Sunday, December 20, 2009

సాంఘిక వికాసానికి తోడ్పడే నవల - ఆంధ్రజ్యోతి సమీక్ష ...



హిందీలో ప్రముఖ రచయిత ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' ను శ్యామ్‌ బెనగల్‌ సినిమాగా తీశారు.

హిందీ సాహిత్యరంగం, చిత్ర పరిశ్రమల్లో సంచలనం సృష్టంచిన ఈ నవలను ''సూర్యుడి ఏడో గుర్రం'' పేరిట వేమూరి ఆంజనేయ శర్మ అనువాదం చేయగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టువారు ప్రచురించారు.

ఇది చాలా చిన్న నవల.
1950ల నాటి సాంఘిక జీవనాన్ని అక్షరబద్ధం చేశాడు రచయిత.
రైల్వేలో చిన్న ఉద్యోగి అయిన మాణిక్‌ ముల్లా మూడు ప్రేమ కథల సమాహారం ఇది.

మాణిక్‌ ముల్లాకు పదేళ్ల వయసు నుంచి వివిధ వయసుల్లో జమున, లిల్లీ, సత్తి అనే స్త్రీలతో పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ముగ్గురి స్త్రీలతో తనకున్న అనుబంధాన్నీ, వారి జీవితాలలో జరిగిన పెనుమార్పులనూ మాణిక్‌ ముల్లా మనకు కథలు కథలుగా చెబుతాడు.

ఈ కథల్లోని జీవితాలేవీ సుఖవంతమైనవి కావు. అయితే అతడు చెప్పే విషాదాంతం వెనక చమత్కారం వుంటుంది. ఆ చమత్కారం మాటున మళ్లీ అంతులేని విషాదం వుంటుంది. జమున తను కోరుకున్న వాడికి భార్య కావడం, సత్తి అర్థాంతరంగా చావడం వెనక దాగున్న దారిద్య్రం, మూఢనమ్మకాలను చెప్పీ చెప్పకనే వివరంగా చెప్తాడు రచయిత. అందుకే మాణిక్‌ ముల్లా ''ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం'' అంటూ ప్రేమను నిర్వచిస్తాడు.

ఏడు కథల సమాహారంగా సాగిన ఈ నవలను సూర్యుడి ఏడు గుర్రాలతో పోల్చుతాడు. ఇప్పటికే నైతికంగా భ్రష్టమైన జీవితపు సందుల్లో నడవడం వలన సూర్యుని రథం శిధిలమై పోయిందని, ఆరు గుర్రాలు కాళ్లు విరిగిపోయి అస్థిపంజరాలుగా మారాయని అంటాడు. మిగిలిన ఒక్క గుర్రమే మన భవిష్యత్తును సూచించేది. మన పిల్లల జీవితాల్లో వెలుగూ, అమృతం నిండిపోవాలంటే మిగిలిన ''సూర్యుడి ఏడో గుర్రం'' పరుగులు తీయడానికి సరైన తోవను ఏర్పాటు చేయాలంటాడు.

ఈ నవల ద్వారా రచయిత ఆశించిన నైతికత, సామాజిక న్యాయం, విలువలు ఈ ఆరు దశాబ్దాలలో మరింతగా పతనమై పోయాయి. బహుశా ఆ ఏడో గుర్రం కూడా మిగిలిన గుర్రాల వరుసలో చేరిపోయిందేమో!
- సుంకోజి
( ఆదివారం ఆంధ్రజ్యోతి, 20 డిసెంబర్‌ 2009 సౌజన్యంతో )
..........................................


సూర్యుడి ఏడో గుర్రం (నవల)
ధర్మవీర్‌ భారతి
పేజీలు : 115
వెల : రూ.50


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85,
బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

Wednesday, December 9, 2009

ప్రగతిశీల సమ్యక్‌ దృష్టే కథావరణం ,,,


సుప్రసిద్ద మళయాళ రచయిత, సాహితీ వైతాళికుడు వైక్కం మొహమ్మద్‌ బషీర్‌ కథలకి తెలుగు అనువాదం ఈ సంపుటి.
బషీర్‌కు దక్కిన గౌరవాదరాలు, పాఠకాభిమానం, ఆయన సాధించిన అనేక విజయాలు-లోక విదితం. సాహితీవేత్తగా బషీర్‌
లోచూపు, ముందుచూపు - రెండూ కూడా - ఆయన లక్ష్యశుద్ధిని తెలియజేస్తాయి. ముస్లిం సమాజంలోని ఛాందసత్వం
తెలివిలేమితనం వీటిపట్ల ఆయనకు గల సంవేదన ఆయన్ని ఆ సమాజంలోని వైకల్యాల్ని గురించి రాయటానికి
పురిగొల్పింది. ఆ సమాజ అభ్యుదయాన్ని కాంక్షించిన చిత్తశుద్ది కల రచయిత బషీర్‌.

ముస్లింలలో చైతన్యం తేవటమేకాక, అనేక అపోహల కారణంగా ముస్లిం సమాజంతో 'ఎలియనేట్‌' అయిపోయిన హిందువుల
మనోభావనల్లో సైతం మార్పు తేవటానికి ప్రయత్నించిన సాహితీకారుడు బషీర్‌. భిన్న వర్గాల మధ్య పరస్పర సహకారం,
సర్దుబాటు అవసరమనే ప్రగతిశీల భావ ప్రచారానికి కథానికని ఒక వాహికగా ఎన్నుకున్న రచయిత ఆయన.

ఈ సంపుటిలో 20 కథలున్నాయి. ఎక్కువ కథల్లో అంతర్లీనంగా అవాంఛనీయ సమాజిక స్థతిగతుల మీద సంధించిన వ్యంగ్యం ధ్వనిస్తూ వుంది. 'అదిగో పులి అంటే ఇదుగో తోక' తంతుగా సాగే 'విశ్వ విఖ్యాత ముక్కు' కథ చదివినా, 'ఒక ప్రేమ లేఖ', 'టైగర్‌' వంటి కథలు చూసినా ఈ వాస్తవం అర్థమవుతుంది. పరపీడన, దోపిడీ వర్గ సంఘర్షణ వంటి భావజాలం ....... వాస్తవికతలోకి దిగకుండా కళాత్మకతగా, బషీర్‌ కథాశిల్పగతం అయింది. అదే ఈ కథలకి వన్నె కూరుస్తున్న ప్రత్యేకాంశం.

'ఒక మనిషి' వంటి కథలోని మానవీయ కోణం చప్పున తెలుగులో బాలగంగాధర తిలక్‌ కథ 'దొంగ'ని స్ఫురింపజేస్తుంది.
చిన్నకథ. హోటల్లో కడుపు నిండా తిన్నాడు. పర్సు పోయింది. దారుణంగా అవమానించారు. చివరికి దాన్ని
కొట్టేసినవాడిలోనే మానవత్వం మేల్కొంది. బిల్లు కట్టటమే కాక, అతని పర్స్‌ అతనికిచ్చేశాడు. 'వెళ్లు. దేవుడు
చల్లగాచూడాలి' అన్నాడతను. 'నిన్ను దేవుడు చల్లగా చూడాలి' అన్నాను నేను!అంటూ కథ ముగుస్తుంది. అద్భుతమైన,
కరుణార్ద్రమైన కథానిక. నిష్కపటంగా, నిర్మలంగా హిందూ-ముస్లింల మతసామరస్యానికి దిశానిర్దేశం కూర్చే కథల్ని
అందించిన బషీర్‌ని చదవటం, ఈ సంక్షోభ వర్తమానంలో ఒక అనివార్య అవశ్యకత!

- విహారి
వార్త , ఆదివారం 8 నవంబరు 2009

Thursday, December 3, 2009

వనవాసి, సూర్యుడి ఏడోగుర్రం నవలా రచయితలు


ప్రముఖ బెంగాలీ నవల ''అరణ్యక''ను 'వనవాస'ి పేరుతో,
ప్రముఖ హిందీ నవలిక ''సూరజ్‌ కా సాత్వా ఘోడా''ను 'సూర్యుడి ఏడో గుర్రం' పేరుతో ఈ మధ్యే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పునర్ముద్రించిన విషయం విదితమే.

ఆ నవలా రచయితల గురించి క్లుప్తంగా ...



బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ:
1894లో కలకత్తాకు ఉత్తరంగా వందమైళ్ల దూరంలో వున్న మరాఠీపూర్‌ గ్రామంలో పుట్టిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ బాల్యమంతా బీదరికంతోనే గడిచిపోయింది.
చదువు స్థానిక పాఠశాలలో సాగింది.
1918లో కలకత్తాలోని రిప్పన్‌ కాలేజీ నుండి డిగ్రీపొందారు.
మధ్య మధ్యలో రకరకాల వృత్తులు చేసినా ఎక్కువ భాగం మాత్రం ఉపాధ్యాయుడిగానే కొనసాగిన ఆయన తొలి కథ 1922లో కలకత్తా జర్నల్‌లో ప్రచురితమైంది.
అప్పటి నుంచీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకూ పుస్తకాలు ప్రచురించారు. ఆయన విఖ్యాత రచన, ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టిన రచన ''పథేర్‌ పాంచాలీ''. దీనికి కొనసాగింపుగా రాసింది ''అపరాజిత''. వీటిని ప్రముఖ దర్శకులు సత్యజిత్‌ రే చలనచిత్రాలుగా మలచి ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు.
దట్టమైన ప్రకృతితో మమేకమై అంతరించిపోతున్న అరణ్యాల గురించి మనసులకు సునిశితంగా హత్తుకునేలా రాసిన అరణ్యక (వనవాసి) బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ విశిష్ట రచనగా విణుతి కెక్కింది.
ఆయన 1950లో మరణించారు.

ధర్మవీర్‌ భారతి:
హిందీ సాహితీరంగంపై బలమైన ముద్రవేసిన విశిష్ట రచయిత ధర్మవీర్‌ భారతి.
1926 లో అ లహాబాద్‌లో జన్మించారు.
కవిగా, నాటక రచయితగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా హిందీ సాహిత్యంలో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనది.
ఆయన రచించిన ''గునహోంకా దేవతా'' భారతీయ సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే క్లాసిక్‌. మహాభారత యుద్ధం పరిసమాప్తమైన ఆఖరి రోజు పరిణామాలను సమకాలీన దృక్పథం నుంచి విశ్లేషిస్తూ రాసిన నాటకం ''అంధయుగ్‌'' భిన్న తరాలకు చెందిన ప్రయోక్తల సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికి కొన్ని వేలసార్లు ప్రదర్శితమైంది.

శైలీపరంగా ఓ అసాధారణ ప్రయోగం ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' (సూర్యుడి ఏడో గుర్రం).

అ లహాబాద్‌ విశ్వవిద్యాలయం నుంచి హిందీ సాహిత్యంలో ఎంఎ. పట్టా తీసుకున్న ధర్మవీర్‌ భారతి 1950లలో విస్తృతంగా రాశారు.
హిందీ అధ్యాపకుడిగా పనిచేశారు.
1960 నుంచీ 1987 వరకూ ప్రముఖ హిందీ వార పత్రిక ''ధర్మయుగ్‌'' కు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు.
పద్మశ్రీతో సహా పలు అవార్డులు అందుకున్నారు. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు.

సూరజ్‌ కా సాత్వా ఘోడా నవలను 1992 లో ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ అదే పేరుతో హిందీలో చలన చిత్రంగా తీశారు. ఆ చిత్రానికి వివేష ప్రజాదరణతో పాటు జాతీయ అవార్డు లభించింది.

Soorampoodi SitaRam





Sunday, November 29, 2009

వనవాసి - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (పథేర్‌ పాంచాలి రచయిత) - తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం...


వనవాసి (నవల) ...

భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ''పథేర్‌ పాంచాలీ'' నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ కలం నుంచి జాలువారిన మరో అపురూప రచన ఇది. పథేర్‌ పాంచాలితో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచనాపరులైన విమర్శకుల అభిప్రాయం.
నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.

.....

ముందుమాట నుంచి ...


బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ (1894-1950) బెంగాలీలో రాసిన 'అరణ్యక' నవలకి అనువాదం 'వనవాసి'. అరణ్యక నవల 1938 ఏప్రిల్‌లో మొట్ట మొదటగా ప్రచురింపబడింది.

భిభూతి భూషణ్‌ అనగానే పాఠకుల మనసులో 'పథేర్‌ పాంచాలీ' మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పథేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టిన విషయం పాఠకులకు తెలుసు. ''వనవాసి''ద్వారా భభూతి భూషణ్‌ తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యారు.

డెబ్భై ఏళ్లక్రితం రాయబడిన నవల వనవాసి. అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పిరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. భౌగోళిక ఉష్ణోగ్రత నానాటికీ పెరిగి పోతోంది. వర్షాభావం వల్ల రాబోయే కాలంలో జరగబోయేవి జల యుద్ధాలేననిపిస్తుంది.

వంద సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40% ఆక్రమించుకొని వున్న అడవులు 1997 నాటికి 19% అయ్యాయి. కాస్త హెచ్చుతగ్గులున్నప్పటికీ మొత్తం మీద అడవులు అంతరించి పోతున్నాయన్నది వాస్తవం. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవు తున్నాయన్నది చేదు నిజం.

అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్థకమవుతోంది. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద బడుగు వర్గాలని నిర్వాసితులను చేసే అనివృద్ధి అధివృద్ధికాదు. ఈ దృష్టితో చూసినప్పుడు సాహిత్యంలో ''వనవాసి'' వంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ.

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మనదేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో; కాలుష్య భూతం భోగోళాన్ని కబళించడానికి పొంచివున్న తరుణంలో, కుల, మత, వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణపడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో; స్వచ్ఛమైన ప్రాణవాయువును అతి స్వచ్ఛమైన అరణ్య వృక్షాల మీద నుంచి సభ్య సమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వచ్ఛమైన జీవితాలనుంచి మనకందిస్తున్నాడు రచయిత ఈ నవల ద్వారా.

...

అభివృద్ధి అంటే ఏమిటన్నది నేటికీ చర్చనీయాంశమే.

చలం ''జీవితాదర్శం'' చదివాక భీమ్లీ సముద్రం చూడాలని మనసు ఆరాటపడేది. అట్లాగే వనవాసి నవల చదివాక ఆ అరణ్యాలన్నీ సంచరించాలనే ప్రగాఢ వాంఛ పీడిస్తుంది.

రచయిత తనతో పాటు పాఠకులనీ అరణ్య సంచారం చేయించి అరణ్య ప్రకృతినీ, ప్రకృతితో మమేకమయిన కపటమెరుగని గిరిజనుల స్వచ్ఛమైన జీవనాన్ని అనుభూయమానం చేస్తాడు. మానవ నిర్మితమైన ఉద్యాన వనాలే కాదు సహజ సుందరమైన అరణ్య ప్రకృతినీ, వనాలనీ సందర్శాన స్థలాలుగా ఏర్పాటుచేసి అడవుల నిర్మూలనకి వ్యతిరేక దిశగా ఉద్యమించాల్సిన అవసరముంది.
వన విహారానుభూతిని స్వయంగా అనుభవించగలిగితే భిభూతి భూషణుని తపనలోని గాఢత ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. అతడు మన ఆత్మలమీది పొరల్ని తొలగిస్తున్నాడు. అతడి చేయిపట్టుకుని దుర్గమారణ్యంలోకి ప్రవేశించడానికి మనం సిద్ధం కావాలి మరి!

...

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువందించిన సూరంపూడి సీతారాం తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో జన్మించారు. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేశారు. ఢిల్లీ ఆకాశవాణిలో, చెన్నైలో ఆంధ్రప్రభలో, కలకత్తాలో ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌లో,ఆంధ్రపత్రికలో, చివరగా భారతీయ సమాచారవిభాగంలో పనిచేసి 1981లో పదవీ విరమణ పొందారు. సహజ సుందర అనువాదాల రూపంలో ప్రపంచ సాహితాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసిన ఘనత ఆయనది. వారు అనువదించిన మహాశ్వేతాదేవి రచనలైన 'హజార్‌ చౌరాసియాకి మా' (ఒకతల్లి), 'డాయిన్‌' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీగణేష్‌ మహిమ' (రాకాసి కోర) లను గతంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. సీతారాం 1997లో మరణించారు.


వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం


తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Saturday, November 28, 2009

సూర్యుడి ఏడో గుర్రం (సూరజ్‌ కా సాత్వా ఘోడా) ... ధర్మవీర్‌ భారతి ... తెలుగు అనువాదం : వేమూరి ఆంజనేయశర్మ ... ముందుమాట : శ్యామ్‌ బెనెగల్‌ ...


సూర్యుడి ఏడో గుర్రం

హిందీ సాహిత్యంలో ఆత్యంత ప్రయోగాత్మకమైన తొలితరం రచన ఇది. నవల కాని
నవల, కథా సంకలనం కాని కథా సంకలనం.

పైకి సాధారణంగా కనిపిస్తూనే నిగూఢమైన మానవ సంబంధాలనూ, ప్రేమ
పరిణామాలనూ అసాధారణ సహజత్వంతో కొత్తకోణం ఆవిష్కరిస్తుందీ ఆధునిక రచన.
ధర్మవీర్‌ భారతి దీన్ని ఆరు దశాబ్దాల క్రితం రాశారు. అయినా నేటికీ వన్నెతగ్గకపోగా
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ చేతుల్లో (అదే పేరుతో) చలనచిత్రంగా రూపుదిద్దుకుని
అంతర్జాతీయ ప్రాశస్త్యాన్నీ సంతరించుకుంది.
................

శ్యాం బెనెగల్‌ రాసిన ముందు మాట నుంచి ...

1980ల చివర్లో అనుకుంటా... ఓ రోజు షమా జైదీ వచ్చి మీరు ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' నవల చదివారా? అని నన్నడిగారు. స్క్రిప్టులు రాయటంలో చిరకాలంగా నాకు సహకరిస్తున్న ఆమె ఆ సమయంలో ఈ నవల ప్రస్తావన తేవటానికి ఓ చిన్న నేపథ్యం ఉంది. ... ...

ఇదిగో సరిగ్గా అప్పుడే ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నా కంటబడింది షమా జైదీ ద్వారా! దాన్ని చదువుతూనే కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ నవల సినిమా హక్కులు కొందామనుకుని వెంటనే ధర్మవీర్‌ భారతిని సంప్రదించాను గానీ ... అప్పటికే దాన్ని టీవీ
సీరియల్‌గా తీస్తానన్న ఓ నిర్మాతకు హక్కులు అమ్మటమో లేక మాట ఇవ్వటమో జరిగిందని చెప్పారాయన. ప్రాణం ఉసూరు మనిపించింది.
....

''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నవలలో ఎన్నో కథలున్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని, బిగువుగా అ ల్లుకుపోతూ చదువరులకు గాఢమైన, నిగూఢమైన అనుభూతిని కలగజేస్తాయి. అ లాంటి దీన్ని విడి విడి భాగాలుగా ముక్కలు చేసి, టీవీ
సీరియల్‌గా నడిపిస్తే... పురి విప్పిన దారంలా ... ఆ అ ల్లిక, బిగువు, పొందిక... ...అన్నీ పేలవంగా తేలిపోతాయనిపించింది. చూస్తూ వుండలేక, ఆ టీవీ ప్రొడ్యూసర్‌తో ఎలాగైనా తెగతెంపులు చేసుకోవాలని ధర్మవీర్‌ భారతిపై ఒత్తిడి తేవటం ఆరంభించాను.

నిజానికది నా తత్వానికి సరిపడని పనే. ముందెన్నడూ ఇలా చేయలేదు, భవిష్యత్తులో చేస్తాననీ అనుకోను. కానీ అప్పటికీ, ఇప్పటికీ కూడా నా విశ్వాసం ఏమంటే - అసాధారణ ప్రాముఖ్యం గల ఈ నవలను ఏ ముక్క కాముక్కగా విడగొట్టటం,
ఇందులోని ఒక్కో కథనూ ఒక్కో ఎపిసోడ్‌గా మలిచి సీరియల్‌గా తియ్యటం సరికాదని! మొత్తానికి కొన్ని నెలలు పెనుగులాడి దాన్ని ఎలాగైనా సాధించగలిగాను.
.... .... ....

ఇక నవల గురించి చెప్పుకోవాలంటే ... నాటి సమకాలీన భారతీయ సాహిత్యంలో అత్యంత ఆధునికతను సిద్ధించుకున్న ''మోడర్నిస్ట్‌'' నవలగా దీన్ని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. అనువాద రూపంలో ''సూర్యుడి ఏడో గుర్రాన్ని'' నేటితరం తెలుగు
పాఠకుల ముందుకు తెస్తుండటం ముదావహం.

ధర్మవీర్‌ భారతి గురించి వినని, భారతీయ సాహిత్యంపై ఆయన వేసిన ముద్ర ఏమిటో అంతగా తెలియని కొత్త తరానికి ఇదో అమూల్యమైన కానుక అని భావిస్తున్నాను.


- శ్యాం బెనెగల్‌

4 జులై 2009

సూర్యుడి ఏడో గుర్రం
ధర్మవీర్‌ భారతి

(సూరజ్‌ కా సాత్వా ఘోడా - హిందీ నవల)
తెలుగు అనువాదం: వేమూరి ఆంజనేయ శర్మ

ముందు మాట : శ్యాం బెనెగల్‌
మలిమాట : ఎన్‌. వేణు గోపాల్‌
ముందుమాట అనువాదం: అనంత్‌

115 పేజీలు, వెల: రూ.50

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

E Mail ID : hyderabadbooktrust@gmail.com

Friday, November 27, 2009

జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ ... పూర్ణిమ గారి సమీక్ష



జమీల్య నవలపై పుస్తకం డాట్ నెట్ లో పూర్ణిమ గారు చేసిన అద్భుతమైన సమీక్షను మరోసారి మా వీక్షకుల దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ పొందుపరుస్తున్నాము. పూర్ణిమ గారికి మా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో పుస్తక సమీక్షల కోసం పుస్తకం డాట్ నెట్ ని సందర్శిస్తున్దండి.

జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ


పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన” అన్న వాక్యం, అట్టకీ అట్టకీ మధ్య మహా అయితే ఓ వంద పేజీలు.. చూడ్డానికి చిట్టిగా, ప్రేమ కథ అంటూ విషయం ఘాటుగా ఉండడంతో “ఓ గంటలో అవ్వగొట్టేయచ్చు” అంటూ మొదలెట్టిన పుస్తకం ఇది.

చదవటం పూర్తవ్వగానే “అబ్బే.. ఇంతేనా?” అనిపించింది. సమయం గడిచే కొద్దీ, పుస్తకం నాలో ఇంకుతున్న కొద్దీ “అబ్బో.. చాలానే ఉంది” అనిపించింది.

ఇది ఒక ప్రేమ కథ! అంటే ఒక అమ్మాయి – ఒక అబ్బాయి ఉన్నారన్న మాటే. ప్రేమన్నాక ఏవో ఆవాంతరాలో, భయంకరమైన బాక్‍డ్రాపో ఉండాలి కదా..అది రెండో ప్రపంచ యుద్ధ సమయం సమీపంలో జరిగుతుంది! ఇక కథ అన్నాక ఎవరో ఒకరు చెప్పాలి..అందుగ్గాను మన హీరోయిన్ మరిది ఉంటాడు.

అప్పటి వ్యవస్థను, ఆచారాలనూ ధిక్కరించి తన మనసుపడ్డ మగాడితో ధైర్యంగా నడిచిపోయే ఒక అమ్మడి కథ ఇది! కొంతమంది అమ్మాయిలుంటారు.. వాళ్ళకేం కావాలో, అది ఎందుకు కావాలో కూడా తెల్సు! తెలీటంతో పాటు దాన్ని సాధించుకునే ధైర్యం, తెగింపు కూడా ఉంటాయి. తమపై తాము పూర్తిగా అవగాహనతో ఉంటారు కాబట్టి ప్రపంచం వారి గురించి ఏమనుకుంటుందో అన్న చింత ఉండదు. ఆత్మవిశ్వాసం, నిర్భీతి అనే రెక్కలతో స్వేచ్ఛా విహంగాల్లా విహరించే వీరిని చూసి లోకం కుళ్ళుకోవచ్చు, ఆడిపోసుకోవచ్చూ, శాపనార్థాలూ పెట్టవచ్చు, అన్నీ తాత్కాలికంగానే! ఆ ఆత్మవిశ్వాసంలో ఇమిడిన అందానికి మాత్రం కాస్త ఆలస్యంగానైనా ప్రపంచం ఎప్పుడూ జోహార్లే పలుకుతుంది.

జమీల్యా అచ్చు ఇలాంటి అమ్మాయే! ఈమె శారీరిక సౌందర్యవతి అని కథలో అనేక మార్లు చెప్తారు. కానీ ఈ పాత్ర నిజంగా మనతో నిలిచిపోయేది మాత్రం ఒక సంపూర్ణ స్త్రీ మూర్తిగా. ఇక ఇంతటి అమ్మాయి మనసు పారేసుకునే వాడు, నిజంగానే మరో గొప్ప వ్యక్తిత్వం అయ్యుండాలి. ఆ హీరోనే దనియార్.. ఒక యుద్ధవీరుడు. కోపంతో మొదలయ్యి, పంతాలూ వేళాకోలాల్లో ఒకరిపై ఒకరికి అభిమానం కలిగి, అది కాస్తా ప్రేమై ఇద్దరనీ నిలువనీయక అప్పటి సామాజిక పరిస్థుతులను కాళ్ళదన్ని మరీ సహజీవనం కొనసాగిస్తారు. పుస్తకంలో ఒక చోట ఉటకించబడట్టు దనియర్ ఆత్మిక బలం అటువంటిది.

ఇందులో విశేషంగా చెప్పుకోవల్సిన మరో పాత్ర, ఈ కథను తన జ్ఞాపకాల పొరల్లోనుండి జాగ్రత్తగా మన కళ్ళ ముందు నిలిపే పాత్ర: జమీల్య మరిది. కొత్త కోడలికి అత్తారింట మరిదికి మించిన స్నేహితుడుండంటారు. జమీల్యా విషయంలో కూడా ఇది నిజం. అన్నలంతా యుద్ధానికెళ్ళిపోయాక చిన్నతనంలోనే పెద్దరికం తెచ్చిపెట్టుకునే ప్రయత్నంలో ఎప్పుడూ వదిన చుట్టూనే తిరిగే ఈ కుర్రాడు, తన వదిన ప్రేమకథకి ప్రత్యక్ష సాక్షి.

మొన్న కవిత్వంపై టాగోర్ రాసిన ఒక వాక్యం:
“Like a tear or a smile a poem is but a picture of what is taking place within.” జమీల్య ప్రేమకావ్యం ఆమె మరిదిలో నిద్రాణమై ఉన్న చిత్రలేఖనం తట్టి లేపుతుంది. ప్రేమ కూడా కవిత్వమే ఏమో. నాకీ కథలో నచ్చినది అదే..

జమీల్య-దనియర్ ప్రణయం ఒక ఎత్తు అయితే అది ఒక మనిషిని కదిపి, కుదిపిన తీరు నన్ను కదిలించింది. పెంపరికం, social conditioning, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ ఎంత ప్రభావం చూపుతున్నా మనలోని “మనిషి” ప్రేమారాధకడే అన్న నమ్మకం కలిగించింది.

Beauty of the book?! ఒడ్డున నుంచున్న వాళ్ళు వచ్చి పోయే అలల తుంపర్లతో ఆడుకోవచ్చు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇందులో భాషగానీ, భావం గానీ. ఇది తెలుగులోకి అనువదించబడ్డ పుస్తకం. ఆలోచనల్లో మునిగే సాహసముంటే, ఓ సముద్రమంతా చుట్టి రావచ్చు. ఈ కథ జమీల్య మరిది గీసిన ఒక చిత్రపఠం వర్ణనతో మొదలవుతుంది. చదవడం పూర్తయ్యాక ఎందుకో ఒకసారి పుస్తకం వంక చూస్తే వచ్చిన చిలిపి ఊహ.. యష్ రాజ్ పోస్టర్ బాయ్ లా ఈ పుస్తకం “come.. fall in love” అంటూ నన్నూరిస్తున్నట్టు ;)

- పూర్ణిమ



పుస్తకం వివరాలు:
పేరు: జమీల్య
రచయిత: చింగీజ్ ఐత్‍మాతొవ్
అనువాదం: ఉప్పల లక్ష్మణ రావు
వెల: రూ. 40/-
ప్రచురణ: హైదరబాద్ బుక్ ట్రస్ట్


........................

Tuesday, November 24, 2009

భగవత్ గీత చారిత్రక పరిణామం: దామోదర్ ధర్మానంద్ కొశాంబి...సాహిత్య అవలోకనం బ్లాగు సమీక్ష ...


భగవద్గీత చారిత్రిక పరిణామం పుస్తకాన్ని ప్రవీణ్ శర్మ గారు తన బ్లాగు "సాహిత్య అవలోకనం" లో సమీక్షించారు. మాబ్లాగు సందర్శకులకు సదా అందుబాటులో ఉండేలా ఆ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. ఈ మెయిల్ ద్వారా స్వయంగా ఈ సమీక్ష గురించి మాకు తెలియజేసిన ప్రవీణ్ శర్మ గారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఎవరైనా తమ బ్లాగుల్లో మా పుస్తకాలను సమీక్షించి నప్పుడు దయచేసి మాకు తెలుపవలసినదిగా కోరుతున్నాము.

భగవద్గీత చారిత్రిక పరిణామం

వేదాలు వ్రాస్తున్న కాలంలో హిందువులు ఇంద్రుడిని ప్రధాన దేవుడిగా పూజించారు.
సంస్కృత బాషలో ఇంద్ర అంటే రాజు అని అర్థం. ఇంద్రుడు ఆర్యులకి రాజు.
విష్ణువుకి నారాయణుడు అని ఇంకో పేరు ఉంది.

నారాయణ అనే పదం సంస్కృత పదం కాదు. అది సింధు లోయ నాగరికత కాలంలో వాడిన బాష పదం. నారాయణ అంటే నీటి మీద నివాసం ఉండేవాడు అని అర్థం. నారా అంటే నీరు. ఆయణ అంటే నివాసం. విష్ణువు నీటి మీద పాము మీద పడుకుంటున్నట్టు హిందూ పురాణాలలో కథలు ఉన్నాయి.

మెసోపొటేమియా (ఇరాక్) నాగరికతలో కూడా నీటి పైన ఇంటిలో నివసించే దేవుడి కథ ఉంది. అప్పట్లో ప్రజలకి వ్యవసాయమే ప్రాధాన జీవనాధారం. ప్రజలు ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో నివసించేవారు కనుక ప్రజలు నీటి పై నివసించే దేవుడి గురించి కథలు అల్లుకోవడం సహజం.

కృష్ణ అంటే నల్లని వాడు అని అర్థం. మహాభారతం, శ్రీమత్భాగవతం, భగవత్ గీత వ్రాయకముందు ద్రవిడులు (నల్లని వారు) మాత్రమే కృష్ణుడిని పూజించేవారు. వేదాలలో కృష్ణుడికీ, ఇంద్రుడికీ మధ్య యుద్ధాలు జరిగినట్టు కథలు ఉన్నాయి.

హిందూ మతం ఒకప్పుడు ఆర్యుల మతంగా ఉండేది. హిందూ మతాన్ని ద్రవిడులకి కూడా వర్తింపచెయ్యాలంటే ఇంద్రుడి ప్రాధాన్యం తగ్గించాలి. నల్లని దేవుడైన కృష్ణుడి ప్రాధాన్యం పెంచాలి.

అప్పట్లో ప్రజలలో ఆత్మ పరకాయ ప్రవేశం పై అనేక కథలు ఉండేవి. ఆత్మ పరకాయ ప్రవేశం కథలు ఆధారంగా దశావతారాల కథలు వ్రాయడం జరిగింది.

భగవత్ గీత ఆత్మవాదాన్ని ఎక్కువగా ప్రబోధిస్తుంది. ప్రజలకి మరణానంతర మోక్షం, పునర్జన్మ లాంటి వాటి పై విశ్వాసం కలిగించడానికే భగవత్ గీత వ్రాయడం జరిగిందని అర్థమవుతోంది.

ఈ వ్యాసాన్ని కొశాంబి గారు 1959లో ఇంక్వైరీ పత్రికలో వ్రాసారు. 1985లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీన్ని తెలుగులోకి అనువదించి పుస్తక రూపంలో ప్రచురించారు.

..................................

..

Monday, November 23, 2009

విమర్శ కాదు విజ్ఞానం ... దుప్పల రవికుమార్ ...






డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ “రాముని కృష్ణుని రహస్యాలు” పుస్తకాన్ని ఇటీవల దుప్పల రవికుమార్ గారు తన బ్లాగులో ( చదువు. వర్డ్ ప్రెస్.కాం) సమీక్షించారు.
http://chaduvu.wordpress.com/2009/11/09/ambedkar/#comments
మాబ్లాగు సందర్శకులకు సదా అందుబాటులో ఉంటుందని దానిని ఇక్కడ తిరిగి పొందు పరుస్తున్నాము.
రవికుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

“రాముని కృష్ణుని రహస్యాలు”


భారత రాజ్యాంగ నిర్మాతగా, రాజనీతి శాస్త్రజ్ఞుడిగా, న్యాయశాస్త్ర కోవిదుడిగా, దళిత వర్గాల ఆశాజ్యోతిగా మెరుగైన భారత సమాజం కోసం పరితపించిన నిజమైన దేశభక్తుడు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్. ఆయన ఆలోచనసరళితో కాస్త పరిచయం వున్న వారెవరైనా అతడొక గొప్ప చదువరనే సంగతి తెలుసుకుంటారు.

చాలా చిన్నచిన్న వివరాలు పొందుపరచడానికి, క్రాస్ రిఫరెన్సులకోసం విస్తృతంగా పురాణాలను, ఇతిహాసాలను, ఇతర గ్రంథాలను అధ్యయనం చేయడంద్వారా అంబేడ్కర్ తన అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకున్నారన్న కోపం కూడా అతడి సీరియస్ పాఠకులకు వస్తుంటుంది.

లోతైన విశ్లేషణ, పదునైన పదజాలంతో, ఉన్నతమైన భావాలతో అలరారే అంబేడ్కర్ సంపూర్ణ సాహిత్యాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రచురించాలని తొలిసారి భావించింది. వెలువడిన మొదటి మూడు సంపుటాలను ప్రజలు విశేషంగా ఆదరించారు.ఆయితే నాలుగో సంపుటి మాత్రం వివాదాస్పదమైంది.

హిందూ మతాన్ని విమర్శిస్తూ, దేవుళ్లను కించపరుస్తూ రాసిన వ్యాసాలన్నీ అందులో సంపుటీకరించారని శివసేన గగ్గోలు పెట్టింది. సెక్యులర్ భావాలు, ప్రజాస్వామిక దృక్పథమున్న ప్రతి భారతీయుడు చేయీచేయీ కలిపి దీన్ని ప్రతిఘటించారు. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, చేతనైతే ఆ వ్యాఖ్యలను సమర్ధంగా ఖండించాలి గాని, రచనలను, ప్రచురణలను నిషేధించకూడదని మేధావులు ప్రభుత్వానికి నచ్చజెప్పారు.

“రిడిల్స్ ఇన్ హిందూయిజమ్” అనే గ్రంథంలోని ఒక వ్యాసాన్ని “రాముని కృష్ణుని రహస్యాలు” పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఆ చిన్ని పొత్తపు పరిచయమే ఈ వ్యాసం.

ఇరవై ఆరు పేజీల చిన్న వ్యాసంలో ఆదిలోనే రామాయణంలో రాముని పాత్ర చాలా నిస్సారమయిందనే వాదన ప్రతిపాదిస్తారు. ఇక అక్కడనుంచి వాల్మీకి రామాయణంలోని పద్యాలను ఉదాహరణలుగా చూపి వాదనను నిర్మిస్తారు. వ్యక్తిగా, రాజుగా రాముని శీలాన్ని (కారెక్టర్) అంచనా వేస్తారు. వాలిపట్ల, భార్యపట్ల రాముని వ్యవహార శైలి అతని వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) పట్టిస్తుందంటారు.

ఎలాంటి రచయిత రచించిన రచనలోనైనా సీతపట్ల రాముని ప్రవర్తనకంటే క్రూరమైన దానిని ఊహించలేమని అంబేడ్కర్ బాధపడతారు. ‘నీ అంత సౌందర్యవతి అయిన స్త్రీని అనుభవించకుండా రావణుడు విడిచిపెట్టి వుంటాడని నేను అనుకోవడం లేదు’ అని రాముడు అన్నాడంటే మనం నమ్మలేం.

విలపించి, ఆగ్రహించి, అగ్నిప్రవేశం పొంది పునీతురాలయి సీత వచ్చాకనే రాముడు అయోధ్యకు తీసుకొచ్చిన కథ మనకు తెలిసిందే. ఆ తరువాత జరిగిన కథే మానవీయ కోణం లేనిది. వాల్మీకితో సహా రామాయణ రచయితలందరూ హృదయ విదారకంగా వర్ణించినది. ఎన్నో విలువైన పద్యాలు, వివరాలను ఎవరికీ అందకుండా చేసిన (వైదిక భావజాల ప్రచారకులైన బ్రాహ్మణ) పురోహితులు సైతం విడిచిపెట్టలేకపోయారు.

అనుమానంతో గర్భవతి అయిన స్త్రీని ఒంటరిగా అడవిపాలు చేయడం – అదీ మోసంతో, కపట పన్నాగంతో. నిండు గర్భిణి సీతను దిక్కూమొక్కూలేని కీకారణ్యంలో విడిచిపెడుతూ లక్ష్మణుడు సీత కాళ్లపై పడ్డాడు. వెచ్చని కన్నీళ్లు బొటబొటా కారుతుండగా, ‘ఓ మచ్చలేని మహారాణీ, నేను చేస్తున్న పనికి నన్ను క్షమించు. నిన్ను తన ఇంట్లో పెట్టుకున్నందుకు తనను ప్రజలు నిందిస్తున్నందువల్ల నిన్ను ఇక్కడ వదిలి వేయమని మా అన్నగారి ఆజ్ఞ‘ అని అంటాడు. (వ్యక్తిత్వం, మూర్తిమత్వం లేని లక్ష్మణుడు ఎలా ఎదిగిందీ మరింత వివరంగా, వ్యంగ్యంగా రంగనాయకమ్మ తన “రామాయణ విషవృక్షం”లో రాశారు.)


రాజుగా రాముని విలాస జీవితాన్ని అంబేడ్కర్ ఉదాహరణలతో వెలుగులోకి తెస్తారు.

ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ క్షత్రియులు మద్యం, మాంసం, మగువ అంటే మక్కువ చూపించడం మరీ అంత విడ్డూరమైన విషయమేమీ కాదు. దీనికి రాముడికే మినహాయింపూ ఇవ్వక్కర్లేదు. ఇంతవరకూ నిదానంగా మాట్లాడిన అంబేడ్కర్ శంభుక వధ విషయంలో రాముడ్ని దూదేకిపారేస్తారు. దీనికి కారణం అంబేడ్కర్ అపార ప్రేమ, సానుభూతులు శూద్ర ప్రతినిధి శంబుకునిపై వుండడమే.

ఇక కృష్ణుని గురించి – మహాభారతంలో కృష్ణుడి కుటిల నీతిని అంబేడ్కర్ ఎండగడతారు. చెడిపోయే బేరం చేస్తే ‘కృష్ణ రాయబారం’ చేశాడని జనపథంలో వాడుక – బహుశా ప్రజలందరికీ కృష్ణుని తీరు తెలిసే వచ్చిందేమో.

కేవలం అంబేడ్కర్ చదువుకున్న పురాణ, ఇతిహాసాల జ్ఞానమే ఈ వ్యాసంలో గుప్పిస్తారు. దీనికి తన వ్యాఖ్యానం జోడించరు. అందుకు కారణం అంబేడ్కర్ ఇదివరకే స్పష్టంగా చెప్పినట్టు ప్రజలను విజ్ఞానవంతులను చేయడమే అతడి రచనోద్దేశం.

అయితే విజ్ఞులైన పాఠకులు ఈ ప్రభావశీల వ్యాసం చదివాక, డి. డి. కోశాంబిని కొద్దిగా అధ్యయనం చేస్తే వలయం పూర్తవుతుంది. అప్పటికే బౌద్ధమత బోధనలు ఉజ్వలంగా వెలుగొందుతున్నాయి. పూజాపునస్కారాలు కాదు సరికదా, విగ్రహారాధనే వద్దన్న బుద్ధుడిని సమర్ధంగా ఎదుర్కోవడానికే అప్పటి పురోహిత వర్గం రాముడికి అంత సీన్ ఇచ్చిందన్న సంగతి (ఆ మాటకొస్తే ఇప్పటికీ ఇస్తోందన్న సంగతి) మనకు బోధపడుతుంది.

రాళ్లూ పూలూ అనదగ్గ కామెంట్లు అన్నీ చేర్చి 45 పేజీలలో “రాముని కృష్ణుని రహస్యాలు” పుస్తకం 12 రూపాయలకే హెచ్ బి టి అందిస్తోంది.
వీలు చేసుకుని తప్పక చదవండి.

Saturday, November 21, 2009

భారతదేశంలో కులాలు - వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ... డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం : భార్గవ ...


భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ...
1916 మే 9వ తేదీన కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌ అమెరికాలో జరిగిన డాక్టర్‌ ఎ.ఎ.గోల్డెన్‌ వైజర్‌ స్మారక ఆంత్రోపాలజీ సెమినార్‌లో చేసిన ప్రసంగ పాఠం.


డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ అధ్యయనశీలతకు, శాస్త్రీయ దృక్పథానికి, తర్క పటిమకు ఈ చిన్న పుస్తకం ఒక ఉదాహరణ.

ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, సమాజంలో అట్టడుగున నలిగిపోయే దళితుల విముక్తి కొరకు తదనంతర కాలంలో తాను నిర్మంచిన దళిత చైతన్య, విముక్తి ఉద్యమాలకు సైద్ధాంతిక భూమికను ఆయన చాలా మ,ధుగానే తయారుచేసుకున్నారు అనడానికి ఈ ప్రసంగపాఠం ఒక నిదర్శనం.

కులం పుట్టుక అన్నది ఇప్పటికీ పరిష్కారం దొరకని ఒక వివాదాస్పద అంశంగానే ఉన్నప్పటికీ, 1916 నాటి ఈ ప్రసంగం కులం పుట్టుక - పరిణామం విషయంలో నేటికీ కొత్త ఆలోచనలను రేకెత్తించగల శక్తిని కలిగి వున్నది.

అనువాదకులు భార్గవ ప్రజాభ్యుదయ సంస్థ (కర్నూలు) ప్రధాన కార్యదర్శి. మార్క్సిస్టు రాజకీయ కార్యకర్తగా పనిచేసే వీరు సామాజిక వ్యవస్థ,ఉద్యమాలు, రాజకీయ వ్యూహాలకు మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడంపై ఆసక్తి కలిగివున్నారు.


భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృది
- బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం : భార్గవ


27 పేజీలు, వెల: రూ.8

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Friday, November 20, 2009

ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... తెలుగు: యాజ్ఞి ...


ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ...

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటీష్‌ పాలనలో 'చట్టం ముందు అందరూ సమానమే' అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది.

బ్రిటీష్‌ వాళ్లు ఈ దేశాన్ని అక్రమించుకోవటానికి, అధికారం నిలబెట్టుకొని పరిపాలించడానికి అంటరానివాళ్ల సహాయం తీసుకొని ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ సర్వీసు, విద్య, సాంఘిక సంస్కరణల విషయంలో వాళ్లు అమలు చేసిన విధానాలు, అగ్రవర్ణాలపట్ల చూపిన పక్షపాత వైఖరిని కూడా ఇది తేటతెల్లం చేస్తుంది.

ఆధునిక విద్య, ఉపాథి రంగాల్లో ప్రతిభ, కులం వలసపాలకుల చేతిలో అవసరానికి తగినట్టు రంగులు మారుస్తూ కింది కులాలకు అవకాశాలు లేకుండా చేశాయి. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్‌ సూటిగా ప్రశ్నిస్తారు.

అంటరానితనం దేశమంతా అమల్లో వున్నా, ఆధునికులమూ నాగరికులమూ అని చాటుకునే బ్రిటీషు పాలకులు ఈ సమస్యపై ఒక్క సాంఘిక చట్టమూ తీసుకొని రాలేదు. పైకి దళితులకు అనుకూలంగా మాట్లాడినట్టు కనిపించినా, సారాంశంలో కులతత్వం ఈ దేశంలో మరింతగా వేళ్లూనుకునేట్టు చేసిన బ్రిటీష్‌ కుటిల రాజనీతిని ఆయన బట్టబయలు చేశారు.

అనువాదకులు యాజ్ఞి ఆ లంపూరు (మహబూబ్‌నగర్‌)కు చెందినవారు. ఆయనకు అధికారం-విస్మృతి ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో 'జానపద కథనాల'కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.


ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు: యాజ్ఞి


60 పేజీలు, వెల: రూ.20

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)


సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

...................................

Wednesday, November 18, 2009

రాష్ట్రాలు - మైనారిటీలు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ...తెలుగు అనువాదం: హారతి వాగీశన్‌ ...


రాష్ట్రాలు - మైనారిటీలు
స్వతంత్ర భారత రాజ్యాంగంలో వారి హక్కులేమిటి? వాటిని సాధించుకోవడం ఎట్లా?
... అఖిల భారత షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య తరఫున భారత రాజ్యాంగ నిర్ణయసభకు షెడ్యూల్డు కులాల రక్షణలకు సంబంధించి
సమర్పించిన నివేదిక (ప్రచురణ 1947)...


ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రవక్త భారతరత్న డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌. భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్థిక
నమూనా ఎలా ఉండాలని ఆయన భావించారో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన, భారత సంయుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్‌ ఆశించారు. ఆ సమాఖ్యలో సామాజిక ఆర్థిక అసమానతలుండకూడదని ఆయన ఆకాంక్ష.

ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది. అంతరాల దొంతరల వర్గ కుల
సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలకు అక్షరరూపం ఈ పుస్తకం.

పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, దారుణమైన సామాజిక వివక్షకు గురై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న షెడ్యూల్డు
కులాలవారికి ప్రత్యేక హక్కులుండాలన్నది అంబేడ్కర్‌ వాదం. అ ల్పసంఖ్యాకులు (మైనారిటీలు) అంటే హిందూ మతంలో లేనివారు
అన్న తప్పుడు అభిప్రాయానికి అంబేడ్కర్‌ గట్టి సమాధానం యిస్తారు. షెడ్యూల్డ్‌ కులాలు మైనార్టీలకంటే దుర్భర స్థితిలో ఉన్నారని
నిరూపించారు.

రాజ్యాధార సామ్యవాదం (స్టేట్‌ సోషలిజం) అంటే ప్రభుత్వం చేతిలో వ్యవసాయం పరిశ్రమలు ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక
సమానత్వం సాధించవచ్చన్న అభిప్రాయాన్ని, వాదనా పటిమను ఇందులో చూడవచ్చు.

అనువాదకులు హారతీ వాగీశన్‌ ఖిల్లా ఘన్‌పూర్‌ (మహబూబ్‌నగర్‌)కు చెందిన రాజనీతి శాస్త్ర విద్యార్థి, యూజీసీ ఢిల్లీ వారి రీసెర్చ్‌
ఫెలోషిప్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ''పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో నాయకత్వం'' విషయంలో పరిశోధన పూర్తి చేసే దశలో
వున్నారు.

రాష్ట్రాలు - మైనారిటీలు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం: హారతి వాగీశన్‌
74 పేజీలు, వెల:రూ.25


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Monday, November 16, 2009

బషీర్‌ ఫకీర్‌ సూఫీ ఫన్‌కార్‌ (కళాకారుడు). ...సాక్షి సమీక్ష ...



బషీర్‌ కథలు

అతను వేరు, అతని సృజన వేరు కాదు.
అతని ఆత్మ, అతని అక్షరం రెండూ ఒక్కటే.
రచయితగా కావచ్చు, అతని రచనలు కావచ్చు, అతనే కావచ్చు- మొదటి నుంచి చివరి దాకా క్రమంగా అర్థం కావచ్చు, కాకపోనూ వచ్చు.
ఎంత కొంచెం జ్ఞానమైనా, అదీ అత్తరబుత్తర గున్నా, జ్ఞానం జ్ఞానమే.
జ్ఞానమే జీవితం.
అందుకే ఆ మహాసముద్రుడి నుంచి ఓ నాలుగు జ్ఞానం చుక్కల్ని నెత్తిన చల్లుకుంటాను!

పద్మశ్రీ వైకం మహమ్మద్‌ బషీర్‌కు కథకుడిగా భారతీయ సాహిత్యంలో పెద్దపేరు. అతను పుట్టిన ఊరు 'వైకం'. అదే అతని ఇంటిపేరయింది. నివసించిన ఊరు 'బేపూర్‌' పేరిట మేపూర్‌ సుల్తాన్‌ బిరుదయింది. అతని కథలు చదువుతుంటే మామూలు దిన చర్య రాసుకున్నట్లే వుంటుంది. ఎవరైనా కథలు రాయగలరు అనిపిస్తుంది. ఇల్లు కట్టుకుంటే కథ షల్లుకున్నాడు. బిడ్డ పుడితే కథను సృష్టించాడు. గాంధీజీని ముట్టుకోవడం కథ అయింది. మానసిక అనారోగ్యంతో దవాఖానలో చేరితే కథా రచన ఉపశమనం ఇచ్చింది.

కళాత్మక కత తెలిసిన జీవిత కథకుడాయన. ఏ వస్తువును తీసుకున్నా అద్భుత సాహితీ రూపాన్ని తీసుకుంది. విభిన్న కథలను రాసిన కథా ప్రేమికుడు. స్వతంత్ర పోనరాట కథలు, జైలు కథలు, తాత్విక కథలు, ప్రేమ కథలు ఇలా ఏ అంశం గురించి రాసినా మనం చదవకుండా, ప్రభావితం కాకుండా వుండలేం.

మన తెలుగు కథలకు భిన్నంగా వుండే ఏనుగులను దొంగిలించే వాళ్ల కథలు ఎంతో ఆసక్తికరంగా వున్నాయి. అంతేకాదు ఎంతో జటిలమైన అంతర్మథనాలూ ఎంతో సులువుగా అర్థమైపోతాయి. చాలా కథల్లో పునరావృతమయ్యే అతని కొన్ని పాత్రలతో, ఆ వాతావరణంతో కలిసిపోతాం. ప్రతి కథలో బషీరే నేరుగా పాఠకులకు కథ చెప్తుంటాడు. విస్మయాన్ని కలిగించే విషయాలున్నా, చదువుతూ పోతుంటే చాలా మామూలుగా జరిగిపోయినట్లు అనిపిస్తాయి. మనింట్లోనో, మనకు పరిచయమున్న బజార్లోనో, మనూర్లోనో జరిగినట్లుంటాయి. సంఘటనలన్నీ, ఎంతో విస్తృతమైన తన జీవితానుభవాలను, సామాజిక వాస్తవికతలను ఆవిష్కరించటమే ప్రధానం కానీ, ఏ శిల్పంలో చెప్పాలనేది అతనికి ప్రధానం కాదు. ఆ వస్తువే దాని శిల్పాన్ని మలచుకుంటుంది. శ్రద్ధ చూపించినట్లు అన్పించకపోయినా అతనో గొప్ప ఫన్‌కార్‌ (కళాకారుడు).

చాలా వరకు కథలన్నీ ఫస్ట్‌ పర్సన్‌లో ఆత్మకథనాత్మక ధోరణిలో సాగుతాయి. బషీర్‌ పేరుతోనే నేరేషన్‌ సాగుతుంటుంది. ఆతని వ్యక్తీకరణలు ఎంత అద్భుతంగా వుంటాయో!

ఉదాహరణకు ఓ రెండ చూడండి. ''జమీలా... కన్నీళ్లన్నీ కూజాలోకి పడేలా ఏడువు. వృథా కాకుండా నేను స్నానం చేస్తాను- ప్రపంచాన్ని మార్చేయాలి. జరిత్ర తిరగరాయాలి. లోకాన్ని నెత్తుట్లో స్నానం చేయించి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రేమించాలి. యవ్వనంలో ఆలోచనలకు సలాం- మతాలకతీతంగా పిల్లల పేర్లు - చిన్నకథ, నాటకం, వచన కవిత ఆకాశం, ఆలిచిప్ప, చాక్లెట్‌, రొయ్యకన్ను, నక్షత్రం, తుఫాను అని పెట్టుకుందాం.

అతన్ని చదవటం షురూ చేస్తే ఎదురుగా వచ్చి కూర్చుని నింపాదిగా కథలు చెప్తున్నాడనుకుంటాం. చదవటం పూర్తయ్యాక మనకు మనం అర్థమైపోతాం. కథలు సుదీర్ఘంగా నడుస్తున్నట్లే వుంటాయి. కానీ నవలలా సాగదీయని కథా కళాత్మకతా రహస్యాలు అతనికి తెలుసు.

తెలుగు కథల్లో ముస్లిం జీవితం పది, పదిహేను సంవత్సరాల నుంచే వస్తున్నది. కానీ బషీర్‌ యాభై సంవత్సరాల క్రితమే రాశాడు.

''ఫాతిమా మేక'', ''మి గ్రాండాడ్‌'' లాంటి పెద్ద కథలు లేదా నవలికలు సాహితీ ప్రేమికులు తప్పక చదివి తీరాల్సినవి.
అన్ని కథలూ చదివాక బషీర్‌ ఆత్మకథను చదివినట్లు అనిపిస్తుంది.
అతని కుటుంబం మన కుటుంబం అయిపోయినట్టు అనిపిస్తుంది.

ఆలస్యంగానైనా ''బషీర్‌ కథలు'' హెచ్‌బిటి వాళ్లు తెలుగు వారికి పరిచయం చేయటం ఎంతో అభినందనీయం. (ఈ పుస్తకం అన్ని ప్రధాన బుక్‌ షాపుల్లోనూ దొరుకుతోంది). అతని మిగిలిన సాహిత్యాన్ని కూడా ఇంకో పుస్తకంగా తీసుకురావాలని విన్నపం.
- బా రహమతుల్లా
సాక్షి దినపత్రిక 16 నవంబర్‌ 2009.

……………………………….

ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ 2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ 3. పూవన్‌ బనానా 4. బంగారు ఉంగరం 5. దుడ్డులాఠీ పణిక్కర్‌ 6. అమ్మ 7. మోసకారి కూతురు 8. తాయెత్తు 9. విశ్వవిఖ్యాత ముక్కు 10. ఏకాంత తీరం 11. గోడలు 12. ఒకనాటి ప్రేమకథ 13. పుట్టిన రోజు 14. టైగర్‌ 15. ఒక మనిషి 16. అవని తల్లికి అసలైన వారసులు 17. అనల్‌ హఖ్‌ 18. శబ్దాలు 19. ఏనుగు పిలక 20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం 21. పాత్తుమ్మా మేక


ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌, జి.షేక్‌బుదన్‌, విమల, ప్రభాకర్‌ మందార, సి.వనజ, హెచ్చార్కె, పి.సత్యవతి, ఎస్‌.జయ, భార్గవ, కాత్యాయని, ఆకెళ్ల శివప్రసాద్‌, సంధ్య, కలేకూరి ప్రసాద్‌, పట్నం ఉమాదేవి.

...............

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009


289 పేజీలు, వెల: రూ.100
.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849
EMail ID : hyderabadbooktrust@gmail.com

Sunday, November 15, 2009

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు ... ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌ ... తెలుగు అనువాదం: అ ల్లం నారాయణ ...


భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు
ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం


మాంఛెస్టర్‌ మెట్రోపాలిటన్‌ యునివర్సిటీ, లండన్‌లో ముంబాయి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌ చేసిన డాక్టర్‌ అంబేడ్కర్‌ స్మారక ప్రసంగపాఠం

భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తున్న ప్రణాళిక చేస్తున్న ప్రణాళిక సంఘం సభ్యులుగా వున్న డాక్టర్‌ బాల్‌చంద్ర ముంగ్రేకర్‌ దేశంలో అగ్రగణ్యులైన వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్తలలో ఒకరు. ప్రణాళిక సంఘం బాధ్యతకలు చేపట్టడానికన్న ముందు ఆయన ముఐబాయి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. అ లాగే, ప్రతిభావంతులైన ఒక సామాజిక తత్వవేత్త. సంస్కర్త. ఆయన ప్రతిభావ్యృత్పత్తులు గల అనేక అకడమిక్‌ పదవులు అధిష్టించారు. ముఐబాయి యూనివర్శిటీ ''అడ్వాన్స్‌డ్‌ స్టడీ సెంటర్‌'' చైర్మన్‌గా, భారత సాంస్కృతిక సంబంధాల మండలి సభ్యుడుగా, ''డాక్టర్‌ అంబేడ్కర్‌ సామాజిక, ఆర్థిక పరిణామాల సంస్థ'' వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇతర ప్రతిష్టాత్మక పనులను ఆయన నిర్వహించారు. వ్యవసాయం, అభివృద్ధి ఆర్థిక శాస్త్రాలలో ప్రావీణ్యతకు గుర్తింపుగా 1999లో భారత ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ ధరవరల మండలి సభ్యునిగా నియమించింది. జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో పలు ప్రభుత్వ కమిటీలలో కూడా ఆయన సేవలు అందించారు.

డాక్టర్‌ ముంగేకర్‌ను అంబేడ్కర్‌ ఆలోచనావిధానం వెలుగులో సాగే ఉద్యమాలలో అగ్రగణ్యుడైన నిపుణుడుగా భావిస్తారు.

ఆర్థిక సంస్కరణలు పేదలపై, ముఖ్యంగా దళితులపై కలుగజేస్తున్న దుష్పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు - ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం
-ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌
తెలుగు అనువాదం: అల్లం నారాయణ


పేజీలు 72, వెల: రూ.20

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Saturday, November 14, 2009

రాముని కృష్ణుని రహస్యాలు... డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచన ...తెలుగు అనువాదం: డాక్టర్‌ బి.విజయభారతి, బొజ్జా తారకం ...



రాముని కృష్ణుని రహస్యాలు

అంబేడ్కర్‌ మరణానంతరం ఆయన సంపూర్ణ రచనలను ప్రచురించే బాధ్యతను మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా మూడు
సంపుటాలు వెలువడ్డాయి. ''రిడిల్స్‌ ఇన్‌ హిందూయిజం'' నాలుగవ సంపుటం. అందరూ అనుకున్నట్టే ఈ పుస్తకం బయటకు రాగానే గొప్ప సంచలనం సృష్టిస్తూ పెద్ద వివాదాన్ని రేపింది.

హిందూ మతం పై విమర్శలున్నాయని, అసభ్యకరమైన రాతలున్నాయని, ఈ పుస్తకం లోని ''ది రిడిల్‌ ఆఫ్‌ రామా అండ్‌ కృష్ణా'' లో తమ దేవుళ్లను కించపరిచే రాతలున్నాయని, దీన్ని సహించేది లేదని, వెంటనే ఆ పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలని, అందులోని కొన్ని భాగాలను తొలగించాలని, మరాఠా మహా సంఘం వారు, శివసేన వారు పెద్ద ఎత్తున ఆందోళన లేవదీశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకం అమ్మవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పుస్తకం కోసం ఎదురు చూస్తున్న మేధావులు,

దళితులు, ప్రజాస్వామిక శక్తులు ఈ సంఘటనతో కలవరపడ్డాయి. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, శక్తి వుంటే వాటిని ఖండించాలి గానీ నిషేధించాలనే హక్కు ఎవరికీ లేదని, తన అభిప్రాయాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ప్రతి రచయితకూ ఉన్నదని, దానిని ఇతరులు గౌరవించాలని, అంబేడ్కర్‌ అభిప్రాయాలను తొలగించాల్సిన అవసరం లేదని దేశంలోని మేధావులు అభిప్రాయపడ్డారు.

డా.అంబేడ్కర్‌ రచనలు ప్రచురించే బాధ్యత మాత్రమే ప్రభుత్వం స్వీకిరించింది కానీ దానిలో మార్పులు, మినహాయింపులు చేసే హక్కు ఎవరికీ లేదని ''రిడిల్స్‌ ఇన్‌ హిందూయిజం'' పుస్తకాన్ని యధాతథంగా అమ్మకానికి విడుదల చేయాలని దళితులు, లక్షలాది ప్రజలు, అభ్యుదయ వాదులు, ముంబాయి, నాగపూర్‌ పట్టణాల్లో గొప్ప ప్రదర్శనలు జరిపారు.

ఒక రచయితకున్న భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి లక్షలాది ప్రజలు ఆందోళన చేయటం అనేది చరిత్రలో ఇదే ప్రథమం. అయితే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకోక ముందే ప్రభుత్వం రెండు వర్గాలకు రాజీ కుదురుస్తూ ''అంబేడ్కర్‌ భావాలతో ప్రభుత్వం అంగీకరించడం లేదు'' అనే వాక్యాన్ని చేర్చి పుస్తకాన్ని యధాతథంగా విడుదల చేసింది. అదే ఈ పుస్తకం.

దీని అనువాదకులు డా. విజయభారతి, బొజ్జా తారకం గార్లు.
విజయనారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ఫూలే, అంబేడ్కర్‌ రచనలు ప్రముఖమైనవి.
బొజ్జా తారకం గారు ప్రముఖ న్యాయవాది. పౌరహక్కులు, దళితుల సమస్యలపై తోడ్పడుతున్న వ్యక్తి. ''పోలీసులు అరెస్టు చేస్తే '' అన్న వీరి రచన తెలుగునాట ప్రత్యేకించి పౌరహక్కుల రంగంలో విశేష ప్రాచుర్యం పొందింది.




రాముని కృష్ణుని రహస్యాలు
రచన: డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం: డా.బి.విజయభారతి, బొజ్జా తారకం


ప్రథమ ముద్రణ: 1988
పునర్ముద్రణ: 1992, 1994, 1996, 1998, 2000, 2003, 2007

48 పేజీలు, వెల : రూ.20/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067 ఫోన్‌: 040 2352 1849

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

.....................................

Monday, November 2, 2009

ఆదివాసీల ఆత్మబంధువు సి కే జాను ..........



ఆదివాసీలు అమాయకులు . నిరక్షరాస్యులు . రక్తాన్ని చెమటగా మార్చి సేకరించిన వస్తువులను మధ్య దళారీలు తరలించుకు పోతుంటే కళ్ళప్పగించి చూసే నిస్సహాయులు . పుట్టి పెరిగిన చోట కనీసం ఆరు గజాల స్థలం సంపాదించు కోలేని నిరుపేదలు . ఆ అభాగ్యుల దుర్భర స్థితిగతులను చూసి తల్లడిల్లిన జాను ... వారి పక్షాన నిలిచింది . అన్యాయాలకు ఎదురొడ్డి ... ఆదివాసీల హక్కుల సాధనకు , వారిని సంక్షేమ పథాన నడిపించేందుకు కంకణ బద్దురాలైంది .

ఆదివాసీల తరఫున కేరళలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన జానూది నిరుపేద గిరిజన కుటుంబం . ఆరేళ్ల వయసులో పాకీ పని చేసింది . పదమూదేల్లకు రోజు కూలిగా రెక్కలు ముక్కలు చేసుకుంది . ఆ సమయంలో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితురాలై ..... ....

ఈనాడు 02 10 2009 ఈనాడు వసుంధరలో "ఆదివాసీల ఆత్మబంధువు " పేరిట ప్రచురించబడ్డ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి .

జాను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మేం ప్రచురించిన "అడవితల్లి సి .కే జాను" ను చదవండి .

Wednesday, October 28, 2009

జమీల్య నవలపై అంతర్వాహిని బ్లాగులో నరేష్ నందం గారి సమీక్ష





హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన "జమీల్య" నవల ను నరేష్ నందం గారు తన బ్లాగు "అంతర్వాహిని" లో చాలా అద్భుతంగా సమీక్షించారు. ( http://janaj4u.blogspot.com/2009/10/blog-post.html ). వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బ్లాగు వీక్షకుల సమాచారం కోసం దానిని తిరిగి ఇక్కడ యధాతధంగా పొందుపరుస్తున్నాము.

"జమీల్య"

“ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథ”గా విమర్శకుల మన్ననలు పొందిన కథ ఇది.

“సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్ధలు పాదుకొల్పుకుంటున్న సంధి దశలో కిర్గిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణలకు అద్దం పడుతుందీ” రచన.

కిర్గిస్తాన్ రచయిత “చింగీజ్ ఐత్‌మాతోవ్”కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నవల జమీల్యా.
ఈ పుస్తకాన్ని నవల అనే కంటే కూడా పెద్ద కథ అంటే సరిపోతుందేమో!

కిర్గిజ్, రష్యన్ భాషలలో వెలువడిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. భారత దేశంలో రష్యన్ రచయితల ప్రాభవం, ప్రభావం పెరుగుతున్న 1950లలో ఈ పుస్తకాన్ని తెలుగులోకి ఉప్పల లక్ష్మణ రావు గారు అనువదించారు.

ప్రధాన పాత్రలు, పరిస్ధితులు:
ఈ కథ కిర్గిస్తాన్‌లోని కుర్కురోవ్ అనే గ్రామం నేపధ్యంగా సాగుతుంది.
జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున ప్రతి యువకుడు పాల్గొనాల్సిన పరిస్ధితి. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు ఉండని వాతావరణం. “పండే ప్రతి గింజ యుద్ధభూమికే” అన్న నినాదంతో యుద్ధంలో పాల్గొంటున్న సైనికుల అవసరాలకోసం, ఇంకా చెప్పాలంటే ప్రతి స్త్రీ తన భర్త, కొడుకుల కోసం పొలంలో శ్రమించాల్సిన అవసరం అప్పటిది.
యుద్ధభూమి నుండి ఏదైనా ఉత్తరం గాని, ఎవరైనా సైనికుడు గానీ వస్తే తమ వారి గురించీ, యుద్ధ వాతావరణం గురించి అడిగి తెలుసుకునే దాకా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంటుంది.

ఈ పరిస్ధితులలో ఆ కుర్కురోవ్ గ్రామంలో ఉన్న మన కథకుడు సయ్యద్ తన ఆలోచనలనూ, అనుభవాలనూ పాఠకులతో పంచుకుంటాడు.

సయ్యద్: తన చుట్టూ తన ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను మౌనంగా చూడటం తప్ప సమర్దించటం లేదా వ్యతిరేకించటం చేయలేని పరిస్ధితి అతనిది. కథాసమయం నాటికి అతని వయసు పదిహేను లేదా పదహారేళ్లు. ఇద్దరు అన్నలు యుద్ధంలో చనిపోతారు. అమ్మ, నాన్న, పిన్ని, ఒక చెల్లెలు, మారుటి అన్న, వదిన.. ఇతని కుటుంబం. చిత్ర కళ అంటే ఆశక్తి.

సాదిక్: సయ్యద్‌కు మారుటి అన్న. సరిగా చెప్పాలంటే.. సాదిక్ నాన్న చనిపోయాక కట్టుబాటు ప్రకారం, అతని అమ్మను సయ్యద్ నాన్న పెళ్లి చేసుకుంటాడు. జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు మిగిలిన యువకులతో పాటు తప్పనిసరి పరిస్ధితులలో యుద్ధానికి వెళతాడు. అప్పటికే పెల్లైన ఇతను భార్య అంటే వస్తువుగా, మగాడి ఆస్తిలో భాగంగా చూసే అప్పటి సమజానికి అసలైన ప్రతినిధి.

జమీల్యా: సయ్యద్ భార్య. ఒక గుర్రపు వ్యాపారి కుమార్తె. కొత్త కోడలిగా వచ్చిన ఆమెకు ఆదరించే ఇద్దరు అత్తలు దొరుకుతారు. పెళ్లి ఐన వెంటనే భర్త యుద్ధానికి వెళతాడు. అత్త మామలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తుంది. తన “చిట్టి మరిది”తో ఆటలు ఆడుతుంది. ఊళ్లో ఎవరైనా తమలపాకుతో ఒకటిస్తే, ఈమె తలుపు చెక్కతో రెండిస్తుంది.

ధనియార్: మాజీ సైనికుడు. చిన్ననాడే కుర్కురోవ్ గ్రామం వదిలిపోయినా, యుద్ధంలో గాయపడిన తర్వాత తిరిగి స్వగ్రామం చేరుకుంటాడు. ఆ ఊళ్లో పొలం పుట్ర ఏమీ లేని కారణం చేత గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో అతనికి కూలీగా పని ఇస్తారు పెద్దలు. ఒకరి జోలికి పోకపోవటం, ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవటం వలన ఇతనంటే ఆ ఊరి పిల్లలకు లోకువ, పెద్దలకు అనాసక్తి.

కథలోకి వెళ్తే..:

సయ్యద్ ఒక సామాన్య యువ రైతు తన బాల్యం, కుటుంబం, అందులో అనుకోకుండా వచ్చి పడిన కొన్ని పరిస్ధితులను విశ్లేషించుకుంటూ తన మనసులోని మాటలను కథ రూపంలో మనకు చెప్తాడు. ఒక చిత్రాన్ని గురించి వివరిస్తూ కథలోకి దారి తీస్తాడు.

అతని స్వంత అన్నలు ఇద్దరు, మారుటి అన్న సాదిక్ యుద్ధానికి వెళతారు. వడ్రంగి ఐన తండ్రి, కుటుంబ పెత్తనం అంతా ఇతని తల్లికే వదిలేస్తాడు. అతని పిన్ని, సాదిక్ భార్య- జమీల్యా పక్కనే ఉన్న “చిన్న ఇంట్లో” ఉంటారు. జమీల్యా అంటే అతనికి ఎంతో అభిమానం. గోధుమ పంటను రైల్వే స్టేషనుకు గుర్రపు బండ్లపై తీసుకువెళ్లేందుకు జమీల్యా అవసరం పడుతుంది. “ఆడకూతురుని నేను పంపను” అని సయ్యద్ అమ్మ ఆ గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్ర అధికారితో గొడవ పడుతుంది. చివరకు సయ్యద్ తోడుగా ఉంటాడనీ, ఇంకా కావాలంటే ధనియార్ కూడా వస్తాడనీ చెప్పటంతో ఒప్పుకుంటుంది.

తర్వాతి రోజు ఉదయం నుంచి వీరు ముగ్గురు గోధుమలు తీసుకెళతారు. స్వతహాగా వాగుడుకాయలైన జమీల్యా, సయ్యద్‌లు దారంతా ధనియార్‌ను వెక్కిరిస్తారు. అతనిపై జోకులేస్తారు. ఉదయం వెళ్లిన వారు తిరిగి రాత్రికి గానీ ఊరు చేరలేరు కాబట్టి వచ్చేటప్పుడు అంత దూరం వెన్నెల కాంతిలో ప్రయాణాన్నీ, “సైపు” మైదానాలలో గుర్రపు బండ్ల పోటీగా మార్చుకుంటారు. తిరుగు ప్రయాణంలో జమీల్యా పాడే పాటలు ఆ వెన్నెల రాత్రులని మరింత అందంగా చేస్తాయి. ఆ పాటలు ధనియార్‌ను ఆకర్షిస్తాయి. అతను జమిల్యాను చుస్తూ ఉండిపోతాడు. ధనియార్‌ను విసిగించేందుకూ, అతనికి కోపం తెప్పించేందుకూ ప్రయత్నాలు చేస్తారు ఆ వదినా మరుదులు.

అప్పటికీ వారు సఫలం కాక అతని బండిలో ఎక్కువ బరువు ఉన్న బస్తాలను వేస్తారు. గోధుమ బస్తాలను షెడ్డులో పెట్టే క్రమంలో ఆ అధిక బరువు బస్తాతో ధనియార్ పడిన శ్రమ అతనంటే ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు అతను చూసిన చూపు జమీల్యాలో అపరాధ భావనను కలిగిస్తుంది.

తర్వాత కొన్ని అల్లరి లేని ప్రయాణాల తర్వాత జమీల్యానే ధైర్యం చేసి ధనియార్‌ను పాడమంటుంది. అతని పాట జమీల్యాను కరిగించి వేస్తుంది. జమీల్యా మనసు పొరల లోలోపలి భావాలకు అర్ధం తెలుస్తున్నట్లవుతుంది. ఇన్నాళ్లూ తను ఎదురు చూసిన వస్తువేదో తనను పిలుస్తున్నట్లనిపిస్తుంది. ఆ గాన ప్రవాహం, ఉధృతి సయ్యద్‌ను అతనికి అభిమానిగా మారుస్తుంది. మళ్లీ రోజులు మామూలు కంటే సంతోషంగా మారతాయి. ప్రయాణంలో పాటల తోడుతో అలసట తెలియదు.

ఒకరోజు రైల్వే స్టేషను దగ్గర కలిసిన సైనికుడు జమీల్యా భర్త సాదిక్ రాసిన ఉత్తరాన్ని అందిస్తాడు. అది చూసిన ధనియార్ ఒక్కడే వెళ్లిపోతాడు. సాదిక్, గాయాలు తగ్గిపోయేకా, ఒక నెలలో తిరిగి వస్తానని రాస్తాడు. సయ్యద్‌ను కూడా వెళ్లిపొమ్మంటుంది జమీల్యా. అలా మొదటిసారిగా ముగ్గురూ ఒంటరిగా తిరుగు ప్రయాణమౌతారు.

ఆ రాత్రి పొలం చేరుకున్న తర్వాత ధనియార్ దగ్గరకు వెళతాడు సయ్యద్. అతనిని పలకరించలేక కొంచెం దూరంగా గడ్డిలో పడుకుంటాడు. తర్వాత వచ్చిన జమీల్యా ధనియార్ దగ్గరకు రావటం చూస్తాడు. వాళ్లిద్దరి కళ్లలో బాధ గమనిస్తాడు. జమీల్యా ధనియార్‌తో మాట్లాడుతుంది. అతను కొంచెం సంతోషంగా చూడటం గమనిస్తాడు సయ్యద్. “జమీల్యా మాటలు అతన్ని ఎందుకు ఊరడించాయో కదా? అనుకున్నాను. ఒక వ్యక్తి భారంగా నిట్టుర్చుతూ: “నాకు భరించడం సులభమనుకుంటున్నావా?” అని అంటే, ఆ మాటల్లో ఊరడింపుకి ఏముందంటా?” అని ఆలోచిస్తాడు.

తర్వాతి నుంచీ మామూలే. ధనియార్ పాటలు ఆమెను ఎక్కడికో తీసుకు పోతాయి. అతని బండి పక్కగా నడుస్తూ, పాటలో లీనమై పోయి ఆమె అతని పక్కన కూచుంటుంది. అతని భుజాలపై తల ఆనించి పరవశం చెందుతుంది. ఆ సన్నివేశాన్ని సయ్యద్ చుస్తూండిపోతాడు. తేరుకున్న జమీల్యా బండిదిగి ఇద్దరినీ కసురుకుంటుంది.

తర్వాతి రోజు ఒక కాగితాన్ని, బొగ్గు ముక్కను సంపాదించిన సయ్యద్ బండిపై జమీల్యా, ధనియార్‌లు కూర్చుని ఉండటాన్ని చిత్రిస్తాడు. తమను తాము మైమరచిన ప్రేమికులలా అనిపిస్తారు వాళ్లిద్దరూ అతనికి. ధనియార్‌ను చూస్తే అతనికి ఈర్ష్య కలుగుతుంది. ఆ చిత్రాన్ని జమీల్యా తీసేసుకుంటుంది. చిన్నప్పుడు బడిలో వదిలేసిన చిత్రకళను తనకు ఇష్టమైన వారి చిత్రాలతో తిరిగి ప్రారంభించటంతో సంతోషిస్తాడు.

ఒక రాత్రి పొలం పక్కన ఏటి ఒడ్డుకు వెళ్లిన అతనకి దూరంగా రెండు ఆకారాలు కనిపిస్తాయి. అవి రెండూ జమీల్యా, ధనియార్ అని గుర్తించటానికి అతనికి ఎక్కువసేపు పట్టదు. ఏటి అవతలి గట్టుపై దూరంగా వెళ్తున్న వారిద్దరినీ చూసి, తేరుకుని వెంట పరిగెత్తుతాడు. కాలికి ఎదురు రాళ్లదెబ్బలతో వెళ్లినా చీకటిలో కలిసిపోయిన వారిద్దరూ కనిపించరు. ఉదయం ఇంటికి వచ్చాక తెలుస్తుంది, అనుకున్నదే అయిందని. లోపల సంతోషపడినా ఏమీ తెలియనట్లే ప్రవర్తిస్తాడు. ఊరంతా ఒక కుటుంబ మర్యాద పోగొట్టిన జమీల్యా గురించే కథలు కథలుగా చెప్పుకుంటారు.

యుద్ధం నుంచి వచ్చిన సాదిక్ జమీల్యాను చంపేస్తానంటాడు. ఎక్కడున్నారో తెలియక ఊరుకుంటాడు. ఒకరోజు ఆవేశంతో వచ్చిన సాదిక్, “ఇ చిత్రం నువ్వు గీసినదేనా? వీడెవడు?” అని అడుగుతాడు. “ధనియార్” అని చెప్తాడు సయ్యద్. చెంప పగలకొట్టి ఆ చిత్రాన్ని చింపేస్తాడు సాదిక్. “నీకు తెలుసా?” అని అడిగిన తల్లికి “అవున”ని సమాధానమిస్తాడు.

తనకు చిత్రకళను నేర్చుకోవాలని ఉందని, వెళ్లేందుకు తల్లిని అనుమతి కోరతాడు సయ్యద్. చిత్రకళ డిప్లొమాకోసం మళ్లీ అదే చిత్రాన్ని చిత్రికరిస్తాడు. ఆ చిత్రాన్ని చూసిన ప్రతిసారీ గుర్తు వచ్చే గ్రామాన్ని, జమీల్యాను తలచుకుని తిరిగి ఇంటికి వెళ్లాలనుకోవటంతో కథ ముగుస్తుంది.

,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:


కిర్గిజ్ జాతిపితగా పిలవబడుతున్న ఐత్‌మాతోవ్ 12-12-1928న అప్పటి సోవియట్ రష్యా యూనియన్‌లో భాగమైన కిర్గిస్తాన్‌లో జన్మించారు.
గిరిజన సంచార కుటుంబంలో జన్మించిన కారణంగా ఆయన ఎక్కువ ప్రదేశాలను, అక్కడి ప్రజలనూ, కట్టుబాట్లనూ గమనించటానికీ, అర్థం చేసుకోవటానికీ ఆయనకు అవకాశం దక్కింది. చిన్నప్పటినుంచి తను గమనించిన విషయాలనే ఆయన తన రచనల్లో వ్యక్తీకరించారు.
“రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ధ్వనించటమే ముఖ్యం” అన్న మాక్సిం గోర్కీ మాటలు తననెంతో ప్రభావితం చేశాయంటారు రచయిత.
1990లలో రష్యా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన కిర్గిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం దక్కేందుకు చింగీజ్ ఐత్‌మాతోవ్ ఎంతో కృషి చేశారు.
ఎన్నో దేశాలకు కిర్గిస్తాన్ రాయబారిగా కూడా పని చేసిన చింగిజ్ ఐత్మాతోవ్ 10-06-2008న జర్మనీలో చనిపోయారు.
నా అభిప్రాయం:
ఈకథ (రెండవ ప్రపంచ యుద్ధం) సమయానికి, సోవియట్ యూనియన్ అంతర్భాగమైన రష్యాలొ స్త్రీ స్వాతంత్ర్యానికి అనుకూలంగా జరిగిన అనేక సంఘటనలు అప్పటి సమాజంలో స్త్రీకి కొంత ధైర్యాన్ని, సమాజ కట్టుబాట్లను ఎదిరించే తెగువను ఇచ్చాయి. అటువంటి పరిస్దితులలో జమీల్యా తనని మనిషి మాత్రంగా నైనా చూడని భర్త సాదిక్ నుంచి విడిపోయి తనకు నచ్చిన ధనియార్‌తో వెల్లేందుకూ, తద్వారా సమజాన్ని ఎదిరించేందుకు సాహసం చేసింది.
ఈకథ చదివిన తర్వాత స్త్రీ అంటే వస్తువే అనే భావం కేవలం భారతదేశంలోని ప్రజలది మాత్రమే కాదనీ, అప్పటి ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలను పాటించే ఆనాటి ప్రజలందరిదీ అని తెలుస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ, ఆ కుటుంబంలో భర్త సోదరున్ని/అదే వంశస్ధున్ని వివాహమాడాలన్న నిబందన కూడా కనిపిస్తుంది.
అలాగే, ఈకథ యుద్ధం ఎటువంటి పరిస్ధితులను సృష్టిస్తుందో తెలియజేస్తుంది. వ్యవసాయం చేసేందుకు మగవారు లేని సమయంలో స్త్రీ, తన చిన్న పిల్లలతో పడే కష్టాలు, భర్త దగ్గర లేని స్త్రీ ఎదుర్కునే వేధింపులు కనిపిస్తాయి.
మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న “సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు”, “అందరూ కలిసి పని చేయటం” అప్పటికే ఉన్నాయనీ, సరైన వ్యవస్ధ ఉంటేకానీ అవి విజయవంతమవవనీ గమనించవచ్చు.

,,,,,,,,,,,,,,

జమీల్యా
చింగీజ్‌ ఐత్‌మాతొవ్‌
అనువాదం: ఉప్పల లక్ష్మణరావు
96 పేజీలు, వెల: రూ.40


,,,,,,,,,,,,,,

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Saturday, October 24, 2009

మునెమ్మ ... ఓ ఫండ మెంటల్ కథ ! పసుపులేటి పూర్ణచంద్రరావు విశ్లేషణ



కేశవరెడ్డి సంచలనాత్మక నవల "మునెమ్మ" పై ది సండే ఇండియన్ నవంబర్ 2009 సంచికలో(42వ పేజీ) పసుపులేటి పూర్ణచంద్రరావు సమగ్ర సమీక్షను చదివేందుకు ఇక్కడ నొక్కండి.

Monday, October 19, 2009

నా కథ మన కథ ...(మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీ బిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌) -ఫ్లెవియా



నా (మన) కథ

పెళ్లైన నాటి నుంచి పదిహేనేళ్ల పాటు భర్త చేతిలో దెబ్బలు తింటూ, ఇంటి నుంచి గెంటివేతకు గురవుతూ ఆమె గడిపిన జీవితం పగవాళ్లకు కూడా వద్దనిపిస్తుంది.
పిల్లల కోసం ప్రశాంతంగా, హింసకు దూరంగా బతికే మార్గాన్వేషణలో వున్న ఆ సాధారణ గృహిణికి ముంబాయిలో స్త్రీవాద ఉద్యమం
కొద్దిపాటి ఊతమయ్యింది.

న్యాయం కోసం ఒకపక్క భర్తతో పోరాడుతూనే మరోపక్క తన కాళ్ల మీద తాను నిలబడి, పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి విజేతగా ఎదిగారు ఫ్లెవియా.
ఆమె తన జీవిత కథను ''మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీ బిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌'' పేరుతో ఇరవై ఐదేళ్ల క్రితమే రాశారు. ఆ పుస్తకం తెలుగు అనువాదమే ''నా (మన) కథ''. అందులోంచి కొన్ని అంశాలు:

ఇది కథ కాదు

జీవిత చరిత్రలు విజయం చవిచూసినవారే రాసుకుంటారు. ఓడిపోయినవారు కాదు. సిగ్గుతో, అవమానంతో గడిపిన క్షణాలను ఎవరూ
మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలనుకోరు. జాలి కోసమో... వ్యక్తి గతంగా నాకేదైనా లాభం ఉంటుందనో కాదు... దెబ్బలు తినే అసహాయ మహిళ పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పడానికి మాత్రమే ఇది రాశాను. ఇది కథ కాదు... నా జీవితంలోని వాస్తవం!
ఆయన దృష్టిలో పెళ్లామంటే కాళ్లు తుడుచుకునే పట్టా.
హనీమూన్‌ నుంచి చేతులపై కమిలిన మచ్చలతో పుట్టింటికి తిరిగి వచ్చాను. ఏమైందని అమ్మ అడిగింది. ఏవో చిలిపి పనులు... అతని సమాధానం. అమ్మకు అర్థమైనట్లే వుంది.

- చాలాసార్లు అతను నా ఒళ్లంతా కుళ్లబొడిచిన తర్వాత మంచి చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, మేకప్‌ వేసుకుని పార్టీలకు వెళ్లాను. ఆ చీర కట్టుకో... చేతుల మీద దెబ్బలు కనిపించకుండా కప్పుకో ... అంటూ సలహా ఇచ్చేవాడు.

- ఆ రోజు పనంతా ముగించుకుని మంచం మీద కూర్చుని అమ్మ రాసిన ఉత్తరం చదువుకుంటున్నాను. అతను వచ్చాడు. మసిగుడ్డ మురికిగా వుంది ఉతకమన్నాడు. తర్వాత ఉతుకుతానన్నాను. నేను చెప్పినట్లు వినాలి. విధేయత ఏమిటో నీకిప్పుడే నేర్పిస్తాను అన్నాడు. మరుక్షణం నా తల వెళ్లి గోడకు కొట్టుకుంది. నన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేసి మసిగుడ్డ నా మొహాన కొట్టి గొళ్ళెం పెట్టాడు.
మూడు గంటల తర్వాత తలుపు తెరిచాడు. 'నా శరీరాన్ని విరగ్గొట్టగలవు కానీ నా మనసును నువ్వేం చేయలేవు' అన్నాను. కానీ అది అబద్ధం.
వాస్తవానికి శరీరమే త్వరగా కోలుకుంటుంది. హింసకి, రక్తపాతానికి చిహ్నంగా మచ్చలే మిగులుతాయి. కానీ మనస్సుకైన గాయాలు
మానడానికి చాలా సమయం పడుతుంది. పైగా అవి గుర్తుకొచ్చిన ప్రతిసారీ మళ్లీ రక్తం కారుతుంది.

కుప్పకూలిన ఆత్మవిశ్వాసం

నా జీవితంలో అత్యంత దారుణమైన దశ అది. నా వ్యక్తిత్వానికి జరగాల్సిన నష్టం పరిపూర్ణంగా జరిగింది. నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. హింసను ఆపడానికి ఏమైనా సరే... చేయాలి. నాలుగేళ్ల లోపు వయసులో ముగ్గురు పిల్లలు... ఉబ్బసం...నాకు చావాలనిపించింది.
కానీ ఈ కర్కశ హృదయుడి దయాదాక్షిణ్యాల మీద పిల్లల నొదిలేసి చచ్చే హక్కు మాత్రం నాకెక్కడిది?

* నేను అందరి సలహాలు విన్నాను. పాటించాను. హింస సందర్భాలు తగ్గాయేమో కానీ స్థాయి తగ్గలేదు. ఒకటి మరిచేలోపే మరొకటి తప్పకుండా జరిగేది.
* ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. భయం వెన్నంటే ఉండేది. కడుపులో పేగుని ముడివేసిన భావన నాలో భాగమైపోయింది. అది ఎంతలా అ లవాటై పోయిందంటే ఆ ఇల్లు వదిలాక హాయిగా ఉండడం కూడా చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చింది.

* నాపైన అతని అధికారం కేవలం భౌతికమైనదే కాదు.... నా ఆత్మగౌరవం మంటకలిసింది... ఆత్మవిశ్వాసం అడ్రస్‌ లేకుండాపోయింది...

నాకంటూ మిగిలింది పిల్లలే!

ఎదురీదాను... ఒడ్డుకు చేరాను


ఆనాటి ఆ స్థితి నుంచి బయటపడి ఈరోజు మహిళల హక్కుల న్యాయవాదిగా నేను ప్రాక్టీసు చేస్తుంటే ఎన్నో వైరుధ్యాలు. నేనెంత
కాదనుకున్నా...ఏదో సాధించిన భావం. నేను గ్రాడ్యుయేట్‌ని కానందున లెక్చర్‌ హాల్‌ వదిలి వెళ్లిపొమ్మన్న సంస్థ ... నన్ను తల్లిగా అయోగ్యురాలన్న న్యాయమూర్తి ... మద్దతిచ్చినా నిలబెట్టుకోకుండా భర్త దగ్గరికి వెళ్లానని బాధపడిన స్నేహితులు... నా విడాకుల హక్కును తిరస్కరించిన చర్చి ... వ్యవస్థ ... నేను పరిస్థితుల్ని పూర్తిగా తలకిందులు చేయలేదు కానీ రెండో ఒడ్డుకి చేరుకోగలిగాను.
నలబైయేళ్ల వయసులో కొత్త గుర్తింపు ఏ మహిళకైనా అసాధరణంగానే వుంటుంది.

* దెబ్బలు తినడం అనే మన అనుభవాల్లో వ్యక్తిగతం అనేదేమీ లేదన్నది వాస్తవం. కానీ మన నోళ్లు నొక్కిపెట్టి ఉన్నాయి. కాబట్టి ఆ అనుభవం విశ్వవ్యాప్తమని తెలుసుకోలేకపోయాం.
నోరు విప్పడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ పుస్తకం.
ఇది సఫమైందని చెప్పగలను.
ఎందుకంటే ముంబాయిలోని ఒక అభ్యుదయ చిత్ర దర్శకుని భార్య, గుజరాత్‌లో స్కూలు టీచరు, బోస్టన్‌ శరణార్థుల శిబిరంలోని మహిళ, భారత్‌ పర్యటిస్తున్న జర్మన్‌ విద్యార్థి... అందరూ ఈ పుస్తకంలో తమ అనుభవాలను చూసుకున్నారు.

* నా జీవితానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ హింసను బహిరంగంగా ఖండిచడాన్ని అంతా మెచ్చుకున్నారు. నా స్నేహితురాలు మధుశ్రీదత్తా, మరికొంతమంది న్యాయవాద వృత్తి నిపుణులతో కలిసి 1990లో ''మజ్లిస్‌'' అనే సంస్థను ప్రారంభించాను. ఇందులో యువ, ఔత్సాహిక న్యాయవాదులున్నారు.

* మేం సాధించింది ఒక్క మాటలో చెప్పాలంటే ... 'బాధిత మహిళ ... ఆమె బిడ్డలు' ... అన్న ముద్ర పోగొట్టుకున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల్లో ఒంటరి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు చెడి పోతారన్న అపోహను పటాపంచలు చేశాం....
(ఈనాడు వసుంధర నుంచి)


నా (మన) కథ
రచన: ఫ్లెవియా ఆగ్నెస్‌

ఆంగ్లమూలం : మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీబిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌, మజ్లిస్‌, ముంబాయి, ౨౦౦౪
తెలుగు అనువాదం : భూజాత

ప్రథమ ముద్రణ : 2004
67 పేజీలు, వెల రూ.20


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం.040-2352 1849


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com


........................................................

Sunday, October 11, 2009

పౌరహక్కులకు మరో పేరు బాలగోపాల్‌ - హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నివాళి



1970,80 దశాబ్దాలలో అనేక కీలక ఉద్యమాలు మన దేశాన్నే కాక ప్రపంచాన్నే ఒక కుదుపు కుదిపాయి. ఐరోపాలో విద్యార్థుల తిరుగుబాటు, వియత్నాం యుద్ధవ్యతిరేక పోరాటం, అమెరికాలో బ్లాక్‌ పాంథర్‌ ఉద్యమం, భారతదేశంలో నక్సల్‌బరీ ఉద్యమం మొదలైనవాటి నేపథ్యంలో ఎందరో కొత్త తరం ప్రజానాయకులు ఆవిర్భవించారు. అట్లాంటి వారిలో బాలగోపాల్‌ ప్రముఖులు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల ఉద్యమానికి పథనిర్దేశనం చేసిన సాహసి ఆయన.

గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా, రచయితగా, వక్తగా, వకీలుగా బహుముఖ ప్రతిభావంతుడైన బాలగోపాల్‌ తన జీవితాన్ని పూర్తిగా తాడిత పీడిత ప్రజల సంక్షేమానికి అంకితం చేశారు. రాజ్య హింస, పౌరహక్కుల ఉల్లంఘన ఎక్కడ ఏ మారుమూల, ఏ అటవీ ప్రాంతంలో జరిగినా ఆయన వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆపన్నులకు అండగా నిలిచేవారు. అందుకోసం కాకతీయ యునివర్సిటీలో తన అధ్యాపక వృత్తిని సైతం తృణప్రాయంగా త్యజించారు.

రాజ్య హింసతో పాటు విప్లవం పేరుతో జరిగే అనుచిత హింసను కూడా ప్రశ్నిస్తూ ఆయన పౌరహక్కుల సంఘం నుంచి విడిపోయి మానవ హక్కుల సంఘాన్ని స్థాపించి తన పరిథిని ఇంకా విస్తరించుకున్నారు. అయితే మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి తెలిసినట్టు న్యాయవాదిగా ఆయన ప్రజలకు అందించిన సేవగురించి చాలామందికి తెలియదు.

తను ప్రథానంగా గణితశాస్త్రజ్ఞుడు అయినప్పటికీ పతితులకు, బాధాసర్ప దష్టులకు మరింతగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంతో దీక్షగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. పేదల పక్షాన నిలిచి లాయర్‌గా హైకోర్టులో ఎన్నో కేసులు వాదించారు. ఆదివాసీలు, బీడీ కార్మికులు, ఉపాథి కోల్పోయినవాళ్లు, గృహహింసకు, రాజ్యహింసకు గురైన వాళ్లు ఇలా ఎందరెందరి తరపున్నో ఆయన పైసా ఫీజు తీసుకోకుండా అత్యంత ప్రతిభావంతంగా వాదించి న్యాయం జరిపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో దత్తత పేరిట జరగుతున్న పసిపిల్లల విక్రయాలకు శాశ్వతంగా తెరదించేట్టు చేయడంలో బాలగోపాల్‌ నిర్వహించిన పాత్ర అపూర్వమైనది. ఆయన మరణం వల్ల మానవ హక్కుల ఉద్యమానికి జరిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ హైకోర్టు న్యాయవాదనకు జరిగిన లోటును పూడ్చడం అసాధ్యం అనిపిస్తుంది.

బాలగోపాల్‌ మానవహక్కుల నేతగా, న్యాయవాదిగానే కాక రచయితగా కూడా ఎంతో సుప్రసిద్ధులు. తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ ఆయన ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ప్రత్యేకించి ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో రాసిన వ్యాసాలు, నక్సలైట్‌ ఉద్యమం మీద రాసిన పుస్తకాలు ఎంతో సంచలనం సృష్టించాయి. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ఆయన రచన ''కల్లోల లోయ'' (కాశ్మీర్‌ సమస్య), ''ప్రాచీన భారతదేశ చరిత్ర'' (డి.డి.కొశాంబి పరిచయం అనువాదం) ఎంతో ప్రాచుర్యం పొందాయి.

స్వార్థం, డబ్బు సంపాదన, సుఖలాలసత్వం, వినిమయతత్వం, వ్యక్తిగత వాంఛలు, వ్యామోహాలు విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో నిస్వార్థానికి, నిర్భీతికి, నిరాడంబరతకు, పరోపకారానికి ప్రతీకగానిలిచే బాలగోపాల్‌ జీవన శైలి నిజంగా ఒక అద్భుతం. ఆయన స్మృతి, స్ఫూర్తి ఎన్నటికీ చెరిగిపోవు.

Sunday, October 4, 2009

ఈ తరం కోసం మరోసారి ....






ఆంధ్రజ్యోతి ఆదివారం 4 అక్టోబర్‌ 2009 : కొత్త పుస్తకాలు :

కళ్లకు కనికట్టుచేసి మనిషిని కుర్చీలో కట్టిపడేసే విభిన్న ప్రసార మాధ్యమాల మధ్య మంచి సాహిత్యం పుట్టడమే గగనమైన ఈ రోజుల్లో ... కొన్ని పుస్తకాలు పునర్మద్రణలు పొందడం హర్షణీయం అభినందనీయం కూడా.

ఈ మధ్య కాలంలో అ లా మళ్లీ అచ్చయి వచ్చిన వాటిల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి , డా. కేశవరెడ్డి, చిలుకూరి దేవపుత్రల పుస్తకాలున్నాయి.

ఆంగ్ల పదాలు అసలే లేని శ్రీపాద అచ్చమైన తేట తెనుగు కథల రుచిని నాలుగు తరాలుగా పాఠకులు అనుభవిస్తూనే ఉన్నారు. కొంతకాలం క్రితం పుల్లంపేట జరీచీర నిలువు చెంబు పేర్లతో వచ్చిన కథా సంపుటాల్లో 49 కథల్ని అందించిన ప్రగతి పబ్లిషర్స్‌ ఈ సారి కలుపు మొక్కలు, మార్గదర్శి, అందమైన చంద్ర ముఖచిత్రాలతో అరచేతుల్లో ఎంచక్కా అమరే సైజుతో పుస్తకం ప్రయాణాల్లో చదువుకోడానికి సౌకర్యంగా ఉంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన ఒకే ముందుమాటను మూడు సంపుటాల్లోనూ వాడటం మాత్రం బాగాలేదు.

దళితుల సమస్యల్ని కథా వస్తువులుగా తీసుకుని రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణను అక్షరబద్ధం చేస్తున్న రచయిత డా. కేశవరెడ్డి,. గతంలో వచ్చిన అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లన గ్రోవి నవలల్ని ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు పునర్ముద్రించారు.

ఒకప్పుడు 14 భారతీయ భాషల్లోకి అనువదించబడిన ''అతడు అడవిని జయించాడు'' నవల రేడియో నాటకంగా కూడా పేరుగాంచి, జాతీయ అవార్డు పొందిన సంగతి ఈ తరం వారికి తెలియదు.

1998లో అటావారి బహుమతి పొంది అప్పుడే పుస్తకంగా వెలుగు చూసిన చిలుకూరి దేవపుత్ర ''పంచమం'' నవలని ఇప్పుడు హైదరాబద్‌ బుక్‌ ట్రస్ట్‌ మళ్లీ తీసుకొచ్చింది. అంటరానితనం, అణగారిన తనం భూమికలుగా దళిత జీవన చిత్రాన్ని సృజనాత్మకంగా విరచించిన రచన ఇది. సమాజంలోని కుల, వర్గ వాస్తవికతల విశ్వరూపాన్ని చూపుతూ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తొలి నవలగా పంచమానికి పేరుంది.

- గొరుసు

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు :
1. మార్గదర్శి (పేజీలు:288, వెల రూ.120),
2. వడ్లగింజలు (పేజీలు:272, వెల రూ.120),
3. కలుపు మొక్కలు (పేజీలు:309, వెల రూ.120)
ప్రతులకు:
విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు.


డా. కేశవరెడ్డి నవలలు :
1. అతడు అడవిని జయించాడు (పేజీలు: 96, వెల: రూ.40)
2. చివరి గుడిసె (పేజీలు: 158, వెల: రూ.80)
3. మూగవాని పిల్లనగ్రోవి (పేజీలు: 132, వెల: రూ.60)

చిలుకూరి దేవపుత్ర నవల :
పంచమం (పేజీలు: 275, వెల: రూ.100)


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

................................(ఆదివారం ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )

.............................

Saturday, September 26, 2009

''బ్రాహ్మణ కులం దేవతల నుంచి, శూద్రకులం అసురుల నుంచి పుట్టాయి.''

దశావతారాలు పుస్తకంపై వచ్చిన విమర్శకు డా.విజయభారతి గారి వివరణ.

పురాణాలు కులవ్యవస్థ:2, దశావతారాలు పుస్తకంపై వెంకటరమణ గారు గత ఏప్రిల్ లో ఈ కిందివిధంగా కామెంట్‌ చేశారు. (పుస్తక పరిచయం కోసం ఇక్కడ నొక్కండి.)

>>>>>''అసురులు'' అంటే రాక్షసులు అని అర్థం. శూద్రులు అని నేను ఎప్పుడూ వినలేదు. మీరు చెప్పినదాన్ని బట్టి శూద్రులందరూ రాక్షసులు అని అర్థం వస్తుంది. దీనికి మీ వివరణ ఏమిటి? దయచేసి మీ ఇష్టం వచ్చిన అర్థంతో వ్రాసి విద్వేషాలను పేన్చకండి.

దశావతారాలలో డార్విన్‌ సిద్ధాంతాన్ని వెతికిన వారిని చూశాను కానీ, ఇలా కులతత్వాన్ని వెతికిన వారిని చూడటం ఇదే మొదటిసారి. విజయభారతి గారి నూతన కోణానికి వందనాలు.<<<<<<

దీనిపై డా.విజయ భారతి గారు యిచ్చిన సమాధానమిది.
కొంత ఆలస్యమైనందు వల్ల ఇక్కడ విడిగా పొందుపరుస్తున్నాము. :


'' బ్రాహ్మణ కులం దేవతల నుంచి, శూద్రకులం అసురుల నుంచి పుట్టాయి'' అని మూయిర్‌ సంస్కృత గ్రంథాలు 1, పుట.12 ఆధారంగా డా|| బి.ఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు (చూ. డా|| అంబేడ్కర్‌ ప్రసంగాలు
తెలుగు అనువాదం సంపుటి 4.పే 273).

కులవ్యవస్ధ ఆవిర్భావం గురించి పురాణాలలోనూ బ్రాహ్మణాలలొనూ ఉన్న ఎన్నెన్నో కధనాలు చెబుతూ ఆయన పై దాన్ని కూడా చెప్పారు.

'అసుర' పదాన్ని మొదట్లో దేవ, దానవ, దైత్య జాతులన్నింటికీ కలిపి వాడేవారు. వరుణుడు, సూర్యుడు మొదట్లో అసురులు గానే వేద మంత్రాలలొ పేర్కొనబడ్డారు. తర్వాతి కాలంలో వేర్వేరు అర్థాలలో ఈ పదాలు వాడారు. ప్రత్యేకించి నాగులనూ, యక్షులనూ రాక్షసులుగా పేర్కొన్నారు.

తెలుగుమాట్లాడే ప్రాంతాలలోనివారంతా నాగజాతి వారనీ, వారిని రాక్షసులుగా పిలిచేవారనీ హిస్టరీ కాంగ్రెస్‌ వారి పరిశీలనలు తెలుపుతున్నాయి. పురాణాలలో వీరిని దేవ బ్రాహ్మణ వర్గాలు తమకంటే తక్కువ వారిగా అద్విజులుగా చూశారు. కులవ్యవస్ధలో మనువు శూద్రులకు ఉపనయనం వంటి సంస్కారాలు చెప్పలేదు. వారు అద్విజులే. ద్విజ, అద్విజ భేదాలు అనంతర కాలంలో ఏర్పడ్డాయి .

ఆంధ్రులు/తెలుగువారు నాగ జాతీయులు, వారిని రాక్షసులు అనేవారు అని ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ వారు నిర్ధారించారు.

- విజయభారతి


......

Wednesday, September 9, 2009

బషీర్ కథలు - వైక్కం మొహమ్మద్‌ బషీర్


'' దాదాపు వెయ్యేళ్లకు ముందునుంచీ ముస్లింలు ఇక్కడున్నారు. కానీ ఎవరూ వారి గురించి రాయలేదు. రాస్తేగీస్తే వాళ్లను ప్రతిసారీ తక్కువ రకం మనుషులుగానే చూపించారు. ఈ దేశంలో ముస్లింలకు రాముడు తెలుసు, రావణుడు తెలుసు. కానీ ఆవలి వైపు నుంచి ఈ అన్యోన్యత లేదు. ఇటువంటి సంస్పందన ఉండాలనే నేను ముస్లిం వాతావరణం నేపథ్యంగా రచనలు చేస్తాను.''
- వైక్కం మహ్మద్‌ బషీర్‌
.... .... ....
వైక్కం మహమ్మద్‌ బషీర్‌ (1908 - 1994) ప్రఖ్యాత మళయాళ రచయిత. తన జీవితకాలంలోనే ఓ 'లెజెండ్‌'లా ఎదిగి విశిష్ట ఆధునిక భారతీయ రచయితగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారాయన. చిన్న చిన్న కథలు, నవలికల్లోనే సంక్లిష్ట మానవ ఇతివృత్తాలను, వైవిధ్యభరితమైన చిక్కటి జీవితానుభవాలను ఆవిష్కరించే నేర్పు. ఏకకాలంలో పండిత పామరుల్నీ, ఆబాల గోపాలాన్నీ ఆలరించే రచనా చమత్కృతి బషీర్‌ ప్రత్యేకతలు.

మానవతావాదిగా ఆయన సాధించిన విజయపరంపర జగద్వితితం. ముస్లిం జాతీయతావాదిగా కూడా బషీర్‌ రచనలకు అసమాన ప్రాశస్త్యం వుంది. అది నానాటికీ పెరుగుతోంది.

ఆయన రచనలను తెలుగు పాఠకులకు చేరువ చేసే అపూర్వ కథా సంకలనమిది.
.....
ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ
2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ
3. పూవన్‌ బనానా
4. బంగారు ఉంగరం
5. దుడ్డులాఠీ పణిక్కర్‌
6. అమ్మ
7. మోసకారి కూతురు
8. తాయెత్తు
9. విశ్వవిఖ్యాత ముక్కు
10. ఏకాంత తీరం
11. గోడలు
12. ఒకనాటి ప్రేమకథ
13. పుట్టిన రోజు
14. టైగర్‌
15. ఒక మనిషి
16. అవని తల్లికి అసలైన వారసులు
17. అనల్‌ హఖ్‌
18. శబ్దాలు
19. ఏనుగు పిలక
20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం
21. పాత్తుమ్మా మేక

సతీష్‌ పొదువాల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కల్చరల్‌ స్టడీస్‌ విభాగం, ఈఎఫ్‌ఎల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ ఈ పుస్తకానికి ''ఆధునిక వైతాళికుడికి సమకాలీన పరిచయం'' పేరుతో ముందుమాట రాశారు.
........................

ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌
జి.షేక్‌బుదన్‌
విమల
ప్రభాకర్‌ మందార
సి.వనజ
హెచ్చార్కె
పి.సత్యవతి
ఎస్‌.జయ
భార్గవ
కాత్యాయని
ఆకెళ్ల శివప్రసాద్‌
సంధ్య
కలేకూరి ప్రసాద్‌
పట్నం ఉమాదేవి
....................

మధ్య కేరళలోని ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో 1908లో పుట్టిన బషీర్‌ చాలావరకు తనను తానే రచనకు ముడిసరుకు చేసుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే భారత జాతీయోద్యమంలో చేరి ఎన్నోసార్లు జైలుకెళ్లారు. ఆ తర్వాత జర్నలిస్టుగా, తీవ్రవాదిగా, దేశ దిమ్మరిగా, సూఫీ సాధువుగా, హోటల్లో పనిమనిషిగా, మిల్లు కూలీగా, వంటమనిషిగా, హస్త సాముద్రికుడిగా, ట్రావెల్‌ ఏజెంట్‌గా ... ఇంకా ఎన్నెన్నో వృత్తులు చేశాడాయన. ప్రముఖ రచయితగా పేరు గడించిన తర్వాత పుస్తకాల దుకాణం నడిపారు. ఈ సహస్ర వృత్తుల బలం కేవలం బషీర్‌ వ్యక్తిత్వాన్నే కాదు, ఆయన రచనలనూ పదును దేల్చింది. ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. 1970: కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1972: స్వాతంత్య్ర సమరంలో పాల్గోన్నందుకు కేంద్రప్రభుత్వ తామ్రపత్రం,1981: కేరళ సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌, 1982: పద్మశ్రీ పురస్కారం, 1987 కాలికట్‌ యూనివర్సిటీ డిలిట్‌ ప్రదానం. బషీర్ మాత్రం ఇవేమీ పట్టనట్టే వుండేవారు. అదే ఆయన ప్రత్యేకత. బషీర్‌ 1994 జులై 5న కన్నుమూశారు.

బషీర్‌ రచనలను ఎన్నింటినో స్కూళ్లలో పాఠ్యాంశాలుగా చేర్చారు. భారతీయ/కేరళ సాహిత్య చరిత్ర గ్రంధాలన్నింటిలో వీటిని ప్రత్యేకంగా చర్చించారు. విఖ్యాత దర్శకులు పలు సినిమాలుగా కూడా తీశారు. బషీర్‌ ఫొటోలు, చిత్రాలు ఎంతగా జన బాహుళ్యంలోకి వెళ్లిపోయాయంటే కేరళలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు పట్టగలరు . ఆయన మరణించి ఎన్నో ఏళ్లు గడచిపోయినా ఇప్పటికీ 'బేపూర్‌ సుల్తాన్‌'గా (బషీర్‌ ఈ పేరుతోనే లబ్ధప్రతిష్టులు), భారతీయ సాహితీ జగత్తులో అత్యంత సమ్మోహనాత్మక రచయితగా ఎప్పటికీ నిలిచే వుంటారు.
................

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009

289 పేజీలు, వెల: రూ.100

.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com


.............

కాంక్రీటు కీకారణ్యాల నుంచి పచ్చటి పల్లెలోకి


ఊరు వాడ బతుకు
ఇండియా టు డే
8-9-2009 సంచికలో వెలువడిన సమీక్ష



చెయ్యి పట్టుకుని ఊరంతా చూపిస్తూ ముచ్చట చెబుతున్నట్టుగా సాగే ఓ చక్కని దృశ్య కావ్యం ఈ ఆత్మకథ .
ఊరుచివర మిద్దె. ఇంటి ముందు దొరోరి మోటబావి. బావి గట్టున మర్రిచెట్టు. దాని మధ్య నుండి రెండు తాటిచెట్లు. పక్కన పంట పొలాలు. అటు పనుల కొట్టం, ఆనుకొని గడ్డివాములు, దొడ్లు, పెంట కుప్పలు. ఎదురుగా ఇంకో ఇల్లు లేదు. ఎప్పుడూ ఇంటి ముందు నుండి చెక్కలకు పోయే బండ్లు, పనులు, మేకలు వచ్చిపోయే జనాలు. ఇక మా ఇల్లు తూర్పు వసారాలో రెండు మగ్గాలు ఎదురెదురుగా నడుస్తుండేవి. మా అన్నలిద్దరు మగ్గాలు నేస్తుండేటోళ్ళు, పెద్ద వసారాలో ఓ బల్ల పీట, పెద్ద మనుఘలు కూర్చోటానికని, పక్కన కుంపటి. దాని వెనుకకు వంటిల్లు ప్రక్కకు పోతె పడమటిల్లు, అదే దేవుని అర్ర. దాంట్లో బియ్యం ఉప్పులు పప్పులు ఉండేవి..''

నాగరికత పేరుతో తుడిచిపెట్టుకుపోయిన ఇలాంటి ఊరు, ఇల్లు ఈ రోజుల్లో మచ్చుకైనా కనబడే అవకాశం ఉందంటారా? అందుకే దేవులపల్లి కృష్ణమూర్తి ఆ పచ్చటి పల్లెబాటన, ఆ చల్లటి ఇంటిలోకి తన ఊరు వాడ బతుకు ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు.

బాల్యం నుండి యౌవ్వనం దాకా సాగిన తన ఆత్మకథను ఊరు వాడ బతుకు అంటూ ఒక జోలి (ముచ్చట) లాగా చెప్పుకుంటూ పోయిన కృష్ణమూర్తి, డెబ్భై ఏళ్ళ తన జీవితపు కిటికీ లోంచి బాల్యపు ఆనంతారం, యౌవ్వనపు సూర్యాపేటలోకి తలుపులు బార్లా తెరచుకుని తెరలు తెరలుగా కదలివచ్చిన అనుభవ జ్ఞాపకాలను పూనగుచ్చినట్టు అల్లుకుంటూ పోయారు. రచయితగా తనకిది తొలి పుస్తకమే అయినా మంచి చేయి తిరిగిన రరచనా పటిమను కనబరిచారు. కవులకు కళాకారులు, రచయితలతో విస్తృతమైన పరిచరయాలు, ఏ సాహిత్య సమావేశాన్ని వదలకుండా హాజరైన అనుభవం, నిరంతర పుస్తక పఠనం ఆయనకీ పుస్తక రచనలొ బాగా తోడ్పడి ఉండవచ్చు. 'పొద్దు పొడుస్తుంది లేరా అని తల్లి నిద్ర లెనపడంతో మొదలయ్యే ఈ కథ, పద్దెనిమిదో ఏట భార్య కమల తన జీవితంలోకి ప్రవేశించే 'కలికి గాధారి వేళకు ముగుస్తుంది. తాను రాసే విషయం పట్ల పూర్తి అవగాహన, పుస్తక పరిమితి పై పట్టు, చక్కని ప్లాను ఉన్న రచయితకే ఇలాంటి ఎత్తుగడలతో కతను ప్రారంభించి ముగించడం సాధ్యపడుతుంది. ఈ ఊరు వాడ బతుకు కూడా అంతే పకబ్చందీ ప్రణాళికతో రాసిన నవల లాంటి ఆత్మకథ.

1940 నుండి 58 దాకా ఒక ప్రవాహంలాగా సాగే కృష్ణమూర్తి జీవితకథ, వెనుకబడిన తెలంగాణ పల్లెల్లోని అందరి జీవితాలకూ ప్రతీక లాంటిది. ఆయన తన ఊరును పూర్తిగా తనలోకి ఇంకించుకుని మహాప్రదర్శన చేసి చూపుతారు. ఊరు వెంట తనను, తన వెట ఊరును ఉరికించుకుంటూతీసుకెళ్ళే కథన రీతి ఆద్యంతం ఉత్సాహంగా చదివిస్తుంది. చదువుతుంటే ఆ వేగం, ఆ ఉరుకు పాఠకులూ అందుకుంటారు. మీలో ఊరు, ఊరిలో మీరు లాగా ఉంటుంది. ఆత్మకథ కథ అంటే 'ఎట్లా జరిగింది అట్లాగే' అన్న మూస పద్దతిలో కాకుండా మొదలుపెడితే అపకుండా చదివించడంలాంటి నవలా టెక్నిక్‌ కథ ఒడుపుగా నడుస్తుంది.

పైగామనసు,కళ్ళుఅక్షరాలవెంటఉరుకులుపెడ్తుంటే,చెవులకు మధురమైన జానపద గీతాల హోరు వినబడుతుంటుంది. కథ, కథనం మాట పాట, చక్కని స్క్రీన్‌ప్లే అన్నీ ఉన్న ఈ ఊరు వాడ బతుకు 'అపూ చూపు నుంచి రాసిన సత్యజిత్‌ రే పథేర్‌ పాంచాలి' అని వరవరరావు కొనియాడారు.

ఊరు ఊరి పరిసరాలు, ఊళ్ళో ఉండే ఇళ్ళు, వాటి ఆర్కి టెక్చర్‌, కుటుంబాలు, ఆ కుంటుంబాల మధ్య ఉండే సంబంధాలు. వృత్తులు, దొరోరి పెత్తనాలు, ఇతరత్రా కొత్తగా వచ్చిన పరిణామాలు అన్నీ విపులంగా, విస్తారంగా చెప్పుకుంటూ పోతారు రచయిత. ఆ చెప్పడం చెయ్యి పట్టుకుని ఊరంతా తిప్పుతూ ముచ్చట చెబుతున్నట్లుగా ఉంటుంది.

''ఎర్ర మన్నుతో గోడలు పూసి సున్నంతో మూరకో నిలువు గీత గీసే టోళ్ళు కింది భాగాన చుట్టూ అడ్డ గీతచ వీటిని పట్టేలు పెట్టటమంటారు. ఈ పట్టెలు కోడి రెక్కతో గీస్తే అందంగా అమరేవి. మా వదినెలు పండగలకు పబ్బాలకు ఇల్లు అలికి ముగ్గులు పెడ్తే ఎంతో అందంగా ఉండేది. పేడ, పుట్టమన్ను కలిపి ఇల్లంతా అలికితే నున్నగా ఉండేది. తలుపులకు, దర్వాజాలకు జాజు రంగు ఎర్రగా ఉండేది.'' పేదరికంలో నూ ఇలాంటి ఇల్లల్లో జీవనం పచ్చగా ఉండేదో, ప్రజలు ఎంత సంతోషంగా ఉండేవారో తెలంగాణ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే భాషలో రాసిన ఈ వివరణాలు అన్ని ప్రాంతాల వారినీ అసక్తిదాయకంగా చదివిస్తాయనడంలో సందేహం లేదు.

బల్లెపీట, దేవుని అర్ర, పటేండ్లు, దర్వులు, ముసుర్లు, పొటుకు పెట్టడం, గిన్నె పండ్లు,తాతీళ్ళు, గాబులు అటిక, ఆట, బెర్ర, దూప, చింతపాల పళ్ళు, కలికి గాంధారి వేళ... లాంటి తెలంగాణ మాండలికంలోని లెక్కకు మిక్కిలి పదాలతో జీవధారలా సాగే ఈ రరచనలో, ''తీరకుంట చేస్తే చాల కుంటాయె, నాభికాడ చల్లబడితే నవాబు కాడ జవాబియ్యొచ్చు, గుడ్డి కొంగకు కొమ్రట్ట దొరికినట్టు'' లాంటి సామెతలు సందర్భశుద్ధితొ పుస్తకమంతా పరచుకుంటవి.

ఇలా తన పల్లె ప్రపంచంలో జరిగే రకరకాల ఆచార వ్యవహారాలు, పండగ పబ్బాలు, జాతర్లు, ప్రదర్శనలు, బాగోతాలు, ఆనాటి నైజాం రజాకార్ల దురాగతాలు, సంఘపోల్ల తిరుగుబాట్లు, కమ్యూనిస్టు నాయకుల ప్రభావం, ఊరి దొరల పలాయనం ఇంకా అనేకానేక సామాజిక విషయాలు కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూనే బాల్యం నుంచి తాను పెరుగుతున్న క్రమాన్నీ సమానంగా నడుపుకుంటూ వచ్చారు కృష్ణమూర్తి.

నేత కుంటుంబంలో పుట్టినందున అబ్బిన విద్యేమో, దేనికి దాన్ని ఒక పద్ధతి ప్రకారం అల్లుకుంటూ గాడి తప్పని, గాడీగా లేని చక్కని పట్టువస్త్రం నేశారీ సాలాయన. ఈ వస్త్రానికి గొప్పగా అమరిన వెండి జరీ అంచు లక్ష్మణ్‌ బొమ్మలు.తెలంగాణ పునరుజ్జీవనాన్ని మరొక్కసారి కళ్ళముందు అవిష్కరించిన ఈ ఊరు వాడ బతుకుకు కొనసాగింపుగా, కృష్ణమూర్తి 'అసలు జీవితం 'లోకి ప్రవేశించిన కథ మరో భాగంగా రావచ్చు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

మా పుస్తకాలని ''ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌'' వారి ద్వారా (http://www.avkf.org/BookLink/book_link_index.php) కూడా పొందవచ్చు.

Monday, August 24, 2009

2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరిక - టంకశాల అశోక్‌ ...


2009 లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలు దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పనున్నాయా?

కాంగ్రేస్‌ పార్టీ తాను సైతం ఊహించని విధంగా పుంజుకుంది.
బిజెపి ఎవరూ అనుకోనట్లు దెబ్బతిన్నది.
వామపక్షాలు తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి.
ప్రాంతీయ పార్టీలు, బడుగు వర్గాల పార్టీలలో కొన్ని బలపడగా, కొన్ని పరాజయం పాలయ్యాయి.

దేశం మొత్తం మీద బేరీజు వేసినప్పుడు సెంట్రలిస్ట్‌ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల ఉమ్మడి సీట్లు పెరిగాయి. కానీ ఉమ్మడి ఓట్ల శాతం
తగ్గింది.
వామపక్షాల సీట్లూ ఓట్లూ కూడా పడిపోయాయి.
ప్రాంతీయ పార్టీలు, బడుగు పార్టీల ఉమ్మడి సీట్లు పెరిగాయి, ఓట్ల శాతంలో తేడా లేదు.

ఈ పుస్తకంలోని ప్రధానాంశం సెంట్రలిస్టు పార్టీలను, ప్రాంతీయ, బడుగు పార్టీలను ప్రస్తుత ఎన్నికల సందర్భంగా పోల్చి చూడటం.
ఆ విధంగా పరిశీలించినపుడు సెంట్రలిస్టులకు సీట్లు పెరిగినా ఓట్లు తగ్గటం, ఫెడరలిస్టులు - బడుగులకు సీట్లు కొద్దిగా పెరిగి ఓట్లు

తగ్గక పోవటాన్ని బట్టి, ఉభయ శిబిరాల బలాబలాలలో పెద్ద మార్పులు లేనట్లు కనిపిస్తుంది.
కానీ ఈ అంకెల ఫిజిక్సును పక్కన ఉంచి రాజకీయ వాతావరణపు కెమిస్ట్రీలోకి వెళ్లి చూస్తే, ప్రజల ఆలోచనలో కొత్త మార్పు
వస్తున్నదేమోననే సందేహం కలగకమానదు.

- టంకశాల అశోక్‌ (ముందుమాట అర్థ శోధన నుంచి)

2009 ఎన్నికల సందర్భంగా వార్త దినపత్రిక సంపాదకులు టంకశాల అశోక్‌ రాసిన వివిధ వ్యాసాల, సంపాదకీయాల
సంకలనమే ఈ పుస్తకం.

ఇందులోని శీర్షికలు:

1) అర్థ శోధన 2) ఫెడరలిస్ట్‌ బడుగు పార్టీలకు మేల్కొలుపు 3) సెంట్రలిస్ట్‌ పార్టీలు మళ్లీ పుంజుకుంటే 4) మళ్లీ సుస్థిరత దిశగా
5) జాతీయ పార్టీలకు ఎందుకీ దుస్థితి 6) ఫెడరల్‌ డార్వినిజం 7) మార్గం మూసుకున్న బీజేపీ 8) వామపక్షాల స్వయంకృతం
9) చేతులు కాలిన లెఫ్ట్‌ 10) పల్లకీ బోయీలు కాదా? 11) పరణితి లేని మాయావతి 12) కూటమి బలమైనదే కానీ 13)
కూటమి వైరుధ్యాలు 14) ప్రాంతీయ పార్టీల రుగ్మతలు 15) తెలుగుదేశం అర్థ సమీక్ష 16) కేసీఆర్‌కు తగని ధోరణి 17) లెఫ్ట్‌
స్వయంకృతం 18) మాయావతి ఇందిరాగాంధీ కూతురా? 19) నగదు బదిలీ కొట్టివేయదగ్గదేం కాదు 20) మనకు తెలియని
ఒక రహస్యం 21) చంద్రబాబు పొరపాటు 22) స్థానికేతరులపై వ్యతిరేకత ఎందుకు?

టంకశాల అశోక్‌ గురించి ...

స్వగ్రామం మడిగొండ, వరంగల్‌ జిల్లా.
హైదరాబాద్‌, ఢిల్లీలలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహరాల్లో విద్యాభ్యాసం.
వార్తలు రాయటం ఆరంభించింది 1966 వరంగల్‌ జిల్లా వారపత్రిక జనధర్మకు.
అదే పత్రికలో 1967-72 మధ్య పూర్తిస్థాయి పని.

1972 నుంచి 77 వరకు ఆధ్ర జనత , నవ్యాంధ్ర ఈనాడు, ఆంధ్రభూమి దినపత్రికలలో హైదరాబాద్‌లో ఉద్యోగాలు, 1979-
80లో ఆంధ్రప్రభకు ఢిల్లీ నుండి అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్‌. 1984-94 నుండి 96 వరకు హైదరాబాద్‌లో అసిస్టెట్‌
ఎడిటర్‌. తర్వాత వార్త దినపత్రికలో ఉద్యోగం. 2002 వరకు అసిస్టెంట్‌ ఎడిటర్‌ తర్వాత నుండి ఎడిటర్‌.
పంజాబ్‌, కాశ్మీర్‌, కార్గిల్‌ యుద్ధం, శ్రీలంక, ఉత్తర భారత రాష్ట్రాల ఎన్నికలు, పాకిస్థాన్‌, ఇరాన్‌లపై ఆయా ప్రాంతాల నుంచి
ప్రత్యేక రిపోర్టింగ్‌లు.

ఎబికెతో కలిసి నాలుగు సంపాదకీయ సంపుటాల ప్రచురణ.
సముద్రం, ఒబామా జీవితం-ఆలోచనలు, ఒక జర్నలిస్టు ఆత్మవిమర్శ, తెలంగాణ రచనల సంకలనం-వివేచన ఇతర ప్రధానమైన
ప్రచురణలు.



2009 ఎన్నికలు ప్రాంతీయ, బడుగు పార్టీలకు హెచ్చరిక
- టంకశాల అశోక్‌


అట్టమీద బొమ్మలు : శంకర్‌
కవర్‌ డిజైన్‌ : రమణ జీవీ
ధర : రూ. 40
తొలి ముద్రణ : జూలై, 2009

ప్రతులకు, వివరాలకు :

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ ; 23521849

EMAIL : hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Wednesday, August 19, 2009

అనుసరణీయం మూలికావైద్యం



మూలికా వైద్యంతో ఆరోగ్యం
సంప్రదాయిక వైద్య విజ్ఞానం లేకుండా ఆధునిక వైద్య విజ్ఞానం లేదు. దీనిని గుర్తించనిరాకరించే వారు అన్నింటికీ అల్లోపతి వైద్యమే పరిష్కారమన్నట్టు మాట్లాడుతున్నారు.

సంప్రదాయిక వైద్య విధానాల్లోని శాస్త్రీయతని ప్రశ్నిస్తున్నారు. కానీ శతాబ్దాల అనుభవ జ్ఞానంతో ఉనికిలో వుంటున్నాయి సంప్రదాయిక వైద్యవిధానాలు. వీటినే దేశీయ వైద్య విధానాలంటున్నారు. వీటిలో అతి ప్రాచీనమైంది మూలికావైద్యం. వర్తమాన అవసరాలకి అనుగుణంగా ఈ వైద్య విధానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చునో డా. జి. లక్ష్మిణరావు కొన్నాళ్ళుగా వివరిస్తున్నారు. మనం ఆరోగ్యంగా జీవించేందుకు మూలికావైద్యం ఎలా ఉపరిస్తున్నదో చెబుతున్నారు. కొంతకాలంగా ఆయన రాసిన వ్యాసాలన్నిటిని ఒకచోట చేర్చి, 'మూలికా వైద్యంతో ఆరోగ్యం' శీర్షికన హైదరాబాద్‌ బుక్‌ట్రస్టు ప్రచురించింది.

మూలికావైద్యం అవసరం ఏమిటో. అది ఎలా ఉపకరిస్తుందో, ఆయుర్వేదం, హోమియో వైద్యవిధానాలకీ, మూలికా వైద్యానికీ తేడాలు ఏమిటో తొలుత వివరించారు అలాగే పశ్చిమ దేశాల్లో ఈ మూలికా వైద్యాన్ని ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో రాశారు. తర్వాతి అధ్యాయాల్లో చర్మ వాధ్యులు, శ్వాససంబంధ వ్యాధులు, కీళ్ళవ్యాధులు, జీర్ణవ్యాధులు, స్థూలకాయం, మధుమేహం మొదలయిన వ్యాధుల్నినయం చేయడంలో మూలికావైద్యం పాత్ర ఏమిటో చెప్పారు.

వ్యాధుల నివారణలో ఎలా ఉపయోగపడుతున్నదనే కాకుండా, అసలు దేహం జబ్బుల బారిన పడకుండా ఎలా కాపాడుకోవచ్చునో చెప్పిన విధానం బాగుంది. ప్రకతి ప్రసాదించిన మూలికల్ని కాపాడుకోవటం, వినియోగించుకోవటం ద్వారా ఆర్యోంగా దీర్గకాలం జీవించడానికి గల అవకాశాల్ని రచయిత వివరించారు.

- స్వామి
(వార్త ఆదివారం అనుబంధం 16 ఆగస్ట్‌ 2009 సౌజన్యంతో)


మూలికా వైద్యంతో ఆరోగ్యం
- డాక్టర్‌ జి. లక్ష్మణ్‌రావు

235 పేజీలు, వెల: రూ.180/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Tuesday, August 18, 2009

వ్యక్తిత్వాన్న గౌరవించే పెళ్లిల్లు - పెరియార్‌ ఇ.వి. రామస్వామి ...


వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్లిల్లు నుంచి ...
వివాహం అంటే ఏమిటి? ఒక స్త్రీ ఒక పురుషుడు వైవాహిక జీవితంలోకి ప్రవేశించటానికి అంగీకరించి ఆ విధంగా ప్రకటించటమే వివాహం. అయితే పెళ్లిళ్లు అనేక రకాలుగా జరుగుతాయి.
ఇన్ని రకాల వివాహాలు జరగాల్సిన అవసరం వుందా? ఈ ప్రశ్నకు ఏ ఒక్కరూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.
...
ముహూర్తం, నక్షత్రం, లగ్నం అనేవి తమిళ పదాలు కావు. తమిళులకు తమవైన సంవత్సరాలు లేవు. సంవత్సరాలకు చెప్పే కథే అసభ్యకరమైనది. నారదుడి, కృష్ణుడి కలయిక (ఇద్దరూ మగవారే) మూలంగా 60 మంది పిల్లలు పుట్టుకొచ్చారనీ... వారి పేర్లే సంవత్సరాలనీ భాగవతం తదితర పురాణాలు చెబుతున్నాయి. ఇధ్దరు మగవారి కలయిక మూలంగా పిల్లలు పుట్టారని చెప్పడం ఎంత అసంబద్ధమూ, ఎంత అసభ్యకరమో మనకు తెలుసు.
...
వివాహ ఆహ్వాన పత్రికల్లో ''కన్యాదాన ముహూర్తం'' లేదా ''తారా ముహూర్తం'' ''వివాహ శుభ ముహూర్తం'' వంటి శీర్షికలుంటాయి. కన్యాదానం అంటే కన్యను మరొకరికి దానంగా, బహుమతిగా ఇవ్వడం.నేటి పెళ్లి కుమార్తెలు దీనికి అంగీకరిస్తారా?
...
మన నాగరికతకు, సంప్రదాయానికి సరిపడనందున సాంప్రదాయ వివాహాలలోని అనేక పద్ధతుల్న మనం విసర్జించాము. వైదిక సంప్రదాయం ''వేద'' నుంచి జనించింది. వేద అనే పదం బ్రాహ్మణులచే సృష్టించబడి, మనపై రుద్దబడింది.
వేదాలను ఇతరులు చదవకుండా వారు అనేక కఠినమైన నిబంధనలు ఏర్పరిచారు. ఏ బ్రాహ్మణేతరుడైనా వేదాలను చదివితే అతని నాలుక కత్తిరించాలన్నారు. బ్రాహ్మణులు వేదాలు చదువుతుండగా ఎవరైనా వింటే వారి చెవుల్లో సీసం కరిగించి పోయాలని నిర్ణయించారు. ఈ విధమైన నియమాల ద్వారా వారు ప్రజలను భయకంపితులను చేసి, ప్రజల్ని వేదాలు చదవకుండా అందులో ఏముందో తెలుసుకోడానికి వీలు లేకుండా చేశారు....
వేదలలో ఏమున్నదనేది నేడు బహిరంగ రహస్యం. అందువల్ల నేటి సాంప్రదాయాలకు వేదాలను అనుసంధానించడం కేవలం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. వైదిక సాంప్రదాయం పేరిట నేడు జరుగుతున్నదంతా బ్రాహ్మణులచే సృష్టించబడిన ఓ ఇంద్రజాలం మాత్రమే.... పురాణాలన్నీ బ్రాహ్మణులచే సృష్టించబడిన కాకమ్మ కథలే. అవి వాస్తవాలు కావు. బ్రాహ్మణుల సంస్కృతినీ, వారి గొప్పదనాన్నీ వర్ణించడానికే పురాణాలు రాయబడ్డాయి
...
ఈ పూజారులేమిటి? మనకు అర్థం కాని, తెలియని భాషలో పురోహితుడు మాట్లాడుతుంటాడు. అసలు ఆవిధమైన కర్మకాండ, వైదిక క్రియలను ఎందుకు పాటించాలో అతనికే తెలియదు. మనలను వాటిని పాటించమని మాత్రం చెబుతాడు. మన నుంచి డబ్బు గుంజుతాడు. మనం అతని పాదాలపై పడటమే కాక నూతన వధూవరులను కూడా అతని పాదాలపై పడమని కోరతాం. ఈ పూజారులను మించిన ద్రోహులు ఎవరైనా వుంటారా? మీలో ఎంతమంది ఈ విషయాన్ని బాగా ఆలోచించారు? అసలు మనకి పూజారి అవసరమేమిటి?
...
మనం మన వివాహాల్లో చేసిన మొదటి మార్పు ఈ పూజారిని తొలగించడమే. ఏ బ్రాహ్మణున్నైనా మన పెళ్లిళ్లు జరిపించటానికి ఆహ్వానించే ప్రశ్నే లేదు.
ప్రజల్ని ఎక్కువ, తక్కువ వారిగా విభజించే విధానానికి మనం వ్యతిరేకం. బ్రాహ్మణులపై మనకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మనం చేస్తున్నదల్లా ఏమిటంటే మనం పుట్టుకతోనే తక్కువ జాతి వాళ్లం అన్న మాటని ఒప్పుకోకపోవడమే. అదేవిధంగా నెయ్యి వంటి విలువైన వాటిని మనం మూర్ఖంగా అగ్నికి ఆహుతి చేయడాన్ని కూడా ఒప్పుకోం. అవన్నీ అర్థరహితమైనవి.
...
కుల వ్యవస్థను శాశ్వతం కావించడానికే ఈ వైదిక కర్మకాండ సృష్టించబడింది. ఈ కర్మకాండ అవసరం మనకు ఏమిటి? దీని వల్ల మనకు జరిగే లాభమేమిటి? ఎవర్ని ప్రశ్నించినా మనకు లభించే సమాధానం ఒక్కటే. ''మన కులంలో ఇది సనాతనంగా వస్తున్న ఆచారం!''
...
మార్పు అనివార్యం...మనం మార్పును కోరుకుంటాం. కాలంతో పాటు పరుగెత్తుకుని వచ్చే మార్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు.
మన వివాహాలలో మన తార్కిక దృష్టికి అహేతుకంగా కనిపించే ప్రతిదాన్నీ తిరస్కరిస్తాం.
మార్పులు సహజసిద్ధం. ఎవ్వరూ వాటిన ఆపలేరు. ఏ సాంప్రదాయవాదైనా జరుగనున్న మార్పులకు నేడో రేపో తలవంచాల్సిందే.

వ్యక్తిత్వాన్ని గౌరవించే పెళ్ళిళ్లు
- పెరియార్‌

ఆంగ్ల మూలం:Self Respect Marriages, Published by Periyar Self-Respect Propaganda Institute, Madras-7
ప్రథమ ముద్రణ: 1995
పునర్ముద్రణ: 2000
36 పేజీలు, వెల: రూ.10

Saturday, August 15, 2009

ఏడాదిలో 10,000 హిట్లు ... !


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగును ప్రారంభించి దాదాపు 14 నెలలు కావస్తోంది.
అయితే వీక్షకుల సంఖ్యను తెలిపే క్లస్టర్ మాప్ ను ఇన్సర్ట్ చేసి మాత్రం సరిగ్గా సంవత్సరం అవుతోంది.
గత 14 ఆగస్ట్ 2008 నుంచి ఇవాళ్టి వరకు 10,000 కు పైగా హిట్లను సూచిస్తోంది అది .
మా బ్లాగును ఇంతగా అభిమానిస్తున్న పుస్తక ప్రియులందరికీ ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
మేం ప్రచురించిన పుస్తకాలపై వివిధ పత్రికల్లో, బ్లాగుల్లో వెలువడిన (మా దృష్టికి వచ్చిన ) సమీక్షలను మా బ్లాగులో తిరిగి పొందుపరుస్తున్న విషయం తెలిసిందే.
మంచి పుస్తకాల ప్రచురణకూ, వాటి ప్రాచుర్యానికీ ఈ సమీక్షలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
ఇకనుంచీ మా పుస్తకాలను చదివిన పాఠకులు ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని, స్పందనను, సమీక్షను మాకు నేరుగా మెయిల్ చేస్తే వాటిని కూడా మా బ్లాగులో పొందుపరచాలని అభిలషిస్తున్నాం.
ఇదే మీకు మా ఆహ్వానం.
రండి మంచి పుస్తకాలు విరివిగా వెలువడేందుకు మీ వంతు సహకారం అందించండి..
మా పాఠకులకూ, బ్లాగు వీక్షకులకూ, సమీక్షకులకూ, కూడలి, జల్లెడ, హారం లకూ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇట్లు
మీ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్

ఈమెయిలు చిరునామా : hyderabadbooktrust@gmail.com

,,,,,,,,,,,,,,,,,,,,,

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌