Sunday, November 10, 2013

ఆయన పొగరు అగ్ర వర్ణాలను గాయపర్చిందా !! అగ్ర వర్ణాల పొగరు ఆయనను గాయ పర్చిందా ??

ఆయన పొగరు అగ్ర వర్ణాలను గాయపర్చిందా !!
అగ్ర వర్ణాల పొగరు ఆయనను గాయ పర్చిందా ??


"నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా ... అయితే సంతోషం!" పుస్తక అహిష్కరణ సభ, ఖమ్మం.
" పొలిటికల్ వార్" నవంబర్ 2013 సౌజన్యం తో


Thursday, November 7, 2013

ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు: పోలీసు, కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి? - బొజ్జా తారకం


ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు
పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?


- బొజ్జా తారకం


ఈ పుస్తకానికి ఎందుకనో ముందుమాట రాయలేదు. రాయకుండానే ముద్రణకు పంపించాం. కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయి అనిపించి ఓ నాలుగు మాటలు రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టానికి సంబంధించిన అవగాహన బాగానే పెంచటం జరిగింది. అత్యాచారం జరిగిందని తెలిసిన వెంటనే కార్యకర్తలు అత్యాచారానికి గురైన వారు వారి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు చేయటం, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించటం, మృతదేహాలకు పోస్ట్‌ మార్టమ్‌ చేయించటం వంటి పనులు జరుగుతున్నాయి. గాయపడిన వారికి మృతుల బంధువులకు నష్టపరిహారం అందేలా చూడటం, పునరావాస సౌకర్యం కల్పించటం వంటి పనులు వెంట వెంటనే జరుగుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ముద్దాయిలను అరెస్టు చేయించి జైలుకు పంపటం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

దీనివల్ల అత్యాచారం జరిపిన వర్గం  నుంచి తీవ్రత వస్తున్నప్పటికీ కార్యకర్తలు వెనుకాడటంలేదు. చట్టం సరిగ్గా అమలు జరిగితే సగం పని అయిపోయినట్టే! అత్యాచారాలు జరగకుండా చూడటం అనేది రాజకీయ వ్యవహారం. చట్టం అమలు పటిష్ఠంగా ఉంటే రాజకీయ శక్తులు, అగ్రకుల అహంకారులు కొంత వెనుకంజ వేస్తారు. దానితో పోలీసులు కూడా దారికి వస్తారు. ఈ చట్టాన్ని ఎంత పటిష్ఠంగా అమలు జరిపితే అంత త్వరగా అత్యాచారాలు కూడా ఆగిపోతాయి.
   
ఇప్పుడు ఒక కొత్త అత్యాచారం చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది.
''పరువు హత్యలంటూ'' ఎస్‌.సి., ఎస్‌.టి.లపై కులం కులమే, గ్రామం గ్రామమే దాడిచేసి చంపేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హర్యానా, యు.పి. రాజస్థాన్‌లలో ఎక్కువగా జరుగుతున్నాయి.

అన్ని హత్యలకూ కారణం ఒకటే. ఎస్‌.సి. కులానికి చెందిన అబ్బాయి, అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అది ఆ అగ్రకులానికి ఇష్టం ఉండదు. పెళ్ళి చేసుకున్న ఆ ఇద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అగ్రకులంవారు ఈ భార్యాభర్తలను వెతికి పట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయిని విడిచిపెట్టేయ మంటారు. ఆ అమ్మాయి వినదు. అంతే, అబ్బాయిని చంపేస్తారు.
ఒకోసారి ఇద్దర్నీ చంపేస్తున్నారు.
దీనికి ఆ కులమూ, గ్రామమూ మద్దతు ఇస్తుంది.
 పోలీసు కూడా జోక్యం చేసుకోవటానికి భయపడుతుంది.

అత్యంత దారుణమైన, హేయమైన, నీచమైన హత్యలివి. అగ్రకులం పరువు పోయిందని ఇటువంటి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయటంగాని, కేసు నమోదు చేయటంగాని, దోషులకు శిక్షపడేలా చూడటం కాని జరగటంలేదు.
దీనితో అగ్రకులాల వారికి ధైర్యం బాగా పెరిగిపోతున్నది.

కాని, ఒక్క విషయం మాత్రం ఈ అగ్రకులాలవారు గ్రహించటంలేదు. ఇటువంటి హత్యల ద్వారా ఈ ప్రేమ వివాహాలను ఆపటం సాధ్యపడదని, కులాల అడ్డుగోడలు లేని ఒక మానవీయ బాంధవ్యాలకు సంబంధించిన అంశమేమో, ఈ నేర ప్రవర్తన ద్వారా వీటిని అరికట్టటం అసాధ్యమనేది గ్రహించటంలేదు.

   
ఈ చట్టం కూడా ఈ పరిస్థితిని పరిగణనలోనికి తీసుకోవటంలేదు.
చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటంతోపాటు, విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా ఒక సామాజికమైన మార్పును తీసుకురావటం ప్రధాన కర్తవ్యం.
అటువంటి పని దురదృష్ట వశాత్తు ఈ దేశంలో జరగటంలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక ఉద్యమాలు పూర్తిగా బలహీనమైపోయాయి.
వాటిని పునరుద్ధరించటం కూడా చాలా అవసరం. ఇటువంటి ఉద్యమాలు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయించటానికి బాగా ఉపకరిస్తాయి.



ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు : పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?

- బొజ్జా తారకం


ధర    :    రూ. 50/-

మొదటి ముద్రణ    :    జూన్‌ 2012, రిపబ్లికన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌
రెండవ ముద్రణ    :    అక్టోబర్‌ 2013
హక్కులు    :    రచయితవి

ప్రతులకు, వివరాలకు 
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌,   గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 23521849

Wednesday, November 6, 2013

అడుక్కుంటే వేసేది బిచ్చం! కొట్లాడితే వచ్చేది వాటా! - బొజ్జా తారకం


అడుక్కుంటే వేసేది బిచ్చం!
కొట్లాడితే వచ్చేది వాటా!



సాగర మధనంచేసి అమృతం పంచుకుందామని రాక్షసులను దేవతలు పిలిచారు. ఆ మాటలు నమ్మిన రాక్షసులు సాగర మధనం చేసి అమృతం తెచ్చారు. కష్టమంతా వారిదే! తీరా అమృతం పంచుకునేసరికి దేవతలు మోసంచేసి వారికి అమృతం లేకుండా చేశారు. ఆస్తి పంపకాల దగ్గర మొదలైన యుద్ధం ఈనాటికీ సాగుతూనే ఉన్నది. ఆస్తి పంపకాల దగ్గరే మొదటినుంచీ మోసం జరుగుతున్నది.
 
మాయా జూదంలో ఓడిపోలేదుగాని ఎక్కడో ఏదో మోసం మాత్రం జరిగింది. దళితులు, ఆదివాసీలు అది కానలేకపోయారు. దాని ఫలితంగా వారు ఊరవతల, అడవుల్లో ఉండిపోయారు.

   
వాళ్ళను అలా పంపి, వారి ఆస్తిని స్వాధీనం చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు అవతలి వాళ్ళు, బతకొచ్చిన వాళ్ళు మోసగాళ్ళు.  పెట్టిన గడువు ఎపుడో పూర్తయిపోయింది. దొంగ లెక్కలు చెప్పి ఇంకా వారిని  అక్కడే ఉంచుతున్నారు. 'తిరిగి వస్తాము, మా ఆస్తి మాకు ఇచ్చేయండి' అని కబురు పంపుతుంటే అసలు ఏమాత్రమూ లక్ష్యపెట్టటం లేదు. వాళ్ళు దానికోసం పోరాటం చేస్తే, అతి కష్టంమీద కొంత దగ్గరగా రానిచ్చారు. అయితే ఒక గీతగీసి దాని అవతలే ఉండాలన్నారు. 'మీరు బ్రతకటానికి మేం కొంత తిండి ఇస్తాములే, మాదగ్గరే పని చేసుకు బ్రతకండి' అని ఓ మెలికపెట్టారు.
   
పాండవులు కౌరవులకు సరిగ్గా ఇలానే జరిగింది. వనవాసం అయిపోయిన తర్వాత రాజ్యానికి తిరిగివచ్చి మా రాజ్యం మాకివ్వమంటే 'ఎక్కడిది మీ రాజ్యం?' అని ఎదురు ప్రశ్న వేశారు. ఎంతచెప్పినా మొండికేస్తుంటే కృష్ణున్ని రాయబారానికి పంపారు. 'మా రాజ్యం మాకు ఇస్తారా? లేక యుద్ధం జరుగుతుంది, దానికి సిద్ధపడతారా? అంటూ.

   
సరే, కృష్ణరాయబారం ఏమయిందో మీకందరకూ తెలుసు ! రాజ్యం ఇవ్వటానికి కౌరవులు ఒప్పుకోకపోతే కృష్ణుడు ఒక ప్రతిపాదన చేశాడు.

వాళ్ళరాజ్యం వారికి ఇవ్వకపోతే
''వాళ్ళు అయిదుగురున్నారు కదా, కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వండి పోనీ'' అన్నాడు కృష్ణుడు.  దానికీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత కథా మీకు తెలుసు !

   
దేశానికి స్వతంత్రం వచ్చి ముప్ఫై ఏళ్ళయిపోయిన తర్వాత ఊరిబయట ఉన్నవారి ఒత్తిడి తట్టుకోలేక ''అరె, వాళ్ళు అక్కడే ఉన్నారు గదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి! ఆ ప్రకారం ప్రస్తుతానికి ప్రతి ఏడూ వాళ్ళకు ఎంతోకొంత పంచుతూ ఉండండి, వాళ్ళ ఆస్తి సంగతి తర్వాత చూద్దాం'' అన్నారు పాలకులు. దాని పర్యవసానమే ఈ స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ !
   
అయిదుగురున్నారు కాబట్టి కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వండి అని అడిగినట్టు, 'ఎస్‌.సి.లు 16.2 శాతం, ఎస్‌.టి.లు 6.6 శాతం ఉన్నారని, బడ్జెటులో ఆ శాతం మేరకు వాళ్ళకు ఆస్తిలో వాటా ఇస్తున్నట్టు చూపండి' అన్నారు పాలకులు. అలా వచ్చినవే  ఈ ఎస్‌.సి.పి., టి.ఎస్‌.పి.లు!

   
దీనినిబట్టి ప్రతి వార్షిక బడ్జెటులో ఎస్‌.సి.లకు 16.2 శాతం, ఎస్‌.టి.లకు 6.6 శాతం కేటాయించాలి. వారి అభివృద్ధి కోసం పథకాలు వేసి వాటిపైన ఖర్చు పెట్టాలి. మొత్తం ఖర్చు మరుసటి సంవత్సరం బడ్జెటు వచ్చేనాటికి అయిపోవాలి. మిగలకూడదు, మిగల్చకూడదు, ఒక్కపైసా కూడా ఏ ఇతర అవసరాలకుగాని మళ్ళించ కూడదు. ఇదీ ఈ పథకాల స్వభావం.
   
అయితే దీనికి భిన్నంగా జరుగుతున్నదే రాజ్యపాలన. నిన్నటివరకూ బడ్జెటు కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగలేదు, జరిగిన తక్కువ శాతం కూడా పూర్తిగా ఖర్చుచేయలేదు. మిగిలిన మొత్తం వేరే వాటి మీద ఖర్చుపెట్టారు!

ఆస్తి, సంపద, డబ్బు లేకపోయినా వనరులు అందకపోయినా ఎవరూ బాగు పడలేరు. ఏ సమాజమూ అభివృద్ధికాలేదు. అవి వీరికి దొరకనివ్వటంలేదు కాబట్టే వీరు ఇంత అధ్వాన్నస్థితిలో ఉన్నారు. ఆనాడు పాండవులు అడిగినా అయిదు ఊళ్ళు ఇవ్వటానికి పాలకులు సిద్ధంగాలేరు. 'తప్పదు బంధు నాశనము' అంటూ పాండవులు యుద్ధానికి దిగారు. అంతే...రాజ్యం తెచ్చుకున్నారు. స్వతంత్రదేశ పాలకులు అది గ్రహించారు. ఇది కూడా ఇవ్వకపోతే యుద్ధానికి దిగుతారని తెలుసుకొని 'అయిదు ఊళ్ళు ఇస్తాములే తీసుకోండి' అన్నారు. ఇలా వచ్చినవే ఎస్‌.సి.పి; టి.ఎస్‌.సి.లు!
   
అడిగితే వేసేది బిచ్చంలాంటిది! వేసేవాళ్ళ ఇష్టం. పాచి అన్నం పెట్టినా బిచ్చగాడు ఏమీ చెయ్యలేడు. ముందుకుసాచిన మూకుడు లోకి నాలుగు మెతుకులు విదిలిస్తారు... ఏరుకోవలసిందే! బిచ్చగానికి వేరే మార్గం లేదు. తాను బిచ్చగాడు కాదని తెలుసుకొని కొట్లాటకు దిగాడనుకోండి, పరిస్థితి వేరే ఉంటుంది. తనకు రావలసిన వాటా వేరే వాళ్ళు అనుభవిస్తూంటే కొట్లాడవలసిందే గదా! కొట్లాడితే వచ్చేది వాటాయే, బిచ్చం కాదు, నాలుగు మెతుకులూ కాదు.
   
ఈ రోజు ఎస్‌.సి., ఎస్‌.టి.లు తేల్చుకోవలసింది ఇదే! మీరు బిచ్చమడుగుతారా? ఆస్తికోసం కొట్లాడతారా? బిచ్చమే అడుగుతూ ఉంటే మీ మూకుడులో నాలుగు మెతుకులు మాత్రమే రాలుతూ ఉంటాయి. యుద్ధానికి దిగారనుకోండి, మీ వాటా మీకు వస్తుంది అంతే...ఇక ఏ గొడవా ఉండదు! ఇదీ ఇపుడు ఎస్‌.సి.పి, టి.ఎస్‌.పి.ల విషయంలో జరగవలసినది! ఏంచేస్తారు? నిర్ణయించుకోండి!
   
ఎస్‌.సి.పి., టి.ఎస్‌.పి.ల వాటా కోసం ఇపుడు కొంత ఆందోళన జరుగుతున్నది. ప్రజా సంఘాల నుంచి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులవరకూ ఇది వెళ్ళింది. హైద్రాబాద్‌ నుంచి ఢిల్లీవరకూ వెళ్ళింది. విజ్ఞాపనలు, వినతి పత్రాలు, ఊరేగింపులు, చర్చలు, సదస్సులు, సభలు, ధర్నాలు, అరెస్టులు అన్నీ అయ్యాయి. ఈ విషయంలో చట్టం ఒకటి తేవాలంటూ కొన్ని సంఘాలు, వ్యక్తులు ప్రభుత్వంపై అటు ఢిల్లీలో ఇటు హైద్రాబాద్‌లో ఒత్తిడి తెస్తున్నారు. ఇంతచేస్తేనేగాని ప్రభుత్వాలు కదలలేదు. ఉప ముఖ్య మంత్రి అధ్యక్షతన కొందరు మంత్రులతో ఈ నిధుల అమలుకు ఒక ఉప సంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది.
   
వీటి ఫలితంగా వార్షిక బడ్జెటులో కేటాయింపు కొంత పెరిగింది. ఇపుడు ఈ కేటాయింపును పూర్తిగా ఖర్చుపెట్టించాలి. ఆ ఖర్చుకూడా ఎస్‌.సి, ఎస్‌.టి. వారి అభివృద్ధి కోసమే జరగాలి. ఎట్టి పరిస్థితిలోనూ మళ్లింపు జరగకుండా చూసుకోవాలి. దీనికి ఏ స్థాయిలో ఆందోళన జరపాలో రాజకీయ పార్టీలు, సంఘాలు సంస్థలు ఆలోచించుకోవాలి.
   
ఈ పధకాల విషయం ప్రభుత్వానికి తెలియవనా ప్రజలు ఆందోళన చేయటం? కానేకాదు. తెలిసీ, ఈ తప్పుడు విధానాలకు వెళ్తున్నది. ప్రతి బడ్జెటును ఆమోదించే ప్లానింగ్‌ కమీషన్‌కు ఈ పథకాలలో జరుగుతున్న తప్పులు, నేరాలు, ఘోరాలు తెలియవనా సంఘాలు ఆవేదన చెందటం? కానేకాదు. తెలిసే ఇదంతా... 'మీరలా చేస్తూ ఉండండి, మేము ఇలా చెపుతూ ఉంటాము'' అని వారిద్దరూ ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు. అందుకని వీరి గూడుపుఠాణీ, వీరి నాటకాలు బద్దలుగొట్టాలంటే ఎంత గట్టిగా ఆందోళన చెయ్యాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. దానికి ఏదైనా సహాయ పడుతుందేమో అని ఈ పుస్తకం తీసుకురావటం!
   
ముందు విషయం తెలియాలి, ఆపైన లక్ష్యం గుర్తించాలి. దానిమీద కేంద్రీకరించాలి. దానిపైననే గురిపెట్టాలి, బాణం ఎక్కుపెట్టాలి, కొట్టాలి. ఫలితం చేతికందాలి. అలాచేస్తే అందుతుంది.
   
మొదట చేయవలసిన పని ఏదోముందు గుర్తించాలి. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ తర్వాత రెండోది, మూడోది, ఆ తర్వాత చివరిది! అందుకనే ముందుగా ఎస్‌.సి., ఎస్‌.టి.లకు రావలసిన వాటా తీసుకోండి. ఆ తర్వాత వాటాలు పంచే స్థానం తీసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అవకాశాలు అందరికీ సమానంగా అందాలి. అది సమానత్వంలో భాగమే!



ఎస్సీ ఎస్టీ నిధులు ... విదిలింపు - మళ్ళింపు

- బొజ్జా తారకం



ధర    :    రూ. 40/-
మొదటి ముద్రణ    :    జూన్‌ 2012, రిపబ్లికన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రణ    :    అక్టోబర్‌ 2013
హక్కులు    :    రచయితవి

ప్రతులకు, వివరాలకు:    
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,      
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌,గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.
 ఫోన్‌ : 23521849

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌