Friday, May 24, 2013

భారత రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు? .

భారత రాజ్యాంగం
దేశానికి మూల స్తంభం

- గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌

భారత రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన రాజకీయ చరిత్రే ఈ పుస్తకం. భారత రాజ్యాంగ రచన నేపథ్యాన్ని, రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యుల కృషిని ఇది సోదాహరణగా వివరిస్తుంది. సాధారణ పాఠకుడు భారతీయ జీవనం తాలూకు రాజకీయ మూలాలను, ప్రేరణలను అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అదే సమయంలో భారతీయ వ్యవహారాలను అధ్యయనం చేసేవారికి, చరిత్ర, రాజనీతి, న్యాయ శాస్త్ర విద్యార్థులకు రాజ్యాంగ నిర్ణయ సభ పనితీరు గురించిన మౌలిక సమాచారాన్ని అందిస్తుంది.

గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ (1927 - ) భారత రాజ్యాంగంపై సాధికారాత కలిగిన ప్రపంచ ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు. జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్‌, కె.ఎం.మున్షీ, బి.ఎన్‌.రావు మొదలైనవారి సహకారంతో అత్యంత కీలకమైన రాజ్యాంగ నిర్ణయ సభ డాక్యుమెంట్లను పరిశీలించి, ఎందరో రాజ్యంగ రచయితలను ఇంటర్వ్యూ చేసి, విస్తృతంగా పరిశోధించి ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. ఆక్స్‌ఫర్డ్‌ యునివర్సిటీ ప్రెస్‌ వారు దీనిని 1966లో ప్రచురించారు. 1972లో తొలి భారతీయ ముద్రణ వెలువడింది. ఆతరువాత 17సార్లు పునర్ముద్రణలు పొంది సంచలన విజయం సాధించింది. ఇప్పుడు నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాయి.

గ్రాన్‌విన్‌ ఆస్టిన్‌ భారతీయ ముద్రణకు రాసిన తన ముందు మాటలో ఇలా అన్నారు:

''ఒకసారి వెనుదిరిగి యాభై ఏళ్ల గతాన్ని పరిశీలించినప్పుడు- జాతి లక్ష్యాలను నిర్దేశించడంలో, వాటికి కావలసిన పాలనా వ్యవస్థలను అందించడంలో రాజ్యాంగ రచయితలు సాధించిన విజయం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజ్యాంగం భారత జాతికి అద్భుతమైన సేవచేసింది. జరుగబోయే ప్రతీ సంఘటనను రాజ్యాంగ రచయితలు ముందే ఊహించి వుండకపోవచ్చు. వాస్తవానికి వాళ్లు అట్లా ఊహించాలని ఆశించడం కూడా సమంజసం కాదు. రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న కాలంలోని ఆదర్శవాదం, ఆనాడు దేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల కారణంగానే వారు కొన్ని భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేయలేకపోయారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఇతర పరిణామాలను ఊహించినప్పటికీ వాటిని వారు రాజ్యాంగంలో పొందుపరచలేకపోయారు.

నిజానికి ప్రతి సమస్యకూ పరిష్కారమార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. తమ కెదురయ్యే సమస్యలకు రాజ్యాంగ సూత్రాల పరిధిలో, తమదైన పద్ధతిలో పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన బాధ్యత భావి నేతలమీదే వుంటుంది.''
...

''..... భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఒక ఆధునికీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూలసూత్రాలో ప్రస్తుత, భవిష్యత్‌ సమస్యలకు పరిష్కార మార్గాలు వున్నాయని రచయిత చెప్పారు. రాజ్యాంగం సరిగా పనిచేయలేదనడం కేవలం అపోహమాత్రమే అని వాదించారు.

    మేధావులూ; న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యార్థులూ, వర్తమాన భారతదేశం ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నవాళ్లూ తప్పక చదవాల్సిన రచన ఇది.

    గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ ఒక స్వతంత్ర చరిత్రకారుడు. వాషింగ్‌టన్‌ డిసిలో నివసిస్తున్నారు. గతంలో ఆయన ''వర్కింగ్‌ ఎ డెమాక్రాటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ : ఎ హిస్టరీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌'' అనే పుస్తకాన్ని వెలువరించారు.
    వస్తువుకు తగినట్టు ఈ రచనా సంవిధానం ఒకవిధమైన హుందాతనంతోకూడి వుంది. శైలి ప్రశంసనీయంగా వుంది.''

...........................................................................................................................- ది ఎకనమిస్ట్‌





భారత రాజ్యాంగం
దేశానికి మూలస్తంభం
గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌


ఆంగ్లమూలం:  The Indian Constitution ; Cornerstone of a Nation By Granville Austin,
Oxford University Ptress

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

483 పేజీలు, వెల: రూ.250/-


ప్రచురణ కర్తలు:
నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌,
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌,
మానస గంగోత్రి, మైసూరు - 570006
www.ntm.org.in


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
e mail: hyderabadbooktrust@gmail.com
Phone No. 040 2352 1849

ISBN: 978-81-907377-3-9


.

Thursday, April 18, 2013

దాచేస్తే దాగదు చరిత్ర - సారంగ సాహిత్య వారపత్రిక ( ఏప్రిల్ 18, 2013 )...

దాచేస్తే దాగదు చరిత్ర
సారంగ సాహిత్య వారపత్రిక 
(ఏప్రిల్ 18, 2013)

ప్రజోద్యమం ప్రజ్వరిల్లిన్నప్పుడు సహజంగానే ఉద్యమ సాహిత్యం వెల్లువెత్తుతుంది. ఆ ప్రాంత చరిత్ర, నేపథ్యం ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. గత పది పదిహేనేళ్లుగా సాగుతున్న మలిదశ ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే ఇందుకో ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణా అస్తిత్వ ఆకాంక్షను, సంస్కృతీ సంప్రదాయాలను, చారిత్రక విశేషాలను చాటిచెప్పే పుస్తకాలు ఇప్పటికే వందల సంఖ్యలో వెలువడ్డాయి. వాటిలో ఈ ఏప్రిల్‌ 7న ఆవిష్కరించబడ్డ మహమ్మద్‌ హైదర్‌  రచన ”1948: హైదరాబాద్‌ పతనం” ఎంతో విలక్షణమైనది.

నిజానికి ఈ పుస్తకానికీ ఇప్పటి తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికీ సంబంధం లేదు. కానీ ఆనాడు ఉస్మానాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మహమ్మద్‌ హైదర్‌ 1947-48లో జరిగిన సంఘటనల గురించి ఎప్పుడో 1952లో రాసిన పుస్తకం ఇన్నాళ్లకి వెలుగు చూడటానికి మాత్రం కచ్చితంగా ఆ ఉద్యమమే కారణమని చెప్పవచ్చు. మొదట్లో భారత ప్రభుత్వంతో తన ఉద్యోగం విషయమై జరుపుతున్న సంప్రదింపులకు విఘాతం కలుగుతుందేమోనన్న భావనతో రచయితే ఈ పుస్తక ప్రచురణను పక్కన పెట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో కొంత సాహిత్యం వెలువడింది. 70వ దశకంలో పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి వంటి హేమాహేమీలు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట అనుభవాలను వివరిస్తూ పలు పుస్తకాలు ప్రచురించారు.

ఆ సందర్భంగా 1972లో మహమ్మద్‌ హైదర్‌ కూడా తన పుస్తకాన్ని పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ 1973లో 58 ఏళ్ల వయసులోనే ఆయన హఠాన్మరణం పాలయ్యారు. చివరికి ఆయన కుమారుడు మసూద్‌ హైదర్‌ ”అక్టోబర్‌ కూ – ఎ మెమైర్‌ ఆఫ్‌ ది స్ట్రగుల్‌ ఫర్‌ హైదరాబాద్‌” పేరిట తండ్రి పుస్తకాన్ని 2012లో వెలుగులోకి తెచ్చారు. దాని తెలుగు అనువాదమే 1948: హైదరాబాద్‌ పతనం.

ఈనాడు తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్షిస్తోంది… కాగా ఆనాడు తెలంగాణాతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర దేశంగా కొనసాగాలని ఆశించింది. ఈనాటిది మెజారిటీ ప్రజల ఆకాంక్ష అయితే – ఆనాటిది కేవలం పాలకుల ఆశ. దానివల్లనే హైదరాబాద్‌ సంస్థానానికి పదమూడు నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్యం లభించింది.

బ్రిటిష్‌ వలస పాలకులు ”స్వాతంత్య్రం ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి” అన్న రీతిలో వ్యవహరించడం వల్ల, కావాలని విభజన చిచ్చును రగిలించడం వల్ల ఆనాడు దేశమంతా అల్లకల్లోలంగా తయారయింది. గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం సుదీర్ఘకాలం అహింసాయుతంగా సాగింది కానీ తీరా స్వాతంత్య్రం సాకారమయ్యే వేళ దేశంలో కనీవిని ఎరుగనిరీతిలో హింస ప్రజ్వరిల్లి రక్తం ఏరులై ప్రవహించింది. బ్రిటిష్‌వాళ్లు తమ ప్రత్యక్ష పాలనలో వున్న ప్రాంతాలకు స్వాతంత్య్రం ప్రకటించి పరోక్ష పాలనలో వున్న 565 సంస్థానాలకు ఉద్దేశపూర్వకంగా స్వయం నిర్ణయాధికారాన్ని ప్రసాదించారు. పాకిస్థాన్‌లో చేరతారో, భారతదేశంలో చేరతారో, స్వతంత్రంగా వుంటారో మీ ఇష్టం అని వాళ్లని రెచ్చగొట్టారు. అన్ని సంస్థానాల్లోనూ అతి పెద్దది హైదరాబాద్‌ సంస్థానమే. సొంత సైన్యం, ప్రత్యేక కరెన్సీ వంటి అన్ని హంగులతో కూడిన సుసంపన్నమైన రాజ్యం. (ఆనాడు ప్రపంచంలో కెల్లా అత్యంత ధనవంతుడు నిజాం రాజే అని ప్రతీతి).

రెండువందల ఏళ్లుగా తమ వంశస్థుల ఆధిపత్యంలో వున్న రాజ్యాన్ని వదులుకునేందుకు నైజాం నవాబు ససేమిరా అన్నాడు. కానీ మెజారిటీ ప్రజల ఆకాంక్ష వేరుగా వుంది. రాచరిక వ్యవస్థనుంచి, కరడుగట్టిన భూస్వామ్య విధానాలనుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో ................


... పూర్తీ సమీక్ష " సారంగ " లో చదవండి . ......

http://www.saarangabooks.com/magazine/?p=1999









Sunday, April 7, 2013

పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే..... - మొహమ్మద్‌ హైదర్‌



... పోలీసు చర్య అనంతరం జరిగిన భయోత్పాతాలను ఎక్కువచేసి చూపించాలన్న కోరిక నాకు లేదు. కాకపోతే ఈ విషాద ఘటనలను కచ్చితంగా నివారించివుండవచ్చు. భారత సైన్యం ముందంజ వేస్తున్నప్పుడు చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయకేతనం ఎగరేసిన భారత సైన్యం ఛిన్నాభిన్నం చేస్తూ దూసుకువచ్చే బదులు స్థానిక పాలనాయంత్రాంగాలను పునరుద్ధరించడమొ లేదా మిలటరీ యంత్రాంగాలను నెలకొల్పడమో చేసి జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఆ రెండూ చేయలేదు.

అదే అదనుగా దోపిడీ దొంగలు సరిహద్దులు దాటి వచ్చారు. హింసాయుత ఘటనలు యాదృచ్ఛికంగానే కాదు అవకాశవాదంతో పెట్రేగాయి. దోపిడీ దొంగల్లో సరిహద్దు శిబిరాలకు చెందిన వేలాది మంది యువకులు కలిసిపోయారు. వాళ్లు హింసాయుత దాడుల్లో ... ప్రత్యేకించి ప్రతీకార దాడుల్లో శిక్షణ పొందారు.

అరాచకత్వం కొన్ని వారాలపాటు కొనసాగింది. గుంపులు గుంపులుగా వచ్చిన జనం జైళ్లను పగలకొట్టి ఖైదీలను విడిపించుకుపోయారు ఉస్మానాబాద్‌ తరహాలో. హత్యలు, లూటీలు, గృహదహనాలు కొనసాగాయి. రజాకార్లుగా అనుమానించినవాళ్లను, సైన్యంతో కలిసిమెలసి వున్న గుంపులను దోపిడీ దొంగలు ఊచకోత కోశారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి.

తల్లిదండ్రుల నుంచి పిల్లల్నీ, భర్తల నుంచి భార్యల్నీ దూరం చేశారు. మహిళలనూ బాలికలనూ వెంటాడి అత్యాచారాలు చేశారు.
ఇలాంటి ఎన్నో సిగ్గుమాలిన దారుణాలు జరిగాయి ఆ రోజుల్లో. వాటి గురించి ఇప్పటికీ నేను రాయలేను.

ఉస్మానాబాద్‌ నుంచి తిరిగి వచ్చిన రోజునుంచీ నా మిత్రులూ బంధువులూ నన్ను పాకిస్తాన్‌ వెళ్లిపోవలసిందిగా ఒత్తిడి చేశారు. పరిస్థితులు రానురానూ మరింత అధ్వాన్నంగా తయారవడంతో
.... .... ...

- మొహమ్మద్‌ హైదర్‌ 
''1948 : హైదరాబాద్‌ పతనం'' పుస్తకం నుంచి
(హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ)

ఈ పుస్తకావిష్కరణ సభ, చర్చ ఈ రోజే హైదరాబాద్‌ సారస్వత పరిషత్‌ హాల్‌ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే.


Thursday, April 4, 2013

భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం ... ఆంధ్రజ్యోతి నవ్య 4 4 2013 ...



 

1948 హైదరాబాద్ పతనం


భారత దేశ చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విలీనం ఒక వివాదాస్పద అధ్యాయం. దీనికి సంబంధించిన వివరాలు అనేకం అందుబాటులో ఉన్నా- ఇంకా వెలుగులోకి రాని కొన్ని ముఖ్యమైన కోణాలున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఆ నాటి సంఘటనల గురించి రాసిన ముస్లింలు తక్కువ. ఆ సమయంలో ఉస్మానాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన మొహమ్మద్ హైదర్ రాసిన "October coup' అనే ఆంగ్లపుస్తకాన్ని ఇటీవల '1948-హైదరాబాద్ పతనం' పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ నెల 7వ తేదీన విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీ కోసం..

సెప్టెంబరు 17...శుక్రవారం ఉదయం ఖాసిం రజ్వీ నుంచి నాకు ఫోను వచ్చింది. అతనితో ఫోనులో మాట్లాడ్డం అదే మొదటిసారి. "లోపలే ఉండండి'' అతను సలహా ఇచ్చాడు. ఇంటి నుంచి బయటకు రాకండి. శుక్రవారం ప్రార్థనల సమయంలో నివారించలేని కొన్ని పరిణామాలు జరగవచ్చు'' అన్నాడు.
"అప్పటికి భారత సైన్యం నగరంలోకి ప్రవేశిస్తుందని అనుకుంటున్నారా?'' అని నేను అడిగాను.
"అబ్బే అదేం కాదు అన్నాడు.
"అది కాకపోతే ఇంకేమిటి?'' నేను ఆరా తీశాను.
"అనివార్యమైనది'' అని మళ్లీ నొక్కి చెప్పాడు. "మన వాళ్లు ఆయుధాలు చేపడతారు'' అన్నాడు.
జరిగిందేంటంటే అతను అప్పటికే తన అనుచరులకు వేలాది తుపాకులు పంచి పెట్టాడు. ఆరోజు మధ్యాహ్నం తర్వాత హిందువులను ఊచకోత కోయాలని వాళ్లకి ఆదేశాలు కూడా ఇచ్చాడు.

నేను చాలా భయపడ్డాను. ఇది చాలా తప్పు అని నేనతనికి చెప్పాను. భారత బలగాలు నగరానికి చేరుకుంటే మొత్తం హైదరాబాదే సర్వనాశనం అయిపోతుందని చెప్పాను. అయితే అతను వినే పరిస్థితిలో లేడు. రాజకీయాల నుంచి రిటైరయ్యే ముందు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించాలని నేను అభ్యర్థించాను. అతను వినిపించుకోకుండానే ఫోన్ కట్ చేశాను. నేను నవాబ్ దీన్‌యార్ జంగ్ దగ్గరకు పరుగు తీశాను. ఖాసిం రజ్వీ అంటువంటి ఆలోచనతో ఉన్నట్లు ఆయనకు అప్పటికే సమాచారం అందింది. వెంటనే రిజ్వీకి ఫోన్ చేశారు. వాళ్లిద్దరూ అరగంటకు పైగానే మాట్లాడారు. దీన్‌యార్‌జంగ్ పాతికేళ్లకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆయన ఎవ్వరినైనా దేని గురించి అయినా ఒప్పించగల నేర్పరి. అలాంటి దీన్‌యార్‌జంగ్‌కు అతని మొత్తం జీవితంలోనే ఎన్నడూ ఎదురుకాని విధంగా- 1948 సెప్టెంబరు 17 న ఆ అరగంట అతని నైపుణ్యానికి ఓ అగ్ని పరీక్షే అయ్యిందని చెప్పాలి. ఆ రోజు అతను సాధించింది హైదరాబాద్ ప్రజలకు అతను చేసిన అతి గొప్ప సహాయంగా మిగిలిపోయింది.

అరగంట మాటలూ పూర్తికాగానే ఖాసిం రజ్వీ తన అనుచరులను ఆయుధాలు అప్పగించాల్సిందిగా ఆదేశించాడు. అదే రోజు మరికొంతసేపటి తర్వాత లాయక్ అలీ, ఆయన మంత్రి వర్గం (సెప్టెంబరు 17 ఉదయాన) రాజీనామాలు సమర్పించి ప్రభుత్వ పాలనా పగ్గాలు నిజాంకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. లాయక్ అలీ యే ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుతూ నిర్ధారించాడు.

ఆరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ సంస్థానమంతటా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. జనరల్ ఎల్ ఇద్రూస్ అంతకు ముందురోజే నిజాం రాజును కలిసి మరింతగా ప్రతిఘటించడం వల్ల ప్రయోజనం ఉండకపోగా ప్రాణనష్టం భారీగా ఉండే ప్రమాదముందని సలహా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఆ సాయంత్రమే ఖాసిం రజ్వీ తన వాణి వినిపించాడు. అతని గొంతు డెక్కన్ రేడియోలో చివరి సారి వినిపించింది. ఇచ్చిన హామీల మేరకు పనిచేయలేకపోయానని ఒప్పుకున్న రజ్వీ -పరిస్థితులే తనకు వ్యతిరేకంగా కుట్రపన్నాయని అన్నాడు. ఎవరెంతగా రెచ్చగొట్టినా ముస్లింలంతా ప్రశాంతంగా ఉండాల్సిందిగా రజ్వీ ఉద్బోధించాడు. హిందూ ముస్లింల మధ్యనున్న సంప్రదాయ ఐక్యత ఎట్టి పరిస్థితిల్లోనూ అలాగే కొనసాగాలని రజ్వీ ఆకాంక్షించాడు. గతంలో జరిగిన ఘటనలన్నీ మర్చిపోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆ ప్రసంగం విన్న వారంతా కూడా అతని మొత్తం జీవితంలో అంత రాజనీతిజ్ఞతతో చేసిన ప్రసంగం మరోటి లేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.
* * *

మరొక పెద్ద విషయాన్ని మీకు చెప్పి ముగిస్తాను. హైదరాబాద్‌కు, భారత దేశానికి మధ్య జరిగిన సంఘటనలను మనం ఎంత వరకు అర్థం చేసుకోగలం? 1947 -48 మధ్య జరిగిన సంఘటనలను సామాన్యంగా మనం భారతదేశం దృష్టి నుంచి, జాతీయోద్యమం దృష్టి నుంచి చూస్తాం. అది అంత ప్రయోజనకరమైన పద్ధతని నేను అనుకోను. ఎందుకంటే, దృష్టితో చూడడం ప్రారంభిస్తే హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయమని, అంచనాలకు అందని నిర్ణయమని, ఐక్య భారతదేశ ఆవిర్భావమనే ఒక మహా కెరటానికి వ్యతిరేకంగా ఒక చిన్న రాష్ట్రం తన శక్తికి మించి పోరాడి, ఓడిపోయిందని భావించవచ్చు. ఇప్పటికే ఆ భావన స్థిరపడిపోయింది. హైదరాబాద్ అప్పట్లో తీసుకున్న చర్య చాలా అసంబద్ధ నిర్ణయమని, చివరికది తాను చేసిన తప్పుడు అంచనాలకు తానే ఫలితాన్ని అనుభవించిందని సాధారణ ప్రజానీకం చాలామంది భావించవచ్చు.

నిజానికి హైదరాబాద్ పిచ్చిదా? చెడ్డదా? దిద్దుకోలేని తప్పులు చేసిందా? ఒక శత్రువుకు సంబంధించి సాధారణంగా మనం ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తుంటాం. కానీ తనను కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం చర్యలను అర్థరహితంగా, దాన్ని కలుపుకోవడానికి రెండో వర్గం చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటి నుంచో ఆమోదం ఉన్నట్లు మనం భావించడం సరైనదేనా? ఈ విధంగా మనం చరిత్రను విజేతల వైపు నుంచే చూస్తూ, దానికి వక్రభాష్యం చెప్పడం లేదా? దానికి బదులుగా ఒక చిన్న రాష్ట్రమైన హైదరాబాద్, తన కన్నా శక్తివంతమైన ప్రభుత్వంతో పోరాడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినపుడు మనం పరిస్థితిని కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆ పోరాటానికి సంబంధించిన వివరాల్లోకి ఇప్పుడు వెళ్లడం అప్రస్తుతం. కానీ అప్పటి సంఘటనల్లో రెండు అసమాన ప్రభుత్వాల మధ్య జరిగిన పోరులో మనం అవి వ్యవహరించిన సాధారణ తీరుని పరిశీలించడం బాగుంటుంది.

1948: హైదరాబాద్ పతనం
మొహమ్మద్ హైదర్
పేజీలు: 204
ధర: 100
ప్రచురణ, ప్రతులకు: హైదరాబాద్ బుక్‌ట్రస్టు
ఫోన్: 040 -23521849 

ఆంధ్రజ్యోతి నవ్య 4 ఏప్రిల్ 2013 


 

Monday, April 1, 2013

1948: హైదరాబాద్ పతనం ... రచన: మహమ్మద్ హైదర్, తెలుగు అనువాదం: అనంతు ...


1948: హైదరాబాద్ పతనం

హైదరాబాద్‌ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్‌ పోలో ...
1948లో భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంపైకి దండెత్తినప్పటి ఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి.

నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర వైవిధ్యం, పరస్పరం సంఘర్షించుకునే భావ వైరుధ్యాలు ఎన్నో వ్యక్తమవుతుంటాయి. ఈ ఉద్వేగపూరిత కథనాల మధ్య చాలాసార్లు అసలు జరిగిందేమిటో గ్రహించటం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది.

నాటి ఘటనల చుట్టూ పేరుకున్న ఆ మాయనూ, మబ్బుతెరలనూ తొలగించి చూపిస్తుందీ మొహమ్మద్‌ హైదర్‌ రచన.

నాటి ఉద్రిక్త కాలంలో ఉస్మానాబాద్‌ కలెక్టర్‌గా పని చేశారు హైదర్‌.
ఏడాది తిరగక ముందే ఆయనను తన జిల్లా జైలుకే పంపించారు.

జైలులో గడుపుతూనే ఓ పరిపాలనాధికారిగా 1948 ఘటనలకు సంబంధించి తన ప్రత్యక్ష అనుభవాలను, జ్ఞాపకాలను కాగితంపై పెట్టారాయన. ఎంతో హుందాగా, అక్కడక్కడ చెణుకులతో సాగిపోయే ఈ రచన- ఎటువంటి ఆవేశకావేశాలకూ లోనుకాకుండా సాగిపోవటమే కాదు- చివరకు మన కళ్లు తెరిపిస్తుంది కూడా !

    ''స్వతంత్రం అనంతరం దేశంలో చోటుచేసుకున్న ఓ పెద్ద కూహకం గురించి దేశ పౌరులకు తెలియకుండా కప్పిపుచ్చటం, పైగా విదేశీ వర్గాలు దీన్ని బయటపెట్టిన తర్వాత కూడా దాచిపెట్టాలనే చూస్తుండటం దారుణం.
1948 మారణహోమం గురించి ముస్లిం మీడియాకూ తెలుసు. కానీ ఎక్కడా మాట్లాడదు. పైగా తన మౌనానికి హిందూ వర్గాల అణిచివేతే కారణంగా చూపిస్తోంది. ఓ ఉదారవాద ప్రజాస్వామ్యం పనిచేసే తీరు ఇది కాదు. నివేదికలను తొక్కి పెట్టటం, పాఠ్యపుస్తకాల్లో ఇటువంటి ప్రస్తావనలు కూడా రాకుండా తుడిచెయ్యడం ద్వారా భారత్‌ ఎన్నటికీ నిజమైన సమైక్య జాతిగా అవతరించ జాలదు.

                        - స్వామినాధన్‌ అయ్యర్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 2012 నవబంరు, 26




ఈ నెల 7న (2013 ఏప్రిల్ 7) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాల్ లో
ఈ పుస్తకం ఆవిష్కరించ బడుతోంది.

1948: హైదరాబాద్ పతనం
- మహమ్మద్ హైదర్  
ఇంగ్లీష్ మూలం : October Coupe: A Memoir Of The Struggle For Hyderabad - Mohammad Hyder, Published by Roli Books, New Delhi, 2012.
 
తెలుగు అనువాదం : అనంతు 
ప్రధమ ముద్రణ : ఏప్రిల్ 2013
 వెల : రూ 100/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

.










Tuesday, March 26, 2013

"1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

1948:హైదరాబాద్ పతనం

మొహమ్మద్ హైదర్ రాసిన "1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

వేదిక: సారస్వత పరిషత్ హాల్ (ఎస్ పి హాల్)
తేది : 7 ఏప్రిల్ 2013 ఆదివారం ఉదయం 10 గంటలకు

హైదరాబాద్ బుక్ ట్రస్ట్, (040 23521849)
అన్వేషి సంస్థ (040 27423168)
సంయుక్త నిర్వహణ

RETRACING HYDERABAD 1948

Release of Mohammed Hyder's  "1948: HYDERABAD PATANAM"
(translation of the English book OCTOBER COUP)

Hyderabad Book Trust and Anveshi Research Centre for Women's Studies
Invite you to a discussion
At SP Hall (Saraswat Parishad Hall)
On April 7, Sunday at 10 AM
Lunch follows at 1 AM

Hyderabad Book Trust : 040 23521849
ANVESHI 040 040 27423168



Monday, March 18, 2013

తెలంగాణా రైతాంగ పోరాటం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.....

మనకు  తెలియని మన చరిత్ర
- అసూర్యంపశ్య (pustakam.net)

తెలంగాణా రైతాంగ పోరాటం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.

ఏమిటీ పుస్తకం?
ఈ సంపాదకవర్గం వారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో, అందునా పూర్తిగా ప్రధాన నాయకత్వంలోని వారు మాత్రమే కాక, వివిధ స్థాయుల్లో పోరాటంలో పాల్గొన్న వారితో మాట్లాడి,

అప్పటి పోరాటంలో స్త్రీల పాత్ర గురించిన ఒక అధ్యయనం చేయాలన్న ఆశయంతో చాలా చోట్లకి తిరిగి సుమారు 60-70 మందిని ఇంటర్వ్యూలు చేసారు. అయితే, మొత్తం ఇంటర్వ్యూలు

అవీ అయ్యాక, ఆ అనుభవాలు గమనించాక, ఈ ఇంటర్వ్యూలని ఉన్నదున్నట్లుగా, వారి జీవితాలని ఒక సజీవ చరిత్రగా అక్షరబద్దం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో కొందరి

కథలతో కూడిన పుస్తకమే ఇది. సంపాదకుల మాటల్లో:

“ముందు ఈ గొంతులందరికీ వినిపించేటట్లు చేయడం మా బాధ్యత అనుకున్నాం. అందుకే తెలంగాణ భాషలో ఉన్నా, ఆంధ్ర భాషలో ఉన్నా, కొన్నిసార్లు రెండూ కలిసిపోయి ఉన్నా దాన్ని

మార్చే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చెప్పిన భాషలోనే ఉంచినప్పుడే వాళ్ళ భావాన్ని మార్చకుండా ఉంచగలుగుతామని అనుకోవడమే దీనిక్కారణం. ఈ చరిత్రలు తెలియజేయడం మాకెంత

ముఖ్యమో, వాటిని స్వయంగా చెప్పగలగడం వారికీ అంతే ముఖ్యం అని గుర్తించడానికి మేం గర్వపడుతున్నాం.”

పుస్తకంలోకి వెళ్తే,

మొదట సాయుధ పోరాట నేపథ్యం, అప్పటి పరిస్థితులు, ఉద్యమంలో కమ్యూనిస్టులు, స్త్రీల పాత్ర గురించి కొంచెం క్లుప్తంగా రాశారు ఒక వ్యాసంలో. ఆపై, స్త్రీల చరిత్ర అంటే ఏమిటి? అందులో

ఏముంటాయి? ఏది స్త్రీల చరిత్ర? ఏది కాదు… అసలు స్త్రీల చరిత్ర తాలూకా చరిత్ర ఏమిటి? – ఇలా అన్ని విషయాలని వివరంగా చర్చిస్తూ సాగిన సైద్ధాంతిక మూలాలున్న వ్యాసం

ఒకటుంది. ఇందులోనే మళ్ళీ చివరికొచ్చేసరికి, ఈ పుస్తకం రాయడం ఎందుకు అవసరమో చెబుతారు. కొంచెం క్లిష్టంగా ఉన్నా, చాలా ఆసక్తికరమైన వ్యాసం ఇది. దీని తరువాత, వరుసగా,

ఉద్యమకారిణులు తమ కథలను చెప్పిన వ్యాసాలున్నాయి.

ఇందులో తమ కథలు చెప్పిన వారు:

    * చాకలి ఐలమ్మ
    * కమలమ్మ
    * అక్కిరాజుపల్లిలో – కొండమ్మ, వజ్రమ్మ, గజ్జెల బాలమ్మ, సైదమ్మ, గొల్ల మల్లమ్మ, గొల్ల బుచమ్మ
    * ప్రియంవద
    * సుగుణమ్మ
    * ప్రమీలా తాయి
    * కొండపల్లి కోటేశ్వరమ్మ
    * దూడల సాలమ్మ
    * మానికొండ సూర్యావతి
    * అచ్చమాంబ
    * జమాలున్నీసా బాజీ – రజియా బేగం
    * మోటూరి ఉదయం
    * బ్రిజ్ రాణీ
    * లలితమ్మ
    * పెసర సత్తెమ్మ
    * మల్లు స్వరాజ్యం

ఒక్కొక్కరి కథా ఒక్కోరకంగా కదిలించింది నన్ను. .......    ....
......    ....

పూర్తి  సమీక్షను పుస్తకం డాట్ నెట్ లో చదవండి.

http://pustakam.net/?p=14141

.

Monday, March 11, 2013

దళిత చరిత్రకు దర్పణం




దళిత చరిత్రకు దర్పణం
కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రే బొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకి వస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటి అంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారా రాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.

తారకంగారి తండ్రి బొజ్జా అప్పలస్వామిగారు మొదటితరం అంబేద్కరిస్టు. ఆయన జీవితం, పోరాటమే 'పంచతంత్రం' నవలకు నేపథ్యం. తారకంగారు కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. మూడు తరాల పోరాటాలకు ప్రతినిధి. 1947 తర్వాత ఎగసిన అంబేద్కర్ ఉద్యమాలతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1970లలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఆయనను రాటుదేలిన పోరాట యోధుణ్ణి చేశాయి. 1985లో జరిగిన కారంచేడు మారణకాండ ఆయన్ని పూర్తిస్థాయి దళిత నాయకుణ్ణి చేసింది. ఏడుపదుల వయస్సులో లక్ష్మింపేట ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఈ నేపథ్యం, రాజకీయ ప్రభావాలు, చారిత్రక ఘట్టాలన్నీ 'పంచతంత్రం' నవలను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.

తెలుగు దళిత సాహిత్యంలో 'పంచతంత్రం' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. తొలి దశ దళిత ఉద్యమ చరిత్ర కథాంశంగా నవలలు ఇంతవరకూ రాలేదు. గాంధేయవాదాన్ని వదిలించుకుంటూ వామపక్ష ఉద్యమాలకు వెలుపల స్వతంత్రంగా ఎదిగిన దళిత ఉద్యమాల చరిత్ర మీద రాసిన నవలలేమీ లేవు. చిలుకూరి దేవపుత్ర గారి 'పంచమం' నవల కారంచేడు తర్వాతి పోరాటాలను చర్చిస్తే, కల్యాణరావుగారి 'అంటరాని వసంతం' నవల దళితుల సాంస్కృతిక వారసత్వం, క్రైస్తవంలోకి మారడం, పీడనకు దోపిడీకి వ్యతిరేకంగా వారు చేసిన భూపోరాటాలు, చివరగా నక్సలైటు ఉద్యమంలో భాగం కావడాన్ని చిత్రీకరించింది. వేముల ఎల్లయ్య 'కక్క' నవల తెలంగాణ మాదిగ జీవితం, భాష, సంస్కృతిని వివరిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా 'పంచతంత్రం' ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రభావితమైన దళిత ఉద్యమ క్రమాన్ని చూపిస్తుంది.

మాలపల్లెకు, జమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథం, మాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్న, మిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకు, వివక్షకు గురవుతూ చివరికి తన కృషితో, చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు.

సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూ, సూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా, వెట్టిచాకిరీ చేసే కూలీలుగా, అంటరానివారిగా అవమానాలకు, అణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల, ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రం' తెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగా, నాయకులుగా రూపొందడం, జమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడం, జమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలి, కవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.
- కె. సత్యనారాయణ
(ఆదివారం ఆంద్ర జ్యోతి 10 మార్చ్ 2013 సౌజన్యం తో )


పంచతంత్రం ,
బొజ్జా తారకం
పేజీలు : 290,
వెల : రూ. 100
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

.

Sunday, March 10, 2013

ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!


ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!

మార్చి 2013

ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!
నా భాధతోనే కాదు – ఈ లోకంలోని భాధ అంతటితోనూ,
చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.
అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం
 -చలం
‘నిర్జన వారధి ‘ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.
తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె  జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.

.......

 కొండపల్లి కోటేశ్వరమ్మ '' నిర్జన వారధి '' పుస్తకం పై రమా సుందరి గారి సమీక్ష
"వాకిలి ఇ సాహిత్య మాసపత్రిక " లో చదవండి

http://vaakili.com/patrika/?p=1412


Monday, February 18, 2013

సారంలోనూ ప్రేమ్‌చందే! - వి. అరవింద్, ఆదివారం ఆంధ్ర జ్యోతి



సారంలోనూ ప్రేమ్‌చందే! -

"ఆ పిల్లవాడు తిరణాలకు వెళ్ళాడు. కంటిని ఆకర్షించే ఎన్నో ఆటవస్తువులు, బొమ్మలు అక్కడ ఉన్నాయి. నోరూరించే తినుబండారాల అంగళ్ళకు కొదవ లేదు. కానీ, వాటికన్నా రోజూ రొట్టెలు చేయడానికి తల్లి పడుతున్న అవస్థే ఆ పిల్లవాడి మనసులో ముద్రేసుకుంది. కాల్చిన రొట్టెను దించేందుకు పళ్ళకర్ర లేక చేతులు కాల్చుకుంటున్న తల్లే ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. దీంతో తన దగ్గరున్న డబ్బులతో ఒక పళ్ళకర్ర కొని ఇంటికి తీసుకెళతాడు.'' ప్రచురణ సంస్థ గానీ ఫలానా రచనని గానీ అంతగా గుర్తులేని ప్రేమ్‌చంద్ కథ ఇది.

ఈ కథలో పిల్లాడిలాగే, జీవితమంతా చాలా బాధ్యతగా, ఇతరుల అవసరాలు తీర్చడంలోనే తన సంతృప్తిని వెతుక్కున్నాడు ప్రేమ్‌చంద్. ఆయన సహచరి శివరాణీదేవి రాసిన 'ఇంట్లో ప్రేమ్‌చంద్' (అనువాదం : ఆర్. శాంతసుందరి) చదివితే ఈ విషయం తెలుస్తుంది. ప్రముఖుల ప్రైవేట్ జీవితాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని తీర్చడమే కాదు, వారి కళా, రాజకీయ వ్యక్తిత్వాలు వికసించే చారిత్రక, సామాజిక ఉద్యమ సందర్భాన్ని కూడా ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ముఖ్యంగా, తల్లి ప్రేమకు ముఖం వాచిపోయిన ప్రేమ్‌చంద్... ప్రతి స్త్రీ నుంచి ఆ లోటు తీర్చుకునేందుకు ఆరాటపడ్డాడు.

భార్యాభర్తల మధ్య గాఢంగా అల్లుకోవాల్సిన ప్రజాస్వామిక సంబంధాలను ఈ క్రమంలోనే ఆయన గుర్తించి గౌరవించాడనేందుకు శివరాణీదేవి-ప్రేమ్‌చంద్‌ల సంభాషణలే రుజువు. ఈ సంభాషణ తరచూ పాత వాసనలు వేయడం, సంప్రదాయ, దైవిక శక్తుల ప్రస్తావనతోనే ప్రేమ్‌చంద్ సైతం తన వాదనను నెగ్గించుకోవడం చూస్తాం. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న రైతాంగంతో ఉండి రచనలు చేసినవాడు కాబట్టి, చివరి వరకు ప్రేమ్‌చంద్‌లో సంప్రదాయ భావనలు నిలిచే ఉన్నాయి. దీన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముఖ్యమైన పరిశీలన... జాతీయోద్యమం, సోవియట్ విజయాలతో రెక్కవిప్పిన అభ్యుదయ ఉద్యమం సైతం అప్పటికి పూర్తిగా కుబుసం విడవలేదనేది. ఈ అభ్యుదయ ఉద్యమానికి కళా, సాహిత్య రంగాల్లో సారథ్యం వహించినవాడు ప్రేమ్‌చంద్ అనేది ఇక్కడ గమనార్హం. ప్రేమ్‌చంద్ స్మరణకే పూర్తిగా ఈ పుస్తకం అంకితం కాకపోవడం మరో విశేషం.

జాతీయోద్యమంతో మమేకమైన బలమైన రాజకీయ వ్యక్తిత్వం గల ఆధునిక యువతిని శివరాణీదేవిలో మనం చూస్తాం. ఇండియన్ గోర్కీగా పిలవబడే ప్రేమ్‌చంద్ చివరి రచన, చివరి స్మారక ఉపన్యాసం (1936) కూడా గోర్కీపైనే కావడం, మాగ్జిమ్ గోర్కీ మరణించిన రెండు నెలల్లోపే ఆయనా మరణించడం గుర్తుండిపోయే విషయాలు. అయితే ప్రేమ్‌చంద్ జీవన, రచనా సారాన్ని పట్టుకోలేకపోవడం, ఆయన ఉర్దూలో మానేసి హిందీ భాషలో రచనలు చేయడమనే ఒక గుణాత్మక పరిణామానికి ప్రేరణగా నిలిచినదేమిటనేది తెలియజెప్పకపోవడం ఈ పుస్తకం పరిమితే.

- వి. అరవింద్
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 17 -2 -2013)

ఇంట్లో ప్రేమ్‌చంద్ - శివరాణీదేవి
అనువాదం : ఆర్. శాంతసుందరి
పేజీలు : 274, వెల : రూ. 120
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌