Showing posts with label డాక్టర్ కేశవరెడ్డి నవలలు. Show all posts
Showing posts with label డాక్టర్ కేశవరెడ్డి నవలలు. Show all posts

Saturday, October 1, 2011

స్మశానం దున్నేరు - డా. కేశవరెడ్డి నవల ...



కొన్ని మంచి నవలలు - తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి.
మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు 'షాక్ట్రీట్మెంట్‌' యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి.
''స్మశానం దున్నేరు'' సరిగ్గా యిటువంటి నవలే!

...మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా?
చట్టాలు ఏం చేస్తున్నాయి?
ప్రభుత్వాధికారులు దుర్మార్గులను అణగ ద్రొక్కి సన్మార్గులకు న్యాయం కలిగిస్తున్నారా?
ప్రభుత్వాలు వున్నది ఎందుకు?
ప్రజలను రక్షించడానికా? భక్షించడానికా?


... ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు - నవల చదివిన తర్వాత మనల్ని కలచివేస్తాయి.

...దోపిడీ వర్గం అభివృద్ధికి కొమ్ముకాసే వెంకటాద్రి వంటి మధ్యతరగతి వ్యక్తులు యెలాంటి పరిణామాన్ని యెదుర్కోవలసి వస్తుందో, తమకు జరిగిన ఘోరాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు సంఘటిత శ్రామిక శక్తి ఏవిధంగా విజృంభిస్తుందో అద్భుతంగా చిత్రీకరించిన నవల యిది. శ్రమజీవులకు వాళ్ల హక్కులు, బాధ్యతలు గురించి 'ఎడ్యుకేట్‌' చేస్తూ, వారిని క్రమశిక్షణాయుతమైన విప్లవపథంవైపు నడిపించే - 'రాజకీయ నాయకత్వం' లేనప్పుడు - ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయో పరోక్షంగా నిరూపిస్తున్నది నవల. (ఆంధ్రజ్యోతి మాసపత్రిక, ఏప్రిల్‌1980 సమీక్ష నుంచి).

(విశాలాంధ్ర పత్రిక నిర్వహించిన పోటీలో (1980) ద్వితీయ బహుమతి పొందిన నవల ఇది)

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10 పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండచ్చేరిలో ఎంబిబిఎస్చేశాక నిజామాబాద్జిల్లా డిచ్పల్లి విక్టోరియా మెమోరియల్ఆసుపత్రిలో స్కిన్స్పెషలిస్ట్గా కుష్ఠురోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్లో వుంటూ ఆర్మూర్లూ వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్ఠువ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ మెడికల్జర్నల్స్లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యల పట్ల సానుతాపంతో రాయలసీప గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. బానిసలు, భగవానువాచ, అతడు అడవిని జయించాడు, రాముడుండాడు రాజ్జిముండాది, మూగవాని పిల్లలన గ్రోవి, చివరి గుడిసె, సిటీ బ్యూటిఫుల్‌, ఇన్క్రెడిబుల్గాడెస్‌, మునెమ్మ వీరి ఇతర రచనలు. అతడు అడవిని జయించాడు నవలను నేషనల్బుక్ట్రస్ట్వారు 14 నారతీయ భాషల్లోకి అనువదించారు. ఇన్క్రెడిబుల్గాడెస్నవల మరాఠీలోకి అనువాదమైంది.

తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచడం, అనివార్యమైన జీవిత పోరాటానకి ఉపక్రమించపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ , కూతురూ సంతానం.


...

స్మశానం దున్నేరు
రచన : డా. కేశవరెడ్డి

ముఖచిత్రం: కాళ్ల
160 పేజీలు, వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇమెయిల్‌:hyderabadbooktrust@gmail.com

Friday, May 20, 2011

సిటీ బ్యూటిఫుల్‌ - డా.కేశవరెడ్డి ...


కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను.
అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి.
కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు.
ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బా, నువు నాణెం రెండు వైపులా చూసినోడివి. సిటీలైఫ్‌ గురించి నువ్వు రాయాల'' అన్నారు. (ఇంతకీ నేను నాణెం రెండువైపులా చూసినోడినేనా?)

నాకు బాగా తెలిసన నగరం పాండిచ్చేరి నగరమే. ఆ నగరంలో ఎవర్ని గురించి రాయాలి? బాగా పరిచయమున్న విషయం గురించి మాత్రమే రాయాలన్న చాదస్తప్రాయమైన నియమం కలవాడిని. కనుక ఒక మెడికో అనుభవాలను ఆధారంగా చేసుకుని రాయాలనుకున్నాను. నా ఇతర నవలలలాగే సంఘటనలన్నీ స్వల్ప వ్యవధిలో - మూడు, నాలుగురోజులలో - జరిగిపోయేలా ప్లాటు వేసుకుని ఈ నవల రాశాను.
ఈ సమాజంలో ఏర్పరచుకున్న బూటకపు విలువలను, బోడి సంప్రదాయాలను ఆమోదించలేని ఒక ఉలిపికట్టె కథే ఇది.
- డా.కేశవరెడ్డి
(ముందుమాట 'లెస్‌ ఎలోన్‌ వెన్‌ ఎలోన్‌ లేక ఇక్కడా మనుషులేనా?' నుంచి)

......................................................................................

మన సమూహాల్లో ఒంటరితనాన్ని గుర్తు చేసే నవల యిది. ఈ సొసైటీలో మన 'బిలాంగింగ్‌నెస్‌' ని మనమే 'డిస్‌ఓన్‌' చేసుకునే ఓ ఆత్మిక సందర్భం ఈ 'సిటీ బ్యూటిఫుల్‌' అనే మంచి నవల.
ఓ గొప్ప రచయిత చేసిన అతి సాధారణ రచన అసాధారణంగా పాపులర్‌ అయిపోవచ్చు.
అదే రచయిత చేసిన ఓ అసాధారణ రచన, సామాజిక స్పృహ, నీతి సూత్రాలూ, సంఘ ప్రయోజనాల్లాంటి చాలా, చాలా 'గొప్ప' సాహితీ సూత్రాల వల్ల అతి మామూలు నవలగా, రచనగా మిగిలిపోవచ్చు. అదుగో అ లా మిగిలిపోయిన రచనే ఈ నవల అని నా ఉద్దేశం.

నిజానికి డా. కేశవరెడ్డి గారు తనమీద పడ్డ ఓ రకపు ముద్రకు తనే తనపైన అంగీకారాన్ని తెలియబరుస్తూ ఓ ఫ్రేమ్‌వర్క్‌లో రచన చేస్తూ వున్నారు...నిన్నటి ''మునెమ్మ'' దాకా.
ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్కడా ఇమడని నవల ''సిటీ బ్యూటిఫుల్‌''. డాక్టర్‌గారి అసలు సిసలు రచనా బలాన్ని... ఆయన చదువరితనాన్ని, ఆయనలోని నిర్భీతినీ 'ట్రాన్స్‌పరెన్సీ' చూపే రచన సిటీ బ్యూటిఫుల్‌.
ఇందులో కథలేదు. (కథ లేకుండా నవలేమిటన్న సామాన్య అమాయక ప్రశ్నవేసే వాళ్లకది అసలు నవల కాదు).
ఇందులో అద్భుత కథనం వుంది.
దేవీదాస్‌ అనబడే ఓ యువ మెడికో అంతస్సంఘర్షణను అక్షరబద్ధం చేయడం చూస్తామిందులో. ప్రాంతాల వారీగా ... మతాల వారీగా ... కులా వారీగా ... జెండర్‌ వారీగా సాహిత్యాన్ని చింపి చూసే, చూపే సాహితీ 'దొడ్డు' వారికి డా.కేశవరెడ్డి ఓ ప్రాంతానికి చెందిన రచయిత.

కేశవరెడ్డి గారి రచనల్లో స్థలాలూ, భాషా నేపథ్యం ఓ ప్రాంతానికి చెందినవైనా ... ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన డా.కేశవరెడ్డి గారి ప్రాత్రల మూలాలు మాత్రం విశ్వమానవీయతలో వుంటాయి.
...
జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా నిజ జీవితాన్ని సాగిస్తూన్న డా.కేశవరెడ్డిగార్ని ఓ చట్రంలో బిగించేసి చూస్తున్నవారికి, సాధారణ పాఠకులక్కూడా ఓ విభిన్నమైన నవల ఈ ''సిటీ బ్యూటిఫుల్‌''.
నా వరకూ నాకు ఇది ఆయన నంబర్‌ వన్‌.

- కాశీభట్ల వేణుగోపాల్‌
(పరిచయం 'మంత్ర నగరి' నుంచి)

..........................................

సిటీ బ్యూటిఫుల్‌
రచన: డా.కేశవరెడ్డి

122 పేజీలు
వెల: రూ.80/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067

ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Thursday, May 19, 2011

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ (క్షుద్ర దేవత) - డా. కేశవరెడ్డి ...


ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ అన్నదే ఈ నవల పేరు!
ఈ ఇంగ్లీషు పేరుకు ఒక తెలుగు అర్థం ... క్షుద్రదేవత.


కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్‌ రూమ్‌' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్‌ పర్పస'్‌ కోసం నమోదు చేయాలి.
అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను.
అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు.
''అది సరే నీ కుల వృత్తి ఏమిటి?'' అనడిగాను.
అతడు, ''అడుక్కు తింటాం'' అన్నాడు.
''చూడు బాబూ. నేను రాసుకోవాలి. నీ కులవృత్తి ఏమిటో చెప్పు'' అన్నాను.
అతడు ''మా కులపోళ్లంతా చేసేది అదే. అందరం అడుక్కుతింటాం'' అన్నాడు.
తర్వాత తెలిసిందేమిటంటే అడుక్క తినడమే కులవృత్తిగా గల కులాలు ఈ దేశంలో డజనుకుపైగా వున్నాయట.

ఈ దేశంలో వ్యవస్థీకృతమై వున్న ఈ భ్రష్టకారి కుల వ్యవస్థ మీద పోరాటం దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి సాగుతున్నది.
ఇన్ని వేల యేండ్లుగా ఏ కులమైతే తనను అవమానాలకు, అమానవీయతకు, హైన్యతకు గురిచేస్తూ వచ్చిందో ఆ కులనామాన్ని తన పేరు చివరన నేడు దళితుడు రాసుకుంటున్నాడు.
అ లా రాసుకోవడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని, తద్వారా తన సాంఘిక సమానత్వాన్ని నిర్ద్వంద్వంగా, బాహాటంగా ప్రకటించుకున్నాడు.
ఈ శతాబ్దంలో సగర్వంగా చెప్పుకోదగిన సాంఘిక చైతన్యంగా దీనిని భావించడానికి ఏమాత్రం తటపటాయించనవసరంలేదు.

ఐతే ఈ సాంఘిక చైతన్యం బాహ్యశక్తులతో పోరాడి సంపాదించింది కాదు.
వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న 'సాంఘిక' సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ''సున్న'' అని చెప్పాల్సి వుంటుంది.
కానీ 'సున్న' కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు 'అంకె' చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి
('దళితుడి పయనం' ముందుమాట నుంచి)
....................................................


మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవరెడ్డి తన చుట్టూరా వున్న సమాజంలోని నిమ్నోన్నతాల్ని, హింసా సన్నివేశాల్ని, అంతులేని యాతనతో నిండిని దీనజనుల దుఃఖ జీవితాల్నీ బాగా కళ్లు తెరచుకుని చూచిన మానవుడు.
చిన్న వయసులోనే ఒక పెద్ద ఆశయం కోసం కలం పట్టిన రచయిత.
ఏరు దాటి తెప్ప తగలేసేవాడు కాడు.
తిరుపతిలో వున్నా, పాండిచ్చేరిలో వున్నా, నిజామాబాదులో వున్నా తమ పల్లెను గురించి, అక్కడి బక్క రైతుల  యొక్క బీద కూలీల స్థితిగతులను గురించి ఆలోచించే నిజాయితీపరుడు.

ఈ నవలలో రచయిత దాపరికం లేకుండా, మొగమాటానికి పోకుండా హరిజనుల జీవన సమస్యకంతా కీలకప్రాయమైన, మూలకారణమైన లోపం ఎక్కడుందో చెప్పేశాడు.
మనిషికి యితరులవల్ల జరిగే అపకారం కన్నా, తనవల్ల తనకే జరిగే అపకారం ఆత్మహత్యా సదృశమైనదని నిరూపించాడు.
గుండెల్ని పిండిచేసే సానుభూతిలో నుంచీ వెలువడిన ఒక కరుణామయమైన ఆక్రందన యీ నవల.
- మధురాంతకం రాజారాం
(పరిచయం నుంచి)
................................

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ (క్షుద్రదేవత)
రచన: డా.కేశవరెడ్డి

155 పేజీలు
వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Saturday, February 5, 2011

రాముడుండాడు రాజ్జిముండాది -డా.కేశవరెడ్డి నవల


రాముడుండాడు
రాజ్జిముండాది

-డా.కేశవరెడ్డి నవల
...
కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనెక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు, మనో ప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ''రాముడుండాడు రాజ్జిముండాది'' అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు.

''రాముడుండాడు రాజ్జిముండాది'' అని వలసల విషయంలో ప్రజలకేర్పడిన భరోసాతోనే ఈ పరిణామంలోని రహస్యం ఇమిడివున్నది. దేశం గొడ్డుబోయిందా, ఇంత సువిశాల దేశం ఇది - బతకకపోతామా అని బయల్దేరలేదు వాళ్లు.  బ్రిటీష్‌వాళ్లు వచ్చి యంత్రాలు, మార్కెట్‌ వచ్చాక రాజ్యం (ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి పర్యాయపదం) జీవనోపాధి కలిగిస్తుందనే ఒక ఎండమావి ఏర్పడింది. పుట్టిచ్చిన వాడు రాతి కింది కప్పకు కూడ బతుకు దెరువు చూపకపోడనే విశ్వాసం మత శాస్త్రాలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పోసినదే. కనుక రాముడూ రాజ్జివూ కలిసిపోయాయి. బ్రహ్మణీయ హిందూ మత విశ్వాసం కలిగించిన మాయకు మార్కెట్‌ మాయ తోడైంది.

ప్రజలకు, కష్టజీవులకు రాముడు చేయగల సాయమేమిటో రచయితే స్వయంగా గుట్టు విప్పి చెప్పారు. హరిశ్చంద్రుని అప్పుల బాధలు మొదలు తానీషా అప్పుల బాధల వరకు తీర్చిన దేవుడు ఈ దేశంలో రైతుల అప్పుల బాధలు తీర్చే దగ్గరికి వచ్చే వరకు రాతి దేవుడైపోయాడు. కలరా, ప్లేగు వంటి రోగాలు 'స్వామి' వల్లనే మాయమయ్యాయని నమ్మారు గానీ ఆకలి రోగం అరికడతానని ఆయన భరోసా ఇవ్వలేదు. ఈ రోగం ఎందుకు వచ్చిందని వాళ్లు స్వామిని ప్రశ్నలడగడంలేదు.
...
కేశవరెడ్డి గారిలో అద్భుతమైన సౌందర్య దృష్టి వున్నది. అయితే ఆయన సౌందర్యాన్ని ప్రకృతిలో, జీవితంలో, శ్రమైక జీవనంలో చూస్తారు. అది ఒక తాత్విక స్థాయినుంచి, హృదయపు లోయల్లోంచి వచ్చింది గనుక అది భాషలోనూ, వర్ణనలోనూ, పాత్ర చిత్రణలోనూ - అంతటా వెలుగువలె, వెన్నెలవలె, సూర్య కిరణాలవలె, నక్షత్రాలవలె పరచుకొని వుంటుంది. ఇంక భాషా సౌందర్యం గురించి అయితే - చిత్తూరు మాండలికంలోని ఆయన నవలలు చదివితే కానీ శ్రమ నుంచి సమస్త సంపదలవలెనే సంపద్వంతమైన భాష పుడుతుందనే విషయాన్ని అనుభూతిచెందలేం. చిత్తూరు అడవుల్లో, పల్లెల్లో, అక్కడ చెట్లమధ్య, పక్షుల మధ్య ఈ అన్ని సమూహాల భాషనూ ఆస్వాదిస్తూ అక్కడ సంచరిస్తున్నట్లు వుంటుంది ఆయన నవలలు చదువుతుంటే.
...
(రాముడుండాడు రాజ్జిముండాది నవలకు వరవరరావు రాసిన 'ఒయాసిసుల కోసం' ముందుమాట నుంచి)

పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రల
నా తల్లి బందీయై పోయిందో
కనిపించని కుట్రల ... పల్లె ...

కుమ్మరి వాముల తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిల దుమ్ము పేరెను
పెద్ద బారిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగు లిరిగినవి
చేతి వృత్తుల చేతులరిగిపోయె నా పల్లెల్లోన
గ్రామ స్వరాజ్యం
గంగలోన పాయె నా పల్లెల్లోన ... పల్లె ...

( గోరటి వెంకన్న పాట 'పల్లె కన్నీరు పెడుతుందో' నుండి)



రాముడుండాడు
రాజ్జిముండాది
-డా.కేశవరెడ్డి 

 డా.కేశవరెడ్డి

ముఖచిత్రం : కాళ్ల
122 పేజీలు, వెల : రూ.80/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067

ఫోన్‌ నెం. 040-2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com



Friday, March 20, 2009

అతడు అడవిని జయించాడు ..... డాక్టర్‌ కేశవరెడ్డి


1984లో ప్రచురితమై పాతికేళ్లపాటు తన అస్తిత్వవాద నిసర్గ సౌందర్యంతో పాఠకులను అ లరించిన కేశవరెడ్డి ''అతడు అడవిని జయించాడు'' నవలిక నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో విశిష్ట రచన.

లేశమాత్రమైన కథాంశంతో,
అనామకుడూ అపరిచితుడూ అయిన నాయకుడితో,
అద్భుతమూ అపూర్వమూ అయిన అరణ్య నేపథ్యంతో
తన రచనను ఒక పురాణగాథ స్థాయికి తీసుకెళ్లారు కేశవరెడ్డి.

కేశవరెడ్డి రచనల్లో సైతం యిది ఒక ప్రత్యేక విశిష్ట రచన.
తెలుగు నవలల్లో అపూర్వం, అనితర సాధ్యం.

కనీసం ఇంకో పాతిక సంవత్సరాలు ఈ నవల తెలుగు సాహిత్యంలో దీపస్తంభంలా నిలబడి దిక్దర్శనం చేయించడంతో పాటు శిష్ట నాగరిక సమాజపు కళ్లు మిరుమిట్లు గొలపుతుందని నిస్సంకోచంగా నమ్మవచ్చు.

'అతడు అడవిని జయించాడు'లో కథా సమయాన్ని రచయిత ఒకానొక సూర్యాస్తమయాన మొదలెట్టి సూర్యోదయానికల్లా ముగిస్తాడు.
ఈ అస్తమయ ఉదయాల మధ్య
పందుల్ని సాకే ఓ అనామక ముసలివాడి బహిరంతర అన్వేషణ,
అడవిలో చిక్కులు చిక్కులుగా ముళ్లుపడి,
మానవ జీవితంలోని అస్తిత్వ సంఘర్షణగా సామాన్యీకరించబడి,
తీగలు తీగలై నిర్నిరోధంగా సాగుతుంది.

గుప్పెడు గంటల వ్యవధిలోనే కొన్ని కఠోర మరణాలు,
యింకొన్ని అదివాస్తవిక జననాలు,
సంక్లిష్ట సందేహాలు,
గుబులు గొల్పే సందిగ్ధాలు,
వెయ్యివెయ్యిగా తలలెత్తే ప్రశ్నలు,
భీతి కలిగించే హింస,
విశ్వం మొత్తాన్ని గుండెల్లో పొదువుకునే అవ్యాజ ప్రేమభావం,
అమాయక వాత్సల్యాలు, విశృంఖలత్వం, విహ్వలత్వం, వైవిధ్యం, మోహం,
గూఢత్వం, మార్మికత్వం, నిష్ఫలత్వం, నిరర్థకత, పాశవికత, నిస్పృహ, నిరీహ -
ముసలివాడి అనుభవంలోకి నిరంతర ప్రవాహంగా ముప్పిరిగొని, అతణ్ణి నివ్వెర పరుస్తాయి.
అతని అంతరంగం ఎక్కడో మొదలయ్యి ఎక్కడో అంతమయ్యే అరణ్యంగా, సిద్ధపరచిన యుద్ధ రంగంగా సాక్షాత్కరిస్తుంది.

..... (-శ్రీనివాస ప్రసాద్‌ రాసిన ముందుమాట 'అధోమానవుడు అధిమానవుడైన వేళ' నుంచి)

..............

ఈ రచయితలోని రసదృష్టి ఎంత పదునైనదో!
పందిలో నందిని సందర్శించ గలిగేడు.
నైచ్యం అనబడే దానిలో ఔన్నత్యం చూడకలిగేడు.
సేయంలో ప్రేయం అనుభూతించాడు.
దీన్నే కురూపపు సురూపం (ది బ్యూటీ ఆఫ్‌ అగ్లీనెస్‌) అంటారు.
రసద్రష్టకు లోకంలో ఏదీ కురూపం కాదు, అంతా సురూపమే.
ఏదీ కునాదం కాదు, అంతా సునాదమే.

( .......... డాక్టర్‌ సంజీవదేవ్‌ రాసిన చివరిమాట 'సింహావలోకనం ' నుంచి)

...........

డాక్టర్‌ కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు.
తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్‌. చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్ట్‌గా కుష్టురోగులకు సేవలందించారు.

ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు.
కుష్టు వ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసిగిస్తున్నారు.

బానిసలు,
భగవానువాచ,
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌,
స్మశానం దున్నేరు,
అతడు అడవిని జయించాడు,
రాముడుండాడు రాజ్జిముండాది,
మునెమ్మ,
మూగవాని పిల్లన గ్రోవి,
చివరి గుడిసె,
సిటీ బ్యూటిఫుల్‌
వీరి రచనలు.

అతడు అడవిని జయించాడు నవలను నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ నవల మరాఠీలోకి అనువాదమైంది.

తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి,
హృదయాలను తేలకి పరచటం,
అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమించపజేయటమే
తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం.
కొడుకూ, కూతురూ సంతానం.
..............

అతడు అడవిని జయించాడు
- డాక్టర్‌ కేశవరెడ్డి


(ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో 1984లో ధారవాహికగా వెలువడింది).
ప్రథమ ముద్రణ: నవోదయ పబ్లిషర్స్‌, విజయవాడ, 1985

హెచ్‌.బి.టి. ముద్రణ: ఫిబ్రవరి, 2009
ముఖచిత్రం : కాళ్ల

98 పేజీలు, వెల: రూ.40


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849
.........
ఇ మెయిల్‌:
http://hyderabadbooktrust.blogspot.com

.....................................

Monday, December 29, 2008

చివరి గుడిసె ... డా.కేశవరెడ్డి






కేశవరెడ్డికి శ్రోతగా ...

'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ.

నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమైన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి.

శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటి రాగల రచనలు.

అయితే గురజాడ, ఉన్నవ, కాళీపట్నం వంటి మహా రచయితలు ఒకే కాలానికీ, ఒకే వ్యవస్థకూ చెందిన వైరుధ్యాల్ని చిత్రించగా డా.కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుధ్యాల్నీ, భూమిపైనా, పాతాళంలోనూ కూడా జరిగే పోరాటాన్నీ అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించారు ఈ నవలలో.
... ...
ఒక జాతిని తల్లి కడుపులోనించే నేరస్థులుగా నిర్ణయించిన ప్రభుత్వం గురించి ఏ యానాదికయినా స్పష్టంగా తెలుసు.

''గవుర్మెంటోళ్లంటే ఎవరు సావి? తాసిల్దారు, రివినిస్పెట్రూ, మనేగాడూ ఈళ్లేగదా గవుర్మెంటు'' అటువంటి ప్రభుత్వానికంతటికీ ఆధార స్తంభమయిన గ్రామ మణియాన్నే నిజమైన క్రిమినల్‌గా చూపించడమే ఈ కథా ప్రజ్ఞ.
....
డా.కేశవరెడ్డి భూస్వామ్య సమాజంలోని మానవత్వం బయటకి ప్రకటితం కావడానికి బైరాగినీ, భూస్వామ్య అమానుషత్వమంతటికీ మణియాన్నీ ప్రతినిధులుగా తీసుకున్నాడు. ఇద్దరిదీ 'చేను' గురించిన తాపత్రయమే.
... ...
ఒట్టి యానాదుల జీవితం గురించి, పీడన గురించి రాయడానికి మాత్రమే రచయిత ఈ కథని రాసాడనుకోను. తాను తొలినుంచీ ప్రయత్నిస్తున్న స్థూల, సూక్ష్మ పోరాటాల అత్యంత సునిశితమయిన చిత్రణకి ప్రయత్నించడమే ఈ ఇతివృత్తంలోని బలం.
... ...
( - వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట లోంచి)
.............................................................

ఒంటిల్లు అను స్తావర జంగమాత్మక ప్రపంచం


డాక్టర్‌ కేశవరెడ్డి నవలా ప్రపంచం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు దుస్సాహసం కొద్దీ చెప్పబోయే ముందు ''మూగవాని పిల్లనగ్రోవి'' నవల చివరి వాక్యం ఇక్కడ ప్రస్తుతిస్తాను.

''పడమటి వైపు నుండి గ్రామంలోకి ప్రవేశించే వాళ్లు (బక్కిరెడ్డి) కానను సమీపించగానే తమకు తెలియకుండానే తమ నెత్తుల మీది తలపాగాలను తీసివేస్తారు. తమకు తెలియకుండానే వాళ్ల శిరస్సులు అవనతాలవుతాయి''.

కేశవరెడ్డి నవలలు చదివిన పాఠక ఆగంతకులకు కూడా ఆ బాటసారులకు కలిగిన అనుభవమే కలుగుతుంది. తమకు తెలియకుండానే వాళ్ల శిరస్సులు అవనతాలవుతాయి.

తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో పుట్టి, తెలుగుభాష చదవడం వచ్చి, ఆ భాషలో నవలలు చదివిన వాడికి మున్నెన్నడూ కలగని అనుభవం కేశవరెడ్డి నవలలు చదివితే కలుగుతుంది.

గొప్ప భావావేశం వారిని ముప్పిరిగొంటుంది.
గాఢానుభూతుల ప్రకంపనలు వారిని వివశులను చేస్తాయి.
వ్యాకులచిత్తులను చేయగల మహా సౌందర్యమేదో వారికక్కడ లభిస్తుంది.
స్పర్శేంద్రియాలకు లోబడని ఆథోలోకాన్ని వారు అక్కడ మొట్టమొదటిసారి స్పృశిస్తారు.

''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' భగవంతునిలా నిర్దయగా క్రూరంగా విపులీకరించే నిర్వికారుడైన రచయితను మీరక్కడ దర్శిస్తారు.

రచయిత ముందు తమ కృతజ్ఞత వ్యక్తం చేసేందుకు మాటలు రాక, వచ్చిన మాటలు చాలక మరో మార్గం లేక వాళ్ల శిరస్సులు అవనతమవుతాయి.
... ... ...
(- అంబటి సురేంద్రరాజు రాసిన చివరిమాట నుంచి)

చివరి గుడిసె
డా.కేశవరెడ్డి

మొదటి ముద్రణ: ఆహ్వానం మాసపత్రిక, 1993, రీతిక పబ్లికేషన్స్‌ 1996
ముఖ చిత్రం: కాళ్ల

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


158 పేజీలు, వెల: రూ.80

.............................

Sunday, December 28, 2008

మూగవాని పిల్లనగ్రోవి ... డా.కేశవరెడ్డి




....
'మూగవాని పిల్లనగ్రోవి' ఒక రైతు మరణ, పునరుత్థానాల గాథ. ఆ రైతు - ప్రయత్నం నుంచి వైఫల్యానికీ, వైఫల్యం నుంచి అభద్రతా భావానికీ, అభద్రత నుండి ఉన్మాదానికీ, ఉన్మాదం నుండి మరణానికీ నడిచిన కథ. తన మరణంలో ప్రాణత్యాగం చేసిన తీరువల్ల కర్మవీరుడై, అమరుడై, పురాణ పురుషుడైన కథ.

డా.కేశవరెడ్డి ఈ కథ ఇతివృత్తం ఎంచుకోవడంలో, కథని చెప్పిన తీరులో అసమాన కౌశలాన్ని ప్రదర్శించారు. ఈ కథలో కూడా పురాతన ఆసియా కథన సంప్రదాయాన్ని, ఆదిమ జాతుల విశ్వాస ధోరణిలో చెప్పే నేర్పు వల్ల ఇంతదాకా తెలుగు సాహిత్యంలో మనం వినివుండని అపూర్వ కథనాన్ని ప్రదర్శించారు.

మూగవాని పిల్లనగ్రోవి 'అతడు అడవిని జయించాడు' లాగానే ఒక వీరగాథ.

అయితే ఇది ఒట్టి వీరగాథగా ఆగిపోలేదు. ఆ వీర గాథ (legend) ఒక పురాణ ప్రతీక (myth) గా కూడా రూపొందింది ఇక్కడ.

ఇక్కడ రచయిత పురాణ ప్రతీకని ఇవ్వడంతో తన పని ముగించినట్టు కనబడినా అది నిజం కాదు. అటువంటి పౌరాణిక ముగింపు (mythological summation) ఇవ్వడంతోనే అతను మనల్ని వేధించడం మొదలు పెడుతున్నాడు.

ఎందుకు ఈ కథ ఇలా ముగిసింది?
ఈ కథకు యథార్థమయిన ముగింపు ఇదేనా??
ఇటువంటి పర్యవసానానికి కారణాలు ఎటువంటివి???

ఇటువంటి ప్రశ్నల పరంపరతో మనం ఆలోచనాపరులంకావడంలోనే రచయిత నిజమయిన విజయం వుంది.
బీదవాళ్లు భూస్వాములపై తిరగబడ్డారని ఎవరయినా రచయిత ఒక నవలని ముగిస్తే, ఆ ముగింపు మనని ఊరడిస్తుంది, మత గురువుల పరలోకం గురించిన ప్రభోధాలవలె.

ఆ ముగింపు మనకు ఇచ్చేది జాగృతి కాదు.
విశ్రాంతి!
అటువంటి రచన చదివిన తర్వాత మనకెటువంటి అ లజడీ కలగదు.
ఏప్రశ్నలూ రేకెత్తవు.

కానీ ఎంతో ప్రశాంతంగా, దివ్యంగా కనిపించే ఈ రచనలోని ముగింపు మనని ఎంతో ఆశాంత పరుస్తుంది. కథలో మణియం వలె మనం కూడా కారణాల అన్వేషణ మొదలుపెడతాం. ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెప్పడంతో చర్చ మొదలవుతుంది.

ఇటువంటి చర్చ నుండి ఒక సామాజిక జాగృతి పొటమరిస్తుంది.
....

(వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట లోంచి)

''మూగవాని పిల్లనగ్రోవి నవలలోనే కాదు, మిగిలిన నవలల్లో కూడా రచయిత ప్రతి సన్నివేశాన్నీ దృశ్యమానం చేస్తారు. “Writing as showing” కి కేశవరెడ్డి నవలలను మించిన దృష్టాంతం తెలుగులో మరొకటి లేదు.

అన్నీ పాఠకుల కళ్లముందే జరుగుతాయి.
పాఠకుడు ప్రతి కథనానికి ప్రత్యక్ష సాక్షి అవుతాడు. ప్రేక్షక పాత్రను దాటి దృశ్యంలో పాత్రగా, కథలో భాగస్వామిగా లీనమైపోయే పరిస్థితిని రచయిత కల్పిస్తాడు.

ఈ విధంగా ఆయన ప్రతి నవల ఒక దృశ్యకావ్యంగా, స్క్రీన్‌ప్లే గా రూపుదిద్దుకుంటుంది.

కేశవరెడ్డి నవలలతో విషయపరంగానే కాక రూపపరంగా కూడా గొప్ప సినిమాలు తీయవచ్చు.
స్క్రీన్‌ప్లే మళ్లీ రాసుకోనవసరం లేనంత గొప్పగా వుంటాయి ఆయన నవలలు.

భావాలతో పోలిస్తే మనుషుల పేర్లు, ఊర్ల పేర్లు, రంగులు, వర్ణనలే కాదు చివరికి అంకెలు కూడా గొప్పవన్న హెమింగ్వే అభిప్రాయంతో ఏకీభావం వున్నందునే ఆయన ఇంత గొప్ప నవలలు రాయగలిగారా?

హెర్మన్‌ మెల్విల్‌, జాక్‌ లండన్‌, గోర్కీ (కథకుడు), నికోస్‌ కజాంట్జకిస్‌ (జోర్బాది గ్రీక్‌ నవల), హెమింగ్వే వంటి రచయితలతో పోల్చదగిన నవలా రచయిత కేశవరెడ్డి.

ఆంద్రీ తార్కొవిస్కీ 'శాక్రిఫైజ్‌' సినిమా చూసినప్పుడు కలిగిన భీతావహమే ''మూగవాని పిల్లనగ్రోవి'', ''చివరి గుడిసె'' నవలలు చదివినప్పుడు కలిగింది.

బి.వి.కారంత్‌ ''చొమనదుడి'' చూసినప్పుడు ...
దాగర్‌ బ్రదర్స్‌ 'రుద్రవీణ' విన్నప్పుడు ...
కుమార్‌ సహానీ 'ఖయాల్‌ గాథా' చూసినప్పుడు ...
కలిగే వివశత్వం కేశవరెడ్డిని చదివినప్పుడూ కలుగుతుంది.

హబీబ్‌ తన్వీర్‌ నాటకం,
రిత్విక్‌ ఘటక్‌ సినిమా ఆయన నవలలకు దగ్గరగా వుంటాయి.

“Man ought not to know more of a thing than he can creatively live upto” అని నీషే ఏనాడో చెప్పిన గొప్ప సత్యాన్ని అప్రయత్నంగా ఆచరిస్తున్నందువల్లే కేశవరెడ్డి నవలా వ్యాసంగాన్ని తపస్సులా దీక్షగా నిర్వర్తిస్తున్నారనుకోవాలి.''
...

(- అంబటి సురేంద్రరాజు రాసిన చివరి మాట లోంచి)


మూగవాని పిల్లనగ్రోవి (నవల)
రచన: డా.కేశవరెడ్డి

మొదటి ముద్రణ: ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 1993, రీతిక పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ 1995.
ముఖచిత్రం: కాళ్ల

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849

ముద్రణ: అనుపమ ప్రింటర్స్, గ్రీన్ వ్యూ, 126 శాంతి నగర్, హైదరాబాద్ - 28, ఫోన్: 040- 2339 1364 / 2330 4194


132 పేజీలు, వెల: రూ.60
.......

Saturday, October 4, 2008

మునెమ్మ ... సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తికి ప్రతీక ... నవల ... రచన: డాక్టర్‌ కేశవరెడ్డి


అనగనగా : మునెమ్మ
ఒక మాంత్రిక కథనం ... ఒక పురాణగాథ

You always have to take the side of the dead.
- Gabriel Garcia Marquez

Quest – romance is the search of the libido or desiring self for a fulfillment that will deliver it from the anxieties of reality but will still contain that reality.
- Northrop Frye

అడుగుదాం. సమయమొచ్చినప్పుడు గొంతుమీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్లలో మునిగినప్పుడు కదా గాలాన్ని లాగుతాం.
....మునెమ్మ

మనం సాధించదలచుకున్నది ధర్మసమ్మతమైనదైతే దాన్ని పొందడానికి మనకు యోగ్యత వుంటే, దానికోసం సాగే ప్రయత్నం నిజాయితీగా సాగితే దాన్ని సాధించే తీరుతాం. ఏ అమావాస్యగానీ, పౌర్ణమిగానీ అడ్డురావు.
.... పూటకూళ్లింటి ముసలాయన

వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అ లాగే స్వప్న జగత్తులోని సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపివేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్లు, ఆమెలోని సకల సందిగ్ధతలనూ సకల సంశయాలనూ సకల జడత్వాలనూ కడిగివేశాయి.
... సినబ్బ

...

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండిచ్చేరిలో ఎంబిబిఎస్‌ చేశాక నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి విక్టోరియా మెమోరియల్‌ ఆసుపత్రిలో స్కిన్‌ స్పెషలిస్టుగా కుష్టు రోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో వుంటూ ఆర్మూరులో వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్టువ్యాధిపై ఆయన రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

వీరి ఇతర రచనలు:

బానిసలు
భగవానువాచ
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌
స్మశానం దున్నేరు
అతడు అడవిని జయించాడు
రాముడుండాడు రాజ్జిముండాది
మూగవాని పిల్లనగ్రోవి
చివరి గుడిసె
సిటీ బ్యూటిఫుల్‌

నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌వారు అతడు అడవిని జయించాడు నవలను 14 భారతీయ భాషల్లోకి అనువదించారు.
ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ నవల మరాఠీలోకి అనువాదమైంది.

తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచటం, అనివార్యమైన జీవిత పోరాటానికి ఉపక్రమింపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ కూతురూ సంతానం.

మునెమ్మ ... నవల
రచన: డా. కేశవరెడ్డి
తొలి పలుకు: జయప్రభ
మలి పలుకు: అంబటి సురేంద్రరాజు
ముఖచిత్రం: కాళ్ళ
111 పేజీలు, వెల రూ.40

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌