Sunday, December 20, 2009

సాంఘిక వికాసానికి తోడ్పడే నవల - ఆంధ్రజ్యోతి సమీక్ష ...



హిందీలో ప్రముఖ రచయిత ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' ను శ్యామ్‌ బెనగల్‌ సినిమాగా తీశారు.

హిందీ సాహిత్యరంగం, చిత్ర పరిశ్రమల్లో సంచలనం సృష్టంచిన ఈ నవలను ''సూర్యుడి ఏడో గుర్రం'' పేరిట వేమూరి ఆంజనేయ శర్మ అనువాదం చేయగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టువారు ప్రచురించారు.

ఇది చాలా చిన్న నవల.
1950ల నాటి సాంఘిక జీవనాన్ని అక్షరబద్ధం చేశాడు రచయిత.
రైల్వేలో చిన్న ఉద్యోగి అయిన మాణిక్‌ ముల్లా మూడు ప్రేమ కథల సమాహారం ఇది.

మాణిక్‌ ముల్లాకు పదేళ్ల వయసు నుంచి వివిధ వయసుల్లో జమున, లిల్లీ, సత్తి అనే స్త్రీలతో పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ముగ్గురి స్త్రీలతో తనకున్న అనుబంధాన్నీ, వారి జీవితాలలో జరిగిన పెనుమార్పులనూ మాణిక్‌ ముల్లా మనకు కథలు కథలుగా చెబుతాడు.

ఈ కథల్లోని జీవితాలేవీ సుఖవంతమైనవి కావు. అయితే అతడు చెప్పే విషాదాంతం వెనక చమత్కారం వుంటుంది. ఆ చమత్కారం మాటున మళ్లీ అంతులేని విషాదం వుంటుంది. జమున తను కోరుకున్న వాడికి భార్య కావడం, సత్తి అర్థాంతరంగా చావడం వెనక దాగున్న దారిద్య్రం, మూఢనమ్మకాలను చెప్పీ చెప్పకనే వివరంగా చెప్తాడు రచయిత. అందుకే మాణిక్‌ ముల్లా ''ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం'' అంటూ ప్రేమను నిర్వచిస్తాడు.

ఏడు కథల సమాహారంగా సాగిన ఈ నవలను సూర్యుడి ఏడు గుర్రాలతో పోల్చుతాడు. ఇప్పటికే నైతికంగా భ్రష్టమైన జీవితపు సందుల్లో నడవడం వలన సూర్యుని రథం శిధిలమై పోయిందని, ఆరు గుర్రాలు కాళ్లు విరిగిపోయి అస్థిపంజరాలుగా మారాయని అంటాడు. మిగిలిన ఒక్క గుర్రమే మన భవిష్యత్తును సూచించేది. మన పిల్లల జీవితాల్లో వెలుగూ, అమృతం నిండిపోవాలంటే మిగిలిన ''సూర్యుడి ఏడో గుర్రం'' పరుగులు తీయడానికి సరైన తోవను ఏర్పాటు చేయాలంటాడు.

ఈ నవల ద్వారా రచయిత ఆశించిన నైతికత, సామాజిక న్యాయం, విలువలు ఈ ఆరు దశాబ్దాలలో మరింతగా పతనమై పోయాయి. బహుశా ఆ ఏడో గుర్రం కూడా మిగిలిన గుర్రాల వరుసలో చేరిపోయిందేమో!
- సుంకోజి
( ఆదివారం ఆంధ్రజ్యోతి, 20 డిసెంబర్‌ 2009 సౌజన్యంతో )
..........................................


సూర్యుడి ఏడో గుర్రం (నవల)
ధర్మవీర్‌ భారతి
పేజీలు : 115
వెల : రూ.50


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85,
బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌