Showing posts with label కులం-మతం-ఆధ్యాత్మిక-తత్వశాస్త్రం. Show all posts
Showing posts with label కులం-మతం-ఆధ్యాత్మిక-తత్వశాస్త్రం. Show all posts

Monday, April 18, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర, రచన: వెండీ డోనిగర్‌, తెలుగు : టంకశాల అశోక్‌

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి.
కానీ, దీనిపై భారతదేశంలో చాలా దృష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫ్రిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్‌స్వాతంత్య్రం పట్ల విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
తరువాత మరో ప్రచురణకర్త పూనుకుంటేనే గానీ మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు. అయితే అంతటా ప్రచారం జరిగినట్లుగా ఈ పుస్తకం వివాదాల పుట్ట కాదు.

పుట్టుకతోనో, ఆచరణరీత్యానో హిందూ మతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి - ఈ పుస్తకం హిందూ మతాన్ని మరో కోణం నుంచి, ప్రత్యామ్నాయ దృక్కోణం నుంచి పరిచయం చేస్తుంది.

ఇందుకోసం జానపద, మౌఖిక, భక్తి సంప్రదాయాల నుంచి విరివిగా స్వీకరించే ఈ రచన స్త్రీలు, నిమ్నకులాలు, నిరక్షరాస్యుల వంటి వారెవ్వరినీ వదిలిపెట్టకుండా అసాధారణ రీతిలో అందర్నీ కలుపుకుపోయే సమత్వ ధోరణిని బలంగా ముందుకు తెస్తుంది.
.. ... ...

''నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, శాస్త్రాలతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాల కావ్య సంప్రదాయంతో డోనిగర్‌కు క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నట్లు ఈ రచన ద్వారా మనకు అర్థమవుతుంది. లిఖిత సంప్రదాయానికి, మౌఖిక సంప్రదాయానికి మధ్య నిరంతర సంబంధాలు, ఆదాన ప్రదానాలు ఉంటాయని వాదించిన ఆమె, హిందూ మతం తన అంతర్గత తిరుగుబాట్లు, ఇతర మతాల వత్తిడుల కారణంగా ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నదో తెలియచెప్పారు. రామాయణం అనేక రూపాంతరాలకు గురై, చివరకు దానిని మొట్టమొదట రచించిన వాల్మీకి రామాయణ రూపంతో స్థిరపడింది. మారుతున్న చారిత్రక పరిస్థితులను స్వీకరిస్తూ దానిని పలువురు మళ్లీమళ్లీ రాసారు. మహాభారతం విషయంలోనూ అదే జరిగింది.

    హిందూ దేవతలను డోనిగర్‌ 'కల్పనల' స్థాయికి తగ్గించినట్లు అతివాదులు ఆరోపిస్తున్నారు. కాని విభిన్నమైన నిర్వచనాలే హిందూ సంప్రదాయపు బలమైనట్లు ఈ గ్రంథం నిరూపిస్తుంది.''
............................................................................................- ప్రియంవద గోపాల్‌, ద గార్డియన్‌
.....

వెండీ డోనిగర్‌ -
సంస్కృత భాషలో, భారతదేశ అధ్యయనంలో హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలనుంచి రెండు డాక్టరేట్లు చేసారు. అనేక సంస్కృత కావ్యాలను, హిందూ మతంపై పలు రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో, బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బోధించారు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో మిర్సియా ఎలియేడ్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ ప్రొఫెసర్‌గా మతాల చరిత్రను బోధిస్తున్నారు.
...

టంకశాల అశోక్‌ -
 హైదరాబాద్‌, ఢిల్లీలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాల్లో విద్యాభ్యాసం జనధర్మ, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం, ఆంధ్రప్రభ, వార్త, హన్స్‌ ఇండియా పత్రికలలో ఉద్యోగం ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌.
...

తెలుగు ప్రచురణకు రచయిత్రి ప్రత్యేక ఉపోద్ఘాతం

'ద హిందూస్‌ : ఏన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరీ' రచన తెలుగులో వెలువడుతుండటం నాకు సంతోషాన్ని, సంభ్రమాశ్చర్యాలను కూడా కలిగిస్తున్నది. అందుకు పలు కారణాలున్నాయి. నా రచనలు ఏదైనాసరే ఒక భారతీయ భాషలో వెలువడడం ఇది మొదటిసారి. నా రచనలలో ఈ విధంగా ఎక్కువమందికి అందుబాటులోకి రావాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే అది ఈ పుస్తకమే.

 పెంగ్విన్‌ సంస్థ 2010 లో ప్రచురించిన ఈ గ్రంథం ఎడిషన్‌ కోర్టు వివాదంలో చిక్కుకోవటం వల్ల నాకిట్లా అనిపిస్తున్నది. ఈ రచనను స్పీకింగ్‌ టైగర్‌ సంస్థ సాహసించి తిరిగి ఇంగ్లీష్‌ ఎడిషన్‌ వేయటం, ద హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అదే సాహసంతో  దీనిని శ్రమపడి తెలుగులోకి అనువదించి మరింతమంది భారతీయ పాఠకులకు అందుబాటులోకి తేవటాన్ని బట్టి, భారతదేశంలో వాక్స్వాతంత్య్రం పట్ల నాకు గొప్ప ఆశాభావం కలుగుతున్నది.

తెలుగు ఎడిషన్‌ పట్ల నాకు మరొకందుకు కూడా సంతోషం కలుగుతున్నది.
దక్షిణ భారతదేశం గురించి నేను రాయటం ఇది మొదటిసారి. (కొన్ని సంకలనాలలో రాసిన వ్యాసాలలో దక్షిణ భారతదేశ ప్రస్తావనలున్నాయి. వాటిలో ఆ ప్రాంత భాషా రచనల అనువాదాలను స్వీకరించాను. ఉదాహరణకు ఇటీవల వెలువడిన 'నార్టన్‌ ఆంథాలజీ ఆఫ్‌ వరల్డ్‌ రెలిజియన్స్‌' లో హిందూమతం గురించిన సంపుటికోసం రాసిన వ్యాసంలో తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు మూలాల నుంచి కొన్ని భాగాలు తీసుకున్నాను. వాటి గురించి అంటున్న మాట కాదిది.)

హిందూ మతం గురించి వెలువడిన ప్రధాన గ్రంథాలు అనేకం వదిలివేసిన కొన్ని వర్గాలవారరి స్వరాలను, ముఖ్యంగా స్త్రీలు, దళితులు, జంతుజాలాల స్వరాలను వినిపించేందుకు నా ఈ ప్రస్తుత రచనలో ప్రయత్నించాను. అదే విధంగా, నేను దక్షిణ దేశంపై సరైన విధంగా దృష్టి సారించటం ఎట్టకేలకు ఈ విధంగా మొదలవుతున్నది. అందువల్ల, ఈ రచనను తెలుగు పాఠకులు కూడా చదవనుండటం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది.
. ...............................................................................................................వెండీ డోనిగర్‌
...............................................................................................షికాగో, డిసెంబర్‌ 25, 2015

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
రచన: వెండీ డోనిగర్‌
తెలుగు :  టంకశాల అశోక్‌

342 పేజీలు , వెల    : రూ. 275/-


ఆంగ్లమూలం    : The Hindus : An Alternative History, Penguin 2009 © Wendy Doniger 

ప్రథమ ముద్రణ    :    మార్చి 2016,

ప్రతులకు, వివరాలకు    :  
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, 
 హైదరాబాద్‌ - 500 006.
ఫోన్‌ : 040 2352 1849
E Mail ID:      hyderabadbooktrust@gmail.com

.
 

Monday, February 22, 2016

బహుజన కోణంలో పురాణాలు - చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016

బహుజన కోణంలో పురాణాలు - చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016

" దేశంలో భక్తి రసం తెప్పలుగా పారుతోంది 
...డ్రైనేజీ స్కీము లేక డేంజరు గా మారుతోంది "

అప్పుడెప్పుడో గజ్జెల మల్లారెడ్డి చెప్పినట్లు ... దేశంలో భక్తి  రసం చాలా ఎక్కువైంది. వేదాలు, పురాణాల పట్ల రోజు రోజుకూ ఆసక్తి పెరిగిపోతోంది ....

పురాణాలు - మరోచూపు -
పుస్తక సమీక్ష
- చందు తులసి - ఆంద్ర జ్యోతి 21-2-2016


Tuesday, September 15, 2015

పురాణాలు - మరోచూపు - బి. విజయభారతి

పురాణాలు - మరోచూపు - బి. విజయభారతి

ఆధునిక సమాజంలో సమస్యలెన్నో ఉండగా పురాణ కథల గురించి ఇంకా రాయ వలసిన అవసరం ఏమిటీ అని చాలామంది అనుకోవచ్చు. స్వశక్తినీ స్వయంకృషినీ పక్కకు పెట్టి దేవుళ్ళను మొక్కుకోవటాలూ దేవుళ్ళమీద ఆధారపడటాలూ రోజురోజుకూ ఎక్కువవటం గమనించాక మహాత్మా జోతిరావ్‌ ఫూలే (1827-1890), డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ (1891- 1956), శ్రీ మాదరి భాగ్యరెడ్డి వర్మ (1888-1939) గార్ల భావజాలాన్ని వర్తమాన సమాజానికి అందించవలసిన అవసరం ఉన్నదనిపించింది.

    భారతదేశంలో మతమే ప్రజల జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నది. ముఖ్యంగా కింది కులాల ప్రజలకు పురాణ పాత్రలు, రామాయణ, మహాభారతాలలోని పాత్రలూ ఆదర్శం. ఆ పాత్రల గురించి వారికి తెలియజెప్పవలసి ఉంది.

    శూద్ర కులాలనూ స్త్రీలనూ విద్యకు దూరం పెట్టినప్పటికీ పురాణాలలోనివిగా విన్న విషయాలను వారే బలంగా నమ్ముతున్నారు. ఆచరణలో పెడుతున్నారు. వాస్తవ విషయాలను స్వయంగా చదవకపోవడం వల్లనూ పురాణాలను ప్రశ్నించకూడదనే ఆంక్షలవల్లనూ ఈ పరిస్థితి ఏర్పడింది. పురాణాలలోని సంఘటనలనూ వాటి పూర్వాపరాలనూ తార్కికంగా పరిశీలించిన మహాత్మా జోతిరావ్‌ పూలే అసుర చక్రవర్తులను స్థానికులుగా పరిపాలనా దక్షులుగా, ధర్మ ప్రవర్తకులుగా, ప్రజలకు సమన్యాయం అందించిన మానవతావాదులుగా గుర్తించారు. పురాణాల పేరిట, ధర్మశాస్త్రాల పేరిట, ప్రజలను - ముఖ్యంగా రైతులనూ కింది వర్గాల వారినీ దోచుకుంటున్న పురోహిత వ్యవస్థను ప్రశ్నించారు. తాను కనుగొన్న వాస్తవాలను  రచనల ద్వారా, రాత్రి పాఠశాలల ద్వారా, దృశ్య కళారూపాల ద్వారా ప్రజలలో ప్రచారం చేశారు.

    జోతిరావ్‌ పూలే ఆలోచనా ధారను డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ మరింత ముందుకు తీసుకువెళ్ళారు. వైదిక మతం గురించీ వర్ణ ధర్మాల గురించీ, రాముని, కృష్ణుని రహస్యాల గురించీ చర్చించారు. ఎవరైతే మన స్థానిక వీరులైన అసురులను తుదముట్టించారో వారినే మనం పూజించటం తగనిపని అని భాగ్యరెడ్డి వర్మ చెప్పారు. ఆర్య - ఆర్యేతర ఘర్షణలలోని వాస్తవాలను చిన్న చిన్న నాటకాలుగా ప్రదర్శింపజేసి ప్రజలను చైతన్య పరచారు.

    వివేకానందుడు (1863-1902) తన చివరి రోజులలో మత సంస్కృతిలోని దోషాలను గురించి ఆందోళనపడ్డాడు. ''మతంలో ఏమీ దోషంలేదు. జనపీడన యంత్రాంగాన్ని ప్రవేశపెట్టిన కపట మతాచార్యులదే దోషం'' అన్నాడు. వేదాలు, రామాయణ, మహాభారతాలు, అష్టాదశ పురాణాలు అప్పటప్పటి సామాజిక రాజకీయ పరిస్థితులను మానవ మనస్తత్వాలను, ప్రతిబింబిస్తూ ఉన్న రచనలు  వాటిని ఉద్దేశపూర్వకంగా మత ధర్మాలతో ముడిపెట్టడం జరిగింది. అలా ముడిపెట్టడం వర్గ ప్రయోజనాల కోసమే.
.....    ...   ...
శంబూకుని పట్ల అమలు అయిన న్యాయమే దళితులపట్ల అమలవుతూ ఉంది. ఊచకోతలలో దళితులది అసుర వారసత్వమే. రామాయణాన్ని అందులోని విషయాలనూ ప్రామాణికంగా ఇప్పటికీ భావిస్తుంటారు. అందులోని మత ధార్మిక విషయాలను 21వ శతాబ్దపు దృష్టితో కాకపోయినా వాస్తవాల కోసమైనా తెలుసుకోవాలి. పురాణాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ వ్యాసాల అవసరం ఉన్నదని భావిస్తూ నా పరిశీలనను మీ ముందు ఉంచు తున్నాను. వర్తమానాన్ని అర్థం చేసుకోవటానికి గతాన్ని తెలుసుకోవటం అవసరం.

(ముందుమాట నుంచి )


పురాణాలు - మరోచూపు
బి. విజయభారతి

380 పేజీలు ; ధర : రూ. 200/-

అట్టమీద ఫోటో    : హరీష్‌ నాగరాజ్‌,  శ్రీ వినాయక తోలుబొమ్మల బృందం, నిమ్మలకుంట గ్రామం, అనంతపురం జిల్లా వారి నుంచి సేకరణ

మొదటి ముద్రణ : జూలై 2015

ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,గుడిమల్కాపూర్‌, 

హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ : 040 2352 1849

Thursday, November 7, 2013

ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు: పోలీసు, కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి? - బొజ్జా తారకం


ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు
పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?


- బొజ్జా తారకం


ఈ పుస్తకానికి ఎందుకనో ముందుమాట రాయలేదు. రాయకుండానే ముద్రణకు పంపించాం. కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయి అనిపించి ఓ నాలుగు మాటలు రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టానికి సంబంధించిన అవగాహన బాగానే పెంచటం జరిగింది. అత్యాచారం జరిగిందని తెలిసిన వెంటనే కార్యకర్తలు అత్యాచారానికి గురైన వారు వారి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు చేయటం, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించటం, మృతదేహాలకు పోస్ట్‌ మార్టమ్‌ చేయించటం వంటి పనులు జరుగుతున్నాయి. గాయపడిన వారికి మృతుల బంధువులకు నష్టపరిహారం అందేలా చూడటం, పునరావాస సౌకర్యం కల్పించటం వంటి పనులు వెంట వెంటనే జరుగుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ముద్దాయిలను అరెస్టు చేయించి జైలుకు పంపటం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

దీనివల్ల అత్యాచారం జరిపిన వర్గం  నుంచి తీవ్రత వస్తున్నప్పటికీ కార్యకర్తలు వెనుకాడటంలేదు. చట్టం సరిగ్గా అమలు జరిగితే సగం పని అయిపోయినట్టే! అత్యాచారాలు జరగకుండా చూడటం అనేది రాజకీయ వ్యవహారం. చట్టం అమలు పటిష్ఠంగా ఉంటే రాజకీయ శక్తులు, అగ్రకుల అహంకారులు కొంత వెనుకంజ వేస్తారు. దానితో పోలీసులు కూడా దారికి వస్తారు. ఈ చట్టాన్ని ఎంత పటిష్ఠంగా అమలు జరిపితే అంత త్వరగా అత్యాచారాలు కూడా ఆగిపోతాయి.
   
ఇప్పుడు ఒక కొత్త అత్యాచారం చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది.
''పరువు హత్యలంటూ'' ఎస్‌.సి., ఎస్‌.టి.లపై కులం కులమే, గ్రామం గ్రామమే దాడిచేసి చంపేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హర్యానా, యు.పి. రాజస్థాన్‌లలో ఎక్కువగా జరుగుతున్నాయి.

అన్ని హత్యలకూ కారణం ఒకటే. ఎస్‌.సి. కులానికి చెందిన అబ్బాయి, అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అది ఆ అగ్రకులానికి ఇష్టం ఉండదు. పెళ్ళి చేసుకున్న ఆ ఇద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అగ్రకులంవారు ఈ భార్యాభర్తలను వెతికి పట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయిని విడిచిపెట్టేయ మంటారు. ఆ అమ్మాయి వినదు. అంతే, అబ్బాయిని చంపేస్తారు.
ఒకోసారి ఇద్దర్నీ చంపేస్తున్నారు.
దీనికి ఆ కులమూ, గ్రామమూ మద్దతు ఇస్తుంది.
 పోలీసు కూడా జోక్యం చేసుకోవటానికి భయపడుతుంది.

అత్యంత దారుణమైన, హేయమైన, నీచమైన హత్యలివి. అగ్రకులం పరువు పోయిందని ఇటువంటి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయటంగాని, కేసు నమోదు చేయటంగాని, దోషులకు శిక్షపడేలా చూడటం కాని జరగటంలేదు.
దీనితో అగ్రకులాల వారికి ధైర్యం బాగా పెరిగిపోతున్నది.

కాని, ఒక్క విషయం మాత్రం ఈ అగ్రకులాలవారు గ్రహించటంలేదు. ఇటువంటి హత్యల ద్వారా ఈ ప్రేమ వివాహాలను ఆపటం సాధ్యపడదని, కులాల అడ్డుగోడలు లేని ఒక మానవీయ బాంధవ్యాలకు సంబంధించిన అంశమేమో, ఈ నేర ప్రవర్తన ద్వారా వీటిని అరికట్టటం అసాధ్యమనేది గ్రహించటంలేదు.

   
ఈ చట్టం కూడా ఈ పరిస్థితిని పరిగణనలోనికి తీసుకోవటంలేదు.
చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటంతోపాటు, విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా ఒక సామాజికమైన మార్పును తీసుకురావటం ప్రధాన కర్తవ్యం.
అటువంటి పని దురదృష్ట వశాత్తు ఈ దేశంలో జరగటంలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక ఉద్యమాలు పూర్తిగా బలహీనమైపోయాయి.
వాటిని పునరుద్ధరించటం కూడా చాలా అవసరం. ఇటువంటి ఉద్యమాలు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయించటానికి బాగా ఉపకరిస్తాయి.



ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు : పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?

- బొజ్జా తారకం


ధర    :    రూ. 50/-

మొదటి ముద్రణ    :    జూన్‌ 2012, రిపబ్లికన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌
రెండవ ముద్రణ    :    అక్టోబర్‌ 2013
హక్కులు    :    రచయితవి

ప్రతులకు, వివరాలకు 
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌,   గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 23521849

Thursday, June 20, 2013

పురాణాలు కుల వ్యవస్థ - 5: రామాయణ మునులు - మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు - బి. విజయభారతి

పురాణాలు కుల వ్యవస్థ - 5:

రామాయణాన్ని ఒక కావ్యంగానూ మత గ్రంథంగానూ కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కథలో అనేక కథలున్నాయి. మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని విద్యా వ్యవస్థను పరిశీలించటం ఈ గ్రంథం లక్ష్యం. ఈ కోణంలో పరిశీలనకు మతంగ, విశ్వామిత్ర, శంబూకుల కథలు ప్రధానంగా గ్రహించటం జరిగింది. ...
...
ఈ కథలలో ఒక సామాజిక క్రమం ఉన్నది. మతంగుని కాలం నాటికి విద్యలపైనా తపస్సులపైనా ఆంక్షలు లేవు. విశ్వామిత్రుని కాలం నాటికి కొన్ని వ్యవస్థలు బ్రాహ్మణ, వైశ్య వర్గాలకే ప్రత్యేకించారు. క్షత్రియులకు కొన్ని వ్యవస్థలు నిరాకరించారు. అప్పటికి క్షత్రియులు అద్విజులు. శంబూకుని కాలం నాటికి క్షత్రియుల నుండి శూద్రులను - అతి శూద్రులను వేరుచేసి వారికి అన్ని విద్యలు నిషేధించారు. రామరాజ్య వ్యవస్థలోని పరిణామ క్రమం ఇది. శూద్రుల సామాజిక స్థాయిలో అమానవీయత ఎందువల్ల ఎప్పుడు ప్రవేశించింది అనేది ఆలోచించాలి. ...
...
రామాయణ కాలంలో ప్రజలకూ మునులకూ మధ్య ఉన్న ధార్మిక సంబంధాల గురించీ యోగాభ్యాస నిరతి గురించీ ప్రస్తావిస్తున్న ఈ పుస్తకం కొన్ని కొత్త కోణాలను కూడా ఆవిష్కరిస్తున్నది.

శ్రమ విలువను ఎంతో గొప్పగా విశ్లేషించిన మార్క్స్‌ మహాశయుని కంటే శతాబ్దాల ముందరే ''శ్రమ నుండి ఎదిగినది నశించదు'' అంటూ రాక్షసుడుగా చెప్పబడుతున్న కబంధుడు రామునికి చెప్పాడనటం మతంగ సంస్కృతిని గురించి ఆలోచనలను రేకెత్తిస్తుంది.
...
డా. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు- కుల వ్యవస్థ పైన ఇది ఐదవ పుస్తకం. ఇంతకు ముందు వెలువడినవి:

1) పురాణాలు- కుల వ్యవస్థ -1 : సత్యహరిశ్చంద్రుడు (వెల: రూ.15/-)
2) పురాణాలు- కుల వ్యవస్థ -2 : దశావతారాలు (వెల: రూ.25/-)
3) పురాణాలు- కుల వ్యవస్థ -3 : షట్చక్రవర్తులు (వెల: రూ.30/-)
4) పురాణాలు- కుల వ్యవస్థ -4 : వ్యవస్థను కాపాడిన రాముడు (వెల: రూ.100/-)



పురాణాలు కుల వ్యవస్థ - 5:
రామాయణ మునులు - మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు
- బి. విజయభారతి

92 పేజీలు, వెల రూ. 50/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849




Monday, February 13, 2012

వేదాల్లో ఏమున్నది?


వేదాల్లో ఏమున్నది?

''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావటమే గాక ప్రజలను పీడించటానికి సాధనమవుతుంది'' అని తెలిసిన వాళ్లు చెబుతారు.
వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది.
వేదాలను బ్రాహ్మలు గుత్తకు తీసుకొని,
వేదాధ్యయనానికి నిషేధాజ్ఞలు కల్పించి,
అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు.

ఈ పరిస్థితిని ఆధారం చేసుకొని కొందరు ముందుకు పోవటమంటే
భయమూ, అసహ్యమూ గల వాళ్లు,
వేదాల్లో లేనిది లేదని ప్రజలను నమ్మించ జూశారు.
...
వేదాల్లో ఏమున్నది అన్న విషయం గురించి
మనకు తెలియజెప్పిన వాళ్లు చాలా వరకు పాశ్చాత్యులు.
వాళ్లు సంస్కృతం చదువుకొని,
వేదాలు పఠించి,
అందులో ఏమున్నదీ మనకు తెలియబరచవలసిన దుస్థితి కలిగింది.
...
ఋగ్వేద రచన క్రీస్తు పూర్వం 1500-1400 ప్రాంతంలో
జరిగిందన్న అంచనాను పురాతత్వ శాస్త్రం బలపరుస్తున్నది.
ఋగ్వేదంలో 10,500 పైచిలుకు ఋక్కులున్నాయి.
కొన్ని ఋక్కులను కలిపి ఒక సూక్తం అన్నారు.
శౌనకుడు ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించాడు.

ఋక్కులలో (సూక్తాలలో) కొన్ని స్తోత్రాలు,
కొన్ని ప్రార్థనలు, కొన్ని మంత్రాలు, కొన్ని ఉత్తపాటలు:
'ఒకప్పుడు వాస్తవమూ, విశ్వసనీయమూ, అద్భుతమూ అయినవి,
కానీ తరచూ చపలంగానూ, పామరంగానూ, దురవగాహంగానూ కూడా వుంటాయి''
అన్నాడు మాక్స్‌ ముల్లర్‌.
...
ఋగ్వేదంలోని భాష ఆడంబరంగానూ, పాండిత్య ప్రకర్షతో కూడినదిగానూ ఉండి, తరచుగా చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది.
ఋగ్వేద ఋషులు సుమారు 2000 మంది ఉండేవారట.
వారు ఎంతో శ్రద్ధగా ఋగ్వేద రచన చేశారు.
వారు తాము ఆర్యులమని, కొత్త ప్రదేశాలను జయించామనీ చెప్పుకున్నారు.
...
వేదాలు నాలుగంటారు గానీ కొందరు మూడు వేదాలనే గుర్తిస్తారు.
నన్నయ భట్టు భారతం ప్రారంభిస్తూ ''వేదత్రయ మూర్తయః త్రిపురుషాః'' అన్నాడు.
ఋగ్వేదం పోతే మిగిలిన వేదాలు సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం.
కానీ వీటికి కూడా మూలం ఋగ్వేదంలాగనే కనిపిస్తుంది.
...
వేదాల గురించీ, ఆకాలపు మనుషులను గురించీ, తెలుసుకోవడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ జీవితంలోనూ, సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా, మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదనే ఆధారపడి పెరిగింది.
ఈ 20 (21)వ శతాబ్దంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి ఉండటం తప్పని సరి అవుతుంది.
అందుచేత తెలిసిన వాళ్లు వేదాలను గురించి వేదకాలపు జీవితం గురించి సాధ్యమైనన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజెప్పాలి.
ఈ సందర్భంలో తప్పుడు భావాలు ప్రచారంలో వుండటం అంత మంచిది కాదు.
...

వేదాల్లో ఏమున్నది ?
- కొడవటిగంటి కుటుంబరావు
పునర్ముద్రణ
పేజీలు 24, వెల: రూ.10
(అవును పది రూపాయలే)

Tuesday, November 15, 2011

కంచ ఐలయ్య 'నేను హిందువునెట్లయిత?' ఏడో ముద్రణ !



...

కంచ ఐలయ్య 'వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ' (Why I Am Not A Hindu?, Published by Samya, Kolkata) యావత్‌ భారత దేశంలో గొప్ప సంచలనం సృష్టించిన అద్భుత గ్రంథం. ఆంగ్లంలో తొలి ముద్రణ పొందిన 1996లోనేనాన్‌ ఫిక్షన్‌ విభాగంలో బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. చాలా దేశాలలోని విశ్వవిద్యాలయాలలో పాఠ్య గ్రంథంగా ఎంపికయింది.

2000 సంవత్సరం ది పయనీర్‌ పత్రిక ఈ పుస్తకాన్ని ఈ సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాల్లో ఒకటని ప్రకటించింది. (మిగతా నాలుగు పుస్తకాలు: బి.ఆర్‌.అంబేడ్కర్‌ ''కుల నిర్మూలన''; నామ్‌ దేవ్‌ దసాల్‌ ''గోల్‌ పిథా''; గుర్రం జాషువా ''గబ్బిలం''; ముల్క్‌రాజ్‌ ఆనంద్‌ ''అన్‌టచబుల్‌'').

2000 సంవత్సరంలోనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని ''నేను హిందువునెట్లయిత?'' పేరిట తెలుగులో వెలువరించింది. ప్రచురించిన కొద్ది మాసాల్లోనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. తెలుగునాట కూడా ఈ పుస్తకంపై విస్తృతమైన చర్చ జరిగింది. జరుగుతోంది. గత పదేళ్లలో ఈ పుస్తకం ఆరు ముద్రణలు పొందింది.

ఇప్పుడు
'నేను హిందువునెట్లయిత?' ఏడో ముద్రణ - మరో కొత్త అధ్యాయంతో, ఆకర్షణీయమైన సరికొత్త ముఖచిత్రంతో వెలువడింది.

తప్పక చదవండి... చదివించండి... చదివి, చదివించి చర్చించండి...!


నేను హిందువు నెట్లయిత?
హిందూ తత్వం, సంస్కృతి, రాజకీయ అర్థశాస్త్రంపై సూద్ర విమర్శ
కంచ ఐలయ్య
188 పేజీలు, వెల: రూ.80

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-23521849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com


..



Tuesday, October 25, 2011

నేను భంగీని


... అవును నేను అంటరానివాన్ని.
నేను ఈ రోజు నా కథని వినిపించాలనుకుంటున్నాను.

నా కథ, నా భాష మీరు ఇంతకు ముందు వినివుండరు.

నా కథని ఎవరూ రాయలేదు.

నేను సమాజపు చిట్టచివరి అంచున వున్నవాణ్ని.
చెత్త కుండీని.

మురికిబట్టిన పనికిరాని చెత్తని ఇందులో విసిరివేస్తారు.
మూగవానిగా, కాళ్ల కింది గడపగా మార్చబడిన ఈ సమాజంలోని మనిషిని.
ప్రతి మనిషీ నాపై అడుగులేసి ఇంట్లోకి వెళ్తాడు. కానీ నాకు మాత్రం ఇంట్లోకి ప్రవేశం లేదు. ....
...
ఇదో అంటరానివాడి చరిత్ర
నేను అంటరానివాన్ని.
నేను పాకీవాన్ని.
నేను ఛండాలుడిని.
మ్లేచ్ఛుడిని అని అంటున్నాడు ఈ వ్యక్తి.

ఇతను ఎవరు?

చరిత్ర వున్నవాడు కానీ చరిత్రలో లేనివాడు.

అక్షరాలు తెలియనివాడు. జ్ఞానం లేనివాడు. అచ్చమైన మూలవాసి.

ఆయుధాలు పట్టినవాడు. పోరాటాలు చేసినవాడు. నెత్తురు
పారించినవాడు.
కిరీటాలు మార్చిన వాడు, తలకాయలు కత్తిరించినవాడు.
సామ్రాజ్యాలు స్థాపించినవాడు. పడిపోతున్న సింహాసనాలకి
ప్రాణాలు పోసినవాడు.
రాజ్యాన్ని నిలబెట్టడంలో,
రాజ్యాన్ని పడగొట్టడంలో ప్రధానమైన పనిముట్టు ఇతను.


''నీళ్లు జీవితాన్నిస్తాయి.

కానీ నాకు మాత్రం నీళ్లు బానిస సంకెళ్ళు.

ప్రకృతిలో నీరూ, గాలీ మీద అందరికీ సమాన హక్కులున్నాయంటారు...

కానీ హిందూ సమాజంలో నీళ్లపై హక్కు కూడా నాకు దక్కకుండా చేశారు''
అని అంటున్నాడు ఈ మనిషి.


అశుద్ధాన్ని , మురికిని, పెంటని వీధుల నుండి, గ్రామం నుండి వేరు చేస్తూ... అద్దంలా ఊరిని తయారుచేస్తూ, తాను అశుద్ధ మానవుడుగా
మారి అసహ్యంతో, రోగాలతో, అశుభ్రతతో దగ్గీ దగ్గీ ప్రాణాలు తీసుకుంటున్న అధోజగత్‌ సహూదరుల చరిత్ర ఇది.

అందుకే ఇది అంటరానివారి చరిత్ర.

ఇందులో భగవాన్‌ బుద్ధుడు వస్తాడు.

అనన్య సామాన్యమైన ఆయన బోధనలు వినిపిస్తాయి.
ఈ దేశానికి రాజ్యాంగం రాసిన దిక్సూచి బాబా సాహెబ్‌ డా. అంబేడ్కర్‌ వస్తాడు.
బోధించు, పోరాడు, సమీకరించు, విప్లవించు అనే ఆయన బోధనలు వినిపిస్తాయి.


అంటరానివాడు అంటరానివాడిగానే ఊరిబైట అ లాగే మగ్గాలి అనే దొంగ సాధువులు, మహాత్ములు కనిపిస్తారు.
వారి కపట నాటకాలు
ధర్మప్రభోదాలు వినిపిస్తాయి.
పురుషార్థాన్ని సాధించవచ్చు అంటూ వర్ణవ్యవస్థ జెండాకి జై కొడుతున్న సిగ్గుమాలిన దగుల్భాజీలు కనిపిస్తారు.

బుద్ధ భగవానుని ప్రవచనాల నుండి బాబాసాహెబ్‌ బోధనల వరకు అన్నింటిని వింటూ అక్షర జ్ఞానానికి దూరంగా బలహీనతలతో, అజ్ఞానంతో
బతుకుతున్న అంటరాని, పాకీ సోదరుల ఈ చరిత్రని మనం వీధివీధికి తీసుకెళ్లాలి.
అందుకోసం మనవంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి
అని చెప్తుంది ఈ పుస్తకం.
అందుకే దీన్ని అందరూ చదవాలి.
...

భగవాన్‌ దాస్‌ (1927-2010)

భారతదేశం తొలితరం దళిత చైతన్యానికి నిలువెత్తు ప్రతీక. కొంతకాలం అంబేద్కర్‌ వద్ద పరిశోధన సహాయకుడిగా పనిచేసిన ఆయన
జీవితాంతం అంబేద్కర్‌ ఆశయాల సాధనకోసమే పాటుపడ్డారు. భంగీ (పాకీ) వృత్తికులంలో జన్మించారు. బౌద్ధాన్ని స్వీకరించిన ఆయన శాంతి కోసం ప్రపంచ మతాల సమ్మేళనం (క్యోటో, 1970) ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1983లో అంటరానితనం, దాని అమానుషాల గురించి ఐక్య రాజ్య సమితి వేదిక మీద ప్రసంగించారు.
డా. జి.వి.రత్నాకర్‌
తెలుగులో మట్టిపలక, లట్లేటి అ లం కవిగా సుపరిచితుడు. హిందీ నుండి తెలుగులోకి 25 పుస్తకాలను అనువదించారు. సాక్షి మానవ హక్కుల నిఘా పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ హిందీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ...

నేను భంగీని

రచన: భగవాన్‌ దాస్‌

తెలుగు: డా. జి.వి.రత్నాకర్‌

128 పేజీలు, వెల: రూ. 80/-


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-23521849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

..

Saturday, September 17, 2011

మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మత విశ్వాసాల ద్వారా సమకూరే ఉపయోగాలేవీ 'ఇన్‌హేలర్ల' స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గానీ, సమాజపు ఆరోగ్యానికి గానీ పట్టిన 'జలుబు' ఎంతమాత్రమూ తగ్గదు. పైగా వాటి 'సైడ్‌ఎఫెక్ట్స్‌' చాలా ప్రమాదకరమైనవి.

వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలు సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రోజూ ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరూపిస్తూనే వుంది.

ప్రాణులను సృష్టించినది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలూ, భద్రతాభావమూ కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్థ ప్రయత్నమే.

ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్థిక అనిశ్చితస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకూ గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగత నమ్మకమూ, బలహీనతా కాదు.

దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడులేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.''

మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడుపోసుకుంది?
మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి?
మతాల నేపథ్యం లాభనష్టాల గురించి విస్తృత అధ్యయనంతో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.

రచయిత: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
జననం: మద్రాసులో 1949లో
విద్యాభ్యాసం: మద్రాసు, ఆంధ్ర, ముంబయి విశ్వవిద్యాలయాల్లో
అణుభౌతికశాస్త్రంలో పి.హెచ్‌డి.
ఉద్యోగం: మొదట బాబా అణుకేంద్రంలో, ప్రస్తుతం ఇ.సి.ఐ.ఎల్‌.లో.
అభిరుచులు: శాస్త్రీయ సంగీతం, జనరంజక విజ్ఞాన రచనల్లో ఆసక్తి, అభినివేశం.
ఇతర రచనలు: జీవశాస్త్ర విజ్ఞానం, సమాజం (జనసాహితి), విశ్వాంతరాళం, మానవ పరిణామం, జీవకణాలూ, నాడీ కణాలూ (స్వేచ్ఛా సాహితి)
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి బ్లాగును "ఇక్కడ" సందర్శించండి :
http://rohiniprasadkscience.blogspot.com

మనుషులు చేసిన దేవుళ్లు
కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
196 పేజీలు, వెల: రూ.100/-
తొలి ముద్రణ: ఆగస్ట్‌, 2011

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

Wednesday, November 10, 2010

వర్గ నిర్మూలన ద్వారా కుల నిర్మూలన జరుగుతుందా? లేక కుల నిర్మూలన ద్వారా వర్గ నిర్మూలన జరుగుతుందా??



కులం - వర్గం

- బొజ్జా తారకం

...
కులం అనగానే కొంతమందికి డాక్టర్‌ అంబేడ్కర్‌ గుర్తుకు వస్తాడు.

వర్గం అనగానే కొంతమందికి కార్ల్‌
మార్క్స్ గుర్తుకు వస్తాడు.

భారతదేశంలోని ప్రధాన సమస్య కులం అని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెబితే -
ప్రపంచంలోని ప్రధాన సమస్య వర్గం అని
మార్క్స్ చెప్పాడు.

కులం సమస్యను పరిష్కరిస్తే భారతదేశంలోని ప్రధానమైన సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్‌ అంబేడ్కర్‌ చెబితే -


వర్గ సమస్యను పరిష్కరిస్తే ప్రపంచంలోని ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని
మార్క్స్ చెప్పాడు.

కుల సమస్యను క్షుణ్ణంగా అంబేడ్కర్‌ పరిశీలిస్తే వర్గ సమస్యను విపులంగా
మార్క్స్ పరిశీలించాడు.

కులసమస్యతో పాటు వర్గ సమస్యను పరిశోధించటానికి అంబేడ్కర్‌కి అవకాశం లభించింది కానీ వర్గ సమస్యతో పాటు కుల సమస్యను అంత వివరంగా పరిశోధించటానికి
మార్క్స్ కు అవకాశం లేకపోయింది.

భారత దేశంలో కుల సమస్యా వున్నది, వర్గ సమస్యా వున్నది. 


కుల వైరుధ్యాలు వున్నాయి, వర్గ వైరుధ్యాలు వున్నాయి. 


కుల ద్వేషం వున్నది, వర్గ ద్వేషమూ వున్నది. 


కులాధిపత్యం వున్నది, వర్గాధిపత్యమూ వున్నది.


అందువల్ల అంబేడ్కర్‌కి ఈ రెండింటినీ పరిశోధించే అవకాశం దొరికింది. .....




కులం - వర్గం
రచన: బొజ్జా తారకం

 
ప్రథమ ముద్రణ: 1996
పునర్ముద్రణ: 2002, 2008 

 
87 పేజీలు, వెల: రూ.30/-

Tuesday, February 23, 2010

నేను హిందువు నెట్లయిత? పునర్ముద్రణ ... మరో కొత్త అధ్యాయం తో ...


నేను హిందువు నెట్లయిత? ఆరో ముద్రణ మరో కొత్త అధ్యాయంతో వెలువడింది. ఆ కొత్త అధ్యాయం లోంచి కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాము:


….. “గత తొమ్మిదేళ్లలో ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో ఎన్నో సమీక్షలు వచ్చాయి. కొందరు సమీక్షకులు ఇందులోని కొన్ని అస్పష్టతలను, చిన్న చిన్న లోటుపాట్లను ఎత్తి చూపారు. అవి సహజమైనవి కూడా. అయితే ఈ దశలో నేనీమీ మార్పులూ చేర్పులూ చేయదలచుకోలేదు. ఈ పుస్తకం ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొంది.

1996వ సంవత్సరంలో నాన్‌ఫిక్షన్‌ విభాగంలో బెస్ట్‌ సెల్లరైంది. యావత్‌ ప్రపంచం నూతన సహస్రాబ్దిలో అడగుపెడ్తున్న సమయంలో అంటే 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వెలువడే 'ది పయనీర్‌' అనే సుప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ' (''నేను హిందువు నెట్లయిత'') పుస్తకాన్ని ఈ మిలీనియంలో దళిత బహుజన దృక్పథంతో వెలువడిన ఐదు అత్యుత్తమ రచనల్లో ఒకటిగా ప్రకటించింది. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సుప్రసిద్ధ రచన ''కుల నిర్మూలన'' సరసన నా పుస్తకం చోటు సంపాదించుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

అంతేకాకుండా ఈ పుస్తకం అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయింది. ఒక విధంగా హిందూత్వ శక్తులు (బిజెపి, నేషనల్‌ డెమోక్రాటిక్‌ అ లయెన్స్‌) దేశాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం దళితుల, బహుజన కార్యకర్తల చేతుల్లో ఒక ఆయుధంగా మారింది.

ఈ పుస్తకం వల్లనే ఈ మధ్య భారత దేశంలోని ప్రధాన స్రవంతి పత్రికల్లో కొన్ని ముఖ్యమైన, సిద్ధాంతపరమైన వ్యాసాలు రాసేందుకు నాకు అవకాశం లభించింది. భారతీయులకు పనికొచ్చే సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రత్యామ్నాయాలను అర్థం చేసుకునేందుకు నేను విదేశాలలో కూడా పర్యటించగలిగాను.

ఈక్రమంలోనే నేను మరో రెండు పుస్తకాలను - ''గాడ్‌ యాజ్‌ ఎ పొలిటికల్‌ ఫిలాసఫర్‌; బుద్ధాస్‌ ఛాలెంజ్‌ టు బ్రాహ్మణిజం'' (దీనిని 'దేవుడి రాజకీయ తత్వం - బ్రాహ్మణత్వం పై బుద్ధుడి తిరుగుబాటు' అనే పేరుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వ తెలుగులో వెలువరించింది), ''బఫెల్లో నేషనలిజం: ఎ క్రిటిక్‌ ఆఫ్‌ స్పిరిట్యువల్‌ ఫాసిజం'' రాశాను. వాటిని కూడా ''వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ''ని ప్రచురించిన 'సామ్య' వారే ప్రచురించారు.

ఆధునిక కాలంలోని హిందూ మతంపై నేను చేసిన విమర్శకు మూలాలు ప్రాచీన కాలంనాటి బౌద్ధ పోరాటంలోనే వున్నాయి. నేనేమీ హిందూమతాన్ని విమర్శ కోసమని విమర్శించడంలేదు. హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వానికి ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నాను. ''నేను హిందువు నెట్లయిత?''లో దళితీకరణను ఒక ఆదర్శ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన నేను ఆతరువాత అసలు హిందూ బ్రాహ్మణీయ శక్తుల 'ఆవు మార్కు' జాతీయవాదం స్థానంలో 'బర్రె మార్కు' జాతీయవాదంను ముందుకు తెచ్చే స్థాయికి చేరుకున్నాను.

ఇట్లాంటి పుస్తకం రాస్తున్నప్పుడు నేను సైద్ధాంతికంగా, భౌతికంగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసివచ్చిందో ఈ చివరి మాట కొంతవరకు వివరిస్తుంది. అదేవిధంగా నేను రచనా వ్యాసంగాన్ని ఓ 'ఆలోచనలను సంస్కరించుకునే ప్రక్రియ'గా ఎంచుకున్న వైనాన్ని కూడా ఇది వివరిస్తుంది.

భారతదేశం అనేక సంస్కృతులకు నెలవు కావడం, సామాజిక సాంస్కృతిక విప్లవాలూ, దళితబహుజన, మహిళా పోరాటాలు అనేకం జరుగుతుండటం వల్ల నా పని ఒకింత సులువయింది. అయితే, భారత దేశంలో ఆలోచనా సంస్కరణ నిమిత్తం ప్రచారం సాగిస్తున్న సమయంలో నేను ఎన్నో దాడులనూ, దూషణలనూ ఎదుర్కొన్నాను. కాగా అటు బ్రాహ్మణీయ శత్రువుల దాడులు, ఇటు శ్రేయోభిలాషుల పొగడ్తలు నన్ను భయపెట్టనూలేదు, సంతృప్తిపరచనూలేదు. నేను ''సంతృప్తిచెందిన మనిషి కంటే అసంతృప్తితోవున్న పంది మేలు'' అన్న లోకోక్తిని నమ్ముతాను. ముఖ్యంగా నా శరీరం మీద కంటే మనసు మీద జరిగిన దాడులు నా కృషిని మరింత పట్టుదలగా కొనసాగించాలనే దీక్షను పెంచాయి.

సిద్ధాంత రచన చేసే హక్కు నిరాకరించబడ్డ వాళ్ళు ఇవాళ తమ చరిత్రనీ, ఇతర్ల చరిత్రనీ కూడా రాసేస్తున్నారు. దానిని వారు తమ సాంఘిక-రాజకీయ ఉద్యమంగా చేసుకుంటున్నారు. ఈ రాసే ఉద్యమానికి కొన్ని పరిమితులు వున్నప్పటికీ, రాసే హక్కులేని వాళ్ల సంకెళ్లను అది ఛేదించింది. బలహీనుల చేతుల్లో రచన ఒక ఆయుధంగా మారింది. కులతత్వ సమాజంలో బ్రాహ్మణీయ శక్తులు దళిత బహుజనులను రాయకుండా అడ్డుకుని వారి అసంఖ్యాక భౌతిక పోరాటాలు మరుగునపడిపోయేట్టు చేశాయి. చారిత్రక పోరాటాలు కనుమరుగైపోతే స్వేచ్ఛా పిపాస రాజుకోవడం సాధ్యపడదు. తీవ్రమైన ప్రతిఘటనల మధ్య రాయడమనే ప్రక్రియను కొనసాగించడం చాలా కష్టం. అయినప్పటికీ అది నిర్విరామంగా కొనసాగితీరాలి. ఒక హిందువు కాని భారతీయుడిగా నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

వేధింపులు

మండల్‌ ఉద్యమం జరిగి, బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై ఇప్పటికే దశాబ్దం దాటింది. ఈ రెండు ప్రధాన ఘటనల నేపథ్యంలోనే నేను ''వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ?'' (నేను హిందువు నెట్లయిత?) పుస్తకాన్ని రాశాను. ఈ దేశంలో హిందువులు, అధికసంఖ్యాక వర్గాలు అనే వాదాన్ని తిప్పి కొట్టడానికే నేను దీన్ని రాశాను. సూద్రుల హిందూ మూలాల వాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించిన మొట్టమొదటి వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తిని నేనే. అది నా పుస్తకం శీర్షికలోనే ప్రస్ఫుటమవుతుంది.

మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌ సూద్ర కోణం నుంచే హిందూమతం పై విమర్శలు చేశారు. కానీ వారు 'సూద్రులు పుట్టుకతోనే హిందువులన్న' సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. దారుణమైన అంటరానితనపు అణచివేతకు గురవుతూ వచ్చిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను'' అని ప్రకటించాడు. హిందూ మతం తాలూకు బ్రాహ్మణీయ నిర్వచనాన్ని అంబేడ్కర్‌ ఆమోదించాడు. తత్సంబంధ కులం, హిందూమతం సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఆయన దానిపై విమర్శ చేశారు. హిందూ సిద్ధాంత గ్రంథాల ప్రాతిపదికతోనే ఆయన కులాన్నీ, హిందూ మతాన్నీ విశ్లేషించాడు.

హిందూ మత నియంతృత్వ స్వభావాన్ని పరిశీలించేందుకు నేను విభిన్న మార్గాన్ని అనుసరించాను. దళితబహుజన ప్రజానీకపు రోజువారీ జీవిత విధానాన్ని లోతుగా పరిశీలిస్తే వారి హిందువేతరత్వానికి కావలసినన్ని ఆధారాలు లభిస్తాయి. బాపన, కోమటి, క్షత్రియ కులాలవారితో దళితబహుజనులకు ఎలాంటి పోలిక లేదని నిరూపించేందుకు నేను ఈ పుస్తకంలో హిందూమతాన్ని ఒక జీవిత విధానంగా, ఒక మతంగా రెండు విధాలా పరిశీలించాను. మానవ జీవితాన్ని నిర్దేశించే సాంప్రదాయక ఆచారవ్యవహారాల్లో, సంస్కృతుల్లో దళితబహుజనులకూ బ్రాహ్మణీయ శక్తులకూ మధ్య ఎన్నో స్పష్టమైన తేడాలు మనకు కనిపిస్తాయి.

ప్రస్తుతం నేనొక హిందువును కాని భారతీయుడిని. నా సూద్ర వ్యక్తిత్వాన్ని, సూద్ర చైతన్యాన్ని బ్రాహ్మణీయ శక్తులు అసహ్యించుకుంటాయి. ఆవిధమైన చైతన్యానికి చారిత్రకంగా హిందూమత పునాదులను పెకలించే సామర్థ్యం వుందని వారికి తెలుసు. దళిత మేధావుల్లో ఒక వర్గం నా వాదనని కొంత అనుమానంగా చూస్తుంటే, మరొక వర్గం ఇది దళిత-వెనుకబడిన వర్గాల (ఓబీసీ) చారిత్రక ఐక్యతకు దోహదం చేస్తుందని ఆశిస్తోంది. వెనుకబడిన తరగతులలో (ఓబీసీ), సూద్ర అగ్రకులలో (వీరిని నా పుస్తకంలో నయా క్షత్రియులు అని అభివర్ణించాను) కుల, మత తాత్విక చర్చలలో పాల్గొనగలిగే మేధోవర్గం చాలా తక్కువ. వారు ఈ పుస్తకాన్ని పూర్తిగా స్వీకరించనూలేరు, గట్టిగా వ్యతిరేకించనూ లేరు. వారిలో విద్యావంతులు ఎక్కువగా అధికారం మీదా, సంపాదన మీదా దృష్టిని కేంద్రీకరిస్తారు. వారికి ఈ చర్చ గురించే పట్టింపులేదు. ఈ పరిస్థితుల్లో వారికి అత్యున్నత అధికారంలో గానీ గుత్తాధిపత్య పెట్టుబడిలో గానీ తమ వంతు వాటా లభించదు. వాళ్ల ఆలోచనలు బ్రాహ్మణీయ సిద్ధాంతాల ప్రభావంతో మసకబారిపోయి వున్నాయి.

నా ఉద్దేశం ప్రకారం ఆధ్యాత్మిక వాస్తవికత, నిత్య జీవన విధానం ఈ రెండు పోరాటాల్లో విజయం సాధిస్తేతప్ప వారి లక్ష్యం నెరవేరదు. మొద్దుబారిన మనసు ఈ వాస్తవాన్ని లేదా ఇందులో దాగివున్న నిజాన్ని గుర్తించలేదు. ఇ.హెచ్‌.కార్‌ ''వాట్‌ ఈజ్‌ హిస్టరీ'' అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో ఇలా అంటాడు : 'చారిత్రక వాస్తవం అనేది ఒక తిత్తి లాంటిది దానిని మనం సిద్ధాంతంతో నింపివేయాలి'. భారతీయ జ్ఞాన తిత్తుల నన్నింటినీ దళితబహుజన ఉత్పత్తితత్వంతో నింపాల్సిన అవసరం వుంది. ఉత్పత్తి వ్యతిరేక బ్రాహ్మణిజం తిరుగులేని పెత్తనాన్ని చెలాయిస్తున్న దేశంలో ఉత్పత్తితత్వం గురించీ, సామాజిక- సైద్ధాంతిక సమానత్వం గురించీ ప్రచారం చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.


హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న క్రమంలో నాకు హిందూత్వ బ్రాహ్మణీయ శక్తుల నుంచి అనేక విద్వేషపూరిత బెదిరింపులు వచ్చాయి. సుప్రసిద్ధ వార్తా పత్రికలలో ఆధ్యాత్మిక నియంతృత్వం- దళితబహుజనులపై దాని ప్రభావం గురించి నేను రాసిన రచనలకు ప్రతిస్పందనగా ఆ శక్తుల నుంచి భారతీయ మీడియాలో తిట్లూ శాపనార్థాలతో కూడిన లేఖలు అనేకం వచ్చాయి. ముఖ్యంగా గుజరాత్‌ జాతిహత్యాకాండ గురించి రాసిన ''అయోధ్య: వాట్‌ స్టేక్స్‌ డూ ఓబీసీస్‌ హావ్‌?'' (హిందూ 18 మార్చి 2002) తర్వాత హిందూ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ అందింది. దానిని వాళ్లు నాకు పంపారు. ఊరూపేరూ లేని ఆ లేఖలో నీచమైన తిట్లతో పాటు - ''ఇష్టమొచ్చిన చెత్త ఏం రాసినా నాకేం కాదని అనుకుంటున్నావేమో - ఈ రాతలను ఇట్లాగే కొనసాగిస్తే నీ తలకాయ హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలో వేలాడదీస్తాం జాగ్రత్త'' అన్న బెదిరింపు వుంది.

హిందుత్వ శిబిరం, బాపన, కోమటి సంస్థలు నా ఆలోచనా విధానంమీదా, నా రచనలమీదా విరుచుకుపడుతూ బహిరంగంగానూ, అంతర్గతంగానూ అనేక లేఖలు రాసి తమ ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని చాటుకున్నాయి. నన్ను ఉద్యోగంలోంచి తొలగించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యానికి వారు ఎన్నో లేఖలు రాశారు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సి.రెడ్డి తన రిజిస్ట్రార్‌ ద్వారా నాపై రచనలు చేయడం ఆపివేయమంటూ ఒత్తిడి తెచ్చిన వైనాన్ని ''బఫెల్లో నేషనలిజం'' అనే నా పుస్తకం ముందుమాటలో ప్రస్తావించాను. అట్లాంటి ప్రతి సందర్భంలో నేను గట్టిగా నిలబడ్డాను. నా రచనా వ్యాసంగాన్ని మరింత పట్టుదలగా కొనసాగించాలని తీర్మానించుకున్నాను. అంతకంతకూ దాడులూ, బెదిరింపులూ ఎక్కువవడంతో అనేకమంది దళితబహుజన యువకులు ముందుకొచ్చి నాకు అండగా నిలబడ్డారు.

బ్రాహ్మణిజం ఆధ్యాత్మిక నియంతృత్వ కట్టడాల సముదాయాన్ని ఎంత పకడ్బందీగా నిర్మించుకుందంటే ఇప్పుడది స్వయంగా కావాలని కోరుకున్నా అందులోంచి బయటపడం సాధ్యం కాదు. హిందుత్వ బ్రాహ్మణీయ శక్తులు ఎందుకు భయపడుతున్నాయంటే - దళితులకు ఆధ్యాత్మిక విముక్తికి సంబంధించినంతవరకు తమంటూ ఒక స్పష్టమైన ఎజెండా ఎలాగూ వుంది (వారిలో చాలామంది క్రైస్తవ మతంలోకో, బౌద్ధ మతంలోకో మారిపోతున్నారు); మరి తమ హిందూత్వ వ్యవస్థకు భౌతిక శక్తిగా వున్న వెనుకబడిన వర్గాల వారు (ఓబీసీలు) కూడా తమ ఆధ్యాత్మిక విముక్తి మార్గాన్ని రూపొందించుకుని వెళ్లిపోతే బ్రాహ్మణిజం, హిందూమతం కాస్తా పేకమేడలా కుప్పకూలిపోతుంది.

సిద్ధాంత గ్రంధాల రచనా ప్రక్రియ ఎక్కడ తమ ఆధిపత్యానికి తూట్లు పొడుస్తుందోనన్నది వారి భయం. అది నిజం కూడా. ఎందుకంటే ఈ రచనలు వారి చారిత్రక దుర్మార్గాలను ఎండగడ్తాయి. అందుకే వారి నిరాశా నిస్పృహలు అంతకంతకూ ఎక్కువగా బయటపడుతున్నాయి. సమానత్వ సిద్ధాంతం అంటే బ్రాహ్మణిజానికి ఎప్పుడూ గుండెల్లో దడగానే వుంటుంది. ఎందుకంటే వారిది అసమానత్వ సిద్ధాంతం.

ఈ అసమానతలు దైవనిర్ణయమని వారి వేద గ్రంథాలు ఉద్ఘోషించాయి. వాళ్లు తమ దేవుణ్ని తమ రూపంలో ప్రతిష్ఠించుకున్నారు. అందుకే దేవుడి శరీరం కుల వ్యవస్థకు మూలాధారంగా మారింది. వారి దేవుడు ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాడు. ఆయుధాలను ఉపయోగించి కింది కులాల వాళ్లను చంపడమే వారి దేవుడి పవిత్ర కార్యక్రమంగా మారింది.

హిందూ బ్రాహ్మణీయ దేవుడు విశ్వజనీన దేవుడికి భిన్నంగా వుంటాడు. విశ్వజనీన దేవుడు ప్రయోజనకారుడు. కాయకష్టం చేసే ప్రజానీకం వర్ణం, కులం, జాతి, స్త్రీపురుష వివక్షలేకుండా అంతా ఆ దేవుడిని తమ వాడిగా స్వీకరిస్తారు. దేవుడు హంతకుడు కాదు. ఆయనొక సంస్కర్త. వ్యక్తులనూ, సామాజిక వర్గాలనూ, జాతులనూ వారి నేరాలతో, ప్రవర్తనతో, వైఖరులతో నిమిత్తంలేకుండా సంస్కరించడమే ఆయన విధి. కానీ హిందూ దేవుళ్లంతా ఈ విశ్వజనీన దైవ సిద్ధాంతానికి, ఆ ప్రయోజనాలకూ పక్కా వ్యతిరేకులు. వారు ఈ అమానవీయ దేవుడిని సృష్టించడం వల్ల సమాజానికి తీరని నష్టం వాటిల్లింది. ఆ దేవుడిని బ్రాహ్మణీయ రూపంలో సృష్టించినమాట నిజం. ఏ ఉత్పత్తిపనులూ చేయని బ్రాహ్మణుల ఉనికినీ, పెత్తనాన్నీ కాపాడడానికి అట్లాంటి దేవుడి సృష్టి తప్పనిసరి అయింది.

దళితబహుజనుల భావనలోని దేవుడికీ, బాపనవర్గాల భావనలోని దేవుడికీ మధ్య వున్న తాత్విక తేడాని నేను ఈ పుస్తకంలో వివరించాను. అంతర్జాతీయంగా విస్తరించిన క్రైస్తవం, ఇస్లాం వంటి మతాల్లో మాదిరిగా దేవుడిని ప్రతిష్టించుకోలేకపోయినప్పటికీ దళిత బహుజనులకు దేవుడు తమ ఉనికిలో ఒక అంతర్భాగం. ఏసుక్రీస్తు, మహమ్మదు ఇరువురూ మూఢనమ్మకాలలో కూరుకుపోతున్న ఆనాటి తమ సమాజాలను ఉద్ధరించారు.

భారతదేశంలోని దళితబహుజన ప్రజానీకం మాత్రం ఆధ్యాత్మిక వాస్తవికత విషయంలో అన్ని ఆధునిక సమాజాలలోని సానుకూల అంశాలను పాటిస్తూనే విగ్రహారాధన స్థాయిలో ఆగిపోయారు. మానవీయ లక్ష్యం కలిగిన దేవుడిని అంటే మనుషులను ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని దళితబహుజన దేవుడిని పరిశోధించాల్సిన అవసరం వుంది. ఆ పరిశోధనలో భాగంగానే 'నేను హిందువు నెట్లయిత?' రాయడం జరిగింది. ఆధ్యాత్మిక సమానత సాధించటం కేవలం ఆధ్యాత్మిక చర్య ద్వారా మాత్రమే సాధ్యం కాదు. దానికి ఒక రాజకీయ చర్య కూడా కావాలి. ఆధ్యాత్మిక, రాజకీయ సంస్థల మధ్య చాలా దగ్గరి సంబంధాలు వున్నాయి. అవి పరస్పరం పెనవేసుకుపోయాయి కూడా. ఆ సంబంధం జీవితంలోని అన్ని రంగాలకూ విస్తరిస్తుంది.

నా రచనలు, ప్రత్యేకించి ''నేను హిందువు నెట్లయిత?'' పుస్తకం సూద్ర/ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల) జీవనవిధానాన్ని వారి పరిభాష, పలుకుబడుల్లోనే విశ్లేషిస్తాయి. బ్రాహ్మణీయ సంస్కృతి, నాగరికత, చరిత్ర సారాన్ని నేను నిలదీస్తున్నాను కాబట్టి బాపన శక్తులు తప్పనిసరిగా నా రచనలపై విరుచుకుపడతాయి.

నేనివాళ రాస్తున్నది గేదెల/బర్రెల చరిత్ర. కానీ ఇన్నాళ్లూ అన్ని రకాల బ్రాహ్మణిజాలూ రాస్తూ వచ్చింది కేవలం ఈ దేశ ఆవుల చరిత్ర. నిజానికి ఆవు ఇచ్చే పాలు చాలా తక్కువ. ఆవు మహా పవిత్రమైనది అని కొందరు వాదిస్తే మరి కొందరు ఆ వాదనను వ్యతిరేకిస్తారు. ఆవు లౌకిక (సెక్యులర్‌) జంతువు అని కొందరంటే, కాదు సామాజిక జంతువని మరికొందరంటారు. అయితే ఎవరూ కూడా బర్రెల గురించి మాట్లాడరు.

విచిత్రం ఏమంటే వీళ్లంతా ఈ వినాశకర వాదోపవాదాలు చేసేటప్పుడు తాగే కాఫీ టీలు, పెరుగూ మజ్జిగా (సల్ల) అన్నీ కూడా కచ్చితంగా కేవలం బర్రెపాలతోనే తయారైవుంటాయి. కాబట్టి నా ముందూ, దళితబహుజన మేధావుల ముందూ వున్న పెద్ద సవాలు ఈ చర్చలో బర్రెను కేంద్రబిందువుగా చేయడం ఎలా అన్నదే. బర్రె ఎలాగైతే హిందువు కాదో నేనూ అంతే. అట్లాగే నేను ఎట్లాగైతే భారతీయుడినో బర్రె కూడా భారతీయ జంతువే. చారిత్రకంగా ఆలోచిస్తే ఆవు భారతీయత అనుమానాస్పదంగా వుంటుంది కదా? అట్లాగే బాపన శక్తుల దేశభక్తి కూడా నిజంగా అనుమానాస్పదమైనదే కదా?

ఆధ్యాత్మిక నియంతృత్వం

ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో హిందూమతం ఒకటి. ఆ నాలుగు ప్రధాన మతాల్లో అతి తక్కువ సంఖ్య కలిగిన మతం కూడా హిందూ మతమే. ఈ మతం విస్తరించిన భౌగోళిక ప్రాంతం కూడా చాలా తక్కువ. హిందూ మతం అతి ప్రాచీనమైనదని బాపన రచయితలు ఎంతగానో ఘోషిస్తుంటారు. కానీ ఇటీవలి మత దృక్పథం ప్రకారం చూస్తే మాత్రం హిందూమతం నిన్నమొన్నటిదే.

''హిందూ'' అన్న పదాన్ని మత దృష్టితో మొట్టమొదటగా వాడిన వాడు 'అ ల్‌్‌ బెరూనీ'. ఆయన రాసిన పుస్తకం శీర్షిక ''అల్‌ హింద్‌''. హిందూమతం అన్న భావనకు మొట్టమొదటగా ప్రాతిపదికను కూర్చింది ఆ పుస్తకమే అనిపిస్తుంది. అ ల్‌ బెరూనీ భారతదేశంలోని ముస్లిమేతరుల్ని సంబోధించేందుకు 'హింద్‌' అనే పదాన్ని వాడారు తప్ప 'హిందువు' అన్న పదాన్ని కాదు. ఆవిధంగా హిందూమత నిర్మాణానికి హిందువు కాకుండా ఒక ముస్లిం మేధావి మొట్టమొదటగా ప్రయత్నించాడు. ఆయన 'హింద్‌' అనే పదాన్ని మత దృష్టితోనే వినియోగించినట్టు అనిపిస్తుంది.

భారతదేశంలోని ముస్లిమేతర జనాభాలో జరిగిన ఈ చర్చలో అనేకమంది ముస్లిం మేధావులు భౌగోళిక దృష్టితో ఈ ప్రాంత ప్రజల్ని హింద్‌ అనే సంబోధించారు. వాళ్లు నివసించే ప్రాంతాన్ని హిందూస్థాన్‌ అన్నారు. అయితే 'హిందుస్థాన్‌' అన్న పదం వాడుకలోకి వచ్చింది 'సింధుస్థాన్‌' అన్న పదంలోంచి. అంటే సింధూనదీ పరీవాహక ప్రాంతమన్నమాట. అ ల్‌ బెరూనీ వాడిన 'హింద్‌' అన్న పదం కూడా కచ్చితంగా 'సింధ్‌' లాగే వుంటుంది.

వలసవాద కాలంలో ప్రాచ్య మేధోవర్గం క్రైస్తవులను ఏవిధంగానైతే ఒక మతంగా పరిగణించిందో అదేవిధంగా భారతదేశంలోని ముస్లిమేతరుల నందరినీ అది హింమతస్తులుగా పరిగణించింది. క్రైస్తవ మతంలో పుస్తకం చదివే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించారు.
అంటరానితనం, ఒక మనిషిని ముట్టుకోకూడదన్న భావన వారిలో లేదు. అయితే పైకి కనిపించే శరీర రంగులోని తేడాపై ఆధారపడిన జాతి విభజన మాత్రం వారిలో వుంది.

పాశ్చాత్య మేధావులు అల్‌ బెరూనీ వంటి ముస్లిం విద్యావేత్తల రచనల నుంచి భాషను అరువు తెచ్చుకున్నారు. హెగెల్‌ తన సుప్రసిద్ధ గ్రంధం ''ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ'' లో వివిధ దేశాలలో సాగిన నాగరికతా ప్రక్రియను సమీక్షించాడు. ఆయన భారతీయ నాగరికత సొంత స్ఫూర్తితో, సొంత చరిత్రపై ఆధారపడి ఏర్పడింది కాదన్నాడు. ఈ దేశంలో ప్రతీదీ - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, సింధూ తదితర నదులూ, జంతువులూ పూలూ అన్నీ కూడా వాళ్లకు దేవుళ్లు కావడమే అందుకు కారణం అన్నాడు. కుల వ్యవస్థ వల్లనే భారతీయుల 'ఆత్మ' ఎదగలేకపోయిందని హెగెల్‌కు తెలుసు. అయితే, భారతదేశంలో అంటరానితనం వుందని ఆయనకు కచ్చితంగా తెలుసోలేదో చెప్పలేం. ఆయన అన్ని కులాలనూ ఒకేగాటనకట్టి హిందువులుగా పరిగణించాడు. అందుకే ఆయన ''ప్రతి ఒక్క హిందువుకూ నిర్దిష్టమైన వృత్తి కేటాయించబడి వుంటుంది'' అన్నాడు.

హిందూ మతం - బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం మతాల మాదిరిగా సొంతగా ఒక విశ్వజనీన ఆత్మను రూపొందించుకొని ఎదగలేకపోయింది. అట్లాగే భారతదేశాన్ని ఒక చారిత్రక జాతిగా అది ఎదగనివ్వలేదు. ఎందుకంటే హిందూమతం పౌర సమాజ పునాదినుంచే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రతిష్టించుకుంది. కానీ, మిగతా మూడు మతాలూ పౌర సమాజం అట్టడుగునుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. అందువల్లే వాటికి తమదంటూ ప్రత్యేకమైన చారిత్రకత ఏర్పడింది. హిందూ మతం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాపనోళ్లకు, కోమట్లకు, క్షత్రియులకు కట్టబెట్టింది. 'బ్రహ్మదేవుని అరికాలి నుంచి పుట్టుకొచ్చిన' సూద్రులను/ఇతర వెనుకబడిన తరగతులవారిని అది తాత్వికంగా పూర్తిగా ఉపేక్షించింది, అణిచివేసింది. … “



నేను హిందువు నెట్లయిత?
హిందూ తత్త్వం, సంస్కృతీ, రాజకీయ అర్థ శాస్త్రం పై సూద్ర విమర్శ
రచన : కంచ ఐలయ్య

English Original: Why I Am Not A Hindu?
Kancha Ilaiah
SAGE Publications
www.sagepublications.com

తెలుగు అనువాదం : ఎ సురేంద్ర రాజు
కొత్త అధ్యాయం అనువాదం : ప్రభాకర్ మందార
పేజీలు : 155
వెల: రూ. 55

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

Saturday, July 4, 2009

ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు - డి. ఎన్‌ ఝా ...పారడాక్స్ అఫ్ ది కౌ ....



ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి. ఎన్‌ ఝా ...


మన దేశంలో ఆహారపు అ లవాట్లు ఎప్పుడూ ఒకేలా లేవు. కాలమాన పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి మారుతూ వచ్చాయి.
ఇప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన ఆహారపు అ లవాట్లు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు ''జలపుష్పాలు''గా పరిగణిస్తారు. అంటే వాళ్ల దృష్టిలో చేపలంటే ఒకరకం సముద్రపు ఆకుకూర లాంటివన్నమాట. అయితే వాళ్లు కూడా ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్‌లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు. అదేవిధంగా మనదేశంలో చాలా చోట్ల శాఖాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.

ఈ నాడు ఆవు హిందువుల మత చిహ్నంగా మారిపోయింది. పరమ పవిత్రమైన జంతువుగా పూజలందుకుంటోంది. కానీ వేదకాలంలో, ఆతరువాత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాల్లో అంత పవిత్రమైనదిగా చూడబడలేదని, ఆకాలంలో ఇతర జంతువులలాగే ఆవులను యజ్ఞ యాగాల్లో బలియిచ్చేవారని, బ్రాహ్మణులు సైతం గోమాంసాన్ని ఆరగించేవారనీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా సోదాహరణంగా వివరిస్తారు ప్రొఫెసర్‌ డి.ఎన్‌.ఝా.

గోసంరక్షణ ఆహ్వానించదగ్గదే ఆయినా అది శాస్త్రీయ పద్ధతిలో, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరగాలి తప్ప పరమత ద్వేషంతోనో, మూఢనమ్మకాలతోనో కాదనీ, ఒక్క ఆవునే ఎందుకు మిగతా జంతువులను మాత్రం ఎందుకు రక్షించకూడదు అంటారాయన. ఆయన రాసిన Paradox of the Cow: Attitudes to Beef Eating in Early India పరిశోధనా గ్రంథం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే చరిత్రను నిష్పాక్షికంగా పరిశోధించాలనే తప్ప ఇందులో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటారాయన.

స్వయంగా శాఖాహారి అయిన ప్రొఫెసర్‌ ద్విజేంద్ర నారాయణ్‌ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు. ఆయన సుదీర్ఘ పరిశోధనా పత్రంలోని కొంత భాగాన్ని ఈ చిరుపుస్తకంగా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులోంచి కొన్ని వ్యాఖ్యలు:

...గోమాంసం తినే అ లవాటు భారతదేశానికి విదేశాల నుంచి వలస వచ్చినవాళ్ల ద్వారా ముఖ్యంగా ముస్లింల ద్వారా మన దేశానికి సంక్రమించిందనీ, గోమాంస భక్షణని వాళ్లే మనదేశంలో ప్రవేశపెట్టారనీ కొందరు నమ్ముతారు. కానీ యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది.

...పాకిస్థాన్‌లోని షిన్‌ తెగకు చెందిన ముస్లింలు ఇతర ముస్లింల మాదిరిగా పంది పట్ల ఎంత ఏహ్య వైఖరి కనబరుస్తారో ఆవు పట్ల కూడా అంతే ఏహ్య వైఖరి కనబరుస్తారు. వాళ్లు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు.

...ప్రాచీన కాలపు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన ఆచారంగా వుండేది.

...వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. ''తైత్తరేయ బ్రాహ్మణం''లో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్‌ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ''సుతపథ బ్రాహ్మణం''లో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది.

...ఋగ్వేద కాలంలో చనిపోయిన వ్యక్తి శవాన్ని కప్పేందుకు దళసరి ఆవు కొవ్వును ఉపయోగించేవారు. ఆ వ్యక్తి పరలోక యాత్రకు వాహనంగా ఉపయోగపడేందుకని శవంతో పాటు ఒక ఎద్దును కూడా దహనం చేసేవారు. ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48)

...మహా భారతంలోని అత్యధిక పాత్రలు మాంసాహారం తినేవే. రంతిదేవుని కథ ఇందుకు పరాకాష్ట. ప్రతిరోజూ ఆయన వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు. రామాయణంలో ఆవుతో సహా వివిధ జంతువులను బలియివ్వడం, తిండి కోసం వధించడం గురించి వాల్మీకి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.

... యమునా నదిని దాటేటప్పుడు సీత ''రాముడు తన ప్రతిజ్ఞా పాలన పూర్తిచేసిన తరువాత 1000 ఆవులతో , 100 పీపాల మద్యంతో నిన్ను కొలుస్తాను తల్లీ'' అని మొక్కడం గమనించవచ్చు.

... సీతకు దుప్పి మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే రాముడు లేడి రూపంలో వున్న మారీచుణ్ని వెంటాడి వేటాడి చంపుతాడు. అట్లాగే భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని ఆహ్వానించిన వైనం కూడా రామాయణంలో కనిపిస్తుంది.

... గౌతమ బుద్ధుడు, మహావీరుడు అహింసా సిదాంతాన్ని ప్రచారం చేశారు. వైదిక కాలపు జంతుబలిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే బుద్ధుడు మాంసాహారాన్ని తినకూడదని చెప్పలేదు. బౌద్ధ మతస్థులకు మాంసాహారం ఆమోదయోగ్యమనేందుకు గ్రంథస్త ఆధారాలు అనేకం వున్నాయి.

... మధ్యయుగపు తొలి రోజుల నుంచే గోవధ, గోమాంస భక్షణ పాపకార్యంగా చూడబడుతోంది.

...హిందూ గో సంరక్షణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ రాజకీయ జన సమీకరణకు ఆవు ఒక సాధనంగా మారింది. 1882లో మొట్టమొదటి గోరక్షిణి సభ ను స్థాపించి స్వామీ దయానంద సరస్వతి అశేష జన బాహుళ్యాన్ని సంఘటిత పరిచేందుకు ఆవును మరింత బలమైన ప్రతీకగా తీర్చిదిద్దాడు. 1880లలో, 1890లలో ముస్లింల గోవధను ఎదిరించడం, తత్ఫలితంగా మతకలహాలు చెలరేగడం అనేక సార్లు జరిగింది. 1966లో జాతీయ స్థాయిలో గోవధను నిషేధించాలన్న డిమాండుతో అన్ని మతతత్వ పార్టీలు పార్లమెంటు ముందు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. 1979లో ఆచార్య వినోభా భావే దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అస్పష్ట హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించుకున్నారు.

ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి.ఎన్‌. ఝా
ఆంగ్ల మూలం: Paradox of the Cow : Attitudes to Beef Eating in Early India, D.N.Jha

తెలుగు అనువాదం : రవి
ప్రచురణ కర్తలు: హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌
ప్రథమ ముద్రణ: 2002
16 పేజీలు, వెల : రూ.4


.............

Thursday, May 14, 2009

హిందూ మతతత్వ సంస్థల అసలు స్వరూపాన్నీ, ముస్లింల గురించి ప్రచార మవుతున్న అపోహలనూ వివరిస్తుంది ఈ పుస్తకం...



మతతత్వ రాజకీయాలు
రామ్‌ పునియానీ
తెలుగు అనువాదం : కాత్యయని ..


భారతదేశంలో ప్రధాన స్రవంతి రాజకీయాలన్నీ
జాతి, మతాల పునాదుల మీద ఏర్పడి వున్నాయనీ -
స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలు అనే ప్రజాస్వామ్య విలువలనూ, సామాజిక న్యాయాన్నీ
అథోగతిలోకి నెడుతున్నాయనీ మనకు తెలుసు.

1886లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం అనంతరం భారతదేశంలో మతతత్వ రాజకీయాలు (హిందూ, ముస్లిం) మొదటిసారిగా రంగం మీదకు వచ్చాయి.
రాజులూ, నవాబులూ, జమీందార్లూ, జాగీర్దార్లూ ఏకమై
బ్రిటీష్‌ పాలకులకు అనుకూలంగా పనిచేసే యునైటెడ్‌ ఇండియన్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ను స్థాపించారు.

దానినుండి కొన్నాళ్ల తరువాత పరస్పర వ్యతిరేకమైన రెండు మతతత్వ సంస్థలు ఆవిర్భవించాయి.
ఒకటి ఇస్లాం మత ప్రాతిపదిక వుండే ముస్లిం లీగ్‌ ..
రెండు హిందూ మత పునాదిపై ఏర్పడిన హిందూ మహా సభ , ఆర్‌ఎస్‌ఎస్‌.
... ... ...

బాబ్రీ మసీదు విధ్వంస చర్య భారత సమాజంలో ఒక ప్రధానమైన మలుపు.
ఆరోజును హిందూ మతోన్మాదులు తమ విజయోత్సవదినంగా జరుపుకున్నారు.
ముస్లిం ఛాందసవాద, మతతత్వ శక్తుల ధోరణి షాబానో కేసు సందర్భంలో స్పష్టమయింది...
ఈ మతతత్వ శక్తులు ముస్లిం ప్రజలను తమ పట్టులోకి లాక్కోవడానికి చూస్తూ వున్నాయి.
అయితే సంఘ్‌ పరివార్‌ శక్తులు హిందూ మతతత్వ రాజకీయాల్లో సాధించిన గుణాత్మక, పరిణామాత్మక అంశాలతో పోల్చి చూసినప్పుడు, ముస్లిం మతతత్వ సంస్థలు వెనుకబడి వున్నాయని చెప్పక తప్పదు.

సంఘ్‌ పరివార్‌ కన్నా ముస్లిం మతతత్వం తక్కువ స్థాయిలోనే వున్నప్పటికీ రెండింటి మీదా సమానంగానే వ్యతిరేకత ప్రకటించాల్సిన అవసరముంది.
... ... ...

దేశంలో ముస్లిం ప్రజానీకం మీద జరుగుతున్న హింస గుజరాత్‌ మారణకాండతో ఉన్మాద స్థితికి చేరుకున్నది.
అయినా ఇప్పటికీ హిందూ మతోన్మాద శక్తులు తమ దుర్మార్గాలకు రకరకాల సమర్థనలు వెతుకుతూనే వున్నాయి.
దేశ రక్షణ పేరిటా, జాతీయతావాదం పేరిటా ముస్లిం వ్యతిరేకతను రోజురోజుకూ ఇంకా రెచ్చగొడుతూనే వున్నాయి.

ఆ ప్రయత్నాలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో,
హిందూ మతతత్వ సంస్థల అసలు స్వరూపం ఏమిటో
రామ్‌ పునియానీ యీ పుస్తకంలో బట్టబయలు చేశారు.
ముస్లింల గురించి ప్రచార మవుతున్న అపోహలనూ, వాటికి సమాధానాలనూ
సరళమైన శైలిలో, బొమ్మలతో సహా వివరిస్తుంది ఈ పుస్తకం.
..............

మీకు తెలుసా?
1. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులెవరు?
2. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి ఎవరు?
3. శివాజీ భవనానికి ఎదురుగా వుండి, ఆయన ప్రతిరోజూ దర్శించే జగదీశ్వరాలయం ఆవరణలో ఏ కట్డడాన్ని నిర్మించాడు?

జవాబులు:
1. దౌలత్‌ ఖాన్‌, సిద్ధిమీ శ్రీ అనే ఇద్దరు ముస్లింలు!
2. మదానీ మెహ్తర్‌ ... ఈయన కూడా ముస్లిమే!
3. తన ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన మసీదును కట్టించాడు!

మీకు తెలుసా?
1. అ లహాబాద్‌ లోని సోమేశ్వరనాథ్‌ ఆలయానికి స్థలాన్నీ, నిధులనూ యిచ్చిందెవరు?
2. ఉజ్జయని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్‌, శత్రుంజయ జైన్‌ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకూ ఉదారంగా నిధులను యిచ్చిన రాజెవరు?
3. గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఏం జరిగింది?

జవాబులు:
1. ఔరంగజేబు!
2. ఔరంగజేబు!
3. ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు ఔరంగజేబు!

మీకు తెలుసా?

1. బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు ఎవరు?
2. దేవోత్పతన నాయక్‌ అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీ పాలకుడెవరు?
3. దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించిన భారతీయ గ్రంథం ఏది?

జవాబులు:
1. టిప్పు సుల్తాన్‌ !
2. కాశ్మీరు రాజు హర్ష దేవుడు !
3. కల్హణుడు రాసిన రాజతరంగిణి!

ఇట్లాంటి ఇంకా ఎన్నో విశేషాల కోసం చదవండి:

మతతత్వ రాజకీయాలు
-రామ్‌ పునియానీ

ఆంగ్ల మూలం:Communal Politics, RamPuniani, Sahamat, New Delhi,2001
తెలుగు అనువాదం : కాత్యాయని


ప్రథమ ముద్రణ: 2003
96 పేజీలు, వెల : రూ.10

...................................

Monday, May 11, 2009

ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం: మొల్ల, వేమన, పోతులూరి, ముద్దు నర్సింహం, త్రిపురనేని, జాషువా రచనలపై పరిశీలన ...



ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం
- కంచ ఐలయ్య ...


ఉత్పత్తి కులాల నుండి వచ్చిన రచయితలు దాదాపు 17వ శతాబ్దం నుండి రచనా రంగంలో ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఈ చిన్న పుస్తకం చెబుతుంది. మొల్ల నుండి గుర్రం జాషువా వరకు సూద్ర, ఓబీసీ, దళిత రచయితలు బ్రాహ్మణిజంతో తలపడేందుకు ఎటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ల కులాల ప్రత్యేకతను కాపాడుకునేందుకు , వాటిలోని అభివృద్ధి లక్షణాలను సమాజం ముందుంచేందుకు ఎటువంటి ఎత్తుగడలు వేశారు అనే అంశాలను, వారి వారసత్వాన్ని ఉత్పత్తి కులాల రచయితలకు చూపించే ప్రయత్నం చేస్తుందిది.

దళిత బహుజనుల స్పష్టమైన ముద్ర కలిగిన కావ్య సంపుటిని 16 వ శతాబ్ధంలో తొలిసారిగా మొల్ల అనే కుమ్మరి మహిళ రచించింది. అది '' మొల్ల రామాయణం '' గా ప్రసిద్ధిచెందింది. కవియిత్రి మొల్ల కాకతీయ సామ్రాజ్యవారసురాలు. ప్రస్తుత వరంగల్‌ సమీప ప్రాంతంలో ఆమె నివసించేది. కొంతమంది నెల్లు ప్రాంత వాసురాలని చెబుతారు. స్త్రీలకు అందునా సూద్ర స్త్రీలకు చదువుకునేందుకు ఎట్లాంటి అవకాశాలు లేని ఆ రోజుల్లో స్వయంగా చదువు నేర్చుకుని మొల్ల కావ్యం రాసే స్థాయికి చేరుకోవడం నిజంగా అబ్బురపరిచే విషయమే.

మొల్ల తరువాత సూద్ర కవుల్లో ప్రముఖుడు వేమన.
కాపు (రెడి)్డ కులస్థుడైన వేమన '' విశ్వదాభి రామ వినుర వేమ '' అంటూ ఆటవెలదిలో రాసిన పద్యాలు17వ శతాబ్దంలో దళిత బహుజనులను ఉర్రూతలూపాయి. సరళమైన వాడుక భాషలో చేసిన వేమన రచనలన్నీ దైవత్వ రహితంగా, లౌకికత్వాన్ని ప్రతిబింబేచివిగా, మూఢనమ్మకాలనూ మూర్ఖ ఆచారాలను చీల్చిచెండాడేవిగా వుండేవి.

పోతులూరి వీరబ్రహ్మం, సిద్దయ్యల ప్రవచనాలు, రచనలు కుల రహిత సమాజ నిర్మాణానికి నాంది పలికాయి. వడ్రంగి కులానికి చెందిన పోతులూరి మొదట్లో తన కుల వృత్తినే చేసేవాడు. దూదేకుల ముస్లిం అయిన సిద్దయ్యను తన శిష్యుడిగా చేసుకుని ఎంతో దూరదృష్టిని ప్రదర్శిచాడు. బ్రాహ్మణాధిక్యతను ఎదిరించాడు.
కాపు కులంలో జన్మించిన ముద్దు నర్సింహం (1800-1858) హితసూచిని అనే తొలి తెలుగు వచన గ్రంథాన్ని రచించారు. మానవాళి అభవృద్ధికి విద్య ఎంతో అవసరమని అది చాటి చెబుతుంది.

ఒక ధనిక “కమ్మ” కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి (1887-1943) సూద్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ, బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యంతో అనేక రచనలు చేశారు. ఆయన రచించిన శంభూక వధ నాటకం ఆరోజుల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇక గుర్రం జాషువా అయితే దళితుల ఆశాజ్యోతిగా వెలుగొందారు. కర్మ సిద్ధాంతం దళితులను కట్టి పడేసిందని అదే దళితుల కొంప ముంచిందని, దానిపై దళితులు తిరుగుబాటు చెయ్యాలని పురికొల్పారు. 'గబ్బిలం' కావ్యం ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది.

తెలుగు సాహిత్యంలో మరుగున పడ్డ మహోన్నతుల గురించి చిత్రిస్తూ తెలుగు సాహిత్య చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరాన్ని చాటి చెబుతుందీ పుస్తకం.

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తాత్వికుడిగా, రాజకీయ శాస్త్రవేత్తగా, ఉస్మానియా యునివర్సిటీలో రాజనీతి శాబస్త విభాగాధిపతిగా సుప్రసిద్ధులు. వారు '' నేను హిందువు నెట్లయిత ? '' , '' మనతత్వం '' , '' దేవుడి రాజకీయతత్వం - బ్రాహ్మణత్వంపై బుద్ధుడి తిరుగుబాటు '' వంటి పలు పుస్తకాలు రాశారు.



ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం:
మొల్ల, వేమన, పోతులూరి, ముద్దు నర్సింహం, త్రిపురనేని, జాషువా రచనలపై పరిశీలన ...

- కంచ ఐలయ్య ...


ఆంగ్ల మూలం : Telugu Nationalism: The Unknown Vision

తెలుగు అనువాదం: సఫ్దర్‌ అహ్మద్‌

40 పేజీలు, వెల: రూ.10

............................

Thursday, May 7, 2009

సత్యహరిశ్చంద్రుని కథలో స్లోపాయిజన్‌ లాంటి సందేశాలు !


పురాణాలు - కుల వ్యవస్థ
సత్య హరిశ్చంద్రుడు
-డాక్టర్‌ విజయ భారతి


హేతువాద దృష్టితో పురాణాలను పరిశీలించినట్లయితే ఎన్నో ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి.
ఇందుకు హరిశ్చంద్రుని వృత్తాంతం ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు.
పురాణాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడిన షట్చక్రవర్తులలో హరిశ్చంద్రుడు మొట్టమొదటివాడు.
త్రేతా యుగానికి చెందిన ఈ రాజు ప్రభావం మన సమాజం మీద ఇప్పటికీ బలంగా వుంది.
హరిశ్చంద్రోపాఖ్యానం, ''కాటి కాపరి'' ఏక పాత్రాభినయం ప్రేక్షకులను ఇప్పటికీ అ లరిస్తూనేవున్నాయి.

హరిశ్చంద్రుని కథ పైకి సత్యవ్రతాన్ని చాటేదిగా కనిపించినప్పటికీ దాని అసలు లక్ష్యం వర్ణ వ్యవస్థ పునాదులను పటిష్ట పరచడం, పాతివ్రత్యం పేరిట స్త్రీలను అణచివేయడం.

హరిశ్చంద్రోపాఖ్యానంలో అంతర్లీనంగా వుండే ఈ సందేశాలు స్లో పాయిజన్‌ వంటివి.

వరుణుడి కరుణతో పుత్ర సంతానాన్ని పొంది వరుణుడు పెట్టిన షరతును ఉల్లంఘించినప్పుడే హరిశ్చంద్రుని సత్యవ్రతం బట్టబయలవుతుంది.
హరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోయింది కూడా కుల దురహంకార ప్రదర్శన మూలంగానే తప్ప అన్యధా కాదు.

విశ్వామిత్రుడి పెంపుడు కూతుళ్లైన మాతంగ (మాల మాదిగ) కన్యలను పెళ్లి చేసుకొమ్మనే ఒత్తిడి వచ్చినప్పుడు హరిశ్చంద్రుడు అహంభావంతో రాజ్యాన్నైనా వదులుకుంటాను గానీ నీచ కుల కాంతలను పెళ్లాడను అని చిక్కుల్లో పడిపోతాడు.

ఆ తరువాత బాకీ తీర్చేందుకు భార్యాబిడ్డల్ని వ్యక్తిగత ఆస్తిలాగా అమ్మేస్తాడు.
నక్షత్రకుడు తనని ఓ ఛండాలుడికి అమ్మబోయినప్పుడు ఇంత బతుకు బతికి నీచ కులస్తుడికి దాస్యుడ్ని కావడమా అని ఎంతగానో గించుకుంటాడు.

ఈవిధంగా కులవ్యవస్థ వికృత రూపం, సత్యవ్రతంలోని డొల్లతనం, స్త్రీల దైన్య స్థితిగతులు పలు సందర్భాల్లో బయటపడతాయి. మార్కెండేయ పురాణం, స్కంధ పురాణం, హరిశ్చంద్రోపాఖ్యానాలను ప్రామాణికంగా చేసుకుని డాక్టర్‌ విజయభారతి గారు హరిశ్చంద్రుని కథను మరో కొత్త కోణంలో విశ్లేషిస్తున్నారు.

డాక్టర్‌ విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలే జీవిత చరిత్రలు ముఖ్యమైనవి. లోగడ వీరు రచించిన ''వ్యవస్థను కాపాడిన రాముడు'', ''పురాణాలు-కుల వ్యవస్థ: దశావతారాలు'', ''షట్చక్రవర్తులు'' పుస్తకాలను ఈ బ్లాగులో పరిచయం చేయడం జరిగింది.

పురాణాలు - కుల వ్యవస్థ
సత్య హరిశ్చంద్రుడు
-డాక్టర్‌ విజయ భారతి

38 పేజీలు, వెల: రూ.15/-


..............................

Saturday, April 25, 2009

పురాణాలకూ, కులవ్యవస్థకూ, దశావతారాలకూ మధ్య వున్న సంబంధం - డాక్టర్ విజయ భారతి గారి విశ్లేషణ


పురాణాలు - కుల వ్యవస్థ - 2
దశావతారాలు


''పరిత్రాణాయ సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగేయుగే''


'సాధువులను రక్షించి, దుష్కర్ములను నశింపజేయటానికి , ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ పుడుతున్నాను'.

భిన్న యుగాలలోని అవతార మూర్తుల కథలనూ వారి చుట్టూ అ ల్లిన భావజాలాన్నీ పరిశీలిస్తే వర్ణవ్యవస్థ విధించే ఆంక్షలను పటిష్టంగా సామాన్యుని జీవితంలో చొప్పించడానికే ఈ ప్రయత్నమంతా జరిగిందని అర్థమవుతుంది.

ధర్మసంస్థాపనం అంటే వర్ణ ధర్మ సంస్థాపనమే!

''మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహో థ వామనః
రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీ చతేదశ''


హిందూ మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు మాత్రమే చదువు నేర్చుకోవచ్చు, వేదాలను చదవవచ్చు. మళ్లీ అందులో బ్రాహ్మణులకు మాత్రమే వేదాలను బోధించే అధికారం వుంటుంది.

శూద్రుల విషయానికి వస్తే వాళ్లు వేదాలను చదవడమే కాదు. ఎవరైనా చదువుతుంటే వినడానికి కూడా వీలు లేదు. దొంగచాటుగా ఏ శూద్రుడైనా విన్నాడంటే వాడి చెవుల్లో సీసం కరిగించిపోయాలి, వాణ్ణి భౌతికంగా చంపేయాలి అంటుంది మనుధర్మం!!

ఒకసారి బ్రహ్మ నిద్రలో వేదాలను పలవరిస్తుండగా హయగ్రీవుడనే దైత్య భటుడు విన్నాడట.
విని వేదాలను నేర్చుకున్నాడు. (అప్పుడు ఏదైనా విని నేర్చుకోవడమే కదా). ఆ తర్వాత అతనికి భయం పట్టుకుంది. ఆ సంగతి తెలిస్తే సురులు (అగ్రవర్ణాల వారు) తనని ప్రాణాలతో బతకనివ్వరు. అని గజగజ వణికిపోతూ సముద్రంలో దూకి (రసాతలంలో) దాక్కున్నాడు.

……''ఇట్లు వేదంబులు దొంగిలి దొంగ రక్కసుండు మున్నీట మునింగిన వారి జయింపవలసియు మ్రానుదీగెల యందు విత్తనంబుల పొత్తరులు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియ నెల్ల కార్యంబులకు గావలియగు నా పురుషోత్తముండప్పెను రేయి చొరుదలయంచు...'' (భాగవతం)

హయగ్రీవుడు భయపడినంతా అయింది.
ఎవరో చూడనే చూశారు. చూసి
'అమ్మో... హయగ్రీవుడు వినడమే కాదు తనవాళ్లకి నేర్పించేస్తాడు.
క్రమంగా వేదాలు అసురులందరికీ (శూద్రులందరికీ) చేరతాయి.' అని బెంబేలెత్తిపోయారు.
హాహాకారాలు చేస్తూ ఆ వార్తని నారాయణుడి చెవిలో వేశారు సురులు.
అంతే. ఆయన మరి ఆలస్యం చేయకుండా మత్స్యావతారం (చేప రూపం) దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్లి హయగ్రీవుడిని సంహరించేశాడు. సంభవామి యుగేయుగే ప్రారంభం…..
ఇది “మత్స్యావతారం” కథ.

అట్లాగే “కూర్మావతారం” (తాబేలు రూపం)లో అసురులతో చేతులు కలిపి సాగర మథనం చేసి అమృతం సాధించి అసురులను వంచించి సురులే దానిని చేజిక్కించుకున్నారు. ఎంత ధర్మాత్ములో సురులు.

ఇక “వరహావతారం” (పంది రూపం)లో భూ ఆక్రమణ వ్యవహారం,.... “నృసింహావతారం” (సగం మనిషి సగం జంతువు రూపం)లో వైష్ణవాన్ని కాదన్నవారిని చీల్చిచెండాడటం ... “వామనావతారం” (మరుగుజ్జు రూపం) లో - అసురులు ఎంత మంచివారైనా, ఎంత సమర్థులైనా వారిని రాజ్యాధికారం చేయన్వికూడదు అన్న కుతంత్రం కనిపిస్తుంది.

“పరశురామావతారం” ఈ భూమి మొత్తం బ్రాహ్మణుల అధీనంలోనిదేననీ, క్షత్రియులు బ్రాహ్మల అధికారానికి లోబడి వుండాలని చాటుతుంది. “రామావతారం” క్ష్రత్రియులకూ బ్రాహ్మణులకూ మధ్య రాజీ కుదిర్చి వర్ణధర్మాన్ని పటిష్ట పరుస్తుంది. “కృష్ణావతారం” శూద్ర కులాలు విద్యా రాజకీయ రంగాలలో ఎదగటం, వారిని అణచే ప్రయత్నాలు, కర్మసిద్దాంతం ... గీతా రహస్యం.

ఇక “బుద్ధావతారం” వైదిక కర్మకాండకు వ్యతిరేకంగా ప్రబలుతున్న ఉద్యమాలను అణచలేక బుద్ధుడూ విష్ణువు అవతారమే అని ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర. కాగా ''కల్కి'' అవతారం ఇంకా అవతరించాల్సి వుంది. (ఇప్పటికే అక్కడా ఇక్కడా నేనే కల్కి అవతారాన్ని అని కొందరు చాటుకుంటున్నా వారు సర్వామోదాన్ని మాత్రం పొందలేకపోతున్నారు).

దశావతారాలు సామాజిక నియంత్రణ విధానాల అమలుకు ఉద్దేశించినవే అంటూ డా. విజయ భారతి గారు ఈ పుస్తకంలో విశ్లేషిస్తున్నారు.
………………………………………………………………………….

''జన సామాన్యాన్ని విద్యావంతులను చేయటంలో వైఫల్యానికి
ప్రాచీన ప్రపంచాన్ని మొత్తంగా తప్పుపట్టవచ్చు.
కానీ ఏ సమాజం కూడా దాని మతానికి సంబంధించిన గ్రంథాలను
ఆ సమాజంలోని ప్రజలు చదవకుండా చేసే నేరానికి పాల్పడలేదు.
సామాన్యుడు జ్ఞాన సముపార్జన చేయటం అనేది శిక్షించదగిన నేరం
అని ప్రకటించడానికి ప్రయత్నించిన సమాజం ఏదీ లేదు.
హిందూ మతానికే ఆ కీర్తి దక్కుతుంది.
చదవటం, రాయటం అనేవి అగ్రవర్యాల వారి హక్కుగానూ,
నిరక్షరాస్యత నిమ్న కులాల వారి తలరాతగానూ
మనుధర్మ సూత్రాలు నిర్దేశించాయి.''
-బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌

………………………………………………………………………….


డాక్టర్‌ విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలే రచనలు ప్రముఖమైనవి. లోగడ వీరు రచించిన ''వ్యవస్థను కాపాడిన రాముడు'', ''షట్చక్రవర్తులు'' పుస్తకాలను ఈ బ్లాగులో పరిచయం చేయడం జరిగింది.




పురాణాలు కుల వ్యవస్థ - 2 ''దశావతారాలు''
- డాక్టర్‌ విజయ భారతి

76 పేజీలు, వెల: రూ.25



ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500085
ఫోన్‌ నెం. 040 - 2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

Friday, April 17, 2009

మనుగడ కోసం పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసులు - హైమన్‌డాఫ్‌




భిన్న జాతుల సమాహారమైన భారత ఉపఖండంలో అనేక సముదాయాల మధ్య సమన్వయ సహజీవనం ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.

ఈ సముదాయాల్లో స్వంత ఆస్తి, మేథోపరమైన ప్రగతుల్లో విపరీతమైన తారతమ్యాలు, వుడటం కూడా గమనించవచ్చు.

తిరుగుబాట్లు, సర్దుబాట్లు ఈ రెండూ కూడా ఈ తరహా రాజ్యాల పరిపాలనా పద్ధతుల్లోంచి పుట్టుకొచ్చిన లక్షణాలే.

ప్రాచీన జీవిత విధాన వారసత్వంగా నిన్నమొన్నటి దాకా ఉనికిలో వుంటూ వచ్చిన ఆదివాసీ సమాజాలపై, రాజకీయంగా శక్తివంతమైన, ఆర్థికంగా అభివృద్ధి చెందిన సమాజాలు విపరీతమైన ప్రభావాన్ని, ఆధిపత్యాన్ని చూపాయి.

ఫలితంగా ఆదివాసీ సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో చోటుచేసుకున్న వివిధ మార్పులను చర్చించడానికే ఈ పుస్తకంలో ప్రయత్నించాను.

అయితే దాదాపు నాలుగు కోట్ల జనాభా వున్న భారతీయ ఆదివాసీ సముదాయాలలోని మొత్తం ఆదివాసీ జీవితం ఏ మేరకు భద్రమయ్యిందో అర్థం చేసుకోడానికీ అంచనా వేయడానికీ మూస సాధారణీకరణలు సరిపోవు. ఎందుకంటే - విభిన్న సముదాయాల వైవిధ్య సాంస్కృతిక జీవన విధానాలను సాధారణీకరించడం అసాధ్యమేకాదు, ఆచరణ సాధ్యం కూడా కాదు. ఈ కారణంగానే ఆదివాసీ జీవితాలనూ, వాటి సామాజిక పరిణామ క్రమాన్నీ ప్రభావితం చేసిన ప్రత్యేక సమస్యలను సూక్ష్మ్ర పరిశోధనల ఆధారంగా ఒక్కొక్కటిగా పరిశీలించే ప్రయత్నం చేశాను.

....

నా పరిశోధనల ఫలితంగా వెలువడిన మూడు సంకలనాల్లో ప్రస్తుత పుస్తకం చివరిది.
''ది గోండ్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ : ట్రెడిషన్‌ అండ్‌ ఛేంజ్‌ ఇన్‌ యాన్‌ ఇండియన్‌ ట్రైబ్స్‌
(1979: ఢిల్లీ, లండన్‌),
''ఎ హిమాలయన్‌ ట్రైబ్‌: ఫ్రం క్యాటిల్‌ టు క్యాష్‌'' (1980: ఢిల్లీ, బెర్కెలీ) అనేవి గతంలో వెలువడ్డాయి.
-హైమన్‌డాఫ్‌

....
... ''భారతదేశంలో ఆదివాసీ సంక్షేమ పథక రచయితలూ, సామాజిక శాస్త్రవేత్తలూ తప్పని సరిగా చదవవలసిన పుస్తకంయిది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీ జీవ యదార్థ చిత్రణ వుంది.''
- కంట్రిబ్యూషన్స్‌ టు ఇండియా సోషియాలజీ, న్యూఢిల్లీ.

...''ఆదివాసుల జీవితంలోని వెలుగు నీడలను హైమన్‌డాఫ్‌ పుస్తకం కన్నా వివరంగా మరేదీ ప్రస్తావించలేదనే చెప్పాలి. ఇలాంటి పుస్తకం శాస్త్ర ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని గుర్తుచేయడమే కాదు మరింత పెంచుతుంది కూడా.''
- ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ముంబాయి.

....

ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1) ఆదివాసులు - ప్రభుత్వం
2) చేతులు మారుతున్న ఆదివాసీ నేల
3) ఆదివాసులు - అటవీ విధానం
4) అర్థికాభివృద్ధి
5) ఆదివాసీ విద్య - సమస్యలు
6) సామాజిక క్రమ పరిణామం
7) విశ్వాసాలు, ఆచారాల్లో మార్పులు
8) ఆదివాసులు - ఇతరులు

మనుగడ కోసం పోరాటం - ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసులు
క్రిస్టాఫ్‌ ఫాన్‌ ఫ్యూరర్‌ హైమన్‌డాఫ్‌


ఆంగ్లమూలం: Tribes of India: The Struggle for Survival, Christoph Von Furer-Haimendorf,
Published in Arrengement with The University of California Press Ltd. Copy right: 1982 by The Regents of The niversity of California.

తెలుగు అనువాదం: అనంత్‌

ప్రథమ ముద్రణ: జులై 2000

185 పేజీలు, వెల: రూ.50/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500028
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ :
hyderabadbooktrust@gmail.com

Tuesday, March 31, 2009

పురాణాలు - కుల వ్యవస్థ -3 ... షట్చక్రవర్తులు ... డాక్టర్‌ విజయ భారతి



షట్చక్రవర్తులు

భారతదేశ ప్రాచీన సారస్వతంలో షోడశ మహారాజులూ, షట్చక్రవర్తులూ ప్రసిద్ధులు.

సుహోత్రుడు, అంగుడు, మరుత్తు, శిబి, దశరథరాముడు, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబంధుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుడు, పరశురాముడు అనే పదహారుమంది రాజులను షోడశ మహారాజులుగా పరిగణిస్తారు.

అలాగే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు అనే ఆరుగురిని షట్చక్రవర్తులుగా పరిగణిస్తారు.

వీళ్లు వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుతూ భారతదేశాన్ని ప్రతిష్టాత్మకంగా పాలించినట్టు కీర్తించబడ్డారు.
వర్ణాశ్రమ ధర్మాలను కాపాడే రాజులనూ చక్రవర్తులనూ సృష్టించవలసిన అవసరం ఎందుకు కలిగిందో ఆలోచిస్తే చరిత్ర నేపథ్యంలోకి వెళ్ళాల్సి వస్తుంది.
...

భారత దేశం వర్గ సంఘర్షణల నిలయమే కాదు, పోరాటాల భూమి కూడా అ లాంటి పోరాటాలలో అత్యంత తీవ్రమైనది బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య జరిగినపోరాటం.
ఈ రెండు వర్ణాల మధ్య జరిగిన వర్గ పోరాటాన్ని ప్రాచీన భారతీయ సారస్వతం చక్కగా చిత్రించింది.

మొట్ట మొదట నమోదైన సంఘర్షణ బ్రాహ్మణులకు క్షత్రియుడైన వేనునికి మధ్య జరిగినటువంటిది....
బ్రాహ్మణులకు క్షత్రియ రాజైన పురూరవునికి మధ్య జరిగిన పోరాటం రెండవది.
బ్రాహ్మణులకు సహుషునితో జరిగిన ఘర్షణ మూడోది.
బ్రాహ్మణులకు నిమికి జరిగిన సంఘర్షణ నాల్గవది. అన్నారు డాక్టర్‌ అంబేడ్కర్‌.

ఆ స్ఫూర్తితో చేసిన పరిశీలన ఇది.

వర్ణ వ్యవస్థను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రచారం చేసిన షట్చక్రవర్తుల కథల పరిశీలన ఈ గ్రంథంలో చూడవచ్చు.

డాక్టర్‌ బి. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలేల జీవిత చరిత్రలు. వ్యవస్థను కాపాడిన రాముడు ప్రముఖమైనవి. పురాణాలు - కుల వ్యవస్థ పైన ఇది మూడవ పుస్తకం. మొదటిది సత్య హరిశ్చంద్రుడు. రెండవది దశావతారాలు.

పురాణాలు-కుల వ్యవస్థ-3 షట్చక్రవర్తులు
- డాక్టర్‌ విజయభారతి
70 పేజీలు, వెల: రూ.20



ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500028
ఫోన్‌: 040-2352 1849


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.............................

Wednesday, December 31, 2008

ఇస్లాం అవగాహన ఓ చిరుప్రయత్నం



సంక్లిష్ట భారతీయ సమాజంలో సామాజిక అంశాతిని ఎగదొసే పరిణామాలు ప్రతినిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. కొన్ని భగ్గుమని ఆరిపోతే మరికొన్ని రావణకాష్ఠంలా రగులు తుంటాయి.

ముంబైలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం యావత్‌ దేశాన్ని కదిపేసింది.
ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో బాధితులకు మతం ఉండదు.
ఇలాంటి సంఘటనల నుంచి లబ్ది పొందాలనుకునేవారు మాత్రం మతాన్ని ఉపయెగించుకుంటారు. దీనివల్ల సామరస్య జీవనం నెత్తురోడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రధాన మతాల అనుయాయుల మద్య పరిపూర్ణమైన పరస్పర అవగాహన ఉండాలి.

భారత్‌లో ఇస్లాం వ్యాపించి కొన్ని వందల సంవత్సరాలైన్పటికీ మెజార్టీ సంఖ్యాకులైన హిందువుల్లో ఇస్లాం ఆవిర్భావం చారిత్రక నేపథ్యం, తమ ప్రాభవం భారతీయ సమాజంలో ఇస్లాం పాత్ర వగైరా అంశాలకు సంబంధించిన అవగహన చాలా తక్కువ.

ముందుస్తుగా ఏర్పడిన అభిప్రాయలతో ఇస్లాంను, ముస్లింలను చూసేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఉన్నత విద్యావంతులైన హిందువుల్లో కూడా అదే పరిస్థితి. ఇస్లాంకు సంబందించి పూర్తి అవగాహన హిందువుల్లో లేనట్టుగానే, తమ మతానికి సంబందించిన చారిత్రక జ్ఞానం కొరవడిన కారణంగా ముస్లింల్లో కూడా సంకుచిత్వం పేరుకుపోయిందటారు ఎంఎన్‌ రాయ్‌.

20 శతాబ్దంలో భారత్‌ గర్వించదగిన మహామేధావి ఎంఎన్‌ రాయ్‌ రాసిన చిరుపుస్తకం హిస్టారికల్‌ రోల్‌ ఆఫ్‌ ఇస్లాం ఎన్‌ ఎస్సే ఆన్‌ ఇస్లామిక్‌ కల్చర్‌. దీనినే ''ఇస్లాం చారిత్రక పాత్ర'' పేరుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగులో ప్రచురించింది.

దేశ కాల మాన పరిస్థితులను బట్టి చూస్తే ఇది అత్యంత సందర్భోచితమైన ప్రచురణ. ఇస్లాం ప్రపంచగతిని ఏ విధంగా మార్చించిందో రచయిత అత్యంత ఆసక్తికరంగా వివరించారు.

ఇస్లాంను యుద్ధోన్మాదంగా భ్రమపడే పరిస్దితి ఎందుకు వచ్చింది?
ఈ తరహా అవగాహనకు కారణమైన అంశాలేమిటి?
ఇస్లాం విజయాన్ని సైనికవిజయంగా భావించడం సబబేనా అరబ్బుల సారథ్యంలో అత్యున్నత శిఖరాలకు చేరిన ఇస్లాం సంస్కతి ప్రాభవాన్ని దెబ్బతీసిన చారిత్రక అంశాలేవి?
ఇలాంటి ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకంలో సహేతుకమైన సమాధానాలు దొరుకుతాయి. హిందు ముస్లిం తేడా లేకుండా ఇస్లాం గురించిన శాస్త్రీయ అవగాహనకు అందరూ చదవదగిన ఈ పుస్తకంలో అనువాదంలో మరికొంత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
(- ఆదివారం ఆంధ్ర జ్యోతి 21-12-2208లో వెలువడిన పుస్తక సమీక్ష. సమీక్షకులు: వి. శ్రీనివాస్‌ )

ఇస్లాం చారిత్రక పాత్ర
ఎంఎన్‌ రాయ్‌,
తెలుగు: సుందరవర్దన్‌


ప్రతులకు. వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెంబరు 85, బాలాజినగర్‌,
గుడిమల్కాపూర్‌. హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌: 040 - 2352 1849

36 పేజీలు, వెల: రూ.25

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌