Friday, December 8, 2017

బాబా బుడన్‌గిరి లో నేను చూసింది - గౌరీ లంకేశ్

బాబా బుడన్‌గిరి లో నేను చూసింది - గౌరీ లంకేశ్ 

("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం)
 
చిక్కమగళూరులో, బాబాబుడన్‌గిరిలో మత సామరస్య సభలు
జరుపుకుని,  కాషాయదళం కర్ణాటకని మరో గుజరాత్‌గా, బాబాబుడన్‌గిరిని మరో అయోధ్యగా మార్చడాన్ని నిలువరిద్దాం రండని మేం పిలుపునిచ్చిన ఈ రెండు వారాల్లో ఎన్నెన్ని విచిత్రమైన విషయాలు జరిగాయో చెప్పలేను.
ఎక్కడనుండి మొదలుపెట్టాలో కూడా తెలియడం లేదు. మత సమైక్యతకి చిహ్నమైన బాబాబుడన్‌గిరి పరిరక్షణకు మద్దతు తెలిపిన రచయిత గిరీశ్‌ కర్నాడ్‌ గారు ఒక రోజు నాకు ఫోన్‌ చేసి: ''డిసెంబర్‌ 7,8 తేదీల్లో అక్కడ మతసామరస్య సమావేశం జరిపే ముందే మనం కొందరం కలిసి అక్కడికి వెళ్ళి వాస్తవ స్థితిగతులను పరిశీలించి వద్దామా?'' అని అడిగారు.
''బ్యూటిఫుల్‌ ఐడియా, వెళదాం పదండి'' అన్నాను. కర్నాడ్‌, డా.కె. మరుళసిద్దప్ప, జి.కె.గోవిందరావు, శూద్ర శ్రీనివాస్‌, ప్రొ.వి.ఎస్‌. శ్రీధర, నేను ఒక టాటా క్వాలిస్‌ ఎక్కి చిక్కమగళూరుకి  బయలుదేరి వెళ్లాం.
దారిలో బాబాబుడన్‌గిరి వైశిష్ట్యం, ప్రస్తుతం కాషాయదళం అక్కడ వ్యాపింపజేస్తున్న విష వాతావరణం గురించి మాట్లాడుకున్నాం. ఈ యేడు భజరంగదళ మర్కటాలు బాబాబుడన్‌గిరిలో అశాంతిని సష్టించడానికి సన్నద్ధమవుతున్నారన్నది రహస్యమేమీ కాదు.
పోయిన ఏడు భజరంగదళ్‌ ఇచ్చిన నినాదాలే అందుకు సాక్ష్యం. అప్పుడక్కడ తీసిన ఫోటోలను శ్రీధర గారు చూపించారు. ఆ ఫోటోలలో ఒక చోట భజరంగ్‌దళ్‌ వాళ్లు రాసిన నినాదం ఇలా ఉంది: ''స్నేహానికి బద్ధులం, కాని సంహారానికీ సిద్ధం.''
ఇది చదివి కర్నాడ్‌ గారికి కోపమొచ్చింది. ''ఎవర్ని సంహరిస్తారట వీళ్ళు? ఇందులో వాడిన పదాలు చూడండి. 'కండబలం', 'నెత్తురుటేరులు', 'శత్రుసంహారం'. ఇది కన్నడ భాషేనా?'' అని గర్జించారు.
''మన సంస్క తిని నిర్మించింది బసవణ్ణ, షరీఫ్‌, కనకదాస, కువెంపులు. 'మతానికి మూలం దయ.' అదే మన కర్ణాటక మతం. కాని ఈ భజరంగదళ్‌ వాళ్ళకి తెలిసింది తొగాడియా-మోదీ లాంటి వాళ్ళ భాష మాత్రమే'' అని విమర్శించారు మరుళసిద్దప్పగారు.
భజరంగదళ్‌ చేస్తున్న డిమాండ్లు కూడా ఆ ఫోటోల్లో కనిపించాయి. అవి ''దత్తపీఠం దగ్గర శాశ్వత పూజాకార్యక్రమాలు, విగ్రహప్రతిష్ఠ, అర్చకుడి నియామకం, దత్తపీఠం చుట్టూరా ఉన్న గోరీల నిర్మూలన, మొత్తం క్షేత్రాన్ని హిందూ క్షేత్రంగా ప్రకటించడం.'' ఈ యేడు కూడా భజరంగదళ్‌ వాటినే డిమాండ్‌ చేసింది. భారతీయ జనతా పార్టీ వాటికి సంపూర్ణ మద్దతు తెలిపింది.
కానీ భజరంగదళ్‌ చేసిన ప్రతి డిమాండూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వీటిల్లో ఏ ఒక్కదానికి ప్రభుత్వం ఒప్పుకున్నా కోర్టు ధిక్కారం అవుతుంది. బిజెపి మూర్ఖ శిఖామణులకి ఆ విషయం తెలియపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు!
బాబాబుడన్‌గిరిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తీర్పు ప్రకారం, 1975 జూన్‌ వరకూ ఏ ఆచారాలు పాటించారో వాటిని మాత్రమే అక్కడ కొనసాగించవచ్చు, కొత్త ఆచారాలకి అవకాశం ఇవ్వరాదు. ఇప్పటిదాకా అక్కడ అనుసరిస్తున్న ఆచారాల పట్టికను కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది.

హిందూ దేవస్థానాల్లో కానవచ్చే చాలా ఆచారాలను అక్కడ పాటిస్తారు. అవి:
1. పాదుకలకి పుష్పార్చన
2. నందాదీపాన్ని వెలిగించడం
3. భక్తులకి తీర్థం ఇవ్వడం
4. కొబ్బరికాయలు కొట్టడం
5. హిందూ మఠాధిపతులను గౌరవించడం
6. భక్తులను నెమలీకతో ఆశీర్వదించడం
1975లో ఈ తీర్పు ఇచ్చినపుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ ఆచారాలలోని మత సామరస్య స్వభావాన్ని అరుదైనదిగా కొనియాడారు కూడా. రామ్‌-రహీంల గురించి మాట్లాడేవన్నీ ఎక్కువగా పడికట్టు మాటలుగా ఉంటున్న ఈ కాలంలో, ఆ సిద్ధాంతాన్ని నిజంగా అనుసరించడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా మెచ్చుకోవలసింది ఈ క్షేత్ర పాలనా వ్యవహారాలు చూసే శాఖాద్రి గారి వైఖరిని అని న్యాయమూర్తులన్నారు. ఎందుకంటే స్వయంగా ముస్లిం అయినా ఈ పుణ్యస్థలం ముస్లింలకి మాత్రమే పరిమితం కాదు, హిందువులకి కూడా చెందుతుందని ఆయన చెప్పడం నిజంగా శ్లాఘనీయమన్నారు. అలాగే అక్కడ పాదుకలు, నందాదీపాల సంప్రదాయం ఉన్నాగాని, ఈ వివాదంలో అర్జీదారులైన హిందువులు ఆ స్థలాన్ని తమది మాత్రమే అని చెప్పకపోవడాన్ని కూడా కోర్టు ప్రశంసించింది.
వందల సంవత్సరాలుగా ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నా ముస్లింలెప్పుడూ ఈ స్థలం తమకు మాత్రమే పరిమితమనలేదని, కాని వక్ఫ్‌ బోర్డ్‌ మాత్రం ఆ స్థలంపై అధికారం చెలాయించాలని చూస్తోదని కోర్టు అంది.
కుల మతాల మధ్య కలహాల వలన ప్రపంచమే ఛిద్రమైపోతున్న నేటి సందర్భంలో ఈ గురు దత్తాత్రేయ బాబాబుడన్‌స్వామి దర్గా నిజమైన లౌకిక భావానికి అద్భుత ఉదాహరణగా నిలిచిందని న్యాయమూర్తులన్నారు.
ఇటువంటి చోట బిజెపి లాంటి సంప్రదాయ హిందూ పార్టీ, దాని అనుబంధ సంస్థ భజరంగదళ్‌ అర్చకుడి నియామకాన్ని (అతడు బ్రాహ్మణుడే అవుతాడని వేరే చెప్పనక్కరలేదు), సమాధుల నిర్మూలనను కోరడం మహా దుర్మార్గం. దాన్ని 'హిందూ పుణ్యక్షేత్రంగా' ప్రకటించాలని వారి కోరిక.
కర్నాడ్‌ గారు ''ఈ దత్తజయంతి, దత్తమాల, ఇవేవీ మన సంస్క తి కాదు. వీటి ఆచరణ వెనుక ఉన్నది మతం కాదు. మతం పేరుతో జరుగుతున్న రాజకీయం. నాథ పరంపరకు చెందిన దత్తాత్రేయుడు కులవ్యవస్థని తిరస్కరించినవాడు. అలాంటి ఆయన్ని బ్రాహ్మణీకరించడం వెనక ఉన్న కుట్ర ఏమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు''  అన్నారు.
ఈ 'గురు దత్తాత్రేయ బాబాబుడన్‌గిరిస్వామి దర్గా'కి చాలా చరిత్రే ఉంది.
అరేబియా నుండి చంద్రద్రోణ పర్వతానికి వచ్చిన దాదా హయత్‌ అనే సూఫీ ఇక్కడి సేనాపతుల పీడనకు గురౌతున్న శూద్రులకీ, దళితులకీ సహాయంచేసి వారి మన్ననలను పొందాడు. దాదా హయత్‌ చూపిన ప్రేమ, దయ, సహనంతో ప్రభావితులై కొందరు ఇస్లాం మతంలో చేరితే, ఇంకొందరు తమ మతాన్ని వదిలిపెట్టకుండానే దాదా హయత్‌ని దత్తాత్రేయుడి అవతారంగా భావించి ఆయనకి భక్తులయ్యారు. దీనికి ఒక కారణం ఉంది. హిందూ పురాణాల్లో విష్ణువు దత్తాత్రేయ అవతారం దాల్చి ప్రజల్ని దాస్య విముక్తుల్ని చేశాడని ఉంది.
అందుకే హిందూ భక్తులు దాదా హయత్‌లో దత్తాత్రేయుడిని చూసి ఆయనకి ఆ పేరు పెట్టుకున్నారు.
ముస్లిం సూఫీ సాధువులకు అలాంటి హిందూపేర్లు పెట్టడం అప్పట్లో సర్వసాధారణమే.
ఉదాహరణకు బీజాపూర్‌ సూఫీసాధువు ఖ్వాజా అమీనుద్దీన్‌ అల్లాని హిందువులు బ్రహ్మానందాయికె స్వామి అనీ, తింతిణే సాధువు మొయిద్దీన్‌ని మునియప్ప అనీ పిలుచుకునేవారు.
కాలక్రమంలో దాదా హయత్‌, దత్తాత్రేయుడు రెండు పేర్లూ ఒకటై 'గురు దత్తాత్రేయ బాబాబుడన్‌గిరిస్వామి' దర్గా అనే పేరు వచ్చింది.
ఈ దర్గా భూమి దస్తావేజుల్లో శాఖాద్రి 'జగద్గురు' అనే పేరుతో నమోదై ఉన్నాడు. శతాబ్దాలుగా ఈ దర్గాని హిందూ, ముస్లిం రాజులిద్దరూ సేవించుకున్నారు.
రాణి చెన్నమ్మ ఎన్నో నిధులు సమకూర్చింది.
హైదర్‌ అలీ కొన్ని పల్లెల్నే దర్గా పోషణ కోసం ఇచ్చాడు.
టిప్పు సుల్తాన్‌ వందల ఎకరాల భూమిని ధారాదత్తం చేసాడు.
మూడవ శ్రీకష్ణరాజ ఒడయార్‌ దర్గాకి అనేకసార్లు వచ్చి, మతసంబంధమైన విషయాల్లో ఇక్కడి పీర్ల నుండి సలహాలు పొందేవాడు.
మైసూరు మహారాజైతే 16 హిందూ ధర్మాధికారులతోపాటు శ్రీ గురు దత్తాత్రేయ బాబాబుడన్‌స్వామి జగద్గురువులకి కూడా విశేష సదుపాయాలను కల్పించాడు. వేరే ముస్లిం మతాధికారి ఎవరికీ అటువంటి గౌరవం దక్కలేదు.
ఇటువంటి చోట
కాషాయదళానికి నేడు
 హోమం,
యాగం,
యజ్ఞం,
పూజా పునస్కారం
వంటి నిష్ప్రయోజనకరమైన ఆచారాలు కావలసివచ్చాయి!

లంకేశ్‌ పత్రికె, 3 డిసెంబర్‌ 2003
కన్నడ నుంచి తెలుగు సేత : కె. ఆదిత్య
.............................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌