Monday, December 18, 2017

'మహిళ కావటమే ప్రస్తుతం నాకున్న భద్రత' - గౌరి లంకేశ్‌

'మహిళ కావటమే ప్రస్తుతం నాకున్న భద్రత' - గౌరి లంకేశ్‌





గౌరి లంకేశ్‌ ను 'లంకేశ్‌ పత్రికె'కి సంపాదకురాలైన రెండు నెలల తర్వాత 2000 మార్చిలో జర్నలిస్ట్‌ ఎం.డి. రితి ఈ ఇంటర్వ్యూ చేశారు.


మీ నాన్న వారసత్వాన్ని మీరు తీసుకుంటారని, ఏదో ఒక రోజు 'లంకేశ్‌ పత్రికె'కి సంపాదకురాలు అవుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?

లేదు. మా నాన్న వారసత్వాన్ని నిజానికి ఎవరూ అందిపుచ్చుకోగలరని నేను అనుకోవటం లేదు. కన్నడ పత్రికా, సాహిత్య రంగాలలో ఆయనకు చాలా పెద్ద స్థానం ఉంది. ఆయన చనిపోయిన రోజు బెంగుళూరు రావడానికి ఢిల్లీ విమానాశ్రయంలో మేం వేచి ఉన్న సమయంలో 'లంకేశ్‌ పత్రికె' ఇప్పుడు ఏమవుతుందని మిత్రులు అడిగారు. దానిని మూసివేయటం మినహా చెయ్యగలిగింది ఏమీ లేదని వాళ్లకి చెప్పాను. ఆయన పోషించిన పాత్ర చాలా పెద్దది, దానిని పూరించటం చాలా కష్టం.

మరి పత్రికకు సంపాదకత్వం వహించాలని ఏ పరిస్థితులలో అనుకున్నారు?

ఆ స్థానంలో అందరూ మరొక లంకేశ్‌ కోసం చూస్తారు. అది సాధ్యం కానిది. అందుకే నేనే కాదు, ఎవరి నేతత్వంలోనైనా పత్రికను నడపటం సాధ్యం కాదని అనుకున్నాను. అయితే ఈ పత్రిక ఎప్పుడూ లౌకికవాదం తరఫున, దళితులు, మహిళలు, అణగారిన ప్రజల తరఫున నిలబడింది కాబట్టి దానిని మూసెయ్యవద్దని చాలామంది సందేశాలు పంపించారు. ప్రధానస్రవంతి పత్రికలలో చోటు దొరకని అంశాలకు ఈ పత్రికే వేదికగా ఉండేది.

నేనూ, మా తమ్ముడూ, చెల్లీ కలిసి మా నాన్న ప్రియమిత్రుడు మణిని కలవడానికి వెళ్లాం. ఆయన ప్రముఖ కన్నడ సాయంత్ర దినప్రతిక సంజెవాణికి, తమిళ దినపత్రిక దిన సుదార్‌కి సంపాదకుడు, ప్రచురణకర్త. ఆయనే మా పత్రికను చాలా సంవత్సరాలుగా ముద్రిస్తున్నారు. పత్రికను మూసెయ్యాలనుకుంటున్నాం  అని చెప్పగానే ఆయన ఆందోళనకు లోనయ్యారు. ''మీ నాన్న తన ఉద్యోగం వదిలిపెట్టి మరీ తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఈ పత్రిక మొదలుపెట్టాడు. దానిని ఈ స్థాయికి తీసుకురావటానికి ఎంతో ధైర్యంగా పోరాడాడు. మీరు ఎటువంటి పోరాటం లేకుండా దీనిని మూసెయ్యాలని అనుకుంటున్నారు. కనీసం కొంత కాలం ప్రయత్నించే ధైర్యం కూడా లేదా మీకు? నడవకపోతే అప్పుడే ఎందుకు మూసెయ్యకూడదు?'' అని ప్రశ్నించారు.

ఆలోచిస్తుంటే మా నాన్న చనిపోయిన పరిస్థితులు కూడా మాకు దారి చూపించినట్టు అనిపించింది. ఆయన ఒక సోమవారం నాడు తాను రాయవలసినవన్నీ రాసి ముద్రణకు పంపాకే మరణించాడు. అలాంటిది పత్రికను ఉన్నట్టుండి మూసివెయ్యడమంటే తన పనిని అంత సమర్థంగా పూర్తి చేసిన వ్యక్తిని అవమానించటమేనని అనిపించింది. పత్రిక తన తరువాత కూడా కొనసాగాలని మా నాన్న అనుకున్నారా అన్న ప్రశ్న మమ్మల్ని చాలా కాలం తొలిచింది. ఆ ప్రశ్నకి ఇప్పటికీ మాకు సమాధానం దొరకలేదు. ఆయనెప్పుడూ మాకు చెప్పలేదు.

ఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంగా ఉన్నారు కదా! పత్రిక భవిష్యత్తు గురించి మీలో ఎవరితో కూడా చర్చించలేదా?

లేదు. నిజానికి అంతకుముందు రెండు సంవత్సరాల నుంచి కొత్తగా ఒక సాయంకాల పత్రిక నడపాలన్న ఆలోచనలో కూడా ఉన్నాడు. మరో పత్రిక నడిపే ఆరోగ్యం ఆయనకు లేదని అందరం ఆ ప్రతిపాదనను తిరస్కరించాం. ఎవరి కోసం ఆ పత్రిక నడపాలనుకున్నారో వారికి ఉపయోగపడుతున్నంత కాలం పత్రికను నడపాలని ఆయనకు ఉండేది. ఇప్పటికీ అది వారికి ఉపయోగపడుతోందనే నేను అనుకుంటున్నాను.

అయితే ఏదో ఒక రోజు ఈ పత్రిక బాధ్యత చేపట్టాలన్న ఉద్దేశంతో మీరు పత్రికా రంగంలోకి రాలేదన్నమాట?

ఈ పనికి నన్ను సన్నద్ధం చేశారా అనా? ఏ మాత్రం లేదు. నేను జర్నలిజం కోర్సులో చేరినప్పుడే మా నాన్న ఈ పత్రికను మొదలుపెట్టాడు. అంటే నేను జర్నలిజం కోర్సులో చేరేనాటికి వారసత్వంగా చేపట్టటానికి ఎటువంటి ప్రచురణ లేదు. వాస్తవానికి నేను డాక్టరుని అవ్వాలని అనుకున్నాను. ఆ కోరిక నెరవేరనప్పుడు జర్నలిస్టు కావాలని అనుకున్నాను. గత ఇరవై సంవత్సరాలలో నేను 'లంకేశ్‌ పత్రికె'కి ఒక్కసారే రాశాను. నన్ను నేను కావాలనే ఈ పత్రికకు దూరంగా ఉంచుకున్నాను. ఎందుకంటే నేను ప్రధాన స్రవంతి ఇంగ్లీషు మీడియాలో పని చేస్తున్నాను, మా నాన్న పత్రికేమో ఎటువంటి మొహమాటాలు లేకుండా అందర్నీ తీవ్రంగా విమర్శిస్తుండేేది.

మీ విమర్శకులు మీ ఉద్యోగంలో మీరు అంతగా రాణించలేదని, గత దశాబ్దకాలంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉన్నారని, ఇంకా చెప్పాలంటే మీ ఉద్యోగ జీవితం వెనకపట్టు పట్టిందని అంటారు. అటువంటి పరిస్థితిలో ఈ పత్రిక ద్వారా మీకు చక్కని అవకాశం లభించిందని అనుకుంటున్నారా?

నా ఉద్యోగం ఎదుగూ బొదుగూ లేకుండా ఉందని ఒప్పుకునేవాళ్లల్లో నేనే మొదటిదాన్ని. నేను ఎటువంటి రిస్కు తీసుకోటానికి సిద్ధంగా లేనందున అలా ఉండిందేమో. నా వ్యక్తిగత జీవితం అంత బాగా లేకపోవడం కూడా ఒక కారణమేమో! ఉద్యోగంలో పైకెదగాలన్న దాని కంటే వ్యక్తిగత ఆనందం పొందేందుకు ఎక్కువ ప్రయాస పడుతుండేదాన్ని. ఈ రోజు నా జీవితంతో నేను సంతోషంగానే ఉన్నాను. దీని కోసం నేను చెల్లించిన మూల్యం గురించి కూడా నేనేమీ దిగులు పడడం లేదు.

మీ వ్యక్తిగత, వత్తి జీవితాల పట్ల మీరు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారా?

వ్యక్తిగా నా పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒంటరిగా ఉండటం నాకు  సమస్య కాదని గత సంవత్సరంలోనే నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత గందరగోళాలన్నీ పరిష్కరించుకుని ఇకనుండి వత్తిపై పూర్తి శ్రద్ధ పెట్టాలని అనుకున్నాను. ఆ సమయంలో మా నాన్న చనిపోవటంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. నా వత్తి ఆశాజనకంగా మారుతున్న సమయంలోనే నేను వెనక్కి రావలసి వచ్చింది. ఇక సంపాదక బాధ్యతల విషయానికి వస్తే, అందుకు అర్హురాలనని నేను ఎంత మాత్రం భావించడం లేదు. అయితే ఆ అర్హతను సంపాదించటానికి మాత్రం నా శాయశక్తులా కషి చేస్తున్నాను.

పత్రిక గురించి ఇప్పుడు మీ ప్రణాళికలు ఏమిటి?

మా నాన్న చివరిక్షణం వరకు ఈ పత్రికకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం బాగా ఉండకపోవటం వల్ల పత్రిక ఇదివరకటిలాగా పాఠకులకు సరిగ్గా చేరువ కాలేకపోయింది. మళ్లీ పాఠకులను చేరేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను.

పత్రికను నడుపుతున్న కుటుంబంలోని రెండవ తరం వ్యక్తిగా దీనిని ఎటువైపు తీసుకెళదామని అనుకుంటున్నారు? ఆన్‌లైన్‌లో పెట్టడం, అన్ని దేశాల వారికీ అందుబాటులో ఉంచడం...వంటి మార్పులేమైనా చేయబోతున్నారా?

మా నాన్న సాంకేతిక వినియోగాన్ని అంతగా ఇష్టపడేవాడు కాదు. ఆ రంగంలో ఆయన పూర్తి సాంప్రదాయవాది. చివరి వరకు ఆయన తన చేతితోనే రాసేవాడు. ఆయన  ఇంటర్‌నెట్‌ని గాని, స్టాక్‌మార్కెట్‌ని గాని ఏనాడూ అర్థం చేసుకోలేదు. సూక్ష్మస్థాయిలోనే మార్పుని బాగా తీసుకురావచ్చని ఆయన బలంగా నమ్మేవాడు. నేను ఆయన దక్పథంతో ఏకీభవిస్తాను కాని ఆ స్థాయిలో కూడా సాంకేతికత బాగా విస్తరిస్తోంది. కొంత కుదురుకున్నాక పత్రికను ఇంటర్‌నెట్‌లో పెట్టాలన్న ఆలోచనైతే ఉంది. మా నాన్న ఇతర రచనలను కూడా ఇంటర్‌నెట్‌లో పెట్టాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన రాసిన ఒక నవలను ధారావాహికంగా ప్రచురిస్తున్నాను, దానిని ఇంటర్‌నెట్‌లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాను.

అంటే పత్రిక ఆన్‌లైన్‌ సంచిక తీసుకొస్తారా?

'లంకేష్‌ పత్రికె' పేరు మీద ఈపాటికే ఎవరో వెబ్‌సైట్‌ నమోదు చేయించారని తెలిసింది. దాంట్లో మా నాన్న ఫొటో తప్పించి మరేమీ లేదు. ఆ సైట్‌ యజమానికి మా తమ్ముడు ఉత్తరం రాస్తే అతను మా నాన్న అభిమాని అని తెలిసింది. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెబ్‌సైట్‌ని మాకు ఇచ్చేస్తానని అతను చెప్పాడు. కొన్ని వారాలలో దానిని చురుకుగా నిర్వహించాలన్న ఆలోచన ఉంది.

ఇప్పటివరకు పాఠకులు, ఉద్యోగులు, ఎడిటర్‌తో సహా అందరూ పురుషులే ఉన్న పత్రికకు సంపాదకురాలు కావటం ఎలా ఉంది?

'పత్రికె'లో మహిళలు మెచ్చే విషయాలు కొన్ని ఉండొచ్చు కాని ప్రధానంగా మగ వాళ్లు ఇష్టపడే రాజకీయ వార్తలు, ఇన్వెస్టిగేటివ్‌ కథనాలే ఎక్కువ ఉన్నాయనడంలో సందేహం లేదు. జిల్లాలలోని పురుష జర్నలిస్టులు ఎక్కువ అవే రాస్తారు. కానీ పాఠకులలో ఎక్కువమంది పురుషులే అనేదానితో నేను ఏకీభవించను. కన్నడలోని కొందరి గొప్ప రచయితలకు మా పత్రికే జన్మస్థానం. వైదేహి, లలితా నాయక్‌, భాను ముష్తాక్‌ వంటి రచయితలను మేమే ప్రోత్సహించాం. మా పత్రిక ద్వారా వారికి మంచి పాఠకులు దొరుకుతారన్న ఉద్దేశంతోనే  వాళ్లు తమ రచనల ప్రచురణకు మొదటి అవకాశం ఇప్పటికీ మాకే ఇస్తారు. మా నాన్న ఎంతో మంది మహిళలకు కన్నడలో జర్నలిస్టులు కావడానికి ప్రేరణగా నిలిచారు.

చంపుతామన్న బెదిరింపులు, దావాలు, దూషణలు ఎన్నో మీ నాన్న ఎదుర్కొన్నారు.  ఆయన తనదైన పద్ధతిలో వాటిని ఎదుర్కొన్నారు. మీరు వయస్సులో ఉన్న మహిళ కదా, ఒక్కరే  బెంగుళూరులో ఉంటూ అంతటి ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? 

మా నాన్న మీద కేసు పెట్టిన ప్రతి ఒక్కరికీ కేసు పెట్టని మరెంతో మంది ఉన్నారు, మా నాన్న చేస్తున్నది సరైనదని వాళ్లకి తెలుసు. దాని వాడిని తగ్గించకుండా పత్రికను మరింత వత్తి నిబద్ధతతో నడిపే ప్రయత్నం చేస్తున్నాను. మహిళగా ఉండటం ఈ పరిస్థితులలో ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. మా నాన్న అంటే కోపంగా ఉన్న రాజకీయ నాయకుడిని మా విలేఖరి ఎవరైనా కలుసుకుంటే వాళ్లు మా నాన్న గురించి రాయటానికి వీలులేని తిట్లు తిట్టి పంపిస్తారు.
        నన్ను కూడా అలాగే తిడితే  సమాజంలో వారే వారి గౌరవం, మర్యాద కోల్పోతారు కాబట్టి ప్రస్తుతం మహిళ కావటమే నాకున్న అతి పెద్ద భద్రత.

మహిళయినందుకు వాళ్లు మిమ్మల్ని ఆ విధంగా తిట్టకపోవచ్చు. కాని మీ నాన్నపై పలుమార్లు దాడి చెయ్యటానికి ప్రయత్నించినట్టు మీ మీద కూడా చెయ్యరని ఏమీ లేదు కదా! ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి మీ పరిస్థితి మరింత బలహీనంగా ఉంటుందని వాళ్లకి తెలుసు.

నేను భౌతిక దాడులకు ఏ మాత్రం భయపడను. పదిహేను రోజుల క్రితం వరకు నేను ఒంటరిగా చాలాసార్లు తెల్లవారి 3 గంటలకు కూడా కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్లేదాన్ని. ఒక రాత్రి రోడ్డు మధ్యలో చీర ధరించి ఉన్న ఒక పురుషుడిని చూసిన తరువాత అర్ధరాత్రి ఒంటరి ప్రయాణాలు మానుకున్నాను. ఇప్పుడు ఇంటికి చేరేవరకు డ్రైవరుని నాతో ఉంచుకుంటున్నాను. బెదిరింపు ఫోన్లు అయితే నాకు ఇప్పటి వరకు ఏమీ రాలేదు. తాలూకా స్థాయిలోని 'బ్లాక్‌మెయిల్‌' దినపత్రికల నుంచి మాత్రం ఒకటి రెండు సార్లు నా వ్యక్తిగత జీవితాన్ని బయటపెడతామని ఫోన్లు వచ్చాయి. ''నా గురించి ఏం కావాలంటే అది రాసుకోండి. భయపడవలసిన తప్పులు నేనేమీ చెయ్యలేదు'' అని చెప్పిన తరువాత అవి కూడా ఆగిపోయాయి.

పత్రికను మరింత వత్తి నిబద్ధతతో నడుపుతానని అన్నప్పుడు దానిని టాబ్లాయిడ్‌లాగా కాకుండా శిష్ట వర్గం కోసం రూపొందిస్తారని అర్థమా?

మా పత్రిక ఎ4 సైజులో ఉండటం మినహాయించి అందులో టాబ్లాయిడ్‌తనం గాని, చౌకబారుతనం గాని ఏమీ లేదు. మా పత్రిక ధర కూడా ఎక్కువేమీ కాదు. తప్పుడు పనులు చేసి పట్టుబడ్డ వారి గురించి రాసినప్పుడు మాది ఎల్లో టాబ్లాయిడ్‌ అని కొందరు కొట్టిపారేస్తుంటారు. విషయాలను ఉన్నవి ఉన్నట్టు రాసే రిస్క్‌ని మేం ఎల్లప్పుడూ తీసుకున్నాం. ఉదాహరణకు మా గత సంచికను తీసుకోండి. ఎస్‌.ఎం. కష్ణ కుడిభుజమైన పట్టణాభివద్ధి శాఖ మంత్రి డి.కె. శివకుమార్‌ మీద కవర్‌ పేజీ వ్యాసం వేశాం. మా విలేఖరి ఒకరు శివకుమార్‌ నియోజకవర్గమైన సత్నూర్‌కి వెళ్లినపుడు అతడి దుశ్చర్యలని బయటపెట్టే పత్రాలు, సాక్ష్యాలతో ప్రజలే ముందుకొచ్చారు. ప్రధాన స్రవంతి పత్రికలు దాన్ని ప్రచురించటానకి వెనకాడాయి కానీ మేం మాత్రం ఎప్పుడూ భయపడలేదు.

ప్రాంతీయ భాషలో పత్రిక తీసుకురావటానికి ఆ భాషలో ఎంతో ప్రావీణ్యత ఉండాలి. కన్నడలో మీకంత నైపుణ్యం ఉందా? 

ఉందనే అనుకుంటున్నాను. గత రెండు నెలల్లో నేను చదవకుండా, ఆమోదించకుండా ఒక్క పదం కూడా పత్రికలోకి వెళ్లలేదు. ఇంగ్లీషు స్టయిల్‌గా ఉండే  భారతీయుల భాష అని మా నాన్న భావించేవాడు. భారతీయ భాష కాని భాషలో మనకు మనం పూర్తిగా వ్యక్తపరుచుకోవటం సాధ్యం కాదని ఆయన నాతో ఎప్పుడూ చెప్పేవాడు. ఆయన మాటలు నిజమేనని ఇప్పుడు నేను గుర్తించాను. రెండు దశాబ్దాల పాటు ఇంగ్లీషులో ఆలోచించి, ఇంగ్లీషులో రాయటం అలవాటైన నాకు ఇప్పుడు కన్నడలో రాసే అవకాశం రావటంతో నా వ్యక్తీకరణలో స్వేచ్ఛ, సహజత్వాలు వచ్చాయనిపిస్తోంది.

రీడిఫ్ డాట్ కాం , 15 మార్చి 2010
అనువాదం : కె. సురేష్‌
............................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com




No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌