Tuesday, March 24, 2009

గడ్డి పరకతో విప్లవం ... మసనోబు ఫుకుఓకా ...


అన్ని వృత్తులలోకి వ్యవసాయం మహత్తరమయినది.
అందరికీ అన్నం పెట్టేవాడు రైతే అని మన నానుడి. అంటే అన్ని రంగాలకూ వ్యవసాయమే ఆధారం. సేద్యం నిలిచిపోయిన నాడు ఇంకేదీ పురోగమించలేదు. ...

ఈనాడు ఒకవైపు వినాశనం మరోవైపు మనుగడ వున్న కూడలిలోకి మానవాళి చేరుకొంది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఎలా ఇరుక్కున్నాం అని ప్రశ్నించుకుంటే - ప్రకృతి నుంచి మనిషి చేజేతులా దూరం కావడమేనన్న సమాధానం ఒక్కటే మిగులుతుంది.

ఫుకుఓకా మాటల్లో చెప్పాలంటే ''మానవ ప్రాణం కేవలం తన శక్తి ద్వారా నిలబడటం లేదు. మానవులకు జన్మనిచ్చి, వాళ్ల ప్రాణాలను ప్రకృతే కాపాడుతోంది. ప్రకృతికీ మనిషికీ మధ్య వున్న సంంధం ఇది.''

జీవన ప్రదాయిని అయిన ఈ సబంధాన్నే మనం తెగ నరుక్కున్నాం. ఇదే సమస్యలన్నిటికీ మూలం. మానవాళి బట్టకట్టి, మనగలగాలంటే మన ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ ఈ సంబంధాన్ని పునరుద్ధరించాలి. ఇంతకు మించి మరో మార్గం లేదు. తన ప్రకృతి వ్యవసాయ అనుభవాల గురించి విస్తృతంగా చర్చించిన ఈ పుస్తకంలో ఫుకుఓకా చెప్పదలచుకున్నది ఇదే.
.......

దక్షిణ జపానులోని షికోకు దీవులలోని ఓ చిన్న గ్రామంలో ఫుకుఓకా పుట్టాడు.

మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంట తెగుళ్ల నిపుణుడయ్యాడు. యోకోహామాలో కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరేడు. జీవితం సాఫీగా, ఖుషీగా గడిచిపోతుందనుకొంటున్న సమయంలో ఎన్నో ప్రశ్నలు అతన్ని పీడించాయి. 25 ఏళ్ల ప్రాయంలో పొందిన అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది.
మానవ ప్రయత్నమంతా వృథా అని అతనికి బోధపడింది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంత ఊరుకు చేరాడు.

ఆధునిక వ్యవసాయాన్ని సవాలు చేస్తూ పొలాన్ని దున్నకుండా, ఎరువులూ, పురుగు మందులూ, కలుపునాశిని మందులూ వాడకుండా, యంత్రాలూ లేకుండా వ్యవసాయం చేయసాగాడు.
ప్రకృతిని సాధ్యమయినంతగా అనుసరిస్తూ ''ఏమీ చెయ్యనవరంలేని'' వ్యవసాయ విధానాన్ని రూపొందించాడు.

అతను అవలంభించిన పద్ధతుల వల్ల నేల ఏ ఏటి కాఏడు సారవంతం అవుతూ వచ్చింది. జపానులో మరే ప్రాంతానికీ తీసిపోని దిగుబడులు వచ్చాయి..

తన ఆ అనుభవసారాన్నంతా ఈ పుస్తకంలో నింపాడాయన.

ఆహార సంస్కృతి గురించీ, ప్రకృతి జీవనం గురించీ ఇందులో వివరించాడు.

ఇది 1975లో జపనీస్‌ భాషలో ప్రచురితమయ్యింది. 1976లో ఇంగ్లీషులోకి అనువాదమయ్యింది. ఆ తరువాత దేశ విదేశాల్లో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యి, ఎన్నో ముద్రణలను పొందింది.

వ్యవసాయానికీ, జీవితానికీ, సంస్కృతికీ మధ్య విడదీయరాని సంబంధం వుందని ఫుకుఓకా విశ్వాసం.

ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవాలని వున్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం మసనోబు ఫుకుఓకాకు 1988లో ''దేశికోత్తమ'' బిరుదునిచ్చి గౌరవించింది. ఆ సందర్భంలో ఆయన హైదరాబాదు కూడా సందర్శించారు. వ్యవసాయం వ్యాపారం కాదు జీవిత విధానమన్న భారతీయ సంప్రదాయానికి జీవం పోసే పుస్తకమిది.




గడ్డి పరకతో విప్లవం
-మసనోబు ఫుకుఓకా
ఆంగ్ల మూలం: The One Straw Revolution, Originally published in Japanese as Shizen Noho Wara Ippon No Kakumei, translated into English and published by Other India Press, Goa, 1992.

తెలుగు: సురేష్‌, సంపత్‌

తెలుగులో మొదటి ముద్రణ: టింబక్టూ కలెక్టివ్‌, 1990
రెండవ ముద్రణ: హెచ్‌బిటి, 2001

199 పేజీలు, వెల: రూ.50
.....


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం.040-2352 1849

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.........

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌