Sunday, November 7, 2010

నిలదీసే అక్షరాలు ....

నిలదీసే అక్షరాలు...

మార్క్సిస్టు అవగాహనతో తొలుత పౌర హక్కుల సంఘం కార్యకర్తగా, నేతగా ప్రత్యేకతను చూపిన డాక్టర్‌ కె. బాలగోపాల్‌ ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ద్వారా తన కృషిని విస్తృత పరిచారు.
వివిధ రంగాల్లోని అనేక సమస్యలపై ఉద్యమించిన ఆయన, సమకాలీన సమాజంలోని వైరుధ్యాలను కూడా ప్రత్యేక రీతిలో విశ్లేషించారు.

బాలగోపాల్‌ మరణించి ఏడాదయిన సందర్భంగా పలు సంస్థలు ఆయన స్మృతిలో పుస్తకాలను ప్రచురించాయి. వివిధ సంధర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలను ''రాజ్యం - సంక్షేమం'' పేరిట 'పర్‌స్పెక్టివ్స్‌' పుస్తకంగా తీసుకొచ్చింది.

రాజ్యం ఆణచివేత స్వభావాన్ని నిలదీసిన బాలగోపాల్‌, సంక్షేమ బాధ్యత దానిపై ఉందని, అది ఉద్యమాల ఫలితమని స్పష్టం చేశారు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో నక్సలైట్‌ ఉ్యమం తీరుతెన్నులు, ప్రభుత్వాల వైఖరులపై తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. సెజ్‌లు, బహుళ జాతి సంస్థల విస్తరణను అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాలు మరింతగా అవసరమని నొక్కి చెప్పారు.

లోతయిన విశ్లేషణతో నిక్కచ్చిగా తన భావాలను వెల్లడించే బాలగోపాల్‌ మతం విషయంలో కూడా ఏమాత్రం తడబడకుండా దాని వికృతత్వాన్ని పలు సందర్భాల్లో ఎండగట్టారు. ఆ రచనలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ మతతత్వంపై బాలగోపాల్‌ పేరిట ప్రచురించింది.

మానవ హక్కుల వేదిక ప్రచురించిన ''హక్కుల ఉద్యమం- తాత్విక దృక్పథం'',  ''మా బాలగోపాల్‌'' కూడా ఆ హక్కుల యోధుడి జీవితానికీ, ఆలోచనలకూ అద్దం పట్టేవే.



రాజ్యం - సంక్షేమం
కె.బాలగోపాల్‌ ఉపన్యాసాలు
పేజీలు: 164, వెల: రూ.100/-

మతతత్వంపై బాలగోపాల్‌
పేజీలు 336, వెల: రూ.150/-

హక్కుల ఉద్యమం-తాత్విక దృక్పథం
పేజీలు: 248, వెల: రూ.100/-

మా బాలగోపాల్‌
పేజీలు: 248, వెల: రూ.100/-


ఈనాడు ఆదివారం 07 నవంబర్‌ 2010

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌