Friday, April 8, 2011

ప్రాంతీయత సార్వజనీనతల సమ్మేళనం ''బషీర్‌ కథలు'' -1, డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి, ( 'మిసిమి' మాసపత్రిక ) ...


ప్రతి భాషలోనూ మాస్టర్‌ రైటర్స్‌ అనదగిన వాళ్లుంటారు. వాళ్లు తమ రచనాశక్తితో ఆయా భాషా సాహిత్యాలపురోభివృద్ధికి కారణమవుతారు. మళయాళ సాహిత్యంలో వైకం మహమ్మద్‌ బషీర్‌ అటువంటి మాస్టర్‌
రైటర్‌. బషీర్‌ తన రచనలతో మళయాళీ సాహిత్య ప్రపంచాన్నే కాక మిగతా భారతీయ భాషా సాహిత్యాలనుకూడా ప్రభావితం చేయగలిగారు. నిజానికి ఏ భాషా సాహిత్యంలోనైనా బషీర్‌లాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే, వీళ్లు స్థలకాలాలకు, వాటి పరిమితులకు పరిమితమై ఆలోచించకుండా భావుకతతో వాటిని దాటి సృజనాత్మకంగా రాయగలుగుతారు. వాళ్ల రచనల సారానికి (ఎస్సెన్స్‌) వారిఅస్తిత్వ సారానికి మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. దాని ఫలితంగా వాళ్ల రచనలు ప్రత్యేకంగావుండటమే కాకుండా నిర్దిష్టంగా కూడా వుంటాయి.

బషీర్‌ కాల్పనిక సాహిత్యంలో అన్ని రూపాలలోనూ రచన చేసినప్పటికీ, ప్రముఖంగా సాహిత్యలోకం ఆయనను కథా రచయితగానే గుర్తించింది. బషీర్‌ కథలు మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావాన్ని, రెండవప్రపంచ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను వాటి నేపధ్యంలో ప్రదర్శిస్తాయి. అదే సందర్భంలో ఆ రెండుప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభాలు, కష్టాలు ఆయన కథల్లో ప్రతిఫలిస్తాయి. ఆకాల సామాజిక సందర్భాలను అన్ని రూపాలలో ఆయన కథలు చిత్రిస్తాయి. ఆ రకంగా, ఆయన కథలుమానవ సంకట స్థితిని దాని సూక్ష్మ్ర రూపాలలోకి వెళ్లి కూడా ప్రతిఫలింపజేయటం జరుగుతుంది. ఒకమేదావి అయిన కథా రచయితగా ఆయన సామాజిక సన్నివేశాలలో వుండే కఠోర వాస్తవాలను వాటిసున్నితమైన కఠోరమైన రూపాలను పట్టుకొని కథలలో చిత్రిస్తారు. ఆయన కథలు ఆ రచయిత భావనాప్రపంచాన్ని ప్రాపంచిక దృక్పథాన్ని చాలా స్పష్టంగా ఎటువంటి జంకు లేకుండా ప్రదర్శిస్తాయి. ఆయన ఒకవ్యక్తిగా తన రోజువారీ జీవితంలో పరిశీలించిన ప్రజలనే పాత్రలుగా మలచుకుంటారు. నిజానికి, ఆయన
సృష్టించిన పాత్రలన్నీ ఆయనతో పరిచయమున్న వాళ్లను నమూనాలుగా స్వీకరించి సృష్టించినవి.

బషీర్‌ ఒకానొక అరుదైన తాత్విక దృక్కోణంలోంచి తన అనుభవాలను పరిశీలించి వాటికి కథారూపం ఇచ్చారు. వైయక్తికమైన అంశాలను చారిత్రకమైనవిగా తాత్కాలికమైన విషయాలను శాశ్వతమైనవిగాచూస్తూ  అ ల్ప విషయాలను కూడా ఉదాత్తమైన అంశాలుగా ఆయన చూడగలిగాడు. ఆ దృష్టే ఆయన కథల్లో నిరంతరం వెన్నంటి వుంది. బషీర్‌ సాధరణమైన, ఎటువంటి విద్యలేని కేరళలోని పేద ముస్లిం కుటుంబాలలోని సంక్షోభాన్ని, ఆధునికతలోకి ప్రవేశించలేక తమ మత సంబంధమైన పునాదులను పెకిలించుకోలేక సంక్షోభంలో ఉన్న స్థితిని కథలుగా మలిచారు. ఆ పాత్రల జీవితాలను అనివార్యంగా ఆవరించుకొన్న విషాదాన్ని అవి ఆమోదించి జీవిస్తూ వుండటం కూడా కనిపిస్తుంది. ఆయన పాత్రలు తమ చుట్టూ వున్న వ్యక్తులపట్ల గాఢమైన ప్రేమతో వుంటాయి. ఈ ప్రేమ పశు పక్ష్యాదుల పట్ల కూడా విస్తరించింది.

పాశ్చాత్య ప్రపంచ ప్రజల మీద వారి ఆత్మిక సాంఘిక జీవితాల మీద రెండు ప్రపంచ యుద్ధాలు విపరీతమైనప్రభావాన్ని చూపి,చాయి. మొదట ఆ యుద్ధాలు ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేస్తే ఆ తరువాత వాళ్ల మనో ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేశాయి. శతాబ్దాలుగా వాళ్ళను నడిపిస్తున్న విలువల పట్ల నమ్మకం పోయింది.వాళ్ల సామాజిక అంత:చేతనాన్ని, మూర్తిమత్వాన్ని రూపుదిద్దిన సంస్కృతి పట్ల కూడా వారికి విశ్వాసం సన్నగిల్లింది. మనిషి తాను ఒంటరివాడిననే భావనకు లోనై క్రమంగా జీవితంపట్ల నిస్పృహతో కూడిన వైఖరిని ఏర్పరచుకున్నాడు. అయితే, అటువంటి అసంబంద్ధ సందర్భం మనిషికి తన అస్తిత్వాన్ని, దాని అర్థాన్ని గురించి లోతుగా ఆలోచించుకోవటానికి ఆస్కారాన్ని కూడా కల్పించింది. ఆ కాలంలో భారతదేశంలో కూడా యుద్ధ పరోక్ష ప్రభావాల వల్ల అటువంటి వాతావరణమే, ఆ తరహా నైరాశ్మమే అలముకొని వుంది. తమ అస్తిత్వాలను గురించిన సగటు మనిషి ఆందోళన, అందుగురించిన లోతైన
ఆలోచన మొదలైన అంశాలే చాలామంది కాల్పనిక సాహిత్యకారులకి వస్తువులయ్యాయి. బషీర్‌ లాంటి వాళ్లు ఆ కోవకు చెందిన వాళ్లే. బషీర్‌ తన సమకాలీన ప్రజల సమస్యలను, సంకట స్థితిని, అత్యంత సానుభూతితో అర్థం చేసుకొని వాటికి కథారూపం ఇచ్చారు.

మానవ స్వభావాన్ని మొరటు వర్గీకరణలోంచి కాకుండా తాత్వికంగా అర్థచేసుకోగలిగిన ఏ రచయితలోనైనా క్షమాగుణం అనేది అనివార్యంగా వుంటుంది. ఈ క్షమాగుణమే బషీర్‌ లాంటి వాళ్లను కథా సాహిత్యం వైపు
నడిపించింది. తన చుట్టూ వున్న మనుషుల పరిమితుల్ని, అసంపూర్ణత్వాన్ని ఆయన అర్థంచేసుకొని, ఆ
అవగాహనలోంచే ఇవాళ వాళ్లను కథాలోకంలో పాత్రల లాగా ప్రవేశపెట్టి క్షమించారు. సాదాసీదా రచయితలకు ఇటువంటి లక్షణం అసాధ్యం. వాళ్లు తాము సృష్టించే పాత్రల పరిమితుల్ని అవి చేసే పొరపాట్లను తప్పులను విద్వేషంతో చూసి చిత్రిస్తారు. ఫలితంగా, ఆ పాత్రలు సజీవత్వాన్ని సంతరించుకోకపోగా, ఆ రచన కేవలం జీవితాన్ని వాఖ్యానించేదిగానూ, అసమగ్రంగానూ మిగులుతుంది.

బషీర్‌ కథలు ప్రధానంగా ముస్లిం కుటుంబాల జీవితాలను వస్తువుగా స్వీకరించినప్పుడు అవి కేవలం వారికి
మాత్రమే పరిమితమై వుండక మిగతా సామాజిక బృందాలను కూడా కదిలించగలిగాయి. అత్యంత దయనీయమైన  దారిద్య్రాన్ని అనుభవిస్తూ, మానసిక ప్రపంచంలో అనేక గాయాలకు గురైన  ముస్లింలు ఆయన కథా సాహిత్యంలో పాత్రలుగా మనకు పరిచితమౌతారు.

బషీర్‌ ప్రముఖ రచనలలో ఒకటి ''పాత్తుమ్మ మేక''. ఆ కథలో ప్రధాన పాత్ర అంతర్ముఖుడైన కథకుడు. అతను భావనా ప్రపంచంలోనే సంచరిస్తూ వుంటాడు. అసలు ఆ పాత్రను పరిచయం చేయటంలోనే ఈ విషయాన్ని నిర్థారించటం జరుగుతుంది. ఈ పాత్రను సాధారణ పద్ధతిలో కాకుండా కథ నడిచే క్రమంలో పరిచయం చేయటం జరిగింది. నిజానికి వాశ్లేషించే క్రమంలోనే ప్రధాన పాత్రను కథకుడు రంగం మీదకు తీసుకవస్తాడు. ఆ తరువాత ఆ పాత్ర వివిధ సందర్భాలలో తనను తాను ఆవిష్కరించుకుంటూ ఎదుగుతుంది.  కథ ప్రధానంగా కథకుడి దృక్కోణంలోనుంచే నడుస్తుంది. సోమర్‌సెట్‌ మామ్‌ లాంటి చేయి తిరిగిన కథకులు యదార్థ జీవిత సన్నివేశాల నుంచి పాత్రలను స్వీకరించటం అత్యవసరమని భావించారు. అప్పుడు మాత్రమే సాహిత్యానికి కొంత విశ్వజనీన లక్షణం ఏర్పడుతుందని కూడా ఆయన భావించారు. బషీర్‌ రాసిన అనేక కథలలో సరిగ్గా ఈ లక్షణమే కనిపిస్తుంది.

వ్యక్తిక,ి సమాజానికి వున్న సంబంధం గతితార్కికమైనదని కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. వక్తి సమాజంలోనే వికసిస్తాడు. సమాజం ఒక రకంగా వ్యక్తి స్థూల రూపం. సమాజం కూడా వ్యక్తి నుంచే రూపొందుతుంది. ఏ వ్యక్తీ తాను జీవిస్తున్న సంస్కృతీ సంప్రదాయం ప్రభావాల నుంచి తప్పించుకోలేడు. ఈ సంస్కృతీ సంప్రదాయాల వలనే వ్యక్తులకు కొన్ని సార్వత్రిక లక్షణాలుంటాయి. ఈ సార్వత్రిక లక్షణాల వలన మిగతా సమాజం నుంచి తనను తాను వేరుగా ప్రతిష్టించుకోగలుగుతాడు. సమాజాన్ని మార్చగలిగే వ్యక్తి తనను తాను మార్చుకోగలుగుతాడు. ఈ లక్షణాలన్నింటినీ బషీర్‌ తన కాల్పనిక సాహిత్యంలో విరుద్ధ స్వభావాలూ ప్రవృత్తులూ వున్న పాత్రల ద్వారా చిత్రించాడు.

- డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి,
   'మిసిమి' మాస పత్రిక, ఏప్రిల్‌ 2011 సౌజన్యంతో

...................................................................(ఇంకా వుంది)

బషీర్‌ కథలు
290 పేజీలు, వెల: రూ.100
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

3 comments:

  1. ఇది మంచి ప్రయత్నం. ఈ కథల తెలుగు అనువాదకులు ఎవరు?

    ReplyDelete
  2. అఫ్సర్ గారూ
    ధన్యవాదాలు.
    బషీర్ కథలను అనువదించినవారు :
    సి.అనంత్‌ , జి.షేక్‌బుదన్‌, విమల, ప్రభాకర్‌ మందార, సి.వనజ, హెచ్చార్కె, పి.సత్యవతి, ఎస్‌.జయ,
    భార్గవ, కాత్యాయని, ఆకెళ్ల శివప్రసాద్‌, సంధ్య, కలేకూరి ప్రసాద్‌, పట్నం ఉమాదేవి.

    ReplyDelete
  3. ee book nenu chadivaanu. godalu katha baaga nachchindi...

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌