Thursday, December 26, 2019

ఒక్క రూపాయికే "బారిస్టర్ పార్వతీశం " !!!

పది రూపాయలకే "జంగిల్ బుక్" !
ఐదు రూపాయలకే "నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు" !
ఒక్క రూపాయికే "బారిస్టర్ పార్వతీశం " !!!

ఇంకా అనేక హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు పదిరూపాయల లోపు ధరకే  లభిస్తాయి
కేవలం డిసెంబర్ 28 , 29  తేదీల్లో
బుక్ ఫెయిర్ స్టాల్ నెం 305 లో
ఎన్టీఆర్ స్టేడియం, లోయర్ ట్యాంక్  బండ్, ఇందిరాపార్క్ ఎదురుగా !



ప్రజల పక్షాన నిలబడిన హైదరాబాదు బుక్ ట్రస్ట్, గత నాలుగు దశాబ్దాలుగా అనేక పుస్తకాలను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్హిన మంచి సాహిత్యాన్ని అనువదించి ప్రధానంగా తెలుగు పాఠకుల దరి చేర్చాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ఇంతవరకూ హెచ్.బి.టి. ప్రచురించిన వాటిలో సామాజిక,ఆర్ధిక, రాజకీయపరమైన అంశాలతో పాటు సమాజ మార్పుకోసం వివిధ రంగాలలో విభిన్న రీతులలో కృషి చేసిన వారి చరిత్రలను, ఆత్మ కధలను, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక అంశాలపై దాదాపు నాలుగు వందల పుస్తకాలను ప్రచురించింది. పాఠకుల ఆదరణ, అనేక మంది సహాయ సహకారాలతోనే ఈ ప్రయాణం హెచ్.బి.టి.కి సాధ్యం అయింది. 2020 ఫిబ్రవరితో హెచ్.బి.టి.ని ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తవుతాయని తెలియచేయడానికి ఆనందిస్తూ ఈ సందర్భంగా హెచ్.బి.టి. ప్రచురించిన అనేక విలువైన పుస్తకాలను ఒక రూపాయి నుంచి పది రూపాయల ధర లోపల పాఠకులకు అందించాలని భావించింది. ఈ అవకాశాన్ని పుస్తక ప్రియులు వినియోగించుకుంటారని ఆశిస్తున్నది. ఈ పుస్తకాల వివరాలను వాటి సారాంశాన్నిక్లుప్తంగా కింద పేర్కొనడం జరిగింది. ఈ పుస్తకాల అమ్మకం ఎన్.టి.ఆర్. స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫేఇర్, స్టాల్ నంబర్ 305 లో 28, 29 తేదీలలో రెండు రోజులు మాత్రమే నిర్వహించ బడుతుంది.

1. పిల్లల రాజ్యం - చాకిరి చదువు: రచయిత మైరన్ వైనర్(అయిదు రూపాయలు) చదువుకు నోచుకోక, చాకిరి బ్రతుకులీడ్చే పసివాళ్ళు ప్రపంచంలో వున్న మొత్తంలో అతి ఏక్కువ మంది వున్నది భారతదేశంలోనే. అందుకు ఏ మౌలిక భావనలు, కులవ్యవస్థ దానికి దారితీసాయో వివరించే పుస్తకం.

2. చదువు : రచయిత కృష్ణ కుమార్ (అయిదు రూపాయలు) ఏది బొధన యోగ్యమైంది? యోగ్యమైనదానిని భోదించడం ఎలా? విద్యావకాశాల వ్యాప్తి ఏ స్థితిలో వుందో తెలియ చేసే పుస్తకం.
                               

3. పిల్లల పాఠాలు పెద్దలకు గుణపాఠాలు: రచయిత కృష్ణ కుమార్(అయిదు రూపాయలు)పిల్లలకు పెనుభారంగా మారిన మన విద్యావిధానం, పుస్తకాలు, సిలబస్ బొధన, మొత్తం విద్యావ్యవస్థను విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా రచయిత కృష్నకుమార్ ఈ పుస్తకం ద్వారా మన ముందుంచారు.
4. మీ పిల్లలు టి.వి. చూస్తారా? - రచయితలు నమితా ఉన్ని కృష్ణన్, శైలజా బాజ్ పాయ్: (పది రూపాయలు)భారతదేశంలో టెలివిజన్ అనూహ్య వేగంతో మన ముంగిట్లోకి వచ్హింది. పిల్లలు టి.వి. ముందు కూర్చుంటే వాళ్లనిక పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది భావిస్తుంటే, వాటికి అతుక్కుపోయిన పిల్లలను వాటినుంచి ఎలా దూరం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న తల్లితండ్రులు మరికొంత మంది. మీ పిల్లల మనస్తత్వాన్ని అర్ధం చేసుకోడానికి మీకు ఈ పుస్తకం తోడ్పడుతుంది.
5. అమ్మా నాన్నలకు-రచయిత ఏ.ఎస్.మకరెంకొ(పది రూపాయలు)ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విధ్యావేత్తలలో ఒకరైన మకరెంకొ పిల్లల పెంపకంపై తన అభిప్రాయాలను, చేపట్టవలసిన చర్యలను లక్ష్యాలను తెలియచేస్తూ తల్లితండ్రుల కోసం రాసిన పుస్తకం ఇది.
6. అల్లరి పిల్లలలో అద్భుత మార్పులు-రచయిత ఏ.ఎస్.మకరెంకొ(పది రూపాయలు)పిల్లల కోసం మకరెంకొ రాసిన మరో అమూల్యమైన పుస్తకం. విద్యాబోధన విషయంలో చేసిన తార్కిక సూత్రీకరణలు,అనుసరించవలసిన విధానాల గురించి వివరిస్తూ వాటిని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన అవసరాన్ని ఇందులో గుర్తుచేసారు.
7. ఎగిరే క్లాస్ రూము రచయిత ఎరిక్ కేస్పనర్ - (పది రూపాయలు)సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్పనర్ పిల్లల కోసం రాసిన నవల ప్లయింగ్ క్లాస్ రూం కు తెలుగు అనువాదం ఇది. బోర్డింగ్ పాఠశాలలో చదువుకునే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించిన గొప్ప పుస్తకం.
8. తొలి ఉపాధ్యాయుడు - రచయిత చింఘిజ్ ఐతమాతవ్(పది రూపాయలు)ప్రముఖ రచయిత చింగిజ్ ఐతమాతోవ్ చదువుపై రాసిన మరో అమూల్యమైన పుస్తకం. ఉప్పల లక్ష్మన్ రావు అనువాదం పాఠకులను కంఠ తడిపెట్టిస్తుంది.
9. ఉడకని మెతుకు-రచయిత కె.ఆర్.వేణుగొపాల్(పది రూపాయలు)పేదల జీవితాలతో లోతుగా ముడిపడిపోయిన సమగ్ర శిశు అభివృద్ధి పధకం ఏవిధంగా నిర్వీర్యం అవుతున్నదనేదిచెప్పేందుకే ఈ పుస్తకాన్ని రచించారు రచయిత.

10. మొగ్లీ-జంగిల్ బుక్ కధలు- రచయిత రడయర్డ్ కిప్లింగ్(పది రూపాయలు)రడ్యర్డ్ కిప్లింగ్, ఆంగ్ల భాష నుంచి సాహిత్యంలో తొలి నోబుల్ బహుమతిని అందుకున్న రచయిత. చిన్న పిల్లలకు ఎంతో ఆసక్తిగా అద్భుతంగా రాసిన కధల పుస్తకం.
                         

11. నేటి పిల్లలకు రేపటి ముచ్హట్లు(అయిదు రూపాయలు)ప్రధానంగా యుక్త వయసులోని వారిని దృష్టిలో ఉంచుకుని రాయబడిన పుస్తకం. బాల్యానికి యవ్వనానికి మధ్య దశ గురించి, యువతకు ఉండవలసిన ఆత్మ గౌరవం, స్థిరత్వం గురించి, లైంగిక పట్ల ఏర్పరచుకోవలసిన నిర్షిష్ట వైఖరి గురించి తెలియ చేస్తుంది.
                         

12. మా యాత్ర-రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి(పది రూపాయలు)ప్రదేశాల చరిత్ర, శిల్ప సంపద ప్రాముఖ్యత, దారికిరువైపులా పరుచుకున్న రమణీయత, ప్రయాణంలో పడిన కష్టనష్టాలు, సహయాత్రికుల సంసారాల్లోని కల్లోలాలను పడుగు పేకల్లా అల్లుకుంటూ అత్యంత నైపుణ్యంతో పాఠకుల ముందుంచారు రచయిత.
13. మంచి చెడూ - రచయిత శారద(పది రూపాయలు)సమాజంలో చోటు చేసుకుంటున్న వ్యాపార సంస్కృతిని, విలువలను అవి ధ్వంసం చేస్తున్న మానవ సంబంధాలను ఎంతో సులువుగా అర్ధం అయ్యేలా రచించారు రచయిత్రి.
14. రధచక్రాలు-రచయిత మహీధర రామమోహనరావు(అయిదు రూపాయలు) ప్రజల జీవితాలలోకి ప్రవేశించిన "ఆధునికత"ను దాని అవకాశాలనూ,సందర్భాలనూ అవి తీసుకు వచ్హిన మార్పులనూ రచయిత ఇందులో అక్షరబద్ధం చేశారు.
15. నల్లజాతి నిప్పు కణిక-సోజర్నర్ ట్రూత్(పది రూపాయలు)సకల వివక్షతలకు పీడనలకూ నిలయం ఈ భూమండలం. ఓ నల్లజాతి నిరక్షరాస్యురాలు అసాధారణ శక్తితో పీడిత సమూహాలపైన అమలవుతున్న వివక్షతలను బద్దలు కొట్టడమే లక్ష్యంగా అధమ స్థాయి నుంచి నిప్పు కణికలా జ్వలిస్తూ అసాధారణ పోరాటం సాగించింది ఈ నవలా నాయకురాలు. కంట తడిపెట్టించే ఆర్తి, ఉద్వేగాన్ని రగిల్చే స్పూర్తి ఆమె జీవితం నిండా పరుచుకున్నాయి. ఈమె జీవితంపై పాటలు, సినిమాలు, నాటకాలు, పిల్లల పుస్తకాలు, పాఠాంశాలు అసంఖ్యాకంగా ఎందుకు వచ్హాయో ఈ పుస్తకం చదివితే మనకు అర్ధం అవుతుంది.
16. సూర్యుడి ఏడో గుర్రం - రచయిత ధర్మవీర్ భారతి(పది రూపాయలు)పైకి అతి సాధారణంగా కనిపిస్తూనే నిగూఢమైన మానవ సంబంధాలను, ప్రేమ పరిణామాలనూ అసాధారణ సహజత్వంతో కొత్త కోణంలోంచి పాఠకులకు చూపించారు రచయిత. తప్పకుండా చదవవలసిన పుస్తకం.
17. జమీల్యా - రచయిత చింగిజ్ ఐతమాతొవ్(పది రూపాయలు) రాజకీయ, సామాజిక విప్లవోద్యమ కాలాలలో సంక్షుభిత సందర్భాలలో జీవితాలను, అద్భుతంగా ఒడిసిపట్టిన రచయిత చింగిజ్ ఐతమాతొవ్. ప్రపంచంలోని ప్రేమ కధల్లోనే ఒకటిగా గణుతికెక్కిన రచన ఇది. అతి తక్కువ ధరకే లభిస్తున్న ఈ ప్రేమ కధను మిస్ అవకండి.
18. బారిష్టరు పార్వతీశం - రచయిత మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి( ఒక్క రూపాయి) తాను చూసిన ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయిక జీవన విధానాలను, హాస్య వ్యంగ్య రసస్పోరకంగా చిత్రిస్తూ పార్వతీశం పాత్రను అజరామరంగా అద్భుతంగా తీర్చిదిద్ది పాఠకుడి మదిలో శాశ్వతంగా గుర్తుండి పోయేలా చేసారు రచయిత. చదివి హాయిగా ఆనందించండి.
19. దక్షిణ తూర్పు పవనం- రచయిత మార్కోస్(అయిదు రూపాయలు)జపాటిస్తా జాతీయ విముక్తి సైన్యం తిరుగుబాటు నాయకుడు మార్కోస్. మూలవాసుల పక్షాన నిలబడిన మార్కోస్ గెరిల్లా యోధుడు మాత్రమే కాదు, మంచి కవి,రచయిత కూడా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమ నిర్మాణమూ లక్ష్యమూ కూడా వుండాలని మార్కోస్ అభిమతం. ఈ పుస్తకం మార్కోస్ రాసిన ఉత్తరాల సంకలనం. సమాజ మార్పును కోరేవారందరూ చదివి తీరాల్సిన పుస్తకం.
20. రేపటి కల- రచయిత రిచడ్ రైట్(పది రూపాయలు) 20వ శతాబ్దపు ప్రధమార్ధంలో అమెరికాలోని నల్లజాతి ప్రజల జీవన పరిస్థితులను ఏడుతరాలు పుస్తక రచయిత ఎలెక్స్ హేలి లాగే రిచడ్ రైట్ కూడా తన రచనలో చిత్రించారు. ఇది రచయిత ఆత్మకధ బ్లాక్ బాయ్ కి సంక్షిప్తానువాదం. కాత్యాయని దీనిని తెలుగులోకి అనువదించారు.
21. ఖైది నంబర్ 174517 -రచయిత ప్రీమొ లెవి(అయిదు రూపాయలు) జర్మనీలో నాజీలు, ఫాసిస్టులు సృష్టించిన విధ్వంసం, భయానకమైన మారణకాండపై ఎంతో సాహిత్యం వచ్హింది. అటువంటి సాహిత్యంలో ప్రీమొ లెవి రాసిన ఈ పుస్తకం మనల్ని వెంటాడుతుంది. ఆయన స్వయంగా నాజీల మృత్యు శిభిరాలలో బందీగా వుండి చావు కనుచూపు మేరలో కనిపిస్తుండగా బతికిపోయి ఒక చారిత్రక వికృతత్వానికి సాక్షిగా నిలిచి రాసిన ఈ పుస్తకం ఫాసిస్టు హింసను నగ్నంగా ప్రపంచం ముందు పెట్టింది.
22. యుద్ధానికి పునాదులెక్కడ -రచయితలు నోంచాంస్కి తదితరులు(అయిదు రూపాయలు)గల్ఫ్ ప్రాంతాలలో అమెరికా సాగిస్తున్న చమురు రాజకీయాలను, అమెరికాకు పెనుసవాలుగా నిలుస్తున్న రాజకీయ, ఉగ్రవాద "ఇస్లామిక్" ఉద్యమాలను అర్ధం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదివి తీరాలి.
23. సరుకు-సంపద రచయిత లియో హ్యూబర్మన్(అయిదు రూపాయలు) పెట్టుబడిదారుడు మొదట ఎలా పుట్టుకొచ్హాడో భూస్వామ్య సమాజాన్ని విచ్హినం చేసి సామాజిక వ్యవస్థగా రూపుదిద్దుకునే క్రమంలో పెట్టుబడి ఏఏ దశల్ని దాటుకుంటూ వచ్హిందో, పెరుగుతున్న ఉత్పత్తులకు కావలసిన మార్కెట్ల అన్వేషణలో అది యావత్ ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తూ దేశాలకు దేశాలను యుద్ధభూమిగా ఎలా మారుస్తున్నదో అత్యద్భుతంగా లియో ఇందులో వివరించాగా మహీధర రామమోహనరావు తెలుగులోకి దీనిని అనువదించారు.
24. భారతీయ ఆర్ధిక వ్యవస్థ (1600-1947)-రచయిత హెచ్.ఎస్.గిల్.(అయిదు రూపాయలు)బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని జయించక ముందు భారతీయ ఆర్ధిక వ్యవస్థ స్వరూపం ఎలా ఉండేది. దాని స్వభావం ఏమిటి? బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పిన కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ గ్రామ సమాజ క్షీణతకూ, విచ్హిత్తికీ ఎలా దోహదం చేసిందో, బ్రిటిష్ వలసవాదపు దోపిడి అవసరాలకు అనుగుణంగా భారతీయ పాలకులు ఏ విధంగా తోడ్పాటు నందించారో తదితర వివరాలను తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
25. దేశమంటే మార్కెట్ కాదోయ్- రచయిత ఎస్.జయ.(ఒక రూపాయి)డ్బ్ల్యు.టి.వొ. దాని పుట్టు పూర్వోత్తరాల గురించి విపులంగా తెలియ చేసిన పుస్తకం. మానవ హక్కుల ఉల్లంఘనకు, కార్మిక చట్టాల తొలగింపుకు, పర్యావరణ పరిరక్షణను విస్మరించి లాభాలు గడించడానికి, బహుళజాతి సంస్థల ప్రయోజనాలను రక్షించడానికి సామ్రాజ్యవాద దేశాలకోసం ఏర్పడిన డ్బ్ల్యు.టి.వొ. ప్రపంచ ప్రజలకు ఏ రకంగా వ్యతిరేకమో రచయిత ఇందులో తెలియ చెప్పారు.
26. ప్రపంచ పేదరికం పెట్టుబడి సంచయనం పేదరికీకరణ- రచయిత సమీర్ అమీన్(ఉచితంగా)పెట్టుబడిదారీ విధానంపై సమీర్ అమీన్ రాసిన చిన్న బుక్ లెట్.
27. ఆంధ్రప్రదేశ్ లో భూసంస్కరణలు-రచయిత ఎస్.ఆర్.శంకరన్(ఉచితంగా) తెలుగు రాష్ట్రాలలో చేయవలసిన భూసంస్కణల గురించి తెలియ చేసిన చిన్న బుక్ లెట్.
28. ఆరోగ్య రంగంలో సంస్కరణలు-రచయిత ఎం.తిమ్మారెడ్డి(రెండు రూపాయలు) ఆరోగ్య విధానాలను పునహ్ సమీక్షించి ప్రజలందరికీ ఆరోగ్యం అందుబాటులో వుండేటట్లు విధాన రూపకల్పన జరగవలసిన అవసార్న్ని ఈ పుస్తకంలో రచయిత నొక్కి చెప్పారు.

29. వైద్య వ్యాపారం-రచయితలు అమర్ జెసాని తదితరులు( అయిదు రూపాయలు) ఆరోగ్య సమ్రక్షణలో ప్రజల హక్కుల పట్ల మీకు ఆసక్తి ఉందా? రోగుల హక్కులపైన వారికి లభిస్తున్న వైద్య సమ్రక్షణపైన మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ పుస్తకాన్ని చదవండి.
                                 

30. ఆధునిక కామసూత్రం-రచయిత సిద్ధార్ధ దూబే(అయిదు రూపాయలు)ఇప్పుడు ఎయిడ్స్ ఎక్కడో దూరంగా వున్న బూచి కాదు. మన మధ్యనే స్వైర విహారం చేస్తూన్న ప్రాణాంతక ఉపద్రవం. ప్రధానంగా లైంగికంగా వ్యాపించే ఈ వైరస్ మనదేశంలో ఎందుకిలా తిష్టవేసుకుని మన వాళ్ళందరిని కబళిస్తోంది. నైతిక విలువల్లో మనల్ని మించినవారు లేరని లైంగిక వ్యవహారాల్లో మన సమాజం సమున్నత ప్రమాణాలు పాటిస్తుందని గొప్పగా చెప్పుకునే మన దేశంలో ఈ వైరస్ ఇంతగా ఎలా విజృభిస్తోంది. సులభశైలిలో ఆసక్తికరంగా సాగే రచన. నోబెల్ బహుమతి పొందిన అమర్త్యసేంతో సహా పలువురి మన్ననలను పొందిన రచన.
31. జండర్ రాజకీయాలు-రచయిత వందనా సోనాల్కర్(ఒక్క రూపాయి)స్త్రీలకు అన్ని రంగాలలో అమలు కావలసిన రిజర్వేషన్ల గురించి, పితృస్వామిక వివిధ కోణాల గురించి డా.వందనా సోనాల్కర్ చాలా చక్కగా ఇందులో వివరించారు.
32. స్త్రీలు-ప్రాతినిధ్యం- (అయిదు రూపాయలు)33శాతం రిజర్వేషన్ల పై వచ్హిన చర్చ మహిళా సంఘాలలో ఉన్న బేదాభిప్రాయాలను, కులవ్యవస్థపై వుండే అవగాహనలను వెలికి తెచ్హాయి. ఈ చర్చను చారిత్రకంగా, రాజకీయంగా అర్ధం చేసుకోవడానికి తోడ్పడే పుస్తకం.
33. మోతె-రచయితలు కోదండరాం తదితరులు(ఒక్క రూపాయి)మోతె ఒక తెలంగాణా గ్రామం. బాధల నుండి బయట పడడానికి చేస్తున్న ప్రజల పోరాటాల వీర గాధే ఈ పుస్తకం.

34. శాంతి దూతలు- మతోన్మాదాన్ని ఎదిరించిన మానవత్వం(అయిదు రూపాయలు) అబ్దుల్ హలీం సిద్ధిఖీ, హర్ష్ మందిర్ మాలెగావ్లో, గుజరాత్ లో పర్యటించి రాసిన వాస్తవ సంఘటనల చిత్రీకరణ. స్పూర్తిదాయకమైన ఈ కధలను చదివి తీరాలి.
                                   

35. గెట్ పబ్లిష్డ్-రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు(అయిదు రూపాయలు) ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు కాని, నూరుమంది నిర్దోషులు తప్పించుకోవాలి అంటారు రచయిత.
36. ప్రసార సాధనాలు పీడిత ప్రజలు-రచయిత పి.సాయినాధ్(రెండు రూపాయలు) సమకాలీన సామాజిక జీవితంలో సమాచారానికి ఉండే ప్రాధాన్యత వలన ప్రసార సాధనాలకు ఉన్న కీలకమైనపాత్ర గురించి ప్రముఖ రచయిత సాయినాధ్ ఇందులో వివరించారు.

2 comments:

  1. Can we get the books by post

    ReplyDelete
  2. Please let us know if any special programs are conducting in the eve of HBT celebrating 40years.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌