Tuesday, August 16, 2011

తొలి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ: ''నేనే బలాన్ని''



సికింద్రాబాద్‌ బొల్లారంలోని మెహతర్‌ బస్తీలో అట్టడుగు మాదిగ ఉపకులమైన మరుగుదొడ్లు సాపు చేసే మెహతర్‌ వృత్తి కులంలో పుట్టి ఏటికి ఎదురీదుతూ అక్కడి నుంచే రాష్ట్ర శాసన సభలో ప్రవేశించి, మంత్రి స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వ్యక్తిత్వం శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మిది. భారతదేశంలో 1952లో ప్రప్రథమంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రిజర్వుడు అభ్యర్థిగా నిలబడి కమ్యూనిస్టు ప్రభంజనాన్ని ఎదుర్కొని రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి, దేవాదాయ శాఖా మంత్రి వంటి అనేక బాధ్యతలను నిర్వహించారు. దేవాదాయ శాఖను నిర్వహించిన తొలి మాదిగ మహిళామంత్రిగా పేరు గడించడమే కాకుండా ఆయా శాఖలపై తనదైన బలమైన ముద్ర వేశారు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మూలస్తంభంగా వున్నారు. తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్‌) అధ్యక్షురాలిగా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మాదిగ హక్కుల కోసం, ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతూ దండోరా ఉద్యమానికి బీజం వేశారు. మాదిగ వర్గీకరణ అన్నది వీరి ఆలోచనే. దండోరా ఉద్యమానికి రాజకీయ రంగు రావద్దొన్న ఉద్దేశంతో తను వెనకుండి మంద కష్ణ మాదిగ, కృపాకర్‌ మాదిగలను ముందుంచి ఉద్యమాన్ని నిర్మించారు.

నేర పూరిత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సాగిన శ్రీమతి సదాలక్ష్మి కృషి మీడియాలో పెద్దగా ఫోకస్‌ కాలేదు. ఇంటా బయటా హిందూ బ్రాహ్మణీయ వర్ణ, పితృస్వామ్య నియంత్రణలను ధిక్కరించి... నిజమైన సాధికారతతో దళిత స్త్రీశక్తిని చాటిచెప్పిన వీరి పాత్ర చరిత్రలో మరుగుపరచబడింది. అందుకే అడుగడుగునా ''నాకు చరిత్ర వున్నదని'' తనే బలంగా ఎలుగెత్తి ప్రకటించారు.

టి.ఎస్‌. సదాలక్ష్మి జీవితం ఈ నాటి మహిళలందరికీ ఆదర్శప్రాయం. ఉద్యమాల్లో, ఉద్యోగాల్లో రాజకీయాల్లో స్త్రీ పురుషులకు... ముఖ్యంగా సాధికారతలో వెనుకబడ్డ ఎంతోమంది మహిళలకు సదాలక్ష్మి జీవితం బతుకు తొవ్వను చూపిస్తుంది.

ఈ పుస్తక రచయిత్రి గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది. పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమికోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు. ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతో కాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు. అనేక
సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం ''నల్లపొద్దు.'' ఆ తరువాత ''నల్లరేగడి సాల్లు'', ''ఎల్లమ్మలు'' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. ''ఎడ్యుసెంట్‌'' అనే దళితుల విద్యపై పనిచేసే సంస్థను స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాసపత్రికను నడుపుతున్నారు. అనేక సంస్థలలో, సాహితీ వేదికలలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ''అన్వేషి'' సంస్థలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే సదాలక్ష్మి బతుకు కథను రాశారు.

నేనే బలాన్ని - టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com


...

1 comment:

  1. సదాలక్ష్మిగారి గురించి ఈ తరంవారికి తెలియకపోవచ్చును.ఆ రోజుల్లో ఆమె చాలా ప్రముఖపదవులనే అలంకరించింది.ఆమెకు అన్యాయమేమీ జరిగిందని అనుకోను.ఏ మైనా ఆవిడ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌