Saturday, May 28, 2011

హృదయంతో చేసిన అనువాదం - చివరకు మిగిలింది? ('గాన్‌ విత్‌ ద విండ్‌') పుస్తక సమీక్ష - విజయకుమార్‌ (ఈ భూమి మాసపత్రిక)


కొన్ని కొన్ని కొందర్ని ఆకర్షిస్తాయి.
వాటికి ఎన్నో కారణాలు వుంటాయి.
ఎం.వి.రమణారెడ్డి గారిని మార్గరెట్‌ మిచ్చెల్‌ 'గాన్‌ విత్‌ ద విండ్‌' ఆకర్షించింది.
దానికి కారణాలు ఆయన చెప్పుకున్నారు.
ప్రపంచ ప్రసిద్ధ నవలను పరవశంగా అనువదించారు.
ఇది నవ్య వారపత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది.
ఇప్పుడు పుస్తకంగా మనముందు వుంది.
'ప్రతి అనువాదకుడు ఆ భాష కొక ప్రవక్తలాంటివాడు' అన్నాడు జర్మన్‌ మహాకవి గోథె.
రచనను, ఇతర భాషలోని రచనను ఆత్మీయంగా భావించినప్పుడే దాన్ని మాతృభాషలోకి తేవాలనిపిస్తుంది. మన ప్రాచీన మహాకవులందరూ అనువాదకులే.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల గురించి చెబుతూ రమణారెడ్డి గారు 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో సంభవించిన ఒకానొక మలుపు ఈ నవలకు నేపథ్యం... సామాజిక శక్తుల పోరాట క్రమంలో భూస్వామ్య వ్యవస్థకూ పెట్టుబడిదారీ వ్యవస్థకూ మధ్య జరిగిన ముఖాముఖి పోరాటాన్ని చిత్రించిన నవల ఇది. ఈ నవలలో ప్రధానపాత్ర 'స్కార్లెట్‌' అనే అమ్మాయిది. ఆమె పాత సమాజంలో ఇమడనూ లేదు. కొత్త సమాజాన్ని అందుకోనూ లేదు' అన్నారు. ఈ నవలను గతంలో సంక్షిప్తంగా పరిచయం చేసిన మాలతీ చందూర్‌ గారి పట్ల ఆయన కృతజ్ఞత ప్రకటించారు.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1936లో అచ్చయింది.
1998 వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది.
ప్రతిష్టాత్మకమైన పులిట్జర్‌ బహుమతిని 1937లో అందుకుంది.
1939లో సినిమాగా వచ్చి 9 అకాడమీ అవార్డులు గెలుచుకుంది.
డిసెంబర్‌ 15, 1939న 'గాన్‌ విత్‌ ద విండ్‌' చిత్రం విడుదలయింది.
ఆ చిత్రం విడుదల రోజు జార్జియా రాష్ట్రంలో సెలవుదినంగా ప్రకటించారు.
అట్లాంటా నగరంలో మూడురోజులు ఉత్సవాలు జరపాల్సిందిగా నగర మేయర్‌ ఆజ్ఞలు జారీ చేశారు.
చలన చిత్ర చరిత్రలోనే అది అపూర్వ విషయం.

మార్గరెట్‌ మిచ్చెల్‌ నవల వెలుగు చూడడానికి పూర్వాపరాల్ని రమణారెడ్డిగారు ఆసక్తిగా వివరించారు. మార్గరెట్‌ మిచ్చెల్‌ 48వ ఏట కారు ఢీకొని స్పృహతప్పి ఆస్పత్రిలో చేరి ఐదురోజులుండి 1949 ఆగస్టు 16 న చనిపోయింది. ఈ నవల వచ్చి 70 సంవత్సరాలు గడచినా ఇప్పటి దాకా తెలుగులో రాలేదు. సంక్షిప్త కథా పరిచయాలు తప్ప సమగ్రంగా రాలేదని రమణారెడ్డి గారన్నారు. ఆ బృహత్తర బాధ్యతని స్వీకరించి ఈ నవలను ఆయన తెలుగు పాఠకుల ముందుంచారు.

బానిసత్వాన్ని రద్దు చేస్తూ లింకన్‌ చట్టం చేశాడు.
దాంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు విడిపోయాయి.
అంతర్యుద్ధం మొదలయింది.

జార్జియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన స్కార్లెట్‌ ఓహరా జీవిత కథ ఈ నవల. ఆమె యాష్‌లీ అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను మెలనీ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. తన అందాన్ని లెక్కపెట్టని అతని పై ఆగ్రహంతో అతని తమ్ముడు చార్లెస్‌ను పెళ్లిచేసుకుంటుంది. అతను అంతర్యుద్దంలో చనిపోతాడు. కానీ ఆమె యాష్‌లీని మరచిపోదు. అంతర్యుద్ధంలో కాలిపోతున్న ఇళ్ల నించి స్కార్లెట్‌ను, ఆమె బంధువుల్ని బట్లర్‌ అనే అతను రక్షిస్తాడు. అతనంటే స్కార్లెట్‌కు ఇష్టముండదు. కానీ అతన్ని పెళ్లాడుతుంది. మనసులో యాష్‌లీ వుంటాడు. యాష్‌లీ భార్య చనిపోతుంది. స్కార్లెట్‌ మనసు తెలిసి బట్లర్‌ ఆమెను వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ మధ్యకాలంలో పిల్లలు కలగడం, పోవడం కూడా జరుగుతుంది. మధ్యలో అంతర్యుద్ధంలో అతలాకుతలమైన జీవితాలు ఎన్నెన్నో.

చివరిదాకా తన అహంకారాన్ని, అభిజాత్యాన్ని వదిలిపెట్టని స్కార్లెట్‌ తత్వం మనల్ని ఆకర్షిస్తుంది. చివరికి తన మనసులో వున్నది యాష్‌లీ కాదని, తన భర్త బట్లర్‌ అని తెలిసినా ఆ విషయం బాహాటంగా భర్తతో చెప్పదు. వ్యక్తులు కలుస్తూ, విడిపోతూ, అకర్షిస్తూ, సంక్షోభంలో సాగిపోతూ అడుగడుగునా మనకు ఉత్కంఠ కలిగిస్తారు.

యాష్‌లీ భార్య మిలెనీ మరణశయ్యపై వుంది. తన భర్తనీ, కొడుకునీ స్కార్లెట్‌కి ఒప్పగించి కళ్లు మూస్తుంది. అన్నాళ్లుగా తను ఆరాటపడిన వ్యక్తి తనకందినా తను ఎండమావులవెంట పరిగెత్తానని గుర్తిస్తుంది. తన మనసులో వున్నది తన భర్త బట్లరని తెలుసుకుంటుంది. బట్లరేమో ఆమెని వదిలి వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. తన అహంకారం వల్ల ఆమె భర్తని అభ్యర్థించదు. బట్లర్‌ లేని జీవితం అంధకారమనిపిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే ఓపిక, ధైర్యం వుండవు. కానీ ఓటమిని ఒప్పుకొని భర్తని వేడుకోలేదు. తన అందంతో, ప్రేమతో అతన్ని లొంగ దీసుకోగల ననుకుంటూనే నిద్రపోతుంది.

నవలలో స్కార్లెట్‌, బట్లర్‌ పాత్రలు ప్రధానమయినవి. అందంలో, తెలివితేటల్లో, స్వార్థంలో ఒకరికొకరు తీసిపోరు. వాళ్లని యిష్టపడతాం, కోప్పడతాం, భూమిలో కలిసిపోతున్న భూస్వామ్య మనస్తత్వాలకు వాళ్లు ప్రతినిధులు. తన గొప్ప శిల్పంతో మార్గరెట్‌ మిచ్చెల్‌ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసి చదివిస్తుంది.

రమణారెడ్డిగారు ఈ నవలని రసవంతంగా అనువదించారు. ఉదాహరణకి చివర్లో స్కార్లెట్‌ భర్త బట్లర్‌ ఆమెని వదలివెళ్లాలనుకున్నప్పుడు ఆమెతో అన్న మాటలు చూడండి.
''మన పెళ్లినాటికే నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలుసు. నీ మనవులో నుండి యాష్‌లీ తొలగిపోలేదని తెలుసు. నేను ఎంత మూర్ఖుణ్ణంటే నువ్వు అతన్ని మరచిపోయేలా చేయగలననుకున్నాను. నువ్వు ఏది కోరినా కాదనకుండా సంతోషపెట్టాలనుకున్నాను. వివాహ బంధంతో రక్షణ కలిగించాలనుకున్నాను. నీ స్వేచ్ఛకు అడ్డు తగలకుండా గారాబంగా చూసుకోవాలనుకున్నాను. కష్టాల నుండి నీకు విముక్తి కలిగించాలనుకున్నాను... ఎందుకో తెలుసా? చీకూ చెంత లేకుండా నువ్వు చిన్నపిల్లలా సరదాగా ఆడుకోవాలని. నా దృష్టిలో నువ్వు యింకా చిన్నపిల్లవే. చిన్న పిల్లలు తప్ప నీ అంత మొండిగా తల బిరుసుగా మరొకరు ఉండలేరు.''

రమణారెడ్డిగారి అనువాదంలో తెలుగు పలుకుబడివుంది.
అనువాదం సహజంగా, సరళంగా సాగింది.
తెలుగువాళ్లు హాయిగా చదువుకోవడానికి తగినట్టుగావుంది.
ఆ పేర్లని అనువదించడం అన్నది కుదరదు.
తక్కిన సంభాషణలు, సన్నివేషాలు, రాగద్వేషాలు అన్నీ మన ముందు అపూర్వంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

అనువాదం ఒక తపస్సు, ఒక తన్మయత్వం.
తన ఆనందాన్ని పంచుకోవాలని భావుకుడు అనుకుంటాడు.
రమణారెడ్డిగారు అనుకున్నారు.
తన మనసుగుండా సాగిన గాన్‌ విత్‌ ద విండ్‌ మన ముందు తియ్యని తెలుగై వెలుగుతోంది.
చదవండి.
- విజయ్‌కుమార్‌
ఈ భూమి, సామాజిక రాజకీయ మాసపత్రిక, మే 2011.

చివరకు మిగిలింది?
513 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

Friday, May 27, 2011

నిరంతర ఘర్షణ ప్రధాన ఇతివృత్తం - 'రాముడుండాడు రాజ్జిముండాది' పుస్తక సమీక్ష - ఎస్‌.రామకృష్ణ (పాలపిట్ట మాస పత్రిక)


డా. కేశవరెడ్డి అభిమానిగా ''రాముడుండాడు రాజ్జిముండాది'' నవల చదివాను. ఆయన మిగతా రచనల కంటే ఇది భిన్నంగా వుంది. ఇంత సరళంగా, సింగిల్‌ లేయర్‌లో మరే ఇతర నవల లేదనిపించింది. అయితే కథను దృశ్యమానం చేయడంలో డా. కేశవరెడ్డి ముద్ర ఇక్కడ కూడా కన్పిస్తుంది.

ఉదాహరణకు 11 వ భాగంలో ''అది పౌర్ణమి వెళ్లిన తరువాతి రాత్రి. సందె చీకటి దట్టంగా అ లముకుని వుంది. కూలిపోయిన కొలిమి దాపున ఉన్న సత్రం నక్షత్రాల కాంతిలో లీలగా కనిపిస్తున్నది. మందంగా వీస్తున్న గాలి పాటకు బూడిద తొలిగిపోవడంతో పొయ్యిలోని నిప్పు కణికలు నిగనిగలాడుతో కనిపించసాగాయి. కొలిమి వెనుకనున్న వెంపలి చెట్లలోను, జిల్లేడు చెట్లలోను అసంఖ్యాకములైన మిణుగురు పురుగులు అవిరామంగా ఎగురబోతున్నాయి.'' మొత్తం నవలకు ఈ వాక్యాలు బీజప్రాయాలు.

చితికిపోతున్న గ్రామీణ జీవితాలు, ఆదరణ కోల్పోతున్న కులవృత్తులు, ఆధునికత దెబ్బతో కుంగిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న వివిధ కులాలవారు, ఈ పరిస్థితి నుండి విముక్తి కోసం నిరంతరం సాగే పోరాటం ''రాముడుండాడు రాజ్జిముండాది'' ఇతి వృత్తం.
దీన్ని దృశ్యమానం చేయడానికి డా.కేశవరెడ్డి ఈ సన్నివేశం ఎంచుకున్నారు.

ఒక రైతు చేతిలో కూల్చివేయబడ్డ కంసాలి కొలిమి, అందులో ఇంకా ఆరని నిప్పు కణికలు, జరుగుతున్న దారుణాన్ని మౌనంగా తిలకిస్తున్న మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, అవిరామంగా ఎగరాలని చూసే మిణుగురు పురుగులు. ఓ అద్భుత దృశ్యం.

పైకి కేవలం ఆర్థి సమస్యగానే కనబడే గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి కేశవరెడ్డి మానవీయతను జోడించారు. కంసాలి కొలిమిలోని ఆరని నిప్పులు వృత్తిపనివారి తరగతి నైపుణ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆకాశ,లోని నక్షత్రాలు కాస్పిక్‌ వాస్తవికతకు తార్కాణంగా, చెట్లలోని మిణుగురులు నిరంతర ఆశావాదులైన గ్రామీణులకు ప్రతీకలుగా తీసుకోవచ్చు.

ఆశ్చర్యకరంగా ఈ చాప్టర్‌లోనే బైరాగి పాత్ర ద్వారా డా. కేశవరెడ్డి ప్రస్తుత సమాజ సంక్షోభానికి కారణం వివరిస్తాడు. తంబూర మీటుతూ బైరాగి వీరబ్రహ్మంగారి తత్వాలు పాడుతున్నాడు. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు లోకం తీరు వివరిస్తున్నాడు. ''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' అతను విపులీకరిస్తున్నాడు అంటూ, మళ్లీ నేపథ్య దృశ్యాన్ని వర్ణించిన కేశవరెడ్డి ఎట్లా ''గాలి వీచే కొద్ది పొయ్యిలోని బూడిద తొలిగిపోయి నిప్పులు బయటపడుతున్నాయో'', ఎట్లా కొమ్మలను అంటిపెట్టెకున్న మిణుగురు పురుగులు కదులుతున్నాయో చెబుతాడు. ఈ ప్రపంచంలో ప్రతీదీ కదులుతుంది. కాకపోతే వాటి వేగం, గమనం విషయంలో ఒక్కోరిది ఒక్కో అంచనా.

బైరాగి దగ్గరకు వచ్చిన యువకుడు ''లోకమంతా ఇట్టానేనే సామీ?'' అని అడుగుతాడు. బైరాగి దీర్ఘంగా నిట్టూర్చి ''లోకం అంతా ఇట్లనే'' అని సమాధానం ఇస్తాడు. అంతేకాదు, ''ఎవని లోకం వానిదిగా వుంది'' అని ముగిస్తాడు.

ఒక స్థాయిలో ''రాముడుండాడు రాజ్జిముండాది'' ను కేవలం గ్రామీణ వ్యవస్థ చితికిపోవడానికి ఆధునికత, సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని చెప్పే నవలగానో, కేవలం పట్టణాలకు వలస పోవడమే కుల వివక్షకు పరిష్కారమని చెప్పే రచనగానో చూసేవారుండొచ్చు. కానీ ఫ్యూడల్‌ సమాజానికి, ఆధునిక పట్టణీకరణకు మధ్య జరిగే సంఘర్షణలో అణగారిన కులాల వారికి, కొన్ని నష్టాలూ, ఎక్కువ లాభాలూ జరిగాయని చెప్పడానికి కూడా ''రాముడుండాడు రాజ్జిముండాది'' తార్కాణంగా నిలుస్తుంది.
నిజానికి ఆర్థికాంశాలు ఎంతగా మనల్ని ఆలోచింపజేసినా, నవల చదువుతున్నంతసేపు కేశవరెడ్డి మార్కు కథనం మనల్ని డామినేట్‌ చేస్తుంది.

పెద్దనాయుడు (పెద్ద భూస్వామి), ముత్యాల నాయుడు (పెద్దనాయుడి పెద్ద పాలేరు), కోనిగాడు (పెద్దనాయుడి దగ్గర 30 ఏళ్లుగా జీతం చేసిన ముదుసలి మాల కులస్తుడు), పుల్లిగాడు (కోనిగాడి కొడుకు, మంచి జీవితం కోసం చెన్నై వలస వెళ్లిన యువకుడు), తిరిపాల నాయుడు (చితికపోయిన రైతు), గుడిపూజారి, చేతివృత్తినే నమ్ముకుని ఊరిమీద ప్రేమ చావని, శ్రమకు ప్రతిఫలం లేని కంసాలి, ''రాముడుండాడు రాజ్జిముండాది''లో ప్రధాన పాత్రలు.

ఇందులో క్లుప్తతకు కేశవరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత కొన్నిచోట్ల బాగుంది. నవలలో ప్రధాన విలన్‌ పెదనాయుడే అయినా, అతడు ఎక్కడా మనకు కనబడడు అతడి ప్రభావం ముత్యాల నాయుడి ద్వారా మనకు అర్థమవుతుంది.
వెట్టిచాకిరిని కొనసాగిస్తూనే పైకి దయామయుడిగా కన్పించడానికి పెదనాయుడి ప్రయత్నాలు ఆధునిక విలన్‌లకు దగ్గరగా ఉంటాయి. బహుశ ఎవరైనా ఈ నవలను సినిమాగా తీస్తే, చివరన కోనిగాడు తన బాండ్‌ పేపర్లను తెచ్చుకోవడానికి దొర ఇంటికి వెళ్లినప్పుడు పెదనాయుడిని, ఓ రంగుల కుర్తా వేసుకున్న ఆర్టిస్టుగా చూపిస్తే బాగుంటుంది. పైకి ఎంత తియ్యగా మాట్లాడినా, లాభనష్టాల విషయంలో అత్యంత కర్కశంగా వ్యవహరించే కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇవాళ్టి ఫ్యూడల్స్‌కు ఆదర్శం.

అన్నిరకాల భ్రమలు దూరమైనా ఊరి మీద మమకారం చావకపోవడం మానవీయ లక్షణం. కన్నీళ్లతోనే ఉన్న ఊరిని వదిలి పట్నం బయల్దేరిన ఐదుగురు- కోనిగాడు, పుల్లిగాడు, కంసాలి, తిరిపాలనాయుడు, పూజారి- మన ఊళ్లలో కన్పించే వివిధ సామాజిక వర్గాలకు ప్రతినిధులు. అయితే వీళ్లు పట్నంలో మెరుగైన జీవితం గడుపుతారా? దశాబ్దాలపాటు ఉన్న ఊళ్లో అనుభవించిన కష్టాలు గట్టెక్కుతారా? ''రాముడుండాడు రాజ్జిముండాది'' అంటూ వలసపోయే చిత్తూరు ప్రాంత గ్రామీణుల ఆశావాదమే ఈ ప్రశ్నలకు జవాబు.

- ఎస్‌. రామకృష్ణ
(పాలపిట్ట మాస పత్రిక)
సమీక్షకుని సెల్‌ నెం. 924 636 4326



Friday, May 20, 2011

సిటీ బ్యూటిఫుల్‌ - డా.కేశవరెడ్డి ...


కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను.
అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి.
కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు.
ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బా, నువు నాణెం రెండు వైపులా చూసినోడివి. సిటీలైఫ్‌ గురించి నువ్వు రాయాల'' అన్నారు. (ఇంతకీ నేను నాణెం రెండువైపులా చూసినోడినేనా?)

నాకు బాగా తెలిసన నగరం పాండిచ్చేరి నగరమే. ఆ నగరంలో ఎవర్ని గురించి రాయాలి? బాగా పరిచయమున్న విషయం గురించి మాత్రమే రాయాలన్న చాదస్తప్రాయమైన నియమం కలవాడిని. కనుక ఒక మెడికో అనుభవాలను ఆధారంగా చేసుకుని రాయాలనుకున్నాను. నా ఇతర నవలలలాగే సంఘటనలన్నీ స్వల్ప వ్యవధిలో - మూడు, నాలుగురోజులలో - జరిగిపోయేలా ప్లాటు వేసుకుని ఈ నవల రాశాను.
ఈ సమాజంలో ఏర్పరచుకున్న బూటకపు విలువలను, బోడి సంప్రదాయాలను ఆమోదించలేని ఒక ఉలిపికట్టె కథే ఇది.
- డా.కేశవరెడ్డి
(ముందుమాట 'లెస్‌ ఎలోన్‌ వెన్‌ ఎలోన్‌ లేక ఇక్కడా మనుషులేనా?' నుంచి)

......................................................................................

మన సమూహాల్లో ఒంటరితనాన్ని గుర్తు చేసే నవల యిది. ఈ సొసైటీలో మన 'బిలాంగింగ్‌నెస్‌' ని మనమే 'డిస్‌ఓన్‌' చేసుకునే ఓ ఆత్మిక సందర్భం ఈ 'సిటీ బ్యూటిఫుల్‌' అనే మంచి నవల.
ఓ గొప్ప రచయిత చేసిన అతి సాధారణ రచన అసాధారణంగా పాపులర్‌ అయిపోవచ్చు.
అదే రచయిత చేసిన ఓ అసాధారణ రచన, సామాజిక స్పృహ, నీతి సూత్రాలూ, సంఘ ప్రయోజనాల్లాంటి చాలా, చాలా 'గొప్ప' సాహితీ సూత్రాల వల్ల అతి మామూలు నవలగా, రచనగా మిగిలిపోవచ్చు. అదుగో అ లా మిగిలిపోయిన రచనే ఈ నవల అని నా ఉద్దేశం.

నిజానికి డా. కేశవరెడ్డి గారు తనమీద పడ్డ ఓ రకపు ముద్రకు తనే తనపైన అంగీకారాన్ని తెలియబరుస్తూ ఓ ఫ్రేమ్‌వర్క్‌లో రచన చేస్తూ వున్నారు...నిన్నటి ''మునెమ్మ'' దాకా.
ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్కడా ఇమడని నవల ''సిటీ బ్యూటిఫుల్‌''. డాక్టర్‌గారి అసలు సిసలు రచనా బలాన్ని... ఆయన చదువరితనాన్ని, ఆయనలోని నిర్భీతినీ 'ట్రాన్స్‌పరెన్సీ' చూపే రచన సిటీ బ్యూటిఫుల్‌.
ఇందులో కథలేదు. (కథ లేకుండా నవలేమిటన్న సామాన్య అమాయక ప్రశ్నవేసే వాళ్లకది అసలు నవల కాదు).
ఇందులో అద్భుత కథనం వుంది.
దేవీదాస్‌ అనబడే ఓ యువ మెడికో అంతస్సంఘర్షణను అక్షరబద్ధం చేయడం చూస్తామిందులో. ప్రాంతాల వారీగా ... మతాల వారీగా ... కులా వారీగా ... జెండర్‌ వారీగా సాహిత్యాన్ని చింపి చూసే, చూపే సాహితీ 'దొడ్డు' వారికి డా.కేశవరెడ్డి ఓ ప్రాంతానికి చెందిన రచయిత.

కేశవరెడ్డి గారి రచనల్లో స్థలాలూ, భాషా నేపథ్యం ఓ ప్రాంతానికి చెందినవైనా ... ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన డా.కేశవరెడ్డి గారి ప్రాత్రల మూలాలు మాత్రం విశ్వమానవీయతలో వుంటాయి.
...
జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా నిజ జీవితాన్ని సాగిస్తూన్న డా.కేశవరెడ్డిగార్ని ఓ చట్రంలో బిగించేసి చూస్తున్నవారికి, సాధారణ పాఠకులక్కూడా ఓ విభిన్నమైన నవల ఈ ''సిటీ బ్యూటిఫుల్‌''.
నా వరకూ నాకు ఇది ఆయన నంబర్‌ వన్‌.

- కాశీభట్ల వేణుగోపాల్‌
(పరిచయం 'మంత్ర నగరి' నుంచి)

..........................................

సిటీ బ్యూటిఫుల్‌
రచన: డా.కేశవరెడ్డి

122 పేజీలు
వెల: రూ.80/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067

ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Thursday, May 19, 2011

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ (క్షుద్ర దేవత) - డా. కేశవరెడ్డి ...


ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ అన్నదే ఈ నవల పేరు!
ఈ ఇంగ్లీషు పేరుకు ఒక తెలుగు అర్థం ... క్షుద్రదేవత.


కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్‌ రూమ్‌' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్‌ పర్పస'్‌ కోసం నమోదు చేయాలి.
అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను.
అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు.
''అది సరే నీ కుల వృత్తి ఏమిటి?'' అనడిగాను.
అతడు, ''అడుక్కు తింటాం'' అన్నాడు.
''చూడు బాబూ. నేను రాసుకోవాలి. నీ కులవృత్తి ఏమిటో చెప్పు'' అన్నాను.
అతడు ''మా కులపోళ్లంతా చేసేది అదే. అందరం అడుక్కుతింటాం'' అన్నాడు.
తర్వాత తెలిసిందేమిటంటే అడుక్క తినడమే కులవృత్తిగా గల కులాలు ఈ దేశంలో డజనుకుపైగా వున్నాయట.

ఈ దేశంలో వ్యవస్థీకృతమై వున్న ఈ భ్రష్టకారి కుల వ్యవస్థ మీద పోరాటం దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి సాగుతున్నది.
ఇన్ని వేల యేండ్లుగా ఏ కులమైతే తనను అవమానాలకు, అమానవీయతకు, హైన్యతకు గురిచేస్తూ వచ్చిందో ఆ కులనామాన్ని తన పేరు చివరన నేడు దళితుడు రాసుకుంటున్నాడు.
అ లా రాసుకోవడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని, తద్వారా తన సాంఘిక సమానత్వాన్ని నిర్ద్వంద్వంగా, బాహాటంగా ప్రకటించుకున్నాడు.
ఈ శతాబ్దంలో సగర్వంగా చెప్పుకోదగిన సాంఘిక చైతన్యంగా దీనిని భావించడానికి ఏమాత్రం తటపటాయించనవసరంలేదు.

ఐతే ఈ సాంఘిక చైతన్యం బాహ్యశక్తులతో పోరాడి సంపాదించింది కాదు.
వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న 'సాంఘిక' సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ''సున్న'' అని చెప్పాల్సి వుంటుంది.
కానీ 'సున్న' కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు 'అంకె' చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి
('దళితుడి పయనం' ముందుమాట నుంచి)
....................................................


మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవరెడ్డి తన చుట్టూరా వున్న సమాజంలోని నిమ్నోన్నతాల్ని, హింసా సన్నివేశాల్ని, అంతులేని యాతనతో నిండిని దీనజనుల దుఃఖ జీవితాల్నీ బాగా కళ్లు తెరచుకుని చూచిన మానవుడు.
చిన్న వయసులోనే ఒక పెద్ద ఆశయం కోసం కలం పట్టిన రచయిత.
ఏరు దాటి తెప్ప తగలేసేవాడు కాడు.
తిరుపతిలో వున్నా, పాండిచ్చేరిలో వున్నా, నిజామాబాదులో వున్నా తమ పల్లెను గురించి, అక్కడి బక్క రైతుల  యొక్క బీద కూలీల స్థితిగతులను గురించి ఆలోచించే నిజాయితీపరుడు.

ఈ నవలలో రచయిత దాపరికం లేకుండా, మొగమాటానికి పోకుండా హరిజనుల జీవన సమస్యకంతా కీలకప్రాయమైన, మూలకారణమైన లోపం ఎక్కడుందో చెప్పేశాడు.
మనిషికి యితరులవల్ల జరిగే అపకారం కన్నా, తనవల్ల తనకే జరిగే అపకారం ఆత్మహత్యా సదృశమైనదని నిరూపించాడు.
గుండెల్ని పిండిచేసే సానుభూతిలో నుంచీ వెలువడిన ఒక కరుణామయమైన ఆక్రందన యీ నవల.
- మధురాంతకం రాజారాం
(పరిచయం నుంచి)
................................

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ (క్షుద్రదేవత)
రచన: డా.కేశవరెడ్డి

155 పేజీలు
వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Sunday, April 10, 2011

ప్రాంతీయత సార్వజనీనతల సమ్మేళనం ''బషీర్‌ కథలు'' - 2, డా. కిన్నెర శ్రీదేవి ( 'మిసిమి' మాసపత్రిక ) ...

స్వాతంత్య్రం తర్వాత భారతీయ సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులన్నిటినీ సానుకూలంగా చూసే అవకాశం లేదు. వీటిలో కొన్ని సమాజ పురోగమనానికి కాకుండా తిరోగమనం వైపుకి నడిపించేవి కూడా వున్నాయి. ఉదాహరణకు వ్యక్తులకు నైతిక మద్దతు, ప్రోత్సాహం ఇచ్చిన సంస్కరణోద్యమం- స్వాతంత్య్రోద్యమం తర్వాత తిరోగమనం వైపు కదిలింది. సాంస్కృతిక రంగంలో వస్తున్న మార్పులు కూడా ప్రగతికాముకంగా లేవు. స్వాతంత్య్రానికి ముందే అమలులో వున్న ఫ్యూడల్‌ సామాజిక వ్యవస్థ స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. స్వాతంత్య్రం తర్వాత రూపుదిద్దుకున్న సామాజిక వ్యవస్థ మరింత అమానవీయంగా మిగిలింది. ఆర్థికరంగంలో వచ్చిన తీవ్రమైన మార్పులు వ్యక్తుల జీవితాలలోకి అనేక సమస్యలనూ సంక్లిష్టతలనూ తీసుకువచ్చాయి. ధనిక వర్గాల జీవిత ప్రమాణాలలో మార్పులు వచ్చాయి. సామాన్యుల జీవితాలలో మాత్రం ఈ మార్పులు ఉపద్రవంగా పరిణమించాయి. గ్రామీణ పేదలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి తీవ్ర సంఘర్షణకు లోనవ్వాల్సి వచ్చింది. వాళ్లు తమ జీవితాలలో అంతులేని పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతిమంగా, మనుషుల మధ్య వున్న సామాజిక సంబంధాలు, వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. ఈ దారుణమైన సంబంధాలన్నింటినీ బషీర్‌ కథలు హృదయాన్ని ద్రవింపజేసే స్థాయిలో చాలా విశ్లేషణాత్కంగా ప్రతిబింబించారు. మనుషుల మధ్య సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన వైనాన్ని, అందులో వున్న దారుణాన్ని ''పాత్తుమ్మా మేక'' బహిర్గతం చేసింది. అందులో తల్లీ కొడుకుల మధ్య జరిగే సంభాషణ ఎప్పుడూ డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. తన దగ్గరికి ఎప్పుడు వెళ్లినా డబ్బు అడగడానికే వెళుతుంది. తల్లీ కొడుకుల సబంబంధాలలో కూడా డబ్బు కీలకమైన పాత్ర పోషించడంలోని అమానుషాన్ని ఈ రచన ప్రతిబింబిస్తుంది. ''నీ జేబులో ఒక్క రూపాయుంటే ఇవ్వు, అయితే ఎవ్వరితోనూ ఈ విషయం చెప్పకు'' అంటుంది.
''నిన్నే కదా ఇచ్చింది.'' అంటాడు కొడుకు.

ఇలా నిరంతరం తల్లి డబ్బు కోసం మాత్రమే రావటం కొడుకులో అసహనానికి కారణమవుతుంది. ఒక ఉద్రేక పూరితమైన సందర్భంలో తల్లితో ఇలా అంటాడు:
''ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో లేకపోతే నేనే ఇల్లు వదిలి పోతా''. కుటుంబంలో అందరికీ అతని డబ్బు కావాలి. కొంత మంది అతని డబ్బుకు తామే వారసులని భావిస్తుంటారు. కుటుంబాలలోని వ్యక్తుల మధ్య డబ్బు నిర్వహిస్తున్న, నిర్వహించబోతున్న దారుణమైన పాత్రను చాలా ముందుగానే పసిగట్టి దాన్ని కాల్పనిక సాహిత్యంలో విశ్లేషించగలిగాడు బషీర్‌.

బషీర్‌ కథల్లో దారిద్య్రం దాని ఫలితంగా జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు, ఆ వైఫల్యాలకుండే పర్యవసానాలు ప్రధాన వస్తువులు. ఒక ప్రత్యేకమైన హాస్యం దాన్ని వెంటాడివుండే వ్యంగ్యం బషీర్‌ రచనా శైలితో విడదీయరాని అంశాలు. నిజానికి బషీర్‌ హాస్యం వెనుక అంతులేని విషాదం వుంది. బషీర్‌ చాలా సందర్భాలలో హాస్యాన్ని తగినంతగా వాడుకోలేకపోయానని వాపోయిన సన్నివేశాలు కూడా వున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వలస పాలన అమలులో వున్న కాలంలో తను స్వేచ్ఛాపూరితంగా రచన చేయలేకపోయాననీ, అసలు తనకలాంటి అనుకూలమైన వాతావరణం లేదని ఒక ఇంటర్వ్యూలో బషీర్‌ అభిప్రాయపడినాడు. (ఇండియన్‌ లిటరేచర్‌, సాహిత్య అకాడమీ జర్నల్‌ మే-జూన్‌2008). అదే ఇంటర్వ్యూలో తాను కోపంతో రగిలిపోతూ వుండటం వలన ''పాత్తుమ్మా మేక'' అనే హాస్యస్ఫోరక రచన చేశానని చెప్పారు. ఆ రచన ఉత్తమ పురుషలో నడుస్తుంది. అందుకే ఆయన చిత్రించిన జీవితం ఆద్యంతం ఆర్థిక సంక్షోభాన్ని గురించే అయినప్పటికీ అందులో ఎక్కడా కూడా ఆర్థిక అంశాల ప్రస్తావన లేనే లేదు. అ లాగే యుద్ధాల ప్రసక్తిగానీ, వాటి ప్రభావాల గురించిన చర్చగానీ, అంతెందుకు అసలు స్వతంత్ర ఉద్యమాన్ని గురించిన ప్రసక్తిగానీ కనపడదు. అయితే ఈ అంశాలను పాత్రల అంతఃచేతనను వర్ణించే క్రమంలో చిత్రించటం జరిగింది. దాదాపు అన్ని పాత్రల పై ప్రభావాల భారాన్ని మోస్తూ, వాటి గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాలలో ఎటువంటి సంకోచం లేకుండా విశదపరచడం కనిపిస్తుంది.

ఉదాహరణకి ఇదే కథలో కథకుడి సోదరుడు అబ్దుల్‌ ఖాదర్‌ కూడా ఇతన్ని డబ్బులు అడుగుతాడు. అయితే అతను విభిన్నమైన కారణాలు చూపిస్తాడు. అతని చెల్లెలు కూడా అతన్నించి డబ్బే ఆశిస్తుంది. వాళ్లందరి దృష్టిలో అతడు డబ్బులిచ్చే ఒక యంత్రం లేక సాధనం. అతన్ని వాళ్ళెప్పుడూ కూడా తన రక్త సంబంధీకుడుగా చూడరు. వాళ్లతనితో జరిపే సంభాషణలన్నీ ఏదోరకంగా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. మనుషుల మధ్య సంబంధాలను డబ్బులు నిర్దేశించటమనేది ఇవ్వాళ ఉన్నంత దారుణంగా బషీర్‌ కాలంలో ఉండి ఉండే ఆస్కారం లేదు. బషీర్‌ కథలు చదువుతుంటే, అతడు తన కాలాన్ని దాటి ఎంత లోతుగా భవిష్యత్తును పరిశీలించగలిగాడో తెలుస్తుంది. అసలు బషీర్‌ కథలన్నీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలలో డబ్బుపట్ల వుండే ఆకాంక్షను బహిర్గతం చేస్తాయి. చాలా లోతుగా ఎటువంటి సంకోచాలు లేకుండా మానవ కార్యకలాపాలను డబ్బు నిర్వహించే పాత్రను బషీర్‌ విశ్లేషించి ముఖ్యంగా నిర్దిష్ట సందర్భాలను సృష్టించడం ద్వారా విమర్శకు గురిచేస్తాడు. ఎటువంటి రచయితైనా భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగేందుకు అవసరమైన విశ్లేషణా పరికరాలను ఇవ్వగలిగారు. బషీర్‌లో అటువంటి శక్తి గణనీయంగా వుంది. అందువలననే తానున్న సమాజం తీసుకోబోతున్న మార్పులను, ఎదుర్కోబోతున్న పర్యవసానాలను ముందుగానే పసిగట్టి, వాటిని కాల్పనిక సాహిత్య రూపంలో వ్యక్తం చేశాడు. తద్వారా తానున్న సమాజాన్ని చైతన్యవంతం చేసే కృషికి పూనుకున్నాడు. ఏ రచయితైనా కేవలం సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడం ద్వారా గొప్ప రచయిత కాలేడు. అంతకంటే ముఖ్యంగా ఆ రచయిత తానున్న సమాజం ఎదుర్కోబోతున్న ప్రమాదాలను పసిగట్టి విశ్లేషించగలిగినప్పుడే ఆ రచయిత శక్తి సామర్థ్యాలు అవగతమవుతాయి. ఈవిధంగా చూసినప్పుడు బషీర్‌ తన కాలం కంటే చాలా ముందున్నాడన్న విషయం స్పష్టమవుతుంది. బషీర్‌ పై పనిని అత్యంత కళాత్మకంగా చేయగలిగాడు. తాను ప్రదర్శించగలిగిన వస్తురూప సమతౌల్యత వల్లే గొప్ప రచయితగా కీర్తించబడుతున్నాడు.

''పాత్తుమ్మా మేక'' గురించి మాట్లాడుతూ బషీర్‌ అందులోని కథ మూఢనమ్మకాలలో జీవిస్తూ వున్న ముస్లిం కుటుంబాలకు సంబంధించిందని అన్నాడు. సమాజంలో కొనసాగుతూ వున్న జాతి, మత, జెండర్‌ సంబంధిత వ్యత్యాసాలను, తరతరాలుగా అవి కొనసాగుతున్న తీరును ప్రశ్నించే పనికి పూనుకున్నాడు. బషీర్‌ ఎక్కుపెట్టిన ఈ విమర్శ ఒక నిర్దిష్ట మతంపైనేనని, ఆ మతాన్ని విమర్శించేందుకు ఆ  కాలంలో ఎవరూ సాహసించలేని సందర్భంలో బషీర్‌ రచన చేశాడని తెలిసినప్పుడు బషీర్‌ ప్రతిభ తెలుస్తుంది. ''పాత్తుమ్మా మేక''తో పాటు మిగతా కథల్లోని ఏ పాత్ర కూడా పాఠకుల తిరస్కరణకు గురికాదు. పాత్తుమ్మాలోని నిరాశా నిస్పృహలకు ఆమె తండ్రి ఎంతగా కారణమో పాఠకులకు స్పష్టంగానే అవగతమతుంది. అయితే, ఆ పాత్ర పట్ల పాఠకులు ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోరు. ఎందుకంటే, ఆ తండ్రి పాత్ర ప్రవర్తనకు కారణం అతడున్న స్థితి. అ లాంటి స్థితిలో ఎవరూ కూడా అ లాకాక మరో రకంగా ప్రవర్తించలేరనే విషయాన్ని పాఠకులు అంగీకరించేట్లుగా బషీర్‌ చిత్రిస్తాడు.

''పాత్తుమ్మా మేక'' ప్రారంభంలోనే కథకుడు తాను ప్రపంచమంతా తిరిగి విసిగి పోయిగాని ఇక ఇంటి దగ్గిరే వుండి ప్రశాంత జీవితాన్ని గడపాలనుకుంటాడు. తన ఇంటి చుట్టూ ఆవరించివున్న చెట్లు, పూలతోటల మధ్య తన బంధువులతోనూ, తన ఆత్మీయులతోనూ గడపాలనుకుంటాడు. అయితే తానుండాలనుకున్న ఇల్లు అద్దెకిచ్చేశారని తెలుసుకొని తాను వంచింపబడినాడని తెలుసుకొని బాధపడతాడు. తన స్వప్నం మొత్తం ధ్వంసం అయిందని చింతిస్తాడు. ఈ కథలో బషీర్‌ తన కాలపు వైయక్తిక, సామాజిక అచేతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు.

ఉత్తమ పురుషులో సాగే కథను ఎక్కువ సందర్భాలలో రచయిత యొక్క  ప్రాపంచిక దృక్పథాన్ని వ్యక్తం చేస్తాయి. చాలా కథలను బషీర్‌ ఉత్తమ పురుషులోనే రాశాడు. కొన్ని కథలలో తానే కథకుడుగా వుంటాడు. అందువలన తన ప్రాపంచిక దృక్పథాన్ని గురించి పాఠకులకు నిర్దిష్టమైన  అవగాహన కలుగుతుంది. ''పాత్తుమ్మా మేక''లో కూడా రచయితను కథకుణ్ణి వేరుచేయటం సాధ్యం కాదు. బషీర్‌ తన కథలలో పాత్రలన్నింటిని రోజువారీ జీవితం నుంచి గ్రహించాడు. అంత మాత్రం చేత అవి మూసలు కావు. తన పాత్రలను రక్తమాంసాలతో సజీవ వ్యక్తులలాగా మలిచాడు. ఆ పాత్రలన్నీ మనుషులకు వుండే అన్ని అనుభూతుల సమాహారంగా కనిపిస్తాయి. సాహిత్యం వాస్తవికతను ప్రవచించినప్పటికీ అది అర్థంలో ప్రతిబింబంలాగా వుండదు. సాహిత్య ప్రతిఫలనంలో కళ ఒక కొత్తరూపాన్ని పొందుతుంది. ఇది సాధారణ వాస్తవికత నుంచి భిన్నంగా వుంటుంది. దీనిపట్ల బషీర్‌కు పూర్తి స్థాయి అవగాహన వుంది. అందువలననే అతని కథలు చాలా సాదాసీదా అంశాలుగా అసాధారణాంశాలుగా కనిపిస్తాయి. ఈ అసాధారణ అంశం బషీర్‌ కథలను పాఠకులకు దగ్గర చేస్తుంది.

పరిచిత ప్రాంతాలను వాటి భౌగోళిక స్వరూపాలను బషీర్‌ తన కథలలో నిరంతరం ప్రస్తావిస్తుంటారు. అందువలననే ఎర్నాకులం, ఎడపాల్‌ రైల్వేస్టేషన్‌, కాలికట్‌ సబ్‌ జైల్‌, వైకం, తలయార పెరంబో లాంటి ప్రాంతాలు బషీర్‌ కథల్లో పునర్నింపబడుతూ వుంటాయి. సాహిత్యం ఎంత విశ్వజనీన మైనప్పటికీ సారాంశంలో అది అత్యంత ప్రాంతీయంగా వుంటుంది. అ లా వున్నప్పుడు మాత్రమే అది పాఠకుల్ని కదిలించగలుగుతుంది. ప్రపంచంలో గొప్ప సాహిత్యం అనదగిన దాన్ని దేనిని పరిశీలించినా ఈ విషయమే స్పష్టమవుతుంది. బషీర్‌ కూడా తన కథల్లో ఈ ప్రాంతీయతను విశ్వజనీనతతో మేళవించి చిత్రించాడు. ఉదాహరణకు తన చాలా కథలలో 'లైకమ్‌' అనే ప్రాంతాన్ని తిరిగి సృష్టించాడు. ఆ ప్రాంతంలోని సాధారణ ప్రజలు, వారి దారిద్య్రం, వాళ్ల ఆత్మిక సంక్షోభాలన్నీ కూడా ఆయన కథలలో ప్రతిఫలించాయి. ఆర్థిక సమస్యల వలన చెదిరిపోయిన మనసుల జీవితాల చిత్రీకరణ ఆయన కథలలో అడుగడుగునా కనిపిస్తుంది. తాను చిత్రించిన జీవితంలో వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా తాను అనుభవించిందే కావటం వలన ఆ చిత్రీకరణ అందరికీ ఆమోదకరంగానూ, అంగీకారయోగ్యంగానూ కనిపిస్తుంది.

బషీర్‌ కథలలో సార్వత్రిక అంశాలతో పాటు  యదార్థ అంశాలు కలిసి వుండటం వలన అవి మిగతా భాషలలోకి అనువదింపబడినప్పుడు కూడా ఆయా భాషలలోని పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. జీవితాన్ని దాని యదార్థ స్థితిలో పరిశీలించి, సృజనాత్మకంగా విశ్లేషించి చిత్రించటం వలననే వాటిని అనువాదాలలో ఎటువంటి అపసవ్యత లేకుండా తీసుకురావడానటికి వీలు కలిగింది. ఎటువంటి భావోద్వేగాలకు లోనుగాకుండా జీవితాన్ని దాని మొరటు రూపంలో పరిశీలించి ఆ తర్వాత చిత్రీకరణకు పూనుకోవటం వలన ఆ కథలపై  ఆయన స్వతంత్ర ముద్రతో పాటు విశిష్టమైన విశ్లేషణకూడా కనిపిస్తుంది. ఆయన తన కథలలో జీవితాన్ని కొంత సానపట్టి చిత్రించినప్పటికీ అందులో ఎటువంటి కృత్రిమత్వం కనిపించకపోవటం గమనార్హం.

ఏ రచయితకయినా తాను చిత్రిస్తున్న జీవితం పట్ల గౌరవం నమ్మకం కూడా వుండాలి. ఆ జీవితాన్ని జీవిస్తున్న పాత్రల పట్ల గౌరవం కూడా వుండాలి. ఈ లక్షణాలన్నీ బషీర్‌లో పుష్కలంగా వుండటం వలన ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖుడిగా నిలబడగలిగాడు.

బషీర్‌కు తాను చిత్రించిన స్త్రీ పాత్రల పట్ల అచంచలమైన గౌరవం వుంది. (లవ్‌ లెటర్‌) ''ప్రేమలేఖ'', ''బంగారు ఉంగరం'' లాంటి కథలను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ''ప్రేమలేఖ'' కథలో చాలా సందర్భాలలో బషీర్‌ స్త్రీలను ''ఖాళీ బుర్రలు'' అని హేళనగా ప్రస్తావిస్తుంటాడు. అయితే ఈ ప్రస్తావనలన్నీ సారమ్మ పాత్ర సృష్టిలో ఆయన చూపించిన నైపుణ్యం ఆ పాత్రకిచ్చిన వ్యక్తిత్వం మేధస్సు తార్కి జ్ఞానం, ప్రేమ లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు బషీర్‌కు స్త్రీలపట్ల వున్న గౌరవం స్పష్టమవుతుంది. ''బంగారు ఉంగరం'' కథలో కూడా భర్త తన భార్యను పనికిమాలినదని, తెలివి తక్కువదని అంటూ వుంటాడు. అయితే కథలో చాలా సందర్భాలలో ఆమె మేధస్సు ముందు భర్త ఓడిపోతూ వుంటాడు. నిజానికి బషీర్‌ స్త్రీ పాత్రల రూపకల్పనలో వాటికి నిర్థిష్టమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వటంలో తన కాలం కంటే ముందే వున్నాడు. స్త్రీ పురుష సంబంధాల గురించి ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం గురించి లోతైన అవగాహన వుంది. అతని పాత్రలన్నీ సంప్రదాయ ముస్లిం కుటుంబాలనుంచి వచ్చినటువంటివి. ఇవి అప్పుడప్పుడు 'బాలెన్స్‌' కోల్పోతుంటాయి. అయితే, కుటుంబ సంబంధాలను నిలుపుకొనేందుకు , అవి తమను తాము సరిదిద్దు కుంటుంటాయి. బషీర్‌ రాసిన 'అమ్మ' లాంటి కథలో కూడా ఈ విషయాలను గమనించవచ్చు. ఈ కథ స్వతంత్య్రోద్యమంలో పాల్గొనటానికి వెళ్లిన తన కొడుకు పట్ల తల్లికున్న ప్రేమను వ్యక్తం చేయటమేకాక ఆ కొడుకు కోసం ఆమె ఎదురు చూపుల్ని చిత్రించే క్రమంలో కథకుడు చాలా ఉచ్ఛస్థితికెళ్లి చిత్రించటం కనిపిస్తుంది. ''గోడలు'' అనే కథ బషీర్‌ రాసిన ఉత్తమ కథలలో ఒకటి. ప్రేమ అనే భావనను బషీర్‌ ఈ కథలో చాలా విస్తృతమైన అర్థంలో చూపిస్తాడు. నిజానికి ఎప్పుడూ కలవని ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడ్డ ప్రేమను చిత్రించిన కథ అదే కావచ్చు. ఈ ప్రేమికులు కలువకుండానే విడిపోయిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను కాపాడుకోవడం అనేది గమనించదగిన అంశం. ఈ ప్రేమికులిద్దరు ఒక పెద్ద గోడ చేత విడదీయబడ్డ ఇద్దరు ఖైదీలని తెలిసినప్పుడు, ఈ కవి పట్ల పాఠకులలో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. తాము ప్రేమలో వున్నామన్న భావాన్ని కాపాడుకోడానికి తాము జైలు నుంచి బయటకు వెళ్లి స్వేచ్ఛగా వుండే అవకాశాన్ని కోల్పోవటానికి సిద్ధమవుతారు. ప్రేమలేని స్థితిలో స్వేచ్ఛ వారికి అవసరంగా అనిపించదు. కథకుడు ఈ కథలో గోడను ఒక రూపకంగా చూపించారు. ప్రతి రూపకానికి బహుళార్థాలుంటాయి. అ లాగే ఈ కథకు కూడా.

ఈ లక్షణాల వల్లనే బషీర్‌ కథలలో, ఈ కతకి విశేషమైన పేరు వచ్చింది. పై పరిశీలన తర్వాత కథ వస్తు రూపాలలో, పాత్ర చిత్రీకరణలో ప్రాంతీయతను ప్రతిబింబించడంలో వ్యక్తుల జీవితాలను నడిపిస్తున్న ఆర్థిక అంశాల విశ్లేషణలో వ్యక్తిలోని ఔన్నత్యాన్ని పెంచటంలో ప్రేమకున్న ప్రాధాన్యతను ప్రతిబింబించడంలో బషీర్‌ చూపించిన ప్రతిభ అతన్ని ప్రపంచ కథా సాహిత్యంలో ఏ కథా రచయితకు తీసిపోని స్థాయిలో నిలబెట్టగలిగింది.

- డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి,
  ( 'మిసిమి' మాస పత్రిక, ఏప్రిల్‌ 2011 సౌజన్యంతో )




బషీర్‌ కథలు
290 పేజీలు, వెల: రూ.100
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

Friday, April 8, 2011

ప్రాంతీయత సార్వజనీనతల సమ్మేళనం ''బషీర్‌ కథలు'' -1, డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి, ( 'మిసిమి' మాసపత్రిక ) ...


ప్రతి భాషలోనూ మాస్టర్‌ రైటర్స్‌ అనదగిన వాళ్లుంటారు. వాళ్లు తమ రచనాశక్తితో ఆయా భాషా సాహిత్యాలపురోభివృద్ధికి కారణమవుతారు. మళయాళ సాహిత్యంలో వైకం మహమ్మద్‌ బషీర్‌ అటువంటి మాస్టర్‌
రైటర్‌. బషీర్‌ తన రచనలతో మళయాళీ సాహిత్య ప్రపంచాన్నే కాక మిగతా భారతీయ భాషా సాహిత్యాలనుకూడా ప్రభావితం చేయగలిగారు. నిజానికి ఏ భాషా సాహిత్యంలోనైనా బషీర్‌లాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే, వీళ్లు స్థలకాలాలకు, వాటి పరిమితులకు పరిమితమై ఆలోచించకుండా భావుకతతో వాటిని దాటి సృజనాత్మకంగా రాయగలుగుతారు. వాళ్ల రచనల సారానికి (ఎస్సెన్స్‌) వారిఅస్తిత్వ సారానికి మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. దాని ఫలితంగా వాళ్ల రచనలు ప్రత్యేకంగావుండటమే కాకుండా నిర్దిష్టంగా కూడా వుంటాయి.

బషీర్‌ కాల్పనిక సాహిత్యంలో అన్ని రూపాలలోనూ రచన చేసినప్పటికీ, ప్రముఖంగా సాహిత్యలోకం ఆయనను కథా రచయితగానే గుర్తించింది. బషీర్‌ కథలు మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావాన్ని, రెండవప్రపంచ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను వాటి నేపధ్యంలో ప్రదర్శిస్తాయి. అదే సందర్భంలో ఆ రెండుప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభాలు, కష్టాలు ఆయన కథల్లో ప్రతిఫలిస్తాయి. ఆకాల సామాజిక సందర్భాలను అన్ని రూపాలలో ఆయన కథలు చిత్రిస్తాయి. ఆ రకంగా, ఆయన కథలుమానవ సంకట స్థితిని దాని సూక్ష్మ్ర రూపాలలోకి వెళ్లి కూడా ప్రతిఫలింపజేయటం జరుగుతుంది. ఒకమేదావి అయిన కథా రచయితగా ఆయన సామాజిక సన్నివేశాలలో వుండే కఠోర వాస్తవాలను వాటిసున్నితమైన కఠోరమైన రూపాలను పట్టుకొని కథలలో చిత్రిస్తారు. ఆయన కథలు ఆ రచయిత భావనాప్రపంచాన్ని ప్రాపంచిక దృక్పథాన్ని చాలా స్పష్టంగా ఎటువంటి జంకు లేకుండా ప్రదర్శిస్తాయి. ఆయన ఒకవ్యక్తిగా తన రోజువారీ జీవితంలో పరిశీలించిన ప్రజలనే పాత్రలుగా మలచుకుంటారు. నిజానికి, ఆయన
సృష్టించిన పాత్రలన్నీ ఆయనతో పరిచయమున్న వాళ్లను నమూనాలుగా స్వీకరించి సృష్టించినవి.

బషీర్‌ ఒకానొక అరుదైన తాత్విక దృక్కోణంలోంచి తన అనుభవాలను పరిశీలించి వాటికి కథారూపం ఇచ్చారు. వైయక్తికమైన అంశాలను చారిత్రకమైనవిగా తాత్కాలికమైన విషయాలను శాశ్వతమైనవిగాచూస్తూ  అ ల్ప విషయాలను కూడా ఉదాత్తమైన అంశాలుగా ఆయన చూడగలిగాడు. ఆ దృష్టే ఆయన కథల్లో నిరంతరం వెన్నంటి వుంది. బషీర్‌ సాధరణమైన, ఎటువంటి విద్యలేని కేరళలోని పేద ముస్లిం కుటుంబాలలోని సంక్షోభాన్ని, ఆధునికతలోకి ప్రవేశించలేక తమ మత సంబంధమైన పునాదులను పెకిలించుకోలేక సంక్షోభంలో ఉన్న స్థితిని కథలుగా మలిచారు. ఆ పాత్రల జీవితాలను అనివార్యంగా ఆవరించుకొన్న విషాదాన్ని అవి ఆమోదించి జీవిస్తూ వుండటం కూడా కనిపిస్తుంది. ఆయన పాత్రలు తమ చుట్టూ వున్న వ్యక్తులపట్ల గాఢమైన ప్రేమతో వుంటాయి. ఈ ప్రేమ పశు పక్ష్యాదుల పట్ల కూడా విస్తరించింది.

పాశ్చాత్య ప్రపంచ ప్రజల మీద వారి ఆత్మిక సాంఘిక జీవితాల మీద రెండు ప్రపంచ యుద్ధాలు విపరీతమైనప్రభావాన్ని చూపి,చాయి. మొదట ఆ యుద్ధాలు ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేస్తే ఆ తరువాత వాళ్ల మనో ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేశాయి. శతాబ్దాలుగా వాళ్ళను నడిపిస్తున్న విలువల పట్ల నమ్మకం పోయింది.వాళ్ల సామాజిక అంత:చేతనాన్ని, మూర్తిమత్వాన్ని రూపుదిద్దిన సంస్కృతి పట్ల కూడా వారికి విశ్వాసం సన్నగిల్లింది. మనిషి తాను ఒంటరివాడిననే భావనకు లోనై క్రమంగా జీవితంపట్ల నిస్పృహతో కూడిన వైఖరిని ఏర్పరచుకున్నాడు. అయితే, అటువంటి అసంబంద్ధ సందర్భం మనిషికి తన అస్తిత్వాన్ని, దాని అర్థాన్ని గురించి లోతుగా ఆలోచించుకోవటానికి ఆస్కారాన్ని కూడా కల్పించింది. ఆ కాలంలో భారతదేశంలో కూడా యుద్ధ పరోక్ష ప్రభావాల వల్ల అటువంటి వాతావరణమే, ఆ తరహా నైరాశ్మమే అలముకొని వుంది. తమ అస్తిత్వాలను గురించిన సగటు మనిషి ఆందోళన, అందుగురించిన లోతైన
ఆలోచన మొదలైన అంశాలే చాలామంది కాల్పనిక సాహిత్యకారులకి వస్తువులయ్యాయి. బషీర్‌ లాంటి వాళ్లు ఆ కోవకు చెందిన వాళ్లే. బషీర్‌ తన సమకాలీన ప్రజల సమస్యలను, సంకట స్థితిని, అత్యంత సానుభూతితో అర్థం చేసుకొని వాటికి కథారూపం ఇచ్చారు.

మానవ స్వభావాన్ని మొరటు వర్గీకరణలోంచి కాకుండా తాత్వికంగా అర్థచేసుకోగలిగిన ఏ రచయితలోనైనా క్షమాగుణం అనేది అనివార్యంగా వుంటుంది. ఈ క్షమాగుణమే బషీర్‌ లాంటి వాళ్లను కథా సాహిత్యం వైపు
నడిపించింది. తన చుట్టూ వున్న మనుషుల పరిమితుల్ని, అసంపూర్ణత్వాన్ని ఆయన అర్థంచేసుకొని, ఆ
అవగాహనలోంచే ఇవాళ వాళ్లను కథాలోకంలో పాత్రల లాగా ప్రవేశపెట్టి క్షమించారు. సాదాసీదా రచయితలకు ఇటువంటి లక్షణం అసాధ్యం. వాళ్లు తాము సృష్టించే పాత్రల పరిమితుల్ని అవి చేసే పొరపాట్లను తప్పులను విద్వేషంతో చూసి చిత్రిస్తారు. ఫలితంగా, ఆ పాత్రలు సజీవత్వాన్ని సంతరించుకోకపోగా, ఆ రచన కేవలం జీవితాన్ని వాఖ్యానించేదిగానూ, అసమగ్రంగానూ మిగులుతుంది.

బషీర్‌ కథలు ప్రధానంగా ముస్లిం కుటుంబాల జీవితాలను వస్తువుగా స్వీకరించినప్పుడు అవి కేవలం వారికి
మాత్రమే పరిమితమై వుండక మిగతా సామాజిక బృందాలను కూడా కదిలించగలిగాయి. అత్యంత దయనీయమైన  దారిద్య్రాన్ని అనుభవిస్తూ, మానసిక ప్రపంచంలో అనేక గాయాలకు గురైన  ముస్లింలు ఆయన కథా సాహిత్యంలో పాత్రలుగా మనకు పరిచితమౌతారు.

బషీర్‌ ప్రముఖ రచనలలో ఒకటి ''పాత్తుమ్మ మేక''. ఆ కథలో ప్రధాన పాత్ర అంతర్ముఖుడైన కథకుడు. అతను భావనా ప్రపంచంలోనే సంచరిస్తూ వుంటాడు. అసలు ఆ పాత్రను పరిచయం చేయటంలోనే ఈ విషయాన్ని నిర్థారించటం జరుగుతుంది. ఈ పాత్రను సాధారణ పద్ధతిలో కాకుండా కథ నడిచే క్రమంలో పరిచయం చేయటం జరిగింది. నిజానికి వాశ్లేషించే క్రమంలోనే ప్రధాన పాత్రను కథకుడు రంగం మీదకు తీసుకవస్తాడు. ఆ తరువాత ఆ పాత్ర వివిధ సందర్భాలలో తనను తాను ఆవిష్కరించుకుంటూ ఎదుగుతుంది.  కథ ప్రధానంగా కథకుడి దృక్కోణంలోనుంచే నడుస్తుంది. సోమర్‌సెట్‌ మామ్‌ లాంటి చేయి తిరిగిన కథకులు యదార్థ జీవిత సన్నివేశాల నుంచి పాత్రలను స్వీకరించటం అత్యవసరమని భావించారు. అప్పుడు మాత్రమే సాహిత్యానికి కొంత విశ్వజనీన లక్షణం ఏర్పడుతుందని కూడా ఆయన భావించారు. బషీర్‌ రాసిన అనేక కథలలో సరిగ్గా ఈ లక్షణమే కనిపిస్తుంది.

వ్యక్తిక,ి సమాజానికి వున్న సంబంధం గతితార్కికమైనదని కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. వక్తి సమాజంలోనే వికసిస్తాడు. సమాజం ఒక రకంగా వ్యక్తి స్థూల రూపం. సమాజం కూడా వ్యక్తి నుంచే రూపొందుతుంది. ఏ వ్యక్తీ తాను జీవిస్తున్న సంస్కృతీ సంప్రదాయం ప్రభావాల నుంచి తప్పించుకోలేడు. ఈ సంస్కృతీ సంప్రదాయాల వలనే వ్యక్తులకు కొన్ని సార్వత్రిక లక్షణాలుంటాయి. ఈ సార్వత్రిక లక్షణాల వలన మిగతా సమాజం నుంచి తనను తాను వేరుగా ప్రతిష్టించుకోగలుగుతాడు. సమాజాన్ని మార్చగలిగే వ్యక్తి తనను తాను మార్చుకోగలుగుతాడు. ఈ లక్షణాలన్నింటినీ బషీర్‌ తన కాల్పనిక సాహిత్యంలో విరుద్ధ స్వభావాలూ ప్రవృత్తులూ వున్న పాత్రల ద్వారా చిత్రించాడు.

- డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి,
   'మిసిమి' మాస పత్రిక, ఏప్రిల్‌ 2011 సౌజన్యంతో

...................................................................(ఇంకా వుంది)

బషీర్‌ కథలు
290 పేజీలు, వెల: రూ.100
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

Sunday, March 27, 2011

మార్పు జెండా - విరాట్, ఈనాడు


మార్పు జెండా 
అమెరికాలో బానిస విధానం రద్దయింది. బానిసల మీదే ఆధారపడ్డ భూస్వాములు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతర్యూద్ధం మొదలైంది. "గాన్ విత్ ది విండ్" నవల  నేపధ్యం ఇది. పాత పధ్ధతుల్ని వదులుకోలేకా కొత్త మార్పులు మింగుడు పడకా అప్పటి ప్రజలు పడ్డ సంఘర్షణ నవలలో దర్శనమిస్తుంది. ఆ పరిణామ క్రమంలో అంతర్మధనానికి గురయ్యే ప్రధాన పాత్ర స్కార్లెట్. మిగతా పాత్రలూ సన్నివేశాలూ కూడా మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దంపడతాయి. మార్గరెట్ మిచ్చెల్ రాసిన ఈ నవల అప్పట్లో  ఓ సంచలనం. దానికి తెలుగు అనువాదమే  "చివరకు మిగిలింది?" అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన పుస్తకాన్ని తెలుగు పాఠకులకు  అందించాలన్న ప్రయత్నం ప్రశంసనీయం,.
- విరాట్
ఈనాదు ఆదివారం, 27-3-2011 సౌజన్యంతొ    

  

Thursday, March 24, 2011

చంద్రగిరి పై సాహసయాత్ర-2 ... కాత్యాయని ...

చంద్రగిరి పై సాహసయాత్ర-2 ... 

ఆ తర్వాత శంకర్‌ సాగించిన ఒంటరి ప్రయాణాన్నీ, అతనికి ఎదురైన ప్రమాదాలనూ ఒళ్లు గగుర్పొడిచేలా వర్ణిస్తాడు రచయిత. వజ్రాలగని కనబడినా గుర్తించలేకపోతాడు శంకర్‌. వజ్రాలను గులకరాళ్లుగా పొరబడి, దారి పొడవునా గుర్తుపెట్టుకునేందుకు వాడుతుంటాడు. చివరికి రెండు మాత్రమే అతని జేబులో మిగులుతాయి. తమలాగే వజ్రాల వేటకు బయల్దేరి, దిక్కులేని చావుకు గురైన అటీరియో అనే ఇటాలియన్‌ యువకుడి అస్థిపంజరమూ, అతను రాసి ఉంచిన లేఖా కంటబడటంతో వజ్రాలపై పూర్తిగా విరక్తి కలుగుతుంది అతనికి.  అతి కష్టంపై కలహారి ఎడారిని దాటి, కొన ప్రాణాలతో రొడీషియాకు చేరి కోలుకుని, భారతదేశానికి బయల్దేరటంతో కథ ముగుస్తుంది.

బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ అనే భావుకుడూ, తాత్వికుడూ, మానవతావాదీ అయిన రచయిత చేతిలో పడకపోయి వుంటే ఈ కథ ఒక మామూలు సాహస గాథగా మిగిలిపోయేది. కానీ, సంపదల కోసం పరుగులు తీయటం మానవ జీవితాన్ని ఎంత విషాదంగా అంతం చేస్తుందో చెప్పటానికి ఈ కథను ఉపయోగించుకున్నాడు రచయిత. జిమ్‌కార్టర్‌, అ ల్వరెజ్‌, అటీరియో లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరును చూస్తుంటే ''గోల్డ్‌ రష్‌'' తాలూకు అమానవీయ పరిణామాలను చిత్రించిన జాక్‌ లండన్‌ కథలు గుర్తొస్తాయి. పాశ్చాత్య దేశాల పెట్టుబడిదారీ సమాజాలకు చెందిన ఆ యాత్రికులూ, నిరుపేద భారతీయ యువకుడు శంకర్‌ ప్రయాణించిన మార్గం ఒకటే అయినా లక్ష్యాలు ఒకటి కావనీ, కాకూడదనీ ఎంతో సున్నితంగా చెప్తాడు రచయిత. శంకర్‌నొక సూపర్‌మాన్‌గా- సాహసాలు చేసే, డబ్బు సంపాదించే యంత్రంగా ఆయనెక్కడా చూపలేదు. సాహసం, భావుకత్వం, సౌందర్య దృష్టి, మానవ సంబంధాలపై గౌరవం, తన గ్రామంతో అనుబంధం, సత్యాన్వేషణ- అన్ని గుణాలూ కలబోసిన సహజమైన పాత్ర శంకర్‌. ఖండాంతరాల్లో పర్యటిస్తున్న అతని హృదయమెప్పుడూ మానవీయంగా ఉంటుంది. వజ్రాలగని దొరికితే తను ఎంత సంపన్నుడవుతాడో, జీవితం ఎంత సుఖవంతమవుతుందోననే ఊహకు బదులుగా- ఎందరు పేదల కన్నీళ్లు తుడవగలనో, ఎందరు నిరుపేద యువతులకు పెళ్లిళ్లు చెయ్యగలనో, ఎందరు వృద్ధులకు రక్షణ కల్పించగలనో అనే ఆలోచిస్తాడు శంకర్‌. వజ్రాల వేటకు బయలుదేరిన ఇతరులకూ. అతనికీ ఉన్న భేదం అదే.

'పథేర్‌ పాంచాలి', 'అపరాజితో', 'వనవాసి' వంటి నవలల్లో బిభూతి భూషణ్‌ తిరిగిన ప్రాంతాల, ఆయన జీవితానుభవాల చాయలు స్పష్టంగా వ్యక్తమవుతాయని ఆయన జీవిత చరిత్రను రాసిన సునీల్‌ కుమార్‌ ఛటోపాధ్యాయ చెప్పారు. కానీ, తానెన్నడూ చూడని ఆఫ్రికా గురించి ఇంత వివరంగా రాయగలగటమే 'చందేర్‌ పహార్‌' (చంద్రగిరి శిఖరం) లోని విశేషం. ప్రపంచం నలుమూలల్లోని భౌగోళిక, ప్రకృతి విశేషాలనూ-సాహస గాథలనూ ఎంతో ఆసక్తిగా చదువుతుండేవాడు బిభూతి భూషణ్‌. కెన్యాలోని రైల్వే కంపెనీలో పనిచేసిన జాన్‌ హెన్రీ పాటర్సన్‌ అనే బ్రిటీష్‌ అధికారీ, బాబూ పురుషోత్తం హర్‌బీ అనే భారతీయుడూ రాసిన అనుభవాల నుండీ, 'వైడ్‌ వరల్డ్‌ మాగజైన్‌' అనే పత్రికలో వచ్చిన సాహస గాథలనుండీ ఆ నవలకు కావలసిన సమాచారాన్ని సేకరించాడట రచయిత. అ లాగే ఆఫ్రికాలోని వృక్ష, జంతుజాతులను గురించీ, గిరిజన తెగల సంస్కృతుల గురించీ అధ్యయనం చెయ్యటం కూడా ఆయనకు ఎంతగానో ఉపయోగపడింది. ఆ వివరాలన్నిటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకుని, తనదైన దృక్పథంతో మేళవించి పునసృష్టించటమే ఆయన ప్రతిభ. తను స్వయంగా చూసి, కొన్నాళ్లు నివసించిన లవటురియా, మోహన్‌పురా అరణ్యాలను గురించి ''వనవాసి''లో, ''చంద్రగిరి శిఖరం''లో వర్ణించగలగిన నేర్పరి బిభూతి భూషణ్‌. శంకర్‌కు అ ల్వరెజ్‌తో ఏర్పడిన అనుబంధాన్ని, అటీలియోపై కలిగిన సానుభూతి కరిగిస్తుంది.

బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ రచనల్లో ప్రకృతి వర్ణన ఎంత హృద్యంగా సాగుతుందో తెలుగు పాఠకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ''వనవాసి''లో ప్రధానంగా ప్రకృతి ముగ్ధ సౌందర్యాన్ని చిత్రించిన రచయిత, ఈ నవలలో దాని భయద సౌందర్యాన్ని సాక్షాత్కరింపజేస్తాడు. ''ఎలిఫెంట్‌ గ్రాస్‌ మైదానాల్లో పరుచుకున్న వెన్నెల వణికిపోయే సింహగర్జన''లనూ, ''ఆకాశ మధ్యాన బాణసంచా ప్రదర్శనలా'' ప్రారంభమై ''దిగంతాలకు అరుణవర్ణాన్ని పులిమి, మేఘాలను నిప్పు ముద్దలుగా మార్చి... పర్వతం మొత్తం ఒకే అగ్ని జ్వాలలా దగ్ధమైపోయిన అగ్నిపర్వతపు విస్ఫోటనాన్నీ'' కళ్లముందు నిలిపి పాఠకులను విభ్రాంతి పరుస్తాడు.

ప్రకృతిలో బిభూతి భూషణుడికున్న గాఢమైన అనుబంధానికీ, తాదాత్మ్యతకూ ఒక ప్రతీక శంకర్‌. తన అంతిమ క్షణాలు సమీపిస్తున్నాయన్పించిన సమయంలో కూడా శంకర్‌కు భయం తప్ప, పశ్చాత్తాపం లేదు. ఏ మలేరియాతోనో రోగగ్రస్తుడై నిస్సహాయంగా ఆస్పత్రిలో చావటంకన్నా ఎంచుకున్న మార్గంలో సాహసిగా మరణించటం మేలనుకుంటాడు. ''తారలతో నిండిన నీలాకాశపు కప్పుకింద ఈ పర్వతారణ్య సీమలలో, ఈ రేయి నిశ్శబ్ధ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ'' మరణాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడతాడు. మృత్యు బీభత్సాన్నీ, సౌందర్య దృక్పథాన్నీ అతి నైపుణ్యంతో గాఢమైన అనుభవాన్ని అందిస్తాడు ఈ నవలతో బిభూతి భూషణ్‌.
''మూన్‌ మౌంటెన్‌'', ''మౌంటెన్‌ ఆప్‌ ది మూన్‌'' పేర్లతో మూడు నాలుగు ఇంగ్లీషు అనువాదాలు వచ్చాయి. ''చందేర్‌ పహార్‌'' నవలను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ''చంద్రగిరి శిఖరం'' పేరిట  తెలుగు పాఠకులకు అందించింది.

......

బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ.
ఆయన పేరు తలచుకుంటే చాలు - స్వచ్ఛమైన ఆడవి గాలి మనసును చల్లగా తాకుతుంది. బెంగాల్‌ పల్లెసీమలూ, పంట పొలాలూ, లవటూరియా, మోహన్‌పురా  అటవీ ప్రాంతాలూ, మహాలిఖారూప పర్వతారణ్యాలూ ... మనో నేత్రం ముందు ఆకుపచ్చ సముద్రం ఉప్పొంగుతుంది. అడవిగాచిన వెన్నెల దారుల్లోంచి మార్మికమైన సౌందర్య లోకాల్లోకి నడిచిపోతున్నట్టుగా ఉంటుంది. బిభూతి భూషణ్‌ను చదివాక ప్రకృతిలో కొత్త అందాలూ, కొత్త అర్థాలూ మనకు గోచరించకపోతే, మన హృదయగత సంస్కారాన్ని శంకించాల్సిందే.
- కాత్యాయని
(చినుకు, మాసపత్రిక, జూలై 2010 సౌజన్యంతో) 



Wednesday, March 23, 2011

చంద్రగిరి పై సాహస యాత్ర-1 ... కాత్యాయని ...

చంద్రగిరి పై సాహస యాత్ర-1 ...


ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించిన రచయితల్లో బిభూతి భూషణ్‌ మొదటివాడేమీ కాదు. కానీ, ఆయన రచనల్లోని ప్రకృతి చిత్రణకు ప్రత్యేకమైన స్వభావమున్నది. ఆయన దృష్టిలో ప్రకృతి సౌందర్యమంటే మానవులకు తీరిక సమయాల్లో ఆహ్లాదాన్నిచ్చే వినోద సాధనం కాదు - ఒక జీవితావసరం. మానవ స్వభావంలోని సహజాతాలకూ, బాహ్య ప్రకృతికీ అవినాభావ సంబంధాన్ని ఆరోపిస్తాడాయన, ప్రాచీన సంస్కృత కవుల్లాగా. సాధారణమైన ప్రకృతి ప్రేమికుల్లాగా ప్రకృతిలోని కొన్ని పార్శ్వాలను మాత్రమే ప్రేమించే దృష్టి కాదాయనది. వసంతశోభను ఎంత ఆహ్లాదంగా వర్ణిస్తాడో- నిప్పులు కురిసే గ్రీష్మ సౌందర్యానికీ అంతే అబ్బురపడతాడు. వెన్నెల వానలో తడిసి ఎంత పరవశించిపోతాడో చీకటి రాత్రుల నిగూఢ లోకాల్లోకీ అంతే ఆసక్తితో అడుగుపెడతాడు. ప్రకృతిపై ప్రేమ ఆయన్నొక తీరని దాహంలా, మోహంలా ఆవిరించుకుని ఆయన అక్షరాలకు అపూర్వమైన అందాన్ని అద్దింది. బిభూతి భూషణుడి ''వనవాసి''తో ముగ్ధులైన తెలుగు పాఠకులకు ఇదంతా అనుభవమే. ఆ నవల ఇచ్చిన అనుభూతిలోకి మరింత లోతుగా ప్రయోగించాలంటే ఆయనే రాసిన ''మూన్‌ మౌంటెన్‌'' (బెంగాలీలో ''చందేర్‌ పహార్‌''/తెలుగులో ''చంద్రగిరి శిఖరం'') ను చదివి తీరాల్సిందే.

''అరణ్యక'' (తెలుగులో ''వనవాసి''), ''చందేర్‌ పహార్‌'' (తెలుగులో ''చంద్రగిరి శిఖరం'')  లను దాదాపుగా ఒకే కాలంలో అంటే 1930ల చివర్లో రాశాడు భిభూతి భూషణ్‌, రెండింటిలోనూ ప్రధానాంశం ప్రకృతి చిత్రణే అయినప్పటికీ కథావస్తువులు పూర్తిగా భిన్నమైనవి. భారతదేశంలోని అరణ్య ప్రాంతాల ప్రకృతినీ, అక్కడి ప్రజల జీవితాలనూ, ప్రకృతికి దూరమవుతున్న మానవుల భౌతిక ఆత్మిక జీవితాల్లోని క్షీణతనూ విస్తృతమైన కేన్వాస్‌పై చిత్రించిన రచన ''వనవాసి''. దీనితో పోల్చినప్పుడు ''చందేర్‌ పహార్‌ (చంద్రగిరి శిఖరం)'' లోని జీవిత చిత్రణ పరిథి తక్కువనే చెప్పాలి. ఈ నవల టీనేజ్‌ పాఠకులను ఉద్దేంశించి రాసినది కావటమే అందుకు కారణం అయ్యుండొచ్చు. బెంగాలీలో ఇటువంటి రచనలు ''కుమార్‌-సాహిత్య'' అనే విభాగం కిందికి వస్తాయట. శంకర్‌ అనే బెంగాలీ యువకుడు ఆఫ్రికాలోని అరణ్యాల్లో, ఎడారుల్లో చేసే సాహసయాత్ర ఇందులోని కథంశం. ఐతే గాఢమైన తాత్విక దృక్పథంగల రచయిత ఎంత చిన్న జీవిత శకలాన్నయినా ఒక గొప్ప సత్యాన్ని నిరూపించటానికి సాధనంగా ఉపయోగించుకోగలడు. అందుకే కేవలం పద్దెనిమిది నెలల జీవితానుభవాలతో పదేళ్ల పరిణితిని పొందగలిగానంటాడు శంకర్‌ నవల చివరిలో.

''పథేర్‌ పాంచాలి''లోని అపూ, ''వనవాసి''లోని సత్యచరణ్‌ వంటి తన ప్రాత్రలన్నింటిలోనూ అంతులేని జీవన తృష్ణను నింపాడు. బిభూతి భూషణ్‌. అది వాళ్లను ఒకచోట నిలవనివ్వదు. ముగింపులేని దారుల్లో ప్రయాణమంటే వాళ్లకు ఆకర్షణ. చంద్రగిరి శిఖరంలోని శంకర్‌ కూడా అ లాంటివాడే. ఎఫ్‌.ఎ పరీక్షలు రాసి గ్రామానికొచ్చిన ఆ యువకుడికి ఉత్తేజకరమైన జీవితం గడపాలని ఎన్నో కలలు. క్రీడలన్నా, సాహస గాథలన్నా ప్రాణమిచ్చే శంకర్‌ను ఇంటి ఆర్థిక పరిస్థితులు నిస్సారమైన గుమాస్తా ఉద్యోగంలోకి నెట్టాయి. అందులో ఇమడలేక దిగాలు పడిన అతనికి, ఒక పరిచయస్తుడి ద్వారా ఆఫ్రికాలోని ఓ రైల్వే కంపెనీలో ఉద్యోగం దొరకటంతో పొంగిపోయాడు. ఆఫ్రికాలోని మూన్‌ మౌంటెన్‌ (చందేర్‌ పహార్‌/చంద్రిగిరి శిఖరం) అనే పర్వతాన్ని గురించీ, దాన్ని అధిరోహించిన ఒక జర్మన్‌ పరిశోధకుడి సాహసం గురించీ పుస్తకాల్లో చదివిన శంకర్‌కు ఆఫ్రికాపై ప్రత్యేకమైన ఆకర్షణ.

గుంపులుగా తిరిగే సింహాలతో, నిశ్శబ్దంగా మృత్యుపాశాలు విసిరే పచ్చికబయళ్లతో నిండిన ఆఫ్రికన్‌ అరణ్యాల్లోకి శంకర్‌తోబాటు మనల్నీ నడిపిస్తాడు రచయిత. సమ్మోహనకరమైన ప్రకృతి సౌందర్యానికీ, అడుగడుగునా వెంటాడే మృత్యు భయానికీ మధ్యన శంకర్‌లో చెలరేగే భావోద్వేగాలను అద్భుతంగా వర్ణిస్తాడు భిభూతి భూషణ్‌. ''ఈ ఆఫ్రికా ఒక భయద సౌందర్య సీమ'' అనుకుంటాడు శంకర్‌. ''వెన్నెల వానలో తడుస్తున్న పచ్చికబయళ్ల మార్మిక సౌందర్యాన్ని'' చూసి ముగ్ధుడౌతూ ఉండగానే, వాటిలోంచి నిశ్శబ్దంగా వచ్చిన సింహం  తన కళ్ల ముందునుండే తోటి ఉద్యోగిని నోటకరచుకుపోయిన దృశ్యాన్ని చూసి వణికిపోతాడు. ఐనా, ఈ అరణ్యాల్లో ''ఎన్ని పేరు తెలియని మానవ జాతులూ, ప్రకృతి సోయగాలూ, ఎవరూ చూడని ప్రాణులూ, ఎవరూ వినని పక్షుల కలకూజితాలూ దాగి వున్నాయో'' అనే ఆసక్తి అతన్ని ముందుకే నడిపించింది.


(ఇంకా వుంది)
(  "చినుకు " మాస పత్రిక జూలై 2010 సౌజన్యం తో )

Monday, March 21, 2011

అక్షరాలా కళావతి - డా. గోపరాజు నారాయణరావు ...

అక్షరాలా కళావతి  ....
పుట్టాక అరవై సంవత్సరాలు జీవిస్తే షష్టిపూర్తి.
మరణానంతర జీవితానికీ అరవై ఏళ్లు నిండితే ఆ సందర్భానికి ఏమని పేరు పెట్టాలి ?!
త్యాగరాజు భక్తి సంగీతానికి పాఠాన్ని కట్టి, ముద్దుపళని రక్తి కావ్యానికి పునర్జన్మనిచ్చిన ఆ స్త్రీ 'రత్నం' పరిపూర్ణ మానవ జీవితానికో ప్రమాణం.
ఆమె మరణానంతర జీవితం 'షష్టిపూర్తి చేరుకున్న సందర్భంగా ...

బెంగళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రపై గోపరాజు నారాయణరావు గారు రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
జీవం ఉట్టిపడేలా అన్వర్‌ వేసిన చిత్రం కూడా చూడవచ్చు.
సాక్షి దిన పత్రిక 21 మార్చి 2011 సౌజన్యంతో 

...







హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌