Tuesday, October 15, 2019

Buddhist Archeological sites need to be safeguarded - Emani Raji Sarma

Buddhist Archeological sites need to be safeguarded - Emani Raji Sarma, Author of Tadhagatuni Adugujadalu published by HBT



Monday, October 14, 2019

"తథా గతుని అడుగుజాడలు" పుస్తక రచయిత్రి, ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ తో సాక్షి ఇంటర్వ్యూ



"తథా గతుని అడుగుజాడలు" పుస్తక రచయిత్రి, ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ తో
సాక్షి ఇంటర్వ్యూ
ఈ దిగువ లింక్ పై క్లిక్ చేయండి :

"జాడల్ని చేరిపెసుకుంటున్నాం"  సాక్షి ఫ్యామిలీ పేజ్ 14-10-2019

-------------------------------------------------------------------------
..................................................................రాణి శర్మ ఈమని

‘బుద్ధుని బోధనలు ఆద్యంతరహితమైనవి; కానీ బుద్ధుడు వాటిని శాశ్వత సత్యాలుగా ప్రకటించుకోలేదు. మారుతున్న కాలంతో బాటుగా మారే సామర్థ్యం బౌద్ధ ధర్మానికి ఉంది. ఇది మనకు ఇంకే మతంలోనూ కనబడదు. బౌద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది పూర్తిగా హేతుబద్ధతపై ఆధారపడి ఉన్నదని మనకు అర్థం అవుతుంది.’ అంటాడు డా. బి.ఆర్. అంబేద్కర్.

ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్, బౌద్ధాన్ని స్వీకరించడం కూడా యాదృచ్చికంగా జరిగిన వ్యక్తిగత నిర్ణయంగా కాకుండా ఆనాటి సామాజిక స్థితిగతులకు పర్యవసానంగా గుర్తించాలి. ఆ పరిస్థితులు ఎంతవరకూ మారాయనేది కూడా ఒక కీలకమైన చర్చనీయాంశమే. 

ఏది ఏమైనప్పటికీ, బౌద్ధానికి ఆదరణ, ధర్మం పట్ల ఆసక్తి – మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా – నానాటికీ పెరుగుతూనే వస్తున్నవి. ఇందుకు ప్రధాన కారణం – అంబేద్కర్ చెప్పినట్లు – బౌద్ధ ధర్మంలోని నిత్యనూతనత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారగల లక్షణం, తద్వారా కొనసాగే కాలాతీత సమకాలీనత.

యావత్ ప్రపంచాన్నీ ప్రభావితం చేసిన భారతీయ ఆధ్యాత్మికతలో బౌద్ధం ఒక ప్రధానమైన పార్శ్వం. భారతదేశాన్ని పాలించిన రాజులు, ప్రాచీన రోమ్ సామ్రాజ్యానికి తొమ్మిది రాయబార బృందాలను పంపిన ఆధారాలున్నాయి. వాటిల్లో ఒకటి పోరస్ (ఇతడెవరై ఉంటాడనేది రూఢి చేసుకోవాల్సి ఉంది) 
అనే రాజు పంపినది. 

రోమన్ చక్రవర్తి అగస్టస్ సీజర్ (క్రీ.పూ.27-క్రీ.శ.14) ని కలుసుకోవడానికి వెళ్లిన ఈ బృందంలో ఒక శ్రమణుడు (బౌద్ధ భిక్షువు) కూడా ఉన్నాడట. ఆ భిక్షువు ఏథెన్స్ లో బౌద్ధంపట్ల తనకున్న నిబద్ధతను ప్రకటిస్తూ ఆత్మాహుతి చేసుకొని మరణించాడనీ, అతని సమాధిపై ‘భారతదేశం నుండి వచ్చిన శ్రమణుడు’ అని వ్రాసి ఉంటుందనీ గ్రీకు చరిత్రకారుడు ప్లూటార్క్ (క్రీ.శ. 46-120) తన 
రచనలలో పేర్కొన్నాడు. అశోకుడు సిరియా, ఈజిప్టు, గ్రీసు దేశాలకు పంపిన రాయబార బృందాలు క్రైస్తవ ఆలోచనలను ప్రభావితం చేసి ఉంటాయని విల్ డ్యురాంట్ 1930లో చేసిన తన రచనలలో ప్రతిపాదించాడు.

బౌద్ధం, బుద్ధుని జీవితగాథ, క్రీ.శ. ఐదు, ఆరు శతాబ్దాలనాటికి సిల్క్ రూటు వంటి వ్యాపార మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్, బాట్రియా, సూగ్డియానా, పర్షియా దేశాలకు కూడా విస్తరించాయి. ఒక భారతదేశపు రాకుమారుడు, సుఖమయ జీవనాన్నీ, ఐశ్వర్యాన్నీ, రాజ్యాధికారాన్నీ త్రోసిపుచ్చి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్న వైనం – ఆ దేశాల ప్రజలని ఎంత ప్రభావితం చేసిందంటే, ఆ 
గాథని పర్షియా దేశభాష అయిన పెహలవీలో క్రీ.శ. ఐదు ఆరువందల సంవత్సరాలలోనే వ్రాసుకున్నారు. అదే గాథని ‘భారతదేశపు గొప్ప ముని కథ’గా బాగ్దాద్ ని ఏలిన అబ్బాసిదుల రాజ్యంలో, ‘బిలావర్-బుద్ధస’ అన్న పేరుతో, మార్పులు, కూర్పులు చేసి అరబ్బు భాషలో తిరిగి వ్రాసుకున్నారు. 

ఈ క్రమంలో బుద్ధ చరిత పలుదేశాల సంస్కృతులలోకి చొచ్చుకుపోయింది. బుద్ధ చరిత, బుద్ధుని ఉపదేశం ఏదో ఒక రూపంలో యూరేసియా లోని ప్రతీ ఒక్క దేశంలోనూ, అన్ని వాంగ్మయాలలోనూ చోటు చేసుకుంది. ఈ గాథ ప్రాచీనకాలంలోనే సుమారు నూరు భాషలలోకి తర్జుమా అయిందని 
చరిత్రకారులు చెబుతున్నారు.  

గ్రీకు భాషలో ‘బార్లాం-జోసఫట్’ అన్న పేరుతో ప్రచురించబడిన బుద్ధుని గాథ ఎంత ప్రజాదరణ పొందిందంటే, ఐదవ  పోప్ సిక్స్టస్ బార్లాం, జోసఫట్ అనే వ్యక్తులు సెయింట్ లని ప్రకటించాడు. ఇది మధ్యయుగంలో అత్యంత జనాదరణ పొందిన గాథలలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. దీన్ని నాటక 
రూపంలో కూడా ప్రదర్శించేవారు. ఈ గాథలన్నిటికీ మూలం, సంస్కృతం, లేదా ప్రాకృతం నుండి గ్రహించిన గౌతమ బుద్ధుని కథే అని సుమారు వందేళ్ల క్రితం మాత్రమే పరిశోధకులు నిర్ధారించారు.

(తథాగతుని అడుగుజాడలు పుస్తకం నుంచి )


తథాగతుని అడుగుజాడలు
రచన: రాణీ శర్మ ఈమని,
ఉణుదుర్తి సుధాకర్

196 పేజీలు, వెల: రూ.200/-
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com 

Tuesday, October 1, 2019

టిపు సుల్తాన్ ఒక్కడే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు? - యార్లగడ్డ నిర్మల

టిపు సుల్తాన్‌

‘‘టిపు చనిపోయి 220 ఏళ్లు అవుతున్నా..
ఇప్పటికీ వార్తల్లో ఉంటున్నాడు.
బ్రిటిషర్స్‌ మనల్ని వదిలి 72 ఏళ్లు అవుతున్నా..
క్రూర నియంతగా, ఇస్లాం మతోన్మాదిగా సుల్తాన్‌ మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు.

ఈ వలస సామ్రాజ్యపు విధి విధానాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతుందో.. వాళ్ల కోణంలోని మన చరిత్రను తిరగ రాసుకోవాల్సిన అవసరమూ అంతే ఉంది!

అలాంటి ప్రయత్నమే ఈ ‘టిపు సుల్తాన్‌’ పుస్తకం’’ అని అంటున్నారు పుస్తక రచయిత్రి యార్లగడ్డ నిర్మల.
ఆమె హైదరాబాద్‌ వాసి.
హిస్టరీ డిపార్ట్‌మెంట్‌లో రీడర్‌గా పనిచేసి రిటైరయ్యారు.
‘టిపు సుల్తాన్‌’ రచన సందర్భంగా ఆమె గురించి ఆమె మాటల్లోనే..

‘‘పుస్తకాలు చదవడం నా దిన చర్యలో భాగం.. చిన్నప్పటి నుంచి. మా నాన్న (జయ రావు) నేర్పిన అలవాటు. ఆయన సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగి. అమ్మ (మేరీ) టీచర్‌. వాళ్లిద్దరూ ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగస్తులవడం వల్ల మా ఇద్దరినీ (అక్క, నేను) బాగా చదివించారు. ఆడపిల్లలకు అంత చదువెందుకని ఏ రోజూ అనుకోలేదు. తెలుగు మీడియంలో చదివించి విడిగా ఇంగ్లిష్‌ నేర్పించారు.. సాహిత్యం ద్వారా. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లోని పెద్ద పెద్ద రైటర్స్‌ అంతా మా చిన్నప్పుడే మాకు పరిచయం అయ్యారు. అంతేకాదు హాలీవుడ్‌ క్లాసిక్స్‌ అన్నీ చూపించారు మాకు.  ఇంగ్లిష్‌ భాష ఇంప్రూవ్‌మెంట్‌కు అదెంతో హెల్ప్‌ అయింది. ఇంకో రకంగా కూడా మేం అదృష్టవంతులమని చెప్పాలి.

మా ఇష్టాయిష్టాల మీద మా అమ్మానాన్న ఏనాడూ పెత్తనం చెలాయించలేదు.  ఇంటర్‌లో నాకు మంచి పర్సెంటేజ్‌ వచ్చింది. అప్పట్లో మెడిసిన్, ఇంజనీరింగ్‌లకు ఇప్పట్లా ఎంట్రన్స్‌ లేదు. మంచి పర్సెంటేజ్‌ ఉంటే చాలు సీట్‌ వచ్చేది. అట్లా నాకు ఇంటర్‌లో వచ్చిన మార్క్స్‌తో ఈజీగా మెడిసిన్‌లో సీట్‌ వచ్చేది. మా బంధువులంతా కూడా మా పేరెంట్స్‌ మీద ప్రెషర్‌ పెట్టారు నన్ను మెడిసిన్‌ చదివించమని. కాని నాన్న  నన్ను ఫోర్స్‌ చేయలేదు. డిగ్రీలో బీఏ ఇంగ్లిష్‌ లిటరేచర్‌ తీసుకున్నా. ఎమ్మేలో హిస్టరీ తీసుకున్నా.   ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అప్పుడే గ్రూప్‌ వన్‌ కూడా రాశా. 23 ఏళ్లకే గ్రూప్‌ వన్‌ ఆఫీసర్‌ అయ్యా.

కాని ఆ ఉద్యోగం అంత గొప్పగా అనిపించలేదు.అప్పటికే ఎంఫిల్‌ కూడా రాసి ఉన్నా. దాంతో గ్రూప్‌ వన్‌కి గుడ్‌బై చెప్పా. అప్పుడు మాత్రం పేరెంట్స్‌ కొంచెం డిసప్పాయింట్‌ అయ్యారు. ఎంఫిల్‌ కూడా ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్‌డీ చేశా.. విజయనగర సామ్రాజ్యంలోని గుడుల మీద. ఆ థీసిస్‌ని పబ్లిష్‌ కూడా చేశా యూజీసీ గ్రాంట్స్‌తో. అమెరికా, యూరప్‌ కంట్రీస్‌లోని స్కాలర్స్‌ అందరూ నా థీసిస్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటూంటారు. యూజీసీ ఫెలో, ఏపీపీఎస్‌సీ క్యాండిడేట్‌ని. నన్ను గైడ్‌ చేసి, ఈ స్థాయిలో నిలబెట్టిన గైడ్‌.. ప్రొఫెసర్‌ పీసపాటి శ్రీరామ్‌ శర్మగారు.

టిపు సుల్తాన్‌.. నిజాలు..!
తెలుగు, ఇంగ్లిష్‌ సాహిత్యంతోపాటు చరిత్ర అన్నా చాలా ఇష్టం నాకు. చదువు థియరీ అయితే.. దానికి ప్రాక్టికల్స్‌ పర్యటన అని బలంగా నమ్మడమే కాదు ఆచరిస్తాను కూడా. అందుకే నా సేవింగ్స్‌ అన్నిటినీ పర్యటనకు వెచ్చించాను. సోలో ట్రావెలింగ్‌నే ఇష్టపడ్తా. పందొమ్మిదో శతాబ్దపు ఇంగ్లిష్‌ సాహిత్యాన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్‌ చేసేందుకు యూరప్‌ వెళ్లాను. చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆఫ్రికా దేశాలు తిరిగాను. చిత్రంగా అక్కడి ప్రతి మూల.. ప్రతి ప్రదేశంతో నాకు ఇదివరకే పరిచయం ఉన్నట్టనిపించింది. అదే సాహిత్యానికున్న గొప్పదనం. ప్రాంతాలనే కాదు మనం లేని కాలమాన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్లి వాటితో మనల్ని మమేకం చేస్తుంది. అట్లాగే నేను చూసిన హాలీవుడ్‌ క్లాసిక్స్‌లోని ప్లేసెస్‌నీ చుట్టొచ్చాను.

‘ఇగ్నోరెన్స్‌ ఈజ్‌ బ్లెస్‌’ అని బెర్నాడ్‌ షా సెలవిచ్చాడు కాని నేనైతే ‘నాలెడ్జ్‌ ఈజ్‌ హ్యాపీనెస్‌’ అనుకుంటాను. ఇదే సూత్రాన్ని నేను పనిచేసిన నాంపల్లి (హైదరాబాద్‌)లోని ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్‌ డిగ్రీ మహిళా కాలేజ్‌ స్టూడెంట్స్‌ విషయంలోనూ అప్లయ్‌ చేశాను. నా పర్సనల్‌ ఇంటరెస్ట్‌తో యేడాదికి ఒకసారి ఆ పిల్లల్నీ స్టడీ టూర్‌కి తీసుకెళ్లేదాన్ని.

అలా చరిత్ర చదివితే, ప్రపంచం చుడితే వచ్చిన జ్ఞానమే ఈరోజు టిపు సుల్తాన్‌  గురించి రాయడానికి తోడ్పడింది.
టిపు సుల్తాన్‌ గురించి చాలా చదివాను.
మరింతగా అర్థం చేసుకోవడానికి అనేకసార్లు మైసూర్‌ కూడా వెళ్లొచ్చాను.
ఆ అనుభవం.. టిపు మీద వచ్చిన ఇంకా అనేక పుస్తకాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్రకారులు ఆయన గురించి పలు సందర్భాల్లో ఇచ్చిన రిఫరెన్స్‌లు..  థీసిస్‌ మొదలైనవాటినన్నీ అధ్యయనం చేసి... విశ్లేషించి.. రెండేళ్లు శ్రమించి రాశాను.

నాకు తెలుసు ఇప్పటి పరిస్థితుల్లో అది కాంట్రవర్షియల్‌ అని.
కాని నిజం తెలియాలి కదా.
అందుకే ధైర్యం చేశా.
దానిమీద వచ్చే ఏ చర్చకైనా ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా.

నిజానికి  మన చరిత్రను కూలంకుషంగా చదివి.. నిశితంగా పరిశీలిస్తే.. ఈ నేలను ఏలిన ముస్లిం రాజులు తమ రాజ్య విస్తరణ కాంక్షనే బయటపెట్టుకున్నారు తప్ప సామాన్య ప్రజల విశ్వాసాలు, జీవన విధానాల జోలికి పోలేదు.

 పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు.
కాని టిపునే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు?
ఆ వివాదాల చారిత్రక నేపథ్యం ఏమిటి?
మొదలైన అంశాల విశ్లేషణే నేను రాసిన ‘టిపు సుల్తాన్‌’.

చిన్న మాట
కాలం తెచ్చిన మార్పులను ఆహ్వానించాల్సిందే. అయితే విపరీతాలను నిలువరించాలంటే పాత టెక్నిక్స్‌ను ఉపయోగించాలి. ఆ పాత పద్ధతే పుస్తక పఠనం. ఇప్పుడు అవసరం. రీడింగ్‌ హాబీ సామాజిక స్పృహను కలిగిస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకోవడం నేర్పిస్తుంది. ఇప్పుడు మన చదువులో సోషల్‌ సైన్సెస్‌ చోటు లేకుండా పోయింది కాబట్టి పుస్తక పఠనం కంపల్సరీ. అలాగే ఆడపిల్లలకు ఒక మాట. ధైర్యంగా ఉండాలి. సమస్యలుంటాయి. ఎదుర్కొనే స్థయిర్యాన్ని అలవర్చుకోవాలి. దీనికి చదువును మించిన ఆయుధం లేదు’’ అని చెప్తారు రైటర్, హిస్టారియన్‌ యార్లగడ్డ నిర్మల.
– సరస్వతి రమ
ఫొటో: మోహనాచారి

►నిర్మల అనేక కథలు, అనువాద కథలు రాశారు.  ఇవన్నీ ప్రముఖ దినపత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రముఖ రచయిత డాక్టర్‌ విజయభారతితో కలిసి అంబేడ్కర్‌ పుస్తకానికీ పనిచేశారు నిర్మల. ఆమె రాసిన తాజా పుస్తకం ‘టిపు సుల్తాన్‌’ను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ.

(సాక్షి దినపత్రిక ,ఫామిలీ పేజ్ , 30 -9 -2019 సౌజన్యం తో )

https://epaper.sakshi.com/c/44166898

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌