Sunday, March 22, 2020

కారంచేడు నేపథ్యంలో స్థాపించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ’కు స్ఫూర్తి నిచ్చింది ‘‘దళిత్‌ పాంథర్‌’’ ఉద్యమమే



కారంచేడు నేపథ్యంలో స్థాపించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ’కు స్ఫూర్తి నిచ్చింది ‘‘దళిత్‌ పాంథర్‌’’ ఉద్యమమే

తిరుపతిలో 22 మార్చి 2020 ఆదివారం నాడు ‘దళిత సాహిత్య వికాస వేదిక’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు  ప్రచురించిన ‘దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. 

ఆరోజు  దేశవ్యాప్తంగా జనతా కర్‌ఫ్యూ ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆర్‌.పి.ఐ. రాష్ట్ర అధ్యక్షు పి. అంజయ్య ఇంట్లో కొద్దిమంది సమక్షంలో ఉదయం 11 గంటలకు నిర్వహించారు. 

ఈ సందర్భంగా పి. అంజయ్య మాట్లాడుతూ 1985లో కారంచేడు దళితుల పై జరిగిన హత్యాకాండను ప్రతిఘటించేందుకు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభకు దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఎంతో స్ఫూర్తి నిచ్చింది అన్నారు. 19172లో మహారాష్ట్రలో ఏడుగురు దళిత యువకులతో మొదలైన దళిత్‌ పాంథర్స్‌ సంస్థ యావత్‌ దేశంలో నిద్రాణమై వున్న దళిత చైతన్యాన్ని తట్టి లేపిందని, తమ రచనల ద్వారా, పోరాటాల ద్వారా అంబేడ్కర్‌ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడంలో గణనీయమైన విజయాలను సాధించిందని అన్నారు. 

అమానుషమైన అంటరానితనం పూర్తిగా నిర్మూలించబడాలంటే, కులాల మధ్య అంతరాలు సమూలంగా తొలగి, కుల నిర్మూలన జరిగి  సర్వమానవ సమానత్వం సాధించబడాంటే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ రచనలను తప్పనిసరిగా చదవాలన్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ కొద్దికాలమే కొనసాగినప్పటికీ అది మన సమాజంపై ఎన్నటికీ చెరగని ముద్రవేసిందనీ, ఇప్పటికీ దళిత్‌ పాంథర్స్‌ చేసిన పోరాటాలు మనకు స్పూర్థినిస్తూనే వున్నాయని అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత వుందన్నారు. 

నాటి కార్యక్రమంలో టి.టి.డి. ఆయుర్వేద కళాశాల విశ్రాంత ప్రొఫెసర్‌ ఎ. మోహన్‌,  ఆర్‌.పి.ఐ. జిల్లా అధ్యక్షులు ఎ. సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ నాయకులు పి. ప్రభాకర్‌, ఎస్‌. సుబ్రమణ్యం, సహదేవ్‌, రెడ్డి బాబు తదితరులు  పాల్గొన్నారని దళిత సాహిత్య వికాస వేదిక వారు తెలియజేశారు. 

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌