Friday, March 13, 2020

టిపుసుల్తాన్' పుస్తకం లోని కొన్ని విషయాలు


టిపుసుల్తాన్' పేరుతో యార్లగడ్డ నిర్మలగారు రచించిన పుస్తకాన్ని
 హైద రాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించింది. అందులోని కొన్ని ఈ విషయాలు:
- భాస్కరం కల్లూరి

1. టిపుసుల్తాన్ అనాలి. టిప్పుసుల్తాన్ తప్పు.
2. టిపు తల్లి ఫాతిమా ఫక్రున్నీసా  స్వస్థలం కడప.

3. టిపు మరణవార్త తెలుసుకుని, టిపుకు వ్యతిరేకంగా తరచు ఆంగ్లేయులకు సహకరించిన మరాఠా రాజకీయ దురంధరుడు నానా ఫడ్నవీస్ అన్నమాటలు:
టిపు మరణించాడు. ఆంగ్లేయుల బలం పెరుగుతుంది...ముందు ముందు చెడ్డరోజులు రాబోతున్నాయి.(రచయిత్రి పరిచయం నుంచి)

4. టిపు దేశానికి ఆంగ్లేయుల ప్రమాదాన్ని గ్రహించాడు. ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఒంటరిగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సమకాలికులవలె బ్రిటిష్ కింద బానిసత్వాన్ని అంగీకరించలేదు.

5. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు టిపును క్రూరనియంతగా, మతోన్మాదిగా ప్రచారం చేశారు. 20వ శతాబ్దిలో కొత్త చారిత్రక ఆధారాలు వెలుగు చూసేవరకు ఈ ప్రచారం విజయవంతంగా కొనసాగింది. 1791లో మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధసమయంలో ఆంగ్లేయులతో కలసి టిపుతో యుద్ధం చేస్తున్న మరాఠాలు- టిపు రాజ్యంలోని శృంగేరి మఠంపై జరిపిన దాడికి, అక్కడ వారు చేసిన విధ్వంసానికి టిపు వ్యక్తం చేసిన ఆవేదన, మఠ పునరుద్ధరణకు సంబంధించి టిపుకు, శృంగేరి మఠాధిపతికి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు 1916లో వెలుగు చూశాయి.

6. టిపు మతసామరస్యానికి సంబంధించి ఎంతో సమాచారం లభిస్తుండగా బ్రిటిష్ చరిత్రకారులు ఆయనపై మతోన్మాది అన్న ముద్ర వేశారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నవారికి మాత్రమే టిపు మరణదండన విధించేవాడు. మిగతావారికి మతమార్పిడి ప్రత్యామ్నాయంగా ఉండేది.

7. 1970 దశకంలో ఆర్.ఎస్.ఎస్. కర్ణాటకరాష్ట్రంలోని మహనీయుల జీవితచరిత్రలను భారత భారతి అనే సీరీస్ లో కన్నడంలో ప్రచురించింది. వాటిలో టిపు జీవితచరిత్ర కూడా ఉంది.

8, బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన 'టిపు విలన్' చర్చ భారతదేశంలో 20వ శతాబ్దం 80వ దశకంలో తిరిగి తెరపైకి వచ్చింది. 1976లో ఎమర్జెన్సీ తర్వాత భారతదేశ రాజకీయాల్లో వచ్చిన కొత్త రాజకీయ సమీకరణలు, వాటి కొత్త అజెండాలే అందుకు కారణం.

9. బీజేపీలో ఉన్నప్పుడు టిపును విమర్శిస్తూ వచ్చిన యడ్యూరప్ప 2012లో కొత్త పార్టీ పెట్టాక టిపును గొప్ప దేశభక్తుడని పొగిడాడు. తిరిగి బీజేపీలోకి వచ్చాక టిపు జయంతి ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాడు,

10. నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధం ప్రారంభమైనప్పుడు దక్షిణభారతంలోని సంస్థానాధీశులందరూ బ్రిటిష్ కు సహాయమైనా చేయాలి, లేదా తటస్థంగానైనా ఉండాలని గవర్నర్ జనరల్ రిచర్డ్ వెలస్లీ ఆదేశించాడు. పేష్వా తరపున మరాఠారాజ్యం నడుపుతున్న నానా ఫడ్నవీస్ తటస్థంగా ఉండడానికి నిర్ణయించాడు. మరాఠాల్లోనే కొందరు టిపుకు సాయం చేయాలని అన్నా ఒప్పుకోలేదు. మరాఠాలు టిపుతో కలసి ఆంగ్లేయులతో పోరాడి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం. టిపుపై విజయం సాధించాక వెలస్లీ మరాఠాలపై కూడా దాడి చేసి సైన్యసహకార సంధికి ఒప్పించాడు.

11. 20వ శతాబ్ది ప్రారంభంలో కలకత్తా యూనివర్సిటీలో సంస్కృత విభాగానికి అధిపతిగా ఉన్న డా. హరిప్రసాద్ శాస్త్రి మెట్రిక్యులేషన్ కు రాసిన పాఠ్యపుస్తకంలో, టిపు సుల్తాన్ జరిపే మత మార్పిదులకు ఇష్టపడని 3000 మంది బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్నారని రాశాడు. ఉత్తరభారతంలో ఈ పాఠ్యపుస్తకం చాలా కాలం కొనసాగింది. 1928లో అలహాబాద్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడిగా ఉన్న బి. ఎన్. పాండే కు ఇది ఆశ్చర్యం కలిగించింది. ఆధారాలు చెప్పమని కోరుతూ హరిప్రసాద్ శాస్త్రికి ఆయన ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు. చివరికి, మేధో
వంచనగా భావించవలసివస్తుందని హెచ్చరించడంతో మైసూర్ గెజిటీర్ లో తనకు ఆ ఆధారం దొరికిందని హరిప్రసాద్ శాస్త్రి చిన్న ఉత్తరం రాసి ఊరుకున్నాడు, మైసూర్ గెజెటీర్ లో ఎంత వెదికినా పాండేకు ఆ ఆధారం కనిపించలేదు.

మరిన్ని విశేషాల కోసం పుస్తకం చూడగలరు.

(భాస్కరం కల్లూరి  ఫేస్ బుక్ పేజ్ నుంచి )
...................................................................................................................................

యార్లగడ్డ నిర్మలగారు రచించిన 'టిపు సుల్తాన్-తలవంచని వీరుడు' అనే పుస్తకంపై 
నిన్నటి నా పోస్ట్ పై వచ్చిన కొన్నిస్పందనలు చూశాక, ఆ పుస్తకం గురించి తప్పుడు సందేశాలు వెళ్ళే ప్రమాదాన్ని గమనించాను కనుక ఇప్పుడు మరోసారి దాని గురించి రాయవలసివస్తోంది:

1. 160 పేజీలు, 14 అధ్యాయాలు, 12 పుస్తకాల గ్రంథసూచి ఉన్న ఈ పుస్తకంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న పుస్తకంలోని అన్ని విషయాలనూ ఏకరవు పెట్టడం భావ్యం కాదు కనుక కొన్నింటికే పరిమితమయ్యాను.

2. ముందుగా చెప్పుకోవలసింది ఇందులోని ఇతివృత్తంపై రచయిత్రి అనుసరించిన దృక్పథం, లేదా ప్రణాళిక. ఆమె పరిచయంలో ఇలా రాశారు: 'కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసిన మోహిబ్బుల్ హసన్ 1951లో 'హిస్టరీ ఆఫ్ టిపు సుల్తాన్' అనే పుస్తకం వ్రాసారు. ఈయన దేశవిదేశాల్లోని టిపు, ఇంగ్లీష్ , తూర్పు ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ, గోవాలోని పోర్చుగీస్ వారికి చెందిన ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, కన్నడ, మరాఠీ, పర్షియన్ రచనలను, అనేక ప్రభుత్వపత్రాలను క్షుణ్ణంగా పరిశోధించి టిపు చరిత్రను గురించిన వాస్తవాలను తన పుస్తకంలో పొందుపరిచారు. 1967లో సుబ్బరాయగుప్తా రచించిన 'న్యూ లైట్ ఆన్ టిపు సుల్తాన్', 1970లో డెనిస్ ఫారెస్ట్ రచన 'టైగర్ ఆఫ్ మైసూర్ అండ్ ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టిపు' వంటి పుస్తకాలు టిపు చరిత్రను వాస్తవికదృక్పథంతో పరిశీలించాయి. మోహిబ్బుల్ హసన్ టిపును క్రూర నియంత, ఇస్లాం మతోన్మాది అనడం ఎంత అసమంజసమో, టిపును భారత జాతీయవాది, భారతదేశ మొదటి స్వతంత్ర సమరయోధుడు అనడం కూడా అంతే అసమంజసం అని తేల్చి చెప్పారు. టిపు బలాన్ని, బలహీనతలను, గెలుపు ఓటములను బేరీజు వేశారు. 1951లో ప్రచురించిన ఈ పుస్తకం 2013లో కూడా పునర్ముద్రణ కావడం విశేషం.

3. నేను చూసినంతవరకు రచయిత్రి 'సెక్యులర్', 'దేశభక్తి', 'దేశభక్తుడు' లాంటి మాటలు వాడలేదు. ఈ మాటలు ఈ కాలపు నిర్దిష్టార్థంలో వాడుతున్న మాటలు. గతానికి వర్తించేటప్పుడు జాగ్రత్త వహించాలి. రచయిత్రి మోహిబ్బుల్ హసన్ వాడిన జాతీయవాది అనే మాటను ఉపయోగిస్తూనే దానిని టిపు సుల్తాన్ కు వర్తింపజేయడం అసమంజసం అన్న హసన్ అభిప్రాయాన్నీ ఉటంకించారు. అలాగే క్రూర నియంత, మతోన్మాది అనడం కూడా అసమంజసమే అన్న హసన్ అభిప్రాయాన్ని కూడా ఉటంకించారు. టిపును క్రూర నియంత అనడానికి వస్తే, "ఆ కాలంలో ప్రజాస్వామ్యం లేదు. రాజులందరూ నిరంకుశులే"నని ఆమె అంటారు. అలాగే మతంపట్ల విశ్వాసం, నిబద్ధత, మతాచారణ అనేవి కూడా రాజులందరిలోనూ ఉన్నవే. "వ్యక్తిగతంగా టిపు ఒక నిబద్ధుడైన ముస్లిం. కానీ ఒక పాలకుడిగా మతవిషయాల్లో ఎంతో లౌక్యాన్ని, పరిణతిని ప్రదర్శించా"డని రచయిత్రి అంటారు. 'సెక్యులర్' అని వాడకుండా 'మతసామరస్యం' అనే మాటను వాడడంలో కాలికమైన స్పృహను ఆమె పాటించారు. పాలకునికి సొంత మతంపట్ల అభిమానం, ఆచరణ ఉండవచ్చు. వాటిని బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. కొందరిలో అది ఉన్మాదం స్థాయికి ప్రకోపించడాన్నీ, మత మార్పిడులకు పాల్పడడాన్నీ కాదనలేం. అదే సమయంలో పాలకునిగా మతసహనాన్ని, సామరస్యాన్ని పాటించకతప్పదు. శివాజీ తుల్జాభవాని భక్తుడు. అయినా ఆయన సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారు..కనుక నియంత అన్నప్పుడుగానీ, మతవాది లేదా మతోన్మాది అన్నప్పుడు గానీ కేవలం టిపును మాత్రమే వేలెత్తిచూపడం నిష్పాక్షికత అనిపించుకోదు.

4. టిపు విషయంలో రెండో వైపు చూడకుండా ఆయనను ఒక క్రూరనియంతగా, మతోన్మాదిగా ప్రపంచం ముందు నిలపడం ఆంగ్లేయులకు అప్పటి రాజకీయ అవసరం అంటారు రచయిత్రి. అదే అవసరం ఇప్పుడు కొందరిచేత అదే పని చేయిస్తోందంటారు. టిపు మత మార్పిడులు చేయించిన సంగతిని చెబుతూనే అతనికి గల మరో పార్స్వాన్నీ చూపించారు. టిపు శృంగేరి మఠం పునరుద్ధరణకు సాయపడడమే కాక గురువాయూరు సహా అనేక దేవాలయాలకు ఎలా ఆస్తులు, ఆభరణాలు సమకూర్చాడో, కొన్ని హిందువుల విశ్వాసాలను ఎలా పాటించేవాడో, ఒడయార్ రాజుల ఆనవాయితీని పాటిస్తూ ఉదయమే రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఎలా అల్పాహారం తీసుకునేవాడో కూడా ఆమె రాశారు.

5. పేష్వాలు హిందువులైనా శృంగేరి మఠం మీద దాడి చేసి దోచుకున్నారు, మతం అడ్డురాలేదు. టిపు తమలానే ముస్లిం అయినా హిందువులైన పేష్వాలతో, ఆంగ్లేయులతో కలసి నిజాం, టిపుతో యుద్ధం చేశాడు. మతం అడ్డు రాలేదు. వీటిని ఆ కాలానికి పరిమితం చేయకుండా ఈ కాలానికి తీసుకొస్తే అభాసుపాలు కాకుండా ఎవరూ మిగలరు.నేటి 'దేశభక్తి', 'దేశద్రోహం' కొలమానంతో చూడాల్సి వచ్చినప్పుడు టిపుతోపాటు పేష్వాలూ వస్తారు, నిజాములూ వస్తారు. ఎవరూ మిగలరు.

6. సారాంశం ఏమిటంటే, చారిత్రకవ్యక్తులు ఎవరి గురించి అయినా రెండు పక్కలా చూద్దాం. సత్యం ప్రకృతి, అసత్యం వికృతి. ప్రకృతిని కాపాడుకుందాం. చరిత్రను మనం రక్షిస్తే చరిత్ర మనల్ని రక్షిస్తుంది.



1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌