Wednesday, July 1, 2020

చరిత్ర అడుగుజాడల్లో తథాగతుడు

చరిత్ర అడుగుజాడల్లో తథాగతుడు

కాల్పనికేతర సాహిత్యాన్ని కాల్పనిక సాహిత్యమంత
అందంగా తీర్చిదిద్దడం సులభమైన అంశమేమీకాదు.
కాల్పనిక సాహిత్యమంత అందంగా కాల్పనికేతర సాహిత్యం కుదరాలంటే ఎంచుకున్న అంశమూ ఆ అంశాన్ని వివరించిన విధానమూ ఆసక్తికరంగా కుదరాలి.. అలాంటి ఒక పుస్తకం ఇటీవల చదవటం తటస్థించింది.ఆ పుస్తకమే తథాగతుని అడుగు జాడలు.ఈపుస్తక రచయితలు చరిత్ర బోధకులు రాణీశర్మ ఈమని, కథా రచనలో చరిత్రను కూడా
భాగం చేసే కథకులు ఉణుదుర్తి సుధాకర్..

విశాఖపట్నం చుట్టుపక్కలున్న బౌద్ధ క్షేత్రాల పరిశీలనతో మొదలుపెట్టి బుద్ధుని జీవిత గాధను, బౌద్ధ సంఘం కార్యకలాపాలను,ఆరామజీవనాన్ని,బౌద్ధ ధర్మం దేశవిదేశాల్లో విస్తరించిన క్రమాన్ని ఈపుస్తకం వివరిస్తుంది.అనేక పరిశీలనలను, ప్రతిపాదించే క్రమంలో భూత,వర్తమాన కాలాలను చక్కగా అనుసంధానిస్తూ సాగే రచన ఇది.రెండువేలనాటి కాలాన్ని మనముందు ఆవిష్కరిస్తూ సమకాలీన సమాజానికి వర్తించే అంశాలను ఫోకస్ చేయటం చూస్తాం.ఎవరికివారు స్వీయ ఙ్ఞానాన్వేషణ  చేసుకోవాలని,ఎవరి మోక్షసాధనకు వారే పాటుపడాలని చెప్పిన ధర్మం అప్పటికి ఇప్పటికి బౌద్ధం ఒక్కటే అంటారు గ్రంధ రచయితలు రాణీశర్మ, సుధాకర్ లు.ఒక యాత్రా రచనలా సాగే ఈ పుస్తకంలో ఎన్నో అంశాలను సరళంగా వివరిస్తారు వారు.విశాఖ పరిసరాలలో బయల్పడిన బౌద్ధస్థలం తొట్లకొండ పుస్తకానికి ప్రధాన భూమిక.ఆ ప్రదేశాన్ని దర్శించినప్పుడల్లా  చరిత్ర ఆవిష్క్రతమవుతు దర్శనమిస్తుందంటారు రాణీశర్మ, సుధాకర్ లు.ఎన్నో అనిర్వచనీయ అనుభూతులను హేతుబద్ధంగా వివరించడమే కాదు బౌద్ధ ధర్మంలోని వైశిష్ట్యాన్ని వివరిస్తూ ఆకాలంలోకి మనలను నడిపిస్తారు.

ఎటువంటి అసౌకర్యం పాఠకుడికి కలగకుండా ఈ పుస్తకాన్ని ఏడుభాగాలుగా విభజించి అలనాటి చారిత్రక వైభవాన్ని కళ్ళ ముందుంచుతారు.ఎత్తుగడే ఎంతో ఆసక్తికరంగా గురజాడ “దేవుళ్ళారా…మీ పేరేమిటి” కథను ప్రస్తావిస్తూ మొదలవుతుంది.సంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించేవాళ్ళు బౌద్ధులు అని గురజాడ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తుంది.బౌద్ధానికి ఆనవాలుగా తొట్లకొండ
లోని బౌద్ధ క్షేత్రాల ఉనికిని 1980వ సంవత్సరంలో వెలుగు లోకి తెచ్చింది భారత నావికాదళం.అప్పటి పురాతత్వ శాఖ అధికారి,పరిశోధకుడూ అయినా డా.వి.వి.కృష్ణశాస్త్రి అక్కడ తవ్వకాలను జరిపించారు.తరువాతి కాలంలో వారే సమీపంలో ఉన్న బావికొండ,పాండవులకొండపై గల బౌద్ధ క్షేత్రాలనూ వెలుగులోకి తెచ్చారు.రచయితల్లో ఒకరైన రాణీశర్మ ఈమని అనేకమార్లు కృష్ణశాస్త్రిగారితో కలిసి చేసిన పర్యటనలు అప్పటి చారిత్రక అంశాలను స్మరించటమేకాదు ఉత్తరాంధ్రలో బౌద్ధ క్షేత్రాలను అధ్యయనం చేస్తూ అనేక అంశాలను వెలుగులోకి తెస్తున్న,తెచ్చిన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ ఆ అంశాలను ఉటంకిస్తారు.వారిలో కొందరిని ప్రస్తావించాలంటే
బౌద్ధ పండితులు రామయ్య,ప్రొ.కొల్లూరు సూర్యనారాయణ,ప్రొ.తిమ్మారెడ్డి,
డా.సోమసుందరం,పరిశోధకుడు డా.రాబర్ట్ ప్నిక్, వీరితో బాటు శాస్త్రవేత్త చిట్టిబాబు, కంప్యూటర్ ఇంజనీర్ నాయని ఆదిత్యమాధవ్* జర్నలిస్ట్ నరసింమూర్తి వంటి ఔత్సాహికుల కృషి శ్లాఘనీయం అంటారు.రాణీశర్మ కొన్ని ఆసక్తికరమైన ప్రతిపాదనలు చేస్తారు.గుడివాడ అన్నపేరుగల  బౌద్ధప్రదేశాలు విశాఖ పరిసర ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తాయంటారు.అలా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో తొమ్మిది గ్రామాలున్నాయిట.ఇక కృష్ణాజిల్లా లోని గుడివాడ తెలిసిందే.అదికూడా ఒక బౌద్ధ క్షేత్రమే.కుటిక అనే పాలీ మాటకు కుటీరం అని అర్థమట.తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో కుటి అంటే గుడిసె అని అర్ధం అంటారు.దీనికి మరోపేరు గుడి అంటారు.ఇక కుటి అన్న పదం బౌద్ధ సాహిత్యంలో అనేకచోట్ల కనిపిస్తుందంటారు.బుద్ధుని కుటీరాన్ని గంధకుటి అంటారు.అలాగే వాడ అనే పదం బౌద్ధసాహిత్యంలో విరివిగా కకనిపిస్తుంటుంద
అలా గుడివాడ పేరుతో గ్రామాలు దర్శనమిస్తాయని అని వివరిస్తారు రచయితలు.బౌద్ధానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తూనే టూరిజం పేరిట చారిత్రక అవశేషాలు ధ్వంసమయిపోతున్న తీరుపట్ల ఎంతో ఆవేదననూ, అసహనాన్ని ప్రకటిస్తారు.భూమికూడా మార్కెట్ వస్తువుగా మారిపోవటం ఈ దుష్పరిణామానికి కారణమంటారు.
ఇక ఆరోజుల్లో ఆరామజీవనం ఏవిధంగా ఉండేది
తీరప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలు ఏవిధంగా బౌద్ధం విస్తరించడానికి ఉపయోగపడ్డాయి,శ్రమణులు, భిక్షువులు ఏవిధంగా జీవనం గడిపేవార, వారికి నిర్దేశించబడిన నియమాలు ఎలా ఉండేవో చదివినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు పరిచయమవుతాయి.సంఘం అనే పదం బౌద్ధధర్మంలో కీలకమయిన మాట.సంఘం అంటే సమూహం లేదా సాంగత్యంగా పరిగణించబడే పదమది.ఇక భిక్షువులు కాకుండా బౌద్ధానికి అండగా నిలిచిన సామాన్యులను ఉపాసకులు అంటారంటారు రచయితలు. మహావగ్గ బౌద్ధ గ్రంథం అనేక అంశాలను చర్చిస్తుందని రచయితలు పేర్కొంటారు.ఉదాహరణకు చైత్యాలు,విహారాలతో కూడిన ఆరామాలు బౌద్ధ భిక్షువులకు నిర్దేశించిన కట్టడాలు.మొదటిసారి వీటి నిర్మాణం ఎక్కడ జరిగిందో ఈగ్రంధం తెలియజేస్తుంది.వీటి నిర్మించటానికి బింబిసారుడు కోరిన అనుమతికి బుద్ధభగవానుడు సమ్మతి తెలియచేయటాన్ని
మహావగ్గ వివరిస్తుంది.తాటికొండ,బావికొండ లతో సహా అనేక ప్రాంతాలలో ఆరామాలు రూపుదిద్దుకున్నాయిట.వీటికి కేవలం రాజరిక వ్యవస్థే కాదు.. సామాన్యజనులు,ధనికులు,వ్యాపారులు ఇలా సమాజంలోని వివిధ వర్గాలవారు సహాయపడ్డారంటారు రచయితలు.
        తక్షశిల, నలందా, విక్రమశిల, నాగార్జున కొండ వంటి ఆరామాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలుగా పరిణితినొందాయి.మరి తొట్లకొండ,బావికొండలపై వెలసిన విద్యాసంస్థలుగా ఎదిగాయా అన్నఅంశాన్ని విశ్లేషిస్తూ రచయితలు అక్కడ దొరికిన శిలాఫలకంపై పయోథి అనే పదం కనిపిస్తుంది.అతడొక ఆచార్యుడయి ఉండొచ్చు అంటారు. జ్ఞానం కలిగిన భిక్షువుగా  అతని ప్రస్తావన పోయసుత్త లో కనిపిస్తుందని పేర్కొంటారు.ఇలాంటి అంశాలపై పరిశోధనలు జరగాలని ఆకాంక్షిస్తారుకూడా...

         ఈ పుస్తక రచనకు సంబంధించి రాణీశర్మ, సుధాకర్ లు సంప్రదించిన గ్రంథాల జాబితా కూడా విస్త్రతమయిందే.చరిత్ర అనగానే తేదీలు,యుద్ధాలు అన్నట్టు కాకుండా సామాజిక జీవనానికి, సామాజిక చైతన్యానికి ముడిపెట్టడం తథాగతుని అడుగుజాడలు ని ఆసక్తికరంగా తీర్చిదిద్దింది.
రెండువేల కితమే సమాజగతిశీలతను ఊహించి
మానవ వికాసానికి కొత్త బాట వేసిన బుద్ధభగవానుడు మనమదిలో నిలిచిపోతాడు.
ఆతని దార్శనికత, ఆర్ద్రత,కరుణ, జ్ఞానవివేచన
నిశిరాత్రివేళ నేలను తాకే వైశాఖ వెన్నెల కిరణాల్లా మనలను అలరిస్తాయి.మనిషి చైతన్యవంతుడవ్వాలంటే నిరంతర స్వీయాన్వేషణ అవసరాన్ని తథాగతుడి సాక్షిగా గుర్తు చేస్తాయి..

             కాల్పనికేతర సాహిత్యంలోని వచనరచన వర్షర్తువు సౌందర్యం లాంటిదని చూపే పుస్తకం తథాగతుని అడుగుజాడలు

సి.యస్.రాంబాబు

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌