Wednesday, September 28, 2011

ఊరు వాడ బతుకు - పుస్తక పరిచయం - అనంత్ ...



యువ రచయిత తొలి రచన ఊరూవాడా బతుకు వెయ్యి ఆత్మలు చెప్పుకున్న కతల కమలం. ఇటీవల తెలుగులో నచ్చిన ఆత్మకతలలో గడియారం రామకృఫ్ణ శర్మ శతపత్రం ఒకటి. గడియారం రామకృఫ్ణ శర్మ తన శ్వేతపత్రానికి ఒక్కో రెక్కా అమరుస్తున్న కాలంలో ఆయనతో నేను చాలా సార్లు ముచ్చటించాను. ముచ్చటించిన ప్రతి సందర్భంలోనూ నేనన్నది ఒకే మాట. అది నాకిప్పటికీ గ్నాపకం.
"
మీరు చరిత్ర రాయడం మానేసి గ్నాపకాలు రాయండి" అని.
"
నీవన్నంత సులభం కాదు వాటిని విడదీయడం" అన్నట్టు నవ్వారు. ఆయన అవేవీ రాయలేదు తన శతపత్రంలో.
మరోసారి కలిసినపుడు మళ్ళీ నిలదీసాను.
"
ఎన్నని రాస్తాం"- అని పెదవి విరిచారు.
"
ఏది రాయకూడదనుకుంటున్నారు మీరు" - అడిగాను
సమాధానంగా అద్భుతమైన అనిక్ డోట్స్ చెప్పారు.
"
రాయండి ఇవన్నీ"- అన్నాను.
"
ఓపిక లేదు. అనుకున్నదే రాయలేకపోతున్నాను"-అని తన పెన్షన్ క్లియరెన్స్ కోసం రాసిన పేద్ద ఉత్తరం ఇచ్చారు.
అలా శతపత్రంలో రెక్కలు తొడగని గ్నాపకాలెన్నో.
ఆ శతపత్రం తర్వాత దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ఈ శ్వేతపత్రం చదువుతుంటే బిగ్ ఫిష్ సినిమా గుర్తుకువస్తుంది.
ఈ రెండు కథల్లాంటి ఆత్మల్లో అదొక్కటే పోలిక.
గడియారం రామకృఫ్ణ శర్మ లోకానికి తన శ్వేతపత్రం సమర్పించక ముందే అతని జీవితానికి వేల రెక్కలు తొడిగిన కమలమ్మ సెలవంటూ వెళ్ళిపోయింది.
తెల్లారిన వేళ పొడిచిన చందమామతో మొదలై కలికి గాంధారి వేళ విరిసిన కమలంతో ముగుస్తుంది దేవులపల్లి కృష్ణమూర్తి గాధ. అక్కడా ఇక్కడా రెక్కల లెక్క మాత్రం వందే. ఆ వందే మా తరమ్ కాదు.


ఇది పితృస్వామ్యం. కాబట్టే నేను సీమవాసిని అయ్యాను. కానీ ననుకన్న గొట్టుముక్కుల సామ్రాజ్యలక్ష్మిది కొల్లాపురమే. తల్లి తెలంగాణ. పిత్రార్జితమే తెలంగాణ.మగ్గాల లడీల మారు మోతల నడుత గడిచింది కోడుమూరులో నా బాల్యం. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు వరకు నేశోళ్ళే నా నేస్తులు. కొత్త సామాజిక బాధ్యత నెత్తిన వేసుకున్నట్టు పోజు కొట్టే చాలా మంది ఆత్మకతాత్మక రచయితల్లా కాకుండా నింపాదిగా, నిమ్మలంగా, సాదాసీదాగా పూసగుచ్చినట్టు గ్నాపకాలను గుర్తుకు తెస్తున్న కొత్త నేస్తమే ఈ దేవులపల్లి కృష్ణమూర్తి.


గూగుల్ సెర్చ్ లో అస్సలు దొరకదీ గుల్ మొహర్ గ్రామం. పేరు అనంతారం. మొదటి పేజీ మొదలు పుస్తకం తిప్పుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో దాసరి రాములు తన లోగొంతుకలో సన్నగా సందమామను పొడిపిస్తాడు. అదీ పొదలపొదల గట్ల మీంచి. అంతే... అక్కడి నుంచి మీకు పలు పాటలు రాసిపెట్టి వున్నాయి ఈ పుస్తకం నిండా.
పాటలే.. పాటల్.
బొట్ల బొట్ల చీర కట్టి మగ్గం ఆడిస్తూ కాపోడు అయిన తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకునేందుకు బోనగిరి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడకు రైల్లో వెళ్ళి కలిసే ప్రియురాలి నోస్టాల్జిక్ బాట ఒక పాట.
తనతో నడిపే ప్రతి యవ్వారానికి ఒక రేటు పెట్టే ఒక జాణ పాటలో టారీఫ్ ని తారీఫ్ చేయకుండా ఎలా వింటాం?
నల్లది, పొట్టిది అయిన ఇంకో నల్ల పిల్ల(తమిళ అర్థంలో) -హమ్ కాలే హై తొ క్యా హువా దిల్ వాలే హై-అంటూ ఇంటికి ఇన్ వైట్ చేస్తుంది. ఎంటైస్ చేస్తుంది పాట పాడి...
బుర్రకథ, బాగోతాలు, కలుపు పాటలు, అలుపు రాకుండా రోకటి పాటలు, నిద్ర రాకుండా జాగారం పాటలు, కవ్వించే పాటలు, అణచుకున్న కోర్కెను మనసారా కైగట్టే పాటలు, పాటలే పాటలు... గాజులోడి పబ్లిసిటీ పాటలు, గాజుల కోసం పడిగాపులు కాసే అమ్మాయిల పాటలు...
ఓహ్ కృష్ణమూర్తీ నీ పాటల్....
ఆలస్యంగానయినా పాడుతున్న అరుదైన, అపురూపమైన పాటే ఈ పుస్తకం.
గ్రామాల గురించి మూల మూలనా మూరలతో కొలిచినట్టు, జాడలతో తూచి నట్టు ఈ 70+కృష్ణమూర్తి తన బాల్యం గురించి నిన్న అన్నంత తాజాగా స్వ్కేర్ ఫీట్ బై స్వ్కేర్ ఫీట్ కైకట్టడం రేర్ ఫీట్. ఇది పక్కా రెవెన్యూ వ్యూ. పల్లెల్లో కులాలు, వాటి కింది కులాలు, వాటి ఆశ్రిత కులాలు, వాళ్ళ పని విభజన. శ్రమకు విలువ చెల్లించే ఆచారాల్లాంటి బాధ్యతలూ... చిన్న చిన్న వివరాలు. చీకూ, చింతా, పస్తూ తెలియని బతుకుల పల్లె ఇంతలా తెలిసిన మాతృమూర్తి కృష్ణ మూర్తి.


ఆంధ్రా నుంచి వలస వచ్చిన ముస్లిం అమ్మాయి, పైగా పిల్ల తల్లి; ఆపై చెప్పేది ఝాన్సీ లక్ష్మి బాయి బుర్రకథ. ఆమె కథ చెప్తే అది మెగా సినిమానే. ఈమె గ్నాపకం కృష్ణమూర్తిని చాన్నాళ్ళు వెంటాడింది. ఆ పిల్ల అందం ఒక తియ్యని గ్నాపకం కృష్ణమూర్తికి.
ఇక కుడుముల పండుగకూ కుక్కల కడుపు నిండటానికీ వున్న సింబయాటిక్ సంబంధం ఒక కదిలించే గ్నాపకం. పదో తరగతి పిల్లల పైనే పోలీసు కేసుండే మరో గ్నాపకం. ఓహ్ ఏం కాలం.
బొగ్గు బస్సూ, నీడల తోలుబొమ్మలు ఆడించే బుడగ జంగాలు, ఉర్దూలో మూలికలు అమ్ముకునే వాడూ, అలా అమ్ముకోడానికి తెలుగులో తర్జుమా చేసేవాడూ. ఆ నడి రోడ్డుల దవాసాజ్ ఒక మధుర గ్నాపకం.
ఇంత మామూలు గ్నాపకాలు కూడా ఇంత బలాదూర్ గా బందిస్తాయని తెలియదు నాకు ఇంతక ముందు. కవితలు, కథలు, నవలలు ఎవరైనా రాస్తారు. కానీ, కానీకి కొరగాకుండా పోయాయనుకున్న ప్రతి గ్నాపకాన్నీ అద్భుతంగా రాసే నేర్పు తెలిసిన యువ రచయిత కృష్ణమూర్తికి పేరా పేరానా పడి పదివేల దండాలు.
ఈ ఊరు, ఈ వాడా, ఈ బతుకూ నాలో చెలరేపిన గ్నాపకాలెన్నో.


మూడో తరగతిలో ఆలూరులో ఆరుబయట రాత్రిపూట రెహమాన్ సర్కస్ చూసిన గ్నాపకం. టాకీస్ లో కృష్ణమూర్తిలా నాటక చూడలేక పోయాను. కానీ ఆలూరులో గోవర్థన టాకీసులో చూసిన సింహబలుడు నా తొలి సినిమా గ్నాపకం. కోడుమూరులో పరప్ప జిన్నుకు ఎదురుగా చేలలో తెల్లార్లూ ఆడిన చింతామణి నాటకం కొంచెం సేపే చూసి పడుకున్న గ్నాపకం. నాటకం అయిపోయిన మరుసటి రోజు మల్లె పూవులా మా ఇంట్లో తిరుగుతున్న బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్ర్రిని చింతామణిగా పోల్చుకోలేని గ్నాపకం.
నేషనల్ పేనసోనిక్ టు ఇన్ వన్ లో తొలిసారి కుంతీ విలాపం పద్యాలు, వర విక్రమయంలో కాళింది, కమలల డైలాగులు, సిలోన్ నుంచి మీనాక్షి పొన్నుదురై, గౌరీ మునిరత్నం దయతలచి వినిపించిన పాటలు నా బాల్యపు గ్నాపకాలు.

మరాఠీలో మాట్లాడుకుని , కాఫీ అమ్ముకునే రంగ్రీజోళ్ళను ప్రస్తావిస్తాడు కృష్ణమూర్తి. మా కోడుమూరులో కూడా ఈ రంగ్రీజులుండే వారు. వాళ్ళను మేం రంగరాజులు అనే వాళ్ళం. ఈ కుటుంబాలు కూడా బట్టల వ్యాపారం చేసేవారు. కాఫీ అమ్ముకునే వారు. అయితే షోలాపూర్ నుంచి వచ్చిన వీళ్లను ఖత్రోళ్ళు, దగుడోళ్ళు అనికూడా అనే వాళ్ళం. వీళ్ళలో కొంత మంది కంసాలి పని చేసేవాళ్లు. ఇంకొంత మంది దర్జీ పని చేసే వాళ్ళు.


ఇక సైన్ బోర్డులు, అంగళ్ళమీద రాతలు, గోడల మీద ప్రకటనలు రాసే పెయింటర్ ఎం.హెచ్.కె గురించి కృష్ణ మూర్తి ఆప్యాయంగా రాస్తాడు. ఈ ఎం.హెచ్.కె ఎవరో నాకు తెలియదు. కానీ ఎం.హెచ్.కె లాగే సంతకం పెట్టిన మా మాస్టర్ వి.యకుమార్ నాకు గ్నాపకం వచ్చాడు చదువుతుంటే.


కర్నూలు జిల్లాలో మంత్రాలయం నుంచి శ్రీశైలం వరకు కనిపించే అన్ని సైన్ బోర్డులపైనా ధగధగ మెరిసిన పేరు బై మాస్టర్. మాస్టర్ కుంచె నుంచి ఏ కళాఖండాలూ జాలువారలేదు అప్పటి టాబ్లాయిడ్స్ లో రాసి వార్చేందుకు. మాస్టర్ అని సంతకం చేసే అతని పేరు విజయ్ కుమార్. అతను దళిత క్రిస్టియన్. మాల. టెలిఫోన్ ఎక్సేంజిలో ఆపరేటర్. మా శేషఫణి బాబాయికి బాల్యపు జిగిరి. మాస్టర్ మా జిల్లాలో ఎన్నో పెళ్ళిల్లను ఘనంగా, వైభవంగా, మధురంగా తీర్చి దిద్దిన ఫోటోగ్రాఫర్ కూడా. ఈ ప్రకాశ్ ఆర్ట్స్, ఇజ్రా బోర్డుల గుత్తాధిపత్యం, దాన్ని మింగేసిన ఫ్లెక్సీలు, వినైల్ షీట్లు రాకముందు మాస్టరే మెగాస్టార్ మా జిల్లాలో. దళితుడైనందుకు ఉద్యోగం చాలా సార్లు పోగొట్టుకున్నాడు. క్రైస్తవుడు అయినందుకు కర్నూలు జిల్లా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటి అనే వన్ మ్యాన్ ఆర్మీని కర్నూలు జిల్లా ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా నడిపి అనేక సార్లు ప్రాణాలు పోగొట్టుకున్నంత పనిచేసుకున్నాడు. మాస్టర్ విజయ కుమార్ దగ్గర నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను.
మాస్టర్ సైన్ బోర్డులపై చేసే సంతకం వెనుక ఒక కత వుంది. తర్వాతే అది నాకూ తెలిసింది. బోర్డులపైన బై మాస్టర్ అని చేసే సంతకం లోపల ముగ్గురు కళాకారులు దాగి వున్నారు. ఒకరు మాస్టర్ విజయ్ కుమార్. రెండు- మాస్టర్ కి ప్రాణ నేస్తుడయిన గిడ్డయ్య. మూడు- మాస్టర్ తమ్ముడు సుకుమార్. రెండు సందర్భాలలో మాస్టర్ అన్న సంతకాన్ని విజయ్ కుమార్ కాకుండా తక్కిన ఇద్దరు చేసేవాళ్ళు.


సందర్భం-1
ఆర్డర్లు ఎక్కువై మాస్టర్ మరీ బిజీ అయిపోతే అతనికి ఆసరాగా ఆ బ్రాండ్ నీడను చల్లగా చూసుకునేవారు మిగతా ఇద్దరూ-ఎక్కువ సార్లు గిడ్డయ్య, అప్పుడప్పుడు సుకుమార్.


సందర్భం- 2
మాస్టర్ విజయ్ కుమార్ కు తరచూ ఉద్యోగం ఊడేది. లేదా ట్రాన్స్ఫర్ అయ్యేది. మాస్టర్ కు విపరీతమైన ఆత్మాభిమానం. పైగా ఆర్టిస్టు. ఆపై అనార్కిస్టు. చాలాసార్లు తనపై అధికారులను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద బుక్ చేసి కులం పేరుతో కుళ్ళు జోకులు పేలుస్తూ, బూతులు తిట్టే వాళ్ళకు చెక్ పెట్టేవాడు. ఉద్యోగం వదిలి కోర్టుల చుట్టూ తిరిగి కేసులు గెలిచి కాలర్ ఎగరేసేవాడు. ఉద్యోగం ఊడటానికీ, కాలర్ ఎగరేయడానికీ మధ్య కాలంలో మాస్టర్ మరేమీ చేసేవాడు కాదు. తన తరపు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి తన కేసు ఎలా గెలవచ్చో, ఎందుకు గెలవాలో లాంటి విషయాల్లో తర్ఫీదు ఇస్తూ బైబిల్ కొటేషన్లను అవోకగా అరువు ఇచ్చేవాడు. సరిగ్గా ఇలాంటి క్రాప్ హాలిడేలో గిడ్డయ్య తన స్నేహాన్ని మాస్టర్ సంతకం పెట్టి చాటుకునేవాడు. అంత వరకూ అల్లరిగా తిరిగే సుకుమార్ కూడా ఇల్లు గడవడానికి మాస్టర్ కి ఘోస్టయ్యేవాడు.
మా జిల్లాలో సైన్ బోర్డుల్లో ఇప్పటికీ చెక్కు చెదరని సంతకం, వ్యక్తిత్వం- మా మాస్టర్ ది. కృష్ణమూర్తి గుర్తు చేసుకున్న ఎం.హెచ్.కె నాకు మాస్టర్ ని గుర్తుకు తెచ్చాడు. గ్నాపకాలు చెప్పుకునేందుకే కదా మనందరికీ ఒక నికార్సయిన సందర్భం కావాలి. అది ఇచ్చినందుకు కృష్ణమూర్తికి కృతగ్నతలు. అంతకు మించి ఇలా నా మాస్టర్ విజయ్ కుమార్ గురించి ఈ నాలుగు స్క్రీన్ ప్రింట్లు ఎక్స్పోజ్ చేసుకునేందుకు వెతుక్కోకుండానే ఒక మంచి సందర్భం ఇచ్చినందుకు కృష్ణమూర్తికి నమస్కారాలు.


ఈత రాని తన దోస్త్ రెహమాన్ ని దొరోరి బావిలో కృష్ణమూర్తి ఎలా కాపాడాడో చెప్పినప్పుడు నాదీ ఒక గ్నాపకం చెప్పాలనిపిస్తోంది. నేనూ, శశి, ఖదీర్, ఉమ, విష్ణు, చిట్టి బాబాయ్(సత్య శ్రీనివాస్) తారామతి బిరాదరిపైన గ్రూప్ డాన్స్ వేసి గండిపేట చెరువుకెళ్ళి టెమ్ట్ అయ్యి ఈతకు దిగాం. గండిపేటలో అక్కడ, అప్పుడు ఈత నిషేధం. ఈత రాని విష్ణు నీళ్ళలోకి దిగలేదు. రాకున్నా ఖదీర్, శశి, చిట్టి దిగి తడిసారు. వస్తుందని దిగిన ఉమకు నీళ్ళలోకి దిగిన వెంటనే తెలియని భయమేదో వేసి తడబడ్డాడు. అప్పుడే ఈత కొట్టి ఒడ్డుకు వచ్చాను నేను. అప్పటికే ఉమ నీళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయి కసిబిసి అయిపోతుంటే అదంతా ఆట అనుకుని పెద్దగా స్పందిచలేదు ఒకే ఒక్క ఈతగాడినైన నేను. గండిపేటలో ఉన్నట్టుండి లోతు ఎక్కువవుతుంది. ఉమ మునిగి పోతున్నాడు. అరుస్తున్నాడు. అదంతా ఆటలో భాగమే అనుకున్నాం అప్పటికీ అందరం. గారడీ వాడు కత్తి సాము చేస్తూ పొరపాటున కత్తి నెత్తికి తగిలి తల తెగి పడినా చప్పట్లే కదా కొడతాం. అలాగే వుండింది మాకూ ఆ రెండు క్షణాలు. కాని విష్ణుకు విషయం అర్థం అయిపోయింది. నేను వెంటనే నీళ్ళలోకి దూకి ఉమను గడ్డకు తీసుకువచ్చాను. ఉమ ప్రాణాలు కాపాడి హీరోనయ్యాను. ఈ గ్నాపకాన్ని నాలో ట్రిగ్గర్ చేసింది కృష్ణమూర్తి ఫ్రెండ్ రెహమానే. ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతమే అని అనిపించవచ్చు. కానీ ఇలాంటి గ్నాపకాలను తీసి పారేయలేం. చెరిపేయనూ లేం. గొప్ప మలుపులూ, మైలురాళ్ళూ కాకపోయినా ఇవన్నీ బతికిన క్షణాలే. ఈ ఎరుక తన పుస్తకమంతా పరిచిన కృష్ణమూర్తికి సవినయ సలాములు.


ఇక గాలి పతంగుల గ్నాపకం. ఓహ్! ఈత తర్వాత తలచుకుంటేనే నా అణువణువూ పుకించేది గాలిపటాలకే. ఒక్క కోడుమూరులో వున్నన్ని గాలిపటాలు మళ్ళీ నేనెక్కడా చూడ్లేదు. గాలి పటం అన్న పదం కర్నూలు టవున్లో కూడా ఏకవచనమే. అంతా ఒకే రకం. ఆకారం చతురస్రం. టెక్స్ట్ బుక్కుల్లో బుక్కయిన ఈ గాలిపట విశేషం పేరు మా కోడుమూరులో బుడ్దంగి. ఇదే కాక ఇంకా బుర్ బుర్ పటాకి, నక్షత్రం పటాకి, మనిషి పటాకి, చామంతి పటాకి, సూపర్ కాయితం పటాకి..... ఇవన్నీ ఎంతెంత పెద్దవో... ఎంతెంత ఎత్తుల్లో ఎగిరేవో. వీటికి సరిపడా తోకలు కట్టడం, ఎగిరేందుకు చక్కని సూత్రాలు వేయడం ఒక సైన్స్... ఒక కళ. అందకే గాలిపటానికి బహువచనంలా వుండేది మా కోడుమూరు ఆకాశం. అదీ సంక్రాంతి ముందు. ఎక్కడా మాంజా అన్న మాట కానీ , కటీ అన్న పదం కానీ తెలియని స్వచ్ఛమైన గాలిపటాల ప్రదర్శన కోడుమూరు. పరుల గాలిపటాలను కటీ చేసి చప్పట్లూ, కేరింతలూ కొట్టడం కోడుమూరుకు తెలియదు. నేను చూడనూ లేదు. ఎగరేసిన గాలి పటానికి క్యాండిల్ కట్టి పైకి పంపించి ,రాత్రంతా గుంజకు కట్టేసి పొద్దునే పళ్ళు కూడా తోముకోకుండా ఇష్టమైన నేస్తం ముఖం చూసినట్లు మురిసిపోవడం ఒక్కటే తెలుసు మాకు. గాలిపటాలు అవంతటవే ఏ అవాంతరమో సాంకేతిక లోపమో వచ్చి తెగిపోవాల్సిందే. తెంపడం తెలియని బాల్యం అది. అలా తెగిపోయిన గాలిపటాలన్నీ మా సద్ద సేన్లో దొరుకుతాయి. అందమైన వేర్వేరు ఆకారాల్లో సగర్వంగా, సమున్నతంగా గాలిపటాలను ఎగురవేసేది ఎక్కువగా నేసోళ్ళే. అయితే మేదరోళ్ళ దగ్గర ఎలాంటి బొంగు బద్దలు తెచ్చుకోవాలి, వాటిని ఎలా కోయాలి, ఎలా కట్టాలి, ఎలా కాయితాలు మూయాలి, ఎలాంటి సూత్రమేసి బుర్ బుర్ మనిపించాలి అన్న మర్మాలను నాకు నేర్పింది మాత్రం మా నాయనే. నేసోళ్ళ గాలిపటాల నైపుణ్యానికి సవాల్ గా వుండేది మా నాన్న పనితనం.


ఈ పుస్తకం ఒక మంచి village ethnography study కి మంచి నమూనా. కేంద్రీకృతకం అయిపోయిన విశ్వవిద్యాలయాల్లోని ఏ కల్చరల్ ఆంత్రొపాలజీ విభాగంలోని ఏ ఎం.ఎన్.శ్రీనివాసన్ లాంటి బోధకులకూ బోధపడని, తెలియని రాత పద్ధతి కృష్ణమూర్తిది. గోల్డు మెడలల్లో వేసుకునే ఆ విద్యార్థులు పొందాల్సిన తక్షణ తర్ఫీదు ఇదీ. టేకింగ్ సైడ్స్ల్ లో చాలా dispassionate గా వుంటూనే చెప్పే పద్ధతిలో విపరీతమైన passion కురిపిస్తాడు కృష్ణమూర్తి. Anthropology లోని observer-participant method కు applied అచ్చుపోత ఈ రచన. మహా ఘటనలను కూడా చాలా మామూలుగా matter-of-fact గాచెప్పి పాఠకులకూ. ఘటనకూ మధ్యవర్తిత్వం, సూత్రధారకత్వం (ఒక ఎరుకతో) మానిన అరుదైన రచనా శైలి ఇది. పాఠకుడికి ఎలాంటి దిశానిర్దేశం అవసరం లేదిలాంటి చారిత్రక జీవిత ఘటనా సమాహారాన్ని చెప్పుకొచ్చేటపుడు. పాఠకులు వట్టి చవట దద్దమ్మలనుకునే మేధావి రచయితలకు నివాళి ఈ శైలి. ప్రతి వచనం పుస్తకం నిండా తాజాగా, చాలా నేల బారుగా, నిటారుగా, సాదాసీదాగా కృష్ణమూర్తిలా పాండిత్యంతో ఎలాంటి దుప్పటి పంచాయితీలు లేకుండా సాగిపోతుంది. మాట అలవోకగా కదులుతుంది.
ఇది రచయితకు రమారమి 19 ఏళ్ళు నిండినపుడు ఆగిపోయే గ్నాపకాల కదంబం. అసలు 19 ఏళ్ళకు ఇంత విస్తారమైన జీవితం, అనుభవం, విపులమైన గ్నాపకం ఎలా సాధ్యం? ఎవరైనా ఎలా వడుకుతారిలా?


కొన్ని గ్నాపకాలు మరిచిపోవడానికి గుప్పెడు గుళికల్ని మింగుతుంటాం. ఇంకోసారి గుర్తు తెచ్చుకోడానికి పిడికెడు గ్నాపకాలు కూడా మిగిలి వుండవు వెనక్కి చూసుకుంటే. కొన్నింటిని రబ్బరు పెట్టి అదేపనిగా చెరిపేసుకోవాలనీ అనుకుంటుంటాం. మరి కొన్నింటిని ఆల్కహాలిక్ డిమెన్షియాలో, ఏజింగ్ అమ్నీషియాలో, అల్జమీర్ రోగాలో, ఏ గాలో మింగేస్తున్న ఈ కాలంలో ఇసుకలో మేలు రకం రేణువులను పోట్చుకోగల నిపుణతతో గతాన్ని సైకత శిల్పంగా మలిచే ఈ మెలకువ ఎప్పటికొస్తుందో నా మటుకు నాకు.
కతకూ, నవలికకూ, నవలకూ- అసలు మనకు తెలిసిన సకల కాల్పనిక రచనా స్వరూపాలకూ అంతుపట్టని , లొంగని ఇట్లాంటి పోగులు పెట్టే సృజన శైలులకు మనం నిజంగా రుణపడి వుంటాం కథా.

-

తన బ్లాగులో రాసుకున్న ఈ సమీక్షను పునర్ముద్రించేందుకు అనుమతించిన అనంత్ గారికి కృతజ్ఞతలు. వారి ఇతర రచనలకోసం ...ఇక్కడ ... క్లిక్ చేయండి )


http://anantamu.blogspot.com/2011/09/blog-post_26.html

ఊరు వాడ బతుకు ఈ పుస్తకం గా కూడా లబిస్తుంది. ఈ పుస్తకం కోసం ... ఇక్కడ ... క్లిక్ చేయండి

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40

..

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

..


మనుషులు చేసిన దేవుళ్ళు ఈ పుస్తకం వెలువడింది !

గత నెలలోనే ప్రచురించబడ్డ కొడవటి గంటి రోహిణీ ప్రసాద్ "మనుషులు చేసిన దేవుళ్ళు"
ఇప్పుడు ఈ పుస్తకం గా కూడా లభిస్తోంది.
వివరాల కోసం దిగువ టైటిల్ పై క్లిక్ చేయండి:

"మనుషులు చేసిన దేవుళ్ళు"



..

Tuesday, September 27, 2011

ప్రపంచ వ్యాప్త తెలుగు పాఠకుల కోసం మరో రెండు హెచ్ బీ టీ "ఇ- పుస్తకాలు"

ఇప్పటికే అందుబాటులో వున్న
"ఊరు వాడ బతుకు",
"నేనే బలాన్ని- టిఎన్ సదాలక్ష్మి బతుకు కథ"
పుస్తకాలకు తోడు కినిగె డాట్ కాం వారి ద్వారా
మరో రెండు హెచ్ బీ టీ పుస్తకాలు
అందుబాటులోకి వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం .
(
ఈ పుస్తకాల శీర్షికలపై క్లిక్ చేసి నేరుగా ఈ పుస్తకం వివరాలు చూడవచ్చు. )
అవి :
ఘంటారావం (అలేగ్జాందర్ ద్యుమా రచన)
అజేయుడు (విక్టర్ హ్యూగో రచన)
పుస్తకాల కోసం... " కినిగే డాట్ కాం "...వెబ్సైట్ ని సందర్శించండి

http://kinige.com/


Monday, September 26, 2011

అస్తిత్వ పోరాటం

అస్తిత్వ పోరాటం

''అడుగడుగునా నాకు చరిత్ర ఉన్నది'' ... ఇలా చాటుకోవటానికి ఎవరికైనా గుండెధైర్యం కావాలి. అంతకు మించిన పోరాట నేపథ్యం ఉండాలి. ఆ రెండూ పుష్కలంగా ఉన్నాయి కాబట్టే టి.ఎన్‌. సదాలక్ష్మి తన జీవన ప్రస్థానం గురించి అ లా వ్యాఖ్యానించుకోగలిగారు. ఒక దళిత కుటుంబంలో ... అదీ మరుగుదొడ్లు శుభ్రం చేసే 'మెహతర్‌' కులంలో పుట్టి, స్వాతంత్య్రపు తొలిదినాల్లోనే పురుషాధిక్య రాజకీయరంగంలోకి ప్రవేశించారంటేనే ఆమె ఎంత సాహసవంతురాలో అర్థమవుతుంది. పైగా అడుగడుగునా లింగ, వర్ణ వివక్షను ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలిలో స్థానం సంపాదించటమంటే మాటలు కాదు. డిప్యూటీ స్పీకర్‌ స్థానాన్ని అధిరోహించి మహిళాశక్తికి ప్రతీకగా నిలిచిన ఆమె జీవితం ఆద్యంతం స్ఫూర్తిదాయకం. ఆ మహోన్నత దళిత నాయకురాలి జీవితకథకు రచయిత్రి గోగు శ్యామల ''నేనే బలాన్ని'' పేరుతో అక్షరరూపం ఇచ్చారు.
- పున్న సుదర్శన్‌

ఈనాడు ఆదివారం (25 సెప్టెంబర్‌ 2011) సౌజన్యంతో

Saturday, September 17, 2011

మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



మనుషులు చేసిన దేవుళ్లు - కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

మత విశ్వాసాల ద్వారా సమకూరే ఉపయోగాలేవీ 'ఇన్‌హేలర్ల' స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గానీ, సమాజపు ఆరోగ్యానికి గానీ పట్టిన 'జలుబు' ఎంతమాత్రమూ తగ్గదు. పైగా వాటి 'సైడ్‌ఎఫెక్ట్స్‌' చాలా ప్రమాదకరమైనవి.

వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలు సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రోజూ ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరూపిస్తూనే వుంది.

ప్రాణులను సృష్టించినది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలూ, భద్రతాభావమూ కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్థ ప్రయత్నమే.

ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్థిక అనిశ్చితస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకూ గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగత నమ్మకమూ, బలహీనతా కాదు.

దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడులేడని వాదిస్తే సరిపోదు. వారికి ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి.''

మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడుపోసుకుంది?
మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి?
మతాల నేపథ్యం లాభనష్టాల గురించి విస్తృత అధ్యయనంతో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.

రచయిత: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
జననం: మద్రాసులో 1949లో
విద్యాభ్యాసం: మద్రాసు, ఆంధ్ర, ముంబయి విశ్వవిద్యాలయాల్లో
అణుభౌతికశాస్త్రంలో పి.హెచ్‌డి.
ఉద్యోగం: మొదట బాబా అణుకేంద్రంలో, ప్రస్తుతం ఇ.సి.ఐ.ఎల్‌.లో.
అభిరుచులు: శాస్త్రీయ సంగీతం, జనరంజక విజ్ఞాన రచనల్లో ఆసక్తి, అభినివేశం.
ఇతర రచనలు: జీవశాస్త్ర విజ్ఞానం, సమాజం (జనసాహితి), విశ్వాంతరాళం, మానవ పరిణామం, జీవకణాలూ, నాడీ కణాలూ (స్వేచ్ఛా సాహితి)
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి బ్లాగును "ఇక్కడ" సందర్శించండి :
http://rohiniprasadkscience.blogspot.com

మనుషులు చేసిన దేవుళ్లు
కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
196 పేజీలు, వెల: రూ.100/-
తొలి ముద్రణ: ఆగస్ట్‌, 2011

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

Thursday, August 25, 2011

ఐ యామ్‌ లెజెండ్‌ - నేనే బలాన్ని



మరుగుదొడ్లు సాపు చేసే మెహతర్‌ కులంలో పుట్టి- దేవుళ్లను, దేవుళ్ల ఆస్తులను సంరక్షించే మంత్రిత్వ శాఖను నిర్వహించే స్థాయికి ఎదిగిన టి.ఎన్‌.సదాలక్ష్మి - ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు సిసలైన గొప్ప స్పూర్తికి నిదర్శనం.
ఎందరో నాయకులను నిగ్గదీస్తూ,
అన్యాయాలను ఎదుర్కొంటూ,
నిత్యం న్యాయం వైపే నిలబడుతూ, ఎక్కడా రాజీపడకుండా బతికిన మనిషి సదాలక్ష్మి.
ఒక స్త్రీగా,
మాదిగగా,
తెలంగాణా వాదిగా...
ఎన్నింటికి ఎదురీది ఆమె గొప్ప నాయకురాలిగా,
మంచి నాయకురాలిగా పేరుతెచ్చుకుందో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

అందుకే ''అడుగడుగునా నాకు చరిత్ర వుంది'' అని అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిందామె.
ఆమె జీవిత చరిత్రనుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు మీకోసం ...

చూడండి: ఈరోజు (25 ఆగస్ట్‌ 2011) ఆంధ్రజ్యోతి దినపత్రిక - నవ్య పేజీ (ఈ కింది లింక్‌)లో ప్రచురించబడ్డ కథనం..

ఐ యామ్‌ లెజెండ్‌ - నేనే బలాన్ని - ఆంధ్ర జ్యోతి

Saturday, August 20, 2011

ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు పుస్తకాభిమానులకు శుభవార్త:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన పుస్తకాలు ఇకనుంచి 'కినిగె డాట్‌ కామ్‌'లో 'ఇ బుక్స్‌'గా లభిస్తాయి.
మా తొలి తెలుగు ఇ బుక్‌: "నేనే బలాన్ని"

ప్రపంచ వ్యాప్తంగా వున్న మా అభిమానులకు
హెచ్‌బీటీ పుస్తకాలను కినిగె డాట్‌ కామ్‌' వారి సహకారంతో ఇ బుక్స్‌' రూపంలో అందించాలని సంకల్పించాము. హెచ్‌బిటీ ఇటీవలే ప్రచురించిన గోగు శ్యామల రచించిన ''నేనే బలాన్ని-టిఎన్‌ సదాలక్ష్మి బతుకు కథ'' మా తొలి తెలుగు ఈ పుస్తకంగా ఇప్పటికే కినిగె డాట్‌ కామ్‌ లో అందుబాటులోకి వచ్చింది.

ఈ పుస్తకం కోసం దిగువ లింక్‌పై క్లిక్‌ చేయండి:
''నేనే బలాన్ని ఇ బుక్‌''

మా రెండో బుక్ : "ఊరు వాడ బతుకు"


అదేవిధంగా దేవులపల్లి కృష్ణమూర్తి రచించిన మరో విశిష్టమైన బతుకు పుస్తకం ''ఊరు వాడ బతుకు'' కూడా మా రెండో ''ఇ బుక్‌'' గా లభిస్తోంది. మా పుస్తకాలన్నింటినీ క్రమంగా ''ఇ బుక్స్‌'' రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.

ఊరు వాడ బతుకు "
పుస్తకం" కోసం దిగువ లింక్‌పై క్లిక్‌ చేయండి.
''ఊరువాడ బతుకు ఇ బుక్‌''

మంచి పుస్తకాలను ఆదరించండి. మా ప్రయత్నాన్ని విజయవంతం చేయండి.

కినిగే వారి వెబ్ చిరునామా: http://kinige.com



.

Tuesday, August 16, 2011

తొలి దళిత మహిళా శాసన సభ్యురాలు, మంత్రి శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ: ''నేనే బలాన్ని''



సికింద్రాబాద్‌ బొల్లారంలోని మెహతర్‌ బస్తీలో అట్టడుగు మాదిగ ఉపకులమైన మరుగుదొడ్లు సాపు చేసే మెహతర్‌ వృత్తి కులంలో పుట్టి ఏటికి ఎదురీదుతూ అక్కడి నుంచే రాష్ట్ర శాసన సభలో ప్రవేశించి, మంత్రి స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వ్యక్తిత్వం శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మిది. భారతదేశంలో 1952లో ప్రప్రథమంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రిజర్వుడు అభ్యర్థిగా నిలబడి కమ్యూనిస్టు ప్రభంజనాన్ని ఎదుర్కొని రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి, దేవాదాయ శాఖా మంత్రి వంటి అనేక బాధ్యతలను నిర్వహించారు. దేవాదాయ శాఖను నిర్వహించిన తొలి మాదిగ మహిళామంత్రిగా పేరు గడించడమే కాకుండా ఆయా శాఖలపై తనదైన బలమైన ముద్ర వేశారు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మూలస్తంభంగా వున్నారు. తెలంగాణా ప్రజా సమితి (టిపిఎస్‌) అధ్యక్షురాలిగా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మాదిగ హక్కుల కోసం, ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతూ దండోరా ఉద్యమానికి బీజం వేశారు. మాదిగ వర్గీకరణ అన్నది వీరి ఆలోచనే. దండోరా ఉద్యమానికి రాజకీయ రంగు రావద్దొన్న ఉద్దేశంతో తను వెనకుండి మంద కష్ణ మాదిగ, కృపాకర్‌ మాదిగలను ముందుంచి ఉద్యమాన్ని నిర్మించారు.

నేర పూరిత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సాగిన శ్రీమతి సదాలక్ష్మి కృషి మీడియాలో పెద్దగా ఫోకస్‌ కాలేదు. ఇంటా బయటా హిందూ బ్రాహ్మణీయ వర్ణ, పితృస్వామ్య నియంత్రణలను ధిక్కరించి... నిజమైన సాధికారతతో దళిత స్త్రీశక్తిని చాటిచెప్పిన వీరి పాత్ర చరిత్రలో మరుగుపరచబడింది. అందుకే అడుగడుగునా ''నాకు చరిత్ర వున్నదని'' తనే బలంగా ఎలుగెత్తి ప్రకటించారు.

టి.ఎస్‌. సదాలక్ష్మి జీవితం ఈ నాటి మహిళలందరికీ ఆదర్శప్రాయం. ఉద్యమాల్లో, ఉద్యోగాల్లో రాజకీయాల్లో స్త్రీ పురుషులకు... ముఖ్యంగా సాధికారతలో వెనుకబడ్డ ఎంతోమంది మహిళలకు సదాలక్ష్మి జీవితం బతుకు తొవ్వను చూపిస్తుంది.

ఈ పుస్తక రచయిత్రి గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది. పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమికోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు. ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతో కాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు. అనేక
సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం ''నల్లపొద్దు.'' ఆ తరువాత ''నల్లరేగడి సాల్లు'', ''ఎల్లమ్మలు'' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. ''ఎడ్యుసెంట్‌'' అనే దళితుల విద్యపై పనిచేసే సంస్థను స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాసపత్రికను నడుపుతున్నారు. అనేక సంస్థలలో, సాహితీ వేదికలలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ''అన్వేషి'' సంస్థలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే సదాలక్ష్మి బతుకు కథను రాశారు.

నేనే బలాన్ని - టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 23521849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com


...

Friday, July 15, 2011

సహవాసి గారు అనువదించిన "ఏడు తరాలు" ( అలెక్స్ హేలీ "ద రూట్స్" ) పుస్తకం పై "నెమలి కన్ను" బ్లాగు సమీక్ష


 ఏడు తరాలు
పుస్తకాలు కేవలం విజ్ఞానాన్నీ, వినోదాన్నీ పంచి ఊరుకోవు. అవి మనల్ని ప్రభావితం చేస్తాయి కూడా. అలా నన్ను ప్రభావితం చేసిన ఒకానొక పుస్తకం 'ఏడు తరాలు.' ఎలెక్స్ హెలీ ఆంగ్ల నవల 'రూట్స్' కి సహవాసి చేసిన సరళమైన తెలుగు అనువాదం. విజేతలే చరిత్రలు రాశారు, రాస్తారు. ఇది సామాన్యంగా జరిగే విషయం. ఎందుకంటే పరాజయాలు చెప్పుకోగలిగే విషయాలుగా అటు పరాజితులకీ, ఇటు సమాజానికే కూడా అనిపించవు కాబట్టి. కానీ, ఈ ఆనవాయితీని బద్దలు కొట్టిన వాడు హెలీ.

'ఏడు తరాలు' బానిసల కథ. కేవలం తమ అమాయకత్వం కారణంగా, చీకటి ఖండం ఆఫ్రికా నుంచి అమెరికాకి బానిసలుగా తీసుకురాబడ్డ దురదృష్టవంతుల కథ. పచ్చటి ఆఫ్రికా పల్లెల్లో, తమవైన సంస్కృతీ సంప్రదాయాల మధ్యన, ఆటపాటలతో జీవితం గడుపుతున్న ఆఫ్రికా వాసులని, వలవేసి పట్టుకుని, బంధించి, రోజుల తరబడి గాలైనా సోకని ఓడలలో తమ దేశానికి రవాణా చేసి, నడిబజార్లో వాళ్ళని వేలం వేసిన అమెరికన్ల కథ.

క్రీస్తుశకం 1750 లో పడమటి ఆఫ్రికా లో గాంబియా సమీపంలోని జపూరు అనే పల్లెటూళ్ళో ఉమరో-బింటా దంపతులకి నేరేడు పండులా నిగనిగలాడే 'కుంటా' అనే కొడుకు పుట్టడం కథా ప్రారంభం. ఆఫ్రికా పల్లెల సౌందర్యాన్నీ, సమస్యలనీ, ప్రకృతి వైపరీత్యాలనీ పరిచయం చేస్తూనే, అక్కడి జీవన విధానాన్నీ కళ్ళ ముందుంచుతారు రచయిత. ముఖ్యంగా పిల్లల పెంపకం, పనిపాటలతో పాటు రాయడం, చదవడం నేర్పించడం, మగ పిల్లలని ప్రత్యేకమైన 'పురుష' శిక్షణ కోసం పంపించడం ఇవన్నీ పాఠకులని ఆశ్చర్య పరుస్తాయి.

కుంటా తమ పల్లె దగ్గరలో ఉన్న అడవిలో పురుష శిక్షణ పూర్తి చేసుకుని యువకుడి గ్రామానికి తిరిగి వచ్చాక, అతనికి వేరే ఇల్లు కట్టించి అక్కడికి పంపేస్తారు తల్లిదండ్రులు. అడవుల్లో తిరిగేటప్పుడు 'తెల్లోడి' బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో కొడుక్కి వివరంగా చెబుతాడు ఉమరో. తడిసిన కోడి మాంసం వాసన వచ్చిందంటే దగ్గరలో తెల్లోడు ఉన్నట్టేననీ, వాడి అడుగులు బరువుగా పడతాయనీ, ఆకుల్ని తుంపుతూ పోతాడనీ.. ఇలా ఎన్నో ఆనుపానులు విశదంగా చెబుతాడు.

మంచెమీద కూర్చుని రాత్రంతా పొలం కావలి కాస్తూ, యవ్వన సహజమైన కోర్కెలతో భావి సంసారజీవితాన్ని గురించి మేల్కొనే కలలు కంటూ నిద్రకు దూరమైన కుంటా, మర్నాడు ఉదయాన్నే తమ్ముడికి మృదంగం చేసి ఇవ్వడం కోసం నాణ్యమైన దుంగ కోసం అడవికి వెళ్లి ఏమరుపాటున తెల్లోడికి చిక్కుతాడు. అక్కడినుంచి అతని కష్టాలు ప్రారంభం. దెబ్బలతో స్పృహ తప్పించి తీసుకెళ్ళిన తెల్లోళ్ళు, కుంటాని ఒక ఓడలో గొలుసుతో బంధిస్తారు. ఆ ఓడ నిండా వందలాది ఆఫ్రికావాసులే.

దుర్భరమైన ప్రయాణం తర్వాత తీరం చేరుతుంది ఓడ. వేలంలో కుంటాని కొనుక్కున్న యజమాని అతనికి 'టోబీ' అని పేరు పెట్టి తనతో తీసుకెళ్ళి పోతాడు. చేతులుమారిన కుంటా వర్జీనియాలో 'నిగ్గరు' (బానిస) గా స్థిరపడతాడు. పారిపోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ విఫలమవుతాయి. తన ప్రయత్నానికి శిక్షగా కాలు కోల్పోతాడు. నలభయ్యేళ్ళ వయసులో తోటి నిగ్గరు బెల్ ని పెళ్లి చేసుకుని 'కిజ్జీ' కి తండ్రవుతాడు. కూతురికి జ్ఞానం రాగానే, దగ్గర కూర్చోబెట్టుకుని జపూరు గురించీ, తన బాల్యాన్ని గురించీ, తను బానిసగా వచ్చిన వైనాన్ని గురించీ వివరంగా చెప్పడంతో పాటు తన భాషనీ నేర్పుతాడు.

కథ పరంపరాగతంగా ప్రతీ తరమూ తన తర్వాతి తరానికి చెప్పడం ద్వారా, ఎనిమిదో తరం వాడైన ఎలెక్స్ హెలీకి చేరడం, అతడు చాలా పరిశోధన చేసి 688 పేజీల ఆంగ్ల నవలగా తీసుకురావడం తర్వాతి కథ. ఈ ఆంగ్ల నవల సారాన్ని క్లుప్తంగా, సరళంగా తెనిగీకరించారు 'సహవాసి' గా పేరొందిన జంపాల ఉమామహేశ్వర రావు. (నాకు కొద్దిపాటి పరిచయం ఉంది అని చెప్పుకోడానికి గర్వ పడే వ్యక్తుల్లో ఒకరీయన). తనకి మరికొంచం వివరంగా రాయాలని ఉన్నా, ప్రకాశకుల కోరిక మేరకే బాగా క్లుప్తీకరించాల్సి వచ్చిందని ఆదివారం ఆంధ్రజ్యోతి 'ఫెయిల్యూర్ స్టోరీ' కి ఇచ్చిన ఇంటర్యూ (బహుశా ఆయన చివరి ఇంటర్యూ) లో చెప్పారు.

జపూరు నాగరికత, తరాల పాటు కొనసాగిన అంచె డప్పుల వ్యవస్థ మొదలుకొని, విముక్తి కోసం కుంటా పడే తపన, తన సంస్కృతీ సంప్రదాయాలని నిలబెట్టుకోవడం కోసం పడే తాపత్రయం వెంటాడతాయి. అంతేనా? నిగ్గర్ల కష్టాలు, యజమానుల కారణంగా వాళ్ళు పడే హింస, ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోలేని అసహాయత, యజమానుల మెప్పు కోసం చేసే వృధా ప్రయత్నాలు ఇవన్నీ కలుక్కుమనిపిస్తాయి. ఒక్క క్షణం ఏమరుపాటు కారణంగా తమ జీవితాలనే మూల్యంగా చెల్లించిన వాళ్ళు వాళ్ళంతా. అంతే కాదు, ప్రపంచానికి నాగరికత నేర్పానని నిస్సిగ్గుగా చెప్పుకునే దేశం చేసిన అనాగరిక పనికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా.

తరచి చదవగలిగితే ఎన్నో జీవిత సత్యాలని విప్పి చెబుతుందీ నవల. ఒక్కో పాత్రనుంచీ నేర్చుకోగలిగింది ఎంతైనా ఉంది. సహవాసి రాసిన ఎన్నో చిన్న వాక్యాలు పదే పదే వెంటాడతాయి. ఆలోచనల్లో పడేస్తాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదివించాల్సిన ఈ నవలని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది.

 (ఈ సమీక్షను మా బ్లాగులో పొందుపరచుకునేందుకు అనుమతించిన మురళి గారికి ధన్యవాదాలు. వీక్షకుల స్పందనలకోసం నెమలి కన్ను బ్లాగును సందర్శించండి.: )
http://nemalikannu.blogspot.com/2011/07/blog-post_11.html

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌