Tuesday, March 26, 2013

"1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

1948:హైదరాబాద్ పతనం

మొహమ్మద్ హైదర్ రాసిన "1948:హైదరాబాద్ పతనం" పుస్తకావిష్కరణ చర్చలో పాల్గొనాల్సిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం.

వేదిక: సారస్వత పరిషత్ హాల్ (ఎస్ పి హాల్)
తేది : 7 ఏప్రిల్ 2013 ఆదివారం ఉదయం 10 గంటలకు

హైదరాబాద్ బుక్ ట్రస్ట్, (040 23521849)
అన్వేషి సంస్థ (040 27423168)
సంయుక్త నిర్వహణ

RETRACING HYDERABAD 1948

Release of Mohammed Hyder's  "1948: HYDERABAD PATANAM"
(translation of the English book OCTOBER COUP)

Hyderabad Book Trust and Anveshi Research Centre for Women's Studies
Invite you to a discussion
At SP Hall (Saraswat Parishad Hall)
On April 7, Sunday at 10 AM
Lunch follows at 1 AM

Hyderabad Book Trust : 040 23521849
ANVESHI 040 040 27423168



Monday, March 18, 2013

తెలంగాణా రైతాంగ పోరాటం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.....

మనకు  తెలియని మన చరిత్ర
- అసూర్యంపశ్య (pustakam.net)

తెలంగాణా రైతాంగ పోరాటం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ మా లైబరీలోని వివిధ పుస్తకాలు చూస్తూండగా, ఈ పుస్తకం దొరికింది.

ఏమిటీ పుస్తకం?
ఈ సంపాదకవర్గం వారు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో, అందునా పూర్తిగా ప్రధాన నాయకత్వంలోని వారు మాత్రమే కాక, వివిధ స్థాయుల్లో పోరాటంలో పాల్గొన్న వారితో మాట్లాడి,

అప్పటి పోరాటంలో స్త్రీల పాత్ర గురించిన ఒక అధ్యయనం చేయాలన్న ఆశయంతో చాలా చోట్లకి తిరిగి సుమారు 60-70 మందిని ఇంటర్వ్యూలు చేసారు. అయితే, మొత్తం ఇంటర్వ్యూలు

అవీ అయ్యాక, ఆ అనుభవాలు గమనించాక, ఈ ఇంటర్వ్యూలని ఉన్నదున్నట్లుగా, వారి జీవితాలని ఒక సజీవ చరిత్రగా అక్షరబద్దం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో కొందరి

కథలతో కూడిన పుస్తకమే ఇది. సంపాదకుల మాటల్లో:

“ముందు ఈ గొంతులందరికీ వినిపించేటట్లు చేయడం మా బాధ్యత అనుకున్నాం. అందుకే తెలంగాణ భాషలో ఉన్నా, ఆంధ్ర భాషలో ఉన్నా, కొన్నిసార్లు రెండూ కలిసిపోయి ఉన్నా దాన్ని

మార్చే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చెప్పిన భాషలోనే ఉంచినప్పుడే వాళ్ళ భావాన్ని మార్చకుండా ఉంచగలుగుతామని అనుకోవడమే దీనిక్కారణం. ఈ చరిత్రలు తెలియజేయడం మాకెంత

ముఖ్యమో, వాటిని స్వయంగా చెప్పగలగడం వారికీ అంతే ముఖ్యం అని గుర్తించడానికి మేం గర్వపడుతున్నాం.”

పుస్తకంలోకి వెళ్తే,

మొదట సాయుధ పోరాట నేపథ్యం, అప్పటి పరిస్థితులు, ఉద్యమంలో కమ్యూనిస్టులు, స్త్రీల పాత్ర గురించి కొంచెం క్లుప్తంగా రాశారు ఒక వ్యాసంలో. ఆపై, స్త్రీల చరిత్ర అంటే ఏమిటి? అందులో

ఏముంటాయి? ఏది స్త్రీల చరిత్ర? ఏది కాదు… అసలు స్త్రీల చరిత్ర తాలూకా చరిత్ర ఏమిటి? – ఇలా అన్ని విషయాలని వివరంగా చర్చిస్తూ సాగిన సైద్ధాంతిక మూలాలున్న వ్యాసం

ఒకటుంది. ఇందులోనే మళ్ళీ చివరికొచ్చేసరికి, ఈ పుస్తకం రాయడం ఎందుకు అవసరమో చెబుతారు. కొంచెం క్లిష్టంగా ఉన్నా, చాలా ఆసక్తికరమైన వ్యాసం ఇది. దీని తరువాత, వరుసగా,

ఉద్యమకారిణులు తమ కథలను చెప్పిన వ్యాసాలున్నాయి.

ఇందులో తమ కథలు చెప్పిన వారు:

    * చాకలి ఐలమ్మ
    * కమలమ్మ
    * అక్కిరాజుపల్లిలో – కొండమ్మ, వజ్రమ్మ, గజ్జెల బాలమ్మ, సైదమ్మ, గొల్ల మల్లమ్మ, గొల్ల బుచమ్మ
    * ప్రియంవద
    * సుగుణమ్మ
    * ప్రమీలా తాయి
    * కొండపల్లి కోటేశ్వరమ్మ
    * దూడల సాలమ్మ
    * మానికొండ సూర్యావతి
    * అచ్చమాంబ
    * జమాలున్నీసా బాజీ – రజియా బేగం
    * మోటూరి ఉదయం
    * బ్రిజ్ రాణీ
    * లలితమ్మ
    * పెసర సత్తెమ్మ
    * మల్లు స్వరాజ్యం

ఒక్కొక్కరి కథా ఒక్కోరకంగా కదిలించింది నన్ను. .......    ....
......    ....

పూర్తి  సమీక్షను పుస్తకం డాట్ నెట్ లో చదవండి.

http://pustakam.net/?p=14141

.

Monday, March 11, 2013

దళిత చరిత్రకు దర్పణం




దళిత చరిత్రకు దర్పణం
కోస్తా ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితమై ఎదిగిన దళిత ఉద్యమ చరిత్రే బొజ్జా తారకం గారి నవల 'పంచతంత్రం'. విద్యా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్న తొలితరం దళితులు, అప్పుడప్పుడే వారి అనుభవంలోకి వస్తున్న 'స్వాతంత్య్రం', మొదటి తరం దళిత నాయకత్వం ఎదిగిన తీరు వంటి అంశాలను ఈ నవల కళ్ళకు కట్టినట్టు చిత్రించింది. కేవలం పరిశోధన ద్వారా రాయగలిగే నవల కాదిది. గొప్ప జీవితానుభవం ఉన్నవాళ్ళు మాత్రమే రాయగలరు.

తారకంగారి తండ్రి బొజ్జా అప్పలస్వామిగారు మొదటితరం అంబేద్కరిస్టు. ఆయన జీవితం, పోరాటమే 'పంచతంత్రం' నవలకు నేపథ్యం. తారకంగారు కూడా సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి. మూడు తరాల పోరాటాలకు ప్రతినిధి. 1947 తర్వాత ఎగసిన అంబేద్కర్ ఉద్యమాలతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1970లలో ఉవ్వెత్తున లేచిన రైతాంగ ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఆయనను రాటుదేలిన పోరాట యోధుణ్ణి చేశాయి. 1985లో జరిగిన కారంచేడు మారణకాండ ఆయన్ని పూర్తిస్థాయి దళిత నాయకుణ్ణి చేసింది. ఏడుపదుల వయస్సులో లక్ష్మింపేట ఉద్యమాన్ని కూడా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఈ నేపథ్యం, రాజకీయ ప్రభావాలు, చారిత్రక ఘట్టాలన్నీ 'పంచతంత్రం' నవలను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం.

తెలుగు దళిత సాహిత్యంలో 'పంచతంత్రం' ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతుంది. తొలి దశ దళిత ఉద్యమ చరిత్ర కథాంశంగా నవలలు ఇంతవరకూ రాలేదు. గాంధేయవాదాన్ని వదిలించుకుంటూ వామపక్ష ఉద్యమాలకు వెలుపల స్వతంత్రంగా ఎదిగిన దళిత ఉద్యమాల చరిత్ర మీద రాసిన నవలలేమీ లేవు. చిలుకూరి దేవపుత్ర గారి 'పంచమం' నవల కారంచేడు తర్వాతి పోరాటాలను చర్చిస్తే, కల్యాణరావుగారి 'అంటరాని వసంతం' నవల దళితుల సాంస్కృతిక వారసత్వం, క్రైస్తవంలోకి మారడం, పీడనకు దోపిడీకి వ్యతిరేకంగా వారు చేసిన భూపోరాటాలు, చివరగా నక్సలైటు ఉద్యమంలో భాగం కావడాన్ని చిత్రీకరించింది. వేముల ఎల్లయ్య 'కక్క' నవల తెలంగాణ మాదిగ జీవితం, భాష, సంస్కృతిని వివరిస్తుంది. వీటన్నిటికీ భిన్నంగా 'పంచతంత్రం' ఆంధ్రలో అంబేద్కర్ ఆలోచనా విధానంతో ప్రభావితమైన దళిత ఉద్యమ క్రమాన్ని చూపిస్తుంది.

మాలపల్లెకు, జమీందారీ కుటుంబానికి మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా సాగే ఈ నవలలో ముఖ్యపాత్రలు మూడు. కాపు కులస్తుడైన జమీందారు విశ్వనాథం, మాల యువకుడు విద్యార్థి నాయకుడు అయిన సూరన్న, మిలట్రీలో పనిచేసి వచ్చిన మరో మాల కులస్తుడు సుబ్బారావు. సూరన్న బాల్యం నుంచి అనేక అవమానాలకు, వివక్షకు గురవుతూ చివరికి తన కృషితో, చైతన్యంతో విద్యార్థి నాయకుడుగా ఎదిగిన తీరును చాలా బాగా చిత్రించారు.

సుబ్బారావు మాలపల్లెకు నైతిక ధైర్యాన్నిస్తూ, సూరన్నను కాపాడుకుంటూ దళిత ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాడు. పాలేర్లుగా, వెట్టిచాకిరీ చేసే కూలీలుగా, అంటరానివారిగా అవమానాలకు, అణచివేతకు గురవుతూ బతుకుతున్న దళితులు విద్యావకాశాల వల్ల, ఉద్యమ చైతన్యం వల్ల, 'స్వాతంత్య్రం' తెచ్చిన వెసులుబాటు వల్ల విద్యావంతులుగా, నాయకులుగా రూపొందడం, జమీందార్ల అక్రమ ఆక్రమణ నుండి భూముల్ని తిరిగి తీసుకోవడం, జమీందారు ఆస్తులకు అండగా ఉన్న రెవిన్యూ పోలీసు వ్యవస్థను వ్యతిరేకించడం వంటి ఘటనలన్నిటినీ అత్యంత వాస్తవికంగా మన కళ్ళ ముందు నిలిపారు రచయిత. తారకంగారి కథన శైలి, కవిత్వం తొణికిసలాడే భాష ఈ నవలను మరింత పఠన యోగ్యం చేశాయి.
- కె. సత్యనారాయణ
(ఆదివారం ఆంద్ర జ్యోతి 10 మార్చ్ 2013 సౌజన్యం తో )


పంచతంత్రం ,
బొజ్జా తారకం
పేజీలు : 290,
వెల : రూ. 100
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

.

Sunday, March 10, 2013

ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!


ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!

మార్చి 2013

ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!
నా భాధతోనే కాదు – ఈ లోకంలోని భాధ అంతటితోనూ,
చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.
అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం
 -చలం
‘నిర్జన వారధి ‘ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.
తన తొంభై రెండు ఏళ్ళ వయస్సులో ఇంచుమించు ఎనిమిది దశాబ్ధాలు ప్రజాజీవితంలో గడిపిన ఆమె  జీవితం కచ్చితంగా ఇతర స్రీల జీవితాల కంటే వైవిధ్యమైనది, విశిష్టమైనది. ఆమె జీవితం ఉద్యమం, సాహిత్యం, సంగీతం, నాటకంతో పెనవేసుకొని ఆమెను ఒక విభిన్న వ్యక్తిగా నిలబెట్టాయి. ఉద్యోగాన్ని కూడా తన మనసుకు నచ్చిన విధంగా మలచుకొని తన సర్వ జీవచైతన్య శక్తులు చివరివరకు సజీవంగా ఉంచగలిగారు. అందుకే తొంభై ఏళ్ళ వయసులో కూడా తేటినీలాపురం పక్షులని చూసి పరవశించగలిగారు.

.......

 కొండపల్లి కోటేశ్వరమ్మ '' నిర్జన వారధి '' పుస్తకం పై రమా సుందరి గారి సమీక్ష
"వాకిలి ఇ సాహిత్య మాసపత్రిక " లో చదవండి

http://vaakili.com/patrika/?p=1412


Monday, February 18, 2013

సారంలోనూ ప్రేమ్‌చందే! - వి. అరవింద్, ఆదివారం ఆంధ్ర జ్యోతి



సారంలోనూ ప్రేమ్‌చందే! -

"ఆ పిల్లవాడు తిరణాలకు వెళ్ళాడు. కంటిని ఆకర్షించే ఎన్నో ఆటవస్తువులు, బొమ్మలు అక్కడ ఉన్నాయి. నోరూరించే తినుబండారాల అంగళ్ళకు కొదవ లేదు. కానీ, వాటికన్నా రోజూ రొట్టెలు చేయడానికి తల్లి పడుతున్న అవస్థే ఆ పిల్లవాడి మనసులో ముద్రేసుకుంది. కాల్చిన రొట్టెను దించేందుకు పళ్ళకర్ర లేక చేతులు కాల్చుకుంటున్న తల్లే ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. దీంతో తన దగ్గరున్న డబ్బులతో ఒక పళ్ళకర్ర కొని ఇంటికి తీసుకెళతాడు.'' ప్రచురణ సంస్థ గానీ ఫలానా రచనని గానీ అంతగా గుర్తులేని ప్రేమ్‌చంద్ కథ ఇది.

ఈ కథలో పిల్లాడిలాగే, జీవితమంతా చాలా బాధ్యతగా, ఇతరుల అవసరాలు తీర్చడంలోనే తన సంతృప్తిని వెతుక్కున్నాడు ప్రేమ్‌చంద్. ఆయన సహచరి శివరాణీదేవి రాసిన 'ఇంట్లో ప్రేమ్‌చంద్' (అనువాదం : ఆర్. శాంతసుందరి) చదివితే ఈ విషయం తెలుస్తుంది. ప్రముఖుల ప్రైవేట్ జీవితాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని తీర్చడమే కాదు, వారి కళా, రాజకీయ వ్యక్తిత్వాలు వికసించే చారిత్రక, సామాజిక ఉద్యమ సందర్భాన్ని కూడా ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ముఖ్యంగా, తల్లి ప్రేమకు ముఖం వాచిపోయిన ప్రేమ్‌చంద్... ప్రతి స్త్రీ నుంచి ఆ లోటు తీర్చుకునేందుకు ఆరాటపడ్డాడు.

భార్యాభర్తల మధ్య గాఢంగా అల్లుకోవాల్సిన ప్రజాస్వామిక సంబంధాలను ఈ క్రమంలోనే ఆయన గుర్తించి గౌరవించాడనేందుకు శివరాణీదేవి-ప్రేమ్‌చంద్‌ల సంభాషణలే రుజువు. ఈ సంభాషణ తరచూ పాత వాసనలు వేయడం, సంప్రదాయ, దైవిక శక్తుల ప్రస్తావనతోనే ప్రేమ్‌చంద్ సైతం తన వాదనను నెగ్గించుకోవడం చూస్తాం. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న రైతాంగంతో ఉండి రచనలు చేసినవాడు కాబట్టి, చివరి వరకు ప్రేమ్‌చంద్‌లో సంప్రదాయ భావనలు నిలిచే ఉన్నాయి. దీన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముఖ్యమైన పరిశీలన... జాతీయోద్యమం, సోవియట్ విజయాలతో రెక్కవిప్పిన అభ్యుదయ ఉద్యమం సైతం అప్పటికి పూర్తిగా కుబుసం విడవలేదనేది. ఈ అభ్యుదయ ఉద్యమానికి కళా, సాహిత్య రంగాల్లో సారథ్యం వహించినవాడు ప్రేమ్‌చంద్ అనేది ఇక్కడ గమనార్హం. ప్రేమ్‌చంద్ స్మరణకే పూర్తిగా ఈ పుస్తకం అంకితం కాకపోవడం మరో విశేషం.

జాతీయోద్యమంతో మమేకమైన బలమైన రాజకీయ వ్యక్తిత్వం గల ఆధునిక యువతిని శివరాణీదేవిలో మనం చూస్తాం. ఇండియన్ గోర్కీగా పిలవబడే ప్రేమ్‌చంద్ చివరి రచన, చివరి స్మారక ఉపన్యాసం (1936) కూడా గోర్కీపైనే కావడం, మాగ్జిమ్ గోర్కీ మరణించిన రెండు నెలల్లోపే ఆయనా మరణించడం గుర్తుండిపోయే విషయాలు. అయితే ప్రేమ్‌చంద్ జీవన, రచనా సారాన్ని పట్టుకోలేకపోవడం, ఆయన ఉర్దూలో మానేసి హిందీ భాషలో రచనలు చేయడమనే ఒక గుణాత్మక పరిణామానికి ప్రేరణగా నిలిచినదేమిటనేది తెలియజెప్పకపోవడం ఈ పుస్తకం పరిమితే.

- వి. అరవింద్
(ఆదివారం ఆంధ్ర జ్యోతి 17 -2 -2013)

ఇంట్లో ప్రేమ్‌చంద్ - శివరాణీదేవి
అనువాదం : ఆర్. శాంతసుందరి
పేజీలు : 274, వెల : రూ. 120
ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

Wednesday, February 6, 2013

తిరగబడ్డ తెలంగాణా పై పుస్తకం డాట్ నెట్ లో అసూర్యం పశ్య సమీక్ష

కొంతకాలం క్రితం ఆర్.నారాయణమూర్తి గారి “వీర తెలంగాణ” చిత్రం చూశాక తెలంగాణా సాయుధ పోరాటం సంఘటనలు నన్ను వెంటాడాయి. అప్పట్లో బైరంపల్లి ఘటన పై రాసిన ఒక చిరుపుస్తకమూ (ఈ పుస్తకం ఒకప్పుడు ఇక్కడ ఆన్లైన్లో ఉచితంగా చదువుకునేందుకు ఉండేది. ఇప్పుడు లేదుమరి! ఇక్కడ జరిగిన మారణహోమాన్ని జలియన్వాలాబాఘ్ ఉదంతంతో పోలుస్తారు.), ఈ సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకమూ -రెంటినీ పైపైన తిరగేసినా కూడా, ముందుకు సాగలేదు నా చదువు. ఈ నేపథ్యంలో మొన్నామధ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారిని కలిసినప్పుడు ఈ పుస్తకం గురించి తెలిసింది. ఒక చరిత్ర పరిశోధకుడు రాసిన థీసిస్ అనగానే భయం వేసింది. ఇది నాకర్థం కాదులే అనుకుంటూ ఉన్నా, స్ట్రాంగ్ రికమెందేషన్ మూలాన చదవడం మొదలుపెట్టాను.
తెలంగాణ సాయుధ పోరాటంపై రచయిత రాసిన పీ.హెచ్.డీ థీసిస్ కు ఒక కొనసాగింపులా సాగిన పరిశోధనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం. నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఉద్యమం మొదలై, కొనసాగిన తీరును ఆవిష్కరించడం ఈ పుస్తకం లక్ష్యం (ఇప్పటి ఖమ్మం జిల్లా అప్పటి వరంగల్ జిల్లాలో భాగం). చారిత్రక, సామాజిక నేపథ్యాలను వివరించడంతో మొదలుపెట్టి, 1948 దాకా వచ్చి ముగుస్తుంది ఈ పుస్తకం. సాధారణంగా ఈ సాయుధ పోరాటం గురించి వివరించే రచనలన్నీ కమ్యూనిస్టు పార్టీ దృక్పథం నుండి, పార్టీని కేంద్రంగా చేసుకుని సాగిన రచనలు (ఈ ముక్కనేను కాదు అంటున్నది. పుస్తకంలో కూడా రాసారు. ఈ విషయమై నేను ఏదన్నా తెలుసుకోజూసిన ప్రతిసారీ కమ్యూనిస్టుల రచనలే నాకు కనబడ్డాయి అన్నది వేరే విషయం!). అయితే, ఈ రచనలో 1940ల నాటి తెలంగాణా పోరాటాల్లో ప్రజల భాగాన్ని అధ్యయనం చేయడం ముఖ్య లక్ష్యమని రచయిత ఉపోద్ఘాతంలోనే స్పష్టం చేశారు. పుస్తకం కవర్ పేజీ – “మా భూమి” అన్న చిత్రం లోనిదట. వ్యక్తిగతంగా ఈ సినిమాలో అసలు కథ కన్నా కమ్యూనిస్టు ప్రాపగండా ఎక్కువని నాకు అనిపించింది ఆ మధ్య ఈ సినిమా చూసినప్పుడు. మరి ముఖచిత్రంగా దాన్ని పెట్టారేం? అనుకున్నాను.
***
పుస్తకంలో ఎనిమిది ప్రధాన అధ్యాయాలు (ముందుమాట, అనుబంధాలు కాక). వీటిలో మొదటి రెండు అధ్యాయాలు ఉద్యమానికి వెనుక చారిత్రక నేపథ్యం, ఉద్యమానికి దారితీసిన భూస్వామ్య పరిస్థితులు, “దొర” దొర గా తయారైన వైనాన్ని విశ్లేషిస్తాయి. తరువాత రెండు అధ్యాయాలు “చిల్లరోళ్ళు” అని పిలువబడే వృత్తి కులాల వారు, రైతులూ ఈ దొరలపై తిరుగుబాట్లు చేయడాన్ని గురించి విశ్లేషిస్తాయి. తక్కిన అధ్యాయాల్లో ఆంధ్రమహాసభ/కమ్యూనిస్టు పార్టీ వీళ్ళని సంఘటిత పరచడం, నిజాం/దొర లకు వ్యతిరేక సాయుధ పోరాటం, కొన్ని ప్రాంతాల్లో సంఘం రాజ్యం ఉండడం – ఈ క్రమాన్ని వివరిస్తూ, విశ్లేషిస్తూ 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని తన పరిధిలో విలీనం చేసుకోవడం దగ్గర ఆపేస్తారు రచయిత. మొదటి రెండు అధ్యాయాలు మినహాయిస్తే, తక్కినవన్నీ తేలిగ్గా అర్థమయ్యే భాషలో ఉన్నాయి........ ....

పూర్తి సమీక్ష ... ఇక్కడ ... చదవండి.
http://pustakam.net/?p=13658

Tuesday, January 22, 2013

బొజ్జా తారకం "పంచతంత్రం" నవలపై చర్చ జనవరి 25 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ! ...

ఆహ్వానం

బొజ్జా తారకం రాసిన "పంచతంత్రం" నవల పై చర్చ నిర్వహిస్తున్నాం.


ప్రముఖ రచయితలు 

బి. కళ్యాణరావు, 
నందిగం కృష్ణారావు, 
ఎన్. వేణుగోపాల్ 
మొదలైన వారు మట్లాడతారు. 

మీరు తప్పక రండి !


తేదీ: 25 జనవరి 2013 

సాయంత్రం 5-30 కి.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, 

హైదరాబాద్ .





Monday, January 21, 2013

చాయ్, సమోస ఔర్ లామకాన్ ...




చాయ్, సమోస ఔర్ లామకాన్

భంగ్యా భూక్యా. ఇటువంటి పేర్లను విద్యావిషయకమైన బృందాల్లో వినడానికి మనం ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. వేరే స్థలాల్లో వేరే సందర్భాల్లో వేరే కోవల్లో మాత్రమే కనిపించే పేర్లు అధికార స్థానాల్లో, జ్ఞానపీఠాల్లో, పత్రికల కాలమ్స్‌లో తరచు తారసపడితే తప్ప సమాజంలోని అహంకారాలూ అర్థసత్యాలూ అంతరించిపోవు.
ఇంగ్లీషు, విదేశీభాషల యూనివర్సిటీలో సామాజికవివక్ష అధ్యయన విభాగంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న భూక్యా నిజాం పాలనలో లంబాడాల స్థితిగతుల మీద ఇంగ్లండ్‌లోని వార్‌విక్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన చరిత్రకారులతో కలసి పనిచేశారు. 2010లో ఇంగ్లీషులో వచ్చిన ఆయన పరిశోధనాగ్రంథం తెలుగు సంక్షిప్త అనువాదం జనవరి 5 హైదరాబాద్‌లో ఆవిష్క­ృతమైంది.

ఆ పుస్తకం నుంచి కోకొల్లలుగా కొత్త సత్యాలు నేర్చుకోవచ్చును. అవన్నీ ఒక ఎత్తు, పుస్తకావిష్కరణ జరిగిన వేదిక 'లామకాన్' నేర్పే కాలజ్ఞానం మరో ఎత్తు. గ్రంథకర్తకూ, ప్రచురించిన హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌వారికీ ఆ సమయంలో ఆ స్ఫురణ కలిగిందో లేదో కానీ, బంజారా హిల్స్‌లో, మేడాగూడూ కాకుండా మధ్యరకంగా, బృహత్‌శిలలను కడుపులోనే పెట్టుకుని కట్టుకున్న ఒక పొదరింటిలో భూక్యా పుస్తకావిష్కరణ జరగడం ఒక చారిత్రక న్యాయంగా తోచింది నాకు.
ఒక వైపు జివికె మహాసామ్రాజ్యం, మరో పక్కన వెంగళరావు పార్కు, తక్కిన వైపులంతా విషంలా వ్యాపించిన నవసంపన్నత, వీటి మధ్య 'లామకాన్' ఒక చెలిమె. సాహిత్యం, సంస్క­ృతి, సమాజం- ఏదైనా సరే, నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి, పాడుకోవడానికి ఒక మంచి మనిషి అందించిన కాసింత స్థలం. అతి విలువైన అతి అరుదైన స్థలం. ఆ స్థలం ఉండబట్టే, బంజారాల చరిత్రను ఆవిష్కరించిన పుస్తకం బంజారాహిల్స్‌లో ఆవిష్క­ృతమైంది. ఆ సన్నివేశం మీటిన రహస్తంత్రి ఏమి చెబుతున్నది? ఈ దేశపు మహాజనులారా! మీరు కోల్పోయిన స్థలాలన్నిటినీ తిరిగి ఆక్రమించుకోండి, మీరు విస్మ­ృతులైన కాలాలన్నిటినీ నిద్రలేపండి!

సంపన్నతతో విర్రవీగుతున్న బంజారాహిల్స్‌ను ఉద్రిక్త వక్షోజాలతో పోల్చాడు తిలక్. మహానగరంలోని ఉన్నతవర్గాల కేంద్రంగా బంజారాహిల్స్ ప్రఖ్యాతినో అపఖ్యాతినో మూటగట్టుకున్నది కానీ దాని నామవాచకం వెనుక ఉన్న చారిత్రక అర్థం మరుగున పడిపోయింది. ఒకనాడు సంచారవర్తకులుగా, రవాణాదారులుగా ఉన్న లంబాడాల ఆవాస ప్రాంతాలు నేటి బంజారాహిల్స్. ఆ కొండలు ఇప్పుడు బంగారు కొండలయిన క్రమం గానీ, ఎవరెవరినుంచి చేతులు మారి అవి నేడు కొండచిలువలకు కొలువైన కథ గానీ చరిత్రలో కనిపించదు.

భంగ్యా భూక్యా- ఆ చరిత్ర డొంకను కదిలించాడు. 'లామకాన్'లో ఆ పుస్తకం గురించి చర్చించుకున్న కాసేపయినా బంజారాహిల్స్‌ను తిరిగి బంజారాలకు అంకితం చేశాడు.

'లామకాన్' ఒక సాంస్క­ృతిక బహిరంగ వేదిక కాకముందు, అది ఒక నివాసం. అప్పుడు కూడా దానిపేరు లామకానే. లామకాన్ అంటే ఇల్లులేని వారు అని అర్థం. ఇల్లు లేకపోవడం అంటే నిరాశ్రయత కాదు. సర్వవ్యాపిత్వం అని. ఇస్లామ్‌లో అల్లాకు ఉన్న అనేక నామాలలో లామకాన్ కూడా ఒకటి. నిరాకారుడైన దైవం స్థావరుడు కాదు. అన్నిటా ఉండే మహాశక్తి. జంగమతత్వానికి దగ్గరగా కనిపించే అద్భుతమైన భావన అది.
భాగ్యనగరానికి ఆభరణాల వంటి మహాశిలలను ధ్వంసం చేయకుండా, వాటిని గర్భీకరించుకుంటూ, కళాత్మకంగా, నిరాడంబరంగా నిర్మించుకున్న ఆ నివాసం మొయిద్ హసన్‌ది. హైదరాబాదీ శిలా రక్షణ ఉద్యమకారుడు, ఛాయాగ్రాహకుడు, డాక్యుమెంటరీల నిర్మాత, చిత్రకారుడు మొయిద్ హసన్. ఉర్దూ రచయిత్రి జిలానీ బానో సోదరుడు ఆయన. తన తండ్రి స్నేహితుడైన హైదరాబాద్ అద్భుత కవి మగ్దూం మొహియుద్దీన్ ఒడిలో బాల్యకౌమారాలు గడిపిన అదృష్టవంతుడు.

పదిహేనేళ్ల కిందట హసన్‌ను 'లామకాన్' లో కలిశాను. చలపతి, విజయవర్థనరావు ఉరిశిక్షల రద్దు ఉద్యమంపై ఆయన, సజయ కలిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిన సందర్భం అది. సందర్భం అదే అయినా సంభాషణ బహుముఖాలుగా సాగింది. ఆయన ఆదరణలాగే ఉన్న పరిమళభరితమైన వెచ్చటి టీ తాగాను. ఆయన స్వయంగా వండి వడ్డించిన ఆతిథ్యాన్ని స్వీకరించాను. అప్పుడప్పుడే తెలంగాణ చరిత్రపై ఆసక్తి పెంచుకుంటున్న నేను నా అజ్ఞానాన్ని, కుతూహలాన్ని ఆయనతో పంచుకున్నాను. వెలుగునీడల మర్మం తెలిసినవాడేమో, సత్యాసత్యాల మధ్య ఉండే పొరలను విప్పిచెప్పాడు. ట్యూబ్‌లైట్‌లు నిర్జీవ దీపాలని అన్నాడు. నీడలు రాని దీపం వృథా అన్నాడు. ఆయన ఇంట్లో అన్నీ గుండ్రటి ఫిలమెంట్ బల్బులే.

ఏ ఉత్తరాది నుంచో ఏడెనిమిది దశాబ్దాల కిందట వలసవచ్చిన హసన్ కుటుంబం, హైదరాబాద్‌ను ప్రాణప్రదంగా ప్రేమించింది. మఖ్‌మల్ బట్టలో చుట్టి కుట్టిన ఒక చిన్న హైదరాబాదీ శిలను చూపిస్తూ, అభివృద్ధి చేస్తున్న విధ్వంసం గురించి, జనజీవనంలో వస్తున్న శైథిల్యం గురించి హసన్ వేదనతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనపై ఆయనకు ఎంతటి వ్యతిరేకతో, హైదరాబాద్ చరిత్రపై, తెహజీబ్ పై ఆయనకు అంత మక్కువ. కర్కోటకుడని పేరుపొందిన ఏడో నిజాం హయాంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదనే విషయం ఆయన చెబితేనే నాకు తెలిసింది. వాస్తవాలను కమ్మివేసిన అభిప్రాయాల పొరలను తొలుచుకుని చూడకపోతే చరిత్రను అర్థం చేసుకోవడం కష్టమని హసన్ నన్ను హెచ్చరించారు.

ఆయనను కలిసింది ఒక్కసారే కానీ, జ్ఞాపకం మాత్రం బలంగా మిగిలిపోయింది. 2004లో ఆయన చనిపోయినప్పుడు, ఆలస్యంగా తెలిసింది. సమాచార విప్లవ యుగంలో కూడా అన్ని వార్తలూ వేగంగా ప్రసరించవని అర్థమయింది. ఆయనను ఎవరెంత గుర్తించారో అనవసరం కానీ, ఆయన బలమైన ఆకాంక్షలు నిరాకరించలేని గుర్తింపును సాధించుకున్నాయి.
 
ఆయన అభిమతాన్ని గుర్తించిన వారసులు, ఆయన నివసించిన ఇంటిని ఒక ఊరుమ్మడి సాంస్క­ృతిక వేదికగా మలిచారు. మంచితనాన్ని పంచుకునే ఏ ప్రయత్నానికయినా ఉచితంగా దొరికే వేదిక 'లామకాన్'. మిత్రుడు రామ్మోహన్ హోలగుండి ప్రదర్శించిన నాటకాలో, మానవహక్కుల వేదిక 'సోంపేట' మీటింగో, కవి శివారెడ్డి కవిత్వాలాపనో, కచేరీలో, ఆటపాటలో బంజారాహిల్స్ రాళ్లలోపల పూలు పూయిస్తూనే ఉన్నాయి. వేడివేడి చాయ్ సమోసాల మధ్య కొత్త మెహఫిళ్లను తీర్చిదిద్దుతున్నాయి. ఎదురీతల్లో రాటుదేలిన భూక్యాల మేధావిత్వం ఒక శిఖరం. విలువలను, సమష్టిని వదలని హసన్‌ల మంచితనం మరో శిఖరం.

- కె. శ్రీనివాస్

(Adivaaram Andhra Jyothy , 20-1-2013)





Sunday, January 20, 2013

చరిత్ర'కు సవాల్ లంబాడా చరిత్ర - బత్తుల కార్తీక్ నవయాన్, ఆదివారం ఆంద్ర జ్యోతి లో ...


సింహాలనుంచి చరిత్రకారుడు ఉద్భవించేవరకు వేటగాడు చెప్పే పిట్టకథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అవుతాయన్నది ఆఫ్రికన్ సామెత. ఈ దేశంలో ఆదిమజాతులు, ఆదిమకులాలు తమ తమ చరిత్రలను తిరగరాస్తున్న సమయమిది. అంటరానితనం, అవమానాల పెనుమంటల పెనుగులాటలో నుండి తమ గతాన్ని తవ్వి 'ఇదిగో ఇదీ మా చరిత్ర' అని వర్తమాన చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగమిది.

ఇప్పుడు పేదలుగా, అంటరానివారుగా, కేవలం ఓటర్లుగా, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదురు చూసే అర్భకులుగా ఉన్న ఆదిమజాతుల గత చరిత్ర ఏమిటి? నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కూడా వారు ఇలాగే ఉన్నారా? వారి బ్రతుకులు ఇలాగే ఉన్నాయా? తదితర అనేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న చరిత్రకారుల వద్ద సమాధానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. నిజానికి తమ తాతలు, తండ్రులు ఈ దేశంలోని అడుగుకులాలపై, జాతులపై సాగించిన అమానవీయ దోపిడీ దౌర్జన్యాలను అగ్రకుల చరిత్రకారులు చరిత్రగా రికార్డు చేయాలి. కానీ అంత నీతి, నిజాయతీ గలిగిన చరిత్రకారులు దుర్భిణీ వేసి వెతికినా దొరకరు. అందుకే అడుగుకులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

ప్రొఫెసర్ భుక్యా భంగ్యా రాసిన 'నిజాంపాలనలో లంబాడాలు' (అణచబడిన సంచారులు)పుస్తకం ఆ కోవలోదే. ఇది పి.హెచ్.డి పరిశోధన గ్రంథం. మూడేళ్ల క్రితం ఇంగ్లీషులో ప్రచురించబడి ఇప్పుడు తెలుగులోకి అనువాదమైంది. అణచబడిన, అంటరాని జాతుల చరిత్రను విద్యారంగ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది.

ఒకప్పుడు స్వయంసమృద్ధిగా రాజీలేని జీవితం గడిపిన ఆదిమజాతులు ఆ తర్వాత వెనుకబడిన జాతులుగా మిగిలిపోయాయి. ఈ దుస్థితికి వలసపాలకులే కాదు, వారితో షరీకైన స్థానిక అధికారులు కూడా ఎంతో కారణం. ఈ చారిత్రక పరిణామాన్ని పట్టి ఇచ్చేదే ఈ పుస్తకం. గతంలో పశువులద్వారా రవాణారంగాన్ని నిర్వహించిన లంబాడాలు టెక్నాలజీ ప్రవేశంతో కూలీలుగా మారిపోయారు. బ్రిటీష్ వారు తీసుకొచ్చిన చట్టాలతో నేరస్త జాతిగా ముద్రపడ్డారు. ప్రధానంగా హైదరాబాద్ డక్కన్‌లోని లంబాడా జాతి తన సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి కన్న బిడ్డలను కూడా అమ్ముకునే దుర్భర పరిస్థితులకు ఎలా లోనయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

- బత్తుల కార్తీక్ నవయాన్
 ( 20.1.2013 ఆదివారం ఆంద్ర జ్యోతి లో)

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా, 

అనువాదం : ఆకెళ్ళ శివప్రసాద్
వెల : రూ 80, పేజీలు : 158,

ప్రతులకు :
 హైదరాబాద్ బుక్ ట్రస్ట్
040-23521849

Sunday, January 6, 2013

నిజాం పాలనలో లంబాడాలు (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) - భంగ్యా భుక్యా

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా 


ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌  సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన  లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా


ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com




హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌