Sunday, October 21, 2012

మల్లు స్వరాజ్యం గారి ఉపన్యాసం ... కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి " పుస్తక అవిహ్కరణ సభలో ...

మల్లు స్వరాజ్యం గారు 
1946 నాటి నిజాం ప్రభుత్వానికి, జమిందార్లకు, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన  
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 

ఆమె తలపై ప్రభుత్వం ఆనాడే పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. 
ఏడు దశాబ్దాలుగా  కమ్యూనిస్ట్ రాజకీయాలతో పెనవేసుకుపోయిన జీవితం అమెది.

ఇటీవల  సెప్టెంబర్ 23 న మల్లు స్వరాజ్యం గారు హైదరాబాద్ లో 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మ కథ "నిర్జన వారధి" పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే

కమ్యూనిస్టు ఉద్యమం , స్త్రీల పాత్ర, చీలికలు పేలికలైన కమ్యూనిస్టు పార్టీల  ప్రస్తుత దయనీయ పరిస్థితి
మొదలైన అంశాలపై ఆరోజు  ఆమె ఎంతో ఆవేదనతో మాట్లాడారు.  

సంచలనాత్మకమైన ఆ  ఉపన్యాసం వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో అందుబాటులో వుంది. 

.... ఇక్కడ ......   చూడండి.



.



Monday, October 15, 2012

వివేకానికో గీటురాయి... రీడింగ్ రూమ్ ...- మందలపర్తి కిషోర్...సాక్షి ...

వివేకానికో గీటురాయి

 బాలగోపాల్ చనిపోయి మూడేళ్ల యింది. ఈ మూడేళ్లలో ఆయన రచనలు - తెలుగులో - ఎనిమిది పుస్తకాలుగా వచ్చాయి. వాటిలో కొన్ని పత్రికలకు రాసిన వ్యాసాలు. కొన్ని కాలమ్స్. కొన్ని ముందుమాటలు. కొన్ని ఉపన్యాసాలు. కొన్ని కరపత్రాలు. కొన్ని సిద్ధాంత పత్రా లు. కొన్ని నివాళులు. కొన్ని జవాబులు. కొన్ని సంపాదకీయాలు. కొన్ని ఇంట ర్వ్యూలు. ఇన్ని ‘రచనా రూపాలు’ ప్రయత్నించిన రచయితలు బాలగోపాల్ సమకాలికుల్లో మరెవరూ లేరేమో! మత తత్వం, రాజ్యం-సంక్షేమం, హక్కుల ఉద్యమం, దళిత సమస్య, సాహిత్య పరామర్శ, మార్క్సిజం సమీక్ష-ఇలాంటి వస్తువులతో రాసినవీ రచనలు. అంటే, రూపంలోనూ సారంలోనూ కూడా బాలగోపాల్ రచనల్లో ఎంతో విస్తృతీ వైవిధ్యం కనిపిస్తుంది.

ఇవి దాదాపు మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ చేసిన రచనలు. ఈ కాలంలో ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పులన్నీ ఈ రచనల్లో ప్రతిఫలించాయి. ఈ మార్పుల్లో ైవైరుధ్యంలా అనిపించే వైవిధ్యం కనిపిస్తుంది. ఏకసూత్రతా ఉంది. మొదటినుంచీ ఆయన పనిచేసిన రంగం హక్కుల రంగం. మన దేశంలో ఈ రంగంలో ప్రధానంగా కేంద్రీకరించి పనిచేసినవాళ్లలో ఎక్కువమంది నక్సలైట్ ఉద్యమాన్ని అభిమానించే మేధావులు. ఎప్పుడో 1970 దశకంలోనే బొజ్జా తార కం, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, కన్నబీరన్ తదితరులు ఈ కృషి మొదలుపెట్టారు. ఎనభయ్ దశకంలో బాలగోపాల్ ఈ రంగంలో మొదలుపెట్టిన కృషి కొత్తపుంతలు తొక్కింది.

చట్టాల ప్రకారం హక్కులను నిర్వచించి విశ్లేషించడం కాకుండా సామా జిక న్యాయం(ఇప్పటి వాడుక అర్థంలో కాదు-దాని అసలు అర్థంలో) ప్రాతిపది కగా బాలగోపాల్ హక్కుల గురించి మాట్లాడారు. దీన్నే తర్వాతి రోజుల్లో హక్కుల ఉద్యమానికి ఉండాల్సిన ‘తాత్విక దృక్పథం’గా ఆయన చెప్తుండేవారు. వ్యక్తిగతం గా-ఒంటరిగా మాత్రం కాదు- బాలగోపాల్ తీసుకొచ్చిన పెద్దమార్పు ఇదేనేమో!

ఇక, సాహిత్యరంగంలో కూడా బాలగోపాల్ చాలానే కృషి చేశారు. ‘సాహి త్యంమీద నేను రాసిన వ్యాసాలు సమగ్రమయిన సాహిత్య విమర్శ అని నేను అనుకోవడం లే’దన్నారు బాలగోపాల్. అంతేకాదు-ఆ వ్యాసాల్లో ఉన్నది ‘సామా జిక ఆర్థిక నేపథ్యంలో సాహిత్యాన్ని పరిశీలించడం’ మాత్రమేనని వివరించి, అదే సమగ్రమయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శ కాబోదని కూడా స్పష్టం చేశారు. ఇలా చెప్పడంవల్ల బాలగోపాల్ తన పరిమితులను వెల్లడించడమే కాదు- మార్క్సిస్టు ముద్రాంకిత విమర్శకుల పరిమితులను సైతం బయటపెట్టారు.

కిందటివారం, బాలగోపాల్ వ్యాసాలు కొన్నింటిని ‘మనిషి మార్క్సిజం’ పేరుతో పుస్తకంగా విడుదల చేసింది పర్‌స్పెక్టివ్స్ సంస్థ. ఇందులో, 1993 సెప్టెంబర్ ‘అరుణతార’లో వచ్చిన ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ అనే వ్యాసం ఉంది. దీన్ని చాలామంది చరిత్రాత్మక వ్యాసంగా పరిగణిస్తారు. కానీ, ఆ వ్యాసంలో బాలగోపాల్ కనిపెట్టి చెప్పిన విషయాలేం లేవు. తను కొత్తగా ఆ విషయాలు చెప్పడమే అందులోని కొత్తదనం. అలాగే, ‘కల్లోల చిత్రాలు’ వ్యాసం లోని విషయాలు కూడా. ఈ వ్యాసాల్లోని విషయాలు -బహుశా బాలగోపాల్ చెప్పిన కారణంగా- అపారమయిన ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
చివరిగా ఓ మాట- మతానికి వ్యతిరేకంగా వచ్చిన చాలా సిద్ధాంతాలు కొత్త మతాలుగా స్థిరపడడం చరిత్రలో చూస్తాం. ఉదాహరణకు బౌద్ధం.

ఇది, సంప్రదాయ విరుద్ధత (నాన్‌కన్‌ఫామిజం), సంప్రదాయ విధేయత (కన్‌ఫా మిజం)గా మారడం మాత్రమే. మార్క్సిజం శాస్త్రమని, దాన్ని విశ్వసించేవాళ్లు చెప్తారు. ఏ శాస్త్రమయినా ప్రశ్నల పునాదిమీద పెరిగిపెద్దవుతుంది. స్వయంగా మార్క్సే అన్నిటినీ ప్రశ్నించమని చెప్పాడట. కానీ, మార్క్సిస్టు ప్రతిపాదనల విషయంలో ఆత్మవిమర్శకు ప్రయత్నించేవారిని మార్క్సిస్టు విశ్వాసులు ప్రశంసించరు. పెపైచ్చు అభిశంసిస్తారు కూడా. బాలగోపాల్ విషయంలో అదే జరిగింది. ఆయన చనిపోయి మూడేళ్లయింది. కానీ, కామన్‌సెన్స్ ప్రాతిపదికగా బాలగోపాల్ లేవనెత్తిన ప్రశ్నలను నక్సలైట్లూ, తదితర గోత్రికులయిన మార్క్సిస్టులు -అప్పట్లో- సరయిన స్పిరిట్‌లో తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఇప్పటికయినా ఈ విషయంలో మార్పు వచ్చిందేమో పరిశీలించాలి. ఆ పరిశీలనకు బాలగోపాల్ రచనలు గీటురాళ్లుగా ఉపయోగపడతాయి.

- మందలపర్తి కిషోర్

( సాక్షి దినపత్రిక 15 10 2012 సౌజన్యం తో )





* 1. మనిషి-మార్క్సిజం, పే.168, వెల రూ.100/- దళిత / పే.209, వెల రూ.120/- 

2. రాజ్యం - సంక్షేమం / పే.161, వెల రూ.100/-

పర్‌స్పెక్టివ్, ఫ్లాట్ నం.305, ఇ.నం.2-2-647/182/ఎ3, హిమశివ అపార్ట్‌మెంట్స్ / బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్-13.


* 3. సాహిత్యంపై బాలగోపాల్ పే.339, వెల రూ.150/- /

4. మతతత్వంపై బాలగోపాల్ / పే.302, వెల రూ.150/-

 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్టాట్ నం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-67


* 5. నిగాహ్,  పే.407, వెల రూ.200/-

 ప్రజాతంత్ర కార్యాలయం, ఫ్లాట్ నం.1, ఇండస్ట్రియల్ పార్క్, ఐడీఏ, ఉప్పల్, హైదరాబాద్-39


* 6. హక్కుల ఉద్యమం - తాత్విక దృక్పథం / రూ.100/-  / నవోదయ, దిశ.


* 7. ఆ శిక్షే ఒక నేరం /  పే.88, వెల రూ.30/- ప్రజాశక్తి, నవోదయ.


.
  




.

Wednesday, October 10, 2012

అంతరంగం బ్లాగులో "నిర్జన వారధి" పై చరసాల గారి సమీక్ష ...


అయింష్టంగానైనా కొండపల్లి కోటేశ్వరమ్మని కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేయాల్సి వస్తోంది. 
ఎందుకంటే నాలాంటి వారికి ఆమె తెలియదు. 
ఆమె స్వీయ కథ, నిర్జన వారధిని చదివే ఆసక్తి కలగడానికి ఆమె సీతారామయ్య భార్య కావడమే కారణం. 
కానీ చదవడం మొదలెట్టాకా చివరికంటా చదవడానికి కారణం మాత్రం కోటేశ్వరమ్మే కాదు కాదు కోటేశ్వరవ్వే! 
ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించు కొని, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తననూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుంటారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ ఒక నిలువెత్తు సాక్ష్యం.
ఆమె ఆమెగానే సర్వ స్వతంత్రంగా బ్రతికిన కోటేశ్వరవ్వని ఇంకొకరి భార్యగా పరిచయం చేయాల్సి రావడం దురదృష్టమనే వుద్దేశ్యంతో నేను అయిష్టమన్నాను. 
నిజానికి కమ్యూనిస్టు వుద్యమానికి పరిచయం చెయ్యడమే సీతారామయ్య ఈ అమ్మకు చేసిన ఉపకారం(?). 
కమ్యూనిస్టు వుద్యమంలో దిగిన రోజునుండి ఈమె తన సర్వస్వాన్నీ పార్టీకి, వుద్యమానికే అర్పించింది.
ఈ కథ రాసిన తీరు, అవ్వ మన పక్కన కూర్చుని తన కథ చెబుతున్నట్లే వుంటుంది. 
చివరి వరకూ ఎక్కడా ఆత్మస్తుతీ, పరనిందా కనిపించవు. 
అలా అని తనతో వుద్యమంలో కలిసి నడిచిన వారి త్యాగాలని ఎక్కడా మెచ్చకుండా వుండదు. అప్పట్లో ఇంత మంచివారు వుండేవారా అని ఆశ్చర్యమనిపిస్తుంది.
.....
పూర్తి సమీక్ష అంతరంగం బ్లాగు లో చదవండి ...

Friday, October 5, 2012

కథలగూడు... దేవులపల్లి కృష్ఞమూర్తి ...




ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే

తెలంగాణా సాయుధ పోరాట జ్ఞాపకాలు మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయాల నుండి మెల్లగా తప్పుకుంటున్నాయి.
ప్రత్యేక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలూ తెచ్చిన తక్షణ ఎజెండాలు కూడా కారణం కావచ్చు.
ఇదంతా తాత్కాలికమే ననిపిస్తుంది.

ఇవి వట్టి జ్ఞాపకాలు కావు. వయసు మళ్లిన వాళ్లు ''మా రోజుల్లో'' అంటూ నెమరేసుకునే సంగతులు మాత్రమే కాదు, ఆ పోరాటం ఈ నేల రంగూ రుచీ వాసనని పట్టిచ్చింది. ఈ జనం స్వభావాన్నీ, టెంపర్‌నీ చూపించింది.

చే గువేరా ఏనాడో అరవయ్యో దశకంలో చనిపోతే అదంతా నిన్నో మొన్నో అయినట్టు ఎందుకు తలుచుకుంటుందీ ప్రపంచం. మన స్వతంత్ర పోరాటం గురించీ అంతకు ముందెప్పుడో వందల ఏళ్ల క్రితం వచ్చిన పోర్చుగీసు పాలనా, గోవా ప్రతిఘటన గురించి ఈ రోజుకీ చెప్పుకుంటున్నాం రాస్తున్నాం. సినిమాలు కూడా తీస్తున్నాం. చూస్తున్నాం.

తెలంగాణా సాయుధ పోరాటమూ అంతే.
అది సజీవం.
దాన్ని మన కథలూ నవలలూ, సాహిత్యం మరింత నిత్యనూతనంగా ఉంచుతాయి.
ఉంచుతున్నాయి కూడా.

ఈ అరవైయ్యేళ్లుగా పోరాట సాహిత్యం చాలా వచ్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌ లాంటి యోధుల జ్ఞాపకాలు పుస్తకాలుగా వచ్చాయి. ఇందులో చాలా వాటికి అట్టమీది బొమ్మలు గీసింది నేనే.

సుద్దాల హన్మంతు, యాదగిరి పాటలు,
దాశరథి, తెన్నేటి సూరి, సోమసుందర్‌ కవితలు ఒక వరస.
కిషన్‌ చందర్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, బొల్లిముంత శివరామకృష్ణ నవలలు మరో వరస.

చిత్త ప్రసాద్‌ బొమ్మలూ, సునీల్‌ జెనా ఫొటోలూ చరిత్రని రికార్డు చేశాయి.
'మా భూమి' లాంటి సినిమాలూ అదే చేశాయి.
ఈ పరంపర ఇంతటితోనే ఆగిపోలేదు.

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమై క్లైమాక్స్‌కు చేరినప్పుడు కూడా హైదరాబాద్‌లో, ఇతర పట్నాల్లో జరిగిన అనేక సభల్లో సాయుధ పోరాట ప్రస్తావన పదే పదే వస్తూనే ఉంది.

దేవులపల్లి కృష్ణమూర్తి కథలకి ఓ విశేషం, ప్రత్యేకతా ఉన్నాయి.
అన్నీ పోరాటకాలం నాటివే.
అన్నీ అసాధారణమైన పోరాట పటిమ చూపిన అన్‌సంగ్‌ హీరో, హీరోయిన్స్‌వే.
పాత్రలన్నీ నిజంగా బతుకులో ఉన్నవే.
కృష్ణమూర్తికి తెలిసినవే.
త్యాగం, పోరాటం, విషాదం, విజయం లాంటివి చెప్పేటప్పుడు పాఠకుణ్ణి కన్నీరు పెట్టించాలనో, పిడికిళ్లు బిగించేట్టు చేయాలనో, మెలో డ్రామాలో ముంచెత్తాలనో రచయితకి అనిపిస్తుంది.

కృష్ణమూర్తి కథలు ఆ పనిచేయలేదు.
పైగా తెలిసిన మనుషులనీ, వాళ్లున్న సందర్భాల్నీ వరుసగా చెప్పుకు పోతాడు.
రియలిస్టిక్‌గా మేటర్‌ ఆఫ్‌ ఫాక్ట్‌గా వినిపిస్తున్నట్టే ఉంటుంది.
ఎక్కడా అతి ఉండదు.
అలాగని ఒక్క దగ్గరా విసుగనిపించదు.
అల్లికలో అందంతో అలనాటి ఊళ్లూ, మనుషులూ, ఘటనలూ కళ్లముందు రూపుకడతాయి.
ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే.
కథలో, నవలలో, సినిమాలో ఒకనాడొచ్చిన ఇటాలియన్‌ నియోరియలిస్టిక్‌ పెయింటింగ్‌ ధోరణిలో కథనం సాగుతుంది.
....
- మోహన్‌
(చిన్నమాట నుంచి)


కథలగూడు
దేవులపల్లి కృష్ఞమూర్తి
ముఖచిత్రం : లక్ష్మణ్‌ ఏలె
122 పేజీలు, వెల: రూ. 60/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006
ఫోన్‌ నెం. 040 23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com



.

కొండపల్లి కోటేశ్వరమ్మ " నిర్జన వారధి " పై జంపాల చౌదరి గారి సమీక్ష .. పుస్తకం డాట్ నెట్ లో ...


నిర్జనవారధి మనుషుల్లేని వంతెన. 
ఈ పుస్తకం గురించి మొదట విన్నప్పుడూ, పుస్తకం చదివాక కూడా, ఈ పేరు గుండెను తొలిచేస్తూ ఉంది. ఈ మాటను తలచుకున్నపుడల్లా ఏదో అస్పష్టమైన విచారం కమ్ముకొస్తుంది. ఒక విషాద దృశ్యం కళ్ళ ముందు పరచుకొంటుంది.
కానీ మనుషులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు. 
స్థిరంగా అలాగే నిలిచి ఉంటుంది తర్వాత రాబోయేవారిని అవతల దరి చేర్చటం కోసం. 
విషాదం వారధిది కాదు; వారధిని వాడుకోలేనివారిది.
మూడు తరాలకు వారధి అయినా ఒంటరిగా మిగిలిపోయిన కోటేశ్వరమ్మగారి స్వీయకథ చదువుతుంటే విషాదం పెళ్ళుకువచ్చేమాట నిజమే అయినా, ఆమె మీద కల్గేది జాలి, సానుభూతి మాత్రమే కాదు, ఆమె సాహసప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత, ఆత్మాభిమానాల పట్ల ఆరాధనాభావం. కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజజీవితంలో ఇంత విషాదమూ, ఇంత ధైర్యమూ ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు.

..........  పూర్తి సమీక్ష పుస్తకం డాట్ నెట్ లో చదవండి 



Thursday, September 27, 2012

నిర్జన వారధి - కొండపల్లి కోటేశ్వరమ్మ ...


ఇవీ...నేను అనుకున్నవి 

నేను ఒక గొప్ప వ్యక్తినీ, రచయిత్రినీ కాకపోయినప్పటికీ 'నీ జీవితం ఓ కావ్యం లాంటిది. అది పదిమందికీ తెలియడం అవసరం' అని చెపుతుండేవాళ్ళు కొంతమంది పెద్దలూ, మిత్రులూ. 'సామాన్యుని సాహసమెట్టిదో...' చరిత్రలో నమోదు కావాలని మహీధర రామమోహనరావు, చేకూరి రామారావు, స్మైల్‌ వంటివాళ్ళు, పరకాల పట్టాభి రామారావు, మానికొండ సూర్యావతి వంటి మిత్రులు నన్ను ఆత్మకథ రాయమని ప్రోత్సహిస్తుండే వాళ్ళు. 

జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. తడిసిన ఆ అక్షరాలను అర్థవంతంగా కాగితం మీద పెట్టడం నా వల్ల అవుతుందా అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళుగా ఆ ప్రయత్నం చేయలేదు. 

నా మనవరాళ్ళు అనురాధ, సుధ, నన్ను అమ్మమ్మా అని పిలిచే మరో మనవరాలు వసంత (వేమన వసంతలక్ష్మి) 'నీ ఒంట్లో శక్తి తగ్గకముందే నీ జీవితాన్ని కథగా రాయి. ముందు తరాలకు తెలియకుండా దాన్ని మాసిపోనివ్వొద్ద'ని మరీ మరీ చెప్పారు. 

అయినా నా శక్తీ, నా కంటిచూపూ అందుకు సహకరిస్తాయా అని సందేహించాను. 

నీ మిత్రులు ఎందుకు రాయమన్నారో ఆలోచిస్తేనూ, విూరు ఆనాడు ఎందుకు ఉద్యమించారో గుర్తుచేసుకుంటేనూ నీ కన్నీరే కథగా ప్రవహిస్తుంది ప్రారంభించమన్నారు వాళ్ళు. 

అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో అనురాధ, అనురాధ మిత్రులు వాసుగారు, వసంత ఎంతో సహకరించారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావు గారిలాంటి వ్యక్తులు నా జీవితంతో ఎంతగానో ముడిపడిపోయిన వ్యక్తులు కాబట్టి సహచర కామ్రేడ్స్‌ మీద రాసిన సంస్మరణ వ్యాసాలను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను. ప్రత్యేకించి అనురాధ అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో చాలా శ్రమ తీసుకుంది. 

స్త్రీ జనాభ్యుదయంపై ప్రేమాభిమానాలున్న ఓల్గాగారు అడగ్గానే ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. నా కథను పాఠకులు లోతుగా ఆలోచించేటట్లుగా చారిత్రక ఉద్యమాల అవగాహనతో విశ్లేషించారు. 

ఈ పుస్తక ప్రయత్నం గురించి తెలిసి దాన్ని అచ్చువేయడానికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ముందుకొచ్చారు. 'సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం మొత్తం నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న జీవితం మీది. కనుక దేన్నీ వదిలిపెట్టకుండా రాయమని' కొన్ని సూచనలిచ్చారు బుక్‌ ట్రస్ట్‌ 
గీత గారు. ఆ ప్రకారం మరికొన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుని రాశాను. మరికొన్నిటిని విమలగార్ని విశాఖపట్నం పంపి రికార్డు చేయించి ఇందులో చేర్చారు. 

ఇందరి సహకారంతో నా జీవిత కథ ఇవ్వాళ నా 92వ యేట పుస్తక రూపంలో రానుంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. 

నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందను కుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందను కుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ళ నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను. 


- కొండపల్లి కోటేశ్వరమ్మ
15.8.2012
(నిర్జన వారధి పుస్తకంలోనుండి )

నిర్జన వారధి 

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 

పేజీలు  184 వెల: రూ. 100 /- 




ప్రతులకు:
హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, 
ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, 
గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

Now NIRJANA VAARADHI  is available to the international Telugu reader;
Here is the link to the book:


http://kinige.com/kbook.php?id=1196&name=Nirjana+Vaaradhi

Friday, September 21, 2012

ఆదివారం ఆవిష్కరించబోతున్న "నిర్జన వారధి" పుస్తక ముఖచిత్రం ...

ఆదివారం ఆవిష్కరించబోతున్న "నిర్జన వారధి" పుస్తక ముఖచిత్రం ...




Wednesday, September 12, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' ఆవిష్కరణ సభ ... సెప్టెంబర్ 23 ఉదయం 10 -30 గంటలకు హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ లో ...

ఆహ్వానం


తొంభైరెండు సంవత్సరాల కొండపల్లి కోటేశ్వరమ్మను గౌరవించుకోవడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది.

ఆమె రాసిన ఆత్మకథ 'నిర్జన వారధి' నుంచి కొన్ని భాగాలు చదివి, మాట్లాడేందుకు -

మల్లు స్వరాజ్యం,
 చేకూరి రామారావు, 
ఎ.బి.కె.ప్రసాద్‌, 
రమా మేల్కొటే,  
వోల్గా, 
విమల, 
గుడిపాటి, 
మంజరి 
మొదలైనవాళ్ళంతా వస్తున్నారు. 
మీరూ తప్పక రండి.

23 సెప్టెంబర్‌ 2012 ఆదివారం 
ఉదయం 10-30 గంటలకు
ఉర్దూహాల్‌, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌

-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌ నెం. 040 23521849

నిర్జీవంగా వున్న (కొండపల్లి) సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి.... ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం... ధారపోశాక చూడ్డానికి వాళ్ల పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను... సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్లు వదిలేశారు. ఇంతేనా జీవితం?
- కొండపల్లి కోటేశ్వరమ్మ

కొండపల్లి కోటేశ్వరమ్మగారు మూడు ఉద్యమాల వారధి. మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాట పటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్థ్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో అంత సామాజికం, రాజకీయం...
-వోల్గా
(నిర్జన వారధి పుస్తకం ముందుమాట నుండి)




.

Sunday, September 9, 2012

సగటుజీవి కథ ...


బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ తన 'పథేర్‌ పాంచాలి' తర్వాత, రెండో భాగంగా 'అపరాజితో' రచించారు. 

ఈ రెండు నవలలనూ కలిపి విఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే మూడు చిత్రాలుగా రూపకల్పన చేశారు. 

నవలలోని కథానాయకుడు అపూ కష్టాలూ కన్నీళ్లూ అధిగమిస్తూ ప్రశాంతంగా జీవించాలని తపిస్తాడు. వీలైనంతవరకూ ఇతరులకు 
సాయపడాలన్నది అతని సంకల్పం. చిమ్మచీకట్లో చిరుపీదాన్ని వెతుక్కుంటూ ప్రస్థానం సాగిస్తాడు. పల్లెల నుంచి పట్నాలకు 
వలసలు, ఛిద్రమవుతున్న గ్రామీణ వ్యవస్థ పెరిగిపోతున్న పేదరికం, తరిగిపోతున్న మానవ సంబంధాలను స్పశిస్తూ ప్రతి పాత్రనూ 
హృద్యంగా మనముందుంచారు రచయిత. 

బెంగాలీ సాహిత్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన నవల.

అపరాజితుడు
బెంగాలీ మూలం: బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ
అనువాదం: కాత్యాయని
పేజీలు: 197, వెల: రూ.100/-

ప్రతులకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌-500006

- కెవియల్లెన్‌
(ఈనాడు ఆదివారం 9-9-2012 సౌజన్యంతో)






Monday, September 3, 2012

అణువుపై ఒకింత అవగాహన...జీవశాస్త్ర విశేషాల సమాహారం ...


 అణువుపై ఒకింత అవగాహన

రచయితల ఊహల్లోని ఆలోచనలను అక్షరబద్ధం చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయినా శాస్త్ర సంబంధిత అంశాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ పరిమితి మూలంగా రచనలోని భావధారకు తరచూ బ్రేక్‌పడే అవకాశముంది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన ‘అణువుల శక్తి’లో ఈ పరిమితిని చాలా వరకూ అధిగమించారనే చెప్పాలి. ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రయోగం ప్రస్తావనతో పదార్థ లక్షణాలకు పరిచయం కల్పించడం... అక్కడి నుంచి క్రమేపీ గతంలోకి.. ఆ వెంటనే వర్తమానంలోకి తీసుకొస్తూ రచనను నడపడం హాయిగొలిపింది. పాఠ్యపుస్తకాల్లో కనిపించే గ్రాంధిక భాషను పక్కనబెట్టి వాడుక భాషలోనే అంశాలను వివరించేందుకు చేసిన ప్రయత్నం ఎన్నదగ్గది. అయితే వాడుకలో లేకపోవడం వల్లనో... స్థిరీకరించకపోవడం వల్లనో తెలియదు కానీ... రచయిత వాడిన కొన్ని పదాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కొత్త పదబంధాలను సృష్టించి ఉంటే శాస్త్ర సంబంధ దృగ్విషయా లకు తగిన తెలుగు అనువాదాలు లేకపోవడమన్న లోటును అధిగమించి ఉండవచ్చునన్న భావన కలుగుతుంది.

జీవశాస్త్ర విశేషాల సమాహారం
రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తన ముందుమాటలో చెప్పినట్లు సైన్స్ రచయితల బాధ్యతను గుర్తుచేసే సంకలనం ఇది. మార్కుల ప్రాతిపదికన చదువుకునే పాఠ్యపుస్తకాల మాదిరిగా కాకుండా సంక్లిష్టమైన అంశాలకూ సులభగ్రాహ్యంగా ఉందీ రచన. కాబట్టి విద్యార్థులు తరగతి గదుల్లోని చదువుకు మెరుగులు దిద్దేందుకూ ఉపయోగపడుతుంది. పరిణామ సిద్ధాంతాన్ని... మన ఆలోచనాసరళి, వచ్చే వ్యాధులకు ఉన్న జన్యుమూలాలను తెలిపేందుకు చేసిన ప్రయత్నమూ బాగుంది. సంకలనం మొత్తమ్మీద మూఢనమ్మకాలపై రచయితకు ఉన్న సహేతుక వ్యతిరేకత... వాటిని దనుమాడేందుకు చేసిన ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

అణువుల శక్తి, 
పే 192, వెల రూ. 100/-,
జీవశాస్త్ర విజ్ఞానం: సమాజం,
పే 175, వెల రూ 100/- /
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్/

ప్రతులకు:
 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

( సాక్షి దినపత్రిక 3 సెప్టెంబర్ 2012 సౌజన్యం తో )


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌