Wednesday, August 12, 2015

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ నిర్జన వారధి తమిళ అనువాదం " ఆలట్ర పాలం "

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ నిర్జన వారధి తమిళ అనువాదం " ఆలట్ర పాలం "

"కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ నిర్జన వారధి తమిళ అనువాదం 'ఆలట్ర పాలం' వెలువడింది. గౌరీ కిరుబనందన్ (0 9791 069 485) అనువదించిన ఈ పుస్తకాన్ని 30 జూలై 2015 న తమిళనాడు లోని ఈరోడ్ లో జరిగిన ఒక కార్యక్రమం లో శ్రీమతి అంబై ఆవిష్కరించారు. సభకు శ్రీ నంజిల్ నాదన్ అధ్యక్షత వహించారు. 


The Sharp Knife of Memory పేరుతో ఈ పుస్తకం ఆంగ్లానువాదం ఇటీవలే వెలువడిన విషయం విదితమే. నిర్జన వారధిని వి.బి.సౌమ్య ఇంగ్లిష్ లోకి అనువదించారు. 




ஜூலை 30th அன்று ஈரோட் ல் நடந்த  புத்தக வெளியீட்டு விழாவில் எடுத்த புகைப்படத்தை
இத்துடன் இணைத்துள்ளேன்.

கொண்டபல்லி கோடேஸ்வரம்மா அவர்களின் சுயசரிதை நிர்ஜனவாரதியின் தமிழாக்கம் "ஆளற்ற பாலம்"

.

చరిత్ర చాటిన సత్యం - వి. ప్రతిమ (మాతృక, మాస పత్రిక ఆగస్ట్ 2015 సంచిక)



      చరిత్ర  చాటిన  సత్యం

నల్లజాతి  నిప్పు కణిక  సోజర్నర్  ట్రూత్’ నవల పరిచయం  
వి. ప్రతిమ

స్వేచ్ఛ’ అన్న పదమే ఎరుగని బానిసలకు పిల్లలపై ప్రేమే తప్ప హక్కుండదు. ఇది రాక్షసులు రాసిన చట్టం. ఏ మనిషయినా ఎన్నెన్ని అవసరాలూ, అత్యవసరాలనైనా వొదులుకోగలరు కానీ తమ కడుపులో పుట్టిన పిల్లలు తమ కళ్ళ ముందు పెరగాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు గదా. నవమాసాలు మోసి అయిదారేళ్ళు ప్రేమతో పెంచుకున్న పిల్లల్ని యజమాని తమ కళ్ళ ముందే వేలం వేసి అమ్మేసుకుంటుంటే చూస్తూ వూరుకోవాలి.

కన్నవాళ్ల కడుపుకోత యజమానికి పట్టదు. ఇది ఏ ఒక్కరిదో, ఒక యింటిదో, ఒక వూరిదో కాదు మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసించిన ఒకానొక జాతి మొత్తానిది. 

ఆ జాతి ఏది? ఆఫ్రికా అడవుల్లో పచ్చి నెత్తురు తాగే క్రూరమృగాల్ని ఎదిరించగలిగిన ఒక మహా జాతి... అదే నల్ల జాతి. ఆఫ్రో అమెరికన్ జాతి. ఆ బడబాగ్నిని ఎదిరించి నిలిచిన ఇసబెల్లి కధ ఇది. ఒక్క బానిసత్వమే కాదు యింకా అన్ని రకాల వివక్షలకూ అవమానాలకూ ఎదురు నిలిచి పోరాడి తాను నిప్పుకణికయి రగులుతూ తన చుట్టూ ప్రపంచానికి వెలుతురు పంచిన ‘సోజర్నర్ ట్రూత్’ కధ యిది. 
చీకటి ఖండం అని పిలవబడే ఆఫ్రికా ఖండంలో స్వేచ్ఛగా వీధుల్లో పొలాల్లో తిరుగుతోన్న అమాయకమైన ఆఫ్రికన్స్ ను మోసంతో చేబట్టి కఠినంగా హింసించి ఇనుప గొలుసుల్తో బంధించి నరకం చూపించి నౌకలెక్కించి అమెరికా సంయుక్త రాష్ట్ర తీరాలు చేర్చి ఉక్కులాంటి నల్లజాతీయుల్ని బానిసలుగా తెగనమ్మి డబ్బు చేసుకున్నారు నరమాంసపు వ్యాపారులైన తెల్లవాళ్ళు. పంధొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో అమెరికా గడ్డ మీద వికృతరూపం దాల్చిన బానిసత్వం, విచ్ఛిన్నమైన నల్ల జాతీయుల లక్షల కుటుంబాల గురించీ గొలుసులతో బంధించబడి, కొరడా దెబ్బలతో పీల్చి పిప్పి కావించబడ్డ శరీరాలూ … యివన్నీ మనం గతంలో విని కరిగి నీరయినవే. 

అలెక్స్ హేలీ ‘రూట్స్’ లోనూ, మార్టిన్ లూధర్ కింగ్ జీవిత చరిత్రలోనూ, యింకా మాల్కం ఎక్స్ జీవిత చరిత్రలోనూ చాలా వరకు చదువుకొన్నవే. అయినా యిది ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీ జీవిత చరిత్ర.  తొమ్మిదేళ్ళ వయసులో విక్రయించబడి తల్లిదండ్రుల్నీ, కుటుంబాన్నీ కోల్పోయి, ఒంటరిగా విలపించి కుటుంబం కోసం పరితపించిపోయిన ఆ చిన్నారి పాప ఎట్లా ఆ సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛాగానమాలపించిందో తెలిపే నల్లజాతి బానిసోద్యమకారిణి  జీవితం యిది. 

ఆమెకు చదువు లేదు. అక్షరమంటే తెలియదు, గురువంటే అసలే తెలీదు. కాఠిన్య జీవితమే ఆమెకు చదువు నేర్పించింది. ఆమె మనసే ఆమెకు గురువు. తెల్లవారి దౌష్ట్యమే పుస్తకం. గుండెల్లో రగిలే మంటల్ని పాటలుగా రూపాంతరం చెందించి ఆలపించి పాటల్నే పావురాలుగా ఎగురవేసిన స్వేచ్చా గానలహరి ఆమె.

బానిస పిల్లలకి పుట్టినప్పటి నుండే వినయంగా, బానిసత్వంతో మెలగడమెలాగో తలిదండ్రులే నేర్పిస్తారు. యజమాని మెప్పుతో స్వేచ్ఛ లభిస్తుందని ఆశపడి తన శరీరాన్ని మొత్తం పని అనే కొలిమిలో కాల్చుకోనేది బెల్లీ. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా యజమాని యింట్లో, పొలంలో పగలూ రాత్రీ ఎండా, గాలీ, వానా దేన్నీ లెక్క చేయకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఎప్పటికైనా తల్లిదండ్రుల్ని కలుసుకోగలనన్న నమ్మకంతో పనిచేస్తూనే ఉండేది. 

ఆ కల నిజమవకుండానే తల్లి మరణం ఆమెను ఎంతగానో క్రుంగదీస్తుంది. అయినా విలవిలలాడి పోతోన్న తండ్రిని తానే తల్లయి ఓదారుస్తుంది. “నాన్నా! వచ్చే పది సంవత్సరాలలో నల్లజాతి బానిసలందరికీ స్వేచ్ఛ వస్తుందట ... అప్పుడు ఎక్కడా బానిసత్వమే వుండదట. అందరూ చెప్పుకుంటున్నారు .. అప్పుడు నాకు స్వేచ్ఛ  వచ్చాక నిన్ను నాతో తీసుకుపోయి నా దగ్గరుంచుకొని అమ్మలాగా బాగా చూసుకుంటా ... అప్పటివరకూ దిగుల్లేక ఉండు నాన్నా’’అంటూ అమాయకంగా చెప్తుంది. 

తండ్రికి బాగా తెలుసు. అది కనుచూపు మేరలో లేదని. బానిసలకు మాతృప్రేమ, కన్నప్రేమ, సంతోషం, నిర్ణయాలు వంటి ఎన్నెన్నో అనుభూతులు కర్కశంగా సమాధి చేయబడ్తాయని. బానిసలకు యింటి పేరు ఉండదు. పేరు పక్కన తాము పని చేస్తున్న తమ యజమాని పేరు కలుపుతారు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు తమ పేరు చివర భర్త పేరు తగిలించుకోవడం బహుశ ఈ బానిస సంస్కృతికి ప్రతీకేమో అనిపిస్తుంది.
బానిసలకు కూడా ఒక పండగ వుంటుంది. ఆ పండగ వేడుకల్లో హఠాత్తుగా పరిచయమవుతాడు బాబ్. పక్క పక్క పొలాల్లో చెరొక యజమాని వద్ద పని చేస్తుంటారు. బాబ్ తో మాట్లాడటం బెల్లికి యిష్టంగా వుంటుంది. కానీ బాబ్ యజమాని కాటిలిన్ యిందుకు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు బెల్లి యజమాని డ్యూమండ్ కి చెందుతారు కాబట్టి. “మన అనుబంధంలో మాధుర్యం మనం ఆలోచిస్తుంటే యింకా మనకి పుట్టని బిడ్డలపై వచ్చే లాభం గురించి వాళ్ళాలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడీ బానిసత్వం నుండి బయట పడదామా అని మనం వున్నాం. వాళ్ళేమో మన బిడ్డల్ని బానిసలుగా మార్వడం గురించి ఆలోచిస్తున్నారు” అంటుంది బెల్లి. 

బానిసలకు సొంత ఆలోచన, ఆశ, ఉల్లాసం, స్పందనలూ ఉండరాదు. యజమానులు భరించలేరు. తన యజమానిని కాదని బెల్లి వద్దకు వచ్చిన బాబ్ వెంటాడబడి, వేటాడబడి కొట్టి చంపబడతాడు. తన మాసా కిందనే పనిచేసే మరో నిగ్గర్ ని తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటుంది. పిల్లలని కంటుంది. నాలుగేళ్ళు కూడా నిండని తన కొడుకుని యజమాని అమ్మివేయడాన్ని తట్టుకోలేక అతడి మీద కక్ష పెట్టుకుంటుంది బెల్లి. అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ చిలకా, గోరింకల్లా వున్న బిడ్డల్ని విడదీసి లాభానికమ్ముకోవడం, అర్ధరాత్రి తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రిస్తోన్న పసికందుల్ని సైతం లాక్కొచ్చి వేలంలో తెగనమ్ముకోవడం తెల్లవాడికి ఉగ్గుతో పెట్టిన విద్య. 

తమ పిల్లల జోలికెళితే ఏ జంతువయినా మన మీద పడి కరుస్తుంది. కానీ కొండల్ని పిండి కొట్టగల కండలు తిరిగిన నల్లవారు మాత్రం మౌనంగా రోదించారే తప్ప ఎదిరించలేదు. ఎదిరించిన వారు బతకనూ లేదు. కానీ బెల్లి దెబ్బతిన్న కాలనాగులా సలసల మరుగుతోన్న రక్తంతో బుసలు కొడుతూ యజమాని డ్యూమండ్ని ఢీకొంటుంది. దెబ్బతిన్న ఆత్మాభిమానంతో బిగించి కట్టబడ్డ ఉక్కుసంకెళ్ళను  ఛేదించి, నిరంకుశమైన చీకట్లను చీల్చుకుంటూ, స్వచ్ఛమైన వెలుగురేఖలను వెదుక్కుంటూ విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.
1827వ సంవత్సరం జులై4వ తేదీ నాటికి 30 సంవత్సరాలు నిండిన బెల్లికి ఆమె నివస్తిస్తున్న రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక చట్టం వలన బానిసత్వం నుండి విముక్తి లభించింది. బెల్లి నవ్య స్వేచ్ఛావలువలు చుట్టుకుని పదేపదే మురిసిపోయి తన అసలైన ప్రయాణాన్ని ప్రారంభించింది ... తన కొడుకు పీటర్ని వెదుక్కుంటూ. పైసా ఫలితం రాని శ్రమ చేసి చేసి కాయలు కాసిన చేతులతో, ఉగ్గు పాలిస్తూ పసిబుగ్గల్ని నిమిరిన చేతులతో ఒక నల్లజాతి మనిషి, అందునా స్త్రీ మొట్టమొదటిసారిగా నవ్యసమాజానికి నిలువెత్తు గురుతుగా నిలిచిన న్యాయస్థానంలో రిట్ వేసింది. అలా తెల్లవాడిని ఎదిరించి నిలిచి కోర్టులో గెలిచి తన కొడుకుని దక్కించుకొన్న తొలి తల్లి బెల్లి. అంతే కాకుండా ఆమె న్యూయార్క్ లో వున్నప్పుడు ఆమె మీద పడిన హత్యానేరాన్ని ఆధారంగా చేసుకొని చాలా వ్యతిరేకంగా రాసిన ఒక పత్రిక మీద కూడా రిట్ వేసి గెలిచింది. చట్టపరంగా ఇది ఆమె రెండో విజయం. 

ఆ తర్వాత తాను నల్లజాతి స్త్రీ అయినందుకుగాను తనను బస్సు ఎక్కనివ్వకుండా చేసినందుకు బస్ కండక్టరు మీద కోర్టులో రిట్ వేసి గెలవడమే కాకుండా ఆ తర్వాత నల్లజాతి వారందరూ బస్సులో ఎక్కేందుకు మార్గం సుగమం చేసింది. 
 
కుటుంబాన్ని భర్త కప్పచెప్పి, శృంఖలాలు అవి ఏ రూపంలో వున్నా సరే, శక్తివంతంగా బద్దలు కొట్టటం కోసం జీవితమంతా సంచారం చేసిన విముక్తి ఉద్యమనేత బెల్లి. ఇంకా చెప్పాలంటే స్త్రీల హక్కు, ఆస్తిహక్కు, ఓటు హక్కు యింకా జైళ్ల సంస్కరణవంటి అనేక అణచివేతల్ని ఎదిరించి నిలిచిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె. అప్పటికి అరాచకంగా ఉన్న న్యూయార్కును వదిలి చాలా ప్రాంతాలు తిరగదలిచి తన పేరును సోజర్నర్ ట్రూత్ గా మార్చుకుంటుంది. సోజర్నర్  అంటే ‘సంచారిణి’ అని అర్ధం. సత్యం కోసం అన్వేషిస్తూ తిరుగుతోంది కాబట్టి ఆ సత్యమే ఆ యింటి పేరై  ‘సోజర్నర్  ట్రూత్’ గా మారింది. 

ఎవరు తనతో నడిచినా నడవక పోయినా తాను మాత్రం ఎన్నో పట్టణాలనీ, పల్లెల్నీ  తిరుగుతూ యింకా మిగిలి ఉన్న బానిసత్వాన్ని విముక్తి చేయడం కోసం ముందుకు నడిచింది. బానిస సంకెళ్ళను ముక్కలు ముక్కలుగా విడగొట్టి తమ జాతీయులకు విమోచన కల్పించడానికి అలుపెరుగక శ్రమించిందామె. తిండి, నిద్ర, విశ్రాంతి కోసం ఎప్పుడూ తపించకుండా చాలా ప్రాంతాలని సుడిగాలిలా చుట్టేసిందామె. ఒక వైపు బానిసత్వ వ్యతిరేకోద్యమంలో పాల్గొంటూనే మరో వంక స్త్రీల హక్కుల సభలు ఏర్పాటు చేసి ఎన్నో చర్చలు చేసేది. మరో వంక నీగ్రోల ఓటుహక్కు కోసం అనేకానేక మందితో పరిచయం ఆమెను మరింత ముందుకు నడిచేలా తోడ్పడింది. 

ఆమె దారుఢ్యం, ఎత్తూ చూసి అంతా ఆమెను పురుషుడనే అనుకొనేవారు. “నేను దున్నగలను, నాటగలను. పంటకోసి నూర్చి ధాన్యాన్ని యిల్లు చేర్చగలను. ఏ పురుషుడి సహాయమూ నాకవసరం లేదు. నేను స్త్రీని కానా మరి?” అంటూ ఆవేశంగా గొంతెత్తి స్పష్టం చేస్తుంది. స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడే మతాధికారుల్ని ఆమె నిలదీస్తూ “క్రీస్తు స్త్రీలకు హక్కులివ్వలేదని మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే క్రీస్తు స్త్రీకాదు కనుక’ అంటుంది. 1840 ప్రాంతంలో సోజర్నర్  ఈ మాట అన్నది అనుకొంటే యివ్వాల్టి స్త్రీలకు కూడా ఉద్వేగం కలుగుతుంది. “తల్లకిందులుగా ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా సరి చేస్తామని స్త్రీలు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళనా పని చేయనిస్తే మేలని నేననుకుంటున్నాను” అంటూ సభలో నిష్కర్షగా ప్రకటిస్తుందామె.
ఈ కధలో ‘అండర్ గ్రౌండ్ రైల్ రోడ్’ అనే పదం ఒక మాట ఉంటుంది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ అంటే భూమి అంతర్భాగాన రైల్వే ట్రాక్ అనో , రోడ్డు అనో కాదట. అమెరికాలో దక్షిణ రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం వేలకొద్ది బానిసలు తప్పించుకొని పారిపోయి ‘ఫ్రీ స్టేట్స్’కి చేరేవాళ్లు. ఫ్రీ స్టేట్స్ అంటే బానిసత్వం లేని కొన్ని ఉత్తర రాష్ట్రాలు. ఈ పారిపోతున్న వాళ్ళను కనిపెట్టి వివిధ సురక్షిత ప్రాంతాలకు చేరవేసేవాళ్ళు కొందరు. ఎందరో మానవతావాదులు, వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ని నిర్వహించారనీ, ఆశ్చర్యకరంగా యిందుకు తెల్ల జాతీయులెందరో కూడా సహకరించారని తెలిసి విస్మయం కలుగుతుంది. 

ఇలా ఒక స్థావరం నుండి మరో స్థావరానికి అంచెలంచెలుగా మార్చడమన్నది అంత తేలికైన విషయమేమీ కాదు. మిలటరీ వాళ్ళు వేటకుక్కలతో ప్రతిచోటా కాపలా ఉండేవాళ్లు. చిన్న పొరపాట్లకే కఠినమైన శిక్షలూ, జరిమానాలూ వుండేవి. ఈ వ్యవస్థలో పనిచేసిన ఎందరో ఇప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. అలా కెనడా చేరుకొన్న బానిసలకు ఎంతో స్వేచ్ఛ, విద్య, రక్షణ, పని లభించేవే. 
సోజర్నర్ పేరు అమెరికా అంతా వ్యాపించిపోయింది. ‘అంకుల్ టామ్స్ కాబిన్’ రచయిత్రి  ‘హరియట్ బీచర్ స్టవ్’ తెల్లజాతి మనిషి. ఆమె భర్త బానిసత్వ విమోచనోద్యమకారుడు. సోజర్నర్  ఆ నవలని ఎవరితోనో చదివించుకుని విని హరియట్ ని కలిసి అభినందనలు తెలిపినపుడు ఆమె గురించి చాలా విని వున్న రచయిత్రి  సోజర్నర్  ట్రూత్ ని కలుసుకోగలిగినందుకు ఆనందపడుతుంది. అలాగే అమెరికా పదహారో ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ని కలిసి నల్ల జాతీయులకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘మీరు ప్రెసిడెంట్ అయ్యేదాకా మీ పేరు విని వుండలేదు’ అంటుంది. అందుకు వెంటనే లింకన్ ‘నేను ప్రెసిడెంట్ కాక ముందు నుండే మీ పేరు విని ఉన్నాను. మీరు నాకు పరిచితులే’ అంటాడు. అంతేకాకుండా బానిసత్వాన్ని నిర్మూలించిన చేత్తో ‘ఫర్ ఆంటీ సోజర్నర్  ట్రూత్ ‘అని ఆటోగ్రాఫ్ ఇస్తాడు.
ఒక నిగ్గర్ అందునా ఒక స్త్రీ తన జీవితకాలంలోనే ఒక మహాత్మురాలిగా గుర్తింపునందుకున్న ‘మహాప్రస్థానం’ ఈ నవల. ఈ నవల, లేదా ఈ జీవిత చరిత్ర చదువుతున్నంత సేపూ ఎంతోమంది బానిసోద్యమకారుల జీవితాలు చరిత్రకెక్కాయి. కానీ ఈ సోజర్నర్ ట్రూత్ గురించి మనకెందుకు అందుబాటులోకి రాలేదు? కేవలం స్త్రీ అయినందువల్లేనా? ఆమె స్నేహితురాలు ఆల్బర్ట్ గిల్ట్ ఈ బానిసోద్యమకారిణి  జీవితాన్ని గురించి రాయకుండా వుండి ఉంటే, యర్రింగ్ టన్ అప్పుడా పుస్తకాన్ని ప్రచురించలేక పోయి ఉంటే ఆమె జీవితం ఎన్నటికీ చరిత్రకందేది కాదు. ముఖ్యంగా చేలూరి రమాదేవి ఈ గ్రంధాల ఆధారంగా ‘నల్లజాతి నిప్పుకణిక  సోజర్నర్ ట్రూత్’నవల మనకు అందించలేకపోయేది.
ఇది రాస్తున్న సమయానికి అమెరికా దక్షిణ రాష్ట్రాలలోని ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురుతున్న ‘కాన్ఫిగరేట్ జండాలను’ (బానిసత్వాన్ని సూచించే జండాలు)  దించివేయడం ముదావహం. 

(మాతృక మాసపత్రిక ఆగస్ట్ 2015 సౌజన్యం తో ) 

 నల్లజాతి నిప్పుకణిక  - సొజర్నర్‌ ట్రూత్‌
- రమాదేవి చేలూరు
ధర : రూ. 100/-
మొదటి ముద్రణ : డిసెంబర్ 2003 ; మహిళా మార్గం ప్రచురణలు, హైదరాబాద్
హెచ్ బి టి తొలి ముద్రణ : జూన్ 2015


పతులకు, వివరాలకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ : 040 23521849 
ఇ మెయిల్ ఐ డి : hyderabadbooktrust@gmail.com

Monday, August 10, 2015

అచ్చమైన బాల్యానికి మచ్చుతునక ... రైలు బడి - డా. వాణి దేవులపల్లి

అచ్చమైన బాల్యానికి మచ్చుతునక !

స్తబ్ధత, యాంత్రికత, అబద్ధపు పోకడలే నేటి జీవన విధానమైన ఈ వ్యవస్థలో
బడులు ఎప్పుడో వాటి పవిత్రతనూ, ప్రాదాన్యాన్నీ కోల్పోయాయి.
వ్యాపార నిలయాలుగా మారాయి.
ఈ దశలో ... పవిత్రమైన, ఉత్కృష్టమైన అధ్యాపక వృత్తికి మళ్ళీ మునుపటి దశను
తీసుకురావలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది ఈ " రైలు బడి " పుస్తకం.

http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=388544&boxid=720703176

నమస్తే తెలంగాణ దినపత్రిక తేది  10 - 8 - 2015 సౌజన్యం తో ...





.


Saturday, August 1, 2015

THE SHARP KNIFE OF MEMORY ... Kondapalli Koteswaramma ... Translated by V.B. Sowmya ...

THE SHARP KNIFE OF MEMORY
- Kondapalli Koteswaramma

When it was first published in India, ninety-four-year-old Kondapalli Koteswaramma’s autobiography was acclaimed by the Telugu literary world. 

Koteswaramma is well known as the widow of Kondapalli Seetharamaiah, founder of the Maoist movement in the south Indian state of Andhra Pradesh, and her life spans a tumultuous century of Indian politics that included the Independence movement, Communist insurrection, and the militant leftist Naxalite movement.

A child widow at the age of five, she went on to marry Seetharamaiah and work for the Communist Party of India. 
She was later forced to live underground with her family in the difficult years of the late 1940s. 

Then Seetharamaiah deserted her and everything changed. Painfully, Koteswaramma worked to rebuild her life, only to face tragedy again when both of her children died as young adults. 

When many others would have given up, Koteswaramma responded by enrolling in school, taking a job, raising her grandchildren, writing poetry and prose, and eventually establishing herself as a thinking person in her own right.

Now in English, The Sharp Knife of Memory is a searing memoir that will resonate worldwide as it explores the nature of memory and gives a firsthand account of the arrival of women’s political independence in India.

That Indian women often face incredible suffering is known, but that they can fight back and emerge winners is exemplified in the life of Koteswaramma.


THE SHARP KNIFE OF MEMORY- Kondapalli Koteswaramma

Telugu Original: Nirjana Vaaradhi, Published by HBT, 2012

Translated by V.B. Sowmya

160 pages  Rs. 325

© 2014,
Published by Zubaan

Copies available at Hyderabad Book Trust also.
For details please contact:

Hyderabad Book Trust,
Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur,
Hyderabad - 500006

Phone No. 040 - 2352 1849
Email :  hyderabadbooktrust@gmail.com


http://hyderabadbooktrust.blogspot.in/2012/09/blog-post_27.html


.
 

Thursday, July 30, 2015

జైల్లో పుట్టిన కవితలు

నది పుట్టిన గొంతుక 
( జైలు కవితలు )
- బొజ్జా తారకం 


"గంగ హిమాలయాల్లో పుట్టింది
గోదావరి త్రైంబకంలో పుట్టింది
ఈ కవిత జైల్లో పుట్టింది
గంగ, గోదావరి ప్రవహించి, ప్రవహించి సముద్రంలో కలిశాయి
గోదావరి సముద్రంలో కలిసిన చోట పుట్టాను నేను
ఈ కవిత జనసంద్రంలో కలుస్తుందని ఆశిస్తున్నాను"

...
1975 జూన్‌ ఇరవై ఆరో తారీఖున అత్యవసర సరిస్థితి ప్రకటించారు. కొన్ని వేల మందిని జైళ్ళలో నింపారు. దేశం అంతా భయం ఆవరించింది. నాకు తెలిసిన వాళ్ళు చాల మంది అరెస్టయ్యారు. 'ఇందిరాగాంధీ విధానాలు వ్యతిరేకిస్తున్నారు' అనుకున్న వాళ్ళను అరెస్టు చేశారు. రాజకీయ కార్యకర్తలకు ఎలానూ తప్పదు; రచయితలను కూడా అరెస్ట్‌ చేశారు. ''ప్రజలతో ఇప్పటికే చాల సంబంధాలు పెంచుకున్నాడు, అంతేకాదు ఇతను రచయిత కూడా'' అని పోలీసులు నా గురించి రిపోర్టులు పంపిస్తున్నారు ఎప్పటి నుంచో.

... ... ...

నిజామాబాద్‌ జైలు చాలా ఎత్తైన కొండమీద ఉంది. పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాలి. దేవాలయాన్ని నిజాం ప్రభుత్వం జైలుగా మార్చిందంటారు. ఎవర్నో ఒకర్ని బంధించడానికే రెండూను. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాసినందుకు దాశరథిని ఇదే జైల్లో ఉంచారు. రచయితగా నేను రెండోవాడిని.

... ... ...

భారత రక్షణ చట్టం క్రింద మమ్మల్ని అరెస్టు చేశారు; కాబట్టి బెయిలు కోసం దరఖాస్తు పెట్టాము. కోర్టు బెయిలు ఇచ్చింది. బెయిలు ఆర్డరు కంటే ముందుగానే పోలీసు వ్యాన్‌లు వచ్చాయి జైలుకు. జైలంతా తెలిసిపోయింది మళ్ళీ అరెస్టు చేస్తారని. నాతో మరో ఇద్దర్ని విడుదల చేయమని కోర్టు ఆర్డర్‌. ముగ్గురమూ కిందికి దిగి వచ్చాం. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సరిగ్గా మెట్ల దగ్గర ఉన్నాడు...చుట్టూ సాయుధులైన పోలీసులు...వాళ్ళిద్దర్నీ ఏమీ అనలేదు. నన్నొక్కణ్ణే అరెస్టు చేశారు... ఈసారి ఆంతరంగిక భద్రతా చట్టం క్రింద.

పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు...కందికుప్ప నుంచి నాన్న వచ్చారు.
ఆ రాత్రే తీసుకువచ్చారు చెంచల్‌గూడా సెంట్రల్‌ జైలుకు. జ్వరంలోనే తీసుకు వచ్చారు. రాత్రి ఒంటిగంటకు బస్‌లో ప్రయాణం. నాకు రెండు వైపులా తుపాకీలతో పోలీసులు. అరెస్టు అయిన వ్యక్తి కంటే చూసేవాళ్ళు హడలిపోవాలి...
అక్కడ దాదాపు సంవత్సరం ఉన్నాను. డిటెన్యూలు రెండు వందల మందిపైగా. వారందరితో జైలు జీవితం చాల గొప్ప అనుభవం.
... ... ...

ఒకరోజు ఎందుకో హఠాత్తుగా 'నీతో చెప్పనే లేదు' అన్న వాక్యాలు వచ్చాయి... వ్రాశాను...ఆ తర్వాత...ఏదో ఆలోచన ఉబికి వచ్చేది...వాక్యాలు తొణికి వచ్చేవి... వ్రాసు కుంటూ వెళ్ళిపోయాను. మిత్రులకు చదివి వినిపిస్తుండే వాడిని. మెచ్చుకొనేవారు. శివుని త్రిశూలంలా ఉండేవి పువ్వులు ఒక చెట్టుకి...ఆ చెట్టు కింద కూర్చుని చదువుకొనేవాణ్ణి. అక్కడే కూర్చుని వ్రాసుకుంటూ ఉండేవాడిని.
ఆ నిర్బంధంలో పుట్టుకొచ్చిన కవితలివి

నది పుట్టిన గొంతుక
( జైలు కవితలు )

- బొజ్జా తారకం

ధర    :    రూ. 60/-
మొదటి ముద్రణ    :    మార్చి 1983,  జనపద ప్రచురణలు - 2
పునర్ముద్రణ    :    2015

ప్రతులకు, వివరాలకు    :హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

 ఫోన్‌ : 040 23521849
ఇ మెయిల్ ఐడి : hyderabadbooktrust@gmail.com

Wednesday, July 29, 2015

చరిత్ర రచనపై బాలగోపాల్‌

చరిత్ర రచనపై

బాలగోపాల్‌


బాలగోపాల్‌ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర : డి.డి. కోశాంబి పరిచయం' తెలుగు పాఠకులకు సుపరిచితమే. 1986 నుండి ఎన్నో పునర్ముద్రణలు పొందింది  ఆ పుస్తకం. దానికి ముందు, తర్వాత చరిత్రపై బాలగోపాల్‌ రాసిన  పది వ్యాసాలను కలిపి ఇప్పుడు మరో పుస్తకం తీసుకొస్తున్నాం. 


ఇందులో సగం వ్యాసాలు వివిధ పుస్తకాలపై సమీక్షలుగా రాసినవి. రెండు నేరుగా బుక్‌లెట్స్‌ రూపంలో వచ్చినవి.

ఒకటి హిస్టరీ కాంగ్రెస్‌లో ఆధునిక ఆంధ్రదేశ చరిత్రపై ఇచ్చిన అధ్యక్షోపన్యాసం. పాతికేళ్ళలో (1981-2007) అక్కడక్కడా వచ్చిన ఈ వ్యాసాలు 'చరిత్ర' కంటే చరిత్ర రచనా పద్ధతిని ఎక్కువగా చర్చించినందువల్ల ('భారత కార్మిక ఉద్యమ చరిత్ర' వ్యాసం మినహా) ఈ పుస్తకానికి దాన్నే శీర్షికగా పెట్టాం.

    ఈ వ్యాసాలలో కనీసం రెండు మూడు శతాబ్దాలకు చెందిన అనేక పేర్లు, సంఘటనల ప్రస్తావన ఉన్నందువల్ల పాఠకుల సౌలభ్యం కోసం ఫుట్‌నోట్లు ఇచ్చాం. ఎంత ప్రయత్నించినా కొందరి గురించి, కొన్నిటి గురించి పూర్తి సమాచారం దొరకలేదు. ఎవరైనా ఇవ్వగలిగితే తర్వాతి ముద్రణలో చేరుస్తాం. ఈ విషయంలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి సవరించుకుంటాం. 


మన్నం బ్రహ్మయ్య, వేమన వసంతలక్ష్మి చేసిన ఈ పనిలో స్వాతి వడ్లమూడి, చిట్టిబాబు పడవల, జిలుకర శ్రీనివాస్‌,  మోతుకూరు నరహరి సహకారం కూడా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు.

- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌




చరిత్ర రచనపై బాలగోపాల్‌

227 పేజీలు  

ధర   :    రూ. 130/-

తొలి ముద్రణ    :    జూలై 2015

కవర్‌ డిజైన్‌    :     అనంత్‌   

ప్రతులకు, వివరాలకు    :   

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ,  ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.        
ఫోన్‌ : 040- 23521849
ఇ మెయిల్ ఐడి : hyderabadbooktrust@gmail.com



   

Friday, July 17, 2015

HYDERABAD BOOK TRUST NEW BOOK NALLAJATHI NIPPU KANIKKA

Friday, June 5, 2015

నల్లజాతి నిప్పుకణిక - రమాదేవి చేలూరు




నల్లజాతి నిప్పుకణిక  - సొజర్నర్‌ ట్రూత్‌

- రమాదేవి చేలూరు

ఓ శక్తిమంతమైన నల్లజాతి మహిళ జీవిత కథే ఈ పుస్తకం.

నల్లజాతిలో వికసించిన రత్నాలు - ముఖ్యంగా ఆఫ్రికన్‌ అమెరికన్ల జీవిత చరిత్రలు ఎంతటి గాఢమైన, ఆర్ద్రమైన మానవ అనుభవాలను ఈ ప్రపంచం ముందుంచాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జీవిత కథలు మనకొక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందించటమే కాదు, అడుగడుగునా ప్రతిఘటించే అసాధారణ పోరాట పటిమకు, మూర్తీభవించిన మానవతా స్ఫూర్తికి ప్రతీకలుగా కూడా నిలుస్తూ... అంతిమంగా అన్ని జాతుల మనసులనూ కదిలించి, అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తాయి. 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇప్పటికే ఇటువంటి శక్తిమంతమైన నల్లజాతి జీవిత కథలను కొన్నింటిని తెలుగు పాఠకుల ముందుకు తెచ్చింది. 

అలెక్స్‌ హేలీ రాసిన రూట్స్‌ (ఏడుతరాలు, 1980) తో ఆరంభించి,  
ఆ తర్వాత రిచర్డ్‌ రైట్‌ ఆత్మకథ బ్లాక్‌ బాయ్‌ (రేపటికల, 2004),  
మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జీవిత చరిత్ర (ఆయుధం పట్టని యోధుడు, 2008),  
మాల్కం ఎక్స్‌ జీవిత చరిత్ర (అసుర సంథ్య, 2006) ఇలాంటివే. 

ఈ పరంపరకు మరో ముఖ్యమైన చేర్పు ఈ సొజర్నర్‌ ట్రూత్‌ జీవిత కథ.

పంధొమ్మిదో శతాబ్దపు తొలినాళ్లలో నల్లజాతిలో, అందునా మహిళగా పుట్టటమే పెద్ద ప్రతికూలత అయితే ఇక సొజర్నర్‌ ట్రూత్‌ వాటికి తోడు బానిస వ్యవస్థలో, ఒక నిరక్షరాస్యురాలిగా కూడా ఘోరమైన వివక్షలను ఎదుర్కొంది. అయినా ఆమె ఎక్కడా తల వంచలేదు. నిప్పు కణికలా రగిలిపోతూ వివక్ష అనేది ఏ రూపంలో, ఎట్నుంచి ఎదురైనా దాన్ని బద్దలు కొట్టేందుకే పోరాడింది. అందుకే ఇప్పుడామె దాస్య శృంఖలాలను బద్దలుకొట్టిన 'విముక్తి ఉద్యమ' నేతగా, మహిళల హక్కుల గురించి ఎలుగెత్తిన తొలితరం ఉద్యమకారిణిగా చరిత్రకెక్కింది. ఆమె యుద్ధం బానిసత్వ నిర్మూలనకే పరిమితం కాలేదు. జైళ్ల సంస్కరణల నుంచి స్త్రీలకు ఆస్తి హక్కు, ఓటు హక్కుల వరకూ ఎంతో విస్తృతంగా సాగింది.

ముక్కుసూటిగా మాట్లాడే సొజర్నర్‌ ట్రూత్‌ నల్లజాతి మహిళలకే కాదు, మొత్తం మహిళా సమాజానికే ఒక బలమైన ప్రతీకగా అవతరించింది.
 
బానిసల కుటుంబంలో పుట్టి ఇసబెల్లా పేరుతో ఇళ్లలో పనిమనిషిగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆమె తన జీవిత కాలంలోనే ఒక మహాత్మురాలిగా గుర్తింపునందుకుందంటే ఈ ప్రస్థానం ఎంతటి అసాధారణమైనదో, ఆమె జీవితం ఎంత సంక్లిష్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.   

బానిసలంటే పురుషులేనన్న భావనలను బద్దలుకొట్టి... నల్లజాతిలో మహిళలూ ఉన్నారు, మహిళల్లో నల్లజాతివారున్నారు, వారు రెట్టింపు వివక్షలను ఎదుర్కొంటున్నారన్నవాస్తవాన్ని ఆమె ప్రతిభావంతంగా ప్రపంచం ముందుకు తెచ్చింది. 

నల్లజాతివారిని, మహిళలను నీచంగా, అథములుగా చూస్తున్నరోజుల్లో... ప్రతికూలతలకు ఎదురొడ్డి ఏకకాలంలో ఆమె బానిసల విముక్తి కోసం, మహిళల హక్కుల కోసం మొక్కవోని పోరాటం సాగించింది. విముక్తి పొందిన బానిసల పునరావాసం కోసం కృషి చేస్తూ 1864-1867 మధ్య ఆమె వాషింగ్టన్‌లో గడిపింది. గుర్రపు బగ్గీల్లో ఎలాంటి జాతివివక్షా తగదంటూ 1865లో చట్టం వచ్చినా నల్లవారెవరూ రోడ్డు మీదకు రావటానికి సాహసించని రోజుల్లో ఆ సాహసం ట్రూత్‌ చేసింది. తనను కిందకు తోసేయబోయిన కండక్టర్‌ను ప్రతిఘటించటమే కాదు... అరెస్టు చేయించి, శిక్ష పడే వరకూ పోరాడింది. నిరక్షరాస్యురాలై ఉండి కూడా బానిస బంధనాల్లో చిక్కుకున్న తన కుమారుడి విముక్తి కోసం అసాధారణ న్యాయపోరాటం చేసిందామె.

ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసిన ఆమె తరచుగా ''నాకు పుస్తకాలు చదవటం రాదు... కానీ మనుషులను చదివే విద్య తెలుసు'' అనేది. చదవటం, రాయటం రాకపోయినా ఆమె తన జీవిత అనుభవాలను గుదిగుచ్చి 1850లో ప్రచురించిన 'నెరేటివ్‌' ఆమె జీవిత కాలంలోనే ఐదు పునర్ముద్రణలు పొందింది. నేటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా విరివిగా అమ్ముడుపోతూనే ఉంది. 

నేడు ట్రూత్‌ అంటే... స్త్రీవాదులకూ, ఆఫ్రికన్‌ అమెరికన్లకూ కూడా ఒక శక్తిమంతమైన చిహ్నం! 1900లలో ప్రధానంగా స్త్రీ వాదిగా వెలుగులోకి వచ్చిన ఆమె 1910 కల్లా నల్లజాతి సమాన హక్కుల ఉద్యమకారిణిగా, 1940ల నాటికి అత్యంత ప్రభావవంతమైన ఆఫ్రికన్‌ అమెరికన్‌గా గుర్తింపులోకి వచ్చింది. 1990ల నాటికి విమర్శకులంతా ఆమెను అమెరికా రాజకీయ చరిత్రలో కీలకమైన వ్యక్తిగా పేర్కొనటం ఆరంభించారు. ఆధునిక రాజకీయ సంస్కరణలన్నింటి పైనా ఆమె ముద్ర చాలా బలంగా ఉంది.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రూత్‌ జీవితాన్ని కథలుకథలుగా చెప్పు కొంటున్నారన్నా...  ఆమె జీవితంపై పాటలు, సినిమాలు, నాటకాలు, పిల్లల పుస్తకాలు, పాఠ్యాంశాలు అసంఖ్యాకంగా ప్రాచుర్యంలో ఉన్నాయన్నా అందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. ఈ నిప్పు కణిక పంచిన వెలుగు దివ్వెలను తెలుగు పాఠకులూ అందుకుంటారని ఆశిస్తున్నాం.
(ముందుమాట )





               
పుస్తక రచయిత్రి మాట :

మేము 2001వ సంవత్సరంలో షికాగోలో వున్నప్పుడు, అక్కడ లైబ్రరీలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీ జీవిత చరిత్ర చదివాను. అది ఎంతో ఆసక్తిగా వుంది. చదివాక నాకనిపించింది ఈ కథని తెలుగు పాఠకులకందిస్తే బాగుంటుందని. అప్పట్నుంచి వివిధ పుస్తకాలు చదివాక, మిత్రుల ప్రోత్సాహంతో రాయగల్గాను ఈ 'స్వేచ్ఛాగానా'న్ని.

19వ శతాబ్ది ఆరంభంలో అమెరికా గడ్డపైన 'బానిసత్వం' వికృత రూపంలో ప్రబలి, నల్లజాతీయుల లక్షల కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసి, వాళ్ళ ప్రాణాల్నిపీల్చి పిప్పి చేసి, పసికందుల్ని సైతం తల్లిదండ్రుల ఒళ్ళోనుంచి లాక్కొని వేలంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్న కాలంలో, మోసం ద్వేషం తెలీని అమాయకమైన ఒక చిన్నారిపాప, కుటుంబం నుంచి దూరమై ఒంటరిగా విలపించి, స్వేచ్ఛకోసం కుటుంబంకోసం తపించి, శ్రమించి, తుదకు బానిస సంకెళ్ళని తెంచుకొని బయటపడింది. అంతటితో తృప్తిచెందక, తన తోటి బానిసల విముక్తి కోసం ఉద్యమించింది.

నిరక్షరాస్యురాలైన ఆ స్త్రీ, ఆఫ్రికన్‌ అమెరికన్‌ జాతీయుల హక్కులకోసం, సమానత్వం కోసం, భూమికోసం, స్వేచ్ఛాజీవనం కోసం స్వేచ్ఛానినాదంతో, దృఢదీక్షతో, అలుపెరుగని శక్తివంతమైన వ్యక్తిగా, స్త్రీ వాదుల్లో మొదటి తరానికి చెందిన వ్యక్తిగా, బానిసోద్యమకారిణిగా ఎదిగిన కథే ఇది.
 
 -రమాదేవి చేలూరు


నల్లజాతి నిప్పుకణిక  - సొజర్నర్‌ ట్రూత్‌

- రమాదేవి చేలూరు

 ధర : రూ. 100/-
మొదటి ముద్రణ : డిసెంబర్ 2003 ; మహిళా మార్గం ప్రచురణలు, హైదరాబాద్
హెచ్ బి టి తొలి ముద్రణ : జూన్ 2015 


పతులకు, వివరాలకు:  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006


ఫోన్‌ : 040 23521849  

ఇ మెయిల్ ఐ డి : hyderabadbooktrust@gmail.com 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌