Monday, April 18, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర, రచన: వెండీ డోనిగర్‌, తెలుగు : టంకశాల అశోక్‌

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి.
కానీ, దీనిపై భారతదేశంలో చాలా దృష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫ్రిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్లటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్‌స్వాతంత్య్రం పట్ల విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
తరువాత మరో ప్రచురణకర్త పూనుకుంటేనే గానీ మళ్లీ ఇది వెలుగులోకి రాలేదు. అయితే అంతటా ప్రచారం జరిగినట్లుగా ఈ పుస్తకం వివాదాల పుట్ట కాదు.

పుట్టుకతోనో, ఆచరణరీత్యానో హిందూ మతాన్ని అనుసరిస్తున్న మనలో చాలామందికి - ఈ పుస్తకం హిందూ మతాన్ని మరో కోణం నుంచి, ప్రత్యామ్నాయ దృక్కోణం నుంచి పరిచయం చేస్తుంది.

ఇందుకోసం జానపద, మౌఖిక, భక్తి సంప్రదాయాల నుంచి విరివిగా స్వీకరించే ఈ రచన స్త్రీలు, నిమ్నకులాలు, నిరక్షరాస్యుల వంటి వారెవ్వరినీ వదిలిపెట్టకుండా అసాధారణ రీతిలో అందర్నీ కలుపుకుపోయే సమత్వ ధోరణిని బలంగా ముందుకు తెస్తుంది.
.. ... ...

''నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, శాస్త్రాలతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాల కావ్య సంప్రదాయంతో డోనిగర్‌కు క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నట్లు ఈ రచన ద్వారా మనకు అర్థమవుతుంది. లిఖిత సంప్రదాయానికి, మౌఖిక సంప్రదాయానికి మధ్య నిరంతర సంబంధాలు, ఆదాన ప్రదానాలు ఉంటాయని వాదించిన ఆమె, హిందూ మతం తన అంతర్గత తిరుగుబాట్లు, ఇతర మతాల వత్తిడుల కారణంగా ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నదో తెలియచెప్పారు. రామాయణం అనేక రూపాంతరాలకు గురై, చివరకు దానిని మొట్టమొదట రచించిన వాల్మీకి రామాయణ రూపంతో స్థిరపడింది. మారుతున్న చారిత్రక పరిస్థితులను స్వీకరిస్తూ దానిని పలువురు మళ్లీమళ్లీ రాసారు. మహాభారతం విషయంలోనూ అదే జరిగింది.

    హిందూ దేవతలను డోనిగర్‌ 'కల్పనల' స్థాయికి తగ్గించినట్లు అతివాదులు ఆరోపిస్తున్నారు. కాని విభిన్నమైన నిర్వచనాలే హిందూ సంప్రదాయపు బలమైనట్లు ఈ గ్రంథం నిరూపిస్తుంది.''
............................................................................................- ప్రియంవద గోపాల్‌, ద గార్డియన్‌
.....

వెండీ డోనిగర్‌ -
సంస్కృత భాషలో, భారతదేశ అధ్యయనంలో హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయాలనుంచి రెండు డాక్టరేట్లు చేసారు. అనేక సంస్కృత కావ్యాలను, హిందూ మతంపై పలు రచనలను ఇంగ్లీషులోకి అనువదించారు. లండన్‌ విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌లో, బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో బోధించారు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీలో మిర్సియా ఎలియేడ్‌ డిస్టింగ్విష్డ్‌ సర్వీస్‌ ప్రొఫెసర్‌గా మతాల చరిత్రను బోధిస్తున్నారు.
...

టంకశాల అశోక్‌ -
 హైదరాబాద్‌, ఢిల్లీలో చరిత్ర, రాజకీయ శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాల్లో విద్యాభ్యాసం జనధర్మ, నవ్యాంధ్ర, ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం, ఆంధ్రప్రభ, వార్త, హన్స్‌ ఇండియా పత్రికలలో ఉద్యోగం ప్రస్తుతం ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌.
...

తెలుగు ప్రచురణకు రచయిత్రి ప్రత్యేక ఉపోద్ఘాతం

'ద హిందూస్‌ : ఏన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరీ' రచన తెలుగులో వెలువడుతుండటం నాకు సంతోషాన్ని, సంభ్రమాశ్చర్యాలను కూడా కలిగిస్తున్నది. అందుకు పలు కారణాలున్నాయి. నా రచనలు ఏదైనాసరే ఒక భారతీయ భాషలో వెలువడడం ఇది మొదటిసారి. నా రచనలలో ఈ విధంగా ఎక్కువమందికి అందుబాటులోకి రావాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే అది ఈ పుస్తకమే.

 పెంగ్విన్‌ సంస్థ 2010 లో ప్రచురించిన ఈ గ్రంథం ఎడిషన్‌ కోర్టు వివాదంలో చిక్కుకోవటం వల్ల నాకిట్లా అనిపిస్తున్నది. ఈ రచనను స్పీకింగ్‌ టైగర్‌ సంస్థ సాహసించి తిరిగి ఇంగ్లీష్‌ ఎడిషన్‌ వేయటం, ద హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అదే సాహసంతో  దీనిని శ్రమపడి తెలుగులోకి అనువదించి మరింతమంది భారతీయ పాఠకులకు అందుబాటులోకి తేవటాన్ని బట్టి, భారతదేశంలో వాక్స్వాతంత్య్రం పట్ల నాకు గొప్ప ఆశాభావం కలుగుతున్నది.

తెలుగు ఎడిషన్‌ పట్ల నాకు మరొకందుకు కూడా సంతోషం కలుగుతున్నది.
దక్షిణ భారతదేశం గురించి నేను రాయటం ఇది మొదటిసారి. (కొన్ని సంకలనాలలో రాసిన వ్యాసాలలో దక్షిణ భారతదేశ ప్రస్తావనలున్నాయి. వాటిలో ఆ ప్రాంత భాషా రచనల అనువాదాలను స్వీకరించాను. ఉదాహరణకు ఇటీవల వెలువడిన 'నార్టన్‌ ఆంథాలజీ ఆఫ్‌ వరల్డ్‌ రెలిజియన్స్‌' లో హిందూమతం గురించిన సంపుటికోసం రాసిన వ్యాసంలో తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు మూలాల నుంచి కొన్ని భాగాలు తీసుకున్నాను. వాటి గురించి అంటున్న మాట కాదిది.)

హిందూ మతం గురించి వెలువడిన ప్రధాన గ్రంథాలు అనేకం వదిలివేసిన కొన్ని వర్గాలవారరి స్వరాలను, ముఖ్యంగా స్త్రీలు, దళితులు, జంతుజాలాల స్వరాలను వినిపించేందుకు నా ఈ ప్రస్తుత రచనలో ప్రయత్నించాను. అదే విధంగా, నేను దక్షిణ దేశంపై సరైన విధంగా దృష్టి సారించటం ఎట్టకేలకు ఈ విధంగా మొదలవుతున్నది. అందువల్ల, ఈ రచనను తెలుగు పాఠకులు కూడా చదవనుండటం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది.
. ...............................................................................................................వెండీ డోనిగర్‌
...............................................................................................షికాగో, డిసెంబర్‌ 25, 2015

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర
రచన: వెండీ డోనిగర్‌
తెలుగు :  టంకశాల అశోక్‌

342 పేజీలు , వెల    : రూ. 275/-


ఆంగ్లమూలం    : The Hindus : An Alternative History, Penguin 2009 © Wendy Doniger 

ప్రథమ ముద్రణ    :    మార్చి 2016,

ప్రతులకు, వివరాలకు    :  
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, 
 హైదరాబాద్‌ - 500 006.
ఫోన్‌ : 040 2352 1849
E Mail ID:      hyderabadbooktrust@gmail.com

.
 

Saturday, April 9, 2016

హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర పుస్తకావిష్కరణ నేడు ( 9 ఏప్రిల్ 2016 ) సాయంత్రం 4-30 హైదరాబాద్ లామకాన్ లో

అమెరికన్ ఇండాలజిస్ట్ వెండీ డోనిగర్ రాసిన,
టంకశాల అశోక్ తెలుగులోకి అనువదించిన
హిందువులు - ఒక ప్రత్యామ్నాయ చరిత్ర  పుస్తకావిష్కరణ నేడు ( 9 ఏప్రిల్ 2016 ) సాయంత్రం 4-30 హైదరాబాద్ లామకాన్ లో


ఆంధ్ర జ్యోతి 9 ఏప్రిల్ 2016  సౌజన్యంతో  



Friday, April 1, 2016

హిందువులు : ఒక ప్రత్యామ్నాయ చరిత్ర - రచన : వెండీ డోనిగర్ - తెలుగు అనువాదం : టంకశాల అశోక్ - పుస్తకావిష్కరణ - రచయిత్రి తో ఆన్ లైన్ లో ఇష్టాగోష్టి

హిందువులు : ఒక ప్రత్యామ్నాయ చరిత్ర -
రచన : వెండీ డోనిగర్ -
తెలుగు అనువాదం : టంకశాల అశోక్ -
పుస్తకావిష్కరణ - రచయిత్రి తో ఆన్ లైన్ లో ఇష్టాగోష్టి  -

09ఏప్రిల్ 2016 సాయంత్రం 4-30 కి లామకాన్ లో

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌