Tuesday, October 28, 2014

రేవతి రాసిన ''ఒక హిజ్రా ఆత్మకథ'' పుస్తకంపై చర్చ

రేవతి రాసిన ''ఒక హిజ్రా ఆత్మకథ'' పుస్తకంపై చర్చ

పాల్గొంటున్న వారు :
రేవతి, కె.శ్రీనివాస్‌, దేశపతి శ్రీనివాస్‌, ప్రొ. శాంతసిన్హా, బొజ్జా తారకం,
వేదిక:
సారస్వత పరిషత్‌ (ఎస్‌పి) హాల్‌, రామ్‌కోఠీ, బొగ్గుల కుంట, హైదరాబాద్‌
సమయం:
01 నవంబర్‌ 2014 శనివారం సాయంత్రం 5.30 ని. లకు.
అందరూ ఆహ్వానితులే
....................................

ఇదే అంశంపై
నవంబర్‌ 1 నాడు ఉదయం 11 గంటలకు
లామకాన్‌, బంజారా హిల్స్‌లో ఇంకొక సమావేశం;
అలాగే-
నవంబర్‌ 2 ఆదివారం ఉదయం 11 గంటలకు
ఉస్మానియా యూనివర్సిటీ ఐసిసిఎస్‌ఆర్‌ మెయిన్‌ హాల్‌లో
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరొక సమావేశం వుంటాయి.
.....................................................................

Monday, October 27, 2014

ఒక హిజ్రా ఆత్మకథ - The Truth About Me: A Hijra Life Story


ఒక హిజ్రా ఆత్మకథ

నేటి ప్రపంచంలో దాదాపు 1,53,24,000 మంది ట్రాన్స్‌ జెండర్స్‌ (హిజ్రాలు) వున్నారని అంచనా. అంటే
కజకిస్థాన్‌, ఈక్వెడార్‌, కాంబోడియా ఈ మూడు దేశాల మొత్తం జనాభాతో సమానం. ఈ సంఖ్యను చూస్తే
మనలో ఒక కొత్త ఆలోచనకు నాంది కలుగుతుంది.

తమిళ నాడులో ఒక మారుమూల కుగ్రామంలో, సాధారణ కుటుంబంలో ముగ్గురన్నలకు, ఒక ఆక్కకు
తోడుగా ఐదో సంతానంగా పుట్టాడు దొరైస్వామి. ఇంట్లో ఎవరికీ లేనివిధంగా అతనిలో అంతర్గతంగా
చిన్నప్పటినుంచే స్త్రీ లక్షణాలుండేవి. ఆడవాళ్లలా అలంకరించుకోవాలనీ, వాళ్ల దుస్తులు ధరించాలని
విపరీతమైన వ్యామోహం కలిగేది. స్కూల్లో తోటి విద్యార్థులు తనని 'ఆడంగి', 'ఆడపిల్లోడు' అని ఎగతాళి
చేస్తుంటే బాధగా అనిపించేది. అయితే తను అమ్మాయిలా ప్రవర్తిస్తున్న విషయం అతనికి తెలుసు. అట్లా
ప్రవర్తించడం తనకు చాలా సహజంగా అనిపించేది. ఒక మగశరీరంలో ఇరుక్కుపోయిన స్త్రీని అన్న భావన
వుండేది. దేవుడు తనకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు, తనను పూర్తిగా స్త్రీగానో లేక పూర్తిగా
పురుషుడిగానో ఎందుకు సృష్టించలేదు అన్న మనో వేదన కలిగేది.

కాలక్రమంలో దొరైస్వామి రేవతిగా మారిపోయాడు. ఆ పరిణామ క్రమాన్నీ, నిత్య జీవితంలో అతను/ఆమె
ఎదుర్కొన్న వివక్షనూ, అవమానాలనూ, అవహేళనలను కళ్లకు కట్టేలా చిత్రించిన పుస్తకమిది.

దీనికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ల ఆలోచనలను ప్రేరేపించే శక్తి వున్నది. పుస్తకమంతటా రేవతి
తాను ఎదుర్కొన్న భయానక సంఘటనల గురించి చెబుతుంది. కానీ ఎవరి సానుభూతినీ కోరదు. ఆమె
అడిగేది ఒక్కటే, హిజ్రాలను అందరిలా కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని!

ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను... తన లింగ మార్పిడి శస్త్ర చికిత్స గురించీ, పోలీసులు పెట్టిన
హింసల గురించీ, తన క్లయింట్స్‌ గురించీ నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమే
కాక అది హృదయానికి హత్తుకుంటుంది. జెండర్‌ గురించీ పురుషాధిక్యత గురించీ ఆమె చేసిన
విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా. శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని
(థర్డ్‌ జెండర్‌) కూడా మనం మానవీయంగా అర్థం చేసుకోలాలనే, అందుకు కృషి చెయ్యాలనే
అవగాహనను కలిగిస్తుంది.

రేవతి ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో ఇలా అంటారు:

''ఒక హిజ్రాగా నేను సమాజపు చివరి అంచులలోకి నెట్టబడ్డాను. అయినా నా జీవితాన్ని మీముందు పెట్టే
సాహసం చేస్తున్నాను. ఒక హిజ్రాగా వుండటమే కాదు, సెక్స్‌ వర్క్‌ చేయడం గురించి కూడా
చెబుతున్నాను. ఎవరి మనోభావలనూ నొప్పించడానికి గానీ, ఎవరినీ నిందించడానికి గానీ నేనీ పుస్తకం
రాయడంలేదు. హిజ్రాల జీవన విధానం గురించీ వారి ప్రత్యేక సంస్కృతి గురించీ వారి కలలూ కోరికల
గురించీ పాఠకులకు తెలియజెప్పడానికే రాస్తున్నాను.

నేను రాసిన 'ఉనర్వుమ్‌ ఉరువమమ్‌' తమిళనాడులో తెచ్చిన ఫలితాలను చూసి గర్వపడుతున్నాను.
ఇప్పుడు నాజీవిత చరిత్ర సమాజంలో మరిన్ని మంచి మార్పులు తేగలదని ఆశిస్తున్నాను. అడుక్కోడానికీ,
సెక్స్‌ వర్క్‌ చెయ్యడానికే కాదు అనేక మంచి పనులు చేసే సామర్థ్యం హిజ్రాలకు వుందన్న విషయాన్ని  ఈ
పుస్తకం చదివి తెలుసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. నేను ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి
సానుభూతి ఆశించడం లేదు. హిజ్రాలమైన మాకు సమాజంలో అందరిలా జీవించే హక్కు వుందని
చెప్పాలనుకుంటున్నాను.''

( అక్టోబర్ 1 సాయంత్రం హైదరాబాద్ ఎస్ పీ హాల్ లో జరిగే పుస్తకావిష్కరణ సభలో పుస్తక రచయిత్రి రేవతి స్వయంగా పాల్గొంటున్నారు.)



నిజం చెప్తున్నా-

ఒక హిజ్రా ఆత్మకథ


- ఎ. రేవతి
ఆంగ్ల మూలం :The Truth About Me: A Hijra Life Story by A. Revathi, Penguin Books India, 2010

తెలుగు : పి. సత్యవతి
పేజీలు: 154, ధర : రూ.130/-



ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌ :  hyderabadbooktrust@gmail.com








Sunday, October 26, 2014

హైందవ పునాదులపై ఇండియా - ఆంధ్రజ్యోతిలో ''ఇండియాలో దాగిన హిందుస్థాన్‌'' పుస్తకంపై డాక్టర్‌ భంగ్యా భుక్యా సమీక్ష ...

హైందవ పునాదులపై ఇండియా

పెరి ఆండర్‌సన్‌ రచించిన ది ఇండియన్‌ ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్‌ మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం,

ఇండియాను బ్రిటిష్‌ పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్‌సన్‌ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ, అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారతదేశంలోని వాస్తవాలను ఎత్తిచూపుతున్నాయి. ఎందుకు అతనితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరీ చేసింది హిందూ మేధావి వర్గం. రాజా రామ మోహన్‌ రాయ్‌ దగ్గర నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టి ంచుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకుని వేద కాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.

ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా   హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదేవిధంగా సనాతన వాదులు, ప్రగతిశీల వాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మ రక్షణకే పాటుపడ్డాడు. పడతాడు కూడా. అందుకే ఆ రోజు వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌.పస్‌.ఎస్‌.ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు.

ఇప్పుడు ఆరువందల అడుగుల ఎత్తు పటేల్‌ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెస్‌కీ బీజేపీకీ హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడాలేదు.

కాంగ్రెస్‌ లౌకికవాదానికి దేశం మోసపోయిందని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్‌ దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని ఈ పుస్తకం రూఢి చేస్తుంది. 

సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్యయనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఈ ఉద్యమం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది.


గాంధీకి స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్లే సాధనం తప్ప మరొకటి కాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించడం  గాంధీ ప్రత్యేకత. ఈ క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ  కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తుంది. కానీ, అసలు కారణం హింస కాదు. ఈ ఉద్యమం కొద్ది రోజుల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్‌ పాలన       కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్‌ కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం.

దండి సత్యాగ్రహం ఒక డిఫెన్సివ్‌ ఆట. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ,   హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.

గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించారని ఈ పుస్తకం రూఢి చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా  హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలూ సమానమని నమ్మినా రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది 'ధర్మ విరుద్ధం' అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి ఆ పెళ్లి కాకుండా చూశారు.

గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి వుందని ముస్లింలు చాలా కొద్ది కాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా వున్న మహమ్మ దలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమ నించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ, చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.

కాంగ్రెస్‌ పార్టీయే పాకిస్థాన్‌ స్థాపనకు నాంది పలికింది. భారత దేశంలో ఒకటికాదు, రెండు దేశాలున్నాయని జిన్నా 1940లో ప్రకటించారు. ఆ రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలు కల్పించాలనీ, ముస్లింలు అధిక సంఖ్యలో వున్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్నీ ఇవ్వాలనీ అన్నారు. అంటే జిన్నా ప్రత్యేకదేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. ఈ విషయాన్ని గందరకోళం చేసి కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌ ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దేశ విభజన బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. క్యాబినెట్‌ మిషన్‌ ముస్లింలు అత్యధిక సంఖ్యలో వున్న ప్రాంతాలన్నీ స్వయం పాలనాధికారంతో వుండేవిధంగా ప్లాన్‌ను రూపొందించింది. కానీ, అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూె భావించారు.

విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్షలు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్‌ బెంగాల్‌ని కూడా జిన్నా కోరుకోలేదు. కానీ, ఆ ప్రాంతం ఇడియాతో వుంటే కోల్‌కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని దానిని పాకిస్థాన్‌కు అంటకట్టారు.స్వతంత్ర భారత్‌లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశ విభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.

గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్‌ పుట్టుకలోనే వున్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ, అంబేద్కర్‌ కుల సమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై ఆయన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు. కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయన దృష్టిలో చాలా తీవ్రమైన సమస్య. వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్‌ మెయిలింగ్‌కు పూనా ఒప్పందం సమయంలో లొంగిపోయినందుకు అంబేడ్కర్‌ తను చనిపోయేవరకూ బాధపడ్డారు.

వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకులతత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి.

రాజ్యాంగంలో లౌకికవాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మాత్రం మతం అడ్డువస్తుంది. అంటే హిందూమత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి వుంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్‌ రక్షణ, పరిశోధన సంస్థల్లో లేరు? కానీ, నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కశ్మీర్‌లోని ముస్లింల మీదా, ఈశాన్య రాష్ట్రాల్లోని క్రిస్టియన్‌ ఆదివాసుల మీదా నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు ఈ దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? ఈ దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు ఈ హింస గురించి మాట్లాడదని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది.



 ......................................................................................................- డాక్టర్‌ భంగ్యా భుక్యా
......... ................................................................................................యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌



(ఆంధ్రజ్యోతి 26 అక్టోబర్ 2014 ఆదివారం సౌజన్యంతో)
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/TELANGANA/2014/10/26/ArticleHtmls/26102014006006.shtml?Mode=1


ఇండియాలో దాగిన హిందుస్థాన్

ఆంగ్ల మూలం :  The Indian Ideology, Perry Anderson, Three Essays Collective, Gurgaon (Haryana), October 2012, ©  Perry Anderson    
       
తెలుగు అనువాదం  :  ప్రభాకర్ మందార
175 పేజీలు ; ధర : రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com





Saturday, October 25, 2014

పిల్లల సంరక్షణ - మనకు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు...


పిల్లల సంరక్షణ - మనకు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు...

ప్రజల్లో ఆరోగ్యపరమైన అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఇప్పటి వరకూ ఎన్నో పుస్తకాలు ప్రచురించింది. ముఖ్యంగా ''వైద్యుడు లేనిచోట'', ''మనకు డాక్టర్‌ లేనిచోట- ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం'', ''సవాలక్ష సందేహాలు'', ''జబ్బుల గురించి మాట్లాడుకుందాం'' వంటి పుస్తకాలు మన సమాజంలోని వివిధ వర్గాల వారికి ఎంతో చేరువయ్యాయి.

వాటిలాగే పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తెలుగులో ఒక మంచి హ్యాండ్‌ బుక్‌ లేని లోటును కొంతరకైనా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.

పిల్లలు మన జాతి రత్నాలు. వాళ్లు చక్కగా పెరిగి మంచి పౌరులుగా తయారయ్యేందుకు ఆరోగ్యం, భద్రత, సంరక్షణ, పోషకాహారం, విద్య, సంతోషకరమైన వాతావరణం అనేవి తప్పనిసరిగా కావాలి. పిల్లలకు సంబంధించిన ఈ కనీసావసరాల పట్ల ప్రజల్లో సరైన స్పృహ పెంచడానికి ఈ పుస్తకం చాలా తోడ్పడుతుందని మేం భావిస్తున్నాం.

హాస్టళ్లు, శిశు సంరక్షణా కేంద్రాలు, బ్రిడ్జి స్కూళ్లు నడుపుతున్నవారికీ, ఆరోగ్య కార్యకర్తలకూ, వైద్య సదుపాయాలకు దూరంగా వున్న గ్రామీణ తల్లిదండ్రులకూ ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమాటకొస్తే, వైద్యం ఖరీదైన వ్యవహారంగా, వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో చుట్టూ ఎన్ని సదుపాయాలు అందుబాటులో వున్నా పట్టణాల్లోని తల్లిదండ్రులకు కూడా ఈ పుస్తకం ఎంతైనా అక్కరకొస్తుంది.

పిల్లల పెంపకంలో వైద్యపరమైన అవగాహన, ఆరోగ్యపరమైన స్పృహ కీలకమైన అంశాలు. పిల్లల్లో కనిపించే చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి ఈ పుస్తకం సులభమైన భాషలో, తేలికగా అర్థమయ్యే రీతిలో చర్చిస్తుంది. ముఖ్యంగా పిల్లలను జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవడం ఎలా? ఒకవేళ ఏవైనా సమస్యలు వస్తే వారిని సంరక్షించుకోవడం పలా? అన్న రెండు అంశాల గురించీ ఇందులో సవివరమైన సమాచారం పొందుపరచడం జరిగింది.

పోషకాహారం, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలతో పాటు తరచుగా ఎదురయ్యే నీళ్ల విరేచనాలు, వడదెబ్బ, జ్వరాలు మొదలైనవి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? దెబ్బలు, కాలిన గాయాలు, బెణుకుళ్లు, ఎముకలు విరగడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్సలు చేయాలి? కలరా, కామెర్లు వంటి తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అనేక విషయాలను సవివరంగా చర్చిస్తుందీ పుస్తకం.

పిల్లల సంరక్షణకు శాస్త్రీయమైన సలహాలనిచ్చే ప్రాణ స్నేహితుడిలాంటిది ఇది. పిల్లలున్న ప్రతి ఇంట్లో, ప్రతి ఆవరణలో తప్పనిసరిగా వుండాల్సిన పుస్తకం ఇది.



పిల్లల సంరక్షణ
మనకు డాక్టరు అందుబాటులో లేనప్పుడు


- కాసడీ టామస్‌, లారెన్‌ హ్యూయి

ఆంగ్లమూలం: THE HEALTHY CHILD HANDBOOK, Cassady Thomas and Lauren Hughey, 2011, World's Children


తెలుగు అనువాదం: భవాని దేవినేని

202 పేజీలు, ధర : రూ.150/-

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

Saturday, October 18, 2014

ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం - సాక్షి సమీక్ష




తాజా పుస్తకం:
ఇండియాలో దాగిన హిందుస్తాన్ ఆసక్తి రేపే పుస్తకం - సాక్షి సమీక్ష

గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని పుస్తక రచయిత పెరి అండర్సన్ అంటారు. పెరి అండర్సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలోఇండియన్ ఐడియాలజీపేరుతో ఇంగ్లిష్లో రాసిన పుస్తకమే ఇప్పుడుఇండియాలో దాగిన హిందుస్తాన్పేరుతో అనువాదమై వెలువడింది. పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి.

 ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు.

 లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది.

 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన  అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు.

 అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు.

 నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశంపుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు)

 మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది.
 
 -
జి.ఆర్.మహర్షి
 ఇండియాలో దాగిన హిందుస్తాన్-
పెరి అండర్సన్;
హెచ్.బి.టి ప్రచురణ;
వెల: రూ.150;
ప్రతులకు: 040- 23521849

( సాక్షి 17-10-2014 ఫామిలీ   పేజ్ సౌజన్యంతో )


Thursday, October 16, 2014

Discover Telangana... Discover "Life in Anantaram"

"ఊరు వాడ బతుకు" ఇంగ్లీష్ అనువాదం "Life in Anantaram" ఉచిత పిడిఎఫ్ పుస్తకం ను
ఇప్పుడు " డిస్కవర్ తెలంగాణా " వెబ్ సైట్ నుంచి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు

http://discover-telangana.org/wp/2014/10/14/life-in-anantharam/


Devulapalli Krishnamurthi’s autobiography, Life in Anantharam, is an important work which offers an unvarnished account of life in a Telangana village, specifically Anantharam near Suryapet and between Penpadu and Dosapadu villages. The period he covers is the nineteen forties – an important period for Telangana when the Telangana peasant movement changed the face of this land. The author captures the nuances of rural life from inside, recreating the everyday idiom of this region through proverbs and songs, so many of them strung through the text, like in a traditional katha with the storyteller moving smoothly between prose and verse. There is a strong oral quality to the book, as if he were speaking aloud.

The book ranges freely and widely over objects, people (groups and individuals), festivals and entertainment, poverty and politics, education, songs, stray encounters and it is one person’s sensibility (though an unobtrusive one) and his extraordinarily vivid memory that holds it all together. Although it can feel a little random, perhaps that is in the nature of a work of this kind and is what makes it so distinctive.

Devulapalli Krishnamurthy (born 1940) lived a most unobtrusive life as a civil servant of the Government of Andhra Pradesh in the small towns and villages of Telangana. After he retired in 1998, he set about writing about the many people and incidents that he had seen in his career. His first book, Ooru vaada batuku was published in 2009 and was received with rave reviews in Andhra Pradesh. Subsequently, he went on to write Ma Yaatra, Kathalagoodu, Baita Gudise, Taaru Maaru – all four books vignettes of the human condition – and published in the short span of five years. He lives in the small town of Nakrekal in Telangana.

The translator Gita Ramaswamy works with the Hyderabad Book Trust. She has earlier worked extensively with agricultural labourers on the issue of land entitlements.


 


Saturday, October 11, 2014

"ఇండియాలో దాగిన హిందుస్థాన్" పుస్తకం కినిగె డాట్ కాం లో 'ఈబుక్' గా కూడా లభిస్తోంది

"ఇండియాలో దాగిన హిందుస్థాన్" పుస్తకం కినిగె డాట్ కాం లో 'ఈబుక్' గా కూడా లభిస్తోంది 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇతర పుస్తకాలు 

కినిగె డాట్ కాం వారి వద్ద "ఈ బుక్స్" రూపంలో లభిస్తున్నట్టే
గత నెలలో ప్రచురించిన పెరీ ఆండర్ సన్ పుస్తకం "ఇండియాలో దాగిన హిందుస్థాన్" (ది ఇండియన్ ఐడియాలజీ ) కూడా 'ఈ బుక్' గా లబిస్తోంది.


10 శాతం రాయితీతో రూ.135 లకే ఈ బుక్ ని పొందవచ్చు.
లేదా 30 రోజులకోసం 30 రూపాయల
కే అద్దెకు తీసుకోవచ్చు. 

వివరాలకు కినిగె డాట్ కాం ని సందర్శించండి:

http://kinige.com/kbook.php?id=3818


Thursday, October 9, 2014

'సంగీతం రీతులు-లోతులు' ...కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ...


'సంగీతం రీతులు-లోతులు' ...కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ...



సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ...

సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగినకొద్దీ బాగా అర్థమవుతుంది. ... రోహిణీ ప్రసాద్‌ లాంటి వారు ప్రక్కన నిలబడి 'ఇదిగో, ఈ వివరం చూడు' అని చెప్పారనుకోండి. రుచి మరింత సులభంగా తెలుస్తుంది.

శాస్త్రీయ సంగీతం గురించి, సులభ పద్ధతిలో చెప్పేవారు లేకనే, అది చిటారుకొమ్మన మిఠాయి పొట్లంలా మిగిలింది. రోహిణీ ప్రసాద్‌ రాసిన ఈ వ్యాసాలు మిఠాయిని కిందకు దించి అందరికీ పంచుతాయి.

రోహిణీ ప్రసాద్‌ శాస్త్రజ్ఞుడు, సాంకేతిక నిపుణుడు. ఇక సంగీత సాహిత్యాలతో లోతయిన అనుభవం గల మనిషి, ఆయన స్వయంగా సితార్‌ విధ్వాంసుడు, రచయిత కూడానూ. శాస్త్రీయ దృక్పథంతో సంగీత విషయాలను విశ్లేషించి, సులభమయిన మాటల్లో చెప్పడం ఆయనకు బాగా కుదిరింది. తండ్రిగారు కుటుంబరావు గారి కారణంగా, స్వంత ఆసక్తి వలననూ మొదటి నుంచి, సంగీతంతో, విధ్వాంసులతో గడుపుతూ, వారి మాటలు వింటూ, చర్చల్లో పాల్గొంటూ గడిపే అవకాశం ప్రసాద్‌కు అందింది. అది ఆయన అవగాహనను పెంచింది. స్వతహాగా శాస్త్రీయ దృక్పథం ఉండటంతో తన స్వంత విశ్లేషణ తోడయింది. సంగీతకారులకు, పాడడం, వాయించడం తెలిసినంత సంగీతం గురించి చెప్పడం చేతకాదు. రచయిత గనక రోహిణీ ప్రసాద్‌ వివరణలు సులభంగా సాగాయి. అందరికీ అర్థమయ్యే రీతిలో నడిచి, ఆహా అనిపింపజేశాయి.

సినిమా పాటల గురించి రోహిణీ ప్రసాద్‌ అందించిన విశ్లేషణలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సాహిత్యం స్వరాలు, లయ మొదలిన వాటి వివరాలు, వాటి మధ్యనుండే సంబంధాలు మనల్ని పాటలకు కొత్త అర్థాలు వెదుక్కునే వరకు లాగుతాయి. సినిమా పాటంటే     ముందిలే అనుకున్న వారికి, పాటలోని కనబడని లోతులను చూసేందుకు చక్కని మార్గం చూపించారు రచయిత.

- కె.బి.గోపాలం ముందుమాట 'రోహిణీ ప్రసాదం' నుంచి.

ఈ పుస్తకంలో విశ్లేషించిన కొన్ని అంశాల:
... సంగీతరస పానశాల ఘంటసాల
... పుష్పవిలాపం - రాగాలతో సల్లాపం
... అసామాన్య సంగీత దర్శకుడు సి.ఆర్‌.సుబ్బరామన్‌
... మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి
... బాలమురళీకృష్ణ సంగీతం
... అత్యుత్తమ హిందూస్థానీ గాయకుడు బడే గులాం అలీఖాన్‌
... నౌషాద్‌
... ఓ.పీ.నయ్యర్‌
... పాటల్లో లయ విన్యాసాలు
... జుగల్‌ బందీ కచేరీలు
... సినిమా పాటల్లో తాళం నడకలు, విరుపులు
...  కీబోర్డ్‌ మీద రాగాలు

ఇంకా మరెన్నో



సంగీతం రీతులు-లోతులు

- కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

212 పేజీలు, ధర: రూ.150/-




పతులకు, వివరాలకు:
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
        ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
        గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
        ఫోన్‌ : 040 23521849 
Email ID: hyderabadbooktrust@gmail.com

Wednesday, October 8, 2014

ఇండియాలో దాగిన హిందూస్థాన్‌ - The Indian Ideology - పెరీ ఆండర్‌సన్‌

ఇండియాలో దాగిన  హిందూస్థాన్‌
The Indian Ideology - పెరీ ఆండర్‌సన్‌


పెరీ ఆండర్‌సన్‌ వ్యాసపరంపర 2012లో 'లండన్‌ రివ్యూ ఆఫ్‌ బుక్స్‌'లో వెలువడుతున్నప్పుడే అవి భారత వామపక్ష
మేధావులకు అసహనాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించాయి. అదేసంవత్సరం 'ది ఇండియన్‌ ఐడియాలజీ' పేరిట అవి పుస్తక
రూపంలో ప్రచురించబడినప్పుడు వాళ్లు దానిపై స్పందించడానికి నిరాకరించారు. చాలా తక్కువ సమీక్షలు వెలువడ్డాయి.

ఆండర్‌సన్‌ తర్కంపై భారతీయ విద్యావేత్తలకు ఎంత తీవ్రమైన అసంతృప్తి వుందో ఇది స్పష్టం చేస్తోంది. భారత
మేధావులను అంతగా ఇబ్బందికి గురిచేసిన అంశాలు ఈ పుస్తకంలో ఏమున్నాయి? స్వయంగా ఆండర్‌సనే చెప్పినట్టు ''సమకాలీన భారత దేశ సాంప్రదాయిక ఆలోచనలను ఎదిరించే ఐదు రకాల ప్రధాన వాదనలను ఈ పుస్తకం ముందుకు తెచ్చింది.''

మొదటిది, ఆరువేల సంవత్సరాలనుంచీ భారతఉపఖండం ఒకే దేశంగా సమైక్యంగా వుందనడం ఒక
అభూత కల్పన అంటుంది.
రెండోది, గాంధీ భారత జాతీయోద్యమంలో మతాన్ని ప్రవేశపెట్టడంతో చివరికి అది ఒక విపత్తుగా మారిందని చెబుతుంది.
మూడోది, దేశ విభజనకు మూలకారణం బ్రిటిష్‌ ప్రభుత్వం కాదు, కాంగ్రెసే అసలు దోషి అని నిరూపిస్తుంది. నాలుగోది, భారత గణతంత్రాన్ని నెహ్రూ అభిమానులు అంగీకరించిన దానికంటే  ఎక్కువగా ఆయన వారసత్వం నష్టపరిచిందని వివరిస్తుంది.
చివరగా, భారత ప్రజాస్వామ్యం కుల అసమానతతో విభేదించదనీ, పైగా దానితో పెనవేసుకుపోయిందనీ వాదిస్తుంది.

ఈ పుస్తకంలో భారతీయ మేధావులకు కోపకారణమైన అంశాలు మరెన్నో వున్నాయి. కశ్మీర్‌ను భారత
సైన్యం ఆక్రమించుకుని చట్ట వ్యతిరేక హత్యలకూ, చిత్ర హింసలకూ, నిర్బంధాలకూ పాల్పడుతుంటే భారత మేధావులు ఏమాత్రం స్పందించకుండా మౌనవ్రతం పాటించడాన్ని ఆండర్‌సన్‌ ఇందులో నిలదీశారు.

భారత మేధావులు ఆరాధించే జాతీయ నేతలను కాదని సుభాస్‌ చంద్రబోస్‌నూ, బి.ఆర్‌.అంబేడ్కర్‌నూ ఆకాశానికి ఎత్తారు. ''ఉమ్మడి లౌకిక పోరాటంలో హిందువులనూ, ముస్లింలనూ, శిక్కులనూ ఏకతాటిపైకి తెచ్చిన ఏకైక కాంగ్రెస్‌ పార్టీ నేత సుభాస్‌ చంద్రబోస్‌ ఒక్కరే. ఆయన ధైర్యసాహసాలు, మేధోసంపత్తి ఆయనను కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత లోకప్రియ నాయకుడిగా చేశాయి.''
 ''నిర్భీతి, క్రియాశీలత, అందర్నీ నియంత్రించే నేర్పు, అపార మేధో సంపత్తి వున్న సుభాస్‌ చంద్రబోస్‌
కాంగ్రెస్‌ పార్టీలో గొప్ప ప్రజాభిమానం వున్న నేతగా కొద్దికాలంలోనే ఎదిగి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఆ మరుసటి సంవత్సరం పార్టీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ప్రప్రథమంగా జరిగిన పోటీ ఎన్నికలలో గాంధీ ప్రతిపాదించిన వ్యక్తిని ఓడించి సుభాస్‌ చంద్రబోస్‌ విజయం సాధించారు. అది గాంధీకి ఊహించని ఎదురుదెబ్బ. ప్రజాస్వామ్య బద్ధంగానైనా సరే తన అభిమతానికి వ్యతిరేకంగా జరిగే దేనినీ ఆయన తట్టుకోలేరు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పార్టీలో అంతర్గత కుట్ర ద్వారా సుభాస్‌ చంద్రబోస్‌ని అధ్యక్షపదవినుంచి తొలగించి కాంగ్రెస్‌ పార్టీని వదిలి వెళ్లిపోయేలా చేశారు గాంధీ.''

ఆండర్‌సన్‌ ''ఇండియాలో దాగి వున్నది హిందుస్థానే'' అని నిర్ద్వంద్వంగా అంటారు.
''ఎక్కడైతే హిందూమతానికి పరిమితులుంటాయో అక్కడ 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం' (ఎఎఫ్‌ఎస్‌పిఎ) రంగప్రవేశం చేస్తుంది.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడు ప్రముఖ తిరుగుబాట్లు - కశ్మీర్‌, నాగాలాండ్‌ మిజోరామ్‌, పంజాబ్‌లలో - అంటే ముస్లిం, క్రైస్తవ, శిక్కు జనాభా ఎక్కువ వున్న ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నాయి. ఆ హిందూయేతర
ప్రాంతాలలోని ప్రజల భావోద్వేగాలను టాంకులు, తుపాకులు, లాఠీలు, మారణకాండ, హంతక ముఠాలు ఎదుర్కొన్నాయి.

ఇవాళ (2013) ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఉద్ఘాటించినట్టు సరిగ్గా అదేపద్ధతులలో 'భారత ప్రజాస్వామ్యానికి
భయంకరమైన ముప్పు' ముంచుకొస్తోంది. అది జార్ఖండ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకూ విస్తరించిన నక్సలైట్‌ కారిడార్‌.
ఆర్యులకంటే ముందునుంచీ వుంటున్న ఆదివాసీ ప్రజానీకాన్నీ, వారి అటవీ సంస్కృతినీ వారి మాతృభూమి నుంచి
నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనన్య వాజ్‌పాయి సూత్రాన్ని తిరగరాయడం సబబుగా
వుంటుంది. ప్రచ్ఛన్న దేశం లేదా సమాజం (షాడో నేషన్‌) అంటే ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించిన ప్రాంతం అని కాదు
ప్రజాసామ్యాన్ని ఆచరిస్తున్న ప్రాంతమనే చెప్పుకోవాలి.
ఇండియాలో హిందుస్థాన్‌ అనే అర్థం దాగివుంది. రాజ్యం రూపురేఖలనీ, స్వేచ్ఛకూ అణచివేతకూ మధ్యనున్న సరిహద్దులనీ, దేన్ని అనుమతించాలి దేన్ని నిషేధించాలి వంటి అంశాలనన్నింటినీ  చాపకింద నీరులాగా అదే నిర్దేశిస్తోంది.''

భారతదేశం గురించి ఈ దశాబ్దిలో వెలువడిన అత్యంత ముఖ్యమైన పుస్తకాలలో ఇది ఒకటి అని మేము
భావిస్తున్నాం. ఇందులో లేవనెత్తిన అంశాలపై మౌనం వహించడం అనేది సరైన స్పందన అనిపించుకోదు. ఇవే అంశాలపై భారత అల్పసంఖ్యాక వర్గాలు - దళితులు, ముస్లింలు, తదితరులు ఎంతోకాలంగా ప్రశ్నలు సంధిస్తున్నారు, సమరం సాగిస్తున్నారు. వాటిని విస్తృతంగా, బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

- Hyderabad Book Trust


ఇండియాలో దాగిన హిందుస్థాన్

ఆంగ్ల మూలం :  The Indian Ideology, Perry Anderson, Three Essays Collective, Gurgaon (Haryana), October 2012, ©  Perry Anderson     
        
తెలుగు అనువాదం  :  ప్రభాకర్ మందార

175 పేజీలు ; ధర : రూ.150/-

ప్రతులకు, వివరాలకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006 

ఫోన్‌ : 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌