Saturday, September 21, 2013

నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం - డా. గోపీనాథ్ పుస్తకం పై చర్చ 28-9-2013 శనివారం సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు:
నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం
- డా. గోపీనాథ్ 
పుస్తకం పై చర్చ
28-9-2013 శనివారం సాయంత్రం 6 గంటలకు
హైదరాబాద్  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో.




Saturday, September 14, 2013

చిరస్మరణీయుడు సి.కె. - వరవరరావు



చిరస్మరణీయుడు సి.కె. - వరవరరావు

Andhra Jyothy September 14, 2013


మంచి కమ్యూనిస్టు, ఆదర్శ కమ్యూనిస్టు అనే మాటలు వాడితే మంచి వారు, ఆదర్శజీవి కాకుండా కమ్యూనిస్టు ఎట్లా అవుతాడు అని అంటారు గానీ కమ్యూనిస్టుగా గుర్తింపు పొందిన వాళ్లంతా మంచివాళ్లు, ఆదర్శజీవులు అయి ఉంటే మన దేశంలో విప్లవం ఇంత ఆలస్యమై ఉండేది కాదేమో.
పైగా కమ్యూనిస్టు భావజాలంలో వ్యక్తి నిజాయితీ కన్నా సమష్టి కోసం చేసే వర్గ పోరాటం మీద కేంద్రీకరణ ఎక్కువగా ఉంటుంది గనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో కూడా సుందరయ్య గారిని ఆయన నిరాడంబరత్వానికి గాంధీతోనే పోల్చారు. సి.కె. నారాయణ రెడ్డి గారిని చిత్తూరు గాంధీ అన్నారు. (చిత్తూరు కరంచంద్ అనలేదు!)

నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాక తెలుగు నేల మీద ఏర్పడిన మార్క్సిస్టు లెనినిస్టు నిర్మాణాల్లో రాయలసీమ నుంచి నేను విన్న పేర్లలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, తర్వాత ప్రముఖంగా పేర్కొనవలసిన పేర్లు ముగ్గురివి. ఎస్.ఎ. రవూఫ్, మహదేవన్, సి.కె. నారాయణరెడ్డి.

వీరిలో మహదేవన్ నక్సల్బరీ విస్ఫోటనం నాటికి మద్రాసు సినీ రంగంలో ఉండి, విప్లవానికి దారి దొరికింది అన్నట్లుగా కొల్లిపర రామనరసింహరావు వలెనే మద్రాసు వదిలి వచ్చి చారు మజుందార్ నాయకత్వాన్ని స్వీకరించిన పార్టీలో రాయలసీమలో పనిచేస్తూ పార్వతీపురం కుట్రకేసులో అరెస్టయి 1972 నాటికే జైలు పాలయ్యాడు. బెయిల్ మీద విడుదలై అజ్ఞాత జీవితంలోకి వచ్చిన కొద్ది కాలానికే 1976లో ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఎస్.ఎ. రవూఫ్ బెంగళూరులో అంపశయ్యపై ఉన్నాడు. మనుషుల్ని గుర్తుపట్టగల, గ్రహించగల స్థితిలో కూడా లేడు. ఇంక మిగిలిన సి.కె. నిక్కచ్చి, ముక్కుసూటి మనిషిగా, నిజాయితీగా, కమ్యూనిస్టుగా సార్థక జీవితం గడిపి తన 88వ ఏట కన్నుమూసాడు.

కొల్లా వెంకయ్యగారు రైతాంగ కార్యకర్త పేరుతో రాసిన అమరవీరుల జీవిత చరిత్ర ప్రచురణ సందర్భంగా డెబ్బైల ఆరంభంలోనే ఆయనతో పాటు సి.కె.తో నాకు, చెరబండరాజుకు సాన్నిహిత్యం ఏర్పడింది. సి.కె. చెరబండరాజుకు ప్రాణమిత్రుడై ఆయన కవితా సంపుటాల ప్రచురణకు సహా యం చేశాడు.

శ్రీకాకుళ ఉద్యమ సెట్‌బ్యాక్ తర్వాత బహుశా సి.కె. పుస్తక ప్రచురణా రంగంలోకి వచ్చినట్లున్నాడు. అయితే 'ఇస్క్రా' పత్రిక ఆర్గనైజర్ పనిచేయాలని లెనిన్ ఆశించినట్లుగా సి.కె. ప్రచురించిన పుస్తకాలన్నీ, ముఖ్యంగా విప్లవోద్యమం సెట్‌బ్యాక్ కాలంలోనూ, పునర్నిర్మాణ కాల ంలోనూ ఒక తరాన్ని తమ జీవితాలను మలచుకునేలా చేసినవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విప్లవోద్యమం శ్రీకాకుళం సెట్‌బ్యాక్ నుంచి స్వీయ విమర్శ చేసుకుని ప్రజాపంథా చేపట్టాలని పునర్నిర్మాణానికి పూనుకున్న కాలంలో సి.కె. ప్రచురించిన పుస్తకాలు కరదీపికలుగా పనిచేసినవి.

చారుమజుందార్ పంథాలోనే ప్రారంభమై శ్రీకాకుళ ఉద్యమాన్ని ఉజ్వలమైన త్యాగాల చరిత్రగా ప్రేమించిన కొల్లా వెంకయ్య, సి.కె.లు 1972 నాటికే చారుమజుందార్ రాజకీయాలతో విభేదించారు. బహుశా అందుకే చైనా విప్లవ అనుభవాలను ప్రచారం చేసే పుస్తక ప్రచురణకు పూనుకున్నారు సి.కె.

1974 నాటికే ఆయన హైదరాబాదులోని ఖైరతాబాదు నుంచి జనతా ప్రచురణలు ప్రారంభించారు. 1974 సృజన సంచికలో 'జనతా ప్రచురణలు' ప్రచురించిన 'చైనాపై అరుణతార' ఎడ్గార్ స్నో అనువాద గ్రంథం ప్రకటన వెలువడింది. అదే సంచికలో 'రక్తాశ్రువులు' (స్కాల్పెల్ అండ్ స్వోర్డ్ పేరుతో డాక్టర్ నార్మన్ బెతూన్ జీవితం, కృషిపై వచ్చిన ఇంగ్లీష్ పుస్తకం అనువాదం) పుస్తక పరిచయాన్ని అప్పటికింకా కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిగా ఉన్న రావి భుజంగరావు చేసాడు. మామూలుగా కాదు, డాక్టర్ నార్మన్ బెతూన్ స్ఫూర్తితో 'వైద్యులారా రోగుల దగ్గరికి మీరే వెళ్లండి' అనే పిలుపుతో.

నాకిప్పటికీ జ్ఞాపకం, పుస్తకం ఇంకా ప్రింటింగ్ ప్రెస్ తడి ఆరక ముందే ఆసాంతం చదివి ఒక సాయంత్రం వచ్చి ఆ పుస్తకం ఎంత గొప్ప స్ఫూర్తియో, ఉత్తేజమో నాకు వివరించి, ఆ రాత్రే నన్ను చదివేలా చేసి మర్నాడు తన పరిచయం రాసి తెచ్చిచ్చాడు భుజంగరావు. కాకతీయ వైద్య కళాశాల విప్లవ విద్యార్థులు ఎం.జి.ఎం. గోడల మీద 'వైద్యులారా రోగుల దగ్గరికి మీరే వెళ్లండి' అని నినాదాలు రాశారు. ఎదురుగా ఇస్లామియా జూనియర్ కాలేజీ గోడల మీద రాశారు. నాకు తెలిసి 1974 నుంచి 1985 వరకు కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆ స్ఫూర్తితో, ఆదర్శంతో పనిచేసారు. వాళ్లలో అమరులు డాక్టర్ రామనాథం, డాక్టర్ ఆమడ నారాయణ, డాక్టర్ ఎ. రామయ్యలను మనం ఎప్పుడూ మరచిపోలేం కదా. డా. కోట్నీస్ ముఖచిత్రంతో వెలువడిన సృజనలో ఈ పరిచయం, పుస్తకంలోంచి కొన్ని పేజీలు, డాక్టర్ చాగంటి భాస్కరరావు, డాక్టర్ నార్మన్ బెతూన్ ఫోటోలు అందులో ఉన్నాయి. ఇంక రాష్ట్రవ్యాప్తంగా 'రక్తాశ్రువులు' పుస్తకం ద్వారా ముఖ్యంగా వైద్య విద్యార్థులకు నార్మన్ బెతూన్ ఆ రోజుల్లో ఒక రోల్ మోడల్ అయ్యాడు. తమ పాఠ్య గ్రంథాలతో పాటు 'రక్తాశ్రువులు' ఒక పాఠ్య గ్రంథమైంది.

ఇంక 'విముక్తి' గురించి నా స్వీయానుభవం చెప్పాలి.
1973 అక్టోబర్‌లో మొదటిసారి నేను మీసా కింద అరెస్టయినపుడు డాక్టర్ రామనాథం గారు విలియం హింటన్ రాసిన 'ఫ్యాన్‌షెన్' పుస్తకం కొని పంపారు. 'శత్రువు రక్తంలో చేతులు ముంచిన వాడే కమ్యూనిస్టు' అని, వర్గశత్రు నిర్మూలన యుద్ధమే విప్లవమని అప్పటిదాకా తీవ్రంగా ఉన్న నా భావాలను ఆ పుస్తకం కుదిపేసింది. 1974లో మళ్లీ మేం జైలుకు వెళ్లే నాటికి కె.ఎస్. రాసిన 'ఆత్మవిమర్శ' పుస్తకం ఇంగ్లీషు అనువాదం కోసం కెవిఆర్‌కు వస్తే మేమంతా ఆ పుస్తక పఠనంలో నిమగ్నమయ్యాం. 1974 అక్టోబర్‌లో ఆర్ఎస్‌యు ఏర్పడి, 1975 ఫిబ్రవరిలో మహాసభలు జరుపుకుని ప్రజాపంథా చేపట్టే మార్గాన్ని ప్రచారం చేసే సాహిత్య అవసరాన్ని వెతుక్కుంటున్న రోజుల్లో జూన్ 1975లో జనతా ప్రచురణలు ఫ్యాన్‌షెన్ సంక్షిప్త రూపం 'విముక్తి'ని ప్రచురించింది. కొద్ది రోజుల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది. బయటేమో నాకు తెలియదు గానీ ఎమర్జెన్సీలో నేను వరంగల్, సికిందరాబాదు, హైదరాబాదు మూడు జైళ్లలో ఎక్కువ కాలమే ఉన్నాను. మూడు జైళ్లలోనూ విప్లవ రాజకీయ ఖైదీలు వందల సంఖ్యలో ఉన్నారు. అందరికీ ఎమర్జెన్సీ కాలమంతా 'విముక్తి' ఒక టానిక్. మూడు జైళ్ళలోను ముప్పై మందికి పైగా విరసం సభ్యులం ఉండేవాళ్లం. రాడికల్ విద్యార్థులూ ఉండేవాళ్లు. మేమంతా బోల్షివిక్ పార్టీ చరిత్రతో పాటు, 'విముక్తి' సమష్టిగా చదువుకుని చర్చించుకునే వాళ్లం.

ఆఖరుసారిగా ఆయనను జార్జ్‌రెడ్డి నలభైవ వర్ధంతి సభలో 2012 ఏప్రిల్ 14 సుందరయ్య విజ్ఞాన భవన్‌లో చూశాను. ముందు వరుసలో కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్లి పలకరించి వచ్చాను. కొల్లా వెంకయ్య గారితో 'అమరవీరుల జీవిత చరిత్రలు' ప్రచురణ సందర్భం తర్వాత మళ్లా సికిందరాబాద్ జైల్లో కలిసుండే అవకాశం వచ్చింది. కానీ సి.కె.తో ఉన్న అనుబంధమంతా ఆయన ప్రచురించిన పుస్తకాలతోనే. వాటి ప్రభావంతోనే. బహుశా 'సహవాసి'ని మూల రచయిత అని పాఠకులు భ్రమించేంత సుప్రసిద్ధ అనువాదకునిగా తీర్చిదిద్దిన కృషిలో కూడా సి.కె. నిర్వహించిన భూమిక ఉండే ఉంటుంది.

పత్రికలు, పుస్తకాలు ఏం చేయగలవో, ఎలక్ట్రానిక్ మీడియా ఇరవై నాలుగు గంటల రొదలో, ఆర్భాటంలో అర్థం చేయించడం కష్టం కావచ్చు, కానీ ఇప్పటికీ అజ్ఞాత జీవితంలోనూ, జైళ్ళలోనూ ఉన్న వాళ్ల పుస్తకాలం దాహం చూస్తే సి.కె. విప్లవోద్యమానికి చేసిన సేవ ఎంత చిరస్మరణీయమైందో అవగతమవుతుంది.

- వరవరరావు

(ఆంధ్ర జ్యోతి 14 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో)

(సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ - సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో)

.


Thursday, September 12, 2013

సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో

సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ
సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు
బాగ్ లింగంపల్లి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో

Saturday, September 7, 2013

అరుదైన కమ్యూనిస్టు



అరుదైన కమ్యూనిస్టు 

మీరు చెప్పేదానిని జాగ్రత్తగా వినే కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా
ఒక రిక్షావాలాకు అవసరమైన శస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేంతవరకు రోజంతా అతని వద్దనే ఉండే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా తెలుసా?  
ఒక భారతీయ పౌరునికి అర్హమైన గౌరవం ఇస్తూ రోగికి చికిత్స చేయని పక్షంలో ఏ డాక్టర్‌తోనైనా పోట్లాడేందుకు సిద్ధపడే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా మీకు తెలుసా?
మహిళలను ఎప్పుడూ ఏ విధంగానూ అగౌరవపరచరని మీరు పరిపూర్ణ విశ్వాసంతో చెప్పగల కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా?  
సదా జనసమ్మర్ధంతో, వాహనాల రాకపోకల రద్దీతో ఉండే లక్డీకపూల్ వద్ద రోడ్డు నడిమి భాగంలో నిర్లక్ష్యంగా విసరివేసిన అరటి తొక్కపై కాలు వేసి ఎవరూ జారిపడకుండా ఉండేందుకై దాన్ని ఎత్తుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో పడవేసే మనిషి ఎవరైనా మీకు తెలుసా?  
అటువంటి ఉదాత్త వ్యక్తి ఒకరు నాకు తెలుసు. 
ఆయన గురువారం అర్థరాత్రి కీర్తిశేషులయ్యారు.

ఆ సజ్జనుడే, సి.కె. అని అందరూ గౌరవంగా పిలిచే సి.కె. నారాయణ రెడ్డి. 
కొన్ని వర్గాలలో చిత్తూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్టు రాజకీయవేత్తగా సుప్రసిద్ధుడు; ఇతర వర్గాలలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి.) సంస్థాపకుడుగా సుపరిచితుడు. పాఠశాల, కళాశాల విద్యాభ్యాసకాలంలో తనకున్న ప్రతిదీ పేదలకు ఇచ్చివేసిన మంచివాడుగా ఆయన పేరుకెక్కారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పేద విద్యార్థుల కోసం ఒక హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. అప్పటికి ఆయనకు నిండా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు. 

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికై చదువుకు స్వస్తి చెప్పారు. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీలో కొంతకాలం పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. 1962లో పీలేరు శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. అయితే భారత్-చైనాల మధ్య యుద్ధం రావడంతో ఆయనకు కారాగారవాసం ప్రాప్తించింది. 1967లో చారుమజుందార్ గ్రూపులో చేరారు. 1970లో ప్రభు త్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్బంధించింది. 1977లో విడుదలైన అనంతరం ప్రగతిశీల సాహిత్యం ప్రచురణకు సి.కె. అంకితమయ్యారు. రిచర్డ్ అలెన్, టెడ్ గోర్డన్‌ల 'ది స్కాల్‌పెల్, ది స్వోర్డ్', విలియం హింటన్ 'ఫాన్‌షెన్', మేరీ టైలర్ 'మై ఇయర్స్ ఇన్ ఏన్ ఇండియన్ ప్రిజన్', ఎడ్గార్‌స్నో రాసిన 'రెడ్ స్టార్ ఓవర్ చైనా' మొదలైన పుస్తకాలను ఆయన తెలుగులో ప్రచురించారు.

నేను ఒక నిర్దిష్ట తిరుగుబాటు దశలో ఉన్న కాలంలో సి.కె.తో నాకు తొలుత పరిచయమైంది. అప్పుడు నా వయస్సు ఇరవై ఐదేళ్ళు. ఒక నక్సలైట్ గ్రూపులో పనిచేసి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుల ధోరణికి విసిగిపోయి బయటికి వచ్చాను. తమ మాటే నెగ్గాలనే మొండి పట్టుదల వారిది. ఇతరులు చెప్పేదానిని వినిపించుకొనేవారు కాదు. మహిళలను అణచివేసే వారు. ఇతరులూ మానవులేనని గుర్తించేవారు కాదు. 

సి.కె. నా భర్తకు పినతండ్రి. నక్సలైటు పార్టీలోని వ్యవహారాలతోనే కాకుండా కుటుంబ బాంధవ్యాలతో కూడా నేను అలసిపోయాను. ఈ బాంధవ్యాలు యువతులకు కొన్ని హద్దులు, తరచు హింసాత్మకంగా కూడా విధించేవి. పుట్టింటి బంధనాల నుంచి తప్పించుకున్న నేను వివాహం ద్వారా మరో కుటుంబానికి సన్నిహితమవ్వడమనేది నేను కోరుకునే చివరి విషయం.

సి.కె.తో పరిచయమైన ఏడు సంవత్సరాల వరకు, ఆయనతో నా బాంధవ్యాన్ని నేను అంగీకరించలేదు. దీనికి ఆయనేమీ బాధపడలేదు. 1980లో సి.కె. నేతృత్వంలో ఒక చిన్న బృందం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. హెచ్.బి.టి. ప్రచురించిన తొలి పుస్తకాలతో సి.కె., నేను కలసి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణానికీ, ప్రతి పెద్ద గ్రామానికీ వెళ్ళాం. కొద్ది నెలల కాలంలోనే ఆయన పట్ల నాకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. 

ఆయన చాలా అరుదుగా మాట్లాడేవారు. సదా ఇతరులు చెప్పేదానిని వినేవారు. ఆయన తరానికి చెందిన ఏ కమ్యూనిస్టులోనైనా ఇదొక గొప్ప గుణం. తనను తాను మరచిపోయి పనిచేసేవారు. ఇతరులను స్వార్థానికి ఉపయోగించుకొనే గుణం ఆయనలో ఏమాత్రం లేదు. చాలా సున్నితంగా, మృదువుగా వ్యవహరించే వారు. తన ప్రతిపాదనలను నిష్పాక్షికంగా చర్చించేవారు.

ముఖ్యంగా మహిళలు, పేదవారిపట్ల ఒక పరిపూర్ణ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించేవారు. నాకుతెలిసిన కమ్యూనిస్టులలో ఇది పూర్తిగా కనరాని విషయం. సంపన్నులతో సాపేక్షంగా కఠిన వైఖరితో వ్యవహరించడంలో ఆయన ఆనందాన్ని పొందేవారు. నిధుల సమీకరణకు మేము ఎవరి గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గృహస్థుడు తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నాననో లేదా కుమార్తె వివాహం చేశాననే సాకుతో విరాళం ఇవ్వలేనని చెప్పినప్పుడు సి.కె. ఊరుకునే వారు కాదు. అందుకే మీ దగ్గరికొచ్చామని స్పష్టం చేసేవారు. మీరు ఫలానా వ్యవహారానికి ఫలానా మొత్తంలో ఖర్చుపెట్ట గలరని విన్నాము. అందుకే మిమ్ములను అడగదలచుకున్నదానికి రెట్టింపు ఇవ్వాలని అడుగుతున్నామని సి.కె. అనేవారు.

ఆయనలోని మానవతా దృక్పథం నన్ను విశేషంగా ఆకట్టుకొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, గ్రామాల్లో ప్రయాణిస్తుండగా కూడా ఎక్కడైనా రోడ్లపై అరటి తొక్కలు కనిపడితే వాటిని తీసివేసేవారు. నిత్యం ఆస్పత్రులను సం దర్శించి రోగుల బాగోగులను చూస్తుండేవారు. పేదలు, అవసరంలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా పట్టించుకొనేవారు. నాకు తెలిసిన కమ్యూనిస్టులో కెల్లా సి.కె. చాలా చాలా భిన్నమైన, విలక్షణమైన వ్యక్తి. జంట నగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై కుక్కకాటుకు బాధితులైన పేదల సంక్షేమాన్ని పట్టించుకొనేవారు. పేద గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, పారిశ్రామిక కాలుష్య సమస్యల పరిష్కారానికి ఆయన ఇతోధిక కృషి చేశారు. దళిత బాలబాలికలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఆయన శ్రద్ధ చూపారు. శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యలకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించినప్పుడు స్వయంగా మాజీ ఎమ్మెల్యే అయివుండీ ఆ నిర్ణయాన్ని సి.కె. వ్యతిరేకించారు.

ఎస్.ఆర్. శంకరన్ తాను ఇద్దరు వ్యక్తులకు భయడతానని, వారిలో ఒకరు సి.కె. అని చెబుతుండేవారు. ఎందుకంటే సి.కె. ఏదైనా ఒక సమస్య విషయమై శ్రద్ధ చూపితే అది పరిష్కారమయ్యేంతవరకు తదేక దీక్షతో కృషి చేసేవారని శంకరన్ అనేవారు. హెచ్.బి.టి.కి సి.కె. సంస్థాపకుడు, హృదయం, ఆత్మ. ఆయన నాకు మార్గదర్శకుడు. నేను అన్ని కుటుంబ బాంధవ్యాలకు దూరమయినాను కదా. ఆయన చాలా ఉదారుడు. ఆయన నాకు తండ్రి, తల్లి, స్నేహితుడు. 1994లో ఆస్పత్రిలో ఉండవలసి వచ్చినప్పుడు సి.కె. రోజూ వచ్చి నన్ను పరామర్శిస్తుండేవారు. నేను త్వరగా కోలుకోవడానికి ఆయన సహాయపడ్డారు.

కాలంతో పాటు నడిచిన వ్యక్తి సి.కె.. గతకాలం గురించి ఆయన ఎన్నడూ ఏదో కోల్పోయామన్న భావనతో ఆలోచించేవారు కాదు. ప్రజల్లో నిత్యం వస్తున్న మార్పులను గమనించే వారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయని, స్వతంత్ర వైఖరితో మాట్లాడడానికి సాహసిస్తున్నారని ఆయన గుర్తించారు. కనుకనే తన వయస్సులో ఉన్న ఇతరుల కంటే వర్తమాన రాజకీయాలు, ఉద్యమాల ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించేవారు. వాటిని ప్రశంసించేవారు. ఇప్పుడు 'మంచి మనిషి'గా, 'స్వార్థరహితుడు'గా ఉండడం ఆనవాయితీగా లేదు. విస్తృతస్థాయిలో సంబంధాలు కలిగివుండడానికి, టెలివిజన్‌లో కనిపించడానికి, ఇతరులు తన గురించి తరచూ రాసేందుకే అందరూ శ్రద్ధ చూపుతున్నారు. సి.కె. నిజంగా మంచి మనిషి, నిస్వార్థపరుడు, మహోన్నతుడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. మన జీవితాలలో ఆయన సజీవుడుగా ఉంటారు.

- గీతా రామస్వామి
(ఆంద్ర జ్యోతి 7 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈరోజు కొన్ని పత్రిక లలో వచ్చిన వార్తల కత్తిరింపులు :


The Hindu 7 9 2013 

‘Piler Gandhi’ dead

Challa Krishna Narayan Reddy, veteran Communist leader and freedom fighter, popularly known as CK and ‘Piler Gandhi’, for his spartan lifestyle, passed away here on Thursday night. He was 88 and survived by wife Jayaprada and two daughters. In accordance with his wish, his body was donated to Gandhi Medical College.

Born on August 1, 1925, at Challavaripalle near Piler of Chittoor district, he discontinued his BA and joined Quit India Movement. Under the influence of Mahatma Gandhi, he spun the charkha and used to wear pure khadi. He joined Communist movement in 1953.
CK was elected to the AP Assembly on Communist Party ticket in 1962. He was arrested again during the Emergency. On release from prison in 1977, he began Janata Prachuranalu and Anupama Prachuranalu and published transformative literature. He founded the Hyderabad Book Trust in 1980 along with social activist, Gita Ramaswamy.
— Special Correspondent
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  The Hans India 7 9 2013

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Eenadu 7 9 2013
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
 




Friday, September 6, 2013

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు
సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధిగా సుప్రసిద్ధులు అయిన  సి.కె.నారాయణ రెడ్డి గారు నిన్న అర్థ రాత్రి (5 సెప్టెంబర్‌ 2013న) హైదరాబాద్‌లో చనిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఆయన వయసు 88 సంవత్సరాలు.

సికె గా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని
చల్లావారిపల్లిలో 1 ఆగస్ట్‌ 1925న జన్మించారు. మదనపల్లిలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌/కాలేజీలో బిఎ వరకు చదువుకున్నారు. కాలేజీలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. బిఎ రెండో సంవత్సరంలో వుండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఫైనల్‌ ఇయర్‌లో కాలేజీ నుంచి బయటికి వచ్చారు. గాంధీ ప్రభావంతో ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. తరచూ చరఖా తిప్పేవారు.

 సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. పేదల వేతనాలకోసం, భూమి కోసం భుక్తికోసం పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.  దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కషి చేశారు. యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లిలో బడుగు వర్గాలకోసం సికె స్వయంగా పలు వసతి గృహాలను నిర్వహించారు. బాకారావు పేట, వాయలపాడు వసతి గృహాలకు సహాయ సహకారాలు అందించారు. అందులో వుంటూ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్‌ అధికారులు అయ్యారు. యువత కోసం రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు.

 సికె గారు 1962లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ వెంటనే భారత చైనా యుద్ధం కారణంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. 1967 లో చారుమంజుందార్‌ గ్రూపులో చేరారు. 1970లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్భంధించింది. రెండేళ్ల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో 1977లో విడుదలయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకు జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు నెలకొల్పి - ''ది స్కాల్‌పెల్‌, ది స్వోర్డ్‌'' - రిచర్డ్‌ అ లెన్‌  , టెడ్‌ గోర్డన్‌ (రక్తాశృవులు) ; ''ఫాన్‌షెన్‌'' - విలియమ్‌ హింటన్‌ (విముక్తి) ; ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌''- మేరీ టైలర్‌ (భారత దేశం లో నా జైలు జీవితం) ;'' రెడ్‌ స్టార్‌ ఓవర్‌ చైనా''- ఎడ్గార్‌ స్నో (చైనా పై అరుణ తార) తదితర పుస్తకాలను తెలుగులో ప్రచురించారు.

1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను నెలకొల్పి అప్పటినుంచి 1990ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషి చేస్తూ అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. సైద్ధాంతిక ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు, ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.

జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై  కుక్క కాటు సంఘటనలు విపరీతంగా పెరిగినప్పుడు ఆ సమస్యపై అక్కినేని అమల వంటి శక్తివంతులైన జంతువుల హక్కుల గురించి పోరడే వాళ్లని ఎదిరిస్తూ ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాటాలు చేశారు.  ప్రభుత్వం శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు అనేక సౌకర్యాలను
కల్పించినప్పుడు స్వయంగా మాజీ శాసన సభ్యులయివుండి కూడా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో హత్యకు గురైన కామ్రేడ్ జార్జి రెడ్డి స్వయానా వీరి అన్న కుమారుడు.

సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ  వున్నారు.


.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌