Thursday, February 25, 2010

గెట్‌ పబ్లిష్డ్‌ ... మహమ్మద్‌ ఖదీర్‌ బాబు కథ ...


ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు
కానీ నూరుమంది నిర్దోషులు తప్పించుకోవాలి.

....
వాళ్లు దర్గాలో వుండగానే ముంబై తాజ్‌ హోటల్‌లో పొగలు టీవీల్లో కనిపించాయి.
ఆ తరువాత మంటలు చెలరేగాయి.
ఆ తర్వాత పేలుళ్ల శబ్దాలు వాళ్ల గుండెలను దడదడలాడించాయి.
వాళ్లు కంగారు పడ్డారు.
ఆ భయంతో, ఆ ఆందోళనతో, ఇలాంటి సమయంలో తిరుగు ప్రయాణం మంచిది కాదని రెండు రోజులపాటు అక్కడే వుండిపోయారు.
మూడో రోజు సద్దు మణిగినట్టు అనిపించాక, మరేం భయం లేదని బయలు దేరి అదేరోజు ఇళ్లకు చేరుకున్నారు.
ఆ రోజు సాయంత్రం గడిచింది. ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు పగలు గడిచింది. సాయంత్రం గడిచింది. రాత్రి అత్తర్‌ నయాబ్‌ యింటి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. ...
... ... ...
ఊ... ఇదంతా పబ్లిష్‌ అవుతుందనే అనుకుంటున్నావా షకీలూ?
నేను మాట్లాడలేదు. ...
తెలుగు సంగతి పక్కన పెట్టు కనీసం ఇంగ్లీష్‌ మెయిన్‌ స్ట్రీమ్‌ పత్రికల్లో అయినా ఇలాంటివి పబ్లిష్‌ అవడం ఎప్పుడైనా చూశావా నువ్వు?
నేను మాట్లాడలేదు.
... ... ...
యాల్లా... మాకు దక్కవలసిన రొట్టెను మాకు దక్కించు.
యాల్లా... మా బతుకు తెరువులో బర్కత్‌ ఇవ్వు.
మేము నిస్సహాయులం.
నీవు తప్ప వేరే దిక్కులేని వాళ్లం. కనికరించు.
మా ఇళ్లలో రోగాలతో పీడితులైనవారు ఎందరో వున్నారు. వాళ్లకు స్వస్థత చేకూర్చు.
పనిలేని బేరోజ్‌గార్‌లు మరెందరో వున్నారు. వాళ్లకు పని ఇవ్వు.
పెళ్లిళ్లు జరగక బండ శిలల వలె తండ్రుల గుండెలపై కూర్చున్న ఆడపిల్లలు లెక్కకు మించి వున్నారు. వాళ్లపై దయ చూపు.
యాల్లా... మాకు మర్యాదతో కూడిన జీవితం ఇవ్వు.
నిర్భయంగా జీవించే బతుకు ఇవ్వు.
యాల్లా... మాకు ప్రార్థించడం రాదు.
అడగడం కూడా రాదు.
ఈ ముక్కల చెక్కల దుఆను నువ్వే కుబూల్‌ చేయాలి పర్‌వర్‌దిగార్‌.
ఆమీన్‌.
... ... ...

చదవండి. చదివించండి.

గెట్‌ పబ్లిష్‌డ్‌ (కథ)
రచన: మహమ్మద్‌ ఖదీర్‌ బాబు


ముఖచిత్రం, బొమ్మలు: మోహన్‌
కవర్‌ డిజైన్‌: లేపాక్షి

39 పేజీలు, వెల: రూ.20

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


...

Tuesday, February 23, 2010

నేను హిందువు నెట్లయిత? పునర్ముద్రణ ... మరో కొత్త అధ్యాయం తో ...


నేను హిందువు నెట్లయిత? ఆరో ముద్రణ మరో కొత్త అధ్యాయంతో వెలువడింది. ఆ కొత్త అధ్యాయం లోంచి కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాము:


….. “గత తొమ్మిదేళ్లలో ఈ పుస్తకంపై వివిధ పత్రికల్లో ఎన్నో సమీక్షలు వచ్చాయి. కొందరు సమీక్షకులు ఇందులోని కొన్ని అస్పష్టతలను, చిన్న చిన్న లోటుపాట్లను ఎత్తి చూపారు. అవి సహజమైనవి కూడా. అయితే ఈ దశలో నేనీమీ మార్పులూ చేర్పులూ చేయదలచుకోలేదు. ఈ పుస్తకం ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొంది.

1996వ సంవత్సరంలో నాన్‌ఫిక్షన్‌ విభాగంలో బెస్ట్‌ సెల్లరైంది. యావత్‌ ప్రపంచం నూతన సహస్రాబ్దిలో అడగుపెడ్తున్న సమయంలో అంటే 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వెలువడే 'ది పయనీర్‌' అనే సుప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక 'వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ' (''నేను హిందువు నెట్లయిత'') పుస్తకాన్ని ఈ మిలీనియంలో దళిత బహుజన దృక్పథంతో వెలువడిన ఐదు అత్యుత్తమ రచనల్లో ఒకటిగా ప్రకటించింది. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సుప్రసిద్ధ రచన ''కుల నిర్మూలన'' సరసన నా పుస్తకం చోటు సంపాదించుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది.

అంతేకాకుండా ఈ పుస్తకం అనేక భారతీయ భాషల్లోకి అనువాదమయింది. ఒక విధంగా హిందూత్వ శక్తులు (బిజెపి, నేషనల్‌ డెమోక్రాటిక్‌ అ లయెన్స్‌) దేశాన్ని ఏలుతున్న నేపథ్యంలో ఈ పుస్తకం దళితుల, బహుజన కార్యకర్తల చేతుల్లో ఒక ఆయుధంగా మారింది.

ఈ పుస్తకం వల్లనే ఈ మధ్య భారత దేశంలోని ప్రధాన స్రవంతి పత్రికల్లో కొన్ని ముఖ్యమైన, సిద్ధాంతపరమైన వ్యాసాలు రాసేందుకు నాకు అవకాశం లభించింది. భారతీయులకు పనికొచ్చే సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రత్యామ్నాయాలను అర్థం చేసుకునేందుకు నేను విదేశాలలో కూడా పర్యటించగలిగాను.

ఈక్రమంలోనే నేను మరో రెండు పుస్తకాలను - ''గాడ్‌ యాజ్‌ ఎ పొలిటికల్‌ ఫిలాసఫర్‌; బుద్ధాస్‌ ఛాలెంజ్‌ టు బ్రాహ్మణిజం'' (దీనిని 'దేవుడి రాజకీయ తత్వం - బ్రాహ్మణత్వం పై బుద్ధుడి తిరుగుబాటు' అనే పేరుతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌వ తెలుగులో వెలువరించింది), ''బఫెల్లో నేషనలిజం: ఎ క్రిటిక్‌ ఆఫ్‌ స్పిరిట్యువల్‌ ఫాసిజం'' రాశాను. వాటిని కూడా ''వై ఐయామ్‌ నాట్‌ ఎ హిందూ''ని ప్రచురించిన 'సామ్య' వారే ప్రచురించారు.

ఆధునిక కాలంలోని హిందూ మతంపై నేను చేసిన విమర్శకు మూలాలు ప్రాచీన కాలంనాటి బౌద్ధ పోరాటంలోనే వున్నాయి. నేనేమీ హిందూమతాన్ని విమర్శ కోసమని విమర్శించడంలేదు. హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వానికి ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నాను. ''నేను హిందువు నెట్లయిత?''లో దళితీకరణను ఒక ఆదర్శ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన నేను ఆతరువాత అసలు హిందూ బ్రాహ్మణీయ శక్తుల 'ఆవు మార్కు' జాతీయవాదం స్థానంలో 'బర్రె మార్కు' జాతీయవాదంను ముందుకు తెచ్చే స్థాయికి చేరుకున్నాను.

ఇట్లాంటి పుస్తకం రాస్తున్నప్పుడు నేను సైద్ధాంతికంగా, భౌతికంగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవలసివచ్చిందో ఈ చివరి మాట కొంతవరకు వివరిస్తుంది. అదేవిధంగా నేను రచనా వ్యాసంగాన్ని ఓ 'ఆలోచనలను సంస్కరించుకునే ప్రక్రియ'గా ఎంచుకున్న వైనాన్ని కూడా ఇది వివరిస్తుంది.

భారతదేశం అనేక సంస్కృతులకు నెలవు కావడం, సామాజిక సాంస్కృతిక విప్లవాలూ, దళితబహుజన, మహిళా పోరాటాలు అనేకం జరుగుతుండటం వల్ల నా పని ఒకింత సులువయింది. అయితే, భారత దేశంలో ఆలోచనా సంస్కరణ నిమిత్తం ప్రచారం సాగిస్తున్న సమయంలో నేను ఎన్నో దాడులనూ, దూషణలనూ ఎదుర్కొన్నాను. కాగా అటు బ్రాహ్మణీయ శత్రువుల దాడులు, ఇటు శ్రేయోభిలాషుల పొగడ్తలు నన్ను భయపెట్టనూలేదు, సంతృప్తిపరచనూలేదు. నేను ''సంతృప్తిచెందిన మనిషి కంటే అసంతృప్తితోవున్న పంది మేలు'' అన్న లోకోక్తిని నమ్ముతాను. ముఖ్యంగా నా శరీరం మీద కంటే మనసు మీద జరిగిన దాడులు నా కృషిని మరింత పట్టుదలగా కొనసాగించాలనే దీక్షను పెంచాయి.

సిద్ధాంత రచన చేసే హక్కు నిరాకరించబడ్డ వాళ్ళు ఇవాళ తమ చరిత్రనీ, ఇతర్ల చరిత్రనీ కూడా రాసేస్తున్నారు. దానిని వారు తమ సాంఘిక-రాజకీయ ఉద్యమంగా చేసుకుంటున్నారు. ఈ రాసే ఉద్యమానికి కొన్ని పరిమితులు వున్నప్పటికీ, రాసే హక్కులేని వాళ్ల సంకెళ్లను అది ఛేదించింది. బలహీనుల చేతుల్లో రచన ఒక ఆయుధంగా మారింది. కులతత్వ సమాజంలో బ్రాహ్మణీయ శక్తులు దళిత బహుజనులను రాయకుండా అడ్డుకుని వారి అసంఖ్యాక భౌతిక పోరాటాలు మరుగునపడిపోయేట్టు చేశాయి. చారిత్రక పోరాటాలు కనుమరుగైపోతే స్వేచ్ఛా పిపాస రాజుకోవడం సాధ్యపడదు. తీవ్రమైన ప్రతిఘటనల మధ్య రాయడమనే ప్రక్రియను కొనసాగించడం చాలా కష్టం. అయినప్పటికీ అది నిర్విరామంగా కొనసాగితీరాలి. ఒక హిందువు కాని భారతీయుడిగా నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

వేధింపులు

మండల్‌ ఉద్యమం జరిగి, బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై ఇప్పటికే దశాబ్దం దాటింది. ఈ రెండు ప్రధాన ఘటనల నేపథ్యంలోనే నేను ''వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ?'' (నేను హిందువు నెట్లయిత?) పుస్తకాన్ని రాశాను. ఈ దేశంలో హిందువులు, అధికసంఖ్యాక వర్గాలు అనే వాదాన్ని తిప్పి కొట్టడానికే నేను దీన్ని రాశాను. సూద్రుల హిందూ మూలాల వాదాన్ని నిర్ద్వంద్వంగా ఖండించిన మొట్టమొదటి వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తిని నేనే. అది నా పుస్తకం శీర్షికలోనే ప్రస్ఫుటమవుతుంది.

మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌ సూద్ర కోణం నుంచే హిందూమతం పై విమర్శలు చేశారు. కానీ వారు 'సూద్రులు పుట్టుకతోనే హిందువులన్న' సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన దాఖలాలు లేవు. దారుణమైన అంటరానితనపు అణచివేతకు గురవుతూ వచ్చిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను'' అని ప్రకటించాడు. హిందూ మతం తాలూకు బ్రాహ్మణీయ నిర్వచనాన్ని అంబేడ్కర్‌ ఆమోదించాడు. తత్సంబంధ కులం, హిందూమతం సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే ఆయన దానిపై విమర్శ చేశారు. హిందూ సిద్ధాంత గ్రంథాల ప్రాతిపదికతోనే ఆయన కులాన్నీ, హిందూ మతాన్నీ విశ్లేషించాడు.

హిందూ మత నియంతృత్వ స్వభావాన్ని పరిశీలించేందుకు నేను విభిన్న మార్గాన్ని అనుసరించాను. దళితబహుజన ప్రజానీకపు రోజువారీ జీవిత విధానాన్ని లోతుగా పరిశీలిస్తే వారి హిందువేతరత్వానికి కావలసినన్ని ఆధారాలు లభిస్తాయి. బాపన, కోమటి, క్షత్రియ కులాలవారితో దళితబహుజనులకు ఎలాంటి పోలిక లేదని నిరూపించేందుకు నేను ఈ పుస్తకంలో హిందూమతాన్ని ఒక జీవిత విధానంగా, ఒక మతంగా రెండు విధాలా పరిశీలించాను. మానవ జీవితాన్ని నిర్దేశించే సాంప్రదాయక ఆచారవ్యవహారాల్లో, సంస్కృతుల్లో దళితబహుజనులకూ బ్రాహ్మణీయ శక్తులకూ మధ్య ఎన్నో స్పష్టమైన తేడాలు మనకు కనిపిస్తాయి.

ప్రస్తుతం నేనొక హిందువును కాని భారతీయుడిని. నా సూద్ర వ్యక్తిత్వాన్ని, సూద్ర చైతన్యాన్ని బ్రాహ్మణీయ శక్తులు అసహ్యించుకుంటాయి. ఆవిధమైన చైతన్యానికి చారిత్రకంగా హిందూమత పునాదులను పెకలించే సామర్థ్యం వుందని వారికి తెలుసు. దళిత మేధావుల్లో ఒక వర్గం నా వాదనని కొంత అనుమానంగా చూస్తుంటే, మరొక వర్గం ఇది దళిత-వెనుకబడిన వర్గాల (ఓబీసీ) చారిత్రక ఐక్యతకు దోహదం చేస్తుందని ఆశిస్తోంది. వెనుకబడిన తరగతులలో (ఓబీసీ), సూద్ర అగ్రకులలో (వీరిని నా పుస్తకంలో నయా క్షత్రియులు అని అభివర్ణించాను) కుల, మత తాత్విక చర్చలలో పాల్గొనగలిగే మేధోవర్గం చాలా తక్కువ. వారు ఈ పుస్తకాన్ని పూర్తిగా స్వీకరించనూలేరు, గట్టిగా వ్యతిరేకించనూ లేరు. వారిలో విద్యావంతులు ఎక్కువగా అధికారం మీదా, సంపాదన మీదా దృష్టిని కేంద్రీకరిస్తారు. వారికి ఈ చర్చ గురించే పట్టింపులేదు. ఈ పరిస్థితుల్లో వారికి అత్యున్నత అధికారంలో గానీ గుత్తాధిపత్య పెట్టుబడిలో గానీ తమ వంతు వాటా లభించదు. వాళ్ల ఆలోచనలు బ్రాహ్మణీయ సిద్ధాంతాల ప్రభావంతో మసకబారిపోయి వున్నాయి.

నా ఉద్దేశం ప్రకారం ఆధ్యాత్మిక వాస్తవికత, నిత్య జీవన విధానం ఈ రెండు పోరాటాల్లో విజయం సాధిస్తేతప్ప వారి లక్ష్యం నెరవేరదు. మొద్దుబారిన మనసు ఈ వాస్తవాన్ని లేదా ఇందులో దాగివున్న నిజాన్ని గుర్తించలేదు. ఇ.హెచ్‌.కార్‌ ''వాట్‌ ఈజ్‌ హిస్టరీ'' అనే తన సుప్రసిద్ధ గ్రంథంలో ఇలా అంటాడు : 'చారిత్రక వాస్తవం అనేది ఒక తిత్తి లాంటిది దానిని మనం సిద్ధాంతంతో నింపివేయాలి'. భారతీయ జ్ఞాన తిత్తుల నన్నింటినీ దళితబహుజన ఉత్పత్తితత్వంతో నింపాల్సిన అవసరం వుంది. ఉత్పత్తి వ్యతిరేక బ్రాహ్మణిజం తిరుగులేని పెత్తనాన్ని చెలాయిస్తున్న దేశంలో ఉత్పత్తితత్వం గురించీ, సామాజిక- సైద్ధాంతిక సమానత్వం గురించీ ప్రచారం చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.


హిందూ ఆధ్యాత్మిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న క్రమంలో నాకు హిందూత్వ బ్రాహ్మణీయ శక్తుల నుంచి అనేక విద్వేషపూరిత బెదిరింపులు వచ్చాయి. సుప్రసిద్ధ వార్తా పత్రికలలో ఆధ్యాత్మిక నియంతృత్వం- దళితబహుజనులపై దాని ప్రభావం గురించి నేను రాసిన రచనలకు ప్రతిస్పందనగా ఆ శక్తుల నుంచి భారతీయ మీడియాలో తిట్లూ శాపనార్థాలతో కూడిన లేఖలు అనేకం వచ్చాయి. ముఖ్యంగా గుజరాత్‌ జాతిహత్యాకాండ గురించి రాసిన ''అయోధ్య: వాట్‌ స్టేక్స్‌ డూ ఓబీసీస్‌ హావ్‌?'' (హిందూ 18 మార్చి 2002) తర్వాత హిందూ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ అందింది. దానిని వాళ్లు నాకు పంపారు. ఊరూపేరూ లేని ఆ లేఖలో నీచమైన తిట్లతో పాటు - ''ఇష్టమొచ్చిన చెత్త ఏం రాసినా నాకేం కాదని అనుకుంటున్నావేమో - ఈ రాతలను ఇట్లాగే కొనసాగిస్తే నీ తలకాయ హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలో వేలాడదీస్తాం జాగ్రత్త'' అన్న బెదిరింపు వుంది.

హిందుత్వ శిబిరం, బాపన, కోమటి సంస్థలు నా ఆలోచనా విధానంమీదా, నా రచనలమీదా విరుచుకుపడుతూ బహిరంగంగానూ, అంతర్గతంగానూ అనేక లేఖలు రాసి తమ ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని చాటుకున్నాయి. నన్ను ఉద్యోగంలోంచి తొలగించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యానికి వారు ఎన్నో లేఖలు రాశారు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సి.రెడ్డి తన రిజిస్ట్రార్‌ ద్వారా నాపై రచనలు చేయడం ఆపివేయమంటూ ఒత్తిడి తెచ్చిన వైనాన్ని ''బఫెల్లో నేషనలిజం'' అనే నా పుస్తకం ముందుమాటలో ప్రస్తావించాను. అట్లాంటి ప్రతి సందర్భంలో నేను గట్టిగా నిలబడ్డాను. నా రచనా వ్యాసంగాన్ని మరింత పట్టుదలగా కొనసాగించాలని తీర్మానించుకున్నాను. అంతకంతకూ దాడులూ, బెదిరింపులూ ఎక్కువవడంతో అనేకమంది దళితబహుజన యువకులు ముందుకొచ్చి నాకు అండగా నిలబడ్డారు.

బ్రాహ్మణిజం ఆధ్యాత్మిక నియంతృత్వ కట్టడాల సముదాయాన్ని ఎంత పకడ్బందీగా నిర్మించుకుందంటే ఇప్పుడది స్వయంగా కావాలని కోరుకున్నా అందులోంచి బయటపడం సాధ్యం కాదు. హిందుత్వ బ్రాహ్మణీయ శక్తులు ఎందుకు భయపడుతున్నాయంటే - దళితులకు ఆధ్యాత్మిక విముక్తికి సంబంధించినంతవరకు తమంటూ ఒక స్పష్టమైన ఎజెండా ఎలాగూ వుంది (వారిలో చాలామంది క్రైస్తవ మతంలోకో, బౌద్ధ మతంలోకో మారిపోతున్నారు); మరి తమ హిందూత్వ వ్యవస్థకు భౌతిక శక్తిగా వున్న వెనుకబడిన వర్గాల వారు (ఓబీసీలు) కూడా తమ ఆధ్యాత్మిక విముక్తి మార్గాన్ని రూపొందించుకుని వెళ్లిపోతే బ్రాహ్మణిజం, హిందూమతం కాస్తా పేకమేడలా కుప్పకూలిపోతుంది.

సిద్ధాంత గ్రంధాల రచనా ప్రక్రియ ఎక్కడ తమ ఆధిపత్యానికి తూట్లు పొడుస్తుందోనన్నది వారి భయం. అది నిజం కూడా. ఎందుకంటే ఈ రచనలు వారి చారిత్రక దుర్మార్గాలను ఎండగడ్తాయి. అందుకే వారి నిరాశా నిస్పృహలు అంతకంతకూ ఎక్కువగా బయటపడుతున్నాయి. సమానత్వ సిద్ధాంతం అంటే బ్రాహ్మణిజానికి ఎప్పుడూ గుండెల్లో దడగానే వుంటుంది. ఎందుకంటే వారిది అసమానత్వ సిద్ధాంతం.

ఈ అసమానతలు దైవనిర్ణయమని వారి వేద గ్రంథాలు ఉద్ఘోషించాయి. వాళ్లు తమ దేవుణ్ని తమ రూపంలో ప్రతిష్ఠించుకున్నారు. అందుకే దేవుడి శరీరం కుల వ్యవస్థకు మూలాధారంగా మారింది. వారి దేవుడు ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించాడు. ఆయుధాలను ఉపయోగించి కింది కులాల వాళ్లను చంపడమే వారి దేవుడి పవిత్ర కార్యక్రమంగా మారింది.

హిందూ బ్రాహ్మణీయ దేవుడు విశ్వజనీన దేవుడికి భిన్నంగా వుంటాడు. విశ్వజనీన దేవుడు ప్రయోజనకారుడు. కాయకష్టం చేసే ప్రజానీకం వర్ణం, కులం, జాతి, స్త్రీపురుష వివక్షలేకుండా అంతా ఆ దేవుడిని తమ వాడిగా స్వీకరిస్తారు. దేవుడు హంతకుడు కాదు. ఆయనొక సంస్కర్త. వ్యక్తులనూ, సామాజిక వర్గాలనూ, జాతులనూ వారి నేరాలతో, ప్రవర్తనతో, వైఖరులతో నిమిత్తంలేకుండా సంస్కరించడమే ఆయన విధి. కానీ హిందూ దేవుళ్లంతా ఈ విశ్వజనీన దైవ సిద్ధాంతానికి, ఆ ప్రయోజనాలకూ పక్కా వ్యతిరేకులు. వారు ఈ అమానవీయ దేవుడిని సృష్టించడం వల్ల సమాజానికి తీరని నష్టం వాటిల్లింది. ఆ దేవుడిని బ్రాహ్మణీయ రూపంలో సృష్టించినమాట నిజం. ఏ ఉత్పత్తిపనులూ చేయని బ్రాహ్మణుల ఉనికినీ, పెత్తనాన్నీ కాపాడడానికి అట్లాంటి దేవుడి సృష్టి తప్పనిసరి అయింది.

దళితబహుజనుల భావనలోని దేవుడికీ, బాపనవర్గాల భావనలోని దేవుడికీ మధ్య వున్న తాత్విక తేడాని నేను ఈ పుస్తకంలో వివరించాను. అంతర్జాతీయంగా విస్తరించిన క్రైస్తవం, ఇస్లాం వంటి మతాల్లో మాదిరిగా దేవుడిని ప్రతిష్టించుకోలేకపోయినప్పటికీ దళిత బహుజనులకు దేవుడు తమ ఉనికిలో ఒక అంతర్భాగం. ఏసుక్రీస్తు, మహమ్మదు ఇరువురూ మూఢనమ్మకాలలో కూరుకుపోతున్న ఆనాటి తమ సమాజాలను ఉద్ధరించారు.

భారతదేశంలోని దళితబహుజన ప్రజానీకం మాత్రం ఆధ్యాత్మిక వాస్తవికత విషయంలో అన్ని ఆధునిక సమాజాలలోని సానుకూల అంశాలను పాటిస్తూనే విగ్రహారాధన స్థాయిలో ఆగిపోయారు. మానవీయ లక్ష్యం కలిగిన దేవుడిని అంటే మనుషులను ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని దళితబహుజన దేవుడిని పరిశోధించాల్సిన అవసరం వుంది. ఆ పరిశోధనలో భాగంగానే 'నేను హిందువు నెట్లయిత?' రాయడం జరిగింది. ఆధ్యాత్మిక సమానత సాధించటం కేవలం ఆధ్యాత్మిక చర్య ద్వారా మాత్రమే సాధ్యం కాదు. దానికి ఒక రాజకీయ చర్య కూడా కావాలి. ఆధ్యాత్మిక, రాజకీయ సంస్థల మధ్య చాలా దగ్గరి సంబంధాలు వున్నాయి. అవి పరస్పరం పెనవేసుకుపోయాయి కూడా. ఆ సంబంధం జీవితంలోని అన్ని రంగాలకూ విస్తరిస్తుంది.

నా రచనలు, ప్రత్యేకించి ''నేను హిందువు నెట్లయిత?'' పుస్తకం సూద్ర/ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల) జీవనవిధానాన్ని వారి పరిభాష, పలుకుబడుల్లోనే విశ్లేషిస్తాయి. బ్రాహ్మణీయ సంస్కృతి, నాగరికత, చరిత్ర సారాన్ని నేను నిలదీస్తున్నాను కాబట్టి బాపన శక్తులు తప్పనిసరిగా నా రచనలపై విరుచుకుపడతాయి.

నేనివాళ రాస్తున్నది గేదెల/బర్రెల చరిత్ర. కానీ ఇన్నాళ్లూ అన్ని రకాల బ్రాహ్మణిజాలూ రాస్తూ వచ్చింది కేవలం ఈ దేశ ఆవుల చరిత్ర. నిజానికి ఆవు ఇచ్చే పాలు చాలా తక్కువ. ఆవు మహా పవిత్రమైనది అని కొందరు వాదిస్తే మరి కొందరు ఆ వాదనను వ్యతిరేకిస్తారు. ఆవు లౌకిక (సెక్యులర్‌) జంతువు అని కొందరంటే, కాదు సామాజిక జంతువని మరికొందరంటారు. అయితే ఎవరూ కూడా బర్రెల గురించి మాట్లాడరు.

విచిత్రం ఏమంటే వీళ్లంతా ఈ వినాశకర వాదోపవాదాలు చేసేటప్పుడు తాగే కాఫీ టీలు, పెరుగూ మజ్జిగా (సల్ల) అన్నీ కూడా కచ్చితంగా కేవలం బర్రెపాలతోనే తయారైవుంటాయి. కాబట్టి నా ముందూ, దళితబహుజన మేధావుల ముందూ వున్న పెద్ద సవాలు ఈ చర్చలో బర్రెను కేంద్రబిందువుగా చేయడం ఎలా అన్నదే. బర్రె ఎలాగైతే హిందువు కాదో నేనూ అంతే. అట్లాగే నేను ఎట్లాగైతే భారతీయుడినో బర్రె కూడా భారతీయ జంతువే. చారిత్రకంగా ఆలోచిస్తే ఆవు భారతీయత అనుమానాస్పదంగా వుంటుంది కదా? అట్లాగే బాపన శక్తుల దేశభక్తి కూడా నిజంగా అనుమానాస్పదమైనదే కదా?

ఆధ్యాత్మిక నియంతృత్వం

ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో హిందూమతం ఒకటి. ఆ నాలుగు ప్రధాన మతాల్లో అతి తక్కువ సంఖ్య కలిగిన మతం కూడా హిందూ మతమే. ఈ మతం విస్తరించిన భౌగోళిక ప్రాంతం కూడా చాలా తక్కువ. హిందూ మతం అతి ప్రాచీనమైనదని బాపన రచయితలు ఎంతగానో ఘోషిస్తుంటారు. కానీ ఇటీవలి మత దృక్పథం ప్రకారం చూస్తే మాత్రం హిందూమతం నిన్నమొన్నటిదే.

''హిందూ'' అన్న పదాన్ని మత దృష్టితో మొట్టమొదటగా వాడిన వాడు 'అ ల్‌్‌ బెరూనీ'. ఆయన రాసిన పుస్తకం శీర్షిక ''అల్‌ హింద్‌''. హిందూమతం అన్న భావనకు మొట్టమొదటగా ప్రాతిపదికను కూర్చింది ఆ పుస్తకమే అనిపిస్తుంది. అ ల్‌ బెరూనీ భారతదేశంలోని ముస్లిమేతరుల్ని సంబోధించేందుకు 'హింద్‌' అనే పదాన్ని వాడారు తప్ప 'హిందువు' అన్న పదాన్ని కాదు. ఆవిధంగా హిందూమత నిర్మాణానికి హిందువు కాకుండా ఒక ముస్లిం మేధావి మొట్టమొదటగా ప్రయత్నించాడు. ఆయన 'హింద్‌' అనే పదాన్ని మత దృష్టితోనే వినియోగించినట్టు అనిపిస్తుంది.

భారతదేశంలోని ముస్లిమేతర జనాభాలో జరిగిన ఈ చర్చలో అనేకమంది ముస్లిం మేధావులు భౌగోళిక దృష్టితో ఈ ప్రాంత ప్రజల్ని హింద్‌ అనే సంబోధించారు. వాళ్లు నివసించే ప్రాంతాన్ని హిందూస్థాన్‌ అన్నారు. అయితే 'హిందుస్థాన్‌' అన్న పదం వాడుకలోకి వచ్చింది 'సింధుస్థాన్‌' అన్న పదంలోంచి. అంటే సింధూనదీ పరీవాహక ప్రాంతమన్నమాట. అ ల్‌ బెరూనీ వాడిన 'హింద్‌' అన్న పదం కూడా కచ్చితంగా 'సింధ్‌' లాగే వుంటుంది.

వలసవాద కాలంలో ప్రాచ్య మేధోవర్గం క్రైస్తవులను ఏవిధంగానైతే ఒక మతంగా పరిగణించిందో అదేవిధంగా భారతదేశంలోని ముస్లిమేతరుల నందరినీ అది హింమతస్తులుగా పరిగణించింది. క్రైస్తవ మతంలో పుస్తకం చదివే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించారు.
అంటరానితనం, ఒక మనిషిని ముట్టుకోకూడదన్న భావన వారిలో లేదు. అయితే పైకి కనిపించే శరీర రంగులోని తేడాపై ఆధారపడిన జాతి విభజన మాత్రం వారిలో వుంది.

పాశ్చాత్య మేధావులు అల్‌ బెరూనీ వంటి ముస్లిం విద్యావేత్తల రచనల నుంచి భాషను అరువు తెచ్చుకున్నారు. హెగెల్‌ తన సుప్రసిద్ధ గ్రంధం ''ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ'' లో వివిధ దేశాలలో సాగిన నాగరికతా ప్రక్రియను సమీక్షించాడు. ఆయన భారతీయ నాగరికత సొంత స్ఫూర్తితో, సొంత చరిత్రపై ఆధారపడి ఏర్పడింది కాదన్నాడు. ఈ దేశంలో ప్రతీదీ - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, సింధూ తదితర నదులూ, జంతువులూ పూలూ అన్నీ కూడా వాళ్లకు దేవుళ్లు కావడమే అందుకు కారణం అన్నాడు. కుల వ్యవస్థ వల్లనే భారతీయుల 'ఆత్మ' ఎదగలేకపోయిందని హెగెల్‌కు తెలుసు. అయితే, భారతదేశంలో అంటరానితనం వుందని ఆయనకు కచ్చితంగా తెలుసోలేదో చెప్పలేం. ఆయన అన్ని కులాలనూ ఒకేగాటనకట్టి హిందువులుగా పరిగణించాడు. అందుకే ఆయన ''ప్రతి ఒక్క హిందువుకూ నిర్దిష్టమైన వృత్తి కేటాయించబడి వుంటుంది'' అన్నాడు.

హిందూ మతం - బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం మతాల మాదిరిగా సొంతగా ఒక విశ్వజనీన ఆత్మను రూపొందించుకొని ఎదగలేకపోయింది. అట్లాగే భారతదేశాన్ని ఒక చారిత్రక జాతిగా అది ఎదగనివ్వలేదు. ఎందుకంటే హిందూమతం పౌర సమాజ పునాదినుంచే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రతిష్టించుకుంది. కానీ, మిగతా మూడు మతాలూ పౌర సమాజం అట్టడుగునుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. అందువల్లే వాటికి తమదంటూ ప్రత్యేకమైన చారిత్రకత ఏర్పడింది. హిందూ మతం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాపనోళ్లకు, కోమట్లకు, క్షత్రియులకు కట్టబెట్టింది. 'బ్రహ్మదేవుని అరికాలి నుంచి పుట్టుకొచ్చిన' సూద్రులను/ఇతర వెనుకబడిన తరగతులవారిని అది తాత్వికంగా పూర్తిగా ఉపేక్షించింది, అణిచివేసింది. … “



నేను హిందువు నెట్లయిత?
హిందూ తత్త్వం, సంస్కృతీ, రాజకీయ అర్థ శాస్త్రం పై సూద్ర విమర్శ
రచన : కంచ ఐలయ్య

English Original: Why I Am Not A Hindu?
Kancha Ilaiah
SAGE Publications
www.sagepublications.com

తెలుగు అనువాదం : ఎ సురేంద్ర రాజు
కొత్త అధ్యాయం అనువాదం : ప్రభాకర్ మందార
పేజీలు : 155
వెల: రూ. 55

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

Saturday, February 20, 2010

Interview with Hyderabad Book Trust by Purnima (Pustakam.Net)


(దశాబ్దాలుగా తెలుగు పుస్తక ప్రచురణ రంగంలో తమదైన ముద్ర వేసిన “హైదరాబాద్ బుక్ ట్రస్ట్” గురించిన వివరాలన్నీ మాతో (e-mail ద్వారా) పంచుకున్న గీతా రామాస్వామిగారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు! మరిన్ని కాలాల పాటు పుస్తకప్రచురణ రంగంలో వీరి విశిష్ట సేవలు కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. పుస్తకం.నెట్)


Firstly, is there a website for HBT? When I search on google, I arrive at the Telugu blog. Is there a site where non-Telugus can know about your efforts?

No, there isn’t. We were long averse to anything to do with the internet, till it became impossible to function without it, though friends had earlier repeatedly asked to set up a website for us. By the time realization dawned on us, a website was no longer free; the other option was a blog.

I do not think there is a site where non-Telugus can know about our efforts.




How was HBT formed? Can you just tell us the story behind its birth? Also, about the founding team?


HBT was formed in February 1980. We are a group of people, largely `majis’ from different ML groups – who felt the need for a pluralistic and diverse publishing entity. If you recall, 1980 was the end of a decade of initial Naxalite activity. Among the many reasons we saw for the movement losing steam was the lack of reading material in Telugu. Activists were taking decisions, uninformed of major developments elsewhere, thinking and debates elsewhere. Mainstream Telugu publishing was not filling the need at all, concentrated as it was then, on pulp romance and detective fiction. A robust publishing activity could help, we thought.

The main person was C.K. Narayana Reddy (Chittoor), who had by that time, already published several major books like Fanshen (William Hinton), చైనా పై అరుణతార (China pai Arunatara – Edgar Snow”s Red Star Over China), భారతదేశంలో నా జైలు జీవితం (Bharatadeshamlo na jailu jeevitam -Mary Tyler’s My Years in an Indian Prison), పురోగమనం, రక్తాశ్రువులు (Purogamanam, Raktashruvulu – The Scalpel, the Sword), etc. His banner was initially Janata Prachuranalu and later, Anupama Prachuranalu. Along with him was M.T.Khan, the late Veeraiah Chowdhury (son of Kolla Venkaiah), the late C.Bharatudu (Guntur), Cyril Reddy, myself and Vithal Rajan (who resigned very shortly). Cyril and I had just came out from difficult times and wished to involve ourselves in publishing for activists in Hyderabad. M.T.Khan of course, is a longstanding Left activist. Veeraiah Chowdhury, while working as a veterinarian, was a wonderful behind-the-scenes worker. Bharathudu was a Left activist and lecturer in Guntur. Vithal Rajan had come to India a few years ago from Canada, and was working with the ASCI. (he quit the Trust almost immediately)

It was understood that CK and I would be the active workers and the others would help.



What were the aims with which HBT began its operations?


The aims were to publish books, progressive literature in short, though we did not confine `progressive’ to mean only `political or ideological’, but also as something which encompassed daily life – health, education, science, etc.


What is HBT’s USP among other Telugu publishers? How do you people stand out from the other lot?

No comments. This is not for me to spell out. Others have to comment really.


HBT is more than 30 years old. How do you see book publishing as a business change in all these years?

As in everything else, publishing has become modernized. The desk top has replaced the manual composing, printing presses have become first rate, and binding is fast mechanizing. Authors are now keying in their works instead of writing them down longhand. There are far more translators now than before (expansion of education?) but quality is being compromised for speed. Government is now a big player in the market as a purchaser (not just libraries, but various departments – the Sarva Siksha Abhiyan) and there are several publishers who publish only for Government today.

The divide between English and Telugu literature seems to be narrowing and there is more interchange than before.

We ourselves have changed tremendously. Earlier, HBT used to be on the streets literally with books. We were all walking salespersons. Now, we sit in our office and the market sells the books for us. Travel, food and lodging have become more expensive now, cutting into the already low margins.

A healthy feature is the presence of several new and vigorous young publishers on the scene.



What sort of books do you publish mostly?


Narratives of the marginalized, inclusive pedagogy, healthy fiction, discourses on caste, social sciences, children’s literature (very few) health (a very big area for us) – in short, anything which can and should be of use to the movements of the marginalized and the common man.


How do you choose a book to publish/Translate and publish?

I read extensively and also make it a point to meet others who do. In this way, I keep abreast of what needs to be translated. As for original works, we often commission writers from movements in areas like health, environment, etc. Many good MS come to us on their own.



Only Telugu books? Or in English too?


We publish only Telugu books. English publishing is robust and spread over so many countries that we do not need to duplicate it here in Andhra Pradesh. We see the need only for literature in Telugu.


Are the translators arranged by HBT after choosing the originals to be translated?

Both ways. Yes, sometimes, we arrange the translator, and sometimes the translator himself/herself comes to us with the book s/he wants to do.



Have there been any attempts to translate Telugu works into other languages?


This is a coincidence. I have just completed the translation of two novels into English. I thought that with so many years’ behind me in Telugu publishing, with a relative ease in English, and some contacts with the English publishing world, I should do some translations myself. One is a novel and the other an autobiography. Both Telugu books were published by us. This is not a major HBT activity of course, I take it up in the time I can spare personally.


From how many languages have you translated so far?

English, Hindi, Tamil, Bengali and Kannada directly and of course, several other languages indirectly – that is, from English. These would be Marathi, Malayalam, French, Spanish, Italian, Russian, Japanese, Persian, maybe a couple of others.


History, Fiction, Progressive Literature, Popular Science, Children’s literature, Politics – How do you manage such a diversity? :) It goes back to – How do you choose a book, again. How do you generally keep track of books from various fields and from various languages?

Again, extensive reading plus the immense goodwill of HBT friends who make it a point to get good books for us.


I saw some of the books by Mahidhara Nalinimohan being published by you in the ’80s (Source: Here). But, as time passed, there is hardly any popular science book in Telugu, from HBT – What do you think is the reason for that?

That’s true. Instead, we have books critiquing science (Vignana shastram viphalam ayye vela). Doesn’t this reflect a change in generational thinking? One no longer sees science as `pure science’ – we see it as a knowledge system that is loaded, represents definite values and supports definite social sections. The fight against superstition and obscurantism is no longer as simple as presented in the 1980s.

However, we do continue to publish on science;

a) విజ్ఞాన శాస్త్రం ఎలా ఎదిగింది (Vignana shastram ela edigindi) Egon Larsen, 1989 (gone through several reprints since)

b) విజ్ఞాన శాస్త్రం – మనిషి విస్తరణ (Vignana shastram manishi vistarana), J.D.Bernal, reprinted 1995

c) శాస్త్ర విజ్ఞానం – అభివృద్ధి – హింస (Shastra-vignanam-abhivruddhi himsa) Claude Alvarez, 1996

d) వాస్తు – నిజానిజాలు (Vaastu nijanijalu) Prof. Kolhatkar, 1998

e) మన విశ్వవిద్యాలయాల్లోకి జ్యోతిష్యం చెదలు (Mana Viswavidyalayalloki Jyothisham chedalu?) Compilation of essays by K. Ashok Vardhan Setti, Y. Nayudamma, SG. Kulkarni, 2001.

f) సైన్స్ పద్ధతి అంటే ఏమిటి? (Science Paddathi Ante Yemity?) By SG. Kulkarni, 2000.

g) విజ్ఞాన శాస్త్రం విఫలమైన వేళ (Vignana Shastram Viphilamaina Vella) – (When Science Fails Us) By Richald Lenin, 1999.


How frequently do you republish old HBT books? Is there a probability that some old book can be republished on a number of requests from readers, now that you are accessible online?

When we think a book could do fairly well (at least sell out 1,000 copies over say, a year), we do republish. Often, we allow other publishers to republish our titles. Prajashakti and Manchi Pustakam have done so.

Being online does not make a difference. How many readers would request a reprint – 5, 10 or 20? It does require a larger number to reprint.


Who are your chief readers – when you publish these books? Which genre is read by the most?

Health is the most popular, followed by readings on caste (writings of and on Ambedkar, Phule, Periyar) and pedagogy. Fiction sells the least.


In over 3 decades, how have been your sales doing?

Over three decades, sales have been increasing, enough to match increasing needs. Our real concern is to have sufficient money in the bank to buy paper. I confess to not having a good business sense and don’t look at the annual sales figures despite the auditors being shocked. If we don’t have money to buy paper, I start pushing sales.


Over this period of 30 years, It somehow appears that the diversity that was felt in the initial and middle years is gradually reducing. Your comments?

Since HBT has so many translations on its catalogue (as compared to original Telugu works), this could reflect on publishing generally, not specifically us. Our range (in terms for what we scout around for) has increased. Do keep in mind that when we started publishing in 1980, we had a whole backlog of great works to choose from, given the paucity of publishing between the 1950s and 1980s. With the backlog worked through, the choice gets limited. (We have published more for children between 2001-2009 than in any earlier period.)

In terms of decades, 1980-90 were very fruitful years – also very good years for peoples’ mobilization. In the latter half of the second decade, much of HBT”s energy was directed towards Nalupu, the forthnightly we ran for 4 years. The third decade 2000-10 also promises to be fruitful – we have an excellent fiction range now, something we did not have earlier.


Can some new author who writes a book which suits your aims, approach you to get his/her book published? If so, how?

Absolutely. We would always prefer a direct approach, because there is no mohamatam involved, and sometimes a mediator could complicate issues with unvoiced perceptions. `Ooru, vada, batuku’ – a recent book published by us, is a new author whom we had never met earlier. He has never published earlier either. We are currently working on a manuscript on Phule, again from a new author.



What is the general procedure for a book review at HBT?


I understand you mean `peer review’? Pre-publication? We generally have three reviewers for any manuscript. We are also careful not to have only expert opinion alone for books that deal with specific themes. For eg. A manuscript on agriculture would also go to someone who does not have much to do with the subject. This way, we get a fairly good idea of the subject treatment, language used, specific areas that need to be brushed up, etc.


Any plans to set up an online store for HBT?

We find that Appajosyula Foundation has been selling all our books online. Does it make sense to duplicate this?


How hard is it to survive as a Telugu book publisher in the age of internet?

Easier, in fact. Information is more easily available, negotiations are easier and much much faster, drafts are circulated at lightning speed to multiple reviewers and the earlier and very tedious leg work has been cut down. The internet has not cut into our sales. Sales is as yet, old-fashioned – at the shop, at the meeting hall, on the pavement, etc.


Do you think that the conventional publishing groups have tough time with many opportunities for authors to publish their books on their own?

Not in Telugu. Authors publishing their own books find it difficult to sell them out; again, some authors feel that those who need to publish their own works and can’t find publishers to do so, are looked down upon. There is absolutely no lack of manuscripts circulating around for publishers to choose from, nor the lack of competent translators, if translation is what is being aimed at.


Who owns the HBT? (if “owning” is possible) How many people work / are involved for the functioning of HBT?

HBT is a private trust, the trustees are C.K.Narayan Reddy, myself, M.T.Khan, Shantha Sinha and G.Manohar. None of us/all of us, do not own HBT. In case we shut down, HBT’s assets are assigned by Government to a trust of a similar nature.

People involved in HBT work go to double digit figures, though we are four employees. Our editors, our reviewers, our artists – we work closely with them. Proofs are done, not on payment, but as a labour of love, so are forewords/introductions written, as are blurbs, etc. Even the blog we maintain is a labour of love by Mandaara Prabhakar. There has been extraordinary and unrecognised involvement of others in HBT’s work.



From when have you been associated with HBT? What was your motivation for it? (Please add few details of your educational background and work experiences)


I am a founder member of the HBT. I had earlier given up postgraduation in Mathematics halfway during the Emergency, joined the ML movement full-time, and later came out from it with the strong conviction that activists needed far more exposure on several issues, for the movement to be truly democratic. While I worked full-time for HBT between 1980-84, I took up organizing a trade union among agricultural labourers between 1985-92, though I continued to give time for HBT when asked for it. There was a gap with my involvement with HBT from 1993-1998 when I was recovering from full time motherhood. Since 1999, while my primary focus is on HBT, I take care to be involved in several other activities at the same time. I feel that it enriches my work here and builds lateral relationships.


Coming to HBT’s blog, no other Telugu publisher has ever ventured into it. How did the blog start? And how did the blog help your cause?

The blog is the brainchild of Mandaara Prabhakar, one of our translators and editors. He had just retired and was keen to take this up on his own. We devised it between the two of us, but the work is all his now. I don’t know if the blog helps us – we certainly don’t get more orders because of the blog, but perhaps more visibility? I have still to assess if visibility helps us at all.


How are the purchasing and reading capabilities of current generation, according to you?

The profile of the current reading generation has changed enormously. Thirty years ago, readers were largely employed and belonged to the upper castes. Today, there is a huge chunk of first generation learners from the BC and SC communities, particularly the latter. While most are employed, wage levels are pretty low. Hence the need to keep prices down and compromise on quality of production.



With the ipods, kindles and all, seems like paper bound books are soon to disappear. What are your thoughts on it?


I don’t think so. Nothing can replace the pleasure of holding a loved book in your hands, of smelling a new book and turning its pages, of being able to read anywhere and everywhere – on the bus, the train, in a meeting, at night in bed, while eating on the table – the opportunities are limitless. How can ipods and kindles match this?



Does HBT have ties with libraries, be it public or private?


We don’t have ties with libraries but do get orders off and on. We refuse to pay bribes and all public libraries give regular orders

What would be your suggestions to inculcate reading habits among people, especially the younger generation?


People with means should endow libraries instead of constructing temples and colleges. Writers should visit villages and hold reading sessions of their books, instead of frequenting five-star hotels.


How about e-books in Telugu? Well, I mean copyrighted e-books for sale. Any plans to venture into this?

I don’t know enough to comment.


(పుస్తకం డాట్ నెట్ పూర్ణిమ గారు గత సంవత్సరం డిసెంబర్ లో జరిపిన ఇంటర్వ్యూ ఇది. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ - మా బ్లాగు వీక్షకులకు ఉపయుక్తంగా, అందుబాటులో ఉంటుందని ఇక్కడ పునర్ముద్రించాము. పుస్తకం డాట్ నెట్ కోసం ఇక్కడ నొక్కండి. )

Thursday, February 18, 2010

వైద్యుడు లేని చోట ... Where There is No Doctor


వైద్యుడు లేని చోట

వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం జరిగింది.

ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.

సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్‌, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.

ఇందులోని అధ్యాయాలు:
1. ఇంటింటి వైద్యం, 2. తరచూ అయోమయంలో పడేసే జబ్బులు, 3. రోగిని ఎలా పరీక్షించాలి?, 4. రోగిని ఎలా సంరక్షించాలి?, 5. మందులు లేకుండా జబ్బును నయం చేయడం,

6. ఆధునిక మందుల వాడకంలో తప్పొప్పులు, 7. యాంటీ బయాటిక్స్‌ అంటే ఏమిటి వాటిని ఎలా ఉపయోగించాలి? 8. మందును ఎలా కొలచి ఇవ్వాలి?, 9. ఇంజక్షన్స్‌కి సూచనలు, జాగ్రత్తలు 10. ప్రథమ చికిత్స,

11. పోషకాహారం, 12. వ్యాధినిరోధకం, 13. కొన్ని సర్వ సాధారణ జబ్బులు, 14. ప్రత్యేక వైద్యం అవసరమైన ప్రమాదకరమైన వ్యాధులు, 15. చర్మ వ్యాధులు,

16. కళ్లు, 17. చెవులు, ముక్కు, 18. జీర్ణ వ్యవస్థ, పళ్లు, చిగుళ్లు, నోరు, 19. మూత్రకోశం, జననేంద్రియాలు, 20. తల్లులకు, మంత్రసానులకు కావలసిన వివరాలు,

21. కుటుంబ నియంత్రణ, 22. పిల్లల ఆరోగ్యం జబ్బులు, 23. వృద్ధుల ఆరోగ్యం జబ్బులు, 24. మందుల పెట్టె, 25. మందుల ఉపయోగం, మోతాదు, తీసుకోవలసిన జాగ్రత్తలు, 26. ప్రమాదకరమైన, నిషేధించబడిన మందుల జాబితా.

ఈ పుస్తకాన్ని మీ బీరువాలో దాచి పెట్టకండి. పదిమందికీ అందజేయండి.



వైద్యుడు లేని చోట
- డేవిడ్‌ వర్నర్‌
తెలుగు అనువాదం: డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

సహాకుడు: బి. కృష్ణారావు

ఆంగ్ల మూలం: వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌, హెస్పెరియన్‌ ఫౌండేషన్‌, కాలిఫోర్నియా, యు.ఎస్‌.ఎ.
ఇండియన్‌ ఎడిషన్‌ను డా. సత్యమాల సవరించారు. దానిని వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూఢిల్లీ వారు ప్రచురించారు.

తెలుగులో తొలి ముద్రణ: 1982
మలి ముద్రణలు: 1983, 1988, 1990, 1996, 2000
450 పేజీలు ... వెల: 220/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


.

Tuesday, February 16, 2010

“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” - పూర్ణిమ


“టోటో చాన్”

Give me some sunshine
Give me some rain
Give me another chance.. I wanna grow up once again

ఇటీవల విడుదలైన హిందీ సినిమాలోని పాట వినగానే నాకు నచ్చిందిగానీ, నన్ను నేను చూసుకునే అవకాశంగా అనిపించలేదు, “టోటో చాన్” అనే పుస్తకం చదివే వరకూ. ఆ పుస్తకం చదువుతున్నంత సేపూ, చదివాక కూడా “యెస్.. నాకూ ఒక ఛాన్స్ ఉంటే బాగుణ్ణు” అని అనిపిస్తూ ఉంది.

నా బాల్యంతోనూ, బడితోనూ, అసలు ఇప్పటిదాకా జీవితంలో దేనితోనూ తీవ్ర నిరాశ చెందలేదు. ఉన్నంతలో దొరికిందే చాలు అనుకుంటూ ఉంటాను. పైగా నేను చదివిన బడి అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో హైద్రాబాద్ లో పేరెన్నిక గల పాఠశాలలో అది ఒకటి. “నీదే స్కూల్?” అని ఎవరన్నా అడగగానే సమాధానంతో పాటు ఒక రవ్వ పొగరు కూడా ఉండేది. స్కూల్ ఉండి బయటకొచ్ఛేటప్పటికి అందరికీ పదో తరగతి మార్కుల మీదే కన్ను. మన లెక్కలు ప్రకారం ఎన్ని ఎక్కువ మార్కులు, ఎంత ఎక్కువ మందికి వస్తే ఆ పాఠశాల అంత మంచిదని కదూ? కాకపోతే సంవత్సరాలు గడిచేకొద్దీ, రెస్యుమే లో పదో తరగతి మార్కులు అట్టడుగున మూలుగుతూ, వల్లవేసిన పాఠాల కన్నా, చుట్టూ ఉన్న మనుషులతో, పరిస్థితుల్లో వేగాల్సి వచ్చినప్పుడు మన ఐ.క్యూ కన్నా ఇ.క్యూకి పరీక్ష! పాఠశాల విద్యార్థిగా మన మెదడెంత పదనుగా ఉన్నదానికంటే మనం జీవితంలో మనకున్న పరిమితుల్లో ఏం చెయ్యగలం అన్నదానికి ముడిసరకైన వ్యక్తిత్వం ముఖ్యం. దానికి బీజాలు పడేది స్కూల్లోనే మరి! మన స్కూల్లు వ్యక్తిత్వాలని తీర్చిదిద్దటం మాట అటుంచి, వాటిని మొగ్గలోనే చిదిమేస్తున్నారు. ఆ చర్చకి ఇది అనువైన చోటు కాదు.

మొన్న హైద్రాబాద్ బుక్ ఫేర్‍లో “నేషనల్ బుక్ ట్రస్ట్” వాళ్ళ స్టాల్ లో పుస్తకాలు చూస్తుండగా, నాతో పాటున్న స్నేహం ఓ పుస్తకం తీసి, “ఈ పుస్తకం చదివారా?” అని అడిగారు. నేను చదవలేదన్నాను. పుస్తకం గురించి మరో ముక్క చెప్పకుండా, ఓ కాపీ నా చేతిలో పెట్టి “తప్పక చదవండి! భలే ఉంటుంది. రైలు బడి అన్న కాన్సెప్టుతో బడి నడుపుతుంటారు. ఆ బడిలో చదివిన విద్యార్థిని రాసిన పుస్తకం ఇది. జపాన్ లో కథ” అని ఉత్సాహంగా చెప్పటం మొదలెట్టారు. సరే, చదివి చూద్దాం అని తీసుకున్నాం.

మొన్నెప్పుడో ఏం చెయ్యటానికీ తోచక, ఊరికే కాసేపు చదువుదాం అని మొదలెట్టాను. పూర్తయ్యే వరకూ ఎక్కడా ఆగలేదు. ఇది “టోటో చాన్” అనే చిన్నారి కథ. ఈ చిన్నారిని ఓ స్కూల్ నుండి పంపించేస్తారు. “ఎందుకూ?” అని అడగడానికి వాళ్ళ అమ్మ స్కూల్‍కి వెళ్లినప్పుడు టీచర్ సవాలక్ష కారణాలు – “క్లాసులో చెయ్యొద్దన్న పని చేస్తుంది”, “పిట్టలతో మాట్లాడుతుంది”, “రోడ్డూ పోయే వాళ్లని అరుస్తూ పిలుస్తుంది” – లాంటివెన్నో చెప్తుంది. టోటో చాన్ అమ్మ చాలా కలరవపడుతున్నా పిల్లకి మాత్రం ఏం జరుగుతుందో చెప్పదు. నేరుగా తీసుకెళ్లి వేరే స్కూల్లో వేస్తుంది.

కాకపోతే ఈ పాత స్కూల్ అన్ని స్కూల్లా ఉండదు. ఇక్కడసలు గదులే ఉండవు. ఒక రైలులో బల్లలు, కుర్చీలూ, బ్లాక్‍బోర్డ్ లు అన్నీ ఉంటాయి. ఈ స్కూల్లో చేరటానికి ఇంటర్వ్యూ ఏంటో తెల్సా? ప్రిన్సిపాల్ ముందు మనకి ఏం తోస్తే అది చెప్పటం. ఎంత సేపైనా చెప్పచ్చు, ఆయన వింటూ ఉంటారు. టోటో చాన్ లాంటి వాగుడుకాయే, “అబ్బా.. ఇంకేం చెప్పాలి” అనుకునేంత వరకూ సహనంగా వింటారు. బడిలో చేరాక, రోజూ బడికి వెళ్ళటం ఎంత నచ్చుతుందంటే, ఒక్క రోజు కూడా స్కూల్ మిస్స్ కాకుండా వెళ్లాలనిపించేంత. క్లాసులో పిరీయడ్స్ ఉండవు. రోజుకిన్ని చదువుకోవాలనుంటే, ఏది ఏక్కడైనా మొదలెట్టచ్చు. “అబ్బా.. పొద్దునే మాథ్సా? ఆ టీచరంటే నాకు చచ్చేంత భయమే” లాంటి ఆలోచనలు ఇక్కడుండవు. అలానే చుట్టూ ఉన్న వాళ్ళతో సఖ్యంగా ఉండడం, బోలెడేసి పుస్తకాలున్న లైబ్రరీ, బొమ్మలు గీసుకోడానికి కాగితాలు కాకుండా, ఏకంగా నేల మీద గీయడానికి అనుమతి.

ఈ పాఠశాల నిర్వహణలో నాకు నచ్చిన రెండు విషయాలు:

“నిన్ను చెయ్యొద్దన్నానా? మళ్ళీ చేస్తావా ఇలాంటి పని?” అని ఎంత మంది టీచర్లు, తల్లులు గొంతులు చించుకుంటూ పిసివాళ్ళని కొట్టరూ?! ఓ సారి మన టోటో చాన్ కూడా ఛెయ్యద్దన్న . చెయ్యకూడని పని చేస్తుంది. ఓ వస్తువు పోగొట్టుకుంటుంది. పోయిందని ఏడ్వకుండా ఆ వస్తువు వెతకడానికి మరో పని చెయ్యటం మొదలెడుతుంది. దాని వల్ల చాలా చెత్త చెత్తగా మారుతుంది ఆ ప్రదేశం. ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలు కనిపిస్తే వాళ్ళని కసిరి, అక్కడి నుండి పంపించేసి, ఆనక నాలుగైదు దెబ్బలు పడేలా చేస్తారు. కానీ ప్రిన్సిపాల్ టోటోని చూడగానే “నీ పని అవ్వగానే ఇదంతా శుభ్రం చేసేస్తావు కదూ” అంటూ వెళ్లిపోతారు. వస్తువూ దొరకదూ, ప్రదేశాన్ని శుభ్రమూ చెయ్యాలి. అంతా అయ్యేసరికి టోటోకి ఆయాసం, నీరసంతో పాటు బుద్ధికూడా వస్తుంది, “ఎందుకా పని చెయ్యటం? ఎందుకు వస్తువు పోగొట్టుకోవడం? ఎందుకు వెత్తుక్కోవటం?” అని.

మరో విషయమేమిటంటే, ఈ స్కూల్ పిల్లలు రోజూ మధ్యాహ్న భోజన విషయంలో ఒక సూత్రం పాటించాలి. దాని పేరు “కొండ నుండి కొంచెం, సముద్రం నుండి కొంచెం”. దీని ప్రకారం పిల్లలకి పెట్టే భోజనంలో నేల పై దొరికే ఆహారం, సముద్రంలో దొరికే ఆహారం సమతుల్యంగా ఉండి పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందివ్వాలని. ఏ కారణాల వల్లనైనా ఏ విద్యార్థి అయినా సరైన ఆహారం తెచ్చుకోకపోతే ప్రిన్సిపల్ భార్యే వాళ్లకి వడ్డిస్తారు. తినడం కూడా “కొన్ని నిమిషాలలో చేసే పని”గా భావించి, పిల్లలు తిన్నా తినకున్నా కొంత వ్యవధిలో మరలా క్లాసుకు వచ్చేయాలని భావించే పాఠశాల్లో చదివుండడం వల్ల అనుకుంటా, నాకీ పాఠశాల ఇంతగా నచ్చింది.

ప్రపంచ యుద్ధం వల్ల ఈ పాఠశాల పూర్తిగా నాశనమయ్యిపోయినా, దాని అవశేషాల్లా మిగిలిన విద్యార్థుల వల్ల పాఠశాల ప్రపంచ ప్రసిద్ధం అయ్యింది. టోటో చాన్ ప్రముఖ టివి ప్రెజంటర్‍గా పేరు తెచ్చుకుంటుంది. అలానే ఆ బడిలో చదివిన తక్కిన పిల్లలు కూడా. వారందరి విశేషాలు పుస్తకం చివర్న జతపరిచారు.

“ఓహ్.. ఇలాంటి బడొకటి ఉంటే ఎంత బాగుణ్ణు” అనిపించేంత అందంగా రాశారు కథని. తెలుగులో వాసిరెడ్డి సీతాదేవిగారి అనువాదం.

నేషనల్ బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది. బొమ్మలు కనిపించేలానే లేవు. అచ్చు తప్పులు కూడా చాలా ఉన్నాయి. ఇక ఫాంటూ, పేపరు సంగతి సరే సరి. వెల ఎంతో నాకు గుర్తు లేదు కానీ, ఇదో అరుదైన రచన, దాచుకోవాల్సిన పుస్తకం. అందుకని అన్నీ బాగున్న పుస్తకాన్నే కొనుక్కోండి. స్కూల్‍కి వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకి మాత్రం ఈ పుస్తకం.. MUST READ. తక్కిన వారు కూడా ఓ మంచి పుస్తకాన్ని చదివిన అనుభూతికోసం ఈ పుస్తకం చదవచ్చు. ఇదే రచన “రైలు బడి” అన్న పేరుతో కూడా వచ్చిందని విన్నాను.

నా చేత పుస్తకం కొనిపించినవారికి మాత్రం బోలెడంటే బోలెడు థాంక్స్!

- పూర్ణిమ (పుస్తకం డాట్ నెట్)

(( టె ట్సుకో కురోయనాగి రచించిన ఈ పుస్తకం జపాన్ భాషలో ప్రచిరించబడిన వెంటనే 45 లక్షల కాపీలు అమ్ముడై చరిత్ర సృష్టిం చింది. ఆ తరువాత దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువాదమైయింది. ఒక్కో భాషలో రెండేసి మూడేసి అనువాదాలు వెలువడిన సందర్భాలు కూడా వున్నాయి. అలాగే తెలుగు లో కూడా టోటోచాన్ ను "రైలు బడి" పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఈశ్వరి, ఎన్. వేణు గోపాల్ లు తెలుగు అనువాదం చేసారు.
పూర్ణిమ గారి స్ఫూర్తి దాయకమైన పుస్తక సమీక్షను మా బ్లాగు వీక్షకులకు సదా అందు బాటులో ఉంచాలని తిరిగి పొందు పరుస్తున్నాము. ఈ పుస్తక సమీక్ష పై వచ్చిన స్పందనల కోసం ఇక్కడ pustakam.net నొక్కండి.
పూర్ణిమ గారికీ, పుస్తకం డాట్ నెట్ వారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. )

.

Wednesday, February 10, 2010

పనిపై కనువిప్పు - మనకాలపు పిల్లలకు కొత్త సిలబస్ : సారె తిప్పు … సాలుదున్ను రచన: కంచ ఐలయ్య ..


సారె తిప్పు … సాలుదున్ను
మనకాలపు శ్రమ గౌరవ పాఠాలు
పుస్తక సమీక్ష - అల్లం నారాయణ

సాలు వెనక సాలు తీర్చిదిద్దినట్టుగా, సోలుపుగా, వంకర టింకర పోకుండా మీరెవరైనా దుక్కిదున్నగలరా! మట్టిముట్టిన ఉత్తచేతులతో గుత్తులు గుత్తులుగా వరినాటు వరసబెట్టి, మునుం తప్పకుండా నాటెయ్యగలరా! ఒరం జెక్కగలరా! తూర్పార పట్టగలరా! గాలికి వాలు చూసి చాటెయ్య గలరా! బంతికొట్టగలరా! నోటికాడికింత కొచ్చెటి మెతుకుల బువ్వముద్దను అందించగలరా! ఇదేదీ మీరు చెయ్యలేరు. వరిధాన్యమా! బియ్యమా! తెలియని అజ్ఞానంలో పెరుగుతున్న కంప్యూటర్‌ బ్రాయిలర్‌ కోడిపిల్లల తరం ఈ పనులు అసలే చెయ్యలేరు. కానీ ఒకటి మాత్రం చెయ్యగలరు. ‘సాలుదున్నిన’ క్రియాశీలి, సృజనశీలి, సంపద సృష్టికర్తను ‘ఉత్త బైతు’ … ‘ఎర్రబస్సు’ ఎక్కొచ్చినోడు అని ఈసడించుకోగలరు. అదీ సమస్య.

ఒక్క రైతునే కాదు. ఆదివాసులను, పశులమందలను ఏలే పసుల కాపర్లను, చెప్పులు కుట్టిచ్చే తోలుపని వాళ్ళను, సారె తిప్పి కుండలు కూజాలు గురుగులు మట్టి కళాఖండాలు చేసే కుమ్మరులను, సన్నపోగుపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడే కళాత్మక నేత దుస్తులు నేసే సాలోళ్ళను, మురికి కంపును ఒదిలించి తాము మురికి మింగి చలువ దుస్తులందించే చాకలోళ్ళను, బొచ్చుతో ఉంటే కోతులను తలపించే మీ ముఖారవిందాలను అద్దంలో మెరిసేలా చేసే క్షురకులను, చివరకి ఇంటి పని, పాచిపని, పనిచేసే మన తల్లులను, అక్కలను, చెల్లెళ్ళను కూడా ఈసడించుకోగలరు.

శ్రమను హీనంగా చూసే సంస్కృతిలో పుట్టి, అదే సంస్కృతిలో తరతరాలుగా ఒదిగి, ఎదుగుతున్న భారత సమాజంలో శ్రమకు విలువలేకపోవడం వెనక సామాన్యమైన కుట్ర ఏమీలేదు. అతి పెద్ద కుట్రే ఉంది. అది అగ్రవర్ణాల వారు మొత్తం మానవ సంబంధాలను పుట్టుకతోనే శాసించే నిచ్చెనమెట్ల వ్యవస్థను ఏర్పరచడంలో ఉంది. కొంచెం కూడా చెక్కుచెదరని కులవ్యవస్థ ‘స్థిరీకరణ’లో ఉంది. పురుష సూక్తాల్లో, వేదాల్లో, మనువు ప్రవచించిన అనాది సిద్ధాంతాల్లో ఉంది.

కంచ ఐలయ్య అనే ఒక ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఆధిపత్య భావజాలాలపై పోరాటం చేస్తున్న యోధుడు. ఇప్పుడున్న దాన్ని తలకిందులుగా చూసి, అసలు సత్యాల్ని శాస్త్రీయంగా, తాత్వికంగా, సహేతుకంగా చెప్పగలుగుతున్న బుద్ధిజీవి. హిందూమతం పైన, అది శూద్రులు, పంచముల మీద రుద్దిన భావజాలంపైన ఆయన రాతలన్నీ అందుకే తలకిందులుగా ప్రశ్నించడంతో ప్రారంభమై ఒక గొప్ప తాత్విక దృష్టిని కలిగిస్తాయి. ‘నేను హిందువునెట్లయిత’ అనే ఒక సాదాసీదా మాటతో ఒక గొప్ప తాత్విక ప్రపంచాన్ని గతంలో ఆవిష్కరించిన కంచ ఐలయ్య శ్రమ గౌరవ పాఠాలకు సంబంధించి ఇప్పుడు ‘సారెతిప్పు … సాలుదున్ను’ అనే అద్భుతమైన పుస్తకం రాశారు. మానవీయ విలువల పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఏమాత్రం నమ్మకమున్న ఏ వర్ణాల వారికైనా, ఏ వర్గాల వారికైనా ఈ పుస్తకం ఇప్పటిదాకా నెత్తురులో పాతుకుపోయి ఉన్న భావాలను చెల్లాచెదురు చేసి కనువిప్పు కలిగించగల గొప్ప సాధనం.

మానవ నాగరికతకు మూలమైన శ్రమకు సంబంధించిన వివక్ష మూలాలు కుల, మత భావనల్లో ఉన్నాయన్న విషయం గురించిన కొత్త సిలబస్‌ ఈ పుస్తకం. ఈ ప్రపంచం ఎట్లా నిర్మితమయింది? దాని నిర్మాతలెవరు? పనికీ ‘జెండర్‌’కూ గల సంబంధం ఏమిటి? అది విలోమంగా ఎందుకున్నది? అసలు పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? వారికి గౌరవం ఎందుకు దక్కదు … శానిపని (నైపుణ్యం) ఏమిటి? సన్నపని ఏమిటి? ఈ శ్రమ ఎట్లా పుట్టింది? ఎన్ని మార్పులు చెందింది? ఒళ్ళు వంచి, చెమట కక్కుతూ పనిచెయ్యడం అనే ఒక గొప్ప విషయం … ఎందుకు అగౌరవంగా తయారయ్యింది. చదువు పెరిగిన కొద్దీ ఉత్పాదక శక్తుల పట్ల ఏవగింపు, చిన్నచూపు ఎందుకని వస్తున్నది? ఇది పరిణామ క్రమంలో భాగంగా వస్తున్నదా? దీనివెనక కుల, మత వ్యవస్థల ప్రమేయం ఉన్నదా? ఇలా … సహస్ర వృత్తుల సమస్త రహస్యాలు, అద్భుతాలు, ఇన్వెన్షన్లూ అన్నీ కలగలిపి నేర్పుతుంది ఈ పుస్తకం.

ఇది వర్తమాన భారతంలో శ్రమకూ, శ్రమకు సంబంధించిన అన్ని వ్యాపకాలకూ ఆమడ దూరమై పోతున్న ఈ తరపు పిల్లలకు నేర్పాల్సిన విషయాలు. ఉత్తభూమి నుంచి బంగారం పండించగల నేర్పు, బట్టలు నేసే నేర్పు, సబ్బుకు మూలమైన సోడా కనిపెట్టిన నేర్పు, తోలుపనిలో వాడిన రసాయనాల నేర్పు, సారె తిప్పి కళాఖండాన్ని వేళ్ళకొనలమీద చేయగల నేర్పు, అందుకు సంబంధించిన విజ్ఞానం, దాని కారణంగా ఏర్పడిన ఇవ్వాల్టి సౌకర్యాల గురించి చాలా చిన్నచిన్న విషయాలతో, ఎక్కడా ‘జార్గన్‌’ వాడకుండా, అద్భుతంగా మలిచారు ఐలయ్య.

ఇంగ్లీషులో Turning The Pot, Tilling The Land – Dignity of Labour in Our Times గా వచ్చిన ఈ పుస్తకానికి చంద్రిక అనువాదం చాలా సరళంగా తెలుగులోనే రాసినట్టుగా ఉంది.

ఐలయ్య ఈ పుస్తకం ఎందుకు రాశారు? ఐఐటీల్లో, ఐఐఎంలలో, కేంద్ర వైద్య సంస్థల్లో చదువుతున్న అగ్రకులాల పిల్లలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఎన్నో ర్యాలీలు చేశారు. వీపీసింగ్‌ బీసీల కోసం మండల్‌ కమిషన్‌ సిఫారసులు అమలుపరచాలనుకున్నప్పుడు కూడా విద్యార్థులు పెద్ద గొడవ చేశారు. ఈ ఆందోళనలో వాళ్ళు రోడ్లు ఊడ్చారు. బూట్లు పాలిష్‌ చేశారు. కూరగాయలు అమ్మారు. అంటే అర్థం ఏమిటి? డాక్టర్లై ఉండీ, మేం రోడ్లు ఊడుస్తున్నామని, ఇంజనీర్లమై ఉండీ బూట్లు పాలిష్‌ చేశామని … అంతేనా? కాదు. రోడ్లు ఊడ్వడం, బూట్లు పాలిష్‌ చెయ్యడం, కూరగాయలు అమ్మడం చిన్న పని. అగౌరవమైన పని అని.

కానీ వాళ్ళు ఆ పనులు నిజంగానే చెయ్యగలరా? సహజ శస్త్ర చికిత్సలు చేసే మంత్రసానులు, మంగలి పనివారు లేకుండానే మానవ నాగరికతలో శస్త్ర చికిత్సలు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? లేదు. అందుకే ఐలయ్యను ఈ విద్యార్థుల కార్యాచరణ చికాకు పరిచింది. ఆ మాటకొస్తే ఆ విద్యార్థులట్లా బయటపడ్డారు కాని మన ఇంట్లో, ప్రతివాళ్ళ ఇంట్లో వాళ్ళు శూద్రులైనా, అగ్రవర్ణాల వారైనా శ్రమ పట్ల కొద్దిపాటి గౌరవం కూడా లేకపోవడం మనకు నిత్యానుభవమే.

అందువల్లే మన కాలపు ఈ మిడిమిడి జ్ఞానపు, మిడిమేళపు తరానికి మన కాలపు శ్రమ గౌరవ పాఠాలను కంచ ఐలయ్య అందించారు. ఆదివాసుల తెలివితేటలు ఏ పండు తినాలో, ఏది కూడదో మనకు నేర్పింది. అట్లాగే చాకలి వారి పని, మంగలి వారి పని, వ్యవసాయం. అన్ని వృత్తులూ విజ్ఞానానికి సంబంధించిన కొనసాగింపుగానే చూడాలనే విషయం ఈ పుస్తకంలో అనేక ఉదాహరణలతో ఉంది.

ఒక్క పిల్లలకే కాదు శ్రమను మరచిపోయి, మూలాలు మరచిపోయి త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్దలకు కూడా ఇది కనువిప్పు కాగల పుస్తకం. సింగరేణిలో సమ్మె జరిగినప్పుడు గోడల మీద ఒక నినాదం ఉండేది. అది శాశ్వతమైన సత్యం. ‘కంప్యూటర్లు బొగ్గు తవ్వగలవా’ … తవ్వలేవు. బొగ్గు లేకుండా ప్రపంచం బతకగలదా? లేదు. అందువల్ల శ్రమకు సంబంధించి మౌలికాంశం భౌతిక శ్రమ, దానికి సంబంధించిన మేధోశ్రమ. దీనికి మినహాయింపు లేదన్న సత్యాన్ని కంచ ఐలయ్య పుస్తకం ఆవిష్కరించింది.

భారతదేశంలో శ్రమగౌరవం లేకపోవడానికి, అశాస్త్రీయ, అభివృద్ధి నిరోధక భావజాలం ఉండడానికి కారణమైన మత, కుల వ్యవస్థల పాత్రపై, శ్రమలో ‘జెండర్‌’ వివక్షపై కూడా ఈ పుస్తకం కొంత సైద్ధాంతికంగా వివరించింది. ఇది అన్ని పాఠశాలల్లో … అన్ని గ్రంథాలయాల్లో ఉండాల్సిన పుస్తకం. ముఖ్యంగా శ్రమను గౌరవించే వారికి ఇది ‘హ్యాండ్‌బుక్‌’ కాగలిగిన విలువైన పుస్తకం.

దీనికి బొమ్మలు వేసిన దుర్గాబాయ్‌ వ్యామ్‌ను ప్రత్యేకంగా పేర్కొనాలి. పెద్దగా చదువులేని దుర్గాబాయ్‌ వ్యామ్‌ ఫోనులో పాఠ్యాంశాలను విని కేవలం పది రోజుల్లో వేసిన బొమ్మలు ఈ పుస్తకానికి అదనపు అందాన్ని, అదనపు విలువనూ తెచ్చాయి.
ఐలయ్యకు అనేక అభినందనలు.
ఈ పుస్తకం ముద్రించిన హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌కు కృతజ్ఞతలు.

సారె తిప్పు … సాలుదున్ను, మనకాలపు శ్రమ గౌరవ పాఠాలు
రచన: కంచ ఐలయ్య

బొమ్మలు: దుర్గాబాయ్‌వ్యామ్‌
తెలుగు: చంద్రిక

ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌, హైదరాబాద్‌ – 500 067.

పేజీలు: 108, వెల: రూ. 80.


Courtesy: Andhrajyothy

( అల్లం నారాయణ గారు ఆంధ్ర జ్యోతిలో రాసిన ఈ పుస్తక సమీక్షను పుస్తకం డాట్ నెట్ వారు ఏప్రిల్ 2008 లో తమ వెబ్ సైట్ లో ప్రచురించారు. మా బ్లాగు సందర్శకులకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. అల్లం నారాయణ గారికీ, ఆంద్ర జ్యోతి వారికీ, పుస్తకం డాట్ నెట్ వారికీ మా కృతజ్ఞతలు. )

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌