Saturday, January 30, 2010

మోతె - తెలంగాణ బతుకుబాట - ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌.లింబాద్రి ...

ఇది ఒక తెలంగాణా గ్రామం కథ.
ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు లేక తెలంగాణా గ్రామాలు ఎట్లా తిప్పలు పడుతున్నాయో తెలియజేసే కథ.

ఆ గ్రామం పేరు మోతె.
నిజామాబాద్‌ జిల్లా, వేల్పూరు మండలంలో వుంది.
తొమ్మిదేళ్ల క్రితం ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి మోతె వెళ్లి అక్కడి స్థితిగతులపై చేసిన అధ్యయన సారాంశమే ఈ చిరు పుస్తకం.

మోతె విరాట్‌ స్వరూపమే తెలంగాణ. ఆ గ్రామానికి ఉత్తర దక్షిణాలలో వాగులున్నట్లే తెలంగాణాకు ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణా నదులున్నాయి. రెండు వాగులుండీ మోతె గ్రామం నీళ్లకు ఏడ్చినట్టే, తెలంగాణా కూడా రెండు నదులుండీ నీటి ఎద్దడితో బాధపడుతున్నది. అంకెలు గణాంకాలు కూడా తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదలకు చేసిన కేటాయింపుల్లో 90% భారీ మధ్య తరహా ప్రాజెక్టులకే వెచ్చించారు. అందువల్ల వచ్చిన ఫలితాలు కోస్తా ఆంధ్రకే ఎక్కువగా దక్కాయి. చిన్న నీటి పారుదలను విస్మరించడం వలన మోతెలో ఎండిపోయినట్టే తెలంగాణా అంతటా చెరువులు ఎండిపోయాయి. మోతె చిత్రం తెలంగాణాకు జరిగిన అన్యాయానికి ఒక మచ్చుతునకగా భావించవచ్చు.

మోతెకి రెండు వాగులే కాదు దక్షిణాన ఐదు చెరువులు కూడా వున్నాయి. వాటిలో పెద్ద చెరువు ప్రధానమైనది. అది నిండి అ లుగు పారితేనే మిగతా నాలుగు చెరువులకు నీరొస్తుంది. ఆ అ లుగు నీరు నాలుగు చెరువుల్లోకి పారడానికి నిజాం కాలంలోనే గ్రామస్తులు శ్రమదానంతో కాలువలు తవ్వుకున్నారు. అయితే ఇప్పుడు ఆ చెరువులకు వరదనీరు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో అవి ఎండిపోతున్నాయి.

నలభై ఏళ్ల క్రిందటి వరకూ ఆ ఊళ్లో దాదాపు 300 బావులుండేవి. అవి కూడా ఎండిపోతుండటంతో 1969 నుంచి వాటిలో ఇన్‌వెల్‌ బోర్లు వేయడం మొదలుపెట్టారు. అయినా ఫలితం అంతంతమాత్రమే కావడంతో 1976 నుంచి బోర్లు వేయడం ప్రారంభించారు.

తెలంగాణాలో మొట్టమొదటి బోరు వేసింది మోతె లోనే అంటారు. ఇప్పుడు అక్కడ వ్యవసాయం ప్రధానంగా బోరు బావులపై ఆధారపడే సాగుతోంది. మొతేలో నేడు 900 బోర్లు, 25వ వరకు ఫిల్టర్లు వున్నాయి.

గత పది సంవత్సరాలుగా బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోయాయి. గతంలో 150 అడుగులకే నీరు వస్తే ఇప్పుడు దాదాపు 300 అడుగుల కంటే లోతుగా బోర్లు వేయించాల్సి వస్తోంది.

బోర్లు ఒకసారి వేస్తే ఎప్పటికీ నీళ్లుంటాయన్న గ్యారెంటీ వుండదు. నీళ్లు ఎండిపోయినప్పుడు బావుల మాదిరిగా పూడిక తీయడం కుదరదు. బోరు ఎండి పోయిందంటే మరో కొత్త బోరు వేయించుకోవాల్సిందే. ఇక్కడ ఆవిధంగా ఒక్కొక్క రైతు గత పదేళ్లలో సగటున ఐదారు సార్లు బోర్లు వేయించారు. బంగ్ల భూమయ్య అనే రైతైతే యాభై బోర్లు వేయించారు.

బోరు వేయిస్తే నీరు పడుతుందని, ఆ నీరు చాలాకాలం వుంటుందని ఎలాంటి భరోసా వుండదు. ఈ ఊళ్లో గత పదేళ్లలో పది కన్నా ఎక్కువ బోర్లు వేయించిన కుటుంబాలు 30 వున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. రైతులు వేలకు వేలు బోర్లకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దానికి తోడు ఓల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోయి వారిపై అదనపు భారం పడుతూ వుంటుంది. మరో దారిలేక తెలంగాణా రైతులు ఇన్ని కష్టాలు పడుతూనే వ్యవసాయం చేస్తుంటారు.

ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన వాళ్లు రైతు కూలీలుగా, కార్మికులుగా మారి వలస పోతుంటారు. ఈ చిన్న ఊరి నుంచి ఇప్పటి వరకు 355 మంది దుబాయికి వలసపోయారు. మరెందరో బొంబాయి, భివాండీలకు వలస పోయారు.

మొత్తం తెలంగాణా అంతటా ఇదే పరిస్థితి.

తెలంగాణాలో బావుల కింద సాగయ్యే భూమి 1955 లో 2,56,809 ఎకరాలు కాగా, ఇప్పుడు బావుల కింద సాగయ్యే భూమి 25,26,451 ఎకరాలు!

చెరువులు ఎండి పోయాయి. కాలువలు రాలేదు. కనుక తెలంగాణా రైతులు అనేక వ్యయప్రయాసలకోర్చి మరో గత్యంతరంలేక బావులపై ఆధారపడవలసి వస్తున్నది. 53 ఏళ్ల ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో తెలంగాణా సాధించిన ప్రగతి ఇది!

కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతం తెలంగాణా లోనే అత్యధికంగా వున్నప్పటికీ ఇక్కడి రైతులకు కడగండ్లు తప్పడం లేదు. ఇక్కడి ప్రజలకు తాగు నీటికి కూడా దిక్కులేకుండా పోతున్నది. ఉన్నది పోయింది. ఉంచుకున్నది పోయింది అన్నట్టు తయారైంది పరిస్థితి.

నికరమైన సాగునీటి వనరులు లేక ఇటు కరెంటు దేవుడు, అటు వాన దేవుడు ఈ ఇద్దరు దేవుళ్లపై ఆధారపడి తెలంగాణా భారంగా బతుకీడుస్తున్నది. ఆ ఇద్దరు దేవుళ్లు కనికరిస్తేనే తెలంగాణాలో వ్యవసాయం సాగుతుంది. లేకుంటే లేదు. ఈ నేపథ్యం నుండే ఇవ్వాళ తెలంగాణా రైతులు న్యాయాన్ని కోరుతున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

మోతె - తెలంగాణా బతుకు బాట
-ఎం. కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య, ఆర్‌. లింబాద్రి

ప్రథమ ముద్రణ : 2001
24 పేజీలు, వెల: రూ.5


.

3 comments:

  1. తెలంగాణ పాటలు/గీతాలు/గేఉఆలకై దయచేసి సందర్శించండి...
    http://telangaanaastate.blogspot.com

    ReplyDelete
  2. తెలంగాణ చరిర,సమైక్య రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాలు,తెలంగాణ పండుగలు,పడవ తరగతిలో హిందీ కి 21 మర్కులకే ఎందకు పాస్ ఇలాంటి ఎన్నో విషయాల గురించి సందర్శించండి www.telangaana-state.blogspot.com
    or www.aboutmytelangana.blogspot.com

    ReplyDelete
  3. తెలంగాణ చరిత్ర,తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు,తెలంగాణ పండుగలు,పడవ తరగతి హిందిలో 21 మార్కులకు ఎందుకు పాస్? ఇలాంటి ఎన్నో విషయాల కోసం సందర్శించండి
    www.telangaana-state.blogspot.com
    www.aboutmytelangana.blogspot.com

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌