Sunday, December 20, 2009

సాంఘిక వికాసానికి తోడ్పడే నవల - ఆంధ్రజ్యోతి సమీక్ష ...



హిందీలో ప్రముఖ రచయిత ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' ను శ్యామ్‌ బెనగల్‌ సినిమాగా తీశారు.

హిందీ సాహిత్యరంగం, చిత్ర పరిశ్రమల్లో సంచలనం సృష్టంచిన ఈ నవలను ''సూర్యుడి ఏడో గుర్రం'' పేరిట వేమూరి ఆంజనేయ శర్మ అనువాదం చేయగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టువారు ప్రచురించారు.

ఇది చాలా చిన్న నవల.
1950ల నాటి సాంఘిక జీవనాన్ని అక్షరబద్ధం చేశాడు రచయిత.
రైల్వేలో చిన్న ఉద్యోగి అయిన మాణిక్‌ ముల్లా మూడు ప్రేమ కథల సమాహారం ఇది.

మాణిక్‌ ముల్లాకు పదేళ్ల వయసు నుంచి వివిధ వయసుల్లో జమున, లిల్లీ, సత్తి అనే స్త్రీలతో పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ ముగ్గురి స్త్రీలతో తనకున్న అనుబంధాన్నీ, వారి జీవితాలలో జరిగిన పెనుమార్పులనూ మాణిక్‌ ముల్లా మనకు కథలు కథలుగా చెబుతాడు.

ఈ కథల్లోని జీవితాలేవీ సుఖవంతమైనవి కావు. అయితే అతడు చెప్పే విషాదాంతం వెనక చమత్కారం వుంటుంది. ఆ చమత్కారం మాటున మళ్లీ అంతులేని విషాదం వుంటుంది. జమున తను కోరుకున్న వాడికి భార్య కావడం, సత్తి అర్థాంతరంగా చావడం వెనక దాగున్న దారిద్య్రం, మూఢనమ్మకాలను చెప్పీ చెప్పకనే వివరంగా చెప్తాడు రచయిత. అందుకే మాణిక్‌ ముల్లా ''ఏ ప్రేమ సాంఘిక వికాసానికి తోడ్పడదో అది నిరర్థకం'' అంటూ ప్రేమను నిర్వచిస్తాడు.

ఏడు కథల సమాహారంగా సాగిన ఈ నవలను సూర్యుడి ఏడు గుర్రాలతో పోల్చుతాడు. ఇప్పటికే నైతికంగా భ్రష్టమైన జీవితపు సందుల్లో నడవడం వలన సూర్యుని రథం శిధిలమై పోయిందని, ఆరు గుర్రాలు కాళ్లు విరిగిపోయి అస్థిపంజరాలుగా మారాయని అంటాడు. మిగిలిన ఒక్క గుర్రమే మన భవిష్యత్తును సూచించేది. మన పిల్లల జీవితాల్లో వెలుగూ, అమృతం నిండిపోవాలంటే మిగిలిన ''సూర్యుడి ఏడో గుర్రం'' పరుగులు తీయడానికి సరైన తోవను ఏర్పాటు చేయాలంటాడు.

ఈ నవల ద్వారా రచయిత ఆశించిన నైతికత, సామాజిక న్యాయం, విలువలు ఈ ఆరు దశాబ్దాలలో మరింతగా పతనమై పోయాయి. బహుశా ఆ ఏడో గుర్రం కూడా మిగిలిన గుర్రాల వరుసలో చేరిపోయిందేమో!
- సుంకోజి
( ఆదివారం ఆంధ్రజ్యోతి, 20 డిసెంబర్‌ 2009 సౌజన్యంతో )
..........................................


సూర్యుడి ఏడో గుర్రం (నవల)
ధర్మవీర్‌ భారతి
పేజీలు : 115
వెల : రూ.50


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85,
బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

Wednesday, December 9, 2009

ప్రగతిశీల సమ్యక్‌ దృష్టే కథావరణం ,,,


సుప్రసిద్ద మళయాళ రచయిత, సాహితీ వైతాళికుడు వైక్కం మొహమ్మద్‌ బషీర్‌ కథలకి తెలుగు అనువాదం ఈ సంపుటి.
బషీర్‌కు దక్కిన గౌరవాదరాలు, పాఠకాభిమానం, ఆయన సాధించిన అనేక విజయాలు-లోక విదితం. సాహితీవేత్తగా బషీర్‌
లోచూపు, ముందుచూపు - రెండూ కూడా - ఆయన లక్ష్యశుద్ధిని తెలియజేస్తాయి. ముస్లిం సమాజంలోని ఛాందసత్వం
తెలివిలేమితనం వీటిపట్ల ఆయనకు గల సంవేదన ఆయన్ని ఆ సమాజంలోని వైకల్యాల్ని గురించి రాయటానికి
పురిగొల్పింది. ఆ సమాజ అభ్యుదయాన్ని కాంక్షించిన చిత్తశుద్ది కల రచయిత బషీర్‌.

ముస్లింలలో చైతన్యం తేవటమేకాక, అనేక అపోహల కారణంగా ముస్లిం సమాజంతో 'ఎలియనేట్‌' అయిపోయిన హిందువుల
మనోభావనల్లో సైతం మార్పు తేవటానికి ప్రయత్నించిన సాహితీకారుడు బషీర్‌. భిన్న వర్గాల మధ్య పరస్పర సహకారం,
సర్దుబాటు అవసరమనే ప్రగతిశీల భావ ప్రచారానికి కథానికని ఒక వాహికగా ఎన్నుకున్న రచయిత ఆయన.

ఈ సంపుటిలో 20 కథలున్నాయి. ఎక్కువ కథల్లో అంతర్లీనంగా అవాంఛనీయ సమాజిక స్థతిగతుల మీద సంధించిన వ్యంగ్యం ధ్వనిస్తూ వుంది. 'అదిగో పులి అంటే ఇదుగో తోక' తంతుగా సాగే 'విశ్వ విఖ్యాత ముక్కు' కథ చదివినా, 'ఒక ప్రేమ లేఖ', 'టైగర్‌' వంటి కథలు చూసినా ఈ వాస్తవం అర్థమవుతుంది. పరపీడన, దోపిడీ వర్గ సంఘర్షణ వంటి భావజాలం ....... వాస్తవికతలోకి దిగకుండా కళాత్మకతగా, బషీర్‌ కథాశిల్పగతం అయింది. అదే ఈ కథలకి వన్నె కూరుస్తున్న ప్రత్యేకాంశం.

'ఒక మనిషి' వంటి కథలోని మానవీయ కోణం చప్పున తెలుగులో బాలగంగాధర తిలక్‌ కథ 'దొంగ'ని స్ఫురింపజేస్తుంది.
చిన్నకథ. హోటల్లో కడుపు నిండా తిన్నాడు. పర్సు పోయింది. దారుణంగా అవమానించారు. చివరికి దాన్ని
కొట్టేసినవాడిలోనే మానవత్వం మేల్కొంది. బిల్లు కట్టటమే కాక, అతని పర్స్‌ అతనికిచ్చేశాడు. 'వెళ్లు. దేవుడు
చల్లగాచూడాలి' అన్నాడతను. 'నిన్ను దేవుడు చల్లగా చూడాలి' అన్నాను నేను!అంటూ కథ ముగుస్తుంది. అద్భుతమైన,
కరుణార్ద్రమైన కథానిక. నిష్కపటంగా, నిర్మలంగా హిందూ-ముస్లింల మతసామరస్యానికి దిశానిర్దేశం కూర్చే కథల్ని
అందించిన బషీర్‌ని చదవటం, ఈ సంక్షోభ వర్తమానంలో ఒక అనివార్య అవశ్యకత!

- విహారి
వార్త , ఆదివారం 8 నవంబరు 2009

Thursday, December 3, 2009

వనవాసి, సూర్యుడి ఏడోగుర్రం నవలా రచయితలు


ప్రముఖ బెంగాలీ నవల ''అరణ్యక''ను 'వనవాస'ి పేరుతో,
ప్రముఖ హిందీ నవలిక ''సూరజ్‌ కా సాత్వా ఘోడా''ను 'సూర్యుడి ఏడో గుర్రం' పేరుతో ఈ మధ్యే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పునర్ముద్రించిన విషయం విదితమే.

ఆ నవలా రచయితల గురించి క్లుప్తంగా ...



బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ:
1894లో కలకత్తాకు ఉత్తరంగా వందమైళ్ల దూరంలో వున్న మరాఠీపూర్‌ గ్రామంలో పుట్టిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ బాల్యమంతా బీదరికంతోనే గడిచిపోయింది.
చదువు స్థానిక పాఠశాలలో సాగింది.
1918లో కలకత్తాలోని రిప్పన్‌ కాలేజీ నుండి డిగ్రీపొందారు.
మధ్య మధ్యలో రకరకాల వృత్తులు చేసినా ఎక్కువ భాగం మాత్రం ఉపాధ్యాయుడిగానే కొనసాగిన ఆయన తొలి కథ 1922లో కలకత్తా జర్నల్‌లో ప్రచురితమైంది.
అప్పటి నుంచీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 17 నవలలు, 20 కథా సంకలనాలతో సహా 50 వరకూ పుస్తకాలు ప్రచురించారు. ఆయన విఖ్యాత రచన, ఆయనకు గొప్ప కీర్తిని ఆర్జించి పెట్టిన రచన ''పథేర్‌ పాంచాలీ''. దీనికి కొనసాగింపుగా రాసింది ''అపరాజిత''. వీటిని ప్రముఖ దర్శకులు సత్యజిత్‌ రే చలనచిత్రాలుగా మలచి ప్రపంచ ప్రఖ్యాతిని పొందారు.
దట్టమైన ప్రకృతితో మమేకమై అంతరించిపోతున్న అరణ్యాల గురించి మనసులకు సునిశితంగా హత్తుకునేలా రాసిన అరణ్యక (వనవాసి) బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ విశిష్ట రచనగా విణుతి కెక్కింది.
ఆయన 1950లో మరణించారు.

ధర్మవీర్‌ భారతి:
హిందీ సాహితీరంగంపై బలమైన ముద్రవేసిన విశిష్ట రచయిత ధర్మవీర్‌ భారతి.
1926 లో అ లహాబాద్‌లో జన్మించారు.
కవిగా, నాటక రచయితగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా హిందీ సాహిత్యంలో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనది.
ఆయన రచించిన ''గునహోంకా దేవతా'' భారతీయ సాహిత్యంలో ఎన్నటికీ నిలిచిపోయే క్లాసిక్‌. మహాభారత యుద్ధం పరిసమాప్తమైన ఆఖరి రోజు పరిణామాలను సమకాలీన దృక్పథం నుంచి విశ్లేషిస్తూ రాసిన నాటకం ''అంధయుగ్‌'' భిన్న తరాలకు చెందిన ప్రయోక్తల సారథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికి కొన్ని వేలసార్లు ప్రదర్శితమైంది.

శైలీపరంగా ఓ అసాధారణ ప్రయోగం ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' (సూర్యుడి ఏడో గుర్రం).

అ లహాబాద్‌ విశ్వవిద్యాలయం నుంచి హిందీ సాహిత్యంలో ఎంఎ. పట్టా తీసుకున్న ధర్మవీర్‌ భారతి 1950లలో విస్తృతంగా రాశారు.
హిందీ అధ్యాపకుడిగా పనిచేశారు.
1960 నుంచీ 1987 వరకూ ప్రముఖ హిందీ వార పత్రిక ''ధర్మయుగ్‌'' కు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు.
పద్మశ్రీతో సహా పలు అవార్డులు అందుకున్నారు. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు.

సూరజ్‌ కా సాత్వా ఘోడా నవలను 1992 లో ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ అదే పేరుతో హిందీలో చలన చిత్రంగా తీశారు. ఆ చిత్రానికి వివేష ప్రజాదరణతో పాటు జాతీయ అవార్డు లభించింది.

Soorampoodi SitaRam





హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌